
సాక్షి, హైదరాబాద్: కేంద్ర రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు, క్షిపణి, వ్యూహాత్మక వ్యవస్థల డైరెక్టర్ జనరల్ డాక్టర్ జి.సతీశ్రెడ్డి జాతీయ డిజైన్ అవార్డుకు ఎంపికయ్యారు. దేశ రక్షణకు కీలకమైన క్షిపణుల అభివృద్ధి, డిజైనింగ్ రంగాల్లో ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఆధ్వరంలో పనిచేసే నేషనల్ డిజైన్ రీసెర్చ్ ఫోరం ఈ అవార్డును ఏర్పాటు చేసింది. సతీశ్రెడ్డి హైదరాబాద్లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ప్రస్తుతం ఏపీజే అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్) డైరెక్టర్గా పనిచేశారు.
చెన్నైలో గురువారం జరిగే కార్యక్రమంలో ఆయనకు ఈ అవార్డు అందజేయనున్నట్లు ఎన్డీఆర్ఎఫ్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇంజనీరింగ్ విభాగాల్లో సామాజిక ప్రయోజనాలు ఉన్న పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలకు ఈ అవార్డు అందజేస్తున్నారు. భారతీయ క్షిపణులకు మనదైన డిజైన్లు సిద్ధం చేయడంతోపాటు వేర్వేరు క్షిపణి వ్యవస్థలకు అవసరమైన నావిగేషన్ పరికరాల అభివృద్ధిలోనూ సతీశ్రెడ్డి కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment