
సాక్షి, హైదరాబాద్ : నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ద్వారానే వైరస్ సోకినట్టు తెలుస్తోంది. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం ఆయన హైదరాబాద్ బంజారాహిల్స్లోని తన నివాసంలోనే చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని, త్వరలోనే కరోనా నుంచి కోలుకొని నియోజకవర్గ ప్రజలను కలుస్తానని గణేష్ గుప్తా చెప్పారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ వాట్సప్ సందేశాన్ని విడుదల చేశారు. (చదవండి : కరోనా వైరస్ బారిన మరో ఎమ్మెల్యే)
‘నాపై ప్రేమ చూపిన ప్రజలకు, అభిమానులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు. నేను బాగానే ఉన్నాను. ఎవరూ అధైర్యపడొద్దు. త్వరలో నేను చేయించుకోబోయే టెస్ట్లో నెగెటివ్ వస్తుందని ఆశిస్తున్నాను. మీ ముందుకు త్వరలోనే వస్తాను. అందరు తప్పకుండా మాస్కులు ధరించండి. సామాజిక దూరం పాటించండి. అన్ని జాగ్రత్తలు తీసుకున్న నేనే కరోనా బారిన పడ్డాను. దయచేసి జాగ్రత్తగా ఉండండి. నిజామాబాద్ నగర ప్రజలు ఎవరూ కూడా నాలాగా కరోనా బారిన పడొద్దని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను’ అని గణేష్ గుప్తా ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.