
భళా..టీమిండియా
ఇంగ్లండ్ తో నాల్గో టెస్టులో భారత్ క్రికెట్ జట్టు సెంచరీలతో చెలరేగిపోయింది.
ముంబై:ఇంగ్లండ్ తో నాల్గో టెస్టులో భారత్ క్రికెట్ జట్టు సెంచరీలతో చెలరేగిపోయింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో ముందుగా మురళీ విజయ్ సెంచరీ సాధిస్తే, విరాట్ కోహ్లి డబుల్ సెంచరీతో సూపర్ షో ప్రదర్శించాడు. మరో ఆటగాడు జయంత్ యాదవ్ తాను ఆడుతున్న మూడో మ్యాచ్లోనే సెంచరీ చేసి అదుర్స్ అనిపించాడు. దాంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 631 పరుగులు చేసింది. ఓవరాల్గా టీమిండియా 231 పరుగుల ఆధిక్యం సాధించి భళా అనిపించింది.
451/7 ఓవర్ నైట్ స్కోరుతో నాల్గో రోజు ఆదివారం ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్.. తొలి సెషన్లో పూర్తి ఆధిపత్యం చెలాయించింది.ఓవర్ నైట్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి-జయంత్ యాదవ్లో కీలక భాగస్వామ్యాన్ని సాధించి జట్టును మరింత పటిష్ట స్థితిలో నిలిపారు. ఈ ఇద్దరూ 241పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ క్రమంలోనే విరాట్ డబుల్ సెంచరీ సాధించాడు. ఇందులో కేవలం 23 ఫోర్లు మాత్రమే ఉండగా, మిగతా వందకు పైగా పరుగులను సింగిల్స్, డబుల్స్ ద్వారానే సాధించాడు. మరొకవైపు జయంత్ యాదవ్(104;204 బంతుల్లో 15 ఫోర్లు) శతకంతో మెరిశాడు. అయితే జయంత్ యాదవ్ ఎనిమిదో వికెట్ గా అవుటైన కాసేపటికే విరాట్(235;340 బంతుల్లో 25 ఫోర్లు, 1 సిక్స్) తొమ్మిదో వికెట్ పెవిలియన్ చేరాడు.
ఇంగ్లిష్ బౌలర్ వోక్స్ బౌలింగ్ లో అండర్సన్ కు క్యాచ్ ఇచ్చి విరాట్ అవుటయ్యాడు. ఆపై స్వల్ప వ్యవధిలో భువనేశ్వర్ కుమార్(9) కూడా అవుట్ కావడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఇంగ్లండ్ బౌలర్లలో రషిద్ నాలుగు వికెట్లు సాధించగా, అలీ, రూట్లకు తలో రెండు వికెట్లు దక్కాయి. వోక్స్ , బాల్లకు చెరో వికెట్ గా దక్కింది.