
చెన్నై విజయలక్ష్యం 131
ఐపీఎల్-8 లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో 131 పరుగుల టార్గెట్ ని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్దేశించింది.
మొహాలీ: ఐపీఎల్-8 లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తో శనివారం జరుగుతున్న మ్యాచ్ లో 131 పరుగుల టార్గెట్ ని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్దేశించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. పంజాబ్ జట్టులో అక్షర్ పటేల్ (29 బంతుల్లో 32, 2 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే రాణించాడు. డేవిడ్ మిల్లర్ (11) తో కలిసి ఆరో వికెట్ కు 23 పరుగుల భాగస్వామ్యాన్ని, రిషి ధావన్ తో కలిసి 44 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఏడో వికెట్ గా వెనుదిరిగాడు. రిషి ధావన్ (20 బంతుల్లో 25) పరవాలేదనిపించాడు.
పంజాబ్ జట్టు 35 పరుగులకే ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా(16) , మనన్ వోహ్రా(4) లతో పాటు కెప్టెన్ జార్జీ బెయిలీ (12) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పంజాబ్ స్కోరు 16 పరుగుల వద్ద సాహా వికెట్ కోల్పోయిన ఆ జట్టు వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది. రవిచంద్రన్ అశ్విన్ వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్లో షాట్ ఆడటానికి క్రీజు వదిలి వెళ్లిన గురుకీరత్ సింగ్ (15)ను చెన్నై కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ స్టంపౌట్ చేశాడు. పదో ఓవర్లో గ్లెన్ మాక్స్ వెల్ (6) రవీంద్ర జడేజా బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో పవన్ నేగి రెండు వికెట్లు పడగొట్టగా, అశ్విన్, ఆశీష్ నెహ్రా, ఈశ్వర్ పాండే, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రేవో ఒక్కో వికెట్ తీశారు.