
న్యూఢిల్లీ: తీరిక లేని క్రికెట్ కారణంగా అలసిపోతున్నామని భావించే భారత క్రికెటర్లను ఐపీఎల్ నుంచి తప్పుకోవాలని టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సూచించారు. విశ్రాంతి లేకుండా విపరీతంగా క్రికెట్ ఆడుతున్నామనుకునేవారు ఐపీఎల్ నుంచి తప్పుకోవడం ఉత్తమం అని అన్నారు. ‘బిజీ షెడ్యూల్తో తీరిక దొరకడం లేదని భావించే వారు ఐపీఎల్ నుంచి తప్పుకోండి. అక్కడ మీరేమీ దేశానికి ప్రాతినిధ్యం వహించడం లేదు కాబట్టి లీగ్కు బ్రేక్ ఇచ్చే వెసులుబాటు మీ చేతుల్లోనే ఉంది. దేశానికి ఆడటంలో ఉండే అనుభూతి వేరు. జాతీయ జట్టుకు ఆడేటప్పుడు అత్యుత్తమ ఆట కనబరచాలి. ఫ్రాంచైజీ క్రికెట్ కారణంగా ఆ ఆట వెనుకబడకూడదు. లీగ్ల్లో శక్తి సామర్థ్యాలన్నీ ఒడ్డి జాతీయ జట్టు తరఫున విఫలమవ్వకూడదు’ అని కపిల్ పేర్కొన్నాడు. (ఇక్కడ చదవండి: టెస్టు ఓటమి.. కపిల్ ప్రశ్నల వర్షం)
అలసట అనేది కేవలం శారీరక మార్పులపైనే కాకుండా మానసిక స్థితి, ఉద్వేగాలపై కూడా ఆధారపడుతుందని కపిల్ అన్నాడు. ‘ఒక సిరీస్లో ప్రతీ మ్యాచ్ ఆడుతూ పరుగులు చేయడంలో విఫలమైతే అలసిపోయిన భావన కలుగుతుంది. అదే సమయంలో వికెట్లు పడగొడుతున్నప్పుడు ఏకధాటిగా 30 ఓవర్లు బౌలింగ్ చేసినా కూడా మనలో అలసట ఉండదు. ఇది మన ప్రదర్శనలపై ఆధారపడి ఉంటుంది’ అని కపిల్ వివరించాడు. (ఇక్కడ చదవండి: సమం చేస్తారా?)