
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (యూపీసీఏ) సెలక్షన్ ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు గుప్పుమన్న నేపథ్యంలో ఓ అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. ఐపీఎల్ చైర్మన్, యూపీసీఏ కార్యదర్శి రాజీవ్ శుక్లా వర్గానికి చెందిన అక్రమ్ సైఫీపై అవినీతి ఆరోపణలు రావడంతో అతన్ని విధుల నుంచి తొలగించారు.
ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన బీసీసీఐ అవినీతి నిరోధక శాఖ పూర్తి వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించింది. ఓ జాతీయ మీడియా జరిపిన స్టింగ్ ఆపరేషన్లో అక్రమ్ సైఫీ... రాష్ట్ర జట్టులో చోటు కోసం యత్నిస్తున్న యువ ఆటగాడు రాహుల్ శర్మ నుంచి ముడుపులు కోరడంతో పాటు ఆటగాళ్లకు తప్పుడు వయసు ధ్రువీకరణ పత్రాలు ఇస్తున్నట్లు తేలింది. ఈ అంశాలను ఆ ఛానల్ ప్రసారం చేయడంతో బీసీసీఐ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది.