
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహించాలని, కార్పొరేట్, ఇతర ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ ఉచిత చికిత్స అందించాలని వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్కు సీపీఎం నాయకులు జూలకంటి రంగారెడ్డి, బి.వెంకట్, టి.జ్యోతి విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు మంగళవారం వారు మంత్రికి వినతిపత్రం సమర్పించారు. ఆక్సిజన్ అందుబాటులో ఉంచడంతో పాటు, బ్లాక్మార్కెట్ను అరికట్టాలని, కోవిడ్ పాజిటివ్ నిర్ధారణైతే కుటుంబసభ్యులందరికీ పరీక్షలు చేయాలని, కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని వారు కోరారు. పరీక్షల నిర్వహణలో, బాధితులకు వైద్య సహాయం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఈ సందర్భంగా సీపీఎం నాయకులు ఆరోపించారు.
కరోనా విభాగాన్ని ఏర్పాటు చేయండి: జూలకంటి
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రత్యేక కరోనా విభాగాన్ని ఏర్పాటు చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్కు సీపీ ఎం నేత, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇక్కడ వెంటనే కరోనా వైద్య కేంద్రాన్ని ప్రారం భించి, అవసరమైన వైద్య సిబ్బందిని నియమించాలని, ఆక్సిజన్, వెంటిలేటర్స్, ల్యాబ్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ నియోజకవర్గ పరిధిలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, స్థానిక ఎమ్మెల్యే, అధికారులు ఇప్పటికే వైరస్ సోకి క్వారంటైన్లో ఉన్నారని, పట్టణంలోని వ్యాపారులు స్వీయ లాక్డౌన్ విధించుకున్నారని తెలిపారు. ఈ మేరకు మంగళవారం మంత్రి ఈటల రాజేందర్కు జూలకంటి వినతిపత్రం సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment