పాక్ ఫైనల్కు రావడంలో ఆశ్చర్యం లేదు
బర్మింగ్హోమ్: చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు పాకిస్థాన్ రావడం తనకు ఆశ్చర్యం కలగించలేదని భారత్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తెలిపాడు. ఏ రోజు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేమని.. క్రికెట్లో ఏ జట్టును తక్కువ అంచనా వేయకూడదని అభిప్రాయపడ్డాడు. వెస్టిండీస్ పర్యటనకు ఎంపిక చేసిన జట్టులో చోటు లేకపోవడంపై బుమ్రా స్పందించాడు.
వంద శాతం ఫిట్గా ఉన్నానని కానీ విశ్రాంతి అవసరమని సెలెక్టర్లు భావించడంతో వెస్టీండిస్ పర్యటనకు ఎంపిక చేయలేదని ఈ స్పీడ్స్టార్ పేర్కొన్నాడు. వెస్టిండీస్తో ఈ నెల 23 నుంచి జరిగే 5 వన్డేలు, ఏకైక టీ20 మ్యాచ్లకు ఓపెనర్ రోహిత్ శర్మ, బుమ్రాకు విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. పూర్తి ఫిట్నెస్తో ఉన్నానని, కానీ సెలక్టర్లు, టీం మెనెజ్మెంట్ విశ్రాంతి తీసుకోవాలని సూచించారని బుమ్రా పేర్కొన్నాడు. తనకు ఎలాంటి ఫిట్నెస్ సమస్యలు లేవని స్పష్టం చేశాడు. ఎంపిక చేయకపోవడం పట్ల నిరాశచెందలేదని చెప్పుకొచ్చాడు.
ఇక బంగ్లాదేశ్తో జరిగిన సెమీస్లో బుమ్రా రెండు వికెట్లు తీసి ఏకంగా 41 డాట్ బంతులు వేశాడు. డాట్ బంతుల వల్ల బ్యాట్స్మెన్ కు ఒత్తిడి పెరిగి ఇతర బౌలర్లకు వికెట్లు దక్కుతాయని బుమ్రా అభిప్రాయపడ్డాడు. యార్కర్లు వేయడం కష్టమని దీనికోసం నెట్స్లో తీవ్రంగా కృషి చేశానని బుమ్రా పేర్కొన్నాడు. ఇక ఈ గుజరాతీ చాంపియన్స్ ట్రోఫీలో రివర్స్ స్వింగ్ బంతులతో డెత్ ఓవర్లలో అద్భుతంగా రాణించాడు.