
శిరూరు స్వామి (ఫైల్ ఫొటో)
యశవంతపుర : ఉడిపి శిరూరు మఠాధిపతి లక్ష్మీవరతీర్థ స్వామి అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. ఆయన మరణానికి ముందు జిల్లా ఎస్పీకి లేఖ రాసిన విషయం బయటపడింది. అష్టమఠాలలో ఒక్కటైన శిరూరు మఠాధిపతి లక్ష్మీవరతీర్థ స్వామి గతనెల 24న ఎస్పీకి లేఖ రాశారు. తనకు పట్టద దేవుడు దక్కకుంటే జరిగే పరిణామాలకు మిగిలిన ఏడు మఠాధిపతులే కారణమని ఆ లేఖలో పేర్కొన్నారు. పట్టద దేవుడు తనకు దక్కే వరకు పోరాటం చేస్తా, అది దక్కకుంటే కారణం సప్త మఠాధిపతులే కారణం అని వివరించారు. సమస్య పరిష్కరించాలని 24న ఎస్పీకి లేఖ రాశారు. ఈ విషయం మూడు రోజుల క్రితం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఇది సివిల్ విషయం కావడంతో కోర్టులో పరిష్కరించుకోవాలని ఎస్పీ సూచించినట్లు సమాచారం.
విష ఆనవాళ్లు లేవు : స్వామీజీ మరణానికి సంబంధించి ఆదివారం పోస్టుమార్టం నివేదిక పోలీసులకు అందింది. మృతదేహంలో ఎలాంటి విషపదార్థాల ఆనవాళ్లు లేవని వెల్లడైంది. అయితే ఎఫ్ఎస్ఎల్ నివేదిక వచ్చే వరకు విచారణను చేయటం కష్టమని పోలీసులు తెలిపారు. పోలీసులకు అందిన నివేదికలో మూత్రపిండాలు పూర్తిగా దెబ్బతినటం వల్ల స్వామిజీ మృతి చెందారని పేర్కొన్నారు.