అమ్మాయిల ‘గురు’ రామన్‌ | Wv Raman set to become womens cricket team coach | Sakshi
Sakshi News home page

అమ్మాయిల ‘గురు’ రామన్‌

Published Fri, Dec 21 2018 3:09 AM | Last Updated on Fri, Dec 21 2018 4:34 AM

Wv Raman set to become womens cricket team coach - Sakshi

ముంబై:భారత మహిళల క్రికెట్‌ జట్టు కోచ్‌గా మాజీ ఓపెనర్‌ డబ్ల్యూవీ రామన్‌ను క్రికెట్‌ పరిపాలక కమిటీ (సీఓఏ) నియమించింది. పురుషుల కోచ్‌గా భారత్‌కు వన్డే ప్రపంచకప్‌ అందించిన గ్యారీ కిర్‌స్టెన్‌ను కాదని రామన్‌ను కోచ్‌గా నియమించినట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. దిగ్గజ కెప్టెన్‌ కపిల్‌ దేవ్, అన్షుమన్‌ గైక్వాడ్, శాంతా రామస్వామిలతో కూడిన అడ్‌హక్‌ కమిటీ తొలి ప్రాధాన్యంగా కిర్‌స్టెన్‌ను ఎంపిక చేసింది. తర్వాతి స్థానాల్లో రామన్, వెంకటేశ్‌ ప్రసాద్‌లతో వున్న తుది జాబితాను కమిటీ గురువారం సీఓఏకు అందజేసింది. అందులో మహిళా కోచ్‌ కల్పన వెంకటాచర్‌ను సహాయ కోచ్‌గా తీసుకోవాలని సూచించింది. కిర్‌స్టెన్‌ ఐపీఎల్‌లో ప్రస్తుతం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు కోచ్‌గా ఉన్నారు. పరస్పర విరుద్ధ ప్రయోజనాల రీత్యా ఆయన ఫ్రాంచైజీకి రాజీనామా చేయాల్సివుంటుంది. కానీ కిర్‌స్టెన్‌ అందుకు సమ్మతించకపోవడంతో సీఓఏ ఆయన్ని పక్కనబెట్టింది. అయితే ఈ ప్రక్రియ వివాదాస్పదమైంది. కోచ్‌లను నియమించే అధికారం లేని సీఓఏ తమ పరిధిని అతిక్రమిస్తుందని దీన్ని బోర్డు ఆమోదించే అవకాశం లేదని కోశాధికారి అనిరుధ్‌ చౌదరి తెలిపారు. 

ఆయనే ఎందుకంటే... 
మహిళా జట్టుకు బ్యాటింగ్‌ కోచ్‌ అవసరముందని బీసీసీఐ భావించింది. దీంతో బ్యాటింగ్‌ కోచ్‌నే హెడ్‌ కోచ్‌గా నియమించాలనుకోవడంతో భారత మాజీ పేసర్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌కు అవకాశం దక్కలేదు. వూర్కేరి వెంకట్‌ రామన్‌ భారత మాజీ ఓపెనర్‌. 1992–93 సీజన్‌లో దక్షిణాఫ్రికా గడ్డపై సెంచరీ చేసిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా ఆయనకు రికార్డుంది. జాతీయ జట్టు తరఫున 11 టెస్టులు, 27 వన్డేలాడిన 53 ఏళ్ల రామన్‌ ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో బ్యాటింగ్‌ సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. పైగా కోచ్‌గా పనిచేసిన అనుభవం కూడా రామన్‌కు ఉంది. గతంలో తమిళనాడు, బెంగాల్‌ రంజీ జట్లతో పాటు... భారత అండర్‌–19 జట్టుకూ కోచ్‌గా పనిచేశారు. ఇవన్నీ ఆయన ఎంపికకు అనుకూలించాయి.  

28 మంది దరఖాస్తు చేస్తే... 
వన్డే కెప్టెన్, సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ మిథాలీ రాజ్‌తో విభేదాల కారణంగా తాత్కాలిక కోచ్‌ రమేశ్‌ పొవార్‌ పదవీ కాలాన్ని పొడిగించలేదు. దీంతో కొత్త కోచ్‌ నియామక ప్రక్రియను బోర్డు మొదలు పెట్టింది. దరఖాస్తులను ఆహ్వానించగా 28 మంది ఆసక్తి కనబరిచారు. ఇందులోంచి 10 మందిని కపిల్‌ కమిటీ ఇంటర్వ్యూకు పిలిచింది. పై ముగ్గురితో పాటు గిబ్స్, రమేశ్‌ పొవార్, మస్కరెనస్, బ్రాడ్‌ హగ్, ట్రెంట్‌ జాన్స్‌టన్, మనోజ్‌ ప్రభాకర్, మహిళా కోచ్‌ కల్పన వెంకటాచర్‌లను కపిల్‌ బృందం ఇంటర్వ్యూ చేసింది. ఇందులో ముగ్గురిని మాత్రమే నేరుగా ఇంటర్వ్యూ చేయగా, ఫోన్‌లో, స్కైప్‌ వీడియా చాట్‌ ద్వారా మిగతా వారు అందుబాటులోకి వచ్చారు. 

బయటపడ్డ లుకలుకలు 
కోచ్‌ నియామక ప్రక్రియపై బోర్డు, పరిపాలక కమిటీ (సీఓఏ)లోని అభిప్రాయబేధాలు మళ్లీ తెరమీదికొచ్చాయి. పొవార్‌నే మళ్లీ కోచ్‌ను చేయాలంటూ  సీఓఏ సభ్యురాలైన డయానా ఎడుల్జీ పట్టుబట్టారు. బాహాటంగానే మద్దతు పలికారు. సీఓఏ చీఫ్‌ వినోద్‌ రాయ్‌ మాత్రం ఆమె పంతాన్ని నెగ్గనివ్వలేదు. ఇప్పుడు అంతా పూర్తయ్యాక కూడా ఎడుల్జీ, బోర్డు కోశాధికారి అనిరుధ్‌ చౌదరితో కలిసి వినోద్‌ రాయ్‌ తీరును తప్పుబట్టారు. కోశాధికారి అనిరుధ్‌ వచ్చే నెల 17వ తేదీన జరిగే కోర్టు విచారణ వరకైన ఈ ఎంపిక ప్రక్రియను ఆపాలని కోరారు. ఇలాగే ముందుకెళ్తే కోచ్‌ నియామకానికి బోర్డు ఆమోదం తెలపదని స్పష్టం చేశారు.  

కివీస్‌ టూర్‌కు జట్ల ఎంపిక నేడు 
న్యూజిలాండ్‌ పర్యటించే భారత వన్డే, టి20 జట్లను శుక్రవారం ఎంపిక చేయనున్నారు. ఢిల్లీలో జరిగే ఈ సెలక్షన్‌ సమావేశానికి వన్డే సారథి మిథాలీరాజ్‌ హాజరు కానుంది. ఆసీస్‌లో మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌ ఆడుతున్న టి20 కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ స్కైప్‌ వీడియోలో అందుబాటులో ఉండనుంది. కివీస్‌లో భారత మహిళల జట్టు మూడు వన్డేలు, మూడు టి20లు ఆడనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement