
హక్కుల కమిటీ గౌరవాన్ని కించపర్చడం శోచనీయం
స్పీకర్ కోడెలకు వైఎస్సార్సీఎల్పీ ఉప నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేఖ
సాక్షి, హైదరాబాద్: శాసనసభ హక్కుల కమిటీ గౌరవాన్ని కమిటీ సభ్యులే కించపర్చడం శోచనీయమని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉప నాయకుడు, హక్కుల కమిటీ సభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఈ మేరకు పెదిరెడ్డి స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు లేఖ రాశారు. లేఖ సారాంశం ఇదీ..
‘గౌరవనీయులైన సభాపతి గారికి,
ఆర్యా!
ఈ నెల 22న అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన శాసనసభా హక్కుల కమిటీ సమావేశంలో గత సెప్టెంబర్లో శాసనసభ లోపల జరిగిన పరిణామాలపై నోటీసులు అందుకున్న కొందరు సభ్యులను పిలచి విచారించారు. నోటీసులు అందుకున్న వారు తమ అభిప్రాయాలను చెబుతున్నçప్పుడు, మధ్యలో.. నాతోపాటు సభ్యులుగా ఉన్న శ్రావణ్కుమార్, కె.రామకృష్ణ గారు మధ్యలో కలుగజేసుకొని మీరు చెప్పేది ఊరునంతా గజదొంగలు దోచుకుని.. ఎందుకు దొంగతనం చేశారు అంటే.. రాష్ట్ర శ్రేయస్సు కోసం, ప్రజల కోసం మేము చేశాము అని చెప్పినట్లు ఉంది మీరు చెప్పేది అని వ్యాఖ్యానించారు. తోటి కమిటీ సభ్యులు అలా మధ్యలో కలుగజేసుకొని మాట్లాడటం బాధాకరం. నోటీసులు అందుకున్న సభ్యుడు తన వివరణ ఇస్తుండగా.. మధ్యలో కలుగజేసుకొని మీరు తప్పుచేసి కమిటీ ముందుకు వచ్చారు అని చెప్పడం.. చాలా విచారకరం.
తోటి శాసనసభ్యులను బందిపో టు దొంగలంటూ పరోక్షంగా మాట్లాడటం కమిటీ గౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయి. కమిటీ సభ్యులుగా ఉన్న వ్యక్తులు హుందాగా, పెద్దతరహాగా ఉండాలి కానీ, ఇలా మాట్లాడటం భావ్యంకాదు, కమిటీకి గౌరవం కూడా కాదు. కావున తమరు దయచేసి ఇకపై నోటీసులు అందుకున్న తోటి సభ్యులు తమ వివరణ ఇస్తున్నప్పడు ఇలా మధ్యలో కలుగజేసుకొని, వారిని అగౌరవ పరిచేలా మాట్లాడవద్దని కమిటీలో సభ్యులుగా ఉన్న వారికి మీరు గట్టిగా సూచించవలసిదిగా కోరుతున్నాము.’