
సాక్షి, హైదరాబాద్: అంతర్ జిల్లా రోలర్ స్కేటింగ్ చాంపియన్షిప్లో హైదరాబాద్ అమ్మాయి శ్రీవిజ్ఞా రెడ్డి మెరిసింది. ఇందిరాపార్క్లోని అంతర్జాతీయ స్కేటింగ్ రింక్పై జరిగిన ఈ పోటీల్లో అండర్–13 బాలికల విభాగంలో శ్రీవిజ్ఞ స్వర్ణంతో పాటు రెండు కాంస్యాలను కైవసం చేసుకుంది.
ఈ విజయంతో జాతీయ స్థాయి రోలర్ స్కేటింగ్ చాంపియన్షిప్లో పాల్గొనే రాష్ట్ర జట్టుకు ఎంపికైంది. ఈ పోటీల్లో సత్తా చాటిన కె. యశ్వంత్ (1 స్వర్ణం, 1 రజతం), జాహ్నవి (1 స్వర్ణం, 3 కాంస్యాలు), ఎం. నిత్యారెడ్డి (3 స్వర్ణాలు, 1 రజతం), రితేశ్ (1 స్వర్ణం, 2 రజతాలు)లు కూడా రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు. తమిళనాడులోని చెన్నైలో జనవరి 27 నుంచి 31 వరకు ఈ జాతీయ చాంపియన్షిప్ జరుగుతుంది.