
‘రికార్డుల’ ఆవిష్కరణ
- విశ్వ వ్యాప్తంగా ‘శివుడే దేవాది దేవుడు ఆది దేవుడు పరమ పురుషుడు’ 10 లక్షల కాపీల వితరణ
- 13 రికార్డులు కైవసం
కవాడిగూడ: సిద్ధ గురు శ్రీ రమణానంద మహర్షి రచించిన గ్రంథం 13 రికార్డులను సొంతం చేసుకుంది. ఆయన స్వీయానుభవంతో రాసిన ‘శివుడే దేవాది దేవుడు ఆది దేవుడు పరమ పురుషుడు’ గ్రంథావిష్కరణ ఆది వారం ఇందిరాపార్కు సమీపంలోని ఎన్టీయార్ స్టేడియంలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి అధ్యక్షత వహించారు.
హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి సమక్షంలో సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ శివుడే దేవాది దేవుడు ఆది దేవుడు పరమ పురుషుడు గ్రంథాన్ని ఆవిష్కరించారు. శివుడే ఆది దేవుడు సీడీని నాయిని నర్సింహారెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా స్వామి రమణానంద మాట్లాడుతూ శివారాధనతో సకల దేవతలను పూజించినట్లేన ని పేర్కొన్నారు. శివుడే ఆదిదేవుడని అన్నారు. తెలంగాణ రాష్ట్రంపై శివుడి అనుగ్రహం ఉందన్నారు.
1100 శివాలయాల్లో..
ఈ గ్రంథాన్ని విశ్వ వ్యాప్తంగా ఆదివారం 11 గంటల వ్యవధిలో 10 లక్షల కాపీలను వితరణ చేసినట్టు రమణానంద తెలిపారు. ప్రత్యేకంగా 1100 శివాలయాల్లో గ్రంథ వితరణ చేసినట్లు పేర్కొన్నారు. ఒకేసారి 10 లక్షల కాపీలు ఆవిష్కరించడంతో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, మిరాకిల్ వరల్డ్ రికార్డ్స్, వరల్డ్ ఎమేజింగ్ రికార్డ్స్, ఆర్హెచ్ఆర్ వరల్డ్ రికార్డ్స్, గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఎవరెస్టు వరల్డ్ రికార్డ్స్, యూనిక్ వరల్డ్ రికార్డ్స్, బుక్ ఆఫ్ స్టేట్ రికార్డ్స్, ది బుక్ ఆఫ్ తెలంగాణ రికార్డ్స్, వరల్డ్ రికార్డ్స్ ఇండియా, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులను స్వామి రమణానంద మహర్షి సొంతం చేసుకున్నారు.
కార్యక్రమంలో భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్యేలు డాక్టర్ కె. లక్ష్మణ్, పైలా శేఖర్ రెడ్డి, ప్రముఖ పారిశ్రామిక వేత్త ఎల్. రాజం, సరస్వతీ ఉపాసకులు దైవజ్ఞ శర్మ, రవీంద్రనాథ్ గుప్తా పాల్గొన్నారు. అనంతరం భక్తులకు ప్రత్యేక కౌంటర్ ద్వారా గ్రంథాన్ని అందజేశారు.