
‘ఆ ఇద్దరు మంత్రులపై కేసులు పెట్టాలి’
మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్పై చీటింగ్ కేసులు నమోదు చేయాలని మాజీ మంత్రి మర్రి శశిధర్రెడ్డి డిమాండ్ చేశారు.
హైదరాబాద్: పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని చెప్పి అంబేద్కర్నగర్లో ఇళ్లు ఖాళీ చేయించి మోసం చేసినందుకు మంత్రులు కె.తారక రామారావుపై, తలసాని శ్రీనివాస్పై చీటింగ్ కేసులు నమోదు చేయాలని మాజీ మంత్రి మర్రి శశిధర్రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మంత్రులపై కేసులు పెట్టాలంటూ రాష్ట్ర డీజీపీకి గతంలోనే ఫిర్యాదు చేశానని చెప్పారు. హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనం చేస్తే కాలుష్యం అవుతుందని, నిమజ్జనం కోసం అంబేద్కర్ నగర్లో కొలను కట్టిస్తామని 70 శాతం పేదల ఇళ్లు ఖాళీ చేయించారని చెప్పారు.
ఇప్పుడు ఇళ్లు కాకుండా చెరువును కట్టించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఇది ప్రజలను మోసం చేయడమేనని, మంత్రులపై కేసులు నమోదు చేయాలని మర్రి శశిధర్రెడ్డి డిమాండ్ చేశారు. సనత్ నగర్లోని వక్ఫ్ భూమిలో ఇళ్లు కట్టుకున్నవారిని ఖాళీ చేయాలని జీహెచ్ఎంసీ నోటీసులను ఇచ్చిందన్నారు. ఈ భూమిని కబ్జా చేయాలని మంత్రులు ఈ కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మంత్రులు కేటీఆర్, తలసానిపై కేసులు పెట్టేదాకా వదిలిపెట్టబోనని మర్రి హెచ్చరించారు.