
ఎన్నికల హామీలు నెరవేర్చని ప్రభుత్వం
ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం నెరవేర్చలేదని, అధికారంలోకి వచ్చి 33 నెలలు గడుస్తున్నా వాటి ఊసే ఎత్తడం లేదని పలువురు వక్తలు విమర్శించారు.
- టీఎస్పీఎస్సీ క్యాలెండర్ విడుదల చేయాలి
- రౌండ్టేబుల్ సమావేశంలో వక్తలు
ఎదులాపురం : ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం నెరవేర్చలేదని, అధికారంలోకి వచ్చి 33 నెలలు గడుస్తున్నా వాటి ఊసే ఎత్తడం లేదని పలువురు వక్తలు విమర్శించారు. శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని సుందరయ్య భవనంలో ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో ‘యువత–నిరుద్యోగం’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడుతూ తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశించిన నిరుద్యోగుల చిరకాల స్వప్నంపై కేసీఆర్ నీళ్లు చల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల అలుపెరుగని పోరాటం, ఆత్మబలిదానాలు బూడిదలో పోసిన పన్నీరయ్యాయని అన్నారు. స్వరాష్ట్ర ఆశయాల సాధన, హామీల అమలు కోసం విద్యార్థి, యువజన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతోపాటు అన్ని సంఘాలను కలుపుకొని ప్రజాపోరాటంగా ముందుకు కదులుతామని తెలిపారు.
యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ క్యాలెండర్ని విడుదల చేసి దాని ప్రకారం ఖాళీలు భర్తీ చేయాలని, ఉద్యోగాల నియమకాలను పారదర్శకంగా చేపట్టాలని, నిర్వహించింన పరీక్ష ఫలితాలు విడుదల చేయాలని తదితర తీర్మానాలు ఆమోదించారు. ఈ కార్యక్రమంలో టీజేఏసీ జిల్లా చైర్మన్ దుర్గం రాజేశ్వర్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షడు వెంకట్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మసి ఉల్లాఖాన్, ఐఫ్టీయూ సభ్యు డు వెంకట్నారాయణ, టీఏజీఎస్ రాష్ట్ర కార్యధర్శి తొడసం భీంరావ్, సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు మయూరి తదితరులు పాల్గొన్నారు.