‘మూడింతల’ దోపిడీ! | Heavily electricity charges in the state | Sakshi
Sakshi News home page

‘మూడింతల’ దోపిడీ!

Published Mon, May 4 2015 3:16 AM | Last Updated on Wed, Sep 5 2018 3:44 PM

‘మూడింతల’ దోపిడీ! - Sakshi

‘మూడింతల’ దోపిడీ!

భవనాలకు ‘ఆక్యుపెన్సీ సర్టిఫికెట్’ లేదంటూ
భారీగా విద్యుత్ చార్జీలు

 
ఇది అక్రమమని హైకోర్టు, ఈఆర్‌సీ తేల్చినా పట్టించుకోని ఎస్‌పీడీసీఎల్
{పతి నెలా రూ.కోటికిపైగా అదనపు వసూళ్లు.. మూడేళ్లలో రూ.40 కోట్లు ఖాతాలోకి
‘ఆక్యుపెన్సీ’ని బూచిగా చూపి దండుకుంటున్న విద్యుత్ సిబ్బంది
వినియోగదారుల నుంచి భారీగా మామూళ్లు.. ఇవ్వని వారికి ‘మూడింతల’ వాతలు

 
హైదరాబాద్: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ డివిజన్ పరిధిలో ఉండే కె.పద్మజ అనే మహిళా వ్యాపారవేత్తకు ఏప్రిల్‌లో రూ.2,06,462 విద్యుత్ బిల్లు వచ్చింది. వాస్తవానికి ఆమెకు రావాల్సిన విద్యుత్ బిల్లు రూ.68,814 మాత్రమే.. మాదాపూర్‌కు చెందిన కె.వంశీ కట్టాల్సిన వాస్తవ చార్జీ.. రూ.48,068. కానీ ఇచ్చిన బిల్లు రూ.1,44,203.. ఇవేవీ సిబ్బంది పొరపాటుతోనో, సాంకేతిక తప్పిదాలతోనో వచ్చిన బిల్లులు కాదు.


ఆయా భవనాలకు ‘ఆక్యుపెన్సీ’ సర్టిఫికెట్ లేదంటూ.. విద్యుత్ సంస్థలు చేస్తున్న నిలువు దోపిడీ! ముక్కుపిండి మరీ ఒకటికి మూడింతలు వసూళ్లు చేస్తున్న వ్యవహారమిది.. వేల మంది గృహ, వాణిజ్య వినియోగదారులపై గత మూడేళ్లుగా రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్‌పీడీసీఎల్) ఇలా మూడింతల చార్జీల మోత మోగిస్తోంది. ఈ ‘ఆక్యుపెన్సీ’ వసూళ్లు అక్రమమని, దాన్ని ఆపేయాలని సాక్షాత్తు హైకోర్టు, ఈఆర్‌సీ ఆదేశించినా.. ఎస్‌పీడీసీఎల్ పట్టించుకోవడం లేదు.
 

హైకోర్టునూ లెక్కచేయరా..?’
‘ఆక్యుపెన్సీ’ బాగోతంపై కొందరు విద్యుత్ వినియోగదారులు హైకోర్టును ఆశ్రయించగా.. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేదంటూ మూడింతల చార్జీలు వసూలు చేయడం అక్రమమని స్పష్టం చేసింది. ఇప్పటికే వసూలు చేసిన అదనపు చార్జీలను సంబంధిత వినియోగదారుల భవిష్యత్ విద్యుత్ బిల్లుల్లో సర్దుబాటు చేయాలంటూ గత నవంబర్ 11న హైకోర్టు ఆదేశాలు కూడా ఇచ్చింది. ఇక రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్‌ఈఆర్‌సీ) సైతం ఈ ‘ఆక్యుపెన్సీ’ వసూళ్లు అక్రమమని తేల్చి చెప్పింది. హైకోర్టు ఆదేశాలను గృహ వినియోగదారులతో పాటు ఇతర కేటగిరీల వినియోగదారులందరికీ వర్తింపజేయాలని డిసెంబర్ 20న ఎస్‌పీడీసీఎల్‌ను ఆదేశించింది. కానీ ఎస్‌పీడీసీఎల్ ఈ ఆదేశాలను బేఖాతరు చేసి ‘ఆక్యుపెన్సీ’ పేరిట అక్రమ చార్జీల మోతను కొనసాగిస్తోంది.


భారీగా మోత..
ఎస్‌పీడీసీఎల్ ఈ మార్చిలో విద్యుత్ వినియోగానికి సంబంధించి ఏప్రిల్‌లో జారీ చేసిన బిల్లుల్లో సైతం ‘ఆక్యుపెన్సీ’ చార్జీల మోత మోగించింది. వాణిజ్య కేటగిరీలోని 7,974 మంది వినియోగదారుల వాస్తవ చార్జీల కింద రూ.13,41,068 వసూలు చేయాల్సి ఉండగా.. మూడురెట్లు పెంచి రూ.40,23,204కు బిల్లులను జారీ చేసింది. ఇదే రూపంలో గత నెలాఖరు వరకు గృహ, వాణిజ్య వినియోగదారుల నుంచి ప్రతి నెలా దాదాపు రూ. కోటి వరకు ‘ఆక్యుపెన్సీ’ చార్జీలను వసూలు చేసింది. మూడేళ్లుగా సాగుతున్న ఈ వ్యవహారంతో ఎస్‌పీడీసీఎల్ ప్రజల నుంచి రూ.40 కోట్ల వరకు అధికంగా వసూలు చేసినట్లు అంచనా.  


విద్యుత్ సిబ్బంది దందా..
ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ నిబంధనను ఆసరాగా తీసుకుని విద్యుత్ అధికారులు, సిబ్బందికి వసూళ్ల దందాకు తెరలేపారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేనందున ఇకపై మూడింతల చార్జీ కట్టాల్సిందేనని భవనాల యజమానులను బెంబేలెత్తిస్తూ.. అందినకాడికి దండుకుంటున్నారు. మామూళ్లు ఇవ్వనివారిపై మూడింతల చార్జీలను వడ్డిస్తున్నారు. మామూళ్లు ఇచ్చిన వారిని తప్పించి, ఆ స్థానంలో కొత్త వినియోగదారుల ను చేర్చి, మూడింతల చార్జీలు వేస్తున్నారు. తద్వారా లెక్కల్లో తేడాల్లేకుండా చూసుకుంటున్నా రు. ‘ఆక్యుపెన్సీ’ లేని జాబితా నుంచి ప్రతి నెలా వందల మంది పేర్లను తొలగించడం, వారి స్థానంలో కొత్తవారిని చేర్చుతుండడమే దీనికి నిదర్శనమనే అభిప్రాయం వస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో క్షేత్రస్థాయి నుంచి పైస్థాయి వరకు వాటాలు వెళుతున్నట్లు ఆరోపణలున్నాయి.
 
 
ఆక్యుపెన్సీ  సర్టిఫికెట్ ఏంటి?
ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ అంటే నివాస యోగ్యత పత్రం. ఏదైన భవన నిర్మాణం పూర్తయిన తర్వాత అందులో ఉండడానికి ముందు సంబంధిత నగర, పురపాలక సంస్థ నుంచి ఈ పత్రాన్ని పొందాల్సి ఉంటుంది. పురపాలకశాఖ 2006లో అమల్లోకి తెచ్చిన ఏకీకృత భవన నిర్మాణ నియమావళి (జీవో నం.86)లో అక్రమ కట్టడాల నియంత్రణ కోసం కొన్ని నిబంధనలను పొందుపరిచారు. ‘ఆక్యుపెన్సీ ధ్రువపత్రం’ లేని కట్టడాలకు విద్యుత్, నీటి సరఫరా, డ్రైనేజీ అండ్ సీవరేజీ కనెక్షన్లపై మూడు రెట్ల చార్జీలను వసూలు చేయాలన్నది అందులో ఒకటి. అయితే వాస్తవానికి ప్రస్తుతం నగర, పట్టణ ప్రాంతాల్లోని 80 శాతం గృహాలకు నివాస యోగ్యత పత్రాలు లేకపోవడం గమనార్హం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement