
సాక్షి, హైదరాబాద్: హరితహారం అమలుపై జీహెచ్ఎమ్సీ జోనల్, డిప్యూటీ కమిషనర్లతో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘హరితహారం అమలుకు వార్డు, లొకేషన్ వారీగా ప్రణాళిక చేస్తున్నాం. కార్పొరేటర్లతో చర్చించి వార్డు ప్రణాళిక రూపొందించాలని డిప్యూటి కమిషనర్లను ఆదేశించాం. మొక్కలు నాటి, సంరక్షించుటలో జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న 30 వేల మంది ఉద్యోగులు భాగస్వాములు కావాలి. కాలని సంక్షేమ సంఘాలను మొక్కలు నాటడంలో భాగస్వామ్యం చేయాలి.
ప్రభుత్వం నిర్దేశించిన 50 లక్షల మొక్కలు నాటి, సంరక్షించాలి. గుంతలు తీయించి, మొక్కలు నాటడంతో పాటు, వాటి సంరక్షణ కోసం ప్రతి లొకేషన్లో ఒకరిని ఇంచార్జిగా నియమించాలి. నాటిన ప్రతి మొక్కను రక్షించుటకు ఫెన్సింగ్ వేయడం, నీరు పోయడం, కలుపుతీత పనులను పరిశీలించాల్సిన బాధ్యత ఇంచార్జి అధికారిదే. ఎవెన్యూ ప్లాంటేషన్ కింద జీహెచ్ఎంసీ పరిధిలో అన్ని రోడ్లకు ఇరువైపులా మొక్కలు కనిపించాలి. రోడ్డు పక్కన స్థలం తక్కువగా ఉంటే సంబంధిత ఇంటి యజమానితో మాట్లాడి, ప్రహరీ గోడకు లోపల మొక్కలు నాటించాలి. స్మశాన వాటికల ప్రహరీ గోడలు గ్రీన్ కర్టెన్స్ను తలపించేలా ప్రత్యేకమైన మొక్కలు నాటాలి. మూసీకి రెండు పక్కల వెదురు రకాల మొక్కలు నాటాలి. చెరువు కట్టలకు ఇరువైపులతో పాటు, నీరు నిలవని ప్రాంతాల్లో కూడా మొక్కలు నాటాలి’ అని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ పేర్కొన్నారు. (సాక్షాత్తు గవర్నరే వెళ్తుంటే కేసీఆర్ ఎక్కడున్నాడు..?)
Comments
Please login to add a commentAdd a comment