
లండన్: మళ్లీ లైవ్ క్రికెట్ను అస్వాదించేందుకు అభిమానులు సిద్ధంగా ఉండండి. వెస్టిండీస్ క్రికెట్ జట్టు మూడు టెస్టుల సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ చేరుకుంది. ప్రైవేట్ విమానంలో కరీబియన్ ఆటగాళ్లు పయనమయ్యారు. ఇంగ్లండ్కు బయలుదేరే ముందు విండీస్ ఆటగాళ్లకు కోవిడ్–19 పరీక్షలు నిర్వహించగా... అందరికీ నెగెటివ్ వచ్చింది. ఇంగ్లండ్ చేరాక ప్రస్తుత నిబంధనల మేరకు 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి కావడంతో ఆటగాళ్లు బస చేసే హోటల్ నుంచి బయటికిరారు. క్వారంటైన్ ముగిశాక మరోసారి కరోనా పరీక్షలు చేస్తారు. టెస్టు సిరీస్ కాస్తా జూలై 8న మొదలవుతుంది. అంతర్జాతీయ క్రికెట్ షట్డౌన్కు త్వరలోనే ఈ సిరీస్ ద్వారా తెరలేవనుందని విండీస్ కెప్టెన్ హోల్డర్ చెప్పాడు. కరీబియన్ నుంచి తొలి అడుగు పడుతోందన్నాడు. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ మాట్లాడుతూ మొత్తం క్రికెట్ ప్రపంచం మళ్లీ ఆటను చూసేందుకు ఉత్సాహంతో ఎదురు చూస్తోందని అన్నాడు. మూడు టెస్టుల సిరీస్ను బయో సెక్యూర్ వాతావరణంలో గేట్లు మూసి ప్రేక్షకుల్లేకుండా ఈ పోటీలు నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment