
చెప్పడానికి మాటలు చాలవు!
కొలంబో:దశాబ్దన్నర కాలంగా అంతర్జాతీయ క్రికెట్ లో ఎన్నో ఘనతలు సాధించి, క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన శ్రీలంక దిగ్గజ ఆటగాడు కుమార సంగక్కరపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. సంగక్కర ఆటతో తాను ఎంతో స్ఫూర్తి పొందానని .. ప్రపంచ క్రికెట్ లో సంగా చాలా మందికి ఆదర్శంగా నిలిచాడనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. 'సంగా గురించి చెప్పడానికి పదాలు చాలవు. సమకాలీన క్రికెటర్లలో సంగా ఒక గొప్ప క్రికెటర్. నేను సంగాతో కలిసి ఆడటం అదృష్టంగా భావిస్తున్నా. సంగా క్రికెట్ లో సాధించిన ఘనతలు నిజంగా అద్భుతం' అని బీసీసీఐ అధికారిక ట్విట్టర్ లో కోహ్లీ పొగడ్తలు కురిపించాడు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న సంగాకు , అతని కుటుంబానికి ఇక ముందు కూడా అంతా మంచే జరగాలని కోహ్లీ ఆకాంక్షించాడు.
సంగా ఆడిన చివరి టెస్టు ఫలితాన్ని పక్కన పెడితే అతనికి భారత ఆటగాళ్లు 'గార్డ్ ఆఫ్ ఆనర్' తో వీడ్కోలు పలికారు. 38 ఏళ్ల సంగా దశాబ్దమన్నర కాలంగా శ్రీలంక క్రికెట్కు వెన్నె ముకగా నిలిచాడు. 134 టెస్టుల్లో 12,400 పరుగులు చేశాడు. ఇందులో 38 సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 38 సెంచరీల్లో 11 డబుల్ సెంచరీలుగా మలచడం విశేషం. ఇక 404 వన్డేల్లో 14,234 పరుగులు చేశాడు. వీటిలో 25 సెంచరీలు, 93 హాఫ్ సెంచరీలున్నాయి. ప్రస్తుతం టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగుల జాబితాలో అతను ఐదో స్థానంలో ఉన్నాడు.