
న్యూయార్క్: లీగ్లు, ఆటలు ప్రస్తుతానికైతే కోవిడ్ –19 వల్ల జరగట్లేదు. ఒకవేళ త్వరలో ఆటలు మొదలైనా కూడా ప్రేక్షకులు కరువయ్యే అవకాశాలున్నాయి. అమెరికా ప్రజల్లో చాలా మంది కరోనాకు మందు, వ్యాక్సిన్ లేదు కాబట్టి ప్రత్యక్షంగా చూసేందుకు స్టేడియాలకు వెళ్లబోమని చెప్పారు. ఇటీవల అక్కడ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో 72 శాతం మంది ప్రస్తుతం ఆరోగ్యకర పరిస్థితులేవీ లేవు కాబట్టి ఆటలకు హాజరు కాబోమని చెప్పారు.
12 శాతం ప్రజలు మాత్రం ఆటలు చూసేందుకు ఆసక్తి కనబరిచినప్పటికీ గ్యాలరీలో సామాజిక దూరం పాటిస్తేనే వెళ్తామని చెప్పారు. కేవలం 13 శాతం మంది మాత్రం ఏదేమైనా ప్రత్యక్ష వీక్షణను ఆస్వాదించేందుకు సిద్ధమేనన్నారు. స్టిల్మన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ పరిధిలో షార్కీ ఇన్స్టిట్యూట్ ఈ నెల 6,7,8 తేదీల్లో ఈ పోల్ నిర్వహించింది. మొత్తం 762 మంది అభిప్రాయాల్ని సేకరించగా... ఇందులో పాల్గొన్న అమెరికన్లు మాత్రం ఇంతకుముందులా ఆటల కోసం ఎగబడి మైదానాలకెళ్లి చూడాలనుకోవడం లేదని... టీవీల్లో చూసేందుకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.