
నాటింగ్హామ్: ఇంగ్లండ్పై వరుసగా రెండు ఘోర ఓటములు చవిచూసిన భారత క్రికెట్ జట్టుకు ఇది ఊరటనిచ్చే వార్త. గత కొన్నిరోజులుగా గాయం కారణంగా జట్టుకు దూరమైన టీమిండియా ప్రధాన బౌలర్ జస్ర్పిత్ బూమ్రా.. ఇంగ్లండ్తో ట్రెంట్బ్రిడ్జ్లో జరుగనున్న మూడో టెస్టుకు సిద్ధమయ్యాడు. ఐర్లాండ్తో తొలి టి20 సందర్భంగా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో బుమ్రా ఎడమ వేలికి గాయం అయిన విషయం తెలిసిందే.
ఈ కారణంగానే అతడు ఇంగ్లండ్తో టీ20, వన్డే సిరీస్కు దూరమయ్యాడు. అయితే టెస్టు సిరీస్కు నాటికి అందుబాటులోకి వస్తాడని తొలుత భావించినా.. తొలి రెండు టెస్టులకు బూమ్రా తేరుకోలేదు. కాగా, కీలకమైన మూడో టెస్టుకు బూమ్రా పూర్తిగా కోలుకోవడంతో టీమిండియా మేనేజ్మెంట్ ఊపిరిపీల్చుకుంది. మూడో టెస్టులో కుల్దీప్ యాదవ్కు విశ్రాంతినిచ్చి, బూమ్రాను తుది జట్టులోకి తీసుకోవచ్చు. మరొకవైపు రిషబ్ పంత్ టెస్టు అరంగేట్రానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. అతనికి మూడో టెస్టులో అవకాశం ఇచ్చేందుకు మేనేజ్మెంట్ ఆసక్తిచూపుతోంది. తొలి రెండు టెస్టుల్లో దినేశ్ కార్తీక్ విఫలం కావడంతో అతని స్థానంలో రిషబ్ పంత్ను తీసుకోవాలనే టీమిండియా మేనేజ్మెంట్ యోచిస్తోంది. ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా శనివారం మూడో టెస్టు ఆరంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment