
'తాహీర్ ను బయటకు వెళ్లొద్దని సూచించాం'
ముంబై: ఇటీవల ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్ తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ సందర్బంగా దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ ను హోటల్ గది నుంచి బయటకు వెళ్లొద్దని సూచించినట్లు జట్టు మేనేజ్ మెంట్ తాజాగా స్పష్టం చేసింది. పాకిస్థాన్ సంతతికి చెందిన తాహీర్ దక్షిణాఫ్రికా జట్టులో కీలక సభ్యుడని.. ఆ కారణం చేతనే ముందస్తు జాగ్రత్తగా హోటల్ గది దాటి వెళ్లకుండా ఆదేశించినట్లు పేర్కొంది. గత నెల 19 వ తేదీన త శివసేన కార్యకర్తలు పాకిస్థాన్ తో సిరీస్ ను నిరసిస్తూ ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించడంతోనే తాహీర్ కు కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించింది.
తమ ఆటగాళ్లకు ఇచ్చిన సాధారణ భద్రతనే తాహీర్ కు కూడా కేటాయించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీమ్ మేనేజ్ మెంట్ తెలిపింది. ముంబైలోని కొన్ని ప్రదేశాలకు వెళ్లడానికి తాహీర్ ముందుగా ప్లాన్ చేసుకున్నాడని.. అదనపు సెక్యూరిటీ లేకపోవడంతో వాటిని రద్దు చేసుకోవాల్సి వచ్చినట్లు పేర్కొంది. వాంఖేడ్ స్టేడియంలో జరిగిన చివరి వన్డేలో తాహీర్ కు భారత అభిమానుల నుంచి పెద్ద ఎత్తున తాకిడి ఉన్నట్లు ఈ సందర్భంగా మేనేజ్ మెంట్ స్పష్టం చేసింది. కాగా, బ్రబౌర్న్ స్టేడియంలో పరిస్థితి కాస్త భిన్నంగా ఉందని దక్షిణాఫ్రికా మీడియా మేనేజర్ తెలిపారు. తాహీర్ తన భార్య సుమయ్య దిల్దార్, 18 నెలల కుమారుడు గిబ్రాన్ లతో కలిసి భారత పర్యటనకు వచ్చాడని .. ముందస్తు జాగ్రత్తలో భాగంగానే తాహీర్ ను ముంబైలోని హోటళ్ల గదులకే పరిమితం కావాల్సిందిగా సూచించామన్నాడు.