
సాక్షి, హైదరాబాద్: దామరచర్లలోని యాదాద్రి పవర్ ప్రాజెక్టుకు అవసరమైన బొగ్గు సరఫరా చేయడానికి అనుగుణంగా ఈ మార్గంలోని రైల్వేలైనును డబుల్ ట్రాక్ లైన్గా మార్చాలని జెన్కో, ట్రాన్స్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు దక్షిణ మధ్య రైల్వే అధికారులను కోరా రు. ఇక్కడ 4,000 మెగావాట్ల అల్ట్రా మెగా పవ ర్ప్లాంటు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ పవర్ప్లాంటుకు సింగరేణి నుండే మొత్తం బొగ్గు ను తీసుకోవాలని నిర్ణయించినందున కొత్తగూడెం నుంచి డోర్నకల్ వరకు; మోటమర్రి నుంచి విష్ణుపురం వరకు 200 కిలోమీటర్ల మేర డబుల్ లైన్ నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. దామరచర్ల ప్లాంట్ నిర్మాణం శరవేగంగా సాగుతున్నదని, డబుల్ లైన్ నిర్మాణం, రైల్వేలైన్ పటిష్టం చేసే పనులు కూడా త్వరితగతిన చేపట్టాలన్నారు. దామరచర్ల, భద్రాద్రి, కేటీపీపీకి బొగ్గు రవాణా చేసేందుకు ప్రస్తుత రైల్వేలైన్లు, భవిష్యత్తులో నిర్మించాల్సిన రైల్వే లైన్లపై ప్రభాకర్రావు విద్యుత్ సౌధలో సోమవారం సమీక్ష నిర్వహించారు. దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ మేనేజర్ కె.శివప్రసాద్, చీఫ్ మేనేజర్ డి.నాగ్య, జెన్కో డైరెక్టర్లు నర్సింగ్రావు, వెంకటరాజ్యం తదితరులు పాల్గొన్నారు.
రోజూ 50 వేల టన్నుల బొగ్గు సరఫరా కావాలి..
‘‘డోర్నకల్–విజయవాడ లైన్లోని మోటమర్రి నుంచి బీబీనగర్–నడికుడి మార్గంలోని విష్ణుపు రం వరకు 100 కిలోమీటర్ల మేర సింగిల్ లైన్ ఉంది. ఇది రోజుకు 5–6 రేక్స్కు మించి బొగ్గు ను రవాణా చేయలేదు. దామరచర్ల విద్యుత్ ప్లాంట్కు ప్రతిరోజూ 50 వేల టన్నుల బొగ్గు కా వాలి. అంటే ఈ లైనులో 59 బోగీలున్న 14 గూ డ్స్ రైళ్లు ప్రతిరోజూ వచ్చి పోవాలి. ఇంత సామ ర్థ్యం ఇప్పుడున్న లైన్లకు లేదు. ఈ నేపథ్యంలో కొత్తగూడెం–డొర్నకల్ మార్గంలో 100 కిలోమీటర్లు, మోటమర్రి–విష్ణుపురం మార్గంలో 100 కిలో మీటర్లు, మొత్తం 200 కిలోమీటర్ల మేర డబుల్లైన్ నిర్మించాలి’’అని ప్రభాకర్రావు చెప్పారు.
ప్రత్యేక రైలు మార్గమా.. డంపింగ్ యార్డా...
ఖాజీపేట– బల్లార్ష మార్గంలోని ఉప్పల్ నుంచి ప్రస్తుతం భూపాలపల్లి పవర్ప్లాంటుకు బొగ్గు సరఫరా అవుతోంది. ఉప్పల్ రైల్వేస్టేషన్లో గూడ్స్ రైళ్లను ఆపి బొగ్గును దిగుమతి చేసి అక్కడ నుంచి లారీల ద్వారా భూపాలపల్లికి తరలిస్తున్నారు. ఈ లైను అత్యంత రద్దీ అయిన చెన్నై– ఢిల్లీమార్గంలోనే ఉంది. ఉప్పల్లో అన్లోడింగ్ వల్ల ఇతర రైళ్లకు ఇబ్బంది కలుగుతున్నదని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా ఉప్పల్ నుంచి భూపాలపల్లి వరకు ప్రత్యేక రైలు మార్గం నిర్మించడమో, లేదంటే ఉప్పల్ నుంచి కొద్దిదూరం రైల్వే ట్రాక్ నిర్మించి డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలని రైల్వే, జెన్కో అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమగ్ర నివేదిక సమర్పించాలని నిశ్చయించారు.
Comments
Please login to add a commentAdd a comment