
సాక్షి, హైదరాబాద్: మల్లన్నసాగర్ భూనిర్వాసితుల పునరావాస ప్యాకేజీకి గురించి హైకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో, సీఎం కేసీఆర్ కోర్టును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆయన అసహనానికి నిదర్శనమని సీపీఐ ధ్వజమెత్తింది. న్యాయవ్యవస్థ ప్రజలకు న్యాయం చేసే తీర్పులను ఇచ్చినపుడు అసహనం వ్యక్తం చేయడం అన్యాయమని ఆ పార్టీ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి శనివారం ఓ ప్రకటనలో విమర్శించారు.
2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయకుండా, ప్రజల్లో చీలికతెచ్చి విభజించి పాలించు అన్న పద్ధతిలో 123, 125 జీవోలు తీసుకొచ్చారని పేర్కొన్నారు. తాము భూములు కొనేవాళ్లం, ప్రజలు అమ్మాలన్న పద్ధతిలో ప్రభుత్వ శైలి ఉండడం దారుణమన్నారు. కోర్టు చురకలు వేయకపోతే ప్రభుత్వ యంత్రాంగం కదిలేదా అని ప్రశ్నించారు. ఆగమేఘాలపై యంత్రాంగం కదలడానికి కోర్టు ఉత్తర్వులే కారణమన్నారు.