ముత్తారం మండలం పారుపెల్లికి చెందిన సుమారు 30 మంది దళిత కుటుంబాలకు ఒక్కొక్కరికి ఎకరం చొప్పున ప్రభుత్వం గతంలో సర్వే నెంబర్ 603లో భూమిని కేటాయించింది. తీరా సర్వే నెంబర్లో ఎంత భూమి ఉందని లెక్కలు తీస్తే అందులో 20 ఎకరాల భూమి మాత్రమే ఉందని తేలింది. దీంతో ఆలోచనలో పడిన రైతులు అదే సర్వే నంబర్ను ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని చదను చేసి పంట పండించుకునేందుకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో దళితులకు తారసపడిన మాజీ ఎంపీటీసీ మల్యాల రాజయ్యకు జరిగిన విషయం తెలిపి వాపోయారు.
ఆ వెంటనే రాజయ్య స్పందిస్తూ ‘మీతోపాటు నన్ను కలుపుకుంటే నేను కొంత భూమిని పట్టా చేసుకోవడంతో పాటు మీకు ఎలాంటి ఖర్చులు లేకుండా ప్రభుత్వ భూమిని పట్టాలు చేయించి ఇస్తాను. అంతేగాకుండా ఆ భూమిని చదును చేసి పైపులైన్ కూడా వేయిస్తా. ఒకవేళ నేనట్లా చేయకుంటే నా ప్రభుత్వ భూమిని కూడా మీరే సాగు చేసుకోవచ్చు’ అని మభ్యపెట్టారు. ఎలాంటి ఖర్చులు లేకుండా భూమి రావడంతో పాటు ఇబ్బందుల్లేకుండా సాగుకు ఉపయోగపడుతుందని భావించిన దళితులు రాజయ్య ప్రతిపాదనకు ఒప్పుకున్నారు. అనంతరం 2011 నవంబర్ 11న రూ.50 బాండ్ పేపర్పై ఇరువర్గాలు ఒప్పందం చేసుకున్నాయి.
అధికార బలంతో తిమ్మిని బమ్మిని చేసిన వైనం
అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీగా ఉన్న రాజయ్య తన అధికారాన్ని, రాజకీయ పలుబడిని ఉపయోగించి 23 మంది దళితలకు ఒక్కొక్కరికి ఎకరం చొప్పున, తన ఇద్దరు కు టుంబసభ్యులు, మరో ఇద్దరు సమీప బం ధువుల పేరిట ఒక్కొక్కరికి రేండేసి ఎకరాల చొప్పున పట్టాలు చేయించాడు. అయితే పట్టాలు చేయించే సమయంలో రెవెన్యూ అధికారులు పెద్దమొత్తంలో ఖర్చులు అడుగుతున్నారని సాకు చూపి ఒక్కో దళితుడి నుంచి రూ.5వేల చొప్పున వసూలు చేశా రు. తీరా పట్టాపాస్ పుస్తకాలు వచ్చిన తరువాత మరో మోసానికి తెరతీశారు. ‘మీ పాస్ పుస్తకాల కోసం సొంతంగా లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన. ఆ పాస్ పుస్తకాలను బ్యాంక్లో తాకట్టు పెట్టి రుణం తీసుకుంట. వచ్చే ఏడాది వడ్డీతో సహా నేనే చెల్లిస్తా’ అని నమ్మబలికాడు. సదరు మాజీ ప్రజాప్రతినిధి చెప్పిన మాటలను నమ్మిన దళితలు సరేననడంతో 23 మంది దళితుల పేరిట ఉన్న కొత్త, పాత పట్టాపాస్బుక్లను బ్యాంక్లో పెట్టి దాదాపు రూ.8లక్షల రుణం తీసుకున్నారు.
ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఇటీవల ఆయా దళితులంతా రుణాల కోసం బ్యాంకుకు వెళితే అసలు విషయం తెలిసి నివ్వెరపోయారు. ‘మీరు తీసుకున్న పంట రుణాలు మాఫీ కాలేదు. మీరెవరూ డబ్బులు చెల్లించలేదు. కాబట్టి రుణాలు చెల్లించాల్సిందే. అప్పటిదాకా కొత్త రుణాలిచ్చేది లేదు’ అని బ్యాంకు అధికారులు చెప్పడంతో అవాక్కయిన సదరు దళితులు రాజయ్య వద్దకు వెళ్లి నిలదీశారు.రాజయ్య నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో దళితులంతా పెద్దమనుషులను ఆశ్రయించారు. అయితే ఎవరెన్ని చెప్పినా తాను పంట రుణాలు చెల్లించేది లేదని మొండికేయడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి దళితులది.
రెవెన్యూ అధికారుల తప్పిదం వల్ల రుణమాఫీ అనర్హులు
వాస్తవానికి పంట రుణాలను మాఫీ చేస్తూ ప్రభుత్వం ఇటీవల ప్రకటించడంతోపాటు కొంత సొమ్మును కూడా బ్యాంకులకు జమ చేసిన సంగతి తెలిసిందే. అయితే దళితుల భూమి విషయానికొచ్చే సరికి సర్వేనంబర్ 603లో అసలు మిగులు భూమి లేదు. ఈ విషయం తెలియని రెవెన్యూ అధికారులు అదే నంబర్పైన పట్టాపాస్ పుస్తకాలు జారీ చేశారు. అయితే ఇది ముత్తారం, కాల్వశ్రీరాంపూర్ సరిహద్దులో ఉంది. రెండు మండలాల సరిహద్దు వివాదం ఉండడంతో ప్రజల నుంచి అందిన ఫిర్యాదు మేరకు జేసీ పలుమార్లు పరిశీలించారు.
సరిహద్దులు నిర్ణయించడానికి సర్వే చేయించారు. తీరా హద్దులు నిర్వహించగా దళితులకు పట్టాలు జారీ చేసిన భూమి సర్వేనంబర్ 603 కాదని తేలిపోయింది. ఈ విషయం బయటకు పొక్కితే పరువు పోతుందని గ్రహించిన రెవెన్యూ అధికారులు రికార్డుల్లో సర్వేనంబర్ 774 పేరిట పత్రాలు రూపొందించారు. రుణమాఫీ గురించి పహణీల కోసం దరఖాస్తు చేసుకున్న దళితలకు సర్వేనంబర్ 774పైన పహణీలు జారీ చేశారు. ఈ విషయం తెలియని దళితులు సదరు పహణీలతో బ్యాంక్ అధికారులను సంప్రదించగా ‘తొలుత రుణం పొందింది సర్వేనంబర్ 603పైన మాత్రమే రుణాలు పొందారు. ఇప్పుడు 774 సర్వేనంబర్ పహణీలు తీసుకురావడం వల్ల మీకు రుణమాఫీ వర్తించదు’ అని తిప్పిపంపించారు.
ఉపకారం చేస్తే అపకారం తలపెడతారా
ఉపకారం చేయబోతే అపకారం అయినట్లుగా మారింది నాపరిస్థితి. నేను దళితులకు సేవ చేయాలనే ఉద్దేశంతో నా డబ్బులతో వారికి భూ పట్టాలు చేయించడంతోపాటు భూమిని చదును చేయించి ఇచ్చాను. అయితే నేనంటే గిట్టని ఓ వ్యక్తి దీన్ని పెద్ద రాద్ధాంతం చేసి నన్ను బదనాం చేస్తున్నాడు. దళితుల కోసమే పంట రుణాలు తీసుకోవడం జరిగింది. అయినా పట్టాదారులు లేకుండా బ్యాంక్ అధికారులు పంట రుణం ఎలా ఇస్తారు.
- మాజీ ఎంపీటీసీ రాజయ్య వివరణ
ప్రీగా చేసిస్తానన్నాడు..
మాతో కలుపుకుని ప్రభుత్వ భూమిలో తనకు కొంత అవకాశం కల్పిస్తే దళితులందరికి ప్రభుత్వ భూమిని పట్టాలు చేయించి ఇస్తానని ముందుగా నమ్మబలికాడు. ఆ తరువాత ఖర్చులు ఎక్కువైనయని డ బ్బులు వసూలు చేసిండు.
- బూడిద మల్లమ్మ, బాధితురాలు
పైపులైన్ వేసిస్తానన్నాడు
ప్రభుత్వ భూమిని ఒక్కొక్కరికి రెండు ఎకరాలు పట్టాలు చేసిన తరువాత చదును చేసి వ్యవసాయం చేసుకోవడానికి వీలుగా సాగునీటి పైపులైన్ వేసిస్తానని చెప్పాడు. ఆ తరువాత మాకు ఒక్కొక్కరికి ఎకరం పట్టా మాత్రమే చేయించాడు.
- ఇనుముల రాయమ్మ, బాధితురాలు
ఐదువేలు వసూలు చేసిండు
రెవెన్యూ అధికారులు పట్టాలు చేయడానికి చాలా పైసలు అడుతున్నారు కనుక ఒక్కొక్కరు ఐదు వేలు ఇవ్వాలని మా దగ్గర బలవంతంగా పైసలు వసూలు చేసిండు. పైసలు ఇవ్వకపోతే భూమి రాదనే భయంతో ఇవ్వాల్సి వచ్చింది.
- ఇరుకురాల లక్ష్మి, బాధితురాలు
లోన్లు కడతనని మోసం చేసిండు
మీకు పట్టాలు చేసిన భూమి మీద తీసుకుంటున్న బ్యాంక్ లోన్లు యేడాది లోపు నేనే కడతానని తీసుకుని, ఇప్పుడు లోన్లు కట్ట ఏం చేసుకుంటరో చేసుకోండని మమ్మల్ని నమ్మించి మోసం చేస్తుండు.
- ఇరుకురాల లింగమ్మ, బాధితురాలు
చట్టపరంగా చర్యలు తీసుకోవాలే
చదువు ముక్కరాని మాలాంటి గరీబు దళితులను మోసం చేసిన అతనిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలే. మా పేరిట తీసుకున్న లోన్లను అతనితోని కట్టించి మాకు న్యాయం చేయాలి.
- ఇరుకురాల రాయపోశమ్మ, బాధితురాలు
ఎనిమిదెకరాలు పట్టా చేయించుకున్నడు
ప్రభుత్వ భూమిలో పొరకలు కొట్టుకుని సాగు చేసుకుందామని సిద్ధమైన మాకు మాయమాటలు చెప్పి ఒక్కక్కరికి ఎక రం భూమి పట్టా చేయించి తా ను మాత్రం కుటుంబసభ్యులు, బంధువుల పేరిట ఎనిమిదెకరాలు పట్టా చేయించుకున్నడు.
- ఇనుముల సమ్మమ్మ, బాధితురాలు
రాజయ్యా.. తగునా..?
Published Thu, Dec 18 2014 1:59 AM | Last Updated on Sat, Sep 2 2017 6:20 PM
Advertisement
Advertisement