
‘కేటీఆర్కు ఇదే మొదటిసారి కాదు’
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కుమారుడు, ఐటీ మంత్రి కేటీఆర్ మీడియాపై విరుచుకుపడటం, బెదిరించడం ఇదే మొదటిసారి కాదని.. గతంలోనూ ఇలాంటి జరిగాయని బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి అన్నారు. మీడియా సంస్థలు రాష్ట్రాన్ని అపఖ్యాతి పాలు చేస్తున్నాయని, జర్నలిజం దిగజారిందని, సంచలనం కోసం ఆర్టికల్స్ రాస్తున్నాయని కేటీఆర్ వ్యంగ్యంగా మాట్లాడారని వివరించారు. అవసరం కోసం బెదిరించడం.. టీవీల ప్రసారాలను ఆపలేదా అని ప్రశ్నించారు.
భూకుంభకోణంపై సీబీఐ విచారణ జరిపితే బండారం బయట పడుతుందని, ప్రభుత్వం కూలిపోతుందని భయపడుతున్నారా అని నిలదీశారు. భూకుంభకోణంలో సీఎం పేషీ పాత్ర ఉందని ఆరోపణ చేసినా.. ఎస్కే సిన్హా నివేదికను ఎందుకు బయటపెట్టలేదన్నారు. గత ప్రభుత్వాలు తప్పుచేస్తే సరి చేయాల్సిన బాధ్యత మీ మీద లేదా అని ప్రశ్నించారు. ప్రత్యేక ఆర్డినెన్సు తెచ్చి గజం భూమిని కాపాడగలిగారా, చెప్పండి అని నిలదీశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఎప్పుడు ఏం మాట్లాడుతారో అర్థం కాదని ఇంద్రసేనారెడ్డి ఎద్దేవా చేశారు. భూముల కుంభకోణంపై సీబీఐ విచారణ ఆపడానికే రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి టీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది అని ఆయన అనడం దారుణమన్నారు.