గుండె నొప్పితో ఓ మహిళ ఖైదీ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది.
హైదరాబాద్: గుండె నొప్పితో ఓ మహిళ ఖైదీ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. చంచల్గూడ మహిళ జైలు సూపరింటెండెంట్ బషీరా బేగం తెలిపిన వివరాలివీ.. సికింద్రాబాద్ బొల్లారం ప్రాంతానికి చెందిన వడ్డెర రేణుక(39) ఓ హత్య కేసులో నిందితురాలు. ఆమెను పోలీసులు గత ఏడాది డిసెంబర్లో చంచల్గూడ మహిళా జైలుకు తరలించారు. అప్పటి నుంచి ఆమె రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభవిస్తోంది. మంగళవారం ఉదయం రేణుకకు అకస్మాత్తుగా గుండె నొప్పి రాగా జైలు వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఉస్మానియా వర్గాలు సమాచారం ఇచ్చినట్లు సూపరింటెండెంట్ తెలిపారు. మృతురాలి బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు ఆమె తెలిపారు. ఈ ఘటనపై మాదన్నపేట పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు సీఐ కేపీవీ రాజు తెలిపారు.