ఆటగాళ్లు... కరచాలనం వద్దు | Avoid Handshakes, Sports Minister Kiren Rijiju | Sakshi
Sakshi News home page

ఆటగాళ్లు... కరచాలనం వద్దు

Mar 6 2020 10:26 AM | Updated on Mar 6 2020 10:26 AM

Avoid Handshakes, Sports Minister Kiren Rijiju - Sakshi

న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్‌ (కోవిడ్‌–19) వ్యాప్తి నేపథ్యంలో అథ్లెట్లు కరచాలనానికి దూరంగా ఉండాలని కేంద్ర క్రీడల మంత్రి కిరణ్‌ రిజిజు సూచించారు. కరచాలనానికి బదులుగా నమస్కారం చేయాలని అన్నారు. ఇతరులతో మాట్లాడే సమయంలో వీలైనంత దూరంగా ఉండాలని పేర్కొన్నారు. ‘సామాన్యులు, క్రీడాకారులకు నాదో సలహా. వీలైనంత వరకు కరచాలనం చేయకండి. అదేం తప్పనిసరి చర్య కాదు. కరచాలనానికి బదులుగా నమస్కరించండి’ అని రిజిజు సూచించారు. విదేశీ టోర్నీలు, శిక్షణా శిబిరాల్లో పాల్గొనే భారత అథ్లెట్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పర్యటనల షెడ్యూల్‌ చేయాలని జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్‌ఎస్‌ఎఫ్‌)లకు సూచించారు. 

త్వరలో ప్రపంచ మెగా ఈవెంట్‌ ఒలింపిక్స్‌ జరుగనున్న నేపథ్యంలో ఈ ఏడాది పోటీలు ఆటగాళ్లకు ఎంత కీలకమో తాము అర్థం చేసుకోగలమని ‘సాయ్‌’ పేర్కొంది. అయినప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సూచనలను జాతీయ సమాఖ్యలు బేఖాతరు చేయకూడదని హెచ్చరించింది. కరోనా కారణంగా ఈనెల 15న జరగాల్సిన షూటింగ్‌ ప్రపంచ కప్‌తో పాటు, ఫిబా 3–3 బాస్కెట్‌బాల్‌ ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోరీ్నలు వాయిదా పడ్డాయి. ఇప్పటివరకు భారత్‌లో 30 కరోనా కేసులు నమోదయ్యాయి.    
 

Advertisement
 
Advertisement
Advertisement