చెప్పుతో కొట్టారన్న మనస్తాపంతో కుటుంబం ఆత్మహత్య | family suicide | Sakshi
Sakshi News home page

చెప్పుతో కొట్టారన్న మనస్తాపంతో కుటుంబం ఆత్మహత్య

Apr 11 2014 4:14 AM | Updated on Sep 2 2017 5:51 AM

చెప్పుతో కొట్టారన్న మనస్తాపంతో కుటుంబం ఆత్మహత్య

చెప్పుతో కొట్టారన్న మనస్తాపంతో కుటుంబం ఆత్మహత్య

ఓ వ్యక్తి చెప్పుతో కొట్టిందని మనస్తాపానికి గురైన ఓ నిండు కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. దంపతులు సహా ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు.

  •     దంపతులు సహా ఇద్దరు పిల్లల బలవన్మరణం
  •      ఆర్థిక ఇబ్బందులు కూడా మరో కారణం అంటున్న స్థానికులు
  •      ఆత్మహత్యకు కారకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  •  లాలాపేట, న్యూస్‌లైన్ : ఓ వ్యక్తి చెప్పుతో కొట్టిందని మనస్తాపానికి గురైన ఓ నిండు కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది.  దంపతులు సహా ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ హృదయ విదారక ఘటన గురువారం లాలాగూడ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. చిన్నారుల మృతదేహాలను చూసి స్థానికులు కన్నీరు మున్నీరయ్యారు. సంఘటనా స్థలంలో లభించిన సూసైడ్ నోట్‌లో పేర్కొన్న విషయాలు, పోలీసుల వివరాలు ఇలా ఉన్నాయి.

    తార్నాక డివిజన్ శాంతినగర్, ఆర్యానగర్‌కు చెందిన ప్రవీణ్‌కుమార్(33) భార్య స్వాతి(29) ఇద్దరు కుమార్తెలు వర్షిత(05) అక్షయ కృప(03)లతో అద్దె ఇంట్లో మూడవ అంతస్తులో ఉంటున్నారు. ప్రవీణ్‌కుమార్ కొంత కాలం ఓ ఎలక్ట్రానిక్ చానల్లో ప్రోగ్రాం ప్రొడ్యూసర్‌గా పనిచేసి మానేశాడు. ప్రస్తుతం ఓ యాడ్ ఎజెన్సీలో కన్స్‌ల్టెంట్‌గా ఉన్నాడు. స్వాతి ఇంట్లో టైలర్ పని చేస్తు జీవనం కొనసాగిస్తున్నారు. మృతుడికి వరుసకు పెద్దమ్మ (అనసూయ), అక్క (నాగలత) ఇదే భవనం కింది అంతస్తులో ఉంటున్నారు. వీరికి, స్వాతికి మధ్య మూడు రోజుల కిందట ఘర్షణ జరిగింది.

    పిల్లల మధ్య జరిగిన తగాదా విషయమై వీరు గొడవపడ్డారు. దీనిపై మంగళవారం సమావేశం ఏర్పాటుచేసిన ఆర్యనగర్ పంచ్‌కమిటీ సభ్యులు పెద్దమనుషులుగా ఇరు వర్గాలను సముదాయించే ప్రయత్నం చేస్తుండగా.. వారి ముందే అనసూయ, స్వాతిని చెప్పుతో కొట్టారు. ఈ ఘటనతో ప్రవీణ్‌కుమార్, స్వాతి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ విషయమై మరోసారి ఆదివారం పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడాల్సి ఉంది.

    ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి తన ఇద్దరు కూతుళ్లను తాడుతో గొంతు బిగించి చంపి బెడ్‌రూంలో బెడ్‌పై పడుకోబెట్టి, పక్క గదిలో భార్యాభర్తలు స్లాబ్‌కు ఉన్న ఇనుప కోక్కాలకు చెరొకవైపు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ప్రవీణ్‌కుమార్ కూతురు వర్షిత, సోదరుడి కూతురు ఒకే పాఠశాలలో చదువుతున్నారు. ప్రతిరోజు ఉదయం వారు కలిసే స్కూల్‌కు వెళ్తారు. గురువారం ఉదయం పాఠశాల సమయం మించిపోతున్నప్పటికి వర్షిత పాఠశాలకు రాకపోవడంతో సోదరుడు సుజీత్‌కుమార్ భవనం మూడవ అంతస్తులో ఉంటున్న ప్రవీణ్‌కుమార్ ఇంటికి వెళ్లగా తలుపులు మూసి ఉన్నాయి.

    పిలిస్తే ఎవరూ పలకలేదు. దీంతో అనుమానం వచ్చిన సుజీత్‌కుమార్ కిటికిలోంచి చూడగా అన్నా, వదిన వేలాడుతూ కన్పించారు. దీంతో బోరున విలపిస్తూ 100కి సమాచారం ఇచ్చారు. ఈ మేరకు లాలాగూడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తలుపులు తెరిచి చూడగా ఇద్దరు చిన్నారులు విగతజీవులుగా బెడ్‌పై, భార్యభర్తలు ఉరికి వేలాడుతూ కనిపించారు.

    అక్కడే ఉన్న సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు లాలాగూడ సీఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. స్వాతితో ఘర్షణ పడ్డ అనసూయ, నాగలతలను అదుపులోకి తీసుకుని, వారిపై కేసు నమోదు చే శామన్నారు. కాగా గత కొంతకాలంగా ఈ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురవుతోందని.. ఆత్మహత్యకు అదీ ఒక కారణం కావచ్చని స్థానికులు చెబుతున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement