
హైదరాబాద్: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు నదిలో పడి దుర్మరణం పాలయ్యాడు. కొడుకు ప్రయోజకుడై కుటుంబానికి అండగా ఉంటాడనుకున్న తల్లికి తీరని శోకం మిగిల్చాడు. రంగారెడ్డి జిల్లా మంకల్ గ్రామానికి చెందిన బుస్సు నరేందర్రెడ్డి, శైలజ దంపతుల కుమారుడు జగమోహన్రెడ్డి (29). హైదారాబాద్లోని స్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశాడు. ఉన్నత చదువుల కోసం 2012 డిసెంబర్ 30న కెనడా వెళ్లాడు. గత నెల 27 లేదా 28న జగన్ ప్రమాదవశాత్తు టొరంటోలోని ఓ నదిలో పడి ఉండటాన్ని స్థానిక పోలీసులు గమనిం చారు. శవాన్ని వెలికితీసి జేబులో బస్పాసు ఆధారంగా న్యూయార్క్లో ఉండే తమ బంధువుకు సమాచారం అందించారని జగన్ కుటుంబసభ్యులు తెలిపారు.
జగన్ తండ్రి గతంలోనే గుండెపోటుతో మృతి చెందగా తల్లి కుటుంబ భారాన్ని తనపై వేసుకుంది. తన ముగ్గు రు పిల్లలతో కలిసి పదేళ్ల క్రితం జిల్లె లగూడ వివేక్నగర్కు వచ్చింది. కష్టపడి పిల్లలను చదివించింది. కూతురు రాజేశ్వరికి వివాహం కాగా పెద్ద కుమారుడు జగదీశ్రెడ్డి ఓ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్నా డు. చిన్న కుమారుడైన జగన్ ఉన్నత చదువుల కోసం 2012లో కెనడా వెళ్లాడు. అప్పుడు వెళ్లిన జగన్..కుటుంబసభ్యులతో ఫోన్లో మాట్లాడటం తప్ప ఎప్పుడూ ఇండియా రాలేదని తెలిపారు. కొడుకు మృతి వార్త తెలిసిన నాటి నుంచి శైలజ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కుమారుడి జ్ఞాపకాలను తలచుకుంటూ కన్నీటి పర్యంతమవుతోంది. కాగా, గురువారం తెల్లవారుజామున 5.30కి జగన్ భౌతికకాయం నగరానికి వస్తుందని మృతుడి సోదరుడు తెలిపాడు. అదే రోజు జిల్లెలగూడలోని స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తామని పేర్కొన్నాడు.