
విలాసవంత జీవితం కోసం..
► జిల్లాకేంద్రంలో నివాస గృహాలే అడ్డాలు..!
►జాతీయ రహదారి వెంటా అదే తరహాలో..
►గురువారం దాడితో మరోసారి వెలుగులోకి వచ్చిన దందా
మహబూబ్నగర్ క్రైం: చూడటానికి అవి నివాస గృహాలే.. ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూ కొందరు కనిపిస్తారు. లోపల జరిగే తతంగం వేరు. అదే వ్యభిచార కేంద్రం జిల్లాలో ఈ పాడు వృత్తి కేంద్రాలు పెద్దసంఖ్యలో ఏర్పడుతున్నాయి. ఎవరికీ అనుమానం రాకుండా నివాస గృహాలనే అడ్డాలుగా మార్చుకుంటున్నారు. వాట్సాప్ ద్వారా ఈ వ్యాపారం నడిపిస్తున్నారు. సెల్ఫోన్లోనే బేరసారాలు చేస్తున్నారు. వేశ్యలు.. కొందరు గృహిణులకు సైతం ప్రలోభాలతో ఆశచూపి ఈ రంగంలోకి దించుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీనివల్ల పచ్చని కుటుంబాలు నాశనమవుతున్నాయి.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంతోపాటు జడ్చర్ల, భూత్పూర్తోపాటు మరికొన్ని పట్టణాలలో విస్తరిస్తున్న హైటెక్ వ్యభిచారం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా జడ్చర్ల, భూత్పూర్ జాతీయ రహదారుల వెంట ఈ దందా బాగానే సాగుతున్నట్లు సమాచారం. ఆర్థిక స్థోమత లేక పాడువృత్తిలో దిగిన మహిళలు కొందరే ఉండగా మరికొందరు మరింత విలాసవంత జీవితం కోసం ఈ వృత్తిలోకి దిగుతున్నారు. వేశ్య వృత్తి చేసేవారు మంచి కుటుంబాల మహిళలను ప్రలోభాలకు గురిచేసి ఈ రంగంలోకి దించుతుండటమే ఆందోళనకంగా మారింది. ప్రతిరోజు జిల్లాకేంద్రంలో పదుల సంఖ్యల ఇళ్లలో, ముఖ్యమైన హోటల్స్తోపాటు చిన్న లాడ్జింగ్లలో ఈ దందా నడుస్తోందంటే ఇది ఎంత శృతిమించిందో అర్థం చేసుకోవచ్చు.
వాట్సాప్లో ఫొటోలు చూసి
ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఈ దందా నిర్వహణ కోసం వాడుకుంటున్నారు. మంచి కుటుంబాలకు చెందిన మహిళలు సైతం ఈ రంగంలోకి దిగడంతో విటులను చూసే సమయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. తెలిసిన వారుంటే పరువు పోతుందనే భయంతో ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలస్తోంది. దీనికోసం చాలామంది అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. తొలుత వాట్సాప్లో విటుని చిత్రాన్ని పంపించాలని కోరుతున్నారు. పూర్తి వివరాలు తెలుసుకున్నాకే ముందుకుపోతున్నారు.
పైగా సెల్ఫోన్లో మాట్లాడే సమయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతా తెలుసుకున్నాకే సదరు మహిళ ఫొటో విటునికి పంపించి బేరమాడుకుంటున్నారు. మరికొందరు సెల్ఫోన్లో మాట్లాడుకొని తమ ఇళ్ల ముందు నుంచి వెళ్లమనో.. లేక మార్కెట్లో ఫలానాచోట కలిస్తే మేం చూసి చెబుతామని చెప్పి సదరు మనిషిని చూశాకే తమకు తెలియని వ్యక్తి అని నిర్ధరణ చేసుకున్నాకే బేరమాడుతున్నారు.
రూ.5నుంచి 10వేల వరకు వసూలు
కొందరు మహిళలు యువతులను సైతం ఈ వ్యాపారంలో దించుతున్నారు. హైదరాబాద్తోపాటు పల్లెల నుంచి వచ్చే కొందరు యువతులకు డబ్బు ఆశ చూపెట్టి ఈ రంగంలోకి దించుతూ.. వారి జీవితాన్ని నాశనం చేస్తున్నారు. పరిచయస్తులైన యువతులకు సైతం గాలం వేస్తున్నారు. మధ్యవర్థులే విపరీతంగా సంపాదిస్తున్నారు. జిల్లాకేంద్రంలో రూరల్, టూటౌన్, వన్టౌన్ పోలీస్స్టేషన్ల పరిధిలో ఈ వ్యభిచార కేంద్రాలు నడుస్తున్నా, పోలీసులకు సమాచారం ఉన్నా తేలిగ్గా తీసుకుంటున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
నివాసగృహాలతోపాటు హోటల్స్, లాడ్జీల్లో..
ప్రత్యేకంగా వ్యభిచార కేంద్రాలని ఎవరికి అనుమానం కల్గకుండా నివాస గృహాలనే అడ్డాలుగా మార్చుకున్నారు. జిల్లాకేంద్రం లోని హౌజింగ్బోర్డు, శ్రీనివాసకాలనీ, వెంకటేశ్వరకాలనీ, రాజీవ్గృహకల్ప, అశోక్టాకీస్, పాతబస్టాండ్ పలు కాలనీల్లోని ఇళ్లల్లో ఈ దందా నడుస్తోంది. బంధువులు వచ్చారనో, సామగ్రి కొనుగోలు చేస్తున్నామనో పట్టపగలే విటులను ఇంటికి పిలిపించుకుంటున్నారు. అనుమానం రాకుండా ప్రధాన ద్వారం మూయకుండా ఇద్దరుముగ్గురు మహిళలు మాట్లాడుకుంటున్నట్లు బయటకు కనిపిస్తూ.. లోపల గదిలో దర్జాగా పగలే దందా చేయిస్తున్నారు. చాలామటుకు సొంతిళ్లలోనే ఈ వ్యభిచారం నడిపిస్తుండగా కొందరు అద్దె ఇళ్లలో ఈ తతంగం కొనసాగిస్తున్నారు. ఓ ఇంటికి ఉదయం 11నుంచి సాయంత్రం 4 గంటల వరకు రూ.వేయి అద్దె చెల్లించినట్లు సమాచారం.కొత్త వస్త్రాలతో కనిపిం చాలనే ధ్యాస, విలాసవంతంగా ఉండాలనే చాలా మంది మహిళలు ఈ ప్రలోభావాలకు ఆకర్షితులై పాడువృత్తిలోకి దిగి పక్కదారి పడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసులకు సమాచారం ఉందా?
ఒక్కో విటుడి నుంచి రూ.1000నుంచి మొదలు రూ.10వేల వరకు వసూలు చేస్తున్నారు. సదరు మహిళ, యువతిని బట్టి ఈ ధర ఉంటుంది. దినంలోనైతే ఒక ధర, రాత్రి మొత్తం ఉంటే మరో ధర అని మాట్లాడుకుంటున్నారు. దీనికి అలవాటు పడ్డ యువత చాలామంది రోడ్డున పడుతున్నారు. అనర్థాలు జరగక ముందే పోలీసులు స్పందించాలని పట్టణవాసులు కోరుతున్నారు.