k taraka rama rao
-
మూడోసారీ మా ప్రభుత్వమే
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ తర్వాత మూడు వేర్వేరు సంస్థల ద్వారా లోతుగా సర్వే చేశామని.. బీఆర్ఎస్కు 72 నుంచి 82 సీట్లు వస్తాయని స్పష్టంగా తేలిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారకరామారావు చెప్పారు. రాష్ట్రంలో మూడోసారి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందనడంలో ఎలాంటి అనుమానం లేదని ధీమా వ్యక్తం చేశారు. బుధవారం కేటీఆర్ మీడియా ప్రతినిధులతో చిట్చాట్ చేశారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘మాపై వ్యతిరేకత ఉన్నట్టు సోషల్ మీడియాలో హడావుడి జరగడం, అక్కడక్కడా మౌఖిక ప్రచారమే (మౌత్ టాక్) తప్ప క్షేత్రస్థాయిలో ఓటరుకు ఎలాంటి గందరగోళం లేదు. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. మొదట్లో మేం కూడా కొంత గందరగోళపడినా క్షేత్రస్థాయి నుంచి మాకు మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి కామారెడ్డిలో మూడో స్థానంలో, కొడంగల్లో రెండో స్థానంలో నిలిచే పరిస్థితి ఉన్నపుడు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఎక్కడుంది? కాంగ్రెస్ దిగ్గజాలైన కోమటిరెడ్డి సోదరులు, జానారెడ్డి కుమారుడు, జగ్గారెడ్డి వంటివారు కూడా ఓడిపోతున్నారు. బీజేపీ రెండు, మూడు సీట్లకే పరిమితం అవుతుంది. మేం ఖమ్మంలో ఆరు స్థానాల్లో, నల్లగొండలో 7 నుంచి 9 సీట్లలో కచ్చితంగా గెలుస్తాం. మిగతా నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఉన్నా మా పార్టీ పరిస్థితి నిక్షేపంగా ఉంది. వాపు చూసి బలుపు అనుకుంటున్నారు రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయి ఆరంభంలో కొంత కాంగ్రెస్ వైపు మళ్లడంతో ఆ వాపును చూసి బలుపు అనుకుంటున్నారు. అది పాలపొంగు వంటి హడావుడి మాత్రమే. క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న బీఆర్ఎస్ కేడర్ కసిగా పనిచేస్తున్నారు. హుజూరాబాద్, గోషామహల్, కరీంనగర్, కోరుట్లలోనూ గెలుస్తున్నాం. మాకు 15 నుంచి 18 చోట్ల బీజేపీ నుంచి, మిగతా చోట్ల కాంగ్రెస్ నుంచి పోటీ ఉండగా.. మేం మాత్రం అన్నిచోట్లా పోటీలో ఉన్నాం. ముదిరాజ్లకు టికెట్ల సర్దుబాటులో అవకాశం ఇవ్వలేకపోయాం. కాసాని జ్ఞానేశ్వర్, ఎర్ర శేఖర్ తదితరుల చేరికతో ఈ విషయాన్ని ఆ సామాజికవర్గం అర్థం చేసుకుంది. బీజేపీతో ఎన్నడూ అంటకాగలేదు కేసీఆర్ 50ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ బీజేపీతో అంటకాగలేదు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్లలో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి అనుకూలంగా వ్యవహరించింది. ప్రస్తుత ఎన్నికల్లో ముస్లిం పట్ల బద్ధ వ్యతిరేకత కలిగిన బండి సంజయ్, అర్వింద్, రాజాసింగ్లపై కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బీజేపీ ఏజెంట్గా పనిచేస్తూ మోదీని ఒక్కసారి కూడా విమర్శించలేదు. విపక్ష నేతల ఇళ్లపై జరుగుతున్న ఈడీ, ఐటీ దాడులను మాకు అంటగట్టడం సరికాదు. రైతుబంధు దుబారా, ధరణి రద్దు అంటూ కాంగ్రెస్.. ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద దొంగ రిపోర్టులతో బదనాం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. తెలంగాణను అప్పుల పాలు చేశామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోపణలు చేయడం విడ్డూరం. మోదీ ప్రతీ కుటుంబంపై రూ.5లక్షల అప్పు మోపారు. ఆయన ప్రియమైన ప్రధాని కాదు.. పిరమైన ప్రధాని. కేసీఆర్ అంటే భయంతోనే.. తెలంగాణకు ఉన్న ఏకైక గొంతు కేసీఆర్. ఆయన జాతీయ పార్టీలకు కొరుకుడు పడని కొయ్య. మూడోసారి అధికారంలోకి వస్తే ఏకు మేకు అవుతాడనేది కాంగ్రెస్, బీజేపీల భయం. కర్నాటక, గుజరాత్ల నుంచి రాష్ట్రంలోని ఆ పార్టీ నేతలకు వస్తున్న డబ్బుకు అడ్డూ అదుపు లేదు. ఆ రెండు జాతీయ పార్టీలకు 28 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. కానీ మాకు మాత్రం తెలంగాణే కేంద్రం. వాళ్లు తెలంగాణను గెలవాలనుకుంటున్నారు. మేం తెలంగాణను గెలిపించాలని అనుకుంటున్నాం. తెలంగాణ ఏకైక గొంతు కేసీఆర్ను కాపాడుకోవాలా వద్దా అని ప్రజలు తేల్చుకోవాల్సిన సందర్భం ఇది. కొత్త పింఛన్లు, రేషన్కార్డులు ఇస్తాం జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులు, కొత్త ఆసరా పింఛన్లు ఇవ్వడం ప్రారంభిస్తాం. బీడీ కార్మీకులకు 2023 వరకు కటాఫ్ పెంచి కొత్తగా లక్షన్నర మందికి పింఛన్లు ఇస్తాం. భర్తను కోల్పోయిన భార్యల పేరిట పింఛన్ వచ్చేలా చర్యలు తీసుకుంటాం. గల్ఫ్ కార్మీకులకు ఉచిత బీమా కల్పిస్తాం. ఆటో డ్రైవర్లకు రూ.వంద కోట్ల మేర వాహన ఫిట్నెస్ చార్జీలు రద్దు చేస్తాం. జాబ్ క్యాలెండర్, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన, ఉద్యోగ నియామకాలు సక్రమంగా నిర్వహించడం వంటి అంశాలపై ఇప్పటికే యువతకు స్పష్టత ఇవ్వడంతోపాటు దీనిని మరింత బలంగా ప్రచారం చేస్తాం. ఈసీ అనుమతివ్వగానే రైతుబంధు సొమ్ము రూ.19,445 కోట్ల పంట రుణాల మాఫీకిగాను ఇప్పటికే రూ.14వేల కోట్ల పైచిలుకు క్లియర్ చేశాం. మిగతా రూ.5వేల కోట్ల మాఫీ ప్రక్రియ ప్రతిపక్షాల ఫిర్యాదు వల్ల ఆగింది. రుణమాఫీ చెల్లింపులకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఎన్నికల సంఘాన్ని కోరాం. అనుమతి వస్తే వెంటనే రుణమాఫీ చేస్తాం. రైతుబంధు 12వ దఫా సొమ్ము విడుదల కోసం కూడా ఎన్నికల సంఘాన్ని అనుమతి కోరాం. పీఎం కిసాన్ డబ్బులు వేసే వెసులుబాటు కల్పించి రైతుబంధు విషయంలో ఇబ్బంది పెట్టడం సరికాదు. మా మేనిఫెస్టోను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గడప గడపకు వెళ్తాం..’’అని కేటీఆర్ తెలిపారు. -
అసైన్డ్ భూములకు హక్కులిస్తాం
సిరిసిల్ల: బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే దళితులు, గిరిజనులకు ఇచ్చిన అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు ఇస్తామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారక రామారావు హామీ ఇచ్చారు. అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు వస్తే.. వాటిని అమ్ముకోవచ్చని, పిల్లలకు ఇచ్చుకోవచ్చని, బ్యాంకుల్లో కుదువపెట్టుకోవచ్చని చెప్పారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి, చందుర్తి, కోనరావుపేట, వేములవాడ, తంగళ్లపల్లి మండల కేంద్రాల్లో ఆయన రోడ్షోలు నిర్వహించి ఎన్నికల ప్రచారం చేశారు. ‘‘దరిద్రానికి నేస్తం కాంగ్రెస్ హస్తం. వారిని నమ్ముకుంటే నష్టపోయేది తెలంగాణ సమాజమే. గ్యారంటీ లేని కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఇస్తుంది. రేవంత్రెడ్డి ఎప్పుడు జైలుకు పోతాడో ఆయనకే తెలియదు. 24 గంటలు కరెంట్ ఇచ్చే కేసీఆర్ కావాలా.. మూడు గంటల కరెంట్ అంటున్న కాంగ్రెస్ కావాలా తేల్చుకోవాలి. ఎన్నికలప్పుడు ఆగం కావొద్దు. ఆలోచించి ఓటేయాలి’’అని కేటీఆర్ కోరారు. ఆరున్నరేళ్ల పాలనలో ఎంతో చేశాం.. రాష్ట్రాన్ని కేసీఆర్ దేశానికే ఆదర్శవంతంగా చేశారని కేటీఆర్ చెప్పారు. తమ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో రెండేళ్లు కరోనాతో, మరో ఏడాది సమయం లోక్సభ, ఇతర ఎన్నికల కోడ్తో వృధా అయిందన్నారు. పక్కాగా పాలన సాగినది ఆరున్నరేళ్లేనని, ఇంత తక్కువ సమయంలోనే రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశామని చెప్పారు. బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే.. రేషన్కార్డులు ఇస్తామని, పెన్షన్లు పెంపు, 93 లక్షల కుటుంబాలకు బీమా, రేషన్కార్డులపై సన్నబియ్యం వంటివి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రైతుబంధును రూ.16 వేలకు పెంచుతామని, వంటగ్యాస్ సిలిండర్ను రూ.400కే అందిస్తామని ప్రకటించారు. సిరిసిల్ల ప్రాంతంలో 370 ఎకరాల్లో ఆక్వా హబ్ వస్తుందని, దీంతో ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. బాధ్యతలు పెరిగాయి ‘‘ప్రతి ఊరికి, ప్రతి ఇంటికి రావాలని ప్రతి ఒక్కరిని కలవాలని నాకు ఉంటుంది. కానీ బాధ్యతలు పెరిగాయి. మంత్రిగా, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా రాష్ట్రమంతటా తిరగాల్సి వస్తుంది. మీరే చూస్తున్నారు. నేను రోజూ ఎన్ని ప్రాంతాల్లో, ఎన్ని సభల్లో పాల్గొంటున్నానో. మిమ్మల్ని కలవలేక పోతున్నందుకు బాధగా ఉంది..’’అని తంగళ్లపల్లి రోడ్షోలో కేటీఆర్ పేర్కొన్నారు. మీ ఆశీర్వాదంతో గెలిచాక ఎలాంటి తలవంపులు తేలేదని, సిరిసిల్ల ఎమ్మెల్యేగా గర్వపడేలా పనిచేశానని చెప్పారు. ఈ రోడ్షోలలో వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థి చెల్మెడ లక్ష్మీనర్సింహరావు, జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, ఉమ్మడి జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
రేవంత్ కాదు.. రేటెంతరెడ్డి
సాక్షి, కామారెడ్డి: పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆర్ఎస్ఎస్ మనిషి అని, ఆయన ఎన్నికల తర్వాత పది పన్నెండు మంది ఎమ్మెల్యేలతో కలసి బీజేపీలో చేరడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘‘ఓటుకు కోట్లు కేసులో అరెస్టైన రేవంత్రెడ్డి.. ఇప్పుడు సీటుకు రేటు కడుతున్నాడు. అందుకే వాళ్ల పార్టీ నేతలే ఆయనను రేటెంతరెడ్డి అంటున్నారు..’’ అని విమర్శించారు. శనివారం కేటీఆర్ కామారెడ్డి జిల్లా కేంద్రంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఇక్కడి డిగ్రీ కాలేజీ మైదానంలో జరిగిన కామారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ కార్య కర్తల సమావేశంలో మాట్లాడారు. దక్షిణ భారత దేశం నుంచి వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రి ఎవరూ కాలేదని.. సీఎం కేసీఆర్ మాత్రం ఈసారితో కచ్చితంగా హ్యాట్రిక్ సాధిస్తారని కేటీఆర్ పేర్కొన్నారు. దేశమంతటా తెలంగాణ గురించే చర్చ నడుస్తోందని, ఇక్కడ బీఆర్ఎస్ విజయం కోసం మహారాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఆ రాష్ట్రంలో చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, జెడ్పీ మెంబర్లు బీఆర్ఎస్తో కలసి రావడానికి సిద్ధంగా ఉన్నారని.. తెలంగాణలో గెలి చాక మహారాష్ట్రలోనూ గులాబీ జెండా ఎగుర వేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మహా రాష్ట్రలో సాధించే విజయంతో కేంద్రంలో కీలక భూమిక పోషిస్తామని పేర్కొన్నారు. దేశ రాజకీయాలకు దిక్సూచిగా.. సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనమే నని కేటీఆర్ చెప్పారు. ‘‘మొదట సిద్దిపేటలో పోటీ చేసిన ఆయన టీఆర్ఎస్ను స్థాపించారు. కరీంనగర్లో పోటీచేసి ఢిల్లీకి తెలంగాణవాదాన్ని తీసుకువెళ్లారు. మహబూబ్నగర్లో పోటీ చేసి దేశాన్ని ఒప్పించి రాష్ట్రం సాధించారు. గజ్వేల్లో పోటీచేసి ఉద్యమ తెలంగాణను ఉజ్వల తెలంగాణగా తీర్చిదిద్దారు. పదేళ్ల స్వల్పకాలంలోనే వందేళ్ల ప్రగతి సాధించారు. కామారెడ్డిలో భారీ మెజారిటీతో విజయం ద్వారా హ్యాట్రిక్ సీఎంగా రికార్డు సాధించి, దేశ రాజకీయాలకు దిక్సూచిగా నిలుస్తారు..’’ అని పేర్కొన్నారు. కామారెడ్డిలో కేసీఆర్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయగానే కాంగ్రెస్, బీజేపీల నాయకులు వణికిపోయి పోటీచేయడంకన్నా ఇంట్లో పడుకోవడమే మంచిదనే భావనతో ఉన్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ను దేశంలోనే అఖండ మెజారిటీతో గెలిపించడం ద్వారా సరికొత్త చరిత్ర లిఖించాలని పిలుపునిచ్చారు. కర్ణాటక నుంచి కాంగ్రెస్ వాళ్లకు అడ్డగోలుగా డబ్బులు వస్తాయని, అదానీ నుంచి బీజేపీ వాళ్లకు డబ్బులు వస్తున్నాయని.. బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు. నామినేటెడ్ పదవులు ఇస్తాం. రకరకాల సమీకరణాల దృష్ట్యా టికెట్ల కేటాయింపులో ముదిరాజ్లు, మరికొన్ని కులాలకు అవకాశం దక్కలేదని.. అయితే వారికి ఎమ్మెల్సీలుగా, చైర్మన్లుగా అవకాశం ఇస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ పోటీచేసే కామారెడ్డి నియోజకవర్గంలోని గ్రామాల వారీగా, పట్టణాల్లో వార్డుల వారీగా ప్రత్యేక మేనిఫెస్టోలు రూపొందించి, అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. కామారెడ్డి నియోజకవర్గానికి తనతోపాటు మంత్రి ప్రశాంత్రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్లు ఇన్చార్జులుగా ఉంటారని తెలిపారు. ఏ ఊరికి ఏం కావాలో నివేదికలు రూపొందించి అప్పగించాలన్నారు. సభలో మంత్రి ప్రశాంత్రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎంపీ బీబీ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. -
గోదావరి నీళ్లతో మూసీని నింపుతాం
నాగోలు/అంబర్పేట్/మన్సూరాబాద్ (హైదరాబాద్): మహా నగరంలో ఉన్న చారిత్రక మూసీ నదిని స్వచ్ఛమైన గోదావరి నీళ్లతో నింపుతామని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కె.తారకరామారావు చెప్పారు. నార్సింగి వద్ద గోదావరి జలాలను మూసీలో కలిపి మురుగు నీరు లేకుండా చర్యలు చేపడతామని, దీనికోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా ఎస్టీపీ ప్లాంట్లను నిర్మిస్తామని తెలిపారు. హైదరాబాద్కు గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చిన మూసీని గత ప్రభుత్వాలు పట్టించుకోక మురికి కూపంగా మారిపోయిందన్నారు. సోమవారం రూ.52 కోట్ల అంచనా వ్యయంతో మూసారంబాగ్ వద్ద మూసీ నదిపై నిర్మించ తలపెట్టిన హైలెవెల్ బ్రిడ్జికి కేటీఆర్ శంకుస్థాపన చేసి మాట్లాడారు. మూసీపై రూ.545 కోట్లతో 14 బ్రిడ్జిలను నిర్మిస్తున్నామని, వీటికి అద్భుతమైన డిజైన్లను రూపొందించేందుకు మన ఇంజనీర్లతో విదేశాల్లో అధ్యయనం చేయించామని తెలిపారు. సినిమాల్లో చూపిన మాదిరిగా బ్రిడ్జి డిజైన్లు ఉంటాయని, శంకుస్థాపన చేసిన వంతెనలు 18 నెలల్లో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మురుగునీటి శుద్ధిలో దేశంలోనే హైదారాబాద్ మొదటి స్థానంలో ఉందని వివరించారు. ఇప్పుడు రోజుకు 2వేల మిలియన్ లీటర్ల సామర్థ్యంతో ఎస్టీపీల నిర్మాణం చేస్తున్నామని, ఇవి పూర్తయితే మూసీలోకి పూర్తిస్థాయి శుద్ధి చేసిన నీటిని వదిలే పరిస్ధితి ఏర్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుదీర్రెడ్డి, కాలేరు వెంకటేశ్, అహ్మద్ బలాల, ఎమ్మెల్సీలు యెగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్ గుప్త, మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు. సీఎం కలను నెరవేరుస్తాం మంచిరేవుల నుంచి ఘట్కేసర్ దాకా మూసీ నదిని అద్భుతంగా సుందరీకరించాలన్న సీఎం కేసీఆర్ కలను నెరవేరుస్తామని కేటీఆర్ చెప్పారు. 160 కి.మీ. ఓఆర్ఆర్ చుట్టూ తిరగకుండా మధ్యలో మూసీ నది మీదుగా వెళ్లేలా బ్రిడ్జిలు, రోడ్లు నిర్మిస్తామని తెలిపారు. రూ. 5వేల కోట్లతో రెండో విడత ఎస్ఎన్డీపీ పనులు త్వరలోనే చేపడతామని తెలిపారు. వారం పది రోజుల్లో 40 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లను పారదర్శకంగా పంపిణీ చేస్తామని వెల్లడించారు. జీవో 118లో చిన్న చిన్న సాంకేతిక సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని కేసీఆర్ తెలిపారు. ఎల్బీ నగర్లోని కామినేని ఫ్లైఓవర్ల కింద ఏర్పాటు చేసిన ఆక్సిజన్ పార్కు అద్భుతంగా ఉందని కేటీఆర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్రెడ్డికి కితాబునిచ్చారు. కేటీఆర్ పార్కు మొత్తం కలియతిరిగి అక్కడ ఏర్పాటుచేసిన ఆకృతులను ఆసక్తిగా తిలకించి.. జీహెచ్ఎంసీ కార్మికులతో ఫొటోలు దిగారు. హైదరాబాద్ మతసమరస్యానికి ప్రతీక అని, పార్లమెంటులో లేని మతసమరస్యాం మన హైదరాబాద్లో ఉందని కేటీఆర్ అన్నారు. గణేశ్ నిమజ్జనం పురస్కరించుకొని మిలాద్ ఉన్ నబీ ర్యాలీ వాయిదా వేసుకోవడం ఒకరిని ఒకరు గౌరవించుకుంటున్నారనే దానికి నిదర్శనమని తెలిపారు. -
ఇప్పటిదాకా చూసింది ట్రైలరే..
సాక్షి, హైదరాబాద్/ ముషీరాబాద్: రాష్ట్రంలో ఇప్పటివరకు తాము చూపినది ట్రైలర్ మాత్రమేనని, త్వరలోనే ప్రతిపక్షాలకు అసలు సినిమా చూపిస్తామని మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు వ్యాఖ్యానించారు. పచ్చగా ఉన్న హైదరాబాద్లో కులమతాల పేరిట చిచ్చు పెట్టాలనుకునే దుర్మార్గులు, చిల్లర పార్టీల ఆటకట్టించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం హైదరాబాద్లోని ఇందిరాపార్కు–వీఎస్టీ జంక్షన్ మధ్య దాదాపు రూ.450 కోట్ల వ్యయంతో నిర్మించిన స్టీల్ ఫ్లైఓవర్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించి మాట్లాడారు. ‘‘55 ఏళ్లు అధికారం ఇచ్చినా ఏమీ చేయని దుర్మార్గులు.. ఇప్పుడు పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్నా ఏమీ చేయని అసమర్థులు.. మళ్లీ వస్తున్నారు. మతం పేరిటో, కులం పేరిటో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అభివృద్ధిలో ముందుకు పోతున్న మనకు కాళ్లల్లో కట్టెలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఏడాదిలో వారం పదిరోజులపాటు కర్ఫ్యూ ఉండేది. ప్రజల మధ్య ఏదో ఓ పంచాయతీ పెట్టి కొన్ని రాజకీయ పార్టీలు పబ్బం గడుపుకొనేవి. ఇప్పుడు మతాలు, కులాలకు అతీతంగా అంతా కలసిమెలసి ముందుకు పోతున్నాం, చిల్లర పార్టీలు, నాయకుల మాటలకు మోసపోతే హైదరాబాద్ మళ్లీ వందేళ్లు వెనక్కుపోతుంది..’’అని కేటీఆర్ పేర్కొన్నారు. మరోసారి బీఆర్ఎస్ను గెలిపించి, కేసీఆర్ను హ్యాట్రిక్ ముఖ్యమంత్రిని చేద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. ట్రాఫిక్ చిక్కులకు పరిష్కారం ఒకప్పుడు అందరం ఆర్టీసీ క్రాస్రోడ్స్ ప్రాంతంలో సినిమాలు చూసిన వాళ్లమేనని.. సినిమా చూసి బయటికి వచ్చాక ట్రాఫిక్లో ఇరుక్కుని ఇబ్బందిపడిన వారమేనని కేటీఆర్ చెప్పారు. ఈ స్టీల్ ఫ్లైఓవర్తో చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ చిక్కులకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు ఈ ఫ్లైఓవర్కు మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టినట్టు తెలిపారు. కార్మికుల తరఫున పోరాడిన నాయిని పేరు దీనితో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఇందిరాపార్కును అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని.. లోయర్ ట్యాంక్బండ్, అప్పర్ ట్యాంక్బండ్ను కలుపుతూ టూరిస్ట్ ప్రాంతంగా తీర్చిదిద్దుతామని కేటీఆర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, స్థానిక ఎమ్మెల్యే ముఠాగోపాల్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్లో చేరిన కల్వకుర్తి నేత ఉప్పల వెంకటేశ్ కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన ఉప్పల వెంకటేశ్, మరికొందరు ఇతర పార్టీల నాయకులు శనివారం తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీలను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్లేనని.. ఢిల్లీ గులాములకు, తెలంగాణ ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరాటంలో ప్రజలు ఆగం కావొద్దని పేర్కొన్నారు. కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత తమదని చెప్పారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించాలన్నారు. -
ఇంతకంటే అభివృద్ధా?.. రుజువు చేస్తే రాజీనామా చేస్తా.. కేటీఆర్ సవాల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కంటే బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మెరుగైన అభివృద్ధి జరుగుతున్నట్టు నిరూపిస్తే తక్షణమే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని పురపాలక, ఐటీశాఖల మంత్రి కె. తారక రామారావు సవాల్ చేశారు. ఔటర్ రింగ్రోడ్డు లీజులో అవినీతి జరిగిందంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారు. శాసనసభ వానాకాల సమావేశాల్లో భాగంగా శనివారం ‘రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన, పల్లె ప్రగతి– పట్టణ ప్రగతి కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు– సాధించిన ఫలితాలు’అంశంపై లఘు చర్చ జరిగింది. ఈ సందర్భంగా పలువురు సభ్యులు లేవనెత్తిన అంశాలపై కేటీఆర్ సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. తాను చెబుతున్నవి తప్పు అయితే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించాలని, లేదంటే కాంగ్రెస్కు డిపాజిట్లు రాకుండా ఓడించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ, రేవంత్రెడ్డిలపై ఘాటుగా విమర్శలు చేశారు. కేటీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. తెలంగాణలో ఉన్నదంతా సంక్షేమమే.. ‘‘రాష్ట్ర బడ్జెట్ అంటే విపక్షాలకు జమాఖర్చుల లెక్క మాత్రమే. బీఆర్ఎస్కు ఇది రాష్ట్ర ప్రజల జీవనరేఖ. తెలంగాణ నమూనా అంటే సమగ్ర, సమ్మిళిత అభివృద్ధి. ఇక్కడ సంక్షేమమే తప్ప సంక్షోభం లేదు. దేశంలో ఇంటింటికీ మంచినీళ్లు ఇచ్చిన మొదటి రాష్ట్రం తెలంగాణ. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు తెలంగాణలో ఉంది. వరి ఉత్పత్తిలో, తలసరి ఆదాయంలో దేశంలో టాప్. 24 గంటల ఉచిత విద్యుత్, ఎకరానికి రూ.10 వేల పెట్టుబడి, రైతులకు జీవితబీమా ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఐటీ ఉద్యోగాలు అత్యధికంగా కల్పించిన రాష్ట్రం తెలంగాణ. ఇది మా పనితనం. ప్రతిపక్ష నేతల్లా మేం ఊక దంపుడు ఉపన్యాసాలు చెప్పం. భట్టి విక్రమార్క, రఘునందన్రావులకు సవాల్ చేస్తున్నా. నేను చెప్పింది తప్పయితే.. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ కంటే మెరుగ్గా అభివృద్ధి ఉందని రుజువు చేస్తే.. రేపు పొద్దున్నే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా.. తెలంగాణ ఎవరో ఇస్తే వచ్చింది కాదు తెలంగాణ ఇచ్చింది మేమేనని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు. కంటెంట్ లేని కాంగ్రెస్కు, కమిట్మెంట్ ఉన్న కేసీఆర్కు పోలికనా? 1968లో 370 మంది ఉద్యమకారులను కాల్చి చంపిందెవరు? 1971లో 11 మంది ఎంపీలను గెలిపించినా వారి ఆశయాలను తుంగలో తొక్కి కాంగ్రెస్లో కలిసిపోయింది వాస్తవం కాదా? 2004లో మాటిచ్చి 2014 దాకా 1000 మందిని చంపింది కాంగ్రెస్ వారు కాదా? ఇవాళ మళ్లీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. వెయ్యి మందిని పొట్టన పెట్టుకున్న బలిదేవత సోనియా అని రేవంత్రెడ్డి అన్నమాటలు మరిచిపోయారా? కర్ణాటకలో గెలిచారని తెలంగాణలో కాంగ్రెస్ నేతలు కలలు కంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయింది. నలుగురు నాయకులు కలసి కూర్చుని మాట్లాడలేని వాళ్లు.. 4 కోట్ల మందిని పాలిస్తారంటే నమ్మాలా? కాంగ్రెస్కు నాయకుల్లేక పక్క పార్టీల నుంచి నాయకులను తెచ్చుకున్నారు. మేం ప్రధాని మోదీకే భయపడలేదు. ఇక్కడ వీళ్లకు భయపడతామా? ప్రజలతో బీఆర్ఎస్ది పేగు బంధం తెలంగాణ కవి అలిశెట్టి ప్రభాకర్ తన కవితలో ‘‘జాగ్రత్త.. ప్రతి ఓటు మీ పచ్చి నెత్తుటి మాంసపు ముద్ద.. చూస్తూ చూస్తూ వేయకు గద్దకు. ఓటు కేవలం కాగితం మీద గుర్తు కాదు.. మీ జీవితం..’’అని చెప్పారు. ప్రజలు తప్పుడు నిర్ణయం తీసుకుంటే గందరగోళంలో పడతారు. తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్ది పేగుబంధం. తుచ్చ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ ఐదు దశాబ్దాల పాలనను, నాటి అంధకారాన్ని గుర్తుకు తెచ్చుకోండి..’’అని కేటీఆర్ పేర్కొన్నారు. నోటికి వచ్చినట్టు మాట్లాడితే అంతు చూస్తాం! ఔటర్ రింగ్ రోడ్డు టోల్ ప్రాజెక్టు (టీవోటీ)ను ఐఆర్బీ సంస్థకు కట్టబెట్టడాన్ని తప్పుపడుతూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ‘‘ఒకాయన (రేవంత్రెడ్డి) బయట ఉండి నోటికి వచ్చినట్టు మాట్లాడారు. ఆ ప్రభావం భట్టి మీద పడినట్టు ఉంది. ఐఆర్బీ సంస్థ దివాలా తీసిందంటూ ఏదేదో మాట్లాడారు. కాంగ్రెస్ పాలిత రాజస్థాన్, కర్ణాటకలలోనూ పలు టోల్స్ నిర్వహణ కాంట్రాక్టులను ఆ సంస్థ పొందింది. మహారాష్ట్రలో కూడా ఇచ్చారు. ఇక్కడ కూడా జాతీయ రహదారుల సంస్థ నిబంధనలకు అనుగుణంగా టెండర్ నిర్వహించి లీజుకు ఇవ్వడం జరిగింది. ఆయన (రేవంత్) ఎందుకు ఈ సంస్థ గురించి మాట్లాడారో, దానికి కారణమేంటో మాకు తెలుసు. ఆర్టీఐ (సమాచార హక్కు) అంటే కొందరికి ‘రూట్ టు ఇన్కం’గా మారిపోయింది. రేవంత్రెడ్డి చేసిన ఆరోపణలపై ఐఆర్బీ సంస్థ వెయ్యికోట్ల పరువు నష్టం దావా వేసింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ కూడా కేసు పెట్టారు. రేవంత్ అంతు చూస్తాం’’అని కేటీఆర్ పేర్కొన్నారు. కోనరావుపేటనా.. కోనసీమనా? ఇటీవల దర్శకుడు వెల్దంటి వేణు బలగం సినిమాను సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట గ్రామంలో తీశారు. ఆ సినిమా చూసి మా కుటుంబసభ్యులే ఇది కోనరావుపేటనా? కోనసీమనా? అని ఆశ్చర్యపోయారు. తెలంగాణలోని ఏ పల్లెకు వెళ్లినా ఇప్పుడు ఇదే పరిస్థితి. రివర్స్ మైగ్రేషన్ చూస్తున్నాం ఇప్పుడు. హైదరాబాద్ అభివృద్ధిని, భూముల విలువను పొరుగు రాష్ట్ర నేతలు గుర్తించారు. వారికి అర్థమైన విషయాలు విపక్షాలకు అర్థం కావట్లేదు. -
అభివృద్ధిని చూడలేకే చిల్లర మాటలు..
వనస్థలిపురం (హైదరాబాద్): బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూడలేకనే ప్రతిపక్ష నాయకులు చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కె.తారక రామారావు మండిపడ్డారు. ప్రతిపక్షాల నేతలు అడ్డగోలుగా మాట్లాడటం సరికాదని.. కేసీఆర్ వయసును గౌరవించాలని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎంగా నిలుస్తారని చెప్పారు. బుధవారం హైదరాబాద్లోని హస్తినాపురం జీఎస్ఆర్ కన్వెన్షన్లో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్లపై ఆంక్షలతో ఇబ్బందిపడుతున్న కాలనీలకు విముక్తి కల్పించేందుకు ప్రభుత్వం తెచ్చిన జీవో 118 కింద ఎల్బీనగర్ నియోజకవర్గంలోని 4వేల మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డితో కలసి రెగ్యులరైజేషన్ సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడారు. దేశంలో నంబర్వన్గా నిలిపాం ‘ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు’అని సామెత ఉందని, తెలంగాణ ప్రభుత్వం ఇళ్లు కట్టించి ఇవ్వడంతోపాటు పేద అమ్మాయిల పెళ్లికి ఆర్థిక సాయం కూడా చేస్తాందని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా తలసరి ఆదాయంలో దేశంలోనే నంబర్వన్గా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును అతి తక్కువ కాలంలో పూర్తిచేశామని, రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఇంటింటికి సురక్షిత తాగునీరు ఇచ్చామని పేర్కొన్నారు. నల్లగొండ ఫ్లోరైడ్, పాలమూరు వలసల సమస్యలు తొలగిపోయాయని పేర్కొన్నారు. గతంలో గాందీ, ఉస్మానియా, నిమ్స్ మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉండేవని.. ఇప్పుడు హైదరాబాద్ నలుమూలలా 10వేల బెడ్లతో కార్పొరేట్ స్థాయి వైద్యం అందించే ఆస్పత్రుల నిర్మాణం చేపట్టామని తెలిపారు. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామన్నారు. వేల కుటుంబాలకు లబ్ధి: సుధీర్రెడ్డి తాను కాంగ్రెస్లో ఉన్నప్పట్నుంచే రిజిస్ట్రేషన్లపై ఆంక్షల సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నానని, దీనికోసమే బీఆర్ఎస్లో చేరానని ఎమ్మెల్యే సు«దీర్రెడ్డి చెప్పారు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రిజిస్ట్రేషన్ల సమస్యను పరిష్కరించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఎమ్మెల్సీలు బొగ్గారపు దయానంద్గుప్తా, ఎగ్గె మల్లేశం, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
దళితులు ధనికులు కావాలె.. ఏ పార్టీ వాళ్లయినా దళితబంధు ఇద్దాం
సిరిసిల్ల: సమాజంలో అణచివేతకు గురై, అట్టడుగున ఉన్న దళితులను ధనికులను చేసే లక్ష్యంతో దేశంలోనే ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ తెలంగాణలో దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం రాష్ట్ర ఎస్సీ, గిరిజన, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి పోడుభూములకు పట్టాలు, ఎస్సీ చిరువ్యాపారులకు ఆర్థిక సాయం అందించారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ దళితబంధులో తొలి విడతలో ప్రతి నియోజ కవర్గానికి 100 కుటుంబాలకు అందించామని, విప్లవాత్మక మార్పులు వచ్చాయని అన్నారు. రెండో విడతలో ప్రతి నియోజకవర్గానికి 1100 యూనిట్లు అందిస్తామని తెలిపారు. ఏ పార్టీ వారైనా అందరికీ దళితబంధు ఇస్తామన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో ధనికులు ఏ నీళ్లు తాగుతారో.. వీర్నపల్లి తండాలోనూ అవే నీళ్లు తాగేలా ఇంటి ముందు నల్లా పెట్టి నీళ్లు అందిస్తున్నామన్నారు. కొమురం భీమ్ స్ఫూర్తితో జల్, జమీన్, జంగల్ నినాదాలతో నీళ్లు సాధించి, పోడుభూములకు పట్టాలిచ్చి, కొత్తగా 5 లక్షల ఎకరాల్లో 8 శాతం పచ్చదనాన్ని పెంచామన్నారు. 70 ఏళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం 9 ఏళ్లలో చేసి చూపించామని, తొమ్మిదేళ్లలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని కేటీఆర్ వివరించారు. రైతులకు బీమా చేయిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే అన్నారు. సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్రం దేశానికి మోడల్గా మారిందని రాష్ట్ర ఎస్సీ, గిరిజన, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. వ్యవసాయ కాలేజీకి బాబూ జగ్జీవన్రామ్ పేరు తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల వ్యవసాయ కళాశాలకు బాబూ జగ్జీవన్రామ్ కళాశాలగా నామకరణం చేశారు. ఆయన వర్ధంతి సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన జగ్జీవన్రామ్ విగ్రహాన్ని మంత్రులు ఆవిష్కరించారు. 128 మంది ఎస్సీ చిరువ్యాపారులకు రూ.62 లక్షల మేరకు ఆర్థిక సాయం చెక్కులను పంపిణీ చేశారు. జిల్లాలో 1,614 మంది గిరిజనులకు 2,558.34 ఎకరాల పోడు భూములకు పట్టాలను అందించారు. జెడ్పీ చైర్పర్సన్ అరుణ, వేములవాడ ఎమ్మెల్యే రమేశ్బాబు, కలెక్టర్ అనురాగ్ జయంతి, టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
రూపు మారిన పురాలు
సాక్షి, హైదరాబాద్: తొమ్మిదేళ్లలో తెలంగాణలోని పట్టణాల అభివృద్ధిలో గణనీయమైన మార్పు వచ్చిందని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారక రామారావు చెప్పారు. పురపాలక శాఖ ద్వారా రూ.1.21 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. రాష్ట్రానికి వస్తున్న ఆదాయంలో 70% పట్టణాల నుంచేనని, ఈ నేపథ్యంలో పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన కోసం అప్పులు తెచ్చినట్లు తెలిపారు. మౌలిక వసతుల కోసం తెచ్చే అప్పులు భవి ష్యత్తు పెట్టుబడేనని ఆయన పేర్కొన్నారు. బుధవారం మెట్రోరైల్ భవన్లో జరిగిన కార్యక్రమంలో తొమ్మిదేళ్లలో పురపాలక శాఖ అభివృద్ధి నివేదిక, ఎంఏయూడీ వార్షిక నివేదికను మంత్రి విడుదల చేశారు. పట్టణాల అభివృద్ధిపై 2014 మొదలుకుని ప్రతి ఏటా ప్రగతి నివేదికను విడుదల చేస్తున్నామని, ఈసారి దశాబ్ది నివేదిక పేరిట 2014 నుంచి సాధించిన ప్రగతిని అందులో పొందుపరిచినట్లు తెలిపారు. గత పదేళ్లలో 462 శాతం ఎక్కువ వ్యయం 2004 నుంచి 2014 వరకు పట్టణాల్లో మౌలిక వసతుల కోసం చేసిన రూ.26,211.50 కోట్ల ఖర్చుతో పోలిస్తే.. గత పదేళ్లలో 462 శాతం ఎక్కువ వెచ్చించామన్నారు. ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.1,21,294 కోట్లలో రూ. 1,11,360 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ నిధులు కాగా, కేవలం రూ.9,934 కోట్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వ నిధులని తెలిపారు. అన్ని రంగాలలో గతంలో కంటే అనేక రెట్లు ఎక్కువ ఖర్చు చేశామని, మౌలిక వసతుల కల్పనలో గణనీయమైన వృద్ధి సాధించామని, ఇందులో భాగంగానే 26 మున్సిపాలిటీలకు కేంద్రం అవార్డులు ఇచ్చిందని చెప్పారు. అధిక శాతం జీహెచ్ఎంసీ పరిధిలోనే.. పదేళ్లలో పట్టణాల్లో మౌలిక సదుపాయాల కోసం చేసిన వేల కోట్ల వ్యయంలో అధిక భాగం జీహెచ్ఎంసీ పరిధిలోనే జరిగిందని కేటీఆర్ వివరించారు. 2004–14 కాలంలో రూ.4,636.38 కోట్లు వెచ్చిస్తే, 2014–23 మధ్య కాలంలో రూ.44,021.99 కోట్లు వెచ్చించామని, ఇది దాదాపు 850 శాతం అధికమని అన్నారు. ౖఈ మధ్య కాలంలో జీహెచ్ఎంసీ ఎస్ఆర్డీపీ, సీఆర్ఎంపీ, హెచ్ఆర్డీసీ, ఎస్ఎన్డీపీ వంటి ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసి ప్రణాళికా బద్ధంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం వల్లనే ఇది సాధ్యమైందని చెప్పారు. ఎస్ఆర్డీపీ ద్వారా సుమారు 35 ఫ్లై ఓవర్లు నిర్మించామని, కానీ ఉప్పల్, అంబర్పేట ఫ్లై ఓవర్లను నేషనల్ హైవే అథారిటీ పూర్తి చేయలేక పోతోందని అన్నారు. మున్సిపాలిటీల్లో రూ.238 కోట్లతో పనులు హైదరాబాద్ చుట్టూ ఉన్న మున్సిపాలిటీల్లో రూ.238 కోట్లతో 19 పనులు చేపట్టామని, అందులో ఏడు పనులు పూర్తి కాగా, మిగతావి కూడా వేగంగా జరిగేలా ఆదేశాలిచ్చినట్లు కేటీఆర్ తెలిపారు. నగరంలో ప్రధాన రహదారుల నాణ్యత పెరిగిందని, వరద ఇబ్బందులను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. చెరువుల సుందరీకరణను పెద్ద ఎత్తున చేపట్టామని, ఎస్ఎన్డీపీ కింద నాలాలను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. గతంలో ముంపు వల్ల 150 కాలనీలు ఇబ్బంది పడేవని, ఎస్ఎన్డీపీ వల్ల ఈ బాధ తప్పిందని పేర్కొన్నారు. 2050 నాటికి నగరంలో తాగునీటి సమస్య లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ప్రజారవాణాను మెరుగుపర్చడంలో భాగంగా మెట్రో విస్తరణ, బస్సుల ఎలక్ట్రిఫికేషన్, పాతబస్తికీ మెట్రో కనెక్టివిటీ, భవిష్యత్తులో నిరంతర నీటి సరఫరా, నాలాల మరమ్మతు లాంటి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా చర్యలు చేపట్టినట్లు వివరించారు. శామీర్పేట్, మేడ్చల్ వైపు డబుల్ డెక్కర్ స్కైవేలు కట్టనున్నట్లు చెప్పారు. మెట్రో రైళ్లలో రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో కోచ్ల సంఖ్యను పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. -
చూసింది ట్రైలరే.. సినిమా ముందుంది!
సాక్షి, హైదరాబాద్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 95–100 సీట్లను కచ్చితంగా గెలిచి తీరుతామని మంత్రి కె. తారక రామారావు స్పష్టం చేశారు. గత 9 ఏళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ట్రైలర్ మాత్రమేనని... అసలు సినిమా ముందుందని చెప్పారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ మాట చెప్పట్లేదని, తెలంగాణ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ మదిలో ఎన్నో ప్రణాళికలు ఉన్నాయన్నారు. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు మూడోసారి ఆశీర్వదిస్తారనే నమ్మకం తనకుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్ నానక్రాంగూడలో కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) నూతన కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ఎన్నికల్లో 63 సీట్లు గెలుచుకున్నామని, ఆ సమయంలో 10 సీట్లు అటుఇటు చేసి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కొందరు కుయుక్తులు చేశారని కేటీఆర్ ఆరోపించారు. చిన్న రాష్ట్ర ఏర్పాటే విఫలమని ప్రకటించి ఏదో చేద్దామని ప్రయత్నించారని, కానీ ప్రజలకు స్పష్టత ఉండటంతో 2018 ఎన్నికల్లో తమకు 88 సీట్లిచ్చి గెలిపించారని చెప్పారు. అభివృద్ధి కేవలం డైలాగ్లు కొడితేనే, ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తేనో జరగదని, నాయకుడికి స్థిరచిత్తం, ధృడసంకల్పం, ప్రజలకు మంచి చేయాలనే ఆరాటం ఉంటేనే సాక్షాత్కారం అవుతుందన్నారు. సమగ్ర, సమీకృత, సమతౌల్య అభివృద్ధికి తార్కాణం తెలంగాణ అని వ్యాఖ్యానించారు. ఐపీఎస్, ఐఏఎస్లకు టెంపర్.. ‘రాజకీయ నాయకులు అధికారంలోకి వస్తే తొలి ఏడాది విధానాలను అర్థం చేసుకోవడానికి, కుర్చీ సర్దుకోవడానికే సరిపోతుంది. చివరి ఏడాది మళ్లీ ఎన్నికల హడావుడి ఉంటుంది. మధ్యలో ఉండేది మూడేళ్లే. ఈ సమయంలో ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు నాయకులకేం తెలుసు.. మేము కదా పర్మినెంట్ ఆర్టిస్టులం.. వాళ్లు గెస్ట్ అర్టిస్టులు. ఐదేళ్లకొకసారి మారిపోతారని అనకుంటారు. వాళ్ల టెంపర్ వాళ్లది’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. 250 కి.మీ. వరకూ మెట్రో విస్తరణ... హైదరాబాద్లో మెట్రో రైలును 250 కి.మీ. వరకూ విస్తరిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. 31 కి.మీ. శంషాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రోను రెండున్నర ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు. బీహెచ్ఈఎల్ నుంచి హయత్నగర్ వరకు, ఈసీఐఎల్ నుంచి నానక్రాంగూడ వరకూ మెట్రోను విస్తరిస్తామని తెలిపారు. జేబీఎస్ నుంచి తుర్కపల్లి వరకు, ప్యాట్నీ నుంచి కొంపల్లి వరకు ఒక్కోటి 18.5 కి.మీ. మేర స్కైవాక్ను నిర్మించనున్నామని... భవిష్యత్తు అవసరాల రీత్యా ఈ స్కైవాక్ల మధ్యలో మెట్రో పిల్లర్లను సైతం నిర్మిస్తామని కేటీఆర్ తెలిపారు. రూ. 4 వేల కోట్లతో చేపట్టిన 16 సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ)ల నిర్మాణం సెపె్టంబర్కు పూర్తవుతుందన్న కేటీఆర్... ఎస్టీపీల నుంచి వచ్చే నీటిని నిర్మాణరంగ అవసరాలకు వినియోగించుకోవాలని డెవలపర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ జి.రంజిత్రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాశ్గౌడ్, సీఐఐ తెలంగాణ చైర్మన్ సి. శేఖర్రెడ్డి, క్రెడాయ్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జి.రాంరెడ్డి, తెలంగాణ చైర్మన్ సీహెచ్ రాంచంద్రారెడ్డి, అధ్యక్షుడు డి.మురళీకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వర్షాకాల సమస్యలపై అప్రమత్తంగా ఉండండి
సాక్షి, హైదరాబాద్: వానాకాలంలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై మున్సిపల్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు ఆదేశించారు. మ్యాన్హోల్స్, నాలాలు, వరదనీటి కాలువల వల్ల గతంలో తలెత్తిన సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలోని పట్టణాల్లో ఆయా మునిసిపాలిటీలు చేపట్టిన వర్షాకాల సన్నద్ధత ప్రణాళికలపై పురపాలక శాఖలోని వివిధ విభాగాల అధికారులతో మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పురపాలికలతోపాటు హైదరాబాద్లో తలెత్తే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. వర్షాల కారణంగా ప్రాణ నష్టం జరగకుండా చూడటమే అధికారుల ప్రథమ ప్రాధాన్యత అని, ఆ దిశగా యంత్రాంగం పనిచేయాలని మంత్రి సూచించారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ చేపట్టిన ఎస్ఎన్డీపీ ప్రాజెక్టు పనుల పురోగతిని ఆరా తీశారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాలలో అవసరమైన డీవాటరింగ్ పంపులు, ఇతర ఏర్పాట్లు చేసుకుని సన్నద్దంగా ఉండాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. నగరవ్యాప్తంగా ప్రారంభించిన వార్డు కార్యాలయాల పనితీరుపైన మంత్రి కేటీఆర్ ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయాల వ్యవస్థ ప్రారంభ దశలోనే ఉన్నదని, ఈ దశలో ఎదురయ్యే సవాళ్లను ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ముందుకు పోవాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పలువురు నగర పౌరులతో ఫోన్లో మాట్లాడి సమస్యలు, వాటి పరిష్కారం జరిగిన తీరు అడిగి తెలుసుకున్నారు. -
కరీంనగర్ పేరు చెబితే.. ప్రతిపక్షాల గుండెఝల్లు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఉద్యమకాలం నుంచి ‘కరీంనగర్ పేరు చెబితే ఝల్లు మనాలే’ అని పాటలు పాడుకున్నామని, ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలకు గుండెఝల్లు మంటోందని మున్సిపల్ మంత్రి కె.తారకరామారావు అన్నారు. కరీంనగర్లోని మానేరు నదిపై నిర్మించిన తీగల వంతెనను మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్లతో కలిసి బుధవారం ప్రారంభించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కరీంనగర్లో రూ.220 కోట్లతో తీగల వంతెన, రూ.410 కోట్లతో మానేరు రివర్ఫ్రంట్ వంటి ప్రాజెక్టులతో నగరం అభివృద్ధి చెందుతోందన్నారు. మానేరు నది మొత్తం 180 కి.మీల పొడవునా సుజల దృశ్యంగా మార్చాలన్న పట్టుదలతో పనిచేస్తున్నామన్నారు. ఉద్యమకాలంలో జలదృశ్యంలో మొదలై.. రాబోయే దసరా నాటికి మానేరు సుజల దృశ్యంగా ఆవిష్కారం కాబోతుందని ప్రకటించారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని కాళోజీ అన్నట్లుగా.. ‘నా తెలంగాణ కోటి మాగాణం’గా చేస్తున్నామన్నారు. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలతో గోదావరి–కృష్ణా నీటిని ఒడిసి తెలంగాణ బీడుభూములను సస్యశ్యామలం చేశామన్నారు. పనిచేసే వారికి పట్టం కట్టండి.. కరీంనగర్ అభివృద్ధిలో మంత్రి గంగుల కమలాకర్ సంకల్పాన్ని కేటీఆర్ ప్రశంసించారు. సీఎం ముద్దుగా ‘కరీంనగర్ భీముడు’ అని పిలుచుకునే గంగుల కమలాకర్ చొరవతోనే అందమైన జంక్షన్లు, రోడ్లతో నగరం సర్వాంగ సుందరంగా మారిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన్ను వెన్నుదట్టి మరోసారి ప్రోత్సహించాలని ప్రజలను కోరారు. అదే సమయంలో ప్రణాళికా సంఘం బోర్డు ఉపాధ్యక్షుడు బి.వినోద్కుమార్ను ఎంపీగా కోల్పోయామని వాపోయారు. ఇపుడున్న ఎంపీ ఏం మాట్లాడుతడో ఆయనకే తెలియదని విమర్శించారు. నగరంలో పదెకరాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో గుడి కట్టిన నాయకుడు ఉన్నాడా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పల్లెప్రగతి నుంచి పట్టణప్రగతి వరకు దేశంలో మనమే నెంబర్ వన్గా ఉన్నామన్నారు. వ్యవసాయ, పారిశ్రామిక, సంక్షేమ రంగాల్లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ దూసుకుపోతోందని, అందులో కరీంనగర్ తెలంగాణలోనే అగ్రభాగంలోనే ఉందని తెలిపారు. అందుకే, పనిచేసేవారిని ప్రోత్సహించాలని కోరారు. పనిచేయని వారిన చెత్తబుట్టలో వేయాల్సిన బాధ్యత మీదేనని ప్రజలకు పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లని.. అభివృద్ధే తమ కులమని.. జనహితమే తమ మతం అని ముగించారు. ప్రాజెక్టులతో కరీంనగర్కు ప్రపంచస్థాయి గుర్తింపు : గంగుల అంతకుముందు మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ఉద్యమకాలం నుంచి కరీంనగర్ అంటే సీఎం కేసీఆర్కు ప్రత్యేక అభిమానమని గుర్తుచేశారు. కేబుల్ వంతెన, మానేరు రివర్ఫ్రంట్ ఆగస్టు 15 నాటికి మొదటి దశ ప్రారంభిస్తామన్నారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద వాటర్ ఫౌంటేన్ ప్రారంభమవుతుందని, ఈ ప్రాజెక్టులతో నగరానికి ప్రపంచస్థాయి గుర్తింపు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇన్ని అవకాశాలు కల్పించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ గతంలో చెప్పినట్లుగా కరీంనగర్ను లండన్ తరహాలో తీర్చిదిద్దుతున్నారన్నారు. రాష్ట్రం ఇస్తే ఏం చేస్తారన్న వెక్కిరింపులను దాటి.. నదులను ఎత్తి కోటి ఎకరాలకు నీళ్లు తెచ్చామని, నిరంతర కరెంటు ఇస్తున్నామని చెప్పారు. -
మూడు సిలిండర్లు మాకెందుకివ్వరు?
సిరిసిల్ల: ఉచితాలు వద్దని, రేవుడీ కల్చర్ అంటూ.. తెలంగాణ ప్రభుత్వాన్ని నిందించిన దేశ ప్రధాని నరేంద్రమోదీ.. ఏటా మూడు సిలిండర్లు, నిత్యం అర లీటరు పాలు ఉచితంగా ఇస్తామంటూ కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడాన్ని రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు తప్పుపట్టారు. మోదీ దేశానికి ప్రధానమంత్రా? లేక ఒక్క కర్ణాటకకేనా అని ప్రశ్నించారు. సిలిండర్ ధరను రూ.400 నుంచి రూ.1,200కు పెంచిన బీజేపీ సర్కార్.. తెలంగాణ రాష్ట్రంలో మూడు సిలిండర్లు ఉచితంగా ఎందుకు ఇవ్వదని, మిగతా రాష్ట్రాల్లోనూ ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. పాలపైనా జీఎస్టీ వేసిన కేంద్ర ప్రభుత్వం హామీలను ఎవరూ నమ్మే పరిస్థితి లేదని పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, సిరిసిల్ల, గంభీరావుపేట మండలాల్లో వడగండ్ల వానలతో దెబ్బతిన్న పంటలను, తడిసిన ధాన్యాన్ని మంత్రి కేటీఆర్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 90 శాతం వరకు వరి నష్టం రాష్ట్రంలో నీరు పుష్కలంగా ఉండడంతో రైతులు ఎక్కువగా యాసంగి సీజన్లో వరిని సాగు చేశారని, అయితే అనూహ్యంగా వచ్చిన వడగండ్ల వానలతో పంటలు దెబ్బతిన్నాయని కేటీఆర్ చెప్పారు. వరి పంట 30 శాతం నుంచి 90 శాతం మేరకు నష్టం జరిగిందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటివరకు 19 వేల ఎకరాల్లో 17 వేల మంది రైతులకు పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశామన్నారు. ఇంకా క్షేత్రస్థాయిలో ఎన్యుమరేషన్ జరుగుతోందని చెప్పారు. సీఎం కేసీఆర్ ఇప్పటికే ఐదు జిల్లాల్లో పర్యటించారని, నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్ను ఆర్థిక సాయం అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారని గుర్తుచేశారు. ఇలావుండగా.. రైతాంగానికి రైతుబంధు, రైతు బీమా, ఉచిత కరెంటు, నీరు ఇచ్చే తెలంగాణ వ్యవసాయ విధానం కావాలని దేశమంతా కోరుకుంటోందని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7.50 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, గతేడాది ఈ సమయానికి కేవలం 4 లక్షల టన్నుల ధాన్యం కొన్నామని వివరించారు. పంటలు వేసిన అసైన్డ్ భూములు, పోడు భూములకు కూడా నష్ట పరిహారం ఇస్తామన్నారు. మహిళల భద్రతకు ‘అభయ’యాప్ మహిళల భద్రతకు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు రూపొందించిన ‘అభయ’యాప్ను మంత్రి కేటీఆర్ సిరిసిల్ల మినీ స్టేడియంలో ఆవిష్కరించారు. జిల్లా పోలీస్ క్రీడోత్సవాల ముగింపు వేడుకల్లో పాల్గొన్న మంత్రి.. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పర్యవేక్షణలో రాష్ట్రంలోనే తొలిసారి రూపొందించిన ‘అభయ’యాప్ను ఆవిష్కరించారు. ఆటోల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఉమెన్ సెఫ్టీ కోసం ఈ క్యూఆర్ కోడ్ పనిచేస్తుందని, ట్రాక్ మై లొకేషన్ పోలీసులకు షేర్ అవుతుందన్నారు. ఈ యాప్ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని మంత్రి వెల్లడించారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, కలెక్టర్ అనురాగ్ జయంతి, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు. కాగా సచివాయంలోకి ఎంపీ రేవంత్రెడ్డిని ఎందుకు అనుమతించడం లేదని విలేకరులు ప్రశ్నించగా.. ‘అది సచివులు ఉండే చోటు, సచివులకే ప్రవేశం ఉంటుంది..’అంటూ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. -
మోదీకి ఘర్వాపసీ తప్పదు
ప్రజలు కేసీఆర్ను ఆశీర్వదిస్తారు.. తెలంగాణలో మళ్లీ గులాబీ జెండాయే ఎగురుతుంది. కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టిన తొలి సీఎంగా రికార్డు సాధిస్తారు. ఎవరు ఎన్ని చెప్పినా కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అనే భావనంలో ప్రజలు ఉన్నారు. రైతులు, పేదల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను దేశానికి పరిచయం చేసేందుకు బయలుదేరిన కేసీఆర్ను ప్రజలు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం. సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ, బీజేపీపై బీఆర్ఎస్ కార్యానిర్వాహక అధ్యక్షుడు కె. తారక రామారావు విరుచుకుపడ్డారు. ఏటీఎం అంటే అదానీ టూ మోదీకి డబ్బుల ప్రవాహమే అని ఆయన కొత్త భాష్యం చెప్పారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీయేనని, బీజేపీకి ఈసారి కూడా వందకుపైగా సీట్లలో డిపాజిట్లు గల్లంతవుతాయని జోస్యం చెప్పారు. ఈ నెల 27న బీఆర్ఎస్ 23వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే... ఏటీఎం అంటే... ఏటీఎం అంటే అదానీ నుంచి మోదీకి డబ్బుల ప్రవాహం సాగడమే. అవినీతి గురించి మోదీ ఆయన మంత్రులు మాట్లాడటం విడ్డూరం. సీబీఐ, ఈడీలను చేతిలో పెట్టుకొని కేంద్రం ఆటలాడుతోంది. కానీ ఎప్పుడూ కాలం ఒకేలా ఉండదు. ç2024లో మోదీకి గుజరాత్కు ఘర్ వాపసీ తప్పదు. 2024లో ప్రధాని పదవి ఖాళీ కాక తప్పదు. ఎవరేం అనుకున్నా తెలంగాణలో గత ఎన్నికల్లో 108 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిన బీజేపీకి ఈసారి 103 స్థానాల్లో మళ్లీ డిపాజిట్లు దక్కవు. మోదీ అప్పట్లో రాష్ట్రం విడిచి తిరగలేదా..? గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉంటూ మోదీ 2010 నుంచి 2014 వరకు పాలన గాలికొదిలేసి గాలి తిరుగుడు తిరగలేదా? తెలంగాణలో మౌలికవసతులు కల్పించాకే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టారు. గుజరాత్లో నేటికీ మంచినీరు, విద్యుత్ కొరత వంటి సమస్యలు ఉన్నాయి. తెలంగాణలో సమస్యలు లేవనడం లేదు. మా కార్యకలాపాలకు కేంద్రం తెలంగాణయే. ఢిల్లీ కేంద్రంగానే పార్టీని నడపాలనే ఖానూన్ ఏమీ లేదు. హైదరాబాద్ కేంద్రంగా జాతీయ రాజకీయాలను శాసించవచ్చు. ప్రజల ఆశీర్వాదం, ఆదరణ మాకు లభిస్తే రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? ఆ ఆరోపణలు పాత చింతకాయ పచ్చడి... పరివార్వాదీ, ఎంఐఎంతో అనుబంధం, మా కుటుంబంపై అవినీతి ఆరోపణలు పాత చింతకాయ పచ్చడి. ప్రజలకు ఇష్టం లేకుంటే మమ్మల్ని తిరస్కరిస్తారు. కర్ణాటకలో 40–50 మంది బీజేపీ నేతల కుటుబ సభ్యులకు టికెట్లు ఇవ్వడం పరివార్వాదీ కాదా? అక్కడ బీజేపీకి వర్తించని నిబంధనలు మాకే వర్తిస్తాయా?. కరప్షన్ క్యాప్టెన్ మోదీ.. క్యాప్షన్ బీజేపీ. అదానీ, ప్రధాని అవిభక్త కవలలు. మోదీ అత్యంత అవినీతిపరుడు. పాలన చేతకాని అసమర్థుడు. బీజేపీకి ఎన్నికల బాండ్ల రూపంలో రూ. 20 వేల కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయి? ఎంఐఎం అనే పార్టీ భుజంపై తుప్పుబట్టిన తుపాకీ పెట్టి ఎన్నిసార్లు కాల్చినా ప్రజలకు స్పష్టత ఉంది. పేదల కోసం పనిచేసే వారిని ప్రజలు ఆదరిస్తారు. బీజేపీ చేసే మతపరమైన రాజకీయం తెలంగాణ చైతన్యం ముందు చెల్లదు. విస్తరణ బాటలో ఉన్నాం... 60 లక్షల సైన్యంగల పార్టీ బీఆర్ఎస్. దేశంలోనే ఇంత పెద్ద బలగం, సైన్యం ఉన్న పార్టీ మరొకటి లేదు. జాతీయ పార్టీగా రూపాంతరం చెందినా ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల్లోకి ఇంకా బలంగా వెళ్లలేదు. ఇప్పుడిప్పుడే మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల్లోకి విస్తరించే ప్రయత్నంలో ఉన్నాం. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారినా మా జెండా, ఎజెండా, మా నాయకుడు, గుర్తు మారలేదు. తెలంగాణనే మాకు మొదటి ప్రాధాన్యం. తెలంగాణ మోడల్ను దేశానికి చూపుతున్నాం. తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను ఇతర రాష్ట్రాల్లో ఎగురవేయడానికి బయలుదేరాం. అంతే కాని తెలంగాణను వదిలి వెళ్లలేదు. శిఖండి రాజకీయం.. మహాభారతంలో శిఖండి రాజకీయం చేసినట్లు నేరుగా గెలవలేక కొత్త పార్టీలు, చిన్న పార్టీలను అడ్డుపెట్టుకొని బీజేపీ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ఈ పార్టీల నాయకులు నిద్రలేచింది మొదలు కేసీఆర్ను, రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టడమే తప్ప తెలంగాణ ప్రయోజనాల కోసం కేంద్రాన్ని అడిగే పరిస్థితి లేదు. అమిత్ షా అడ్డగోలుగా మాట్లాడినా ఒక్కరూ ప్రశ్నించరు. బీజేపీపై మరకపడకుండా చూస్తూ బీఆర్ఎస్ ఓట్లను చీల్చడమే వారి పని. తెలంగాణ ప్రజలు దీన్ని అర్థం చేసుకొని బీఆర్ఎస్కు అండగా నిలుస్తారు. ఎన్నికల సమాయత్తానికే సమ్మేళనాలు.. ఎన్నికల ఏడాదిలో కేడర్ను సిద్ధం చేసేందుకు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నాం. ఈ సమ్మేళనాల నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ను దృష్టిలో పెట్టుకొని చిన్నాచితకా లోటుపాట్లు ఉంటే సవరించుకుంటాం. మే నుంచి యువజన, విద్యార్థి సమ్మేళనాలు నిర్వహిస్తాం. విద్యార్థి విభాగాన్ని బలోపేతం చేసేలా జూన్ నుంచి బీఆర్ఎస్వీ ఎన్రోల్మెంట్ ప్రారంభిస్తాం. రాష్ట్రంపై కేంద్రం చూపుతున్న వివక్ష, రాష్ట్ర ప్రభుత్వ విజయాలను విద్యార్థులు, యువతకు వివరించి మత కలహాలతో చిచ్చు పెట్టే పార్టీ కావాలా లేదా తెలంగాణను పచ్చగా చేసే పార్టీ కావాల ఆలోచించుకోవాలని చెప్తాం. వారికి భవిష్యత్తులో అవకాశాలు.. పార్టీలో టికెట్లు ఆశించడం అసహజ విషయమేమీ కాదు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందనే స్పష్టత మా పార్టీ నేతలకు ఉంది. ఎమ్మెల్యే టికెట్ వచ్చిన వారు ఎన్నికల్లో కొట్లాడతారు. రాకున్నా పార్టీ నిర్ణయానికి కట్టుబడే వారికి రేపు మరో అవకాశం వస్తుంది. తొమ్మిదేళ్లలో అనేక మంది విద్యార్థి, యువజన నాయకులకు ఎమ్మెల్సీలుగా, కార్పొరేషన్ల చైర్మన్లుగా, కమిషన్ల సభ్యులుగా అవకాశం ఇచ్చాం. మాట ఇచ్చిన వారందరినీ అకామిడేట్ చేసుకున్నాం. ఎవరికైనా అవకాశాలు రాకుంటే భవిష్యత్తులో ఇస్తాం. గవర్నర్ వ్యవస్థతో కేంద్రం రాజకీయం... గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష ప్రభుత్వాల గొంతును కేంద్రం నులుముతున్న తీరును దేశం గమనిస్తోంది. గవర్నర్ వ్యవస్థతో రాజకీయం చేసి రాష్ట్రాలను ఇబ్బందులు పెట్టడం ప్రజాస్వామ్యానికి ప్రమాదం. కొందరికి ఆదరణ లేకే... పాదయాత్రల పేరిట కొందరు ఆపసోపాలు పడినా ప్రజలు పట్టించుకోవడం లేదు. మీడియా దృష్టిని ఆకర్షించేందుకు, అస్తిత్వం కోల్పోతామనే చిల్లర ప్రయత్నాలతో కాంగ్రెస్కు బీఆర్ఎస్ డబ్బులు ఇచ్చిందని కొందరు ఆరోపిస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికతోపాటు కరీంనగర్, నిజామాబాద్ లోక్ సభ, ఇతర ఉపఎన్నికల సమయంలో కాంగ్రెస్, బీజేపీ ఏకమై పనిచేశాయి. అదానీతో మోదీకి సంబంధం లేదని బీజేపీ నేతలు భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేస్తారా? ప్రమాణాలు, ఇమానాల మీద తేలేదుంటే కోర్టులు ఎందుకు? ఇంకో పార్టీకి డబ్బులు పంపే ఖర్మ మాకేంటి? వాళ్లందరికీ పంచేంత డబ్బులు మా వద్ద లేవు. బీజేపీ, కాంగ్రెస్లు తెలంగాణకు ఉపద్రవాలు. ఎంత త్వరగా వదిలించుకుంటే తెలంగాణకు అంత మంచిది. జాతీయ పార్టీ ఒకేసారి దేశమంతా పోటీ చేయాలని లేదు... బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారినంత మాత్రాన దేశమంతా ఒకేసారి పోటీ చేయాలన్న రూలేమీ లేదు. రెండు స్థానాల నుంచి 300 స్థానాలకు చేరుకొనేందుకు బీజేపీకి 30–40 ఏళ్లు పట్టింది. 2024లో 543 లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలనే తొందరేమీ మాకు లేదు. పట్టుదొరికి బలంగా ఉన్న చోట, గెలిచే అవకాశం, పార్టీ విస్తరణకు అవకాశం ఉన్న చోట పోటీ చేస్తాం. మహారాష్ట్రలో 48 ఎంపీ సీట్లలో పోటీ చేస్తామా, ఇతరులతో అవగాహన ఉంటుందా ఇప్పుడే చెప్పలేము. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ విస్తరణకు పనిచేస్తూనే రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రావడాన్ని మొదటి కర్తవ్యంగా పనిచేస్తాం. దేశంలో రాజకీయ శూన్యత నేపథ్యంలో బీఆర్ఎస్ బలమైన పార్టీగా ఎదుగుతుంది. కుమారస్వామికి మద్దతు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జనతా దళ్ (సెక్యులర్) నేత కుమారస్వామికి మద్దతివ్వాలని పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ ఎన్నికల్లో ప్రచారం చేయాలని కుమారస్వామి కోరితే పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. మా ప్రత్యర్థి కాంగ్రెస్సే.. తెలంగాణలో మాకు కాంగ్రెస్ పార్టీయే ప్రత్యర్థి. క్షేత్రస్థాయిలో అంతోఇంతో కాంగ్రెస్ ఉన్నా టీపీసీసీ అధ్యక్షుడి ఒంటెద్దు పోకడలతో కేడర్, లీడర్లు నిరాసక్తతతో ఉన్నారు. 2018లో 19 సీట్లు వస్తే ఈసారి కాంగ్రెస్కు డబుల్ డిజిట్ వస్తుందో రాదో తెలియదు. కాంగ్రెస్తో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు ఉండదు. మునుగోడు ఉపఎన్నికలో కమ్యూనిస్టులు మద్దతు ఇచ్చారు. భవిష్యత్తులో వారితో పనిచేసే విషయంలో ఎన్నికల నాటికి నిర్ణయం ఉంటుంది. అదానీ షేర్ల స్కాం అంశం విషయంలో పార్లమెంటు సంయుక్త కమిటీ (జేపీసీ) ఏర్పాటు డిమాండ్ కోసం కాంగ్రెస్తోపాటు ఇతర విపక్షాలతో కలసి కేవలం ఫ్లోర్ కోఆర్డినేషన్ కోసం పనిచేశాం. -
రాష్ట్రంలో బీజేపీ ఖాళీ.. ఢిల్లీలో ప్రధాని కుర్చీ ఖాళీ
అమిత్ షా జీ.. త్వరలో అధికారంలోకి కాదు..బీజేపీ అంధకారంలోకే. త్వరలో రాష్ట్రంలో బీజేపీ ఖాళీ.. ఢిల్లీలో ప్రధాని కుర్చీ ఖాళీ. 2024లో వైఫల్యాల మోదీకి గుజరాత్ ఘర్వాపసీ తప్పదు. మరోసారి మోదీని ప్రధాని పీఠం ఎక్కిస్తే దేశాన్ని బలిపీఠం ఎక్కించినట్టేననే బలమైన భావనలో ప్రజలున్నారు. సాక్షి, హైదరాబాద్: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా చేవెళ్ల సభలో చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి కె. తారక రామారావు ఆదివారం రాత్రి ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు. ‘డియర్ అమిత్షా జీ..త్వరలో అధికారంలోకి కాదు.. బీజేపీ అంధకారంలోకే.. త్వరలో రాష్ట్రంలో బీజేపీ ఖాళీ.. ఢిల్లీలో ప్రధాని కుర్చీ ఖాళీ.. 2024లో వైఫల్యాల మోదీకి గుజరాత్ ఘర్వాపసీ తప్పదు.. మరోసారి మోదీని ప్రధాని పీఠం ఎక్కిస్తే దేశాన్ని బలిపీఠం ఎక్కించినట్టేననే భావనలో ప్రజలున్నా రు’ అంటూ అమిత్షా వ్యాఖ్యలపై ఎక్కడికక్కడ కౌంటర్ ఇస్తూ ఆయన చేసిన వరుస ట్వీట్లు ఇలా.. అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్ ‘కారు స్టీరింగ్ కాదు.. బీజేపీ స్టీరింగే అదానీ చేతికి చిక్కింది. కార్పొరేట్ దోస్తు కబంధహస్తాల్లో కమలం విలవిలలాడుతోంది. హిండెన్బర్గ్ రిపోర్ట్తో బీజేపీ ఫుల్ పిక్చర్ను దేశప్రజలు 70 ఎంఎంలో చూసేశారు. ఇంకా ఏ ట్రైలర్ అవసరం లేదు. తెలంగాణలో గల్లీ బీజేపీ నేతల పగటివేషాలు నడవవు. ఢిల్లీ పెద్దల పగటికలలు నెరవేరవు. అదానీపై జేపీసీ వేయని బీజేపీకి సిట్టింగ్ జడ్జి విచారణ అడిగే హక్కుందా?. ముక్కునేలకు రాసినా..మోకాళ్ల యాత్ర చేసినా..మోసాల మోదీని తెలంగాణ నమ్మదు. బట్టేబాజ్ బీజేపీని తెలంగాణ సమాజం క్షమించదు. కరప్షన్కు కెప్టెన్.. మోదీ. క్యాప్షన్.. బీజేపీ. ఎంఐఎం భుజంపై తుప్పుపట్టిన బీజేపీ తుపాకీపెట్టి ఎంతకాలం కాలుస్తారు?. తెలంగాణలో సొంత బలం లేని పార్టీ బీజేపీ. పల్లెపల్లెనా బలగం కలిగిన పార్టీ బీఆర్ఎస్’. నిస్సిగ్గుగా సుద్దులా? ‘బారాణా తీసుకుని చారాణా కూడా ఇవ్వని బీజేపీకి మిగిలేది బూడిదే. అదానీ విషయంలో జేపీసీ కాదు కదా కనీసం సిట్ కూడా వేయని వారు అవినీతి గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. గుజరాత్లో మోదీ హయాంలో మీరు హోంమంత్రిగా ఉన్నప్పుడు పేపర్ లీకుల్లో గుజరాత్ నంబర్వన్గా ఉన్నమాట నిజం కాదా?. గత ఎనిమిదేళ్లలో గుజరాత్లో 13సార్లు పేపర్లు లీక్ కాలేదా?. ఈ దేశంలో ‘వ్యాపం’ లాంటి అతి జుగుప్సాకరమైన స్కాం చేసింది మీ బీజేపీ ప్రభుత్వం కాదా?. అటువంటి మీరు నిస్సిగ్గుగా సుద్దులు మాట్లాడటం మీకే చెల్లింది’. పీఎం కేర్స్లో ఎంత జమైందో చెబుతారా? ‘పీఎం కేర్స్లో ఎంత జమైందో, ఏవిధంగా ఖర్చ యిందో చెప్పని వారు, కాగ్ ఆడిట్ పీఎం కేర్స్కు వర్తించదని నిస్సిగ్గుగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసిన వారు, కాగ్ మాత్రమే కాక అన్ని రకాల బ్యాంక్స్ ఆడిట్లతో కట్టిన ప్రాజెక్టులపై మాట్లాడటం అవివేకం కాక మరేమిటి?. ఎనిమిదేళ్లుగా కృష్ణా నదిలో తెలంగాణ వాటా తేల్చకుండా, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించకుండా ఇక్కడికొచ్చి ఎవరో మీ గులాములు రాసిచ్చిన స్క్రిప్టును వల్లెవేస్తే నమ్మేదెవరు?’ అంటూ కేటీఆర్ తన వరుస ట్వీట్లను ముగించారు. మీకు ఫ్రెండ్ ఫస్ట్.. నేషన్ లాస్ట్.. ‘ఐటీఐఆర్ హైదరాబాద్, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, హైదరాబాద్ మెట్రో రెండోదశ, ఐఐఎం, ఐసెర్, ట్రిపుల్ ఐటీ, ఎన్ఐడీ, నవోదయ, మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలకు శంకుస్తాపన చేసినందుకు కృతజ్ఞతలు. ఓహ్.. ఆగండాగండి.. ఇవేవీ ఆయన చేయలేదు’ అంటూ అమిత్ షాను ఉద్దేశించి రాష్ట్రమంత్రి కేటీఆర్ మరో ట్వీట్లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గడిచిన తొమ్మిదేళ్లలో తెలంగాణ కంటే మెరుగ్గా పనిచేసిన బీజేపీ పాలిత రాష్ట్రం పేరు ఒక్కటీ ఎందుకు చెప్పలేకపోయారు’ అని మంత్రి కేటీఆర్ అమిత్షాను ప్రశ్నించారు. ‘ఆకాశాన్నంటుతున్న పప్పు, ఉప్పు, నూనె ధరలు నియంత్రించే సోయి లేదు. ప్రజలపై పెట్రోధరల భారాన్ని తగ్గంచాలన్న సోయి కూడా లేదు. గ్యాస్ ధరలను భరించలేకపోతున్న మహిళలపై కనికరం లేదు. కానీ ఆగమేఘాలపై అదానీ కంపెనీని ఆదుకోవడమే మీ ఏకైక లక్ష్యం. దేశం కోసం కాదు.. దోస్తు కోసం ప్రజల రెక్కల కష్టాన్ని ధారపోస్తున్న వైనం. సామాన్యుడు ప్రశ్నిస్తున్నాడు.. ప్రధాని ప్రాధాన్యాల్లో పేదవాడు ఎక్కడ?. దేశానికి అర్దమైంది.. మీకు ఫ్రెండ్ ఫస్ట్.. నేషన్ లాస్ట్’ అంటూ కేటీఆర్ బీజేపీపై మండిపడ్డారు. -
ఊరూరా పండుగలా..
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈసారి పెద్ద ఎత్తున నిర్వహించాలని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నిర్ణయించింది. కొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతోపాటు.. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఆత్మీయ సమ్మేళనాలకు పార్టీ శ్రేణుల్లో మంచి స్పందన వస్తుండటంతో.. ఈ ఉత్సాహాన్ని కొనసాగించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఊరూరా పండుగలా ఘనంగా కార్యక్రమాలు నిర్వహించాలని.. అన్ని స్థాయిల పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు పాల్గొనేలా చూడాలని నిర్ణయించింది. ఏప్రిల్ 27న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో ముందు, తర్వాత నిర్వహించే కార్యక్రమాలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారకరామారావు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. దీనికి అనుగుణంగా పార్టీ శ్రేణులు సిద్ధంకావాలని సూచించారు. 25 నుంచి కార్యక్రమాలు.. ఈ నెల 25వ తేదీన పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జుల అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి పార్టీ ప్రతినిధుల సభలు నిర్వహించుకోవాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు ఈ సమావేశాల నిర్వహణను సమన్వయం చేస్తారని, కనీసం 2.5 వేల నుంచి 3 వేల మంది వరకు సభలో పాల్గొనేలా చూడాలని ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, వార్డుల్లో అదే రోజున ఉదయం పార్టీ జెండాలను ఎగరవేసి.. పండుగలా జరుపుకోవాలని, ఆ తర్వాత నియోజకవర్గ సమావేశాలకు రావాలని నేతలకు సూచించారు. రోజంతా జరిగే పార్టీ నియోజకవర్గ ప్రతినిధుల సభలో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, పార్టీ తరఫున చేపట్టిన కార్యక్రమాలన్నింటిపై విస్తృతంగా చర్చించనున్నట్టు తెలిపారు. ప్రతినిధుల సభకు నియోజకవర్గ పరిధిలోని గ్రామ, వార్డు పార్టీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులతోపాటు అన్నిస్థాయిల ప్రజా ప్రతినిధులు, కార్పొరేషన్ల చైర్పర్సన్లు హాజరుకావాలని చెప్పారు. తెలంగాణభవన్లో ఆవిర్భావ దినోత్సవం ఈ నెల 27న హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడకలను నిర్వహించనున్నట్టు కేటీఆర్ తెలిపారు. అదేరోజున పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్రావు అధ్యక్షతన పార్టీ జనరల్ బాడీ సమావేశం జరుగుతుందని.. సుమారు 300 మంది పార్టీ జనరల్ బాడీ ప్రతినిధులు అందులో పాల్గొంటారని వివరించారు. ఈ సమావేశంలో పలు రాజకీయ తీర్మానాలను ప్రవేశపెడతారని.. వాటిపై విస్తృతంగా చర్చించి, ఆమోదిస్తారని వెల్లడించారు. తెలంగాణవ్యాప్తంగా ఈ నెలాఖరులో వరి కోతలు ఉండటం, ఎండల తీవ్రత దృష్ట్యా.. పార్టీ ఆవిర్భావ దినం సందర్భంగా నిర్వహించే బహిరంగసభ, ప్రతినిధుల సభను వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. వీటిని కలిపి అక్టోబర్ 10న వరంగల్లో మహాసభ నిర్వహిస్తామని ప్రకటించారు. ఆత్మీయ సమ్మేళనాల కొనసాగింపు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణను పార్టీ అధినేత కేసీఆర్ అభినందించారని కేటీఆర్ తెలిపారు. ఈ ఆత్మీయ సమ్మేళనాలను మే నెలాఖరు దాకా కొనసాగించాలని కేసీఆర్ సూచించారని.. ఈ మేరకు చర్యలు చేపడుతున్నామని వివరించారు. మూడు నియోజకవర్గాలకు ఇన్చార్జులు సిట్టింగ్ ఎమ్మెల్యే జి.సాయన్న మృతి నేపథ్యంలో కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జిగా మర్రి రాజశేఖర్రెడ్డిని కేసీఆర్ నియమించారు. ఇక గోషామహల్ ఇన్చార్జిగా నంద కిషోర్ వ్యాస్ బిలాల్, భద్రాచలం ఇన్చార్జిగా ఎంపీ మాలోతు కవితలను నియమించారు. ప్రస్తుతం నియోజకవర్గంలో కొనసాగుతున్న ఆత్మీయ సమ్మేళనాలతోపాటు పార్టీ ఆవిర్భావ దిన వేడుకలు, ఇతర కార్యక్రమాల నిర్వహణకు బాధ్యులుగా ఉంటారని ప్రకటించారు. -
భావి తరాల కోసం ‘కూల్ రూఫ్’
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో కూల్రూఫ్ పాలసీ అమలుకు శ్రీకారం చుడుతున్నట్లు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభా వాన్ని నివాస గృహాలు, వాణిజ్య కార్యాలయాలపై తగ్గించేందుకు తీసుకొచ్చిన ‘తెలంగాణ కూల్రూఫ్ విధానం 2023–28’ను మంత్రి కేటీఆర్ సోమవారం పురపాలక శాఖ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 600 చదరపు గజాలకుపైగా విస్తీర్ణంలో నిర్మించే అపార్ట్మెంట్లు, ఇతర వాణిజ్య సముదాయాల్లో కూల్ రూఫ్ పాలసీని తప్పనిసరి చేస్తున్నట్లు తెలిపారు. కూల్రూఫ్ పాలసీ ఉంటేనే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చేలా నిబంధనలను మారుస్తామన్నారు. 600 గజాల్లోపు విస్తీర్ణంలో నిర్మించుకొనే ఇళ్లకు కూల్రూఫ్ విధానాన్ని ఆప్షన్గా ఇస్తున్నట్లు చెప్పారు. అలాగే ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాలు, డబుల్ బెడ్రూం ఇళ్లపై కూల్రూఫ్ విధానం అమలు చేస్తామన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, రోడ్లు, ఫుట్పాత్లు, సైక్లింగ్ ట్రాక్లు మొదలైన వాటిని ఈ విధానం ద్వారానే నిర్మించనున్నట్లు వివరించారు. తెలంగాణ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొనే... రాష్ట్రంలో దాదాపు 50 శాతం జనాభా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తోందని, దేశంలోనే మూడవ అతిపెద్ద పట్టణీకరణ రాష్ట్రంగా ఉన్న తెలంగాణ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కూల్రూఫ్ విధానాన్ని అమల్లోకి తెచ్చినట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. 2030 నాటికి హైదరాబాద్లో 200 చదరపు కిలోమీటర్లు, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో 100 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కూల్ రూఫింగ్ కిందకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరం జీహెచ్ఎంసీ పరిధిలో 5 చదరపు కిలోమీటర్ల మేర, ఇతర పట్టణాల్లో 2.5 కిలోమీటర్ల మేర కూల్ రూఫ్ను అమలు చేస్తామన్నారు. పట్టణాల్లో వేడిని తగ్గించాలి.. పట్టణాల్లో జరిగే నిర్మాణాల వల్ల ఉత్పన్నమవుతున్న వేడిని ఎదుర్కోవడానికి వాతావరణ అనుకూలమైన శీతలీకరణ పరిష్కారాలను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పాతకాలంలో పెంకుటిళ్లు, డంగు సున్నం, మట్టి గోడలు వేడిని ఆపాయని... ప్రస్తుతం భవన నిర్మాణాల్లో విచ్చలవిడిగా వినియోగిస్తున్న ఇనుము, స్టీల్, ఇతర ఖనిజాలతో వేడి పెరిగిందన్నారు. భవిష్యత్ వాతావరణ సవాళ్లను పరిష్కరించే దిశలో రూఫ్ కూలింగ్ పాలసీ తప్పనసరని ఆయన చెప్పారు. న్యూయార్క్ లక్ష్యంకన్నా మిన్నగా... విదేశాల్లోకన్నా అధిక విస్తీర్ణంలో తెలంగాణలో కూల్రూఫ్ పాలసీని తీసుకురావాలని నిర్ణయించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. అమెరికాలోని న్యూయార్క్ కూల్రూఫ్ నిర్దేశిత లక్ష్యం 10 లక్షల చదరపు అడుగులు లేదా 0.1 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అయితే కేవలం హైదరాబాద్, ఔటర్ రింగ్రోడ్డు కింద 1,000 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ వైశాల్యం ఉందని, ఔటర్ లోపల 20 శాతం ప్రాంతాన్ని కూల్ రూఫింగ్ కిందకు తీసుకురానున్నట్లు చెప్పారు. పెట్టుబడి తిరిగి వచ్చేస్తుంది.. కూల్రూఫ్ విధానం అమలు కోసం చదరపు మీటర్కు రూ. 300 మాత్రమే ఖర్చవుతుందని మంత్రి కేటీఆర్ వివరించారు. ఈ విధానం వల్ల ఏసీ ఖర్చులు, కరెంట్ బిల్లులు తగ్గే అవకాశం ఉన్నందున పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందన్నారు. తన ఇంటి మీద కూల్ రూఫింగ్ కోసం పెయింటింగ్ చేసినట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. కూల్ రూఫ్ కోసం ముందుకొచ్చే వారికి శిక్షణ అందించేందుకు పురపాలక శాఖ సిద్ధంగా ఉందన్నారు. త్వరలో ‘మన నగరం’అనే కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు చెప్పిన మంత్రి కేటీఆర్... దీనిలో భాగంగా భవన నిర్మాణ వ్యర్థాలను సేకరించి వాటిని కూల్ రూఫింగ్కు దోహదపడే సామగ్రిగా మార్చి ఉపయోగించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, జీహెచ్ఎంసీ మేయర్ జి. విజయలక్ష్మి, కూల్రూఫ్ నిపుణులు, ప్రొఫెసర్ విశాల్ గార్గ్, సీఆర్ఆర్సీ సభ్యురాలు నీతూ జైన్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, సీడీఏఎం సత్యనారాయణ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ తదితరులు పాల్గొన్నారు. -
పంట నష్టపోయిన రైతులకు భరోసా ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: స్థానిక వ్యవసాయ అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించడం ద్వారా అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు భరోసా కల్పించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు పార్టీ నేతలకు సూచించారు. ఎమ్మెల్యేలు ప్రభుత్వ కార్యక్రమాల అమలును పర్యవేక్షించడంతో పాటు పంచాయతీరాజ్ రోడ్ల మరమ్మతు పనులు వర్షాకాలం లోపు పూర్తయ్యేలా సమన్వయం చేసుకోవాలని చెప్పారు. ఉపాధి హామీ, పంచాయతీరాజ్, పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా చేసిన పనులకు బిల్లుల చెల్లింపుపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని తెలిపారు. ఉపాధి హామీ పథకానికి సంబంధించి కేంద్రం నుంచి రూ.1,300 కోట్ల నిధులు పెండింగ్లో ఉన్నందునే బిల్లుల చెల్లింపు ఆలస్యమైందని వివరించారు. సీఎం కేసీఆర్ సందేశాన్ని ప్రతి కార్యకర్తకు చేరేలా చూడాలని కేటీ ఆర్ ఆదేశించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య ప్రజాప్రతినిధులు, పార్టీ ఇన్చార్జీలతో సోమవారం ఆయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏప్రిల్ 27న జెండా పండుగ పార్టీ జిల్లా ఇన్చార్జీల ఆధ్వర్యంలో ఏప్రిల్ 20 నాటికి ఆత్మీయ సమ్మేళనాలు పూర్తి చేయడంతో పాటు బీఆర్ఎస్ కార్యకలాపాలు విస్తృతంగా కొనసాగించాలని కేటీఆర్ సూచించారు. కేసీఆర్ తన సందేశంలో పేర్కొన్నట్టుగా.. ఉద్యమకాలం నుంచి పార్టీకి అండగా ఉంటూ రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చేందుకు కార్యకర్తలు చేసిన కృషిని, పార్టీతో వారి అనుబంధాన్ని గుర్తు చేస్తూ.. తెలంగాణ అభివృద్ధి ప్రస్థానం అందరికీ అర్థమయ్యేలా వివరించాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు రాష్ట్రం పట్ల చూపిస్తున్న వివక్షపై ఆత్మీయ సమ్మేళనాల్లో ప్రత్యేకంగా చర్చించాలన్నారు. ఏప్రిల్ 20 నాటికి ఆత్మీయ సమ్మేళనాలు పూర్తి చేసి, 25న నియోజకవర్గ స్థాయిలో బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. 1,000 నుంచి 1,500 మంది పార్టీ ప్రతినిధులతో ఈ సమా వేశాలు జరుగుతాయని తెలిపారు. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్ని గ్రామాలు, వార్డుల్లో జెండా పండుగ కార్యక్రమం ఉంటుందన్నారు. ప్లీనరీకి ఆహ్వానం అందిన ప్రతినిధులు హాజరు కావాలని కేటీఆర్ సూచించారు. -
వాళ్లవి దివాళాకోరు రాజకీయాలు
సాక్షి ప్రతినిధి, వరంగల్: దేశంలో, రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దివాళాకోరు రాజకీయాలకు పాల్పడుతున్నాయని.. పచ్చటి తెలంగాణను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కె.తారక రామారావు మండిపడ్డారు. ఆ రెండు పార్టీలు ప్రజల బాగోగులను ఏనాడూ పట్టించుకోలేదని.. అంబానీలు, అదానీలకు ఊడిగం చేయడంలోనే మునిగిపోయాయని ఆరోపించారు. దేశాన్ని, రాష్ట్రాన్ని ఎక్కువకాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ.. కరువు, కరెంటు కోతలు, దారిద్య్రాన్ని మిగిల్చిందని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అరాచకపాలనను ప్రశ్నిస్తే దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. సోమవారం హనుమకొండ జిల్లా వేలేరు మండలం సోడాషపల్లిలో సుమారు రూ.152 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం సోడాషపల్లి క్రాస్రోడ్లో నిర్వహించిన రైతు కృతజ్ఞత సభలో ప్రసంగించారు. కేటీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘కొందరు రాజకీయ నిరుద్యోగులు పనికిమాలిన పాదయాత్రలు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒక్క చాన్స్ ఇవ్వండి అని పీసీసీ అధ్యక్షుడు అడుక్కుంటున్నాడు. మీ దిక్కుమాలిన పార్టీకి ప్రజలు 10 చాన్సులు ఇచ్చారు. ఏం చేశారు? గుడ్డి గుర్రాల పళ్లు తోమారా? కరెంట్, సాగు, తాగునీరు ఇవ్వలేదు. ఇప్పుడేమో ఎగతాళిగా మాట్లాడుతూ.. ఒక్క చాన్స్ ఇవ్వండి అని అడుక్కుంటే మీకు ఓటెయ్యాలా? రేవంత్రెడ్డి రెచ్చగొట్టే మాటలను ఎవరూ నమ్మరు. మతం పేరుతో మంటపెడ్తున్న బీజేపీ బీజేపీ మతం పేరుతో మంటలు రేపుతూ, కులం పేరిట కుంపట్లు పెడుతూ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తోంది. కేంద్రంలో అరాచక పాలన సాగిస్తున్న బీజేపీని విమర్శిస్తే దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తున్నారు. ఇలాంటి దాడులకు భయపడేది లేదు. ఎందాకైనా పోరాడుతాం. అన్నింటి ధరలు పెంచి ప్రజలపై భారం మోపినందుకు మోదీని దేవుడని అనాలా? బండి సంజయ్ ఏం మాట్లాడుతాడో ఎవరికీ అర్థం కాదు. కిషన్రెడ్డికి మెదడు మోకాళ్లలో ఉందో, అరికాళ్లలో ఉందో అర్థం కాదు. ప్రజలంతా మా కుటుంబమే.. కేసీఆర్ను విమర్శించేందుకు విపక్షాలకు ఏ కారణమూ దొరకక కుటుంబ పాలన అని విమర్శలు చేస్తున్నారు. బరాబర్ చెప్తున్నా.. మాది కుటుంబ పాలనే.. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలంతా మా కుటుంబ సభ్యులే. ప్రతి కుటుంబంలో కేసీఆర్ భాగస్వామే. 65లక్షల మందికి పెట్టుబడి సాయం ఇచ్చి రైతులందరికీ పెద్దన్న అయ్యారు. 45లక్షల మందికి ఆసరా పెన్షన్లతో వృద్ధులను కడుపులో పెట్టుకున్నారు. 12 లక్షల మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ఇచ్చి పేదింటి ఆడబిడ్డలకు మేనమామ అయ్యారు. ఇందులో కులం పంచాయతీ లేదు. మతం పిచ్చి లేదు. జనహితమే మా అభిమతంగా పని చేస్తున్నాం. పల్లె ప్రగతి ద్వారా గ్రామాలు, పట్టణాలు బాగు పడుతున్నాయి. సీఎం కేసీఆర్ ముందు చూపుతో పంజాబ్, హరియాణాలతో తెలంగాణ రైతులు పోటీ పడుతున్నారు..’’అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ఎంపీలు పసునూరి దయాకర్, మాలోతు కవిత, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు టి.రాజయ్య, దాస్యం వినయభాస్కర్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, అరూరి రమేష్, వొడితెల సతీశ్కుమార్, శంకర్నాయక్ తదితరులు పాల్గొన్నారు. నిందితుడు సైఫ్ అయినా.. సంజయ్ అయినా వదలం.. పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి మృతిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం, పార్టీపరంగా ప్రీతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. కాలేజీలో జరిగిన ర్యాగింగ్ వల్ల మనస్తాపానికి గురై డాక్టర్ ప్రీతి చనిపోవడం చాలా బాధాకరమని.. కానీ ఈ విషయాన్ని కొందరు అనవసరంగా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘నిందితులు ఎవరైనా, ఎంతటివారైనా వదిలేది లేదు. నిందితుడు సైఫ్ అయినా.. సంజయ్ అయినా వదిలిపెట్టబోం..’’అని వ్యాఖ్యానించారు. -
శత్రుదేశంపై దండయాత్రలాగా తెలంగాణపైకి ఉసిగొల్పుతున్నారు: కేటీఆర్
భూపాలపల్లి: ‘శత్రుదేశం మీద కక్ష గట్టి దండయాత్రకు దిగినట్లుగా.. ప్రధాని నరేంద్ర మోదీ వేట కుక్కల్లాంటి కేంద్ర సంస్థలను తెలంగాణపైకి ఉసిగొల్పుతున్నారు. పీఎం మోదీ దేవుడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అంటాడు. అదానీకి దేవుడా? లేక ఆయనకు దేవుడా? ఒక్క చాన్స్ ఇవ్వాలని అడుగుతున్న కాంగ్రెస్ పార్టీకి 75 ఏళ్లలో పదిసార్లు అవకాశం ఇస్తే అభివృద్ధి జరిగిందా?..’అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రశ్నించారు. భూపాలపల్లి నియోజకవర్గంలో రూ.276 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు గురువారం ఆయన ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడారు. పదిసార్లు గెలిపిస్తే సోయి లేదా? ‘టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి రానున్న ఎన్నికల్లో ఒక్క చాన్స్ ఇవ్వండి అంటూ అడుక్కుంటున్నాడు. 75 ఏళ్లలో పదిసార్లు గెలిపిస్తే సోయి లేదా.. గుడ్డి గుర్రాల పళ్లు తోమారా?.. ఇవ్వాళ మళ్లీ మొరుగుతున్నారు. కాంగ్రెస్ హయాంలో అర్ధరాత్రి కరెంట్, పేలిపోయిన మోటార్లు, కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు, పాము కాట్లు, విద్యుత్ షాక్తో రైతులు మృతి చెందిన సంఘటనలు ఎన్నో చూశాం. మనిషి చచ్చిపోతే దహనం అనంతరం స్నానం చేసేందుకు కరెంటు సరఫరా కోసం బతిమిలాడే పరిస్థితి ఉండేది. సమైక్య ఆంధ్రప్రదేశ్లో గరిష్టంగా 13,662 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా.. ఇప్పుడు ఒక్క తెలంగాణలోనే 14,700 మెగావాట్ల డిమాండ్ ఉందంటే రాష్ట్రం ఏమేరకు అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు..’అని మంత్రి అన్నారు. మాది వసుదైక కుటుంబ పాలన.. ‘రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అక్కడ బీజేపీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణలో రాజ్యాంగ బద్ధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆ పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేస్తే రకరకాల మాటలు మాట్లాడతారా? మీరు చేస్తే సంసారం.. మేము చేస్తే వ్యభిచారమా?. ప్రజల మనసులను గెలవాలంటే ఏం చేశామో, ఏం చేస్తామో చెప్పాలే తప్ప ఇష్టమొచ్చినట్లు మాట్లాడకూడదు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రతి ఒక్కరికీ కావాల్సిన పథకాలు అందిస్తూ ఒక మామలా, అన్నలా, పెద్ద కొడుకులా, తాతలా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలోని 4 కోట్ల మందీ కేసీఆర్ కుటుంబమే. మాది వసుదైక కుటుంబ పాలన..’అని చెప్పారు. పార్టీ పేరు మాత్రమే మారింది.. ‘ఎన్నికల యుద్ధానికి యువత సిద్ధం కావాలి. పార్టీ పేరు మాత్రమే మారింది. డీఎన్ఏ రంగు, గుర్తు కూడా అలాగే ఉంది. వ్యవసాయం, విద్యుత్, విద్య, వైద్య రంగాల్లో తెలంగాణ మాదిరిగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టారు. నిన్న, మొన్న వచ్చిన కొంతమంది చిల్లరగాళ్లు ఏవేవో మాట్లాడుతున్నారు. వాళ్ళకు కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా సమాధానం ఇవ్వాలి. ఆ పార్టీలు పిచ్చోళ్ల చేతిలో ఉంటే తెలంగాణ ఆగమైతది. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేదా? మీకు పదవులు వచ్చేవా?’అని కేటీఆర్ ప్రశ్నించారు. సభలో మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్రావు, జి.జగదీశ్రెడ్డి, ఎంపీ దయాకర్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. -
రాష్ట్రంపై ‘శత్రు’ వైఖరి: మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కోసం ఎన్ని ప్రతిపాదనలు పంపినా పట్టించుకోవడం లేదని మంత్రి కె.తారక రామారావు విమర్శించారు. హైదరాబాద్లో మెట్రోరైలు విస్తరణకు ఉన్న డిమాండ్పై ఏమాత్రం స్పందించడం లేదని.. మరోవైపు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని నగరాలలో మెట్రో ప్రాజెక్టులకు కేంద్ర వాటాతో పాటు సావరిన్ గ్యారంటీల పేరిట పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందని మండిపడ్డారు. అయినా హైదరాబాద్ ప్రజల ఆకాంక్ష, పెరుగుతున్న నగర అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వమే మెట్రో ప్రాజెక్టు విస్తరణ కోసం కృషి చేస్తోందని చెప్పారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా శనివారం ప్రశ్నోత్తరాల సమయంలో మెట్రో రైలు ప్రాజెక్టు పొడిగింపు అంశంపై సభ్యులు అరికపూడి గాంధీ, దానం నాగేందర్, ప్రకాశ్గౌడ్, భట్టి విక్రమార్క.. చార్మినార్ పాదచారుల ప్రాజెక్టు (సీపీపీ)పై ఎంఐఎం సభ్యులు.. ఎస్ఎన్డీపీపై దానం నాగేందర్, వివేకానంద అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానాలు ఇచ్చారు. కోటీ 20లక్షల మంది నివసిస్తున్న హైదరాబాద్కు నిధులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వానికి మనసు రావడం లేదని, శత్రుదేశంపై పగబట్టినట్టుగా తెలంగాణపై కక్షగట్టి వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అసెంబ్లీలో కేటీఆర్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘కాంగ్రెస్ హయాంలో చేపట్టిన మెట్రో ప్రాజెక్టు ఒప్పందం మేరకే ప్రస్తుతం మూడు కారిడార్లలో ఎల్అండ్టీ సంస్థ ద్వారా నిర్వహణ ప్రక్రియ కొనసాగుతోంది. రూ.6,250 కోట్లతో ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరణకు శ్రీకారం చుట్టాం. రాయదుర్గ్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు ఈ ఎక్స్ప్రెస్ మెట్రోను మూడేళ్లలో పూర్తిచేయనున్నాం. హైదరాబాద్ మెట్రో ఉద్యోగాల్లో 80 శాతం వరకు తెలంగాణ వాళ్లే ఉన్నారు. కాంగ్రెస్ హయాంలో కుదిరిన ప్రైవేట్, పబ్లిక్ పార్ట్నర్షిప్ ఒప్పందంలో భాగంగా మెట్రో టికెట్ ధరలను పెంచుకునే అధికారాన్ని నిర్వహణ సంస్థకే ఇచ్చారు. అయినా ఇష్టానుసారం ధరలు పెంచకూడదని ప్రభుత్వం తరఫున చెప్పాం. ఆర్టీసీ ధరలతో పోల్చి మెట్రో టికెట్ ధరలు ఉండాలన్నాం. పాతబస్తీలో మెట్రో రైలు ప్రాజెక్టును పొడిగించే విషయంలో ఇటీవలే ఎంఐఎం నేత అక్బరుద్దీన్తో సమావేశమయ్యాను. ముందుగా రూ.100 కోట్లతో రోడ్ల విస్తరణ పూర్తిచేసి పనులు చేపట్టనున్నాం. హైదరాబాద్ ఆత్మ ఎప్పటికీ చెదిరిపోదు హైదరాబాద్ సాంస్కృతిక వైభవాన్ని కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది. చార్మినార్ సంరక్షణ కోసం పాదచారుల ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. ఎన్ని అధునాతన భవంతులు వెలిసినా హైదరాబాద్ ఆత్మ ఎప్పటికీ చెదిరిపోదు. మూసీనదిపై అఫ్జల్గంజ్ వద్ద ఐకానిక్ పెడస్ట్రియన్ బ్రిడ్జి నిర్మాణం కోసం టెండర్లు పిలిచాం. మరో పెడస్ట్రియన్ బ్రిడ్జిని నయాపూల్ వద్ద నిర్మించే యోచనలో ఉన్నాం. గుల్జార్హౌస్, మీరాలం మండి, ఆషుర్ ఖానాకు పూర్వవైభవం తీసుకొస్తున్నాం. మదీనా నుంచి పత్తర్ఘట్టి వరకు పనులు పూర్తికావొచ్చాయి. పాతబస్తీలో సుందరీకరణ, సెంట్రల్ లైటింగ్ పనులు చేపట్టాం. చార్మినార్ నుంచి దారుల్–ఉలం స్కూల్ వరకు రోడ్డు వెడల్పు పనులు పూర్తయ్యాయి. హుస్సేనీ ఆలం నుంచి దూద్బౌలి వరకు విస్తరణ పనులు జరుగుతున్నాయి. హెరిటేజ్ భవంతుల పూర్వ వైభవం కోసం ఎంత ఖర్చయినా వెనుకాడబోం. ఎస్ఎన్డీపీ ఏ నగరంలోనూ లేదు హైదరాబాద్లో రూ.985.45 కోట్లతో వ్యూహాత్మక నాలాల అభివృద్ధి (స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎస్ఎన్డీపీ)) చేపట్టాం. జీహెచ్ఎంసీ పరిధిలో 35 పనులకు 11 పూర్తిచేశాం. పరిసర మున్సిపాలిటీల్లో 21 పనులకుగాను 2 పూర్తిచేశాం. నగరంలో వందేండ్ల క్రితం నిర్మించిన నాలాలే ఉన్నాయి. పలుచోట్ల నాలాలపై 28వేల మంది పేదలు ఇండ్లు కట్టుకున్నారు. ప్రస్తుతం ఎస్ఎన్డీపీ ఫేజ్–2కు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. పలు కాలనీల్లో గత వర్షాకాలంలో ముంపు సమస్య కొంతమేర తగ్గింది..’’ అని కేటీఆర్ వివరించారు. 9 నెలల్లో పిల్లలు వస్తారు – మీరు రారు! సభలో మొదట సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో మెట్రోరైలు ప్రాజెక్టు వచ్చిందని, కానీ ఇప్పుడు ఆదాయాన్ని మొత్తంగా నిర్వహణ సంస్థకే దోచిపెడుతున్నారని ఆరోపించారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. ‘‘60 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆమాత్రం చేయలేరా?’’ అని నవ్వుతూ అంటూనే.. ‘‘మాట్లాడితే తొమ్మిది నెలల్లో మేం వస్తాం అంటున్నారు. తొమ్మిది నెలల్లో పిల్లలు వస్తారు. మీరు రారు’’ అని వ్యాఖ్యానించారు. దీనితో సభలో అంతా ఒక్కసారిగా ఘొల్లుమన్నారు. ఇక సంగారెడ్డి మెట్రో ప్రాజెక్టు గురించి జగ్గారెడ్డి అడుగుతున్న విషయాన్ని కేటీఆర్ ప్రసంగం తర్వాత గుర్తుచేయగా నవ్వుతూ.. ‘‘9 నెలల్లో వస్తారుగా.. అప్పుడు చూసుకోండి’’ అని పేర్కొన్నారు. అప్పటికే మైక్ ఆపేయడంతో ఆ మాటలు రికార్డులకు ఎక్కలేదు. ప్రతిపాదనలన్నీ వెనక్కే.. కోటీ 20లక్షల మంది నివసిస్తున్న హైదరాబాద్కు నిధులు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం శత్రుదేశంపై పగబట్టినట్టుగా తెలంగాణపై కక్షగట్టి వ్యవహరిస్తోంది. హైదరాబాద్లో మెట్రో పొడిగింపు కోసం కేంద్ర ప్రభుత్వ వాటా ఇవ్వాలని కేంద్ర మంత్రిని కలుద్దామంటే అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. అధికారులను పంపించినా సానుకూల స్పందన రాలేదు. ఢిల్లీ మెట్రో అధికారులతో హైదరాబాద్ మెట్రో ఆడిటింగ్ చేయించాం. హైదరాబాద్ ఎయిర్పోర్టు ఎక్స్ప్రెస్ మెట్రోకు కేంద్ర ప్రభుత్వ సాయం కోరితే వయబిలిటీ లేదని, ఇతర కారణాలు చూపుతూ నిధులు కేటాయించడం లేదు. వడ్డించేవాళ్లు మనవాళ్లయితే అన్నట్టుగా కేంద్రం వ్యవహరిస్తోంది. బెంగళూరు మెట్రోకు కేంద్రం 20 శాతం వాటాతోపాటు రూ.29వేల కోట్లకుపైగా సావరిన్ గ్యారెంటీ ఇచ్చింది. చెన్నై మెట్రోకు కేంద్రం వాటా, సావరిన్ గ్యారంటీ కలిపి రూ.58,795 కోట్లు కేటాయించింది. యూపీ లోని ఆరు పట్టణాలకు 20 శాతం వాటాతో పాటు సావరిన్ గ్యారంటీ ఇస్తోంది. – మంత్రి కేటీఆర్ -
కోట్ల వసూళ్లకు పాల్పడుతున్నాడు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం అసెంబ్లీలో పద్దుల గురించి చర్చ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు ధరణికి సంబంధించి లేవనెత్తిన అంశాలపై మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకుంటూ రేవంత్తో సహవాసంతో సభలోని కాంగ్రెస్ సభ్యులు కూడా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ అరాచకంగా, అడ్డగోలుగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ‘‘ఆయన ఏం భాష మాట్లాడుతున్నాడు? ఒక పార్టీ అధ్యక్షుడు మాట్లాడే భాషేనా అది? ముఖ్యమంత్రి ఎవరు అయితే వారు ప్రగతి భవన్లో ఉంటారు. అది అధికార నివాసం. అలాంటి ప్రగతి భవన్ను బాంబులతో పేల్చేస్తానని ఎలా మాట్లాడతాడు? కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి సహచర్యంతో శ్రీధర్బాబు సైతం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నిజానికి శ్రీధర్బాబు, భట్టి మంచివారే. కానీ పార్టీలో సహవాస దోషంతో ఇలా తయారయ్యారు. వాళ్ల అధ్యక్షుడు అడ్డగోలుగా మాట్లాడే అలవాటుతో వీళ్లు కూడా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. వాళ్ల అధ్యక్షుడు బ్లాక్మెయిల్ చేసి రూ. కోట్లకు కోట్లు వసూళ్లు చేస్తున్నాడు. ఇందుకోసం కొందరు విశ్రాంత తహసీల్దార్లు, ప్రైవేటు వ్యక్తులతో ఓ దఫ్తర్ (కార్యాలయం)నే తెరిచాడు. చివరకు సమాచార హక్కు చట్టాన్ని కూడా ఆదాయ మార్గంగా మార్చుకున్నాడు. అట్లాంటి వాళ్లకు ధరణితో ఇబ్బందులు అనిపిస్తాయి... సాధారణ ప్రజలకు కాదు. ధరణి రద్దు, ప్రగతి భవన్ పేల్చివేతే మీ విధానామా? ధరణిని రద్దు చేసి లంచాల కోసం రైతులను పీడించిన కాంగ్రెస్ హయాంలోని పద్ధతినే తేవాలనుకుంటున్నారా? ఏ విషయం చెప్పండి’’ అని కేటీఆర్ ప్రశ్నించారు. ధరణిని రద్దు చేయాలంటూ భట్టి, శ్రీధర్బాబు చేసిన డిమాండ్పై మంత్రి వేముల ప్రశాంతరెడ్డి జోక్యం చేసుకుని, ‘‘మరి మీ అధ్యక్షుడు ప్రగతి భవన్ను బాంబులతో పేల్చేస్తానంటున్నాడు. దానిపై సీఎల్పీ వైఖరి ఏమిటో కూడా చెబితే బాగుంటుంది’’ అని పేర్కొన్నారు. లోపాలపుట్ట ధరణి.. దాన్ని రద్దు చేయాలి: భట్టి, శ్రీధర్బాబు పేదలను ముప్పుతిప్పలు పెడుతున్న ధరణి పోర్టల్ను రద్దు చేయాలని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క, ఆ పార్టీ సభ్యుడు దుద్దిళ్ల శ్రీధర్బాబు డిమాండ్ చేశారు. పద్దులపై చర్చలో భాగంగా వారు ఈ అంశాన్ని ప్రస్తావించారు. భూముల పట్టాకు సంబంధించి గతంలో ఉన్న చాలా కాలమ్స్ను తొలగించి ధరణిని తీసుకొచ్చారని, ఇది పేదల తీవ్ర ఇబ్బందిగా మారిందని వారు పేర్కొన్నారు. పట్టా రికార్డుల్లో దశాబ్దాలుగా పేరు ఉన్నప్పటికీ ధరణిలో కాస్తు కాలమ్ను తొలగించడంతో చాలా మంది భూమి హక్కులు కోల్పోవాల్సి వచ్చిందన్నారు. ఆ భూములు బడా బాబుల పరమయ్యాయని భట్టి, శ్రీధర్బాబు ఆరోపించారు. కొంత భూభా గానికి సంబంధించి ఏదైనా సమస్య ఏర్పడితే మొత్తం సర్వే నంబర్నే నిషేధిత జాబితాలో ఉంచుతున్నారని విమర్శించారు. గతంలో అసైన్ చేసిన భూములను కూడా ఇప్పుడు వెనక్కు తీసుకొని వేలం ద్వారా బడాబాబులకు కేటాయిస్తున్నారని శ్రీధర్బాబు ఆరోపించారు. ఫార్మాసిటీ కోసం పేదల భూములను ఎకరా రూ. 8 లక్షలకు తీసుకొని రూ. 1.30 కోట్లకు ఎకరం చొప్పున బడా బాబులకు కట్టబెట్టారని ఆరోపించారు. ధరణితో ప్రజల్లో సంతోషం: మంత్రి ప్రశాంత్రెడ్డి ధరణి పోర్టల్పై కాంగ్రెస్ సభ్యుల ఆరోపణలను మంత్రి ప్రశాంత్రెడ్డి తోసిపుచ్చారు. సాధారణ ప్రజలు ధరణితో పూర్తి సంతోషంగా ఉన్నారని, అది అందుబాటులోకి వచ్చిన తర్వాత 24 లక్షల లావాదేవీలు జరిగాయని చెప్పారు. ధరణిని రద్దు చేసి మళ్లీ లంచాల బాగోతం, ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులను ఎందుకు కోరుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ తీరుపై ప్రజలే నిర్ణయం తీసుకుంటారన్నారు. అయితే ధరణి బాధలు ఏమిటో క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలిస్తే తెలుస్తాయని, ఓ తహసీల్దార్ను హత్య చేసే వరకు సమస్య ఏర్పడిందంటే సమస్య తీవ్రత తెలియడం లేదా? అని భట్టి ప్రశ్నించారు. నిరూపించకుంటే శ్రీధర్బాబు క్షమాపణ చెప్పాలి.. శ్రీధర్బాబు చేసిన ఆరోపణలను మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. అలా ఎకరం కాదుకదా.. కనీసం ఒక్క గజం ఇచ్చినట్లు నిరూపించాలని, లేనిపక్షంలో శ్రీధర్బాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ను కోరారు. ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోని శ్రీధర్బాబు... ధర విషయంలో తాను చెప్పింది తప్పయితే ఎంతకు ఇచ్చారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. భూసంబంధిత సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైతే వేరే వ్యవస్థలు పుట్టుకొస్తాయని, ఇది మంచి పరిణామం కాబోదని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. -
బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభోత్సవానికి కేటీఆర్ గైర్హాజరు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్లో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం మధ్యాహ్నం ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి బీఆర్ఎస్ జాతీయ విధానాన్ని ఆవిష్కరించనున్నారు. అయితే, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి కేటీఆర్ హాజరుకాలేకపోతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. జపాన్ బిజినెస్ వరల్డ్ లీడర్స్తో సమావేశం ఉన్న నేపథ్యంలో కేటీఆర్ ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్నారు. ఈ క్రమంలోనే జపాన్ కంపెనీ బోష్ ఆఫీస్ ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు కేటీఆర్.ఇందుకోసం సీఎం కేసీఆర్ అనుమతి తీసుకున్నారు. ఇదీ చదవండి: KCR BRS: మరో ప్రస్థానం -
పార్లమెంటుకు అంబేడ్కర్ పేరు పెట్టాలి
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలో కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఈ మేరకు మంగళవారం మంత్రి కేటీఆర్ శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ వచ్చింది. ఆయన చూపిన బాటలోనే నడుస్తున్నాం. అంబేడ్కర్తత్వాన్ని టీఆర్ఎస్ ఆచరణలో చూపింది. అంబేడ్కర్ లక్ష్యం సమానత్వం. ఆయన భాషా ఆధిపత్యం, ప్రాంతీయ ఆధిపత్యంతోపాటు అన్నిరకాల ఆధిపత్యాలకు వ్యతిరేకంగా పోరాడారు. ఆయనలా సమగ్రంగా సమాజాన్ని అర్థం చేసుకున్నవారు ఎవరూ లేరు. తాను రాసిన రాజ్యాంగం దుర్వినియోగమైతే దాన్ని తానే ముందుగా తగలబెడతానని అంబేడ్కర్ అన్నారు. దేవుడు కోసం గుడి కడితే... దెయ్యాలు ముందే వచ్చి కూర్చుంటే గుడిని ధ్వంసం చేయక తప్పదు. అంబేడ్కర్ కొన్ని కులాలు, వర్గాలకు మాత్రమే ప్రతినిధి కాదు. ఆయన మహాత్ముడితో సరిసమాన వ్యక్తి. అంబేడ్కర్ మహిళలకు కూడా సమాన హక్కులుండాలన్నారన్నారు. ఆ బిల్లు ఆమోదం పొందకపోవడంతో రాజీనామా చేశారన్నారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతీక పార్లమెంట్. దానికి ఆ పేరు పెట్టడానికి ఇంతకు మించిన వ్యక్తి లేరు. అందుకే అంబేడ్కర్ పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం’అని ఆ తీర్మానంలో కోరారు. ఏకగ్రీవ ఆమోదం కాంగ్రెస్ సభాపక్ష నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానానికి పూర్తి మద్దతు ఇస్తున్నామన్నారు. ఈ దేశంలో స్వేచ్ఛ లేదని, ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడితే ఐటీ, ఈడీ దాడులతో భయపెడుతున్నారని ఆరోపించారు. ఈ దేశ సంపద కొన్ని వర్గాలకు మాత్రమే అందుతోందన్నారు. ఈ దేశంలో సోదరభావం లేకుండా పోయిందని ఆరోపించారు. పార్లమెంట్కు అంబేడ్కర్ పేరు పెడితే.. ఈ దేశ నిర్మాణం సరిగ్గా సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పంజగుట్టలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎంఐఎం కూడా ఈ తీర్మానానికి మద్దతు తెలిపింది. అనంతరం పార్లమెంటుకు అంబేడ్కర్ పేరు పెట్టాలనే ప్రతిపాదనకు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. జనవరిలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ తమ తీర్మానానికి మద్దతు తెలిపిన భట్టి, ఇతర నేతలకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ కూడా ఈ తీర్మానానికి మద్దతు తెలిపితే బాగుండేదన్నారు. పంజగుట్టలో విగ్రహం ఏర్పాటు అంశంపై కేటీఆర్ స్పందిస్తూ... గతంలో విగ్రహాలు పెట్టిన విషయాన్ని తానేమీ కాదనడం లేదని, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అయినా ట్యాంక్బండ్ సమీపంలో 125 అడుగుల విగ్రహాన్ని పెడుతున్నామని, ప్రస్తుతం విగ్రహ నిర్మాణం సాగుతోందన్నారు. జనవరిలో ఆ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని చెప్పారు. ఇదీ చదవండి: ఆనాటి తారకరాముడి డైలాగ్తో అదరగొట్టిన కేటీఆర్.. అసెంబ్లీలో చప్పట్ల మోత! -
రోడ్లపై రయ్.. రయ్..
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక కార్ల రేసింగ్ ఈవెంట్ ‘ఫార్ములా ఈ– రేసింగ్’(ఈ–ప్రిక్స్)కు ఆతిథ్యం ఇచ్చేందుకు హైదరాబాద్ నగరం సిద్ధమవుతోంది. ఫార్ములా ఈ–చాంపియన్షిప్ తొమ్మిదో సీజన్ (2022–23)లో భాగంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 11వ తేదీన నగరంలో ఈ–రేసింగ్ (సింగిల్ సీట్ ఎలక్ట్రిక్ వాహనాలకు నిర్వహించే పోటీలు) జరగనుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం మేనేజింగ్, ఎగ్జిక్యూటివ్ కమిటీలను ఏర్పాటు చేసింది. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు చైర్మన్గా మేనేజింగ్ కమిటీని, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఎంఏయూడీ (అర్వింద్కుమార్) చైర్మన్గా ఎగ్జిక్యూటివ్ కమిటీని నియమించారు. ఈ మేరకు సోమవారం అర్వింద్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. దేశంలో ఏబీబీ ఎఫ్ఐఏ ఫార్ములా ‘ఈ–రేసింగ్’కు ఆతిథ్యం ఇస్తున్న తొలి నగరంగా హైదరాబాద్ రికార్డు సృష్టించనుంది. 2011 నుంచి 2013 వరకు గ్రేటర్ నోయిడాలోని బుద్ధ్ అంతర్జాతీయ సర్క్యూట్లో ఫార్ములా వన్ రేసు జరిగిన తర్వాత దేశంలో జరగబోయే రెండో అతి పెద్ద రేసింగ్ ఈవెంట్ ఇదే కావడం గమనార్హం. సర్క్యూట్లలో కాదు.. వీధుల్లో రోడ్లపైనే ఫార్ములా వన్ రేసులు ప్రత్యేకంగా నిర్మించిన పర్పస్ బిల్డ్ (తాత్కాలిక) సర్క్యూట్లలో జరుగుతాయి. అయితే ఫార్ములా ఈ–ప్రిక్స్ మాత్రం నగర వీధుల్లోని రోడ్లపైనే జరుగుతాయి. మోటార్ స్పోర్ట్ అభిమానులకు వినోదం పంచడంతో పాటు ఎలక్ట్రిక్ వాహన వినియోగాన్ని ప్రోత్సహించేందుకు వీటిని నిర్వహిస్తున్నారు. వచ్చే ఫిబ్రవరి 11న హైదరాబాద్లోని హుస్సేన్సాగర్ చుట్టూ నెక్లెస్ రోడ్డులో సచివాలయం కాంప్లెక్స్, లుంబినీ పార్కు మీదుగా ఏర్పాటు చేసిన 2.37 కిలోమీటర్ల ట్రాక్ మీద ఈ–రేసింగ్ సాగనుంది. భారత్ తరఫున బరిలో ‘మహీంద్రా’ విద్యుత్ కార్లతో జరిగే ఈ తొమ్మిదో సీజన్ రేసింగ్ పోటీలకు ఆతిథ్యం ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ సంవత్సరం జనవరిలో ‘ఫార్ములా ఈ’సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. కాగా రేసింగ్ చాంపియన్షిప్ క్యాలెండర్ను గత జూన్ 29న ఎఫ్ఐఏ (ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి–ఎల్ ఆటోమొబైల్ ) వరల్డ్ మోటార్ స్పోర్ట్స్ కౌన్సిల్ ఆమోదించింది. సుమారు పదేళ్ల క్రితం గ్రేటర్ నోయిడాలోని బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో నిర్వహించిన ఫార్ములా వన్ పోటీల ద్వారా ప్రపంచ మోటార్ స్పోర్ట్స్ మ్యాప్లోకి భారత్ ప్రవేశించింది. వచ్చే ఏడాది జరిగే ఈ–రేసింగ్ నిర్వహణకు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా రేసింగ్కు ఆతిథ్యం ఇస్తున్న 13 నగరాల్లో ఒకటిగా హైదరాబాద్ నిలిచింది. ఈ రేసింగ్లో భారత్ నుంచి మహీంద్రా కంపెనీకి చెందిన ‘మహీంద్ర రేసింగ్’జట్టు పోటీ పడుతోంది. మేనేజింగ్ కమిటీలో.. చైర్మన్గా మంత్రి కేటీఆర్,సభ్యులుగా మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, మహీంద్రా రేసింగ్ టీమ్ ప్రిన్సిపాల్, సీఈవో దిల్బాగ్ గిల్, ఏస్ అర్బన్ రేస్ ఏండీ అండ్ సీఈవో, ఎఫ్ఐఏ ప్రతినిధి, కమిటీ నిర్ణయించిన ముగ్గురు నిపుణులు లేదా బ్రాండ్ అంబాసిడర్లు, చైర్మన్ నిర్ణయం మేరకు ఇతర సభ్యుడు, మెంబర్ కన్వీనర్గా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ఉంటారు. ఎగ్జిక్యూటివ్ కమిటీలో చైర్మన్గా ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (ఎంఏయూడీ), సభ్యులుగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్, జాయింట్ సీపీ ట్రాఫిక్, ఏస్ అర్బన్ గ్రీన్కో గ్రూప్ ఎండీ, అర్బన్ రేస్ నుంచి ఇద్దరు ప్రతినిధులు, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ ప్రాజెక్టు డైరెక్టర్, ఎండీ, జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్, హెచ్ఎండీఏ సీఈ, టీఎస్ఎస్పీడీసీఎల్, ఆర్ అండ్ బీ, జీహెచ్ఎంసీ, వాటర్బోర్డు, కలెక్టరేట్ తదితర విభాగా లకు చెందిన అధికారులు ఉంటారు. -
ప్రగతిలో తెలంగాణ ప్రతిభ
సాక్షి, హైదరాబాద్: పారిశ్రామికంగా శరవేగంగా ముందుకు సాగుతూ తక్కువ కాలంలోనే తెలంగాణ ప్రగతిశీల రాష్ట్రాల సరసన నిలబడే స్థాయికి చేరిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. రాష్ట్ర పురోగతి లక్ష్యంగా సీఎం కేసీఆర్ అవలంబిస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలే ఇందుకు కారణమని చెప్పారు. తెలంగాణ పారిశ్రామిక, వాణిజ్య మండళ్ల సమాఖ్య (ఎఫ్టీసీసీఐ) ఆధ్వర్యంలో వివిధ అంశాల్లో ప్రతిభ కనబరిచిన పరిశ్రమలకు సోమవారం హెచ్ఐసీసీలో ఎక్సలెన్స్ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తోపాటు ఇతర రంగాల్లోనూ దూసుకుపోతుందని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా టీఎస్ ఐపాస్ చట్టం ద్వారా 15 రోజుల్లో పరిశ్రమలకు డీమ్డ్ అప్రూవల్ విధానాన్ని అమలుచేస్తున్నట్లు చెప్పారు. దేశంలో కొన్ని ప్రాంతాల్లో పెట్టుబడిదారులకు ఆశించిన గౌరవం లభించడం లేదని, కానీ తెలంగాణలో పారిశ్రామికవేత్తలను సంపద సృష్టికర్తలుగా, ఉద్యోగాల సృష్టికర్తలుగా గుర్తిస్తున్నామని అన్నారు. ఒక్కటీ లాకౌట్ పడలేదు.. అందరి అంచనాలను, సందేహాలను పటాపంచలు చేస్తూ ఎవరూ ఊహించని విధంగా దేశంలోనే 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందన్నారు. గుజరాత్లో సైతం ఈ ఏడాది వేసవిలో పవర్ హాలిడే ప్రకటించారని, ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వల్లనే తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. గతంలో అగ్రశ్రేణి రాష్ట్రాల్లో గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ఉండగా, ప్రస్తుతం ఈ జాబితాలో తెలంగాణ కూడా చేరిందన్నారు. పరిశ్రమల శాఖలో ప్రభుత్వ జోక్యాన్ని సాధ్యమైనంతవరకు తగ్గించినట్లు చెప్పారు. రాష్ట్రంలో గత ఎనిమిదేళ్లుగా ఒక్క పరిశ్రమ కూడా లాకౌట్ పడిన దాఖలాలు లేవన్నారు. రాష్ట్రంలో వ్యాపారులు, పెట్టుబడిదారులు సంతృప్తిగా ఉన్నారనేందుకు రాష్ట్రంలో రిపీట్ పెట్టుబడులు 24 శాతం ఉండటమే నిదర్శనమన్నారు. రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి నగరాల్లో సైతం పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. నాలుగేళ్లలోనే కాళేశ్వరం రికార్డుస్థాయిలో కేవలం నాలుగేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేసినట్లు కేటీఆర్ చెప్పారు. దీనిద్వారా 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, ఈ నీటితో వివిధ ప్రాంతాల్లో మొత్తం 184 టీఎంసీల సామర్థ్యం గల జలాశయాలను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. పాలమూరు రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులు కూడా త్వరలోనే పూర్తవుతాయన్నారు. భవిష్యత్తులో వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, డెయిరీ పరిశ్రమ, మాంసం ఉత్పత్తులు, వంట నూనెల ఉత్పత్తి తదితర రంగాలు అభివద్ధి చెందనున్నట్లు చెప్పారు. కోవిడ్ కారణంగా ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాల విడుదలలో కొంత జాప్యం జరిగిందని, ప్రస్తుతం పరిస్థితులు కుదుటపడినందున త్వరలోనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్తోపాటు ఎఫ్టీసీసీఐకి చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. కాకతీయ వైభవ సప్తాహంపై సమీక్ష కాకతీయ వైభవ సప్తాహం కార్యక్రమాల్లో అన్ని పార్టీలు, అన్ని రంగాలకు చెందిన వారు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ఈనెల ఏడు నుంచి వారంపాటు జరిగే ఈ కార్యక్రమాలపై ఆయన సోమవారం సమీక్షించారు. -
యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలుకు కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: విపక్షాల తరపున రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయనున్న మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్సిన్హా సోమవారం నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితి పాల్గొనాలని నిర్ణయించింది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారక రామారావుతో సహా కొంతమంది ఎంపీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని పార్టీ వర్గాల సమాచారం. యశ్వంత్ సిన్హాకు మద్దతునిస్తున్నట్లు అధికారికంగా టీఆర్ఎస్ నుంచి ప్రకటన రాకున్నా కేటీఆర్ నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమానికి హాజరవుతుండటం గమనార్హం. విపక్షాలతోనే టీఆర్ఎస్ పార్టీ ఉందనే సంకేతాలు పంపించడానికి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు హాజరవుతున్నట్లు సమాచారం. -
కేంద్రం తీరు మారితేనే ‘ఆత్మ నిర్భర్’ ఫలప్రదం
సాక్షి, హైదరాబాద్: పరిశ్రమల ఏర్పాటు విషయంలో, ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీరు మారాలని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె. తారక రామారావు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమం ఫలప్రదం కావాలంటే కేంద్రం ఆలోచనా విధానం మారాలని ఆయన అన్నారు. ఓట్లు్ల.. సీట్లు ఉన్నాయని, పెద్దన్న పాత్ర పోషిస్తున్నామని కేంద్రం పరిశ్రమలను ఇష్టారీతిన తరలించడం సరికాదని విమర్శించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలోని జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి (నిమ్జ్)లో సుమారు 512 ఎకరాల విస్తీర్ణంలో వెమ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేయనున్న సమీకృత రక్షణ వ్యవస్థల తయారీ కేంద్రానికి మంత్రి కేటీఆర్ బుధవారం భూమి పూజ నిర్వహించారు. వెమ్ టెక్నాలజీస్ చైర్మన్ వెంకటరాజు, రక్షణ శాఖ మాజీ మంత్రి పళ్లంరాజు, స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ వెమ్ టెక్నాలజీస్ భారతదేశపు లాక్హీడ్ మార్టిన్ (అమెరికా ఆయుధ కంపెనీ)గా ఎదుగుతుందన్న నమ్మకం తనకుందని అన్నారు. హైదరాబాద్, బెంగళూరులలో ఇప్పటికే కొన్ని రక్షణ రంగ పరిశ్రమలు ఉన్న నేపథ్యంలో.. ఈ రెండు నగరాల మధ్య రక్షణ రంగ తయారీ పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించేలా ఒక కారిడార్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి గతంలోనే ప్రతిపాదించామని తెలిపారు. ఈ పారిశ్రామిక కారిడార్ కారణంగా తెలంగాణ మాత్రమే కాకుండా ఏపీలోని కర్నూలు, అనంతపురం జిల్లాలకూ ప్రయోజనం చేకూరే అవకాశం ఉండగా.. కేంద్రం దాన్ని ఎకాఎకిన ఎలాంటి మౌలిక సదుపాయాలు లేని బుందేల్ఖండ్కు తరలించిందని, ఇది సరికాదని ఆన్నారు. స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలి వెమ్ టెక్నాలజీస్ నిమ్జ్లో ఏర్పాటు చేస్తున్న ఫ్యాక్టరీలో క్షిపణులు, ఆయుధాలు, రాడార్లు, యుద్ధ విమానాల విడిభాగాలన్నీ తయారవుతాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడితో పెట్టనున్న ఈ పరిశ్రమతో ప్రత్యక్షంగా రెండు వేల మందికి, పరోక్షంగా నాలుగు వేల మందికి ఉపాధి లభిస్తుందని కేటీఆర్ వివరించారు. ఇక్కడి పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత వెమ్ టెక్నాలజీస్ వంటి సంస్థలపై ఉందని అన్నారు. అవసరమైతే స్థానికులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి మరీ ఉద్యోగాల్లోకి తీసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిననిమ్జ్ ప్రాజెక్టుకు భూములిస్తున్న రైతులకు తగినంత పరిహారం ఇచ్చేందుకు కలెక్టర్లు అన్ని చర్యలూ తీసుకోవాలని చెప్పారు. స్వదేశీ క్షిపణి ‘అసిబల్’ తయారీకి సిద్ధం: వి.వెంకటరాజు 1988లో స్థాపితమైన వెమ్ టెక్నాలజీస్ పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో క్షిపణిని తయారు చేసేందుకు సిద్ధంగా ఉందని ‘అసిబల్’ పేరుతో తయారయ్యే ఈ క్షిపణి ప్రస్తుతం రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో వాడుతున్న జావెలిన్ తరహా క్షిపణి అని వెమ్ టెక్నాలజీస్ చైర్మన్ వెంకట రాజు తెలిపారు. ప్రైవేట్ రంగంలో తొలిసారి పూర్తిస్థాయి క్షిపణిని తయారు చేసిన కంపెనీగా వెమ్ రికార్డు సృష్టించనుందని ఆయన ‘సాక్షి’తో చెప్పారు. సృష్టికర్త బ్రహ్మ చేతి ఖడ్గం పేరు ‘అసి’ కాగా.. బల్లెం అనే అర్థంలో బల్ను ఉపయోగించి క్షిపణి పేరును అసిబల్గా నిర్ణయించినట్లు చెప్పారు. ఏడాదికి పదివేల క్షిపణులను తయారు చేసేందుకు సంస్థకు అనుమతులు ఉన్నాయని తెలిపారు. భవిష్యత్తులో స్వదేశీ టెక్నాలజీతో ఒక యుద్ధ విమానాన్ని, అత్యాధునిక స్నైపర్ ఆయుధాలు, డ్రోన్లు తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. -
ఆటోమొబైల్ హబ్గానూ ఎదుగుతాం
మణికొండ: ఇప్పటికే ఐటీ, ఫార్మా రంగాల్లో అగ్రగామిగా నిలిచిన హైదరాబాద్... రాబోయే రోజుల్లో ఆటోమొబైల్ టెక్నాలజీ రంగంలోనూ హబ్గా మారుతుందనే నమ్మకం తనకు ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి్ద శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. పెట్టుబడిదారులకు హైదరాబాద్ స్వర్గధామంగా నిలుస్తోందని, ప్రపంచంలోనే అత్యుత్తమ పెట్టుబడి నగరాల్లో హైదరాబాద్ ఏడవ స్థానంలో ఉందని చెప్పారు. అమెరికాలోని ఉత్తర కరోలినా రాష్ట్రానికి చెందిన అడ్వాన్స్ ఆటోపార్ట్స్ సంస్థ సోమవారం నార్సింగి మున్సిపాలిటీ కోకాపేటలో ఏర్పాటు చేసిన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ)ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భం గా కేటీఆర్ మాట్లాడుతూ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆటోపార్ట్స్కు సాఫ్ట్వేర్ను అందించే అతిపెద్ద సంస్థ దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్కు రావడం గర్వకారణమన్నారు. నేటి ఆధునిక యుగంలో ఆటోమొబైల్ అంటే నాలుగు చక్రాలపై కదిలే కంప్యూటరేనని... ప్రస్తుతం తయారవుతున్న వాహనాల్లో ఎన్నో ఎలక్ట్రానిక్ పరికరాలు, సాఫ్ట్వేర్లు ఉంటున్నాయని చెప్పారు. సమీప భవిష్యత్తులో ఆటోమొబైల్ రంగానికి సం బంధించిన అన్ని అవసరాలకు తమ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ప్రతిపాదిత ‘మొబిలిటీ వ్యాలీ’ కేంద్రబిందువుగా నిలుస్తుందన్నారు. అన్ని సౌకర్యాలు కల్పిస్తాం... రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు పెద్దపీట వేసి వారితో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తుండటం వల్లే ఇలాంటి సంస్థలు హైదరాబాద్కు వస్తున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. పెట్టుబడిదారులకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ తదితర నగరాలకన్నా భిన్నంగా అనేక రంగాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలుస్తుండటంతోనే రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని కేటీఆర్ అన్నారు. ఇలాంటి సంస్థలు వస్తే వేలాది మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని చెప్పారు. గత కొంతకాలంగా కరోనా వ్యాప్తి సంస్థలను కుంగదీసినా ప్రస్తుతం కంపెనీలన్నీ కుదుటపడి తిరిగి వ్యాపార విస్తరణ బాట పడుతున్నాయన్నారు. త్వరలోనే పెట్టుబడిదారులను ఆకర్షించేలా పెద్ద ఈవెంట్ను నిర్వహిస్తామన్నారు. దేశంలో జీసీసీ ఏర్పాటు వ్యూహాత్మకం... దేశంలో నైపుణ్య శక్తిని అందిపుచ్చుకుంటూ సంక్లిష్ట ప్రక్రియలు, వినూత్న కార్యక్రమాల్లో భాగమయ్యేందుకు జీసీసీ ఏర్పాటు ఓ వ్యూహాత్మక చర్య అని అడ్వాన్స్ ఆటోపార్ట్స్ సంస్థ సీఈఓ, ప్రెసిడెంట్ టామ్ గ్రీకో పేర్కొన్నారు. కోకాపేటలో ఏర్పాటు చేసుకున్న కార్యాలయంలో మొదటి విడతగా 430 మంది ఉద్యోగులు, 150 భాగస్వామ్య వనరుల సామర్ద్యం, 65 వేల చదరపు గజాల కార్యాలయం ఏర్పాటు చేశామన్నారు. రాబోయే రోజుల్లో మరింత విస్తరిస్తామన్నారు. స్థానికంగా ఉత్తమ ప్రతిభను ఆకర్షించాలని తమ సంస్థ చూస్తుందని, తమ కార్యాలయంలో ఉద్యోగులకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలను కల్పించామని సంస్థ ఎండీ మహేందర్ దుబ్బా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్, సంస్థ ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
కారు కౌంటర్ అటాక్.. అమిత్ షాపై విరుచుకుపడిన టీఆర్ఎస్ నేతలు
కేంద్ర హోంమంత్రి అమిత్షాపై రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్ నేతలు విరుచుకుపడ్డారు. అదే సమయంలో ప్రధాని మోదీపైనా విమర్శలు ఎక్కుపెట్టారు. జూటేబాజ్, బట్టేబాజ్లంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శనివారం తుక్కుగూడ సభలో టీఆర్ఎస్ పాలనపై అమిత్ షా చేసిన విమర్శలు, ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. ఆదివారం మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, తలసాని శ్రీనివాస్యాదవ్, ఎర్రబెల్లి దయాకర్రావు, వేముల ప్రశాంత్రెడ్డితో పాటు నేతలు జీవన్రెడ్డి, బాల్క సుమన్ మాటల దాడి చేశారు. అమిత్ షాను అబద్ధాల బాద్షాగా అభివర్ణించారు. రాష్ట్రం గురించి పచ్చి అబద్ధాలు వల్లె వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీని చేతగాని దద్దమ్మ అని ఆరోపించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. ఎన్నికలకు సిద్ధమంటూ సవాల్ విసిరారు. మరోవైపు టీఆర్ఎస్ దాడిని తిప్పి కొట్టేందుకు రాష్ట్ర బీజేపీ నేతలు ప్రయత్నించారు. బీజేపీ, టీఆర్ఎస్ల మాటల తూటాలతో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. సాక్షి, హైదరాబాద్: అసమర్థుడైన ప్రధానమంత్రి ఉండడం వల్లే దేశం అప్పుల పాలైందని, చేతకాని దద్దమ్మకు అధికారం ఇవ్వడంతో దేశంలో ధరలు భగభగమంటున్నాయని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత ఆందోళనకరంగా ద్రవ్యోల్బణం ఉందని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా లేనంతగా గ్యాస్ సిలిండర్ ధర మన దగ్గర ఉందని, పెట్రోల్, డీజిల్ ధరలకు అదుపే లేదని విమర్శించారు. 45 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత నిరుద్యోగం ఇప్పుడు దేశంలో ఉండటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ఆరున్నర దశాబ్దాల కాంగ్రెస్ హయాంలో రూ.56.69 లక్షల కోట్ల అప్పులు చేస్తే.. ఎన్డీఏ హయాంలోని ఎనిమిది సంవత్సరాల్లోనే రూ.100 లక్షల (కోటి) కోట్లు అప్పులు చేసిన ఘనత నరేంద్ర మోదీకి దక్కిందని చెప్పారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు సామాన్యుల నుంచి రూ.26.5 లక్షల కోట్లు పన్నుల రూపంలో వసూలు చేసిన మోదీ ప్రభుత్వం, ఇందులో నుంచి రూ.11.68 లక్షల కోట్ల మేరకు తన కార్పొరేట్ మిత్రుల బ్యాంకు రుణాలు మాఫీ చేసిందని మండిపడ్డారు. ఆదివారం తెలంగాణ భవన్లో మంత్రులు శ్రీనివాస్గౌడ్, సబితారెడ్డి, చామకూర మల్లారెడ్డి తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పైనా నిప్పులు చెరిగారు. నాలాయక్, జూటేబాజ్లంటూ మోదీ, షా పై తీవ్ర విమర్శలు చేశారు. వారిని గద్దె దించే రోజులు దగ్గరపడ్డాయన్నారు. ముఖ్యాంశాలు కేటీఆర్ మాటల్లోనే.. ఆదివారం తెలంగాణ భవన్లో మంత్రులు, ఎమ్మెల్యేలతో కలసి మీడియా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్ సింగరేణినీ అమ్మేసేటట్టున్నారు ఒకప్పుడు రైల్వే స్టేషన్లో చాయ్ అమ్ముకున్న వ్యక్తికి ప్రధాని పదవి ఇస్తే ఇప్పుడు రైల్వే స్టేషన్లనే అమ్మేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ ఒక్కొక్కటిగా అమ్ముకుంటున్న మోదీ ప్రభుత్వం.. విశాఖ ఉక్కు సంస్థను అమ్మేసింది. త్వరలో సింగరేణిని కూడా అమ్మేసేటట్టున్నారు. మత రాజకీయాలతో మభ్య పెట్టడం తప్ప బీజేపీ చేసిందేమీ లేదు. అప్పుల్లో ముందుంది బీజేపీ పాలిత రాష్ట్రాలే.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేరు అబద్ధాల బాద్షా అంటే సరిగ్గా ఉంటుంది. తుక్కుగూడకు వచ్చిన ఆయన అన్నీ తుక్కు మాటలు, పచ్చి అబద్ధాలు చెప్పి వెళ్లారు. తెలంగాణ అప్పుల పాలైందని షా అంటున్నాడు. అప్పులు చేసిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ కింది నుంచి ఐదో ది. పైన ఉన్న రాష్ట్రాలన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలే. డబుల్ ఇంజన్ అని మాటిమాటికీ చెప్పే బీజేపీ నేతలు.. డబుల్ ఇంజన్ ఉన్న రాష్ట్రాల్లో ఏం సాధించారో చెప్పాలి. ఆ రాష్ట్రాల్లో అప్పులు తప్ప చెప్పుకోడానికి ఇంకేం లేవు. మోదీ మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న గుజరాత్లో తాగునీటికి కటకట ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇప్పటివరకు 3.65 లక్షల కోట్లు పన్నుల రూపంలో కేంద్రానికి చెల్లిస్తే.. రాష్ట్రానికి ఇచ్చింది 1.68 లక్షల కోట్లు మాత్రమే. షా మాటలకు జనం నవ్వుకుంటున్నారు మోదీ హయాంలో కేవలం కార్పొరేట్ మిత్రులకు మాత్రమే అచ్ఛేదిన్. సామాన్యులకు మాత్రం చచ్చేదిన్. తెలంగాణ ప్రభుత్వం స్టార్టప్లతో నిరుద్యోగ యువతను ప్రోత్సహిస్తుంటే కేంద్రం.. ప్రభుత్వ రంగ సంస్థలను మూసేస్తూ ప్యాకప్ చెబుతోంది. అమిత్ షా నీళ్లు, నిధులు, నియామకాల గురించి మాట్లాడడం హాస్యాస్పదం. అబద్ధాల బాద్షాకు వాటి గురించి ఏమాత్రం అవగాహన లేదు. ఇక్కడి నేతలు తమకు తోచిన స్క్రిప్ట్ రాసిస్తే ఆయన చదివి వెళ్లిపోయాడు. కేంద్రంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయకుండా రాష్ట్రంలోని ఉద్యోగ ఖాళీల గురించి మాట్లాడితే జనాలు నవ్వుకుంటున్నారు. బీజేపీవన్నీ జూటా, బట్టేబాజ్ మాటలే.. రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను యాభై పెసలు పెంచితే లొల్లి చేస్తున్న బీజేపీ నేతలు.. గుజరాత్లో 5 నెలల్లో ఐదుసార్లు కరెంటు బిల్లులు పెం చితే ఏం చేస్తున్నారు? బీజేపీ నేతలు చెప్పేవన్నీ జూటా మాటలు, బట్టేబాజ్ మాటలే. నాలాయక్, జూటేబాజ్లు ఏంచేసినా చెల్లుతుందనే భావనలో ఉన్నారు. వారిని గద్దె దించే రోజులు దగ్గరపడ్డాయి. రాష్ట్రంలో సరైన సమయంలోనే ఎన్నికలు జరుగుతాయి. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పార్లమెంటును రద్దు చేసి ఎన్నికలకు వస్తే మేము కూడా అసెంబ్లీని రద్దు చేసి బరిలో దిగుతాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అడిగే ప్రశ్నలకు టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్తో సమాధానం చెప్పిస్తాం. -
గవర్నర్లా వ్యవహరిస్తే గౌరవిస్తాం: కేటీఆర్
సాక్షి, సిరిసిల్ల: ‘గవర్నర్తో మాకు పంచాయితీ లేదు. ఆమెను ఎక్కడా అవమాన పరచలేదు. ఎక్కడ అవమాన పరిచామో చెబితే వింటాం. అర్థం చేసుకుంటాం..’అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. గవర్నర్ వ్యవస్థపై తమకు గౌరవం ఉందని, గవర్నర్లా వ్యవహరిస్తే తప్పకుండా గౌరవిస్తామని చెప్పారు. గురువారం సిరిసిల్ల కలెక్టరేట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. గవర్నర్ గౌరవానికి భంగం వాటిల్లేలా తాము ఏమీ చేయలేదని కేటీఆర్ చెప్పారు. ‘ఎమ్మెల్సీగా కౌశిక్రెడ్డి విషయంలో అభ్యంతరం పెట్టినందుకు ఆమెను అవమానిస్తున్నారని అన్నట్లు విన్నా. కౌశిక్రెడ్డికి రాజకీయ నేపథ్యం ఉన్నందున ఎమ్మెల్సీగా అనుమతించలేదని ఆమె చెప్పినట్లు విన్నా. అయితే.. గవర్నర్ కాకముందు ఆమె ఎవరు? బీజేపీ తమిళనాడు పార్టీ అధ్యక్షురాలు కాదా?’అని మంత్రి ప్రశ్నించారు. గవర్నర్ కావడానికి రాజకీయ నేపథ్యం అడ్డం రాదు కానీ ఎమ్మెల్సీ అయ్యేందుకు అడ్డం వస్తదా? అని కేటీఆర్ నిలదీశారు. నరసింహన్ ఉన్నప్పుడు ఏ పంచాయితీ లేదు గవర్నర్గా నరసింహన్ ఉన్నప్పుడు ఏ పంచాయితీ లేదని, వీరితో పంచాయితీ ఉంటదని ఎందుకు ఊహించుకుంటున్నారో వారే ఆలోచించుకోవాలని మంత్రి అన్నారు. తాము రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తున్నామని చెప్పారు. శాసనసభ సమావేశాలు ఒక సంవత్సరంలో మొట్టమొదటిసారి జరుగుతున్నప్పుడు గవర్నర్ ప్రసంగం ఉండాలని రాజ్యాంగంలో స్పష్టంగా రాసి ఉందని.. అయితే ఇటీవలి సమావేశం మొదటిది కాదని చెప్పారు. ఆ సమావేశం సైనడై (నిరవధిక వాయిదా) అయిందని, ప్రోరోగ్ కాలేదని తెలిపారు. అందువల్లే గవర్నర్ ప్రసంగం లేదని.. దాన్ని అవమానం కింద తీసుకుంటే తాము చేయగలిగింది ఏమీ లేదని కేటీఆర్ అన్నారు. (చదవండి: తారా స్థాయికి చేరిన గవర్నర్, రాష్ట్ర సర్కార్ మధ్య విభేదాలు..) -
ప్రైమ్ వాలీబాల్ లీగ్కు మద్దతు: మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ప్రైమ్ వాలీబాల్ లీగ్ నిర్వహణకు హైదరాబాద్ను వేదికగా ఎంచుకున్నందుకు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు (కేటీఆర్) నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ లీగ్కు తమ వైపు నుంచి పూర్తి మద్దతు ఉంటుందని ఆయన అన్నారు. రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్ సీఈఓ జాయ్ భట్టాచార్య, బేస్లైన్ వెంచర్స్ మేనేజింగ్ డైరెక్టర్ తుహిన్ మిశ్రా, హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ప్రిన్సిపల్ యజమాని అభిషేక్ రెడ్డి సోమవారం కేటీఆర్ను కలిసి ఈ లీగ్ మ్యాచ్ బాల్ను, హైదరాబాద్ బ్లాక్ హాక్స్ జట్టు జెర్సీని ఆయనకు అందజేశారు. ఈనెల 5 నుంచి 27 వరకు ఏడు జట్ల మధ్య గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో రౌండ్ రాబిన్ పద్ధతిలో ఈ లీగ్ జరగనుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, హైదరాబాద్ బ్లాక్ హాక్స్ జట్టు సహ యజమాని శ్యామ్ గోపు, బెంగళూరు టార్పెడోస్ సహ యజమాని యశ్వంత్ బియ్యాల తదితరులు పాల్గొన్నారు. -
ఐటీ అ‘ద్వితీయం’
రాష్ట్రంలో ఐటీ ఉద్యోగమంటేనే కేరాఫ్ హైదరాబాద్.. బడా కంపెనీల్లో ఉద్యోగమంటే ఎవరైనా రాజధాని బాట పట్టాల్సిందే. కానీ ఇప్పుడా లెక్క మారుతోంది. ద్వితీయ, తృతీయశ్రేణి పట్టణాల్లో ఐటీ హబ్ల ఏర్పాటుతో చదువుకున్న చోటికి, కుటుంబానికి దగ్గరగా ఉంటూనే ఐటీ ఉద్యోగం చేసే అవకాశం వస్తోంది. స్థానిక యువతలో నైపుణ్యాలకు గుర్తింపు, వేలాది మందికి ఉపాధి లభిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఐటీ హబ్లు జిల్లాల్లోని యువత కలలను నెరవేరుస్తున్నాయి. సాక్షి, హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగాన్ని రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయశ్రేణి పట్టణాలకు విస్తరించే వ్యూహాన్ని ప్రభుత్వం వేగంగా అమలు చేస్తోంది. హైదరాబాద్లో కేంద్రీకృతమైన ఐటీ రంగాన్ని ద్వితీయ శ్రేణి పట్టణాలకు విస్తరించడం ద్వారా.. వచ్చే రెండేళ్లలో 25 వేల మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే వరంగల్, కరీంనగర్, ఖమ్మం పట్టణాల్లో ఐటీహబ్ల కార్యకలాపాలు మొదలయ్యాయి. నిజామాబాద్, మహబూబ్నగర్లలో ఐటీ టవర్ల నిర్మాణం ముగింపు దశకు చేరుకుంది. ఈ ఏడాది మార్చిలోగా ఈ రెండింటిని ప్రారంభించేందుకు ఐటీశాఖ సన్నాహాలు చేస్తోంది. ఇక సిద్దిపేటలో ఐటీహబ్ నిర్మాణ దశలో ఉండగా.. తాజాగా నల్లగొండ ఐటీ టవర్కు మంత్రి కె.తారక రామారావు శంకుస్థాపన చేశారు. త్వరలోనే తృతీయశ్రేణి పట్టణాలైన రామగుండం, వనపర్తిలలో ఐటీ హబ్ల నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఖమ్మంలోని ఐటీ హబ్ జిల్లాల్లోని ఐటీ హబ్లకు బడా కంపెనీలు ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు దిగ్గజ ఐటీ కంపెనీలు కూడా ఆసక్తి చూపుతున్నాయి. దీనితో పెద్ద కంపెనీలకు అవసరమైన ప్లగ్ అండ్ ప్లే సౌకర్యాలు కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. 2016లో తొలిదశ కింద ఏర్పాటైన వరంగల్ ఐటీ హబ్లో టెక్ మహీంద్రా, సైయంట్ వంటి మల్టీనేషనల్ కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. ఐటీ కార్యకలపాలతోపాటు ఇంక్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేశాయి. కరీంనగర్ ఐటీ హబ్లో ఐటీ కంపెనీలతో పాటు ‘టాస్క్’ రీజనల్ కార్యాలయం కూడా ఏర్పాటైంది. వీటితోపాటు ఖమ్మం ఐటీ హబ్లో కలిపి సుమారు 3వేల మంది ఉపాధి పొందుతుండగా.. సీటింగ్ కెపాసిటీకి మించి కంపెనీల నుంచి డిమాండ్ ఉన్నట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలోనే రెండోదశ టవర్ల నిర్మాణం కోసం ఐటీశాఖ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మహబూబ్నగర్, సిద్దిపేట, నిజామాబాద్ ఐటీ టవర్లతోపాటు నల్లగొండ ఐటీ టవర్ ప్రారంభమైతే మరో 4,200 సీటింగ్ కెపాసిటీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వరంగల్లోని ఐటీ హబ్లో టెక్ మహీంద్రా కార్యాలయం నైపుణ్య శిక్షణ, ఆవిష్కరణల కేంద్రాలుగా.. ద్వితీయ, తృతీయశ్రేణి పట్టణాల్లో ఏర్పాటవుతున్న ఐటీ హబ్లను కేవలం ఉద్యోగ కల్పన కేంద్రాలుగానే కాకుండా.. నైపుణ్య శిక్షణ, ఆవిష్కరణల కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ఐటీశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఐటీ పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా స్థానిక యువతకు ‘టాస్క్’ ద్వారా నైపుణ్య శిక్షణ ఇస్తోంది. ఇప్పటికే గ్రామస్థాయిలో ఆవిష్కరణలను గుర్తించి ప్రోత్సహించేందుకు టీఎస్ఐఐసీ ద్వారా ఐటీశాఖ పలు కార్యక్రమాలు చేపట్టింది. మరోవైపు టీహబ్, వీహబ్ ద్వారా స్టార్టప్ల వాతావరణాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు ఐటీ హబ్లను కేంద్రంగా చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. నిజామాబాద్లో నిర్మాణంలో ఉన్న ఐటీ హబ్ భవనం రాష్ట్రవ్యాప్తంగా ఐటీ ఉద్యోగావకాశాలు రాష్ట్రంలో ఇప్పటికే వరంగల్, ఖమ్మం, కరీంనగర్లలో ఐటీ హబ్ లు ప్రారంభించాం. నిజామాబాద్, మహబూబ్నగర్ ఐటీ హబ్లు త్వరలోకి అందుబాటులోకి వస్తాయి. కేవలం హైదరాబాద్లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని యువతకు కూడా ఐటీ రంగంలో అవకాశాలు అందుబాటులోకి రావాల్సిన అవసరాన్ని సీఎం కేసీఆర్ రాష్ట్ర అవతరణ సమయంలోనే నొక్కిచెప్పారు. ఆ దిశలోనే ఈ చర్యలు చేపడుతున్నాం. తెలంగాణ వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి వంటి రంగాల్లోనే కాదు పరిశ్రమలు, ఐటీ రంగాల్లోనూ అద్భుతంగా పురోగమిస్తోంది. – కె.తారక రామారావు, ఐటీ, పరిశ్రమ శాఖల మంత్రి ద్వితీయ, తృతీయశ్రేణి పట్టణాల్లో ఐటీ అభివృద్ధి భవిష్యత్తులో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో గత ఏడాది 12శాతంగా నమోదైన ఐటీ రంగం వృద్ధి.. ఈసారి 16 శాతానికి చేరుకునే అవకాశముంది. కోవిడ్ పరిస్థితుల మూలంగా హైబ్రిడ్ పనివిధానంలో చాలా మంది ఉద్యోగులు తమ స్వస్థలాల నుంచి పనిచేస్తున్నారు. రాబోయే రోజుల్లో ద్వితీయ, తృతీయశ్రేణి పట్టణాల నుంచే పనిచేసేందుకు ఉద్యోగులు మొగ్గు చూపే అవకాశం ఉన్నందున.. ఆయా చోట్ల ఐటీ హబ్లకు ఉజ్వల భవిష్యత్తు ఖాయం. – భరణి అరోల్, అధ్యక్షుడు, హైసియా ప్రభుత్వ చర్యలతో ఊతం రాష్ట్రంలోని సానుకూల వాతావరణం, ఐటీ విస్తరణకు ప్రభు త్వం చేపడుతున్న చర్యలు మా వంటి సంస్థలకు ఊతంగా నిలుస్తున్నాయి. కరీంనగర్ కేం ద్రంగా మేం ప్రారంభించిన సంస్థలో 20 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఐటీ హబ్లతోపాటు లాజిస్టిక్స్కు పెద్దపీట వేస్తుండటంతో ఎక్కడి నుంచైనా కార్యకలాపాలు నిర్వహించే వెసులుబాటు లభించింది. ఐటీని ద్వితీయశ్రేణి పట్టణాలకు విస్తరిం చడం ద్వారా స్థానికంగా నైపుణ్యం కలిగిన యువతకు ఉపాధి అందుబాటులోకి రావడంతోపాటు తమ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశాలు లభిస్తున్నాయి. – మనోజ్ శశిధర్, సహస్ర సాఫ్ట్వేర్ సర్వీసెస్, కరీంనగర్ సొంత జిల్లాలో ఐటీ ఉద్యోగం.. ఖమ్మంలో ఐటీ హబ్ ఏర్పాటుతో సొంత జిల్లాలోనే ఉద్యోగం పొందే అవకాశం దక్కింది. నేను చదువుకున్న కాలేజీలో క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా ఐటీ హబ్లో ఉద్యోగం సాధించాను. టెక్నోజన్ కంపెనీలో జావా ఫుల్స్టాక్ డెవలపర్గా పనిచేస్తున్నా. ఉద్యోగం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం వచ్చింది. కుటుంబ సభ్యులకు దగ్గరగా ఉంటూ.. నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకునే పనిలో ఉన్నాను. – మారేపల్లి కౌశిక్ శర్మ, ఐటీ ఉద్యోగి, టెక్నోజన్, గార్ల, ఖమ్మం జిల్లా -
సృజనాత్మకతతోనే నూతన ఆవిష్కరణలు
సాక్షి, హైదరాబాద్: సృజనాత్మకతే నూతన ఆవిష్కరణలకు మూలమని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం సమ్మిళిత ఆవిష్కరణల అభివృద్ధికి సాక్ష్యంగా నిలుస్తోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. ఇంటింటా ఇన్నోవేటర్ ఎగ్జిబిషన్–2021ను ఆదివారం ఆయన సిరిసిల్లలో ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్ ద్వారా ఎంపిక చేసిన 105 ఆవిష్కరణలు తోటి భారతీయుల నిజమైన సమస్యల ఆధారంగా రూపుదిద్దుకున్నాయని పేర్కొన్నారు. ఎగ్జిబిషన్లో తెలంగాణలోని 33 జిల్లాల నుంచి వందకంటే ఎక్కువ ఆవిష్కర్తలు వర్చువల్ షోకేస్ ద్వారా తమ ఆవిష్కరణలను ప్రదర్శించారు. పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో భాగంగా వ్యవసాయం, పారిశుద్ధ్యం, సాంకేతికత, రవాణా, నీరు, ఆరోగ్య రంగాల్లో పాఠశాల విద్యార్థుల నుండి ఇళ్లల్లో తయారీదారుల వరకు, మెకానిక్ నుండి రైతు వరకు వందకి పైగా ఆవిష్కరణలను ఆన్లైన్లో ప్రదర్శనకు ఉంచారు. ఈ ఆవిష్కరణలను ప్రజలు www.teamtsic.telangana,gov.in/intinta-innovator-exhibition-2021 పోర్టల్లో సందర్శించవచ్చు. ఈ కార్యక్రమం కోసం 33 జిల్లాల సైన్స్ అధికారులు జిల్లా కలెక్టర్ల మార్గదర్శకత్వంలో నోడల్ ఆఫీసర్లుగా నియమితులయ్యారు. హైదరాబాద్ నుంచి ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్రంజన్ వర్చువల్ విధానంలో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ నూతన ఆవిష్కరణలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. -
రైతుల ఆత్మహత్యలు తగ్గాయి
సిరిసిల్ల: తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని.. ఈ విషయాన్ని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరు శివారులోని అపెరల్ పార్క్లో శుక్రవారం మంత్రి, గోకుల్దాస్ ఇమేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ అపెరల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే రాష్ట్రం అనేక రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా ఉందన్నారు. జౌళి రంగం అభివృద్ధికి తెలంగాణ టెక్స్టైల్స్ అండ్ అపెరల్ పాలసీ(టీ–టాప్) తెచ్చామని తెలిపారు. వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులతో 12 వేల మందికి ఉపాధి కల్పించేందుకు పలు కంపెనీలు ముందుకు వచ్చాయన్నారు. అలాగే సిరిసిల్లలో 60 ఎకరాల్లో నెలకొల్పిన అపెరల్ పార్క్ ద్వారా పదివేల మందికి ఉపాధి కల్పిస్తామని తెలిపారు. బీడీలు చేస్తూ రె క్కలు ముక్కలు చేసుకునే మహిళలకు సులభంగా నెలకు రూ.10 వేలనుంచి రూ.12 వేలు సంపాదించుకునేందుకు గార్మెంట్ పరిశ్రమలు దోహదపడతాయని స్పష్టం చేశారు. సిరిసిల్ల వస్త్రాలు ప్రపంచ విపణిలో పోటీ పడతాయని, నాణ్యమైన, నవ్యమైన వస్త్రాలకు సిరిసిల్ల కేంద్ర బిందువు అవుతుందని పేర్కొన్నారు. మన పత్తి ఎంతో నాణ్యమైంది దేశంలోనే తెలంగాణ పత్తి ఎంతో నాణ్యమైందని, ఈ విషయాన్ని దక్షిణ భారత స్పిన్నింగ్ మిల్లుల సంఘమే ప్రకటించిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. నేతన్నల సంక్షేమం కోసం నేతన్నల బీమా పథకాన్ని అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు. రైతుల తరహాలో నేతకార్మికులు ఏ కారణాలతో చనిపోయినా.. వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందేలా బీమా పథకం అమలు చేస్తామని స్పష్టం చేశారు. కరోనా కష్ట కాలంలోనూ నేతన్నకు చేయూత పథకం ద్వారా రాష్ట్రంలో 26 వేల మంది కార్మికులకు రూ.110 కోట్ల సాయం అందించినట్లు తెలిపారు. కాగా, సిరిసిల్లలో రూ.400 కోట్లతో చేపట్టిన వర్కర్ టు ఓనర్ పథకం కొద్ది రోజుల్లో కార్యరూపం దాలుస్తుందన్నారు. మహిళల ఉపాధికి ప్రాధాన్యం: శైలజారామయ్యర్ అపెరల్ పార్క్లో మహిళల ఉపాధికి ప్రాధాన్యం ఇస్తామని రాష్ట్ర జౌళి శాఖ డైరెక్టర్ శైలజారామయ్యర్ పేర్కొన్నారు. సిరిసిల్ల అపెరల్ పార్క్లో రూ.20 కోట్లతో రోడ్లు, షెడ్లు, ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేశామన్నారు. ఇన్నర్వేర్ గార్మెంట్ పరిశ్రమకు ఇప్పటికే శంకుస్థాపన చేశామని ఈ ఫ్యాక్టరీలో వెయ్యి మంది మహిళలకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. గోకుల్దాస్ కంపెనీ ఎండీ సుమీర్ హిందుజా మాట్లాడుతూ మహిళలకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని తెలిపారు. జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, కలెక్టర్ కృష్ణభాస్కర్, టీఎస్ఐఐసీ ఎండీ ఇ.వెంకట నర్సింహారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
‘రామప్ప సందర్శకులకు మెరుగైన సౌకర్యాలు’
సాక్షి, హైదరాబాద్: రామప్పకు యునెస్కో వారసత్వ గుర్తింపు సాధనలో సీఎం కేసీఆర్ కృషి ఎంతో ఉందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ గుర్తింపుతో రామప్ప ఆలయం ప్రపంచ పర్యాటక ప్రాంతం అవు తుందన్నారు. బుధవారం ప్రగతిభవన్లో పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి కేటీఆర్ను కలిశారు. రామప్ప ఆలయ అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకోవాలని వారు కోరారు. ఈ సందర్భంగా కేటీఆర్కు ఎర్రబెల్లి, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి రామప్ప ఆలయం చిత్రపటాన్ని బహూకరించారు. కేటీఆర్ను కలసిన వారిలో పార్టీ రాష్ట్ర సోషల్మీడియా కన్వీనర్ వై.సతీశ్రెడ్డి, లింగాలఘణపురం జెడ్పీటీసీ గుడి వంశీధర్రెడ్డి ఉన్నారు. -
కంటోన్మెంట్ రోడ్లను తెరిపించండి
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో మిలిటరీ అధికారులు మూసివేసిన అలహాబాద్ గేట్ రోడ్, గాఫ్ రోడ్, వెల్లింగ్టన్ రోడ్, ఆర్డినెన్స్ రోడ్లను వెంటనే తెరిపించాలని కోరుతూ రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్కు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు గురువారం లేఖ రాశారు. కోవిడ్ కారణం చూపుతూ రోడ్లను మూసివేయడంతో ప్రజలు అనేక కిలోమీటర్లు అదనంగా ప్రయాణించి తమ గమ్యస్థానాలకు చేరుకోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో కరోనా కేసులు తగ్గాయని, అయినా మళ్లీ రోడ్లను మూసివేయడం అత్యంత బాధాకరమన్నారు. రోడ్లను ఇష్టారీతిన మూసివేయకుండా మిలటరీ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కంటోన్మెంట్ రోడ్ల మూసివేతపై గతంలోనూ కేంద్రానికి లేఖలు రాసినట్టు కేటీఆర్ గుర్తు చేశారు. స్థానిక కంటోన్మెంట్ బోర్డును సంప్రదించకుండానే లోకల్ మిలటరీ అథారిటీ రోడ్ల మూసివేతకు పాల్పడుతోందని, కంటోన్మెంట్ చట్టంలోని సెక్షన్–258కి ఇది విరుద్ధమని తెలిపారు. గతంలో ఈ అంశాన్ని రక్షణ శాఖ దృష్టికి తీసుకురావడంతో కంటోన్మెంట్ బోర్డుతో సంబంధం లేకుండా రోడ్లను మూసివేయవద్దని ఇచ్చిన ఆదేశాలను సైతం స్థానిక మిలిటరీ అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. స్థానిక మిలిటరీ అథారిటీ పరిధిలో ఉన్న రోడ్లపైన ఎలివేటెడ్ కారిడార్ నిర్మించే అంశంపై గతంలో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కార్యదర్శితో వీడియో కాన్ఫరెన్స్ జరిగిందని, అందులో సూచనప్రాయంగా అంగీకరించారని పేర్కొన్నారు. -
ఆగస్టు చివరిలోగా సంస్థాగత కమిటీలు
సాక్షి, హైదరాబాద్: పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈ నెల 20 నాటికి పూర్తిచేయాలని, ఆగస్టు నెలాఖరులోగా గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్నిరకాల సంస్థాగత కమిటీలను ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కె.చంద్రశేఖర్రావు చేతుల మీదుగా టీఆర్ఎస్ జిల్లా కార్యాలయ భవనాలను ప్రారంభించి, కార్యకర్తలకు సంస్థాగత శిక్షణ ఇవ్వాలని యోచిస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారక రామారావు అధ్యక్షతన బుధవారం తెలంగాణ భవన్లో పార్టీ ప్రధాన కార్యదర్శులు, పలువురు కీలక నేతలతో సమావేశం జరిగింది. ఇందులో పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీలు, పార్టీ కార్యాలయాల ప్రారంభం, కార్యకర్తలకు శిక్షణ వంటి అంశాలపై సుమారు మూడు గంటల పాటు చర్చించారు. 2021–23 సంవత్సరాలకు సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి 12న ప్రారంభమైన సభ్యత్వ నమోదులో ఇప్పటివరకు 61 లక్షల మంది టీఆర్ఎస్ సభ్యత్వాన్ని స్వీకరించారని.. ఈ నెల 20 వరకు గడువు ఉండటంతో మరో 9 లక్షల మంది చేరొచ్చని ఈ సందర్భంగా అంచనా వేశారు. దేశంలో ఏ ఇతర ప్రాంతీయ పార్టీలోనూ ఇంత భారీగా సభ్యత్వ నమోదు జరగలేదని అభిప్రాయపడ్డారు. పార్టీ నేతలంతా లక్ష్యం చేరుకునే దిశగా సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ ఆదేశించారు. సభ్యత్వం తీసుకున్న వారి వివరాలను 20వ తేదీనాటికి డిజిటలైజేషన్ చేయాలని సూచించారు. కాగా.. పార్టీ సభ్యత్వ నమోదుకు సంబంధించి ఇప్పటివరకు రూ.18 కోట్లు పార్టీ కార్యాలయానికి చేరాయని.. మరో రూ.24 కోట్లు ఇంకా రావాల్సి ఉందని సమావేశంలో నేతలు వివరించారు. 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 50వేలకు పైబడి సభ్యత్వాలు నమోదయ్యాయని, 20 నియోజకవర్గాల్లో 20 వేలలోపే సభ్యత్వ నమోదు జరిగిందని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పాతబస్తీతోపాటు కొన్ని నియోజకవర్గాల్లో ఆశించిన స్థాయిలో సభ్యత్వాలు నమోదు కాలేదని పేర్కొన్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జీలతో కేటీఆర్ నేరుగా మాట్లాడారు. వారం తర్వాత మరో భేటీ ఏడేళ్లుగా పార్టీ కార్యకర్తలకు అమలవుతున్న ప్రమాద బీమా గడువు ఈ నెల 30న ముగియనుం డటంతో.. 20వ తేదీలోగా కార్యకర్తల వివరాలను డిజిటలైజ్ చేయాలని భేటీలో నిర్ణయించారు. ఆగస్టు నెలాఖరులోగా వార్డు, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సంస్థాగత కమిటీల నిర్మాణం పూర్తి చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ ఆదేశించారు. 2019లో 31 జిల్లా కేంద్రాల్లో టీఆర్ఎస్ కార్యాలయాల నిర్మాణం ప్రారంభించగా, ఇప్పటివరకు 24 జిల్లా కేంద్రాల్లో పనులు పూర్తయ్యాయని.. సూర్యాపేట, సిరిసిల్ల సహా మరో ఏడు జిల్లాల్లో 90 శాతం పనులు అయ్యాయని తెలిపారు. జిల్లా కార్యాలయాలను త్వరలోనే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించి, జిల్లా ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యేలా షెడ్యూల్ రూపొందించాలని ఆదేశించారు. పార్టీ కార్యాలయాల ప్రారంభం తర్వాత.. కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమాలను ప్రారంభించాలని సూచించారు. సభ్యత్వ నమోదుపై సమీక్షించేందుకు ఈ నెల 21న మరోమారు పార్టీ కార్యనిర్వాహక సమావేశం నిర్వహిస్తామని కేటీఆర్ ప్రకటించారు. క్షేత్రస్థాయిలో చురుకైన కార్యకర్తలను గుర్తించి సోషల్ మీడియా కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కొత్త పదవులు వచ్చినపుడు కొత్త భాష .. తెలంగాణ భవన్లో జరిగిన భేటీలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల మీద కూడా లోతుగా విశ్లేషణ జరిగింది. రాజకీయ పార్టీలకు కొత్త అధ్యక్షులు వచ్చినపుడు కొత్త కార్యక్రమాలు, కొత్త భాష సహజమేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు. వాటిపై టీఆర్ఎస్ కూడా తగిన కార్యాచరణతో ముందుకు పోతుందని తెలిపారు. ఈటల రాజేందర్ వ్యవహారం ప్రస్తావనకు రాగా.. టీఆర్ఎస్ ఆయనకు ఇవ్వాల్సిన దాని కంటే ఎక్కువ గుర్తింపునే ఇచ్చిందని కేటీఆర్ పేర్కొ న్నట్టు తెలిసింది. ఈటల టీఆర్ఎస్లో ఉంటూ కొత్త పార్టీ ఏర్పాటు గురించి ఆలోచించాడని, అయినా చివరి నిమిషం వరకు ఆయనను పార్టీలో కొనసాగించేందుకు తాను వ్యక్తిగతంగా కూడా ప్రయత్నించానని కేటీఆర్ పేర్కొన్నట్టు సమాచారం. కొండల్ కుటుంబానికి అండగా ఉంటాం టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగంతో పాటు పార్టీ కోసం సుదీర్ఘకాలం పనిచేసిన నల్లగొండ జిల్లా చండూరు మండలానికి చెందిన దివంగత తిరుమణి కొండల్ కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఏడాది క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి గత నెల క్రితం వరకు చికిత్స పొందుతూ మరణించిన కొండల్ కుటుం బం బుధవారం తమకు సహాయం అందించాల్సిందిగా తెలంగాణ భవన్లో కేటీఆర్ను కలిసింది. ఈ సందర్భంగా కొండల్ భార్యను ఓదార్చిన మంత్రి కేటీఆర్, తగిన సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. -
దేవుడితోనైనా కొట్లాడుతాం
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: కృష్ణా జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్తోనే కాదు.. అవసరమైతే దేవుడితోనైనా పోరాడుతామని, పాలమూరుకు నీటినందించే విషయంలో ఎలాంటి రాజీలేదని రాష్ట్ర పురపాలక, ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పష్టం చేశారు. నారాయణపేట జిల్లాలో శనివారం ఆయన పర్యటించి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మించి తీరుతామన్నారు. ఈ ప్రాజెక్ట్కు సంబంధించి నారాయణపేట జిల్లాకు నీరందించే కెనాల్ కోసం వచ్చే నెల 10న ప్రజాభిప్రాయ సేకరణ జరగనున్నట్లు తెలిపారు. దీనిపై ఈ ప్రాంతానికి చెందిన వారే అడ్డంకులు సృష్టించే అవకాశం ఉందని పేర్కొన్నారు. జిల్లాలోని సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులందరూ రైతులను అధిక సంఖ్యలో తీసుకొచ్చి కరివెన నుంచి నారాయణపేట వరకు చేపట్టే కెనాల్కు అవసరమైన భూసేకరణకు మద్దతు తెలపాలని కోరారు. నేతన్నలను అన్ని విధాలా ఆదుకుంటాం.. రూ.5 లక్షల బీమా వర్తింపజేసే పథకాన్ని రాష్ట్రంలోని నేత కార్మికులకు త్వరలో వర్తించేలా చూస్తామని కేటీఆర్ అన్నారు. 70 ఏళ్లలో ఎవరూ ఆలోచించని విధంగా ముఖ్యమంత్రి పల్లెలు, పట్టణాలను ప్రగతి బాటలో నడిపిస్తున్నారన్నారు. ప్రపంచాన్ని కరోనా వైరస్ అతలాకుతలం చేసి ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దెబ్బతీసిందని చెప్పారు. అయినా ప్రజా సంక్షేమం, అభివృద్ధిలో వెనుకడుగు వేయకుండా కేసీఆర్ నేతృత్వంలో బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరిని పండించామని.. రైతులకు ఇబ్బందుల్లేకుండా ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, వాణిదేవి, ప్రభుత్వ విప్లు కూచకుళ్ల దామోదర్రెడ్డి, గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు రాజేందర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఏబీవీపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ సభ ప్రారంభానికి ముందు మంత్రి కాన్వాయ్ను ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేసి.. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగి ఉద్రిక్తతలకు దారితీసింది. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేయడంతోపాటు ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. తర్వాత సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తుండగా పీడీఎస్ విద్యార్థులు నిరసన తెలిపారు. పీజీ కళాశాల ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వీరిని కూడా అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. -
ఎంఎస్ఎంఈలకు అండగా ఉండాలి
సాక్షి, హైదరాబాద్: రుణాలు, ఫండింగ్ విషయంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)కు బ్యాంకులు అండగా ఉండాలని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు పిలుపునిచ్చారు. ఎంఎస్ఎంఈ రంగానికి కేంద్ర ప్రభుత్వం, బ్యాంకుల నుంచి మరింత సహకారం అందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో బ్యాంకులు రుణాల వసూళ్ల విషయంలో కొంత ఉదారతతో వ్యవహరించాలని, పరిశ్రమలు తిరిగి గాడినపడేందుకు సహకరించాలని కోరారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి, ఆర్బీఐకి విజ్ఞప్తి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఎంఎస్ఎంఈల కోసం ఇండియన్ బ్యాంక్ తీసుకొచ్చిన ‘ప్రేరణ’కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రగతిభవన్లో ప్రారంభించారు. ఎంఎస్ఎంఈలకు కేంద్రం ప్రకటించిన ప్రోత్సాహకాలతోపాటు రుణాల లింకేజీ విషయంలో కొంత సంక్లిష్టత ఉందని, దీన్ని సరళీకృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఖాయిలా పడిన ఎంఎస్ఎంఈల పునరుద్ధరణకు కృషి చేస్తున్న ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్తో ఇండియన్ బ్యాంక్ భాగస్వామిగా మారి సహాయం చేయాలని కోరారు. తెలుగు రాష్ట్రాల్లోని స్వయం సహాయక సంఘాలు రెండు దశాబ్దాలుగా తీసుకున్న రుణాలకు అద్భుతమైన రీపేమెంట్ రేటును కలిగి ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇండియన్ బ్యాంకుతో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం, మిషన్ భగీరథ వంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కలిగి ఉందని, అద్భుతంగా అభివృద్ధి చెందుతున్న అర్బన్ డెవలప్మెంట్ రంగంలో ఉన్న అవకాశాలను పరిశీలించాలని బ్యాంక్ సీఈఓ, ఎండీ పద్మజా చుండూరును మంత్రి కోరారు. ప్రభుత్వం ప్రారంభించిన టీ–హబ్, వీ–హబ్లో భాగస్వాములు కావాలని సూచించారు. ఎంఎస్ఎంఈ రంగానికి అండగా దేశవ్యాప్తంగా ‘ప్రేరణ’కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని, ఇందులోభాగంగా అత్యంత సులువుగా రుణాలివ్వడంతోపాటు పరిశ్రమల నిర్వహణలో ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తామని పద్మజా చెప్పారు. రాష్ట్రంలో తమ బ్యాంకు ఇప్పటికే పలు కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉందని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాల్లో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. -
వ్యవసాయ ఉత్పత్తుల ఆధారంగా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్, మార్కెటింగ్ సదుపాయాన్ని పెంచేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. ఇందు లో భాగంగా కేవలం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకే పరిమితం కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను కూడా ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల కు సంబంధించి మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో బుధవారం విస్తృతస్థాయి సమావేశం జరిగింది. వ్యవసా య అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయ డం ద్వారా రాష్ట్రంలో సాగు ఉత్పత్తులు భారీగా పెరిగిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాన పంట వరితోపాటు ఆయిల్పామ్ వంటి నూతన పంటల భవిష్యత్ ప్రాసెసింగ్ అవసరాలను కూడా ‘స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు’ఏర్పాటులో పరిగణనలోకి తీసుకుంటామ న్నారు. తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు ఎస్.నిరంజన్రెడ్డి, గంగుల కమలాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్తోపాటు పరిశ్రమలు, వ్యవసాయం, పౌరసరఫరాల శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నిరుద్యోగ సమస్యకు పరిష్కారం వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్, డిమాండ్ కల్పించడం ద్వారానే ఆర్థిక పురోగతి, గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి ఎస్.నిరంజన్రెడ్డి అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటు ద్వారా సాగు ఉత్పత్తులకు గిరాకీ పెరగడంతో పాటు దీర్ఘకాలంలో లాభసాటి ధర వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ ఉత్పత్తులకు శాశ్వత డిమాండ్ ఉండే అవకాశం ఉండటంతో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తాయన్నారు. పెరిగిన వరి ధాన్యం మిల్లింగ్ సామర్థ్యం పెంచేందుకు ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లలో ఏర్పాట్లు చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సుమారు 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ఎఫ్సీఐకి అందించేందుకు ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు మిల్లింగ్ ఇండస్ట్రీకి ప్రోత్సాహమిచ్చేలా కొత్త పాలసీ రూపొందించాలన్నారు. మిల్లింగ్ పెరిగితే చైనా లాంటి దేశాలకు తెలంగాణ నుంచి బియ్యం ఎగుమతికి అనేక అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఉమ్మడి తొమ్మిది జిల్లాల పరిధిలో.. తొలి విడతలో హైదరాబాద్ మినహా పూర్వ ఉమ్మడి తొమ్మిది జిల్లాల పరిధిలో కనీసం 225 ఎకరాల విస్తీర్ణంలో స్పెషల్ ఫుడ్ ప్రాసిసెంగ్ జోన్ల ఏర్పాటుకు కసరత్తు జరుగు తోంది. ఈ జోన్లలో విద్యుత్, తాగునీటి సరఫరా, వ్యర్థాల నిర్వహణ, కాలుష్య వ్యర్థాల శుద్దీకరణ ప్లాంటు తదితర మౌలిక వసతులన్నీ ఈ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లలో అంతర్భాగంగా ఉంటాయి. రాష్ట్రంలో ప్రధానంగా వరి, మిరప, పసుపు, చిరు ధాన్యాలు, నూనె గింజలు, పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్, స్టోరేజీ, మార్కెటింగ్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ జోన్లలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే 350 దరఖాస్తులు ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకు సంబం ధించి ఔత్సాహికుల నుంచి ప్రభుత్వం ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులు ఆహ్వానించింది. ఇప్పటికే 350 దరఖాస్తులు అందగా, మరిన్ని కం పెనీలను భాగస్వాములను చేసేందుకు గడువు పెంచాలని కేటీఆర్ ఆదేశించారు. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణ, ఇతర అంశాల్లో స్థానిక ఎమ్మెల్యేలు చొరవ తీసుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు. హరిత విప్లవంతోపాటు మాంసం, పాలు, మత్య్స రంగాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నందున ఫుడ్ ప్రాసెసింగ్ అవకాశాలు మెరుగుపరచాల్సి ఉందన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖలపై మంత్రి కేటీఆర్ సమీక్ష రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన ప్రతిపాదనలపై పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా రంగాల వారీగా పరిశ్రమలు, ఐటీ శాఖ విభాగాధిపతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యత రంగాలైన ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, ఫార్మా మరియు లైఫ్ సైన్సెస్ వంటి రంగాల్లో అనేక కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సం సిద్ధత వ్యక్తం చేశాయని, ఈ మేరకు పలు కంపెనీలు తమ ఆసక్తిని వివిధ శాఖల అధికారులకు తెలియజేశాయని ఈ సందర్భంగా అధికారులు మంత్రికి వివరించారు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమల ఏర్పాటు జరగాలన్నది ప్రభుత్వ లక్ష్యం అని, ఆ మేరకు పారిశ్రామిక వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. -
కేటీఆర్ కుమారుడు హిమాన్షు రావుకు ‘డయానా అవార్డు’
సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు రావుకు ప్రతిష్టాత్మక డయానా అవార్డు దక్కింది. బ్రిటన్ దివంగత రాకుమారి డయానా పేరుతో ఏర్పాటు చేసిన ఈ అవార్డుకు ప్రపంచ వ్యాప్తంగా 9 నుంచి 25 ఏళ్ల వయస్సు ఉన్న యువత చేసిన సోషల్ వర్క్ను పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేస్తారు. గజ్వేల్ నియోజకవర్గంలో గంగాపూర్, యూసుఫ్ ఖాన్పల్లి గ్రామాల్లో స్వయం సమృద్ధి దిశగా పలు అంశాలపై శోమ పేరుతో హిమాన్షు ఓ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ మేరకు చేపట్టిన పలు కార్యక్రమాలకుగాను ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా తన ప్రాజెక్టుకు మార్గదర్శనం చేసిన తన తాత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుకు హిమాన్షు ధన్యవాదాలు తెలిపారు. అలాగే తనకు సహకరించిన రెండు గ్రామాల ప్రజలు, తన మెంటార్స్కు కృతజ్ఞతలు తెలిపారు. కుమారుడికి అత్యున్నత అవార్డు రావడంపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరింత ఎదగాలని ఆకాంక్షించారు. -
కేటీఆర్కు ఉక్కు పోరాట కమిటీ ఆహ్వానం
ఉక్కు నగరం (గాజువాక): తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు (కేటీఆర్)ను విశాఖపట్నంలో ఉక్కు పరిరక్షణ దీక్షా శిబిరానికి పోరాట కమిటీ నాయకులు ఆహ్వానించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాటానికి కేటీఆర్ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్కు పరిరక్షణ కమిటీ చైర్మన్ మంత్రి రాజశేఖర్, కో–కన్వీనర్ గంధం వెంకటరావు శుక్రవారం హైదరాబాద్లో కేటీఆర్ను కలిశారు. స్టీల్ప్లాంట్ పరిస్థితులు, ప్రభుత్వ విధానం, చేస్తున్న ఉద్యమం గురించి ఆయనకు వివరించి ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ దీక్షా శిబిరాన్ని సందర్శించాలని కోరారు. ఎంతోమంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న ప్లాంట్ను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, ఉక్కు పరిరక్షణ పోరాటానికి తాము పూర్తి మద్దతు ఇస్తామని కేటీఆర్ స్పష్టం చేసినట్టు పోరాట కమిటీ నాయకులు తెలిపారు. బడ్జెట్ సమావేశాల అనంతరం తాను విశాఖ వస్తానని చెప్పారన్నారు. -
వెయ్యి కోట్లతో ‘మాస్’... జీసీసీ
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ పెట్టుబడులకు భారత్లో ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారిన హైదరాబాద్కు మరో దిగ్గజ సంస్థ రానుంది. అమెరికాకు చెందిన ప్రముఖ జీవిత బీమా, ఆర్థిక సేవల సంస్థ... మసాచుసెట్స్ మ్యూచువల్ ఇన్సూరెన్స్ (మాస్ మ్యూచువల్) కంపెనీ రూ.1,000 కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్ నగరంలో తమ అంతర్జాతీయ సామర్థ్య కేంద్రం (గ్లోబల్ కెపబిలిటీ సెంటర్)ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. దశల వారీగా ఈ పెట్టుబడులను మాస్ మ్యూచువల్ సంస్థ పెట్టనుందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు ప్రకటించారు. గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ ఏర్పాటు నేపథ్యంలో మాస్ మ్యూచువల్ ఇండియా అధిపతి రవి తంగిరాల, సంస్థ కోర్ టెక్నాలజీ విభాగాధిపతి ఆర్థర్ రీల్ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి కేటీఆర్, పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్లతో మాట్లాడారు. గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ కోసం మాస్ మ్యూచువల్ సంస్థ ఇప్పటికే నియామకాలను చేపట్టిందని, 300 మందికి పైగా ఉద్యోగులను నియమించుకుందని కేటీఆర్ తెలిపారు. భవిష్యత్తులో భారీ సంఖ్యలో ఉద్యోగావకాశాలను కల్పించనుందన్నారు. ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్లో లక్షా యాభై వేల చదరపు అడుగుల భారీ విస్తీర్ణంలో ఈ కేంద్రం ఏర్పాటు కానుందన్నారు. ఈ సంస్థకు ప్రభుత్వం తరఫున అన్నిరకాల సహాయ, సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలు హైదరాబాద్ నగరాన్ని తమ పెట్టుబడులకు కేంద్రంగా ఎంచుకున్నాయని, ఈ రోజు 170 సంవత్సరాల చరిత్ర కలిగి, ‘ఫార్చూన్ 500’కంపెనీల్లో ఒకటిగా ఉన్న మాస్ మ్యూచువల్ అమెరికా వెలుపల తమ మొదటి గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ను ఏర్పాటు చేయడానికి హైదరాబాద్ నగరాన్ని ఎంచుకోవడం ఎంతో గర్వకారణమన్నారు. ప్రపంచ పెట్టుబడులకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారిందని మరోసారి రుజువైందన్నారు. రానున్న కాలంలో నగరంలో కంపెనీ పెద్ద ఎత్తున విస్తరణ చేపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రికార్డు సమయంలో ప్రపంచస్థాయి కేంద్రాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయడంలో రవి తంగిరాల చూపిన చొరవను కేటీఆర్ అభినందించారు. హైదరాబాద్ ది బెస్ట్: రవి తంగిరాల మాస్ మ్యూచువల్ గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ (జీసీసీ) ఏర్పాటుకు ప్రపంచంలోని అనేక నగరాలను పరిశీలించామని, హైదరాబాద్లో చక్కటి నైపుణ్యం కలిగిన ఐటీ ఉద్యోగులు, ప్రభుత్వ సానుకూల విధానాలకు ఆకర్షితులై ఈ నగరాన్ని ఎంపిక చేశామని మాస్ మ్యూచువల్ ఇండియా హెడ్ రవి తంగిరాల పేర్కొన్నారు. 1851లో ఏర్పాటైన తమ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి ఆర్థిక, ఇన్సూరెన్స్ సేవలను అందిస్తోందన్నారు. రానున్న రోజుల్లో తమ కంపెనీ కార్యకలాపాలను, ఇతర రంగాలకు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని, గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ ద్వారా తమ లక్ష్యాలు, అవసరాలను ఇక్కడ ఉన్న టాలెంట్ పూల్ సహకారంతో అందిపుచ్చుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. తమ కంపెనీ అప్లికేషన్ డెవలప్మెంట్, సపోర్ట్, ఇంజనీరింగ్ డేటా సైన్స్, డేటా అనలిటిక్స్ రంగాల్లో పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగావకాశాలు సృష్టించే అవకాశం ఉందన్నారు. ఈ దిశగా భారీ ఎత్తున తమ కంపెనీ నియామకాలు చేపట్టే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే అమెరికాలో తమ కంపెనీలో 6 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. నగరంలోని నిపుణులైన ఉద్యోగుల ద్వారా తమ ఇన్నోవేషన్ లక్ష్యాలను కచి్చతంగా అందుకుంటామన్న విశ్వాసాన్ని ఆర్థర్ రీల్ వ్యక్తం చేశారు. జీసీసీలు ఏం చేస్తాయి? గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ (జీసీసీ)లు నిపుణులైన ఉద్యోగులను, అత్యుత్తమ మౌలిక సదుపాయాలను ఒకేచోట కేంద్రీకృతం చేసి తమ వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తాయి. బ్యాక్ ఆఫీసు సేవలు, కార్పొరేట్ వ్యాపార మద్దతు కార్యకలాపాలు, కాల్ సెంటర్ల సేవలు ఇక్కడి నుంచి కొనసాగిస్తాయి. అలాగే ఐటీ సేవల విషయానికి వస్తే... యాప్ల అభివృద్ధి, నిర్వహణ, రిమోట్ ఐటీ ఇ్రన్ఫాస్ట్రక్చర్, హెల్ప్ డెస్క్లు ఈ అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాల నుంచే నిర్వహిస్తారు. ఈ ఏకీకృత సేవల ద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తాయి. కొన్ని పెద్ద అంతర్జాతీయ కంపెనీలు ఈ జీసీసీలను నూతన అవిష్కరణల కేంద్రాలుగా కూడా ఉపయోగించుకుంటాయి. ఈ సామర్థ్య కేంద్రాల మూలంగా మాతృసంస్థలకు మూడు నుంచి ఐదేళ్ల వ్యవధిలో నిర్వహణ వ్యయంలో సగటున దాదాపు 45 శాతం వరకు ఆదా అవుతుందని అంచనా. -
ఐటీకి తెలంగాణ బంగారు గని
సాక్షి, హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి తెలంగాణ రాష్ట్రం బంగారు గనిగా మారిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. దీంతో ఇక్కడ ఐటీ సంస్థలు, అందులో పనిచేసే ఉద్యోగులు గణనీయంగా లబ్ధి పొందుతున్నారని చెప్పారు. ఐటీ రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక పాలసీలు, ప్రోత్సాహకాలు అమలు చేస్తోందని వెల్లడించారు. డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ (డీట్), క్రెడిట్ రిపోర్టింగ్ బహుళ జాతి సంస్థ ఈక్విఫాక్స్ శుక్రవారం మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ఈ రెండు సంస్థల భాగస్వామ్యం ద్వారా ఉపాధి కల్పన ప్రక్రియ మెరుగ్గా, మరింత పారదర్శకంగా జరుగుతుంది. ఉద్యోగ కల్పన రంగంలో ఈ ఒప్పందం మైలురాయి వంటిది. సమర్థత కలిగిన ఉద్యోగులను సంస్థలు నియమించుకునేందుకు ఎంతో ఉపయోగపడుతుంది’అని వ్యాఖ్యానించారు. డీట్ వేదిక ద్వారా రాష్ట్రంలోని ఉద్యోగార్థులు తమ నైపుణ్యానికి తగిన ఉద్యోగాలను వెతుక్కోవచ్చని మంత్రి మల్లారెడ్డి అన్నారు. నియామక సంస్థలకు కూడా తమకు అవసరమైన మానవ వనరులను ఎంపిక చేసుకునే వీలు కలుగుతుందని చెప్పారు. ఉపాధి కల్పన రంగంలో ఈ తరహా వేదిక దేశంలోనే మొదటిదని ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. కార్యక్రమంలో ఈక్విఫాక్స్ ఇండియా ఎండీ కేఎం నానయ్య, వర్క్ఫోర్స్ సొల్యూషన్స్ ప్రతినిధి నిపా మోదీ, వర్క్రూట్ సీఈఓ మణికాంత్ చల్లా పాల్గొన్నారు. డీట్తో సత్వర ఉద్యోగాలు కృత్రిమ మేధస్సు (ఏఐ) టెక్నాలజీ ఆధారంగా వర్క్రూట్ సంస్థ భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ (డీట్) యాప్ను రూపొందించింది. ఉద్యోగాల కోసం అన్వేషించే వారు, ఉద్యోగాలిచ్చే వారు డీట్ వేదికగా సంప్రదింపులు జరుపుకునేలా యాప్ను సిద్ధం చేశారు. ఇలా ఎంపికైన ఉద్యోగుల వివరాలను వెరిఫై చేసేందుకు ప్రస్తుతం 8 నుంచి 10 రోజుల సమయం పడుతోంది. అయితే ప్రస్తుతం ఈక్విఫాక్స్తో డీట్ భాగస్వామ్యం ద్వారా ఇంటర్వ్యూలో ఎంపికైన ఉద్యోగుల వివరాలను తక్షణమే తెలుసుకునే అవకాశముంటుంది. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి కల్పన వాతావరణానికి డీట్, ఈక్విఫాక్స్ భాగస్వామ్యం కొత్త రూపునిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. -
నల్ల చట్టాలు పోవాల్సిందే..
షాద్నగర్ టౌన్, రూరల్: కేంద్ర ప్రభుత్వం రైతుల నెత్తిన నల్ల చట్టాలను రుద్ది, వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు కుట్ర పన్నుతోందని మున్సిపల్ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కర్షకులు తమ కడుపులు మాడ్చుకొని.. ఎముకలు కొరికే చలిని లెక్కచేయకుండా ఢిల్లీలో వారం రోజులుగా రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఆందోళన చేస్తున్నా కేంద్రం స్పందించడం లేదన్నారు. ఈ మూడు రైతు వ్యతిరేక చట్టాలను కేంద్రం వెనక్కితీసుకునే వరకు టీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. రైతన్నల బాగు కోసం.. వారికి అండగా నిలవాలనే సంకల్పంతో భారత్ బంద్ విజయ వంతానికి సీఎం కేసీఆర్ పిలుపు ఇచ్చారని చెప్పారు. భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ మంగళ వారం రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మండల పరిధిలోని బూర్గుల గేట్ వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై రైతులతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ.. ఈ చట్టాల పర్యవసానాలపై రైతులకు అవగాహన కల్పించే విధంగా టీఆర్ఎస్ తర ఫున గ్రామ గ్రామాన కార్యక్రమాలు చేపడతామన్నారు. వ్యవసాయం రాష్ట్రాల పరిధిలోని అంశమని, రాష్ట్రాల హక్కును హరించే విధంగా కేంద్రం వ్యవసాయ చట్టా లను చేయ డం సరికాదన్నారు. కేంద్రం బ్లాక్ మెయిలింగ్ రాజకీయా లకు పాల్పడుతోందని, వీటిని మానుకొని రైతుల సంక్షేమానికి పాటు పడాలని కేటీఆర్ హితవు పలికారు. సన్నాల మద్దతు ధరకు కేంద్రమే అడ్డు సన్నధాన్యానికి మద్దతు ధర ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా... కేంద్ర ప్రభుత్వం అడ్డుతగులుతోందని కేటీఆర్ అన్నారు. రాష్ట్రాలు మద్దతు ధర ఇస్తే కొనుగోళ్లను నిలిపివేస్తామని కేంద్రం నియంత్రణలో పనిచేసే ఎఫ్సీఐ స్పష్టంగా చెబుతోందన్నారు. పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని రైతులు కోరుతున్నా కేంద్రం నిమ్మకు నీరె త్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. దేశంలోని కోట్లాది మంది రైతుల్లో 85 శాతం చిన్న, సన్నకారు రైతులేనని... వారికి కార్పొరేట్ శక్తులతో కొట్లాడే బలం లేదన్నారు. మార్కెట్ కమిటీలు రద్దు చేస్తామని కేంద్రం చెప్పడం సరికాదన్నా రు. రైతులు ఎక్కడైనా పంటలు అమ్ముకోవచ్చని కేంద్రం చెబుతోందని.. చిన్న, సన్నకారు రైతులు తమ పంటలను మరోచోటికి తరలించి అమ్ముకోవడం సాధ్యమేనా? అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కేశవరావు, మన్నె శ్రీనివాస్రెడ్డి, మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘భారత్ బంద్’లో మంత్రులు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మంగళవారం రైతు సంఘాలు చేపట్టిన భారత్ బంద్కు టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత్ బంద్కు మద్దతుగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సహా మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంత్రి కేటీఆర్ రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని బూర్గుల వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై రైతులతో కలసి ధర్నాలో పాల్గొంటారు. ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ వై జంక్షన్ వద్ద నాగ్పూర్ రహదారి దిగ్బంధనం కార్యక్రమంలో పాల్గొంటారు. జిల్లాల్లో మంత్రులు, శాసనసభ్యులు.. వ్యవసాయ చట్టాలపై జరుగుతున్న భారత్ బంద్కు సంఘీభావంగా పలువురు మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ ప్రజా ప్రతినిధులు మంగళవారం తాము ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల్లో నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి వేల్పూరు, ఎర్రబెల్లి దయాకర్రావు మడికొండ, సత్యవతి రాథోడ్ మహబూబాబాద్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే నిరసన కార్యక్రమంలో పాల్గొననున్నారు. బంద్కు బందోబస్తు.. కేంద్రం ఇటీవల ఆమోదించిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విపక్ష పార్టీలు భారత్ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. బంద్ నేపథ్యంలో అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లతో డీజీపీ మహేందర్రెడ్డి టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ మినహా దాదాపు అన్ని పార్టీలు బంద్లో పాల్గొంటున్న నేపథ్యంలో పోలీసులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. పలు రైతు అనుబంధ సంఘాలు, విద్యార్థి సంఘాలు, ట్రేడ్ యూనియన్లు, ట్రాన్స్పోర్ట్ యూనియన్లు కూడా బంద్లో పాల్గొంటున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రణాళికలపై ఆయన పలు సూచనలు చేశారు. సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిరసన తెలుపుకోవాలని సూచించారు. బంద్ అనుకూల, వ్యతిరేక నేతలపై ఇంటెలిజెన్స్ పోలీసుల నిఘా కొనసాగుతోంది. వీలును బట్టి హౌస్ అరెస్టు చేసే అవకాశాలున్నాయని సమాచారం. -
జ్వాల అకాడమీ ఆఫ్ ఎక్స్లెన్స్ ప్రారంభం
మొయినాబాద్ (చేవెళ్ల): తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే 110 స్టేడియాలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని నాగిరెడ్డిగూడ రెవెన్యూలో ఉన్న సుజాత స్కూల్ ఆవరణలో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఏర్పాటు చేసిన గుత్తా జ్వాల అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ను ఆయన సోమవారం సాయంత్రం క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేసేందుకు, దేశానికి ఆదర్శంగా ఉండే నూతన స్పోర్ట్స్ పాలసీని ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులకు శిక్షణ ఇచ్చి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. స్టార్ షట్లర్ జ్వాల అకాడమీ ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో జ్వాల అకాడమీతో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ కలిసి పనిచేస్తుందన్నారు.లీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ అనితా రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, మొయినాబాద్ ఎంపీపీ నక్షత్రం జయవంత్, జెడ్పీటీసీ కాలె శ్రీకాంత్ పాల్గొన్నారు. సిద్ధమైన కోర్టులు -
ఆ మాటలను మీడియా ఆపాదించింది
సాక్షి, హైదరాబాద్: ‘నవంబర్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలుంటాయని నేను అన్నట్టు కొన్ని మీడియా సంస్థలు రిపోర్టు చేశాయి. జీహెచ్ఎంసీ యాక్టు ప్రకారం నవంబర్ రెండోవారం తర్వాత ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని, కనుక పార్టీ నాయకులు సిద్ధంగా ఉండాలని మాత్రమే నేను అనడం జరిగింది. ఎన్నికల షెడ్యూల్, నిర్వహణ పూర్తిగా ఎన్నికల కమిషన్ పరిధిలోని అంశం. సదరు మీడియా సంస్థలు నేను అనని మాటలను నాకు ఆపాదించడం జరిగింది’అని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు బుధవారం ట్వీట్ చేశారు. మంగళవారం జీహెచ్ఎంసీ పరిధిలోని మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో నిర్వహించిన సమావేశంలో బల్దియా ఎన్నికలపై కేటీఆర్ సంకేతాలిచ్చినట్టు పత్రికల్లో వార్తలు రావడంతో ఆయన ఈ మేరకు వివరణ ఇచ్చారు. -
జీరో అవర్లో హీరోగిరి చేస్తున్నారా?
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ ఏర్పాటైన తర్వాత అభివృద్ధి వేగం ఊపందుకుంది. ఇదివరకున్న ప్రభుత్వాలు చేయలేని సాహసోపేత కార్యక్రమాలన్నీ మా ప్రభుత్వం చేసింది. ఆ కృషిని ప్రజలు గుర్తించి అధికారాన్ని కట్టబెట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక మున్సిపాలిటీలు కైవసం చేసుకుని చరిత్ర సృష్టించాం. ఇదంతా గమనించాలి. వాస్తవాలను గుర్తించాలి. జీరో అవర్లో అవకాశం దొరికిందని హీరోగిరి చేస్తే కుదరదు’అని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. గురువారం అసెంబ్లీ జీరో అవర్లో కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మాట్లాడుతూ.. మున్సిపాలిటీలను ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించలేదని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలతో తన నియోజకవర్గ పరిధిలోని చౌటుప్పల్, చండూరు మున్సిపాలిటీల్లోని పలు కాలనీల్లో వర్షపునీరు చేరి చెరువులను తలపించాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రత్యేకంగా నిధులు ఇచ్చి వసతులు కల్పించాలని కోరారు. మంత్రి కేటీఆర్ కలగజేసుకుంటూ పైవిధంగా స్పందించారు. ‘పట్టణ ప్రగతి కింద రూ.138 కోట్లు విడుదల చేశాం. సమస్యలన్నింటికీ పరిష్కారం చూపిస్తాం. ఆరేళ్లుగా మేము పనిచేయకుంటే అన్ని సీట్లు ఎలా వస్తాయి? అన్ని మున్సిపాలిటీల్లో మా పార్టీ ఎలా అధికారం కైవసం చేసుకుంటుంది? అని ప్రశ్నించారు. -
టెక్నాలజీతోనే వినూత్న మార్పులు
సాక్షి, హైదరాబాద్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వంటి నూతన సాంకేతికత సామాన్యుడి జీవితంలో మార్పులు తెచ్చే అవకాశముందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. ఆహారభద్రత, ఆరోగ్యం, వ్యవసాయం, పాలన, శాంతిభద్రతలు వంటి రంగాల్లో కృత్రిమ మేధస్సు(ఏఐ)ని పెద్ద ఎత్తున ఉపయోగించుకునే వీలుందన్నారు. ‘ఎక్స్పీరియెన్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ పేరిట నాస్కామ్ బుధవారం నిర్వహించిన వర్చువల్ ఇష్టాగోష్టిలో ‘ఐటీ పరిశ్రమలో ఏఐ పాత్ర – భారత్ చేపట్టాల్సిన చర్యలు’అనే అంశంపై కేటీఆర్ ప్రసంగించారు. ఏఐ ఉపయోగాలు, తెలంగాణ ప్రభుత్వం వాటిని అందిపుచ్చుకుంటు న్న తీరును వివరిస్తూ 2020ని తమ ప్రభు త్వం ‘ఇయర్ ఆఫ్ ది ఏఐ’గా ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రపంచ ఆర్థిక వేదిక, ఇంటెల్, ట్రిపుల్ ఐటీ, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ వంటి సంస్థలతో ఏఐ రంగంలో తాము ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పారు. ఓపెన్ డేటా పాలసీ ద్వారా సమాచారం ఏఐ టెక్నాలజీ వినియోగంలో పెద్ద ఎత్తున సమాచారం(డేటా) అవసరమని, డేటా వినియోగంలో ప్రభుత్వం అప్రమత్తతతో వ్యవహరిస్తోందని కేటీ ఆర్ వెల్లడించారు. ‘డేటా వినియోగం’, ‘వ్యక్తిగత గోప్యత’వంటి అంశాలపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పాలనలో డేటా వినియోగంపై లోతైన చర్చ జరగాలన్నారు. ఓపెన్ డేటా పాలసీలో భాగంగా వివిధ శాఖల సమగ్ర సమాచారాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఏఐ ప్రయోజనాలను అందిపుచ్చుకునేందుకు ప్రభుత్వం, విద్యారంగం, పరిశ్రమల నడుమ భాగస్వామ్యం ఏర్పడాలని అభిప్రాయపడ్డారు. వ్యవసాయ రంగంలోనూ.. వ్యవసాయ రంగంలో ఏఐ ద్వారా లాభం పొందేందుకు ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పర్ అగ్రికల్చరల్ ఇన్నోవేషన్’అనే ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. కాగా, ఏఐ రంగంలో తెలంగాణ ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తామని నాస్కామ్ ఇండియా ప్రెసిడెంట్ దేబ్జానీ ఘోష్ హామీ ఇచ్చారు. ఏఐపై నాస్కామ్ రూపొందించిన ‘సర్వే ఆఫ్ ఇండియన్ ఎంటర్ప్రైజెస్’నివేదికను కేటీఆర్ విడుదల చేశారు. -
ఆవిష్కరణలకు ప్రాధాన్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్న నేపథ్యంలో గ్రామీణ, వ్యవసాయ ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు పిలుపునిచ్చారు. ఔత్సాహిక యువతకు సేవలు అందిస్తున్న స్టార్టప్ ఇంక్యుబేటర్ ‘టీ హబ్’కార్యక్రమాలను ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, టీ హబ్ కార్యకలాపాలపై మంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, టీ హబ్, వీ హబ్, టీ వర్క్స్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ (రిచ్), తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) వంటి సంస్థలు ఏర్పాటైనట్లు కేటీఆర్ వెల్లడించారు. ఈ సంస్థల ద్వారా రాష్ట్రంలో ఆవిష్కరణలకు అనుకూల వాతావరణం ఏర్పడిందన్నారు. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఇంటింటా ఇన్నోవేటర్’ద్వారా గ్రామీణ యువతకు, విద్యార్థులకు ప్రోత్సాహం లభిస్తోందని మంత్రి వెల్లడించారు. పాఠశాల విద్యార్థుల వినూత్న ఆలోచనలకు అండగా నిలిచేందుకు పాఠశాల స్థాయిలోనే ఇన్నోవేషన్ కల్చర్ను అలవాటు చేయాలని, ఈ దిశగా విద్యా శాఖతో కలిసి ప్రణాళికలు సిద్ధం చేయాల్సిందిగా అధికారులకు సూచించారు. టీ హబ్ ద్వారా సాంకేతిక ఆవిష్కరణలతో పాటు గ్రామీణ, సామాజిక ఆవిష్కరణల పైనా దృష్టి సారించాలన్నారు. వివిధ రంగాల్లో ఆవిష్కరణలకు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, టీ హబ్, వీ హబ్ వంటి సంస్థల ద్వారా సహకారం అందించాలని ఆదేశించారు. సమావేశంలో ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, టీ హబ్ సీఈవో రవి నారాయణ్ తదితరులు పాల్గొన్నారు. టీ హబ్, స్టేట్ ఇన్నోవేషన్ సెల్ కార్యకలాపాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. -
85 వేల ‘డబుల్’ ఇళ్లు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో పేదల కోసం సుమారు లక్ష ఇళ్ల నిర్మాణం జరుగుతోందని రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. ఇందులో 85 వేల ఇళ్లను ఈ ఏడాది చివరి నాటికి అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు. ఒకటి రెండ్రోజుల్లో లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేస్తామని వెల్లడించారు. జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పథకంపై మంత్రి కేటీఆర్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్లతో పాటు జీహెచ్ఎంసీ హౌసింగ్, పురపాలక శాఖ ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. రూ.9,700 కోట్లతో డబుల్ ఇళ్లు.. దేశంలోని ఏ ఇతర మెట్రో నగరంలో లేని విధంగా జీహెచ్ఎంసీ పరిధిలో రూ.9,700 కోట్ల వ్యయంతో పేదల కోసం ఇళ్లు నిర్మిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. జీహెచ్ఎంసీ పరిధిలో వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులు చాలా చోట్ల ఆగస్టు నెలాఖరు నుంచి డిసెంబర్ చివరి నాటికి పూర్తవుతాయన్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో తాగునీరు, విద్యుత్, ఇతర మౌలిక వసతుల పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. పనులు పూర్తయిన చోట అర్హులైన పేదలకు ఇళ్లు పంపిణీ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గానికి 4 వేల ఇళ్లు.. జీహెచ్ఎంసీ పరిధిలో 75 వేల డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంతో పాటు మరో 10 వేల ఇళ్లు జేఎన్యూఆర్ఎం, వాంబే పథకం కింద నిర్మాణంలో ఉన్నట్లు అధికారులు నివేదించారు. డబుల్ బెడ్రూం ఇళ్లకు సంబంధించి జీహెచ్ఎంసీ దాని పరిసర జిల్లాల్లోని మొత్తం 24 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఒక్కో నియోజకవర్గానికి 4 వేల ఇళ్లు అందజేస్తామని తెలిపారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం కోసం స్థలాలు ఇచ్చిన మురికివాడల్లోని ప్రజల (ఇన్స్ట్యూ) జాబితా రూపొందించాలన్నారు. జీహెచ్ఎంసీ పరిసర జిల్లాల్లోని ప్రజల కోసం 10 శాతం ఇళ్లు కేటాయించినందున లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. సమావేశంలో జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయొద్దీన్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ పాల్గొన్నారు. -
కాలుష్య రహితంగా ఫార్మాసిటీ
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో హైదరాబాద్ ఫార్మా సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. మంగళవారం ‘టీ ఫైబర్’కార్యాలయంలో హైదరాబాద్ ఫార్మాసిటీపై జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్తో పాటు, ఆర్థిక, పురపాలక, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శులు పాల్గొన్నారు. ఫార్మాసిటీలో తమ యూ నిట్ల ఏర్పాటుకు వందలాది ఫ్యాక్టరీలు ఎదు రు చూస్తున్నాయని తెలిపారు. మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా కాలుష్య రహితంగా ఫార్మాసిటీని తీర్చిదిద్దాలని కేటీఆర్ అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఫార్మాసిటీని ఏర్పాటు చేసేందుకు పరిశ్రమల శాఖ అధికారులు ఇప్పటికే పలు దేశాల్లోని ఫార్మా క్లస్టర్లను సందర్శించిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. విండ్ ఫ్లో వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని మాస్టర్ప్లాన్ రూపొందించినట్లు వెల్లడించారు. ఫార్మాసిటీని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు జీరో లిక్విడ్ డిశ్చార్జి యూనిట్లు ఎక్కువగా ఏర్పాటవుతాయని తెలిపారు. రసాయన వ్యర్థాలను కేంద్రీకృతంగా శుద్ధి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని, ఫార్మాసిటీలో పనిచేసే వారికి అక్కడే నివాస సౌకర్యం ఉంటుందన్నారు. ఫార్మాసిటీకి అనుబంధంగా అత్యుత్తమ విద్యా సంస్థలు ఏర్పడతాయని పేర్కొన్నారు. అలాగే స్థానికులకు ఉద్యోగాలు కల్పించేందుకు నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి పాల్గొన్నారు. -
పూర్తి నివేదికతో రమ్మన్నారు: కేటీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: వరంగల్ మామునూరు ఎయిర్పోర్టును ‘ఉడాన్’ పథకంలో చేర్చాలని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరీని కోరినట్లు తెలంగాణ ఐటీ, పురపాలక శాఖా మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్) తెలిపారు. అదే విధంగా పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన రూ.2537.81 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. కేంద్ర మంత్రితో సోమవారం భేటీ అయిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. (మున్సిపాలిటీల్లో వార్డుకో ఆఫీసర్!) ఈ సందర్భంగా.. కేసీఆర్ సర్కారు ప్రతిపాదించిన నూతన పురపాలక చట్టంలోని అంశాలను హర్దీప్సింగ్ పూరికి వివరించినట్లు తెలిపారు. ఇందుకు స్పందించిన ఆయన.. అక్టోబర్లో మరోసారి పూర్తి నివేదికతో రావాలని సూచించినట్లు పేర్కొన్నారు. వీటితో పాటు స్వచ్ఛ భారత్, అమృత్ పథకం నిధులు, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ రూ.784 కోట్లు విడుదల చేయాలని కోరినట్లు కేటీఆర్ వెల్లడించారు. ఇళ్ల నిర్మాణం కోసం ఇవ్వాల్సిన రూ.1184 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశానన్నారు. -
ప్రపంచం చూపు మన వైపు
సాక్షి, హైదరాబాద్: ‘టీకా’తాత్పర్యం తెలంగాణ చెప్పగలదని మన దేశమే కాదు, ప్రపంచదేశాలూ భావిస్తున్నాయి. అందుకు తగ్గట్టే ఇక్కడ కరోనాకు దేశంలో తొలి స్వదేశీ వ్యాక్సిన్ను భారత్ బయోటెక్ రూపకల్పన చేస్తోంది. ‘బయోలాజికల్ ఇ’ కంపెనీ సైతం ఆ దిశగా ప్రయత్నాలు సాగిస్తోంది. వ్యాక్సి న్ల తయారీలో ప్రపంచానికి తెలంగాణ రాజ ధాని కావడంతో కోవిడ్–19 వ్యాక్సిన్ అభివృద్ధికి సహకరించాల్సిన బాధ్యత రాష్ట్రంపై ఉంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంద’ని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు అన్నారు. కరోనా సమస్య పరిష్కారానికి యావత్ ప్రపంచం మరోసారి భారతదేశం వైపు చూస్తోందన్నా రు. కరోనాకు దేశంలో తొలి స్వదేశీ వ్యాక్సి న్ను భారత్ బయోటెక్ రూపకల్పన చేయడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. ‘బయోలాజికల్ ఇ’ కంపెనీ సైతం కరోనా వ్యా క్సిన్ అభివృద్ధిలో గణనీయమైన పురోగతి సాధించిందని కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశా రు. కోవిడ్–19 వ్యాక్సిన్ అభివృద్ధిలో పురోగతిని తెలుసుకోవడానికి కేటీఆర్ మంగళవారం ఇక్కడి జినోమ్ వ్యాలీని సందర్శించి భా రత్ బయోటెక్, ‘బయోలాజికల్ ఇ’ సంస్థల నాయకత్వ బృందాన్ని కలుసుకున్నారు. టీకా అభివృద్ధిలో ఈ కంపెనీలు ఎదుర్కొం టున్న సవాళ్లను తెలుసుకోవడంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అవసరమైన సహకారాన్ని అందించడానికి మంత్రి కేటీఆర్ ఈ పర్యటన జరిపారు. కరోనా కష్టకాలంలో లైఫ్ సైన్సెస్ కీలకం ‘వ్యాక్సిన్ రేస్: బ్యాలెన్సింగ్ సైన్స్ అండ్ అర్జెన్సీ’అనే అంశంపై జినోమ్ వ్యాలీలో మంత్రి కేటీఆర్ చర్చ నిర్వహించడంతోపాటు సం ధానకర్తగా వ్యవహరించారు. కరోనా కష్టకాలంలో లైఫ్ సైన్సెస్ రంగం కీలకంగా ఉద్భవించిందని, టీకా పరిశ్రమ అతిపెద్ద ఆశాకిరణంగా మారిందన్నారు. ప్రపంచవ్యాప్త పం పిణీ కోసం వ్యాక్సిన్ అభివృద్ధి, ఉత్పత్తిలో భారత వ్యాక్సిన్ రంగం కీలక పాత్ర పోషి స్తుందని పదేపదే చెప్పుకుంటున్నారన్నారు. ప్రపంచ వ్యాక్సిన్ చిత్రపటంలో హైదరాబా ద్కు మాత్రమే ప్రాధాన్యత పెరుగుతోందని చెప్పారు. రాష్ట్రంలో టీకాల పరిశ్రమల అభివృద్ధి, కొత్త ఔషధ పరిశ్రమల ఏర్పాటుకు కేటీఆర్ దూరదృష్టితో సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నారని భారత్ బయోటెక్ చైర్మన్, ఎండీ డాక్టర్ క్రిష్ణ ఎం.ఎల్లా ప్రశంసించారు. వ్యాక్సిన్లకు అనుమతిచ్చే ప్ర క్రియను వికేంద్రీకరించాలని, రాష్ట్రాల్లో వీటి కి సంబంధించిన ప్రాంతీయ కార్యాలయాల ను ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రంలో ఫార్మా, లైఫ్సైన్సెస్ పరిశ్రమల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి కేటీఆర్ తీవ్రంగా కృషి చేస్తున్నారని బయోలాజికల్ ఇ సంస్థ ఎండీ మహిమ దాట్ల కొనియాడారు. ప్రపం చంలోని ప్రతి ఒక్కరికీ టీకాలు చేరాలనేది తమ కంపెనీ అభిమతమని చెప్పారు. విస్తృ త స్థాయిలో కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్ష లు నిర్వహించి వైద్యసదుపాయం కల్పించడానికి ప్రభుత్వం సమగ్ర ప్యాకేజీని తీసుకురావాలని డాక్టర్ సౌమ్య స్వామినాథన్ అ న్నారు. దేశంలో వ్యాక్సిన్ను అభివృద్ధి చేసేపనిలో ఉన్న సంస్థలన్నీ ఒకేతాటిపైకి రావాలని, డాక్టర్ ఆనంద్కుమార్ సూచించారు. -
హ్యాపీ బర్త్డే తారక్.. ధన్యవాదాలు అన్నా!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖల మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్)కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ప్రియమైన నా సోదరుడు తారక్కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆ దేవుడు మీకు ఆరోగ్యాన్ని, అంతులేని సంతోషాలను ప్రసాదించాలి’’అని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఇందుకు స్పందించిన కేటీఆర్.. ‘‘ధన్యవాదాలు అన్నా’’ అని బదులిచ్చారు.(కేటీఆర్కు శుభాకాంక్షలు వెల్లువ) Many thanks Anna 🙏 https://t.co/Zm5sXBYa8n — KTR (@KTRTRS) July 24, 2020 అదే విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విడదల రజిని కూడా ట్విటర్ వేదికగా కేటీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సేవలో నిమగ్నమై యువతలో స్ఫూర్తి నింపుతున్న మీకు అన్ని సంతోషాలు దక్కాలి అని ఆకాంక్షించారు. కాగా శుక్రవారం కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రాజకీయ, సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ మంత్రి, కేటీఆర్ బావ హరీష్ రావు, టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్, మెగాస్టార్ చిరంజీవి తదితరులు కేటీఆర్ను విష్ చేశారు. Birthday Greetings to @KTRTRS Garu who has been an inspiration to youth in public life. May you be blessed with good health and happiness.🎂#KTR pic.twitter.com/n8j5f5SC9T — Rajini Vidadala (@VidadalaRajini) July 24, 2020 -
వీధి వ్యాపారుల కోసం ప్రత్యేక జోన్లు: కేటీఆర్
సాక్షి, మహబూబ్నగర్: వెనకబడిన పాలమూరు జిల్లాను తెలంగాణ అగ్రగామి జిల్లాగా మారుస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు పేర్కొన్నారు. మహబూబ్నగర్లో సోమవారం పర్యటించిన మంత్రి ఈ సందర్భంగా జిల్లాలో ఎక్స్పో ప్లాజాను ప్రారంభించారు. అనంతరం కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... పాలమూరు జిల్లాపై సీఎం కేసీఆర్కు ప్రత్యేక శ్రద్ధ ఉందని వ్యాఖ్యానించారు. జిల్లాలోని పట్టణాలు, గ్రామాలను అభివృద్ధి బాటలో నిలుపుతామన్నారు. వీధి వ్యాపారుల కోసం ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమాన్ని నిరాటంకంగా చేస్తున్నామని తెలిపారు. దళారుల ప్రమేయం లేకుండా పథకాలు అమలు చేస్తున్నామని ఉమ్మడి జిల్లాలో సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకు నీరంధిస్తామన్నారు. ప్రతిపక్షాల ఆరోపణలు పట్టించుకోవాల్సిన పని లేదని మంత్రి పేర్కొన్నారు. చదవండి: మహానగరం ఇక విశ్వనగరం: కేటీఆర్ -
కరోనాపై పైశాచికానందం
కరీంనగర్ రూరల్: కరోనాపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మునిసిపల్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆపత్కాలంలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ.. ప్రభుత్వంపై బురద చల్లడం కేవలం పైశాచికానందం తప్ప సాధించేదేమీ ఉండదన్నారు. బుధవారం కరీంనగర్ శివారు నగునూరులో ప్రతిమ సంచార వైద్యశాలను మంత్రులు ఈటల రాజేందర్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్కుమార్తో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భం గా కేటీఆర్ మాట్లాడుతూ.. విపక్షాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘తెలంగాణలో కరోనా టెస్టులు, చేయడం లేదు.. డేటా దాస్తున్నారు.. కేసీఆర్ సర్కార్ వైఫల్యం చెందింది’అని విపక్షాలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాయని, అదే నిజమైతే మరణాలు సంఖ్య ఎలా దాచగలమని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో కరోనాతో 98 శాతం రోగులు కోలుకుంటున్నారని, దేశవ్యాప్తంగా 3 శాతం మరణాల రేటుంటే.. తెలంగాణలో 2 శాతం మాత్రమే ఉందని, ఇది ప్రభుత్వం చేపట్టిన పకడ్బందీ కట్టడి చర్యలు కాదా అని ప్రశ్నించారు. ప్రపంచంలో కరోనా బారిన పడని దేశం అంటూ లేదన్నారు. వ్యాక్సిన్ వచ్చే వరకు లాక్డౌన్ విధించి ఇళ్లలో ఉండలేని పరిస్థితి నెలకొందని చెప్పారు. ఈ వైరస్ వల్ల ఎంతమంది చనిపోతారో తెలియదు గానీ, ఆర్థిక ఇబ్బందులతో ఎన్ని ఉద్యోగాలు పోతాయో కూడా తెలియని పరిస్థితి ఉందన్నారు. మళ్లీ లాక్డౌన్ విధిస్తే ప్రజలు ఉపాధి కోల్పోతారని పేర్కొన్నారు. అందరికి జీవితం.. జీవనోపాధి ముఖ్యమని, కరోనాతో సహజీవనం చేస్తూనే ఉపాధి, అభివృద్ధి సాధించాలని మంత్రి కోరారు. ప్రతిపక్షాలు కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. కరోనాతో రాజకీయాలు చేయడం ఇది సరైన సమయం కాదని, ఇంకా నాలుగేళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. అక్కడక్కడా లోపాలు లేవని తాను అనడం లేదని, వాటిని సరిదిద్దేందుకు సూచనలు ఇవ్వాలని విపక్షాలను కోరారు. కేవలం ప్రభుత్వం మాత్రమే కరోనాకు ఏదో చేయాలని అనుకునే కంటే, అందరూ బాధ్యతగా మెలగాలని కేటీఆర్ కోరారు. ఆరోగ్య రంగంలో మంచి అవకాశాలు ఆరోగ్య రంగంలో మన దేశానికి మంచి అవకాశాలు రాబోతున్నాయని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఫార్మారంగంపై మన రాష్ట్రం నుంచి పనిచేస్తున్న నాలుగు కంపెనీలు దూసుకుపోతున్నాయని పేర్కొన్నారు. 78 శాతం వైద్య పరికరాలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, కానీ అందులో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. 22 వైద్య కళాశాలలు..15 వేలకు పైగా పడకలు: ఈటల వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం కరోనా టెస్టులు చేస్తున్నామని స్పష్టం చేశారు. కరోనాపై మొదట స్పందించి, కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కరీంనగర్లో కంటైన్మెంట్ విధానాన్ని ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా నిలిచినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్తో మాట్లాడి రెండు, మూడు రోజుల్లో ప్రైవేట్ బోధనాస్పత్రుల్లో కరోనా రోగులకు వైద్యసేవలపై తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. వైద్య కళాశాలల్లో కరోనా చికిత్సకు మార్గదర్శకాలు రూపొందిస్తామని తెలిపారు. 22 వైద్య కళాశాలల్లో కలిపి 15 వేలకుపైగా పడకలు అందుబాటులో ఉన్నాయని ఈటల వెల్లడించారు. సోషల్ మీడియాలో అందరూ డాక్టర్లే.. ఒక కార్యక్రమంలో ఉపసభాపతి పద్మారావుకు తాను మాస్క్ ఇచ్చానని మంత్రి కేటీఆర్ చెప్పారు. కానీ పద్మారావు మాస్క్ ధరించకుండా జేబులో పెట్టుకున్నారని గుర్తు చేశారు. ఏం కాదన్నా.. హైదరాబాద్ వాళ్లం గట్టిగా ఉంటామని చెప్పుకొచ్చారని, చివరకు ఆయనకే కరోనా సోకిందన్నారు. జాగ్రత్త పాటించడం మన కోసమే కాదు.. మన కుటుంబ సభ్యులకు రక్షణ కోసమని పేర్కొన్నారు. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ప్రతి ఒక్కరూ వైద్యుల్లా సలహాలు ఇస్తున్నారని చలోక్తులు విసిరారు. -
ఇంటింటికీ ఇంటర్నెట్
సిరిసిల్ల: రాష్ట్ర వ్యాప్తంగా టీ–ఫైబర్ ద్వారా ఇంటింటికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రంగంపేటలో 307 మంది గిరిజన రైతులకు పట్టాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టీ–ఫైబర్ పనులు సాగుతున్నాయని, ఇంటింటికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హరి తహారం ద్వారా పెద్దఎత్తున మొక్కలు నాటుతూ భవిష్యత్ తరాలకు ఆక్సిజన్ అందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. అడవిని నరికితే కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవర్నీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. న్యాయమైన వాటా వాడుకుంటున్నాం కృష్ణా, గోదావరి నదుల్లో న్యాయమైన నీటి వాటాను కాళేశ్వరం, సీతారామ, పాలమూరు ఎత్తిపోతల ద్వారా వాడుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. రైతులకు దీర్ఘకాలంగా మేలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. దేశానికి రైతులే వెన్నెముక అని, వ్యవసాయాన్ని పండుగ చేయాలన్నదే ముఖ్యమంత్రి ధ్యేయమన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా వ్యవసాయ రంగానికి 24 గంటలు ఉచిత కరెంటును అందిస్తున్నామని, పెట్టుబడి సాయం గా ఇంతటి కరోనా కష్టకాలంలో 57 లక్షల మంది రైతులకు రూ. 7,200 కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్నారు. రైతులకు బీమా కల్పించి ధీమా ఇస్తున్నామని, ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని గట్టిగా నమ్మే వ్యక్తి కేసీఆర్ అని మంత్రి పేర్కొన్నారు. దమ్మున్న, దక్షత ఉన్న, చిత్తశుద్ధి ఉన్న నాయకుడు కేసీఆర్ అని కితాబిచ్చారు. ముఖ్యమంత్రి ఏం చేసినా రైతుల లాభం కోసమే తప్ప తన స్వప్రయోజనాల కోసం కాదన్నారు. అక్కరకొచ్చే పంటలు వేస్తే లాభదాయకం అవుతుందని కేసీఆర్ గట్టిగా నమ్ముతున్నారని, పంటల సాగులో మార్పు వచ్చిందన్నారు. పాలనా సౌలభ్యం కోసం.. రాష్ట్రంలో పాలనా సౌలభ్యం కోసం 10 జిల్లాలను 33 జిల్లాలుగా, 30 రెవెన్యూ డివిజన్లను 73 రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేశామని కేటీఆర్ వివరించారు. 439 మండలాలు ఉండగా అదనంగా 131 మండలాలను కొత్తగా ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. 3,400 తండాలను కొత్త గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. రాష్ట్రంలో 42 లక్షల మందికి ఆసరా పింఛన్లు ఇస్తున్నామని వెల్లడించారు. ఇకపై అభివృద్ధిపైనే దృష్టి వచ్చే నాలుగేళ్లలో ఎలాంటి ఎన్నికలు లేవని, అభివృద్ధిపైనే దృష్టి సారిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. రూ.15 కోట్ల వ్యయంతో వీర్నపల్లి మం డలం రాశిగుట్టతండా, మద్దిమల్ల, సోమారం పేట, వన్పల్లి, శాంతినగర్ వద్ద నిర్మించిన ఐదు వంతెనలను మంత్రి ప్రారంభించారు. కంచర్లలో 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. గర్జనపల్లిలో రైతువేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. -
నిర్మాణ సామగ్రి పరిశ్రమలకు ఊతం
సాక్షి, హైదరాబాద్: నిర్మాణ యంత్ర సామగ్రి తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి రాష్ట్ర ప్రభుత్వం సాదర స్వాగతం పలుకుతోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రకటించారు. వీటికోసం ఇప్పటికే రాష్ట్రంలో ప్రత్యేక పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేశామన్నారు. ఇండియా కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (సీఐఏ) ఆధ్వర్యంలో శనివారం జరిగిన వెబినార్లో కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, పారిశ్రామిక పార్కుల నిర్మాణాలతో నిర్మాణ రంగ యంత్ర సామగ్రి తయారీదారులకు మంచి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో రాబోయే రోజుల్లోనూ నిర్మాణరంగ యంత్రపరికరాల తయారీ రంగానికి మంచి డిమాండ్ ఉంటుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ రంగంలోని పరిశ్రమలు ఎదుర్కొంటున్న సవాళ్లు, అవకాశాలపై నివేదిక ఇవ్వాలని కోరారు. వీటి తయారీదారులు ఏటా నిర్వహించే ‘ఎక్స్కాన్’వంటి కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహిస్తే ఆతిథ్యం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ పరిశ్రమలకు అవసరమైన సిబ్బందికి ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆత్మ నిర్భర్ భారత్, మేకిన్ ఇండియా కార్యక్రమాల్లో స్వదేశీ తయారీ రంగానికి మరింత ప్రాధాన్యమివ్వాలని అభిప్రాయపడ్డారు. హైస్పీడ్ నెట్వర్క్, నూతన ఎయిర్పోర్టులు, భారీ సాగునీటి ప్రాజెక్టులు, పారిశ్రామిక వాడల నిర్మాణం వంటి మౌలిక వసతుల ద్వారానే భారత్ అగ్ర దేశాల సరసన చేరుతుందన్నారు. దీనిలో కీలక పాత్ర పోషించే కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ పరిశ్రమకు సంబంధించి కీలకమైన విధాన నిర్ణయాలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని కేటీఆర్ వెల్లడించారు. కోవిడ్ మహమ్మారి ప్రభావం అన్ని రంగాలపైనా ఉందని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, కరోనా సంక్షోభంలోనూ వలస కార్మికులను ఆదుకున్న విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. కాగా, రాష్ట్రంలో అమలవుతున్న ప్రాజెక్టులను సీఐఏ అభినందించింది. సిమెంటు ధరల తగ్గింపు దిశగా చర్యలు: మంత్రి కేటీఆర్ హైదరాబాద్లో నిర్మాణ రంగం గత ఆరేళ్లుగా అభివృద్ధిపథాన కొనసాగుతోందని, కరోనా కల్లోలంలోనూ అదే ఒరవడి కొనసాగేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న నిర్మాణరంగం ఎదుర్కొంటున్న సమస్యలు, భవిష్యత్తు మార్గనిర్దేశంపై చర్చించేందుకు శనివారం ప్రగతిభవన్లో నిర్మాణ రంగ సంఘాల ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. సిమెంట్ ధరల పెరుగుదలపట్ల నిర్మాణరంగ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేయగా, ధరల తగ్గింపు దిశగా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. హైదరాబాద్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని వారికి పిలుపునిచ్చారు. దేశంలోని ఇతర మెట్రోనగరాల్లో నిర్మాణ రంగ పరిస్థితి అయోమయంగా ఉన్నప్పటికీ, హైదరాబాద్లో పర్వాలేదని నిర్మాణ రంగ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్ అప్రూవల్, మాస్టర్ ప్లాన్లకు సంబంధించి వారిచ్చిన సూచనల పట్ల మంత్రి సానుకూలంగా స్పందిస్తూ నిర్మాణ రంగానికి అండగా ఉంటామని హామీనిచ్చారు. ప్రస్తుతంæ సైట్ల వద్ద పనిచేస్తున్న అతిథి కార్మికుల వివరాలను క్రోడీకరించి తమకు అందజేయాలని, సంక్షోభ సమయాల్లో వారికి తొందరగా సహాయక చర్యలు చేపట్టేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. నిర్మాణ రంగ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకునే అన్ని నిర్ణయాలకు మద్దతు ఇస్తామని నిర్మాణ సంఘాల ప్రతినిధులు హామీ ఇచ్చారు. తెలంగాణ ఉత్పత్తులకు జీఐ బ్రాండింగ్ ‘తెలంగాణ జీఐ’పై రూపొందించిన ‘ఈ బుక్’ ఆవిష్కరణలో మంత్రి కేటీఆర్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: వివిధ వస్తువుల పుట్టుపూర్వోత్తరాలను తెలియజేయడంలో భౌగోళిక సూచన (జియోలాజికల్ ఇండెక్స్–జీఐ) గుర్తులు కీలకపాత్ర పోషిస్తాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ‘తెలంగాణ జీఐ’పై రూపొందించిన ‘ఈ బుక్’ను శనివారం కేటీఆర్ ఆవిష్కరించారు. తెలంగాణకు సంబంధించి ప్రస్తుతం 15 వస్తువుల కు మాత్రమే జీఐ కింద నమోదయ్యాయని, తెలంగాణలో మరిన్ని ఉత్పత్తులు జీఐ కోసం నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. కనీసం జిల్లాకు ఒక ఉత్పత్తిని గుర్తించి జీఐ నమోదు కోసం ప్రయత్నించాల్సిన అవసరం ఉందన్నారు. తాజాగా విడుదలైన ‘ఈ బుక్’ద్వారా రాష్ట్రంలోని వివిధ ఉత్పత్తులు, ప్రదేశాలు, తయారీదారులకు సంబంధించిన సమాచారం అందుబాటులోకి వస్తుందన్నారు. ఆయా ఉత్పత్తుల తయారీలో ఏళ్ల తరబడి సా«ధించిన నైపుణ్యం, చరిత్ర, సంస్కృతి వెలుగులోకి వస్తుందని, జీఐ టూరిజంను ప్రోత్సహించడంలో ‘ఈ బుక్’ తోడ్పడుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా మొదట రాష్ట్రంలోని ఉత్పత్తులకు బ్రాం డ్ సాధించి పేరు గడించాలని కేటీఆర్ సూచిం చారు. కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ము ఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, హస్తకళల అభివృద్ధి సంస్థ ఎండీ శైలజా రామయ్యర్ పాల్గొన్నారు. -
10 నెలల్లో ‘టీ–ఫైబర్’ పూర్తి చేయాలి
సాక్షి, హైదరాబాద్: పటిష్టమైన డిజిటల్ నెట్వర్క్ అవసరాన్ని ప్రస్తుత కరోనా సంక్షోభం ఎత్తిచూపిందని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. రాష్ట్రంలోని ఇంటింటికీ ఇంటర్నెట్ సదుపాయం కల్పించేందుకు చేపట్టిన టీ–ఫైబర్ ప్రాజెక్టును వచ్చే 10 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన టీ–ఫైబర్ నెట్వర్క్ను మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు విస్తరించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కోరారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను వేగవంతం చేసేందుకు అవసరమైతే ‘రైట్ టు వే’చట్టాన్ని వినియోగించేందుకున్న అవకాశాలను పరిశీలిస్తామన్నారు. తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుపై మంగళవారం ఆయన ఇక్కడ సమీక్ష నిర్వహించారు. కరోనాపై యుద్ధంలో డిజిటల్ మౌలిక వసతులు ప్రభుత్వానికి ఉపయుక్తంగా మారాయన్నారు. ఆన్లైన్ విద్య, వైద్యం, ఈ–కామర్స్ సేవలకు ఏర్పడిన డిమాండ్ నేపథ్యంలో పటిష్టమైన డిజిటల్ నెట్వర్క్ కలిగి ఉండటం అత్యవసరమని చెప్పారు. లక్షల మంది ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం అవకాశాన్ని వినియోగించుకుని ఇళ్ల నుంచే పనిచేస్తున్నారని గుర్తు చేశారు. ఐటీ, అనుబంధ రంగాల్లో ఈ ట్రెండ్ భవిష్యత్తులో సైతం కొనసాగే అవకాశముందన్నారు. ఈ అవసరాలను తీర్చడానికి ఎలాంటి లోపాలు లేని పటిష్టమైన బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అవసరమని, టీ–ఫైబర్ ప్రాజెక్టుతో ఇది సాధ్యం కానుందని వెల్లడించారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు పూర్తయితే ప్రభుత్వం నుంచి ప్రభుత్వం (ఏ2ఏ), ప్రభుత్వం నుంచి పౌరులకు (ఏ2ఈ) అందించే సేవల్లో గణనీయమైన మార్పులు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాలను ప్రపంచంతో అనుసంధానం చేసేలా ఈ ప్రాజెక్టు ఉంటుందని తెలిపారు. ఆన్లైన్ విద్య/వైద్యం/వ్యవసాయ సేవల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే శక్తి ఈ ప్రాజెక్టుకు ఉందన్నారు. గ్రామీణ ప్రాంతా ల్లోని ఇంటర్నెట్ కనెక్టివిటీ వస్తుందని, దీం తో డిజిటల్ కంటెంట్ ప్రజలందరికీ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. రైతు వేదికల అనుసంధానం కొత్తగా నిర్మించనున్న రైతు వేదికలన్నింటిని టీ–ఫైబర్తో అనుసంధానం చేయాలని కేటీఆర్ ఆదేశించారు. గ్రామాల్లోని రైతు వేదికల నుంచి రైతులు నేరుగా ముఖ్యమంత్రి, మంత్రి, వ్యవసాయ అధికారులతో మాట్లాడే అవకాశం కల్పించేందుకు వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం కల్పించాలనే సీఎం కేసీఆర్ ఆలోచనలకు తగ్గట్టు చర్యలు తీసుకోవాలని చెప్పారు. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తుల ధరలు, దిగుబడుల పెంపకం వంటి విషయాల్లో గణనీయమైన లబ్ధి పొందేందుకు వీలు కలుగుతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అందుబాటులో ఉన్న డిజిటల్ నెట్వర్క్, స్టేట్ డేటా సెంటర్లను టీ–ఫైబర్ పరిధిలోకి తేవాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. -
రైతులు సంఘటితం కావాలి
సిరిసిల్ల: రాష్ట్రంలో రైతులను సంఘటితం చేసి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా పనిచేస్తోందని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బందనకల్లో బుధవారం గోదావరి జలాలతో నిండిన ఊర చెరువు వద్ద జలహారతి పట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో చేపట్టిన కాళేశ్వరం, సీతారామ, పాలమూరు ఎత్తిపోతల పథకాలతో కోటీ 25 లక్షల ఎకరాలకు సాగు నీరు అందనుందని చెప్పారు. రాష్ట్రంలో జల విప్లవంతో హరిత విప్లవం, నీలి విప్లవం, శ్వేత విప్లవం, పింక్ విప్లవం వస్తుందన్నారు. ఐదు విప్లవాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ధాన్యాగారంగా మారిందని, సారవంతమైన భూములతో దేశానికి ఆదర్శంగా ఉంటామని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని 46 వేల చెరువులను నింపుతామని, దీంతో కరెంటు అవసరం లేకుండా రెండు పంటలు పండుతాయని తెలిపారు. ఇంటింటికీ పాడి గేదెలను అందించే యోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఆరు మీటర్ల భూగర్భ జలం పెరిగింది ఏ రాష్ట్రంలో లేని విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏడాదిలోనే ఆరు మీటర్ల భూగర్భ జలం పెరిగిందని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలోనే యువ ఐఏఎస్లకు శిక్షణ ఇచ్చే ముస్సోరిలో సిరిసిల్ల వాటర్ మేనేజ్మెంట్ పాఠ్యాంశమైందని, ఇది గర్వకారణమన్నారు. సిరిసిల్ల మానేరు వాగులో 365 రోజులు నీరు నిల్వ ఉంటుందన్నారు. మేడిగడ్డ నుంచి గోదావరి జలాలు మల్లన్నసాగర్ వరకు రావడం ఒక అద్భుతమని, అది కేసీఆర్ పట్టుదలతోనే సాధ్యమైందన్నారు. సముద్ర మట్టానికి 82 మీటర్ల ఎత్తులో ఉన్న గోదావరి నీటిని 618 మీటర్ల ఎత్తుకు తరలించి రైతుల సాగు నీటి కలను కేసీఆర్ సాకారం చేశారన్నారు. కాంగ్రెసోళ్లకు సిగ్గు లేదు కాంగ్రెసోళ్లకు సిగ్గు లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో మంచి పనులు చేస్తే ఓర్వలేరని, ఏది చేసినా వక్రభాష్యం చెబుతున్నారని ఆరోపించారు. ఏ ఒక్కరికీ రైతు బంధు ఎగ్గొట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. ఈ నెల 13న కాంగ్రెస్ పార్టీ జల దీక్ష చేస్తామని ప్రకటించిందని, కుందేళ్లను చంపి న నక్కలే సంతాప సభ పెట్టినట్లుగా ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. చెరువులు నిండుతుంటే, పంటలు పండుతుంటే కాం గ్రెసోళ్ల కళ్లు మండుతున్నాయని ఆరోపించారు. ఎగువ మానేరును దసరా నాటికి నింపుతామని, మధ్యమానేరుతో పాటు మల్లన్నసాగర్ నుంచి కూడెల్లి వాగు ద్వారా ఎగువ మానేరులోకి గోదావరి జలాలను తరలిస్తామన్నారు. -
వంతెన కింద వంతెన
సాక్షి, హైదరాబాద్: వ్యూహాత్మక రహదారుల పథకం (ఎస్సార్డీపీ)లో భాగంగా జీహెచ్ఎంసీ చేపట్టిన పనుల్లో మరో ఫ్లైఓవర్ పనులు పూర్తయ్యాయి. బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద సెకండ్ లెవెల్ ఫ్లైఓవర్ ఇప్పటికే అందుబాటులోకి రాగా, ఫస్ట్ లెవెల్ ఫ్లైఓవర్ను మునిసిపల్ మంత్రి కేటీఆర్ గురువారం ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్తో బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సమస్య తీరనుంది. గచ్చిబౌలి వైపు నుంచి రాయదుర్గం మీదుగా మెహిదీపట్నం వైపు వెళ్లే వారికి దీని వల్ల ట్రాఫిక్ చిక్కులు తగ్గుతాయి. దీని వ్యయం రూ.30.26 కోట్లు. (భయం భయంగా ఆసుపత్రులకు) ఎస్సార్డీపీ ప్యాకేజీ–4 పూర్తి: ఈ ఫ్లైఓవర్ పూర్తితో ఎస్సార్డీపీలో ప్యాకేజీ–4 కింద మొత్తం రూ.379 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన అన్ని పనులు పూర్తయ్యాయి. ఇప్పటికే మైండ్స్పేస్ అండర్పాస్, మైండ్స్పేస్ ఫ్లైఓవర్, అయ్యప్ప సొసైటీ జంక్షన్ అండర్పాస్, రాజీవ్గాంధీ జంక్షన్ ఫ్లైఓవర్, బయోడైవర్సిటీ జంక్షన్ సెకెండ్ లెవెల్ ఫ్లైఓవర్ వినియోగంలోకి వచ్చాయి. దీంతో బయోడైవర్సిటీ జంక్షన్ (ఓల్డ్ ముంబై హైవే) నుంచి జేఎన్టీయూ(ఎన్హెచ్–65) మార్గంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గినట్టేనని, మొత్తం 12 కిలోమీటర్ల కారిడార్ పనులు పూర్తయ్యాయని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. -
స్ట్రాటజీ గ్రూప్ను ఏర్పాటు చేయండి
సాక్షి, హైదరాబాద్: ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలకు చెందిన పరిశ్రమలను చైనా నుంచి భారత్కు రప్పించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కే.తారక రామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తద్వారా దేశంలో పెద్దెత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. కరోనా నేపథ్యంలో జపాన్ లాంటి దేశాలు తమ కంపెనీలను చైనా నుంచి ఇతర దేశాలకు తరలించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు వస్తున్న ప్రకటనలను ప్రస్తావించారు. వివిధ రాష్ట్రాల ఐటీ శాఖ మంత్రులతో కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రస్తుత సంక్షోభంలోనూ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు పరిశ్రమలు సిద్ధంగా ఉన్నాయని, అందుకు అనుగుణంగా కేంద్రం సహకరించాలని సూచించారు. స్ట్రాటజీ గ్రూప్ను ఏర్పాటు చేయండి... కరోనా కట్టడి, లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత వ్యాపార, వాణిజ్య రంగాల నిర్వహణకు సంబంధించి పలు దేశాలు పారిశ్రామికవేత్తలు, మేధావులతో స్ట్రాటజీ గ్రూప్లను (వ్యూహ బృందాలు) ఏర్పాటు చేసిన విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. దేశంలోనూ ఐటీ పరిశ్రమకు సంబంధించి స్ట్రాటజీ గ్రూప్ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఐటీ కంపెనీలు ప్రస్తుతం ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పిస్తున్నందున, సమీప భవిష్యత్తులోనూ ఇది కొనసాగే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీ రంగంలో ఉన్న అవకాశాలను దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఇంటర్నెట్ వినియోగం పెరిగినందున బ్రాడ్ బ్యాండ్, నెట్వర్క్ల బలోపేతానికి కేంద్రం చొరవ తీసుకోవాలన్నారు. భారత్ నెట్ ప్రాజెక్టుకు అవసరమైన సహకారం అందించాలని కేటీఆర్ కేంద్రాన్ని కోరారు. మరో రెండు ఎలక్ట్రానిక్స్ క్లస్టర్లు... రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ క్లస్టర్లకు ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని మరో రెండింటిని మంజూరు చేయాలని కేటీఆర్ కోరారు. ప్రస్తుతం బయోటెక్నాలజీ, మెడికల్ డివైజెస్, ఫార్మా వంటి రంగాల్లో అనేక అవకాశాలు ఉత్పన్నం అవుతున్నట్లు చెప్పారు. ఈ రంగాల్లో ఐటీ ఆధారిత అవకాశాలు లేదా అయా రంగాల సమ్మిళితం ద్వారా వచ్చే కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ కామర్స్ రంగం మరింత విస్తరించే అవకాశం ఉన్నందున ప్రోత్సాహం అందించాలన్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ అనుబంధ రంగాల్లోని ఎంఎస్ఎంఈలు ఆర్థిక సంక్షోభంలో ఉన్నందున జీఎస్టీ, ఆదాయ పన్ను తదితరాల్లో మినహాయింపులు ఇవ్వాలన్నారు. అమెరికా, యూరప్ ఆర్థిక వ్యవస్థలు భారతీయ ఐటీ, అనుబంధ రంగాలపై ప్రభావం చూపే పక్షంలో, అందులోని మానవ వనరులను ఇతర రంగాలకు తరలించేలా ప్రణాళికలు అవసరమని కేటీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మూడు రోజుల్లో ప్రత్యేక పోర్టల్ కరోనా వైరస్ కట్టడి కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన ఆదర్శవంతమైన పద్ధతులు, కార్యక్రమాలను దేశవ్యాప్తంగా మిగిలినవారు ఉపయోగించుకోవడానికి వీలుగా ఒక ప్రత్యేక పోర్టల్ను మూడు రోజుల్లో ఏర్పాటు చేస్తామని కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ హామీ ఇచ్చారు. ఈ కామర్స్ రంగానికి చేయూతను అందిస్తామన్నారు. -
రంగనాయక సాగర్లోకి గోదారి జలాలు
-
కరువు నేల.. మురిసే వేళ
సాక్షి, సిద్దిపేట : సిద్దిపేట జిల్లా సరిహద్దుకు చేరిన గోదారమ్మను రంగనాయక సాగర్లోకి వదిలేందుకు శుక్రవారం ముహూర్తం ఖరారు చేశారు. మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ పంపులు ఆన్ చేసి గోదావరి జలాలను వదలనున్నారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ద్వారా మేడ్చల్, రంగారెడ్డి, భువనగిరి, సూర్యాపేట వరకు గోదావరి జలాలు పరుగులు పెట్టనున్నాయి. గోదావరి నది నుంచి 500 మీటర్ల ఎత్తున ఉన్న సిద్దిపేట నుంచి సూర్యాపేట వరకు ఉన్న బీడు భూములు తడిపి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనే సీఎం కేసీఆర్ కల సాకారం కానుంది. నేడు రంగనాయక సాగర్లోకి గోదావరి అనంతగిరి సాగర్ రిజర్వాయర్ నుంచి పంపులు ఆన్ చేసి గోదావరి జలాలను రంగనాయక సాగర్కు వదలనున్నారు. సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరు మండలంలో ఈ రిజర్వాయర్ నిర్మించారు. దీని సామర్థ్యం 3 టీఎంసీలు. రిజర్వాయర్కు 8.6 కిలోమీటర్ల చుట్టూ భారీ కట్టను నిర్మించారు. కట్ట నిర్మాణం, దాని చుట్టూ రాతి కట్టడం, కట్టపై చమన్ ఏర్పాటుతో పాటు ఇంజనీరింగ్ అధికారుల కార్యాలయం, పర్యాటకులకు విశ్రాంతి భవనం నిర్మించారు. చదవండి: లాక్డౌన్ ఎప్పుడు ఎత్తివేసేదీ చెప్పలేం రంగనాయక సాగర్ రిజర్వాయర్ ద్వారా సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు, నారాయణరావుపేట, సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్, నంగునూరు, దుబ్బాక, చేర్యాల, మద్దూరు కోహెడతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పలు ప్రాంతాలకు సాగునీరు అందుతోంది. ఇలా సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో మొత్తం 409 చెరువులను గోదావరి జలాలతో నింపనున్నారు. సిద్దిపేట జిల్లాలో 78 వేల ఎకరాలకు, సిరిసిల్ల జిల్లాలోని 32 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. వెంటనే మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్కు.. రంగనాయక సాగర్ రిజర్వాయర్ ద్వారా సిద్దిపేట జిల్లాకు అడుగిడిన గోదావరి జలాలను వెంటనే జిల్లాలోని మల్లన్న సాగర్ రిజర్వాయర్ వరకు, అక్కడి నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు తీసుకెళ్లేందుకు పనులు వేగంగా జరుగుతున్నాయి. 24 కిలోమీటర్ల పొడవుతో నిర్మించే మల్లన్న సాగర్ రిజర్వాయర్కు 50టీఎంసీల సామర్థ్యం ఉంది. ఈ రిజర్వాయర్ ద్వారా సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ తదితర జిల్లాలకు భారీ ప్రయోజనం కలగనుంది. అయితే రిజర్వాయర్ నిర్మాణంలోని కొంత భూసేకరణ పూర్తి కాలేదు. దీంతో అప్పటి వరకు మల్లన్న సాగర్ రిజర్వాయర్ వరకు చేరిన నీటిని కాల్వల ద్వారా చెరువుల్లోకి నింపడంతో పాటు, కింద ఉన్న కొండపోచమ్మ సాగర్ వరకు నీటిని తరలించేందుకు 18 కిలో మీటర్ల మేరకు గ్రావిటీ కెనాల్ నిర్మించారు. దీంతో మల్లన్న సాగర్ రిజర్వాయర్ వద్దకు చేరిన నీరు కొండపోచమ్మ సాగర్ వరకు చేరుతాయి. రంగనాయకసాగర్ పంప్హౌస్ను పరిశీలిస్తున్న మంత్రి హరీశ్రావు ‘కొండపోచమ్మ’తో 2.85 లక్షల ఆయకట్టుకు నీరు సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గంలో ‘కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నిర్మాణం పూర్తయింది. దీని సామర్ధ్యం 15 టీఎంసీలు. జగదేవ్పూర్, తుర్కపల్లి, గజ్వేల్, రామాయంపేట, కిష్టాపూర్, ఉప్పరపల్లి, శంకరంపేట, ఎం.తుర్కపల్లి మొత్తం ఎనిమిది ప్యాకేజీలతోపాటు సంగారెడ్డి కెనాల్ ద్వారా మొత్తం 2.85 లక్షల ఆయకట్టుకు నీరు అందిస్తారు. అలాగే.. ఉమ్మడి మెదక్, రంగారెడ్డి జిల్లాకు సాగునీరు, తాగునీరు సరఫరాకు ఈ రిజర్వాయర్ ద్వారా నీరు అందిస్తారు. వీటితోపాటు బస్వాపూర్, గందమల్ల రిజర్వాయర్లతో అనుసంధానం చేసి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని భువనగిరి, సూర్యాపేట జిల్లాల వరకు సాగు నీరు అందించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. సీఎం కేసీఆర్ అకుంఠిత దీక్షా ఫలం కరువు నేలకు గోదావరి జలాలు తరలించి పునీతం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అకుంఠిత దీక్షా ఫలితమే రంగనాయక సాగర్ రిజర్వాయర్ నిర్మాణం. సాగు నీటి కోసం బోర్లు వేసి బోర్లా పడిన రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్న చరిత్ర ఈ గడ్డకు ఉంది. స్వయానా రైతుగా కేసీఆర్ చూసిన కష్టాలను తీర్చే మార్గమే కాళేశ్వరం ప్రాజెక్టు. ఇప్పుడు గోదావరి జలాలు కరువు నేలను ముద్దాడాయి. ఈ ప్రాంతంలో కరువు అనేది గతం. సూర్యచంద్రులు ఉన్నంత కాలం సీఎం కేసీఆర్ కీర్తి నిలుస్తుంది. ఈ మహా యజ్ఞంలో భాగస్వామ్యమైన నా జన్మ చరితార్థమైంది. – హరీశ్రావు, ఆర్థిక శాఖ మంత్రి -
మీ సేవలకు వెలకట్టలేని అభినందన..
-
కరోనాపై యుద్ధంలో తొలి సిపాయిలు మీరే!
సాక్షి, హైదరాబాద్: ‘‘ఏమ్మా.. నీ పేరేంటి?.. ‘‘పిల్లలెంత మంది?.. ఏం చదువుతున్నారు?’’ ‘‘మీకేమైనా సమస్యలున్నాయా..?’’ ఇలా పేరుపేరునా మునిసిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికుల యోగక్షేమాలను ఆరా తీశారు. సంజీవయ్య పార్కు ఎదుట ఉన్న జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగంలోని డీఆర్ఎఫ్ శిక్షణ కేంద్రంలో బుధవారం ఆయన జీహెచ్ఎంసీ పారిశుధ్య, ఎంటమాలజీ, డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి భోజనం చేశారు. లాక్డౌన్ సమయంలో మీరంతా డాక్టర్లు, పోలీసులకు ధీటుగా పనిచేస్తున్నారని వారిని మంత్రి అభినందించారు. కరోనాపై యుద్ధంలో మీరే తొలి సిపాయిలని, మీరంతా కష్టపడుతున్నారంటూ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలంతా ఇప్పుడు మిమ్మల్ని, మీ సేవల్ని గుర్తిస్తున్నారని కితాబునిచ్చారు. కొందరికి తానే వడ్డించారు. వారి కుటుంబీకుల ఆరోగ్య పరిస్థితిని, వారేం చేస్తున్నదీ అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మీ వెంటే మేమున్నామంటూ ధైర్యమిచ్చారు. ‘పనికి వెళ్లొద్దంటూ మీ ఇంట్లో వాళ్ల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయా?, కరోనా వల్ల మీకేమైనా భయంగా ఉందా?’అంటూ వారితో ముచ్చటించారు. భౌతిక దూరం పాటిస్తూ ఈ భోజనాల కార్యక్రమం నిర్వహించారు. ప్రజల కోసం పనిచేసేవారిని ప్రభుత్వం గౌరవిస్తుంది.. కరోనా నియంత్రణలో విశిష్ట సేవలందిస్తున్న శానిటేషన్, ఎంటమాలజీ, డీఆర్ఎఫ్ సిబ్బందికి కూడా పూర్తి జీతంతో పాటు ప్రోత్సాహకాలను సీఎం కేసీఆర్ ఇస్తున్నారని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. ప్రజల కోసం నిరంతరం పనిచేసేవారిని ప్రభుత్వం గౌరవిస్తుందన్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీ చుట్టుపక్కల వారికి వివరించాలని కోరారు. వర్షాకాలం రానున్నందున దోమల వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని ఎంటమాలజీ విభాగానికి సూచించారు. ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే బాల్క సుమన్, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్, డిప్యూటీ మేయర్ మహ్మద్ బాబా ఫసియుద్దీన్, అదనపు కమిషనర్ (శానిటేషన్) రాహుల్రాజ్, ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ కాంపాటి, సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఏ ఒక్కరినీ తొలగించొద్దు: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: ఒక్క కార్మికుడిని కూడా ఉద్యోగం నుంచి తొలగించరాదని, మే నెలలో కూడా కార్మికులు, ఉద్యోగులందరికీ జీతాలు చెల్లించాలని రాష్ట్రంలోని పరిశ్రమల యాజమాన్యాలకు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు స్పష్టం చేశారు. పరిశ్రమలు మూతపడటంతో కార్మికుల్లో ఆందోళన నెలకొందని,∙విపత్కర పరిస్థితుల్లో కార్మికులకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు పరిశ్రమల యాజమాన్యంపై ఉందని కోరారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డితో కలసి సోమ వారం జీహెచ్ఎంసీ కమాండ్ కంట్రోల్ రూం నుంచి అన్నిజిల్లాల కార్మిక, పరిశ్రమల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యుత్ బిల్లులు, ఆస్తి పన్నుల చెల్లింపు విషయంలో పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం పలు వెసులుబాట్లు కల్పించిందని గుర్తు చేశారు. వారి బాధ్యత మనమీదే... శాశ్వత ఉద్యోగులతో పాటు వలస కార్మికుల సంక్షేమాన్ని చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. మానవీయకోణంలో వలస కార్మికులకు కూడా 12 కిలోల బియ్యాన్ని, రూ.500 నగదును ప్రభుత్వం ఇస్తుందన్నారు. పేదలు, వలస కార్మికుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలను ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయన్నారు. ఫ్యాక్టరీల వద్దే ఉండిపోయిన కార్మికులకు నిత్యావసరాలు అందించాల్సిన బాధ్యత తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రేషన్కార్డులేని వారికి బియ్యం, నగదు మంజూరు చేసే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు కల్పించామన్నారు. పని ప్రదేశాల్లో ఉన్న కార్మికులకు వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. వలస కార్మికులు రోడ్డు మీదకు వస్తే ఇప్పటి వరకు అమలు చేసిన లాక్డౌన్ వృథా అవుతుందని, అందుకే ఎక్కడి కార్మికులను అక్కడే ఉంచాలని మంత్రి స్పష్టం చేశారు. ఇళ్లలోనే రంజాన్ పవిత్ర రంజాన్ నెల ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకుంటూ కరోనా వైరస్ నివారణలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు పూర్తిగా సహకరిం చనున్నట్లు ముస్లిం మత పెద్దలు తెలిపారు. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి వీడియో కాన్ఫరెన్స్ కోసం వచ్చిన మంత్రి కేటీఆర్ కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిలను ముస్లిం మత పెద్దలు ఖుబుల్ పాషా సత్తారి, ముఫ్తీ ఖలీల్ అహ్మద్, మహ్మద్ పాషా, ఇఫ్తెకారి పాషాల బృందం స్వచ్ఛందంగా కలిసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ మాసం నేపథ్యంలో సామాజిక దూరాన్ని పాటించడానికి తమ ఇళ్ల వద్దనే అన్ని ప్రార్థనలు నిర్వహించాలని ముస్లింలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు వివరించారు. -
అంతా బాగుంటాంరా
కరోనా వైరస్పై పోరాటంలో కీలక పాత్ర పోషిస్తున్న వైద్య, పారిశుధ్య, పోలీస్ సిబ్బంది కృషిని అభినందిస్తూ మంచు మనోజ్ ఓ పాటను విడుదల చేశారు. ‘‘అంతా బాగుంటాంరా ...’’ అంటూ సాగే ఈ పాటను కాసర్ల శ్యామ్ రచించగా, అచ్చు కంపోజ్ చేశారు. తన మేనకోడలు విద్యా నిర్వాణతో (మంచు లక్ష్మి కుమార్తె) కలసి ఈ పాటను పాడారు మంచు మనోజ్. ఆదివారం ఈ పాటను మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. ‘‘ఈ పాట కొందరి మనస్సులో అయినా ఆశను, స్ఫూర్తిని కలిగిస్తుందనే నమ్మకం ఉంది’’ అని పేర్కొన్నారు మనోజ్. -
ఉద్యోగులను తొలగించొద్దు
సాక్షి, హైదరాబాద్: కరోనా సవాల్ను సమష్టిగా ఎదుర్కోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) తెలంగాణ చాప్టర్ సభ్యులతో శనివారం వీడియో కాన్ఫరెన్స్లో కేటీఆర్ సంభాషించారు. మరోవైపు పారిశ్రామిక వర్గాలు ఎట్టిపరిస్థితుల్లోనూ ఉద్యోగులను తొలగించవద్దని విజ్ఞప్తి చేస్తూ లేఖ రాశారు. లే ఆఫ్లు లేకుండా ఉద్యోగులకు అండగా నిలిచేందుకు అవసరమైతే కంపెనీలు ఇతర ఖర్చులు తగ్గించుకోవాలని సూచించారు. నమ్మకం, భరోసా ద్వారానే లాక్డౌన్ తర్వాత కూడా పారిశ్రామికాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. పారిశ్రామిక వర్గాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. అన్నిరంగాల మద్దతు కోరుతున్నాం కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి కేటీఆర్ సీఐఐ సభ్యులకు వివరించారు. ప్రస్తుత సంక్షోభంలో పారిశ్రామిక రంగానికి అవకాశాలు ఉన్నాయని, రాబోయే రోజుల్లో హెల్త్కేర్, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బయోటెక్ రంగాలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఆయా రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై విజన్ డాక్యుమెంట్ రూపొందించాలని సీఐఐ ప్రతినిధులను కేటీఆర్ కోరారు. ఎంఎస్ఎంఈ రంగానికి సహకారం అందించాలని సీఐఐ ప్రతినిధులు మంత్రిని కోరారు. పారిశ్రామిక వర్గాలకు అండగా ఉంటాం లాక్డౌన్ తర్వాత ఆర్థిక అభివృద్ధి తిరిగి గాడిన పడుతుందనే విశ్వాసాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించినా భౌతిక దూరానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందన్నారు. వైద్య రంగంలో మౌళిక సదుపాయాల కల్పనకు కంపెనీలు తమ సీఎస్సార్ ని«ధులు వెచ్చించాలని కేటీఆర్ కోరారు. -
ఆ మందులు ఎవరెవరు కొన్నారు?
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి చెందిన ప్రస్తుత పరిస్థితుల్లో సొంత వైద్యం మరింత ప్రమాదమని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా లక్షణాలైన జ్వరం, గొంతు నొప్పి నివారణకు ఇటీవల కాలంలో మెడికల్ షాపుల నుంచి మందులు కొనుగోలు చేసిన వారి వివరాలను తెలుసుకోవాలని ఆదేశించారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ల సహకారంతో ఆయా మున్సిపాలిటీల్లోని ఫార్మసీ అసోసియేషన్ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమై సమాచారాన్ని సేకరించాలన్నారు. జ్వరం, గొంతు నొప్పి మందులను కొనుగోలు చేసిన వారి వివరాలను తప్పనిసరిగా అందజేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. మంత్రులు ఈటల రాజేందర్, శ్రీనివాస్గౌడ్తో కలసి మంత్రి కేటీఆర్ శుక్రవారం జీహెచ్ఎంసీ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కంటైన్మెంట్ జోన్లలోని ప్రజలను ఇళ్లకే పరిమితం చేయాలని మున్సిపల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లను కేటీఆర్ ఆదేశించారు. ఉల్లంఘిస్తే కేసులే.. కరోనా వైరస్ను అరికట్టేందుకు కంటైన్మెంట్ జోన్లలో నిబంధనలను పటిష్టంగా అమలు చేయాలని కేటీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో 260 కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేస్తే, జీహెచ్ఎంసీ పరిధిలోనే 146 జోన్లు ఉన్నాయన్నారు. ఇతర జిల్లాల్లోని 43 మున్సిపాలిటీల్లో మిగిలిన 114 కంటైన్మెంట్ జోన్లు ఉన్నట్లు తెలిపారు. పాలు, కూరగాయలు, నిత్యావసరాలు, మెడిసిన్స్ను ఇళ్ల వద్దకే సరఫరా చేయాలని సూచించారు. ప్రభుత్వం నియమించిన వలంటీర్లు, సిబ్బందితో మాత్రమే నిత్యావసరాలను డోర్ డెలివరీ చేయించాలన్నారు. వీలైతే వలంటీర్లు, సిబ్బందికి ప్రత్యేక దుస్తులు అందజేయాలన్నారు. కంటైన్మెంట్ జోన్లలోకి దాతలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోరాదన్నారు. కంటైన్మెంట్ జోన్లలోని కుటుంబాల మొబైల్ నంబర్లతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి, అవసరాలను తెలుసుకోవాలన్నారు. కంటైన్మెంట్ నిబంధనలు అతిక్రమించిన వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ప్రజల సహకారం పైనే కంటైన్మెంట్ జోన్ల తొలగింపు ఆధారపడి ఉంటుందని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో 15 కంటైన్మెంట్ జోన్లను తొలగించినట్లు మంత్రి ఉదహరించారు. వలస కార్మికులు తమ రాష్ట్రాలు, జిల్లాలకు వెళ్లేందుకు తొందరపడుతున్నప్పటికీ, రోడ్లపైకి ఎవరిని అనుమతించరాదని తెలిపారు. వలస కార్మికులకు ప్రస్తుతం వారున్న ప్రాంతంలోనే భోజన సదుపాయాలు కల్పించాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. -
పాప ఏడుస్తోంది.. పాలు కావాలి
వెంగళరావునగర్: తల్లిలేని 5 నెలల పాపకు పాలులేవంటూ రాష్ట్రమంత్రి కేటీఆర్కు ఓ వ్యక్తి ట్వీట్ చేయడంతో మంత్రి స్పందించి డిప్యూటీ మేయర్ ద్వారా సాయం అందించారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ డివిజన్ ప్రేమ్నగర్లో లకాన్సింగ్, జ్యోతిలు దినసరి కూలీలు . వారికి 5 నెలల పాప ఉంది. అనారోగ్య కారణాలతో నెలరోజుల కిందట పాప తల్లి జ్యోతి మృతి చెందింది. దాంతో తండ్రి లకాన్సింగ్ పాపకు తానే ప్యాకెట్ పాలు పట్టిస్తూ ఉన్నాడు. లాక్డౌన్ కారణాల వల్ల ఆ పాపకు గురువారం తండ్రి పాల ప్యాకెట్ తీసుకురాలేకపోయాడు. పాలులేక ఆ రాత్రి పాప ఏడుస్తుంటే ఈ విషయాన్ని వారి ఇంటి పక్కనే ఉంటున్న నవీన్ అనే యువకుడు మంత్రి కేటీఆర్కు ట్వీట్ చేశాడు. దానికి మంత్రి కేటీఆర్ అప్పటికప్పుడు స్పందిస్తూ సమీపంలో బోరబండ వద్ద నివసిస్తున్న డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్కు తెలియజేసి పాపకు పాలను చేరేలా చూడాలని కోరారు. కేటీఆర్ సూచన మేరకు గురువారం అర్ధరాత్రి ఒంటి గంట సమ యంలో డిప్యూటీ మేయర్ బాబా హుటాహుటిన ఎర్రగడ్డకు పాలు తీసుకుని వెళ్లి పాప తండ్రికి అందించడంతో పాటుగా ఆ కుటుంబానికి నెలకు సరిపడా నిత్యా వసర సరుకులు అందించారు. తమ కుటుంబానికి సాయం అందించడంతో పాటుగా పాపకు పాలు సకాలంలో అందించిన కేటీఆర్కు, డిప్యూటీ మేయర్కు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం విషయం తెలుసుకుని మంత్రి కేటీఆర్ డిప్యూటీ మేయర్ను అభినందించారు. -
జీహెచ్ఎంసీ ఎన్నికలే లక్ష్యం..
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సి పల్ కార్పొరేషన్ పాలక మండలి పదవీ కాలం వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగియనుంది. 2016 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్లకు గాను 99 చోట్ల పార్టీ అభ్యర్థు లు కార్పొరేటర్లుగా విజయం సాధించడంతో పా టు సొంత బలంతో జీహెచ్ఎంసీ పీఠాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. జీహెచ్ఎంసీ పాలక మం డలి పదవీ కాలం ఏడాది లోపు ముగియనుండటంతో, మరోమారు గ్రేటర్ పీఠాన్ని దక్కించుకునేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అభివృద్ధి మంత్రంతో ప్రజల్లోకి వెళ్లిన టీఆర్ఎస్, వచ్చే ఎన్నికల్లోనూ అదే నినాదంతో ప్రజల్లోకి వెళ్లేలా వ్యూహా న్ని రూపొందిస్తోంది. ఈ ఏడాది అక్టోబర్లోగా జీహెచ్ఎంసీ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు చేపట్టిన కీలక అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయడంపై మున్సిపల్ శాఖ మంత్రి హోదా లో ఉన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ప్రత్యేక దృష్టి సారించారు. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, ప్రచారం తదితరాల్లో అంతా తానై వ్యవహరించిన కేటీఆర్ వచ్చే ఏడాది జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో మరోమారు పార్టీ వ్యూహం అమ ల్లో కీలక పాత్ర పోషించేలా వ్యూహ రచన చేస్తున్నారు. 2018 ముందస్తు ఎన్నికల్లో వరుసగా రెం డో పర్యాయం అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన అన్ని రకాల ఎన్నికల్లో నూ ఏకపక్ష విజయాన్ని నమోదు చేస్తూ వస్తోంది. గతేడాది ఏప్రిల్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ప్ర త్యర్థి పార్టీలపై స్వల్ప ఆధిక్యత చూపిన టీఆర్ఎస్, స్థానిక సంస్థలు, మున్సిపల్, సహకార ఎన్నికల్లో మాత్రం విజయాలను నమోదు చేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఏకపక్ష విజయం సాధించేం దుకు ఇప్పటి నుంచే పార్టీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని నిర్ణయించింది. డివిజన్ల వారీగా నివేదికలు.. గత ఎన్నికల్లో అభివృద్ధి ఎజెండాతో ప్రజల్లోకి వెళ్లిన టీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లోనూ ఇదే అంశాన్ని ప్రచారాస్త్రంగా చేసుకోవాలని భావిస్తోంది. దీనిలో భాగంగా స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ కింద చేపట్టిన ఫ్లైఓవర్లు, అండర్పాస్ల నిర్మాణం, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, తాగునీరు తదితర పనులను ఈ ఏడాది అక్టోబర్ నాటికి పూర్తి చేసేలా మున్సిపల్ మంత్రి హోదాలో కేటీఆర్ గడువు నిర్దేశించారు. 2020–21 వార్షిక బడ్జెట్లో హైదరాబాద్ మౌలిక సౌకర్యాల కల్పనకు రూ.10 వేల కోట్లు కేటాయించడంతో పాటు, ఐదేళ్ల పాటు ఏటా రూ.10 వేల కోట్లు కేటాయిస్తామని వెల్లడించారు. ఓవైపు అభివృద్ధి పనులను కొనసాగిస్తూనే డివిజన్ల వారీగా పార్టీ పరిస్థితిపైనా కేటీఆర్ దృష్టి సారించారు. మున్సిపల్ ఎన్నికల తరహాలో జీహెచ్ఎంసీ డివిజన్ల పరిధిలో పార్టీ పరిస్థితిని అంచనా వేసేందుకు త్వరలో పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులతో కేటీఆర్ సమావేశమవుతారు. డివిజన్ల వారీగా ప్రస్తుత కార్పొరేటర్ల పనితీరు, పార్టీ యంత్రాంగం తదితరాలపై పార్టీ నేతలు క్షేత్ర స్థాయిలో పర్యటించి నివేదికలు రూపొందిస్తారు. నివేదికలు అందిన తర్వాత జీహెచ్ఎంసీ పరిధిలో పార్టీ పనితీరును మదింపు చేసి యంత్రాంగాన్ని అప్రమత్తం చేసేలా కేటీఆర్ కార్యాచరణ రూపొందిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
త్వరలో వరంగల్ ఎయిర్పోర్ట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్రంలో ఆరు విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు శుక్రవారం వెల్లడించారు.అందరికీ విమానయోగం కల్పించాలన్న సంకల్పంతో పాత ఎయిర్పోర్టుల పునరుద్ధరణతోపాటు కొత్తవి ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మారుమూల ప్రాంతాలను అనుసంధానించేందుకు హెలిపోర్ట్స్ తేనున్నట్లు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్లోని జక్రాన్పల్లి, మహబూబ్నగర్ జిల్లా అడక్కల్ మండలం గుదిబండ వద్ద కొత్త విమానాశ్రయాల ఏర్పాటుతోపాటు వరంగల్ సమీపంలోని మామునూరు, పెద్దపల్లి జిల్లాలోని బసంతనగర్, ఆదిలాబాద్ వద్ద ఉన్న విమానాశ్రయాల పునరుద్ధరణ చేపట్టనున్నట్లు తెలిపారు. వింగ్స్ ఇండియా ప్రదర్శన, సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ‘రాష్ట్రంలో ఎయిర్పోర్టుల ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాను కన్సల్టెంట్గా నియమించాం. వరంగల్ విమానాశ్రయం త్వరితగతిన కార్యరూపంలోకి వచ్చేందుకు అన్ని శాఖలతో కలిసి పనిచేస్తున్నాం. ఇది వస్తే రాష్ట్రంలో ప్రాంతీయ విమానయాన రంగానికి ఊతమిస్తుంది.మెగా టెక్స్టైల్ పార్క్, ఐటీ హబ్కు తోడ్పాటు లభిస్తుంది. ‘ఉడాన్’లో భాగంగా వరంగల్ విమానాశ్రయాన్ని జత చేయాలని కేంద్రాన్ని కోరాం’అని చెప్పారు. భారత్లో తొలి అటానమస్ బగ్గీని ఆవిష్కరించిన అనంతరం అందులో కేటీఆర్ ప్రయాణించారు. డ్రైవర్ లేకుండానే నడుస్తుంది. -
మార్పునకు ముందడుగు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పట్టణాల మార్పే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన తొలి విడత పట్టణ ప్రగతి విజయవంతమైందని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కె.తారకరామారావు ప్రకటించారు. పట్టణాల్లో గుణాత్మక మార్పునకు తొలి అడుగుగా భావిస్తున్నామని, మార్పుదిశగా ఒక ముందడుగు పడిందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారన్నారు. అది ముగిసిన అనంతరం పట్టణాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోందన్నారు. నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం(ఎంసీఆర్హెచ్ఆర్డీ)లో శుక్రవారం ఆయన జిల్లా అదనపు కలెక్టర్లతో సమావేశమై పట్టణ ప్రగతి కార్యక్రమం పురోగతిని సమీక్షించారు. -
‘లంచం అడిగితే తాట తీస్తాం..’
సాక్షి, జనగామ: ‘లంచాలను అరికట్టడానికే ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త మున్సిపల్ చట్టం తీసుకొచ్చారు.. 600 గజాల లోపు ఇల్లు కట్టుకునే వారు ఆన్లైన్లో సెల్ఫ్ అసెస్మెంట్ ఇస్తే అనుమతి పత్రాలు 21 రోజుల్లో మీ ఇంటికే వస్తాయి. ఎవరినీ అడగక్కరలేదు. ఎవరైనా లంచం అడిగితే తాట తీస్తాం’అని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు హెచ్చరించారు. పట్టణ ప్రగతిలో భాగంగా బుధవారం జనగామ మున్సిపాలిటీలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం అంబేడ్కర్ కమ్యూనిటీ హాలులో ఏర్పాటు చేసిన ‘పట్టణ ప్రగతి’సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. çపట్టణాల్లోని నిరుపేదలకు విడతల వారీగా డబుల్ బెడ్రూం ఇళ్లను మంజూరు చేస్తామని, ఇళ్ల మంజూరు కోసం ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి కొత్త పింఛన్లు ఇస్తామని, ‘ఆదాయం పెంచాలి.. పేదలకు పంచాలనేది’కేసీఆర్ లక్ష్యమని పేర్కొన్నారు. కొత్త మున్సిపాలిటీ చట్టం ప్రకారంగా పట్టణాల్లో నాటిన మొక్కల్లో 85% బతక్కపోతే కౌన్సిలర్, చైర్మన్ పోస్టులు ఊడుతాయని ఆయన హెచ్చరించారు. ఊరూ రా, పట్టణాల్లో నర్సరీలు ఏర్పాటు చేస్తున్నామని, ఇళ్లు, కాలనీల్లో మొక్కలు పెంచాలని కోరారు. పుట్టినప్పటి నుంచి కాటికిపోయే వరకు.. పుట్టినప్పటి నుంచి కాటికి పోయే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. పింఛన్లను రెట్టింపు, ప్రతి మనిషికి 6 కిలోల బియ్యం, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, ఆరోగ్య లక్ష్మి, హాస్టళ్లల్లో చదువుకునే పిల్లలకు సన్న బియ్యం, నాణ్యమైన విద్య అందిస్తున్నామని వివరించారు. ప్రజల మధ్యలో ఉండాలనే కేసీఆర్ మమ్మల్ని జనంలోకి పంపిస్తున్నారని, దళిత కాలనీల్లో పర్యటించాలని చెప్పారన్నారు. పేదల కష్టాలను తెలుసుకునేందుకే ఇక్కడికి వచ్చానన్నారు. తడి, పొడి చెత్త సేకరణకు సహకరించాలి తడి, పొడి చెత్త సేకరణకు ప్రజలు సహకరించాలని మంత్రి కోరా రు. తడి చెత్తను కరెంటు ఉత్పత్తి కోసం, పొడి చెత్తతో ఎరువు తయారు చేసి రైతులకు వినియోగిస్తామన్నారు. సిరిసిల్లలో పొడి చెత్తతో మెప్మా మహిళలు నెలకు రూ.2.50 లక్షల ఆదాయం పొందుతున్నారు.. చూడటానికి బస్సు తీసుకొని సిరిసిల్లకు రావాలని కోరారు. కేసీఆర్కు మొక్కలంటే మహా ఇష్టమని, జనగామ పక్కనే ఉన్న సిద్ధిపేట నియోజకవర్గంలో 1985–86 ప్రాంతంలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన కేసీఆర్ ఆ కాలంలోనే హరిత సిద్ధిపేట కార్యక్రమాన్ని చేపట్టారని గుర్తు చేశారు. పట్టణ ప్రగతిలో భాగంగా మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, కలెక్టర్ కె.నిఖిలతో కలసి జనగామ మున్సి పాలిటీల్లోని 13, 30 వార్డుల్లోని అంబేడ్కర్ కాలనీల్లో గడపగడపకు వెళ్లారు. నమస్తే అమ్మా.. నీ పేరేంటి తల్లీ.. పింఛన్ వస్తుందా.. అంటూ వృద్ధులను అడిగి తెలుసుకున్నారు. -
వైద్య పరికరాల దిగుమతులకు చెక్ పెట్టాలి
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఉపయోగించే వైద్య పరికరాల్లో 80 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని ఈ పరిస్థితి మారాలని మంత్రి కె.తారక రామారావు స్పష్టం చేశారు. మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా వైద్య పరికరాల తయారీకి పెద్దపీట వేయాలని, వైద్య పరికరాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా తమ ప్రభుత్వం కూడా ఆ దిశగా ముందడుగు వేసిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, ఫెడరేషన్ ఆఫ్ ఆసియన్ బయోటెక్ అసోసియేషన్స్ (ఫాబా) సంయుక్తంగా నిర్వహించిన బయో ఆసియా సదస్సు బుధవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై వైద్య పరికరాల తయారీ కేంద్రంలో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన ఐదు కంపెనీలకు భూ కేటాయింపు పత్రాలను అందజేశారు. ఐబీఎం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కృత్రిమ మేధ పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. బయో ఆసియా వంటి సదస్సులు ప్రభుత్వాలకు, పరిశ్రమలకు ఎన్నో గొప్ప అవకాశాలను కల్పిస్తున్నాయన్నారు. 17వ బయో ఆసియా సదస్సుకు 35 దేశాల నుంచి 2,000 మంది హాజరయ్యారని, వచ్చే ఏడాది ఈ సదస్సు మరింత విస్తృత స్థాయిలో నిర్వహించాలన్నది తమ ఆకాంక్ష అని చెప్పారు. స్టార్టప్ కంపెనీలకు అవార్డులు... బయో ఆసియాలో భాగంగా స్టార్టప్ కంపెనీల పోటీల్లో విజేతలుగా నిలిచిన ఐదు కంపెనీలకు కేటీఆర్ నగదు బహుమతులు అందజేశారు. పోటీ కోసం వందల దరఖాస్తులు రాగా నిశిత పరిశీలన తరువాత 70 కంపెనీలకు బయో ఆసియాలో తమ ఉత్పత్తులను ప్రదర్శించేందుకు అవకాశం కల్పించామని, సీసీఎంబీ, టెక్ మహేంద్ర వంటి సంస్థల నుంచి ఎంపిక చేసిన న్యాయనిర్ణేతలు 5 కంపెనీల ను విజేతలుగా నిర్ణయించారని ఐఐఐటీ ప్రొఫెసర్ రమేశ్ లోకనాథన్ తెలిపారు. నవజాత శిశువులకు వచ్చే కామెర్ల రోగానికి చికిత్స అందించే పరికరాన్ని అభివృద్ధి చేసిన ‘హీమ్యాక్ హెల్త్ కేర్’, డాక్టర్ల అపాయింట్మెంట్లు మొదలు, వారి లభ్యత, ప్రత్యేకతల గురించి టెలిఫోన్లో వివరించేందుకు వాడే కృత్రిమ మేధ ఆధారిత సేవలను అందిస్తున్న ‘కాల్జీ’, ఆధునిక టెక్నాలజీతో పనిచేసే ఊతపు కర్రలు (క్రచెస్)ను తయారు చేసిన ‘ఫ్లెక్సీ మోటివ్స్’, శరీర అవయవాల త్రీడీ మోడళ్ల ద్వారా గాయాలు, శస్త్రచికిత్సల నుంచి కోలుకునే సమయాన్ని సగానికి తగ్గించే ‘లైకాన్ త్రీడీ’, ఈ–కోలీ బ్యాక్టీరియాలో మార్పుల ద్వారా మందుల తయారీకి అవసరమైన ప్రొటీన్లను ఉత్పత్తి చేయగల ‘ఆంకోసెమిస్’కు ఈ అవార్డులు లభించాయి. -
ఆరోగ్య రంగంలో అగ్రగామిగా భారత్
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్య రంగంలో ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచే సత్తా భారత్కు ఉందని, 50 కోట్ల మంది ప్రజలకు మెరుగైన ఆరోగ్యం కల్పించేందుకు చేపట్టిన ఆయుష్మాన్ భారత్ వంటి కార్యక్రమాలు ఇందుకు నిదర్శనమని అంతర్జాతీయ ఫార్మా కంపెనీ నోవార్టిస్ సీఈవో వాస్ (వసంత్) నరసింహన్ స్పష్టం చేశారు. దేశంలోని మేధో సంపత్తిని దృష్టిలో ఉంచుకున్నా, బయో టెక్నాలజీ, ఆరోగ్య రంగాల్లో మన శక్తి సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకున్నా భారత్ ప్రపంచంపై తనదైన ముద్ర వేసేం దుకు ఇది మంచి తరుణమని అభిప్రాయపడ్డారు. జీవశాస్త్ర పరిశ్రమల రంగంలో విశేష కృషి జరిపేందుకు బయో ఆసియా ఏటా అందించే జినోమ్ వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డును వాస్ నరసింహన్ మంగళవారం అందుకున్నారు. మంత్రి కె.తారక రామారావు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. అనంతరం వైద్య రంగంలో వస్తున్న మార్పులపై వాస్ ప్రసంగించారు. మందులనేవి వచ్చి కేవలం రెండు మూడు వందల ఏళ్లు మాత్రమే అయిందని మందులతో చేసే వైద్యం కూడా ఇప్పుడు మారి పోయి.. కణ ఆధారిత, జన్యు ఆధారిత వైద్యంగా పరిణమిస్తోందన్నారు. కేన్సర్తోపాటు గుండె జబ్బులకు, మలేరియా, శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు కూడా కణ ఆధారిత చికిత్సలు అందుబాటులోకి వచ్చే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. హైదరాబాద్ కేంద్రంగా బయోమ్.. నోవార్టిస్కు ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద కేంద్రం ఉందని, దీనికి అదనంగా బయోమ్ పేరుతో ఇంకో వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని వాస్ నరసింహన్ ప్రకటించారు. -
హ్యాపీ బర్త్డే కేసీఆర్
జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, మోదీ, వైఎస్ జగన్ సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు 66వ జన్మదినం సందర్భంగా రాష్ట్రపతి, ప్రధానితో సహా దేశం నలుమూలల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సుఖ సంతోషాలతో, సంపూర్ణ ఆరోగ్యంతో నిండు జీవితం గడపాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఫోన్ ద్వారా సీఎం కేసీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు. చిరకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ‘జన్మదిన శుభాకాంక్షలు సీఎం కేసీఆర్ గారూ, ఆరోగ్యంగా, సంతోషంగా రాబోయే రోజుల్లో మరింత ప్రజా సేవ చేయాలని కోరుకుంటున్నా’అని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలిపారు. లోక్సభ స్పీకర్ ఓంప్రకాశ్ బిర్లా కూడా కేసీఆర్కు ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఫోన్లో జగన్ శుభాకాంక్షలు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు ఆయన జన్మదినం సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ఫోన్లో శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు గారికి హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు. దేవుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని, చిరకాలం ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా’ అని ముఖ్యమంత్రి జగన్ ట్వీట్ కూడా చేశారు. మమత, పళని, సంగ్మా.. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా, ఛత్తీస్గఢ్ గవర్నర్ అనుసూయ ఉయికె, పంజాబ్ గవర్నర్ వీపీ సింగ్ బద్నోర్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదితరులు సీఎం కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు జగన్, మమతా బెనర్జీ తదితరులకు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. సందడిగా ప్రగతి భవన్ కేసీఆర్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్లు, అకాడమీల చైర్మన్లు, అధికారులు, వివిధ రంగాలకు చెందిన వారితో సోమవారం ప్రగతిభవన్ పరిసరాలు సందడిగా మారాయి. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రాధాన్యతను వివరిస్తూ రూపొందించిన పాటల సీడీని ఈ సందర్భంగా సీఎం విడుదల చేశారు. మంత్రి హరీశ్రావు భావోద్వేగ ట్వీట్ కేసీఆర్ జన్మదినం సందర్భంగా ట్విట్టర్లో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు భావోద్వేగ సందేశాన్ని పోస్ట్ చేశారు. ‘తెలంగాణ మీ స్వప్నం. ఈ రాష్ట్రం మీ త్యాగ ఫలం. ఈ అభివృద్ధి మీ దక్షతకు నిదర్శనం. ఈ నేలకు మీరే శ్రీరామ రక్ష. తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు శత వసంతాలు చూడాలని కోరుకుంటూ’.. అంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాగా, వీరితో పాటు యూఎస్ కాన్సుల్ జనరల్ జోయల్ రీఫ్మన్, హిమాచల్ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. తల్లిని కన్న తనయుడు.. మా నాన్న కేటీఆర్ ట్వీట్ ‘తల్లిని కన్న తనయుడికి జన్మదిన శుభాకాంక్షలు’అంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారకరామారావు ట్విట్టర్లో పోస్ట్ చేసిన సందేశం.. సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల సందేశాల్లో ప్రత్యేకంగా నిలిచింది. ‘నాకు తెలిసిన బహుముఖ ప్రజ్ఞాశాలి, సాహసి, కారుణ్యమూర్తి, ప్రజాకర్షక, శక్తిమంత నేత మా నాన్న కావడం గర్వకారణం’అని కేటీఆర్ పేర్కొన్నారు. దూరదృష్టి, చిత్తశుద్ధితో కలకాలం ఇలాగే స్ఫూర్తి నివ్వాలని కేటీఆర్ సందేశంలో పేర్కొంటూ, కేసీఆర్ పెయింటింగ్(పక్క చిత్రం)ను జత చేశారు. కాగా ‘ఈచ్ వన్ ప్లాంట్ వన్’ నినాదంలో భాగంగా తమ కుటుంబ సభ్యులందరూ సోమవారం ప్రగతిభవన్లో తలా ఒక మొక్క నాటినట్లు కేటీఆర్ మరో సందేశంలో పేర్కొన్నారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారు. వాటి సంరక్షణకు వచ్చే రెండేళ్ల పాటు శ్రద్ధ తీసుకోవాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ‘జన్మదిన శుభాకాంక్షలు డాడీ. చిరకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నా’అని మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ట్వీట్ చేయడంతో పాటు కేసీఆర్ పెయింటింగ్ను తన సందేశానికి జత చేశారు. -
కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటన హాస్యాస్పదం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులిచ్చిందని కేంద్ర ఆర్థిక మంత్రి లోక్సభలో చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో అధిక ఆదాయమిచ్చిందన్న విషయాన్ని రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరముందని బుధవారం ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లిన పన్నుల ఆదాయం, రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన నిధులకు సంబంధించిన గణాంకాలను ఆ ట్వీట్తో జత చేశారు. 2014–19మధ్య కాలంలో రాష్ట్రం.. కేంద్రానికి రూ.2,72,926 కోట్ల పన్నుల ఆదాయం ఇచ్చిందని, కేంద్రం కేవలం రూ.1,12,854 కోట్లను మాత్రమే రాష్ట్రానికి తిరిగి ఇచ్చిందని ఈ గణాంకాలు పేర్కొంటున్నాయి. -
రేపు దావోస్కు కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: వరల్డ్ ఎకనామిక్ ఫోరం 50వ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు మంత్రి కేటీఆర్ సోమవారం స్విట్జర్లాండ్లోని దావోస్కు బయలుదేరి వెళ్లనున్నారు. ఫోరం నుంచి కేటీఆర్ ప్రత్యేక ఆహ్వానం అందుకున్నారు. 2018లో తొలిసారిగా ఆయన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యారు. 2019లో నిర్వహించిన సదస్సుకు ఫోరం నుంచి ప్రత్యేక ఆహ్వానం అందినా హాజరు కాలేకపోయారు. ఈ ఏడాది 50వ వార్షిక సదస్సు కావడంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 21 నుంచి 24 వరకు ఈ సదస్సు జరగనుంది. సదస్సులో భాగంగా నిర్వహించే పలు చర్చల్లో కేటీఆర్ పాల్గొని మాట్లాడనున్నారు. తెలంగాణ ఆర్థికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న తీరును వివరించి రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను తెలియజేయనున్నారు. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో కేటీఆర్ పత్యేక సమావేశాలు నిర్వహించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించనున్నారు. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్, డిజిటల్ మీడియా విభాగం డైరెక్టర్ దిలీప్ కొణతం.. కేటీఆర్తో పాటు దావోస్కు వెళ్తున్నారు. సదస్సు ముగిసిన అనంతరం 24న కేటీఆర్ హైదరాబాద్కు తిరిగి వస్తారు. కాగా, కేటీఆర్ ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల బాధ్యతలు చూస్తున్నారు. ఆయన దావోస్కు బయలుదేరి వెళ్లితే సీఎం కేసీఆర్ ఎన్నికల వ్యవహారాలను పర్యవేక్షించనున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
బస్తీ మే సవాల్
సాక్షి, హైదరాబాద్: పురపోరు తారస్థాయికి చేరుకుంది. ఆధిక్యత కోసం అధికారపక్షం.. అస్తిత్వం కోసం విపక్షం ‘బస్తీ మే సవాల్’ అంటున్నాయి. మరో వారంలో రాజకీయ పార్టీల భవితవ్యం తేల్చనున్న మున్సి‘పోల్స్’ను మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. శాసనసభ నుంచి స్థానికం వరకు ప్రతి ఎన్నికల్లోనూ అఖండ విజయం సాధించిన ‘కారు’.. పురపోరులోనూ అదే స్పీడు కొనసాగించేందుకు వ్యూహాలకు పదునుపెట్టింది. కాంగ్రెస్, బీజేపీలకు ఏ మాత్రం అవకాశమివ్వకుండా.. పట్టణ సంస్థల్లో పైచేయి సాధించేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. కారు.. అదే జోరు మున్సిపాలిటీ చేజారితే.. మంత్రి పదవి ఊడుతుందని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ చేసిన హెచ్చరికను విశ్లేషిస్తే.. ఈ ఎన్నికలను గులాబీ నాయకత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందో అర్థమవుతోంది. శాసనసభ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ను చావుదెబ్బ తీసినప్పటికీ, ఇటీవల వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో ఆ పార్టీ సాధించిన విజయాల ప్రభావం ఇక్కడ కనిపించకుండా పకడ్బందీగా ప్రణాళికను అమలు చేస్తోంది. హస్తం పార్టీ కోలుకోకుండా.. స్థానిక నాయకత్వానికి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశమైన గులాబీ దళపతి కేసీఆర్.. వివిధ మార్గాల నుంచి క్షేత్రస్థాయిలో ఉన్న సమాచారాన్ని పంచుకున్నారు. ప్రత్యర్థుల బలాలు, బలహీనతలను విశ్లేషించుకుంటూ ప్రచారపర్వాన్ని సాగించాలని మార్గనిర్దేశం చేశారు. ఇక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక మంత్రి కేటీఆర్ రోజూ పురపోరులో పార్టీ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పార్టీలో పోటీ తీవ్రంగా ఉండడంతో భారీ సంఖ్యలో తిరుగుబాటు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినా..ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, అసంతృప్తులను తెలంగాణ భవన్కు పిలిపించి సముదాయించే ప్రయత్నం చేశారు. ఇందులో చాలామంది దారిలోకి వచ్చినా.. అక్కడక్కడా బరిలో నిలిచిన కొంతమందిని కూడా తటస్తులను చేసే దిశగా పావులు కదుపుతున్నారు. ప్రచారపర్వంలోనూ కొత్త పుంతలు తొక్కేలా ఈసారి సోషల్ మీడియాను విరివిగా వినియోగించుకునేలా పార్టీ శ్రేణులకు శిక్షణ ఇచ్చారు. టెలికాన్ఫరెన్స్లు, సమీక్ష సమావేశాలతో నిత్యం మున్సిపోల్స్ను సమీక్షిస్తున్న ఆయన.. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మంగా తీసుకోవడానికి మరో కారణం ఉంది. పురపాలకశాఖకు తానే ప్రాతినిధ్యం వహిస్తున్నందున.. ఇందులో విజయబావుటా ఎగురవేయడం ద్వారా పార్టీని తిరుగులేని దిశకు చేర్చాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే పురపోరులో ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్కు జీవన్మరణం వరుస పరాజయాల తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో ఓటమిపాలైతే.. ఓటమి సంపూర్ణమవుతుంది. శాసనసభ మొదలు పంచాయతీ ఎన్నికల వరకు వరుస ఓటములతో చావుదెబ్బతిన్న ఆ పార్టీకి ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్య. ఎమ్మెల్యేలు కాస్తా చేజారి అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదాను కోల్పోయిన కాంగ్రెస్కు ఈ ఎన్నికల్లో విజయం అనివార్యం. పురపాలికల్లో సగం సీట్లను సాధించడం.. ఆ పార్టీకి కనీస రాజకీయ అవసరం. పట్టణ ఓటర్లలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందనే అంచనా ఉంది. ఈ నేపథ్యంలో మున్సిపోల్స్లో కోలుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. ముఖ్యంగా పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి, రేవంత్రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్బాబు, జగ్గారెడ్డి, జీవన్రెడ్డి ఈ ఎన్నికల్లో సత్తా చాటేలా వ్యూహాలను ఖరారు చేస్తున్నారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ చేతిలో భంగపడ్డ కొండా విశ్వేశ్వర్రెడ్డి, షబ్బీర్ అలీ, పొన్నం ప్రభాకర్కు పట్టు నిలుపుకోవడం వ్యక్తిగతంగా, రాజకీయంగా అగ్నిపరీక్ష. మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మూడు నెలల క్రితమే ఓ కమిటీని కూడా వేసిన కాంగ్రెస్ అధిష్టానం.. పలు దఫాలుగా సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికల వ్యూహాన్ని ఖరారు చేసింది. ఇప్పటికే కామన్ మేనిఫెస్టోను కూడా ప్రకటించిన ఆ పార్టీ.. ఆస్తిపన్ను రద్దు, 100 గజాల ఇళ్ల స్థలం, యువతకు జిమ్లు, గ్రంథాలయాలతో పట్టణ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. మున్సిపాలిటీల్లో విస్తృతంగా పర్యటిస్తూ పదేపదే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతోంది. ఇవేగాకుండా ఫేస్బుక్, ఇతర సోషల్ మీడియాను విరివిగా వినియోగించుకుంటూ విద్యావంతులైన పట్టణ ఓటర్లకు పార్టీ వాణిని వినిపిస్తోంది. కమల వికాసమా..విలాపమా! శాసనసభ ఎన్నికల్లో చావుదెబ్బతిన్నా.. పార్లమెంటు ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు సాధించడం ద్వారా టీఆర్ఎస్కు తామే ప్రత్యర్థి అని చెప్పుకుంటున్న భారతీయ జనతాపార్టీకి మున్సిపోల్స్ సవాల్గా మారాయి. గులాబీ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ.. అడుగంటిపోయిన టీడీపీలో మిగిలిన నేతలను చేర్చుకోవడం ద్వారా బలీయంగా మారామని ప్రచారం చేసిన ఆ పార్టీ పురపాలికల్లో అన్ని వార్డుల్లో అభ్యర్థులను నిలబెట్టలేక చతికిలపడింది. బీ ఫారాల మొదలు.. ఉపసంహరణల వరకు అసంతృప్తులు, రాజీనామాలతో నెట్టుకొస్తున్న ఆ పార్టీ నాయకత్వానికి కాస్తోకూస్తో పట్టున్న పట్టణాల్లోనూ అభ్యర్థులు దొరకని పరిస్థితి ఏర్పడడం ఆందోళన కలిగిస్తోంది. పౌరసత్వం చట్టం గట్టెక్కిస్తుందని, వలస నేతలతో పార్టీకి ఊపిరివస్తుందని అంచనా వేస్తున్న ఆ పార్టీ ఉత్తర తెలంగాణ, హైదరాబాద్ శివారు మున్సిపాలిటీలపై గంపెడాశలు పెట్టుకుంది. అక్కడక్కడా ఫలితాలు వచ్చినా.. పురపాలికలు దక్కించుకునే స్థాయిలో స్థానాలు రావడం అనుమానంగానే కనిపిస్తోంది. అయితే, అధినాయకత్వం ప్రచారపర్వంలో ఏ మాత్రం వెనుకడుగు వేయడంలేదు. ప్రతి మున్సిపాలిటీకి ఓ బాధ్యుడిని నియమించి ప్రచారసరళిని నిశితంగా విశ్లేషిస్తోంది. అన్ని పార్టీలకంటే ముందే కొన్ని నగర, పురపాలక సంస్థల మేయర్/చైర్మన్ అభ్యర్థులను ప్రకటించడం ద్వారా ప్రత్యర్థులకు సవాల్ విసిరింది. ఇక, ఎంఐఎం కూడా మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తోంది. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, నల్లగొండ, రంగారెడ్డి పూర్వ జిల్లాల పరిధిలోని పలు మున్సిపాలిటీల్లో స్వతంత్రంగా బరిలోకి దిగి సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. -
వాళ్లు కూడా బోనస్ తీసుకుంటారేమో: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో సింహభాగం తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పార్టీ గెలుచుకుంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారకరామారావు అన్నారు. కఠినంగా ఉన్న మున్సిపల్ చట్టం అమలును టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల నుంచే ప్రారంభిస్తామని తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా 2020 సంవత్సరం టీఆర్ఎస్కు బ్రహ్మాండమైన ప్రారంభాన్ని ఇస్తుందన్నారు. ఇది టీఆర్ఎస్ సంవత్సరమని... ఈ దశాబ్దము కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణది కావాలని ఆకాంక్షించారు. కొత్త మున్సిపల్ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడమే ఈ ఏడాది లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే తామే ముందు ఉన్నామని... వర్కింగ్ ప్రెసిడెంట్గా సభ్యత్వ నమోదు, కమిటీల నిర్మాణం పూర్తి చేసుకున్నామని తెలిపారు. సంక్రాంతి తర్వాత జిల్లా కేంద్రంలో పార్టీ భవనాల్లో అధిక భాగం కేసీఆర్తో ప్రారంభించాలని అనుకుంటున్నట్లు కేటీఆర్ తెలిపారు. పార్టీ శ్రేణులకు శిక్షణా తరగతుల నిర్వహణపై కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ, ప్రజల మధ్య వారధిగా పార్టీ కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. అదే విధంగా మున్సిపోల్స్లో గెలిచిన ప్రజా ప్రతినిధులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. మున్సిపల్ సిబ్బందికి కూడా ప్రతి నెలా లేదా మూడు నెలలకు ఒకసారి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఏమో బోనస్ తీసుకుంటారేమో! ఇక ఆర్టీసీ కార్మికుల గురించి మాట్లాడుతూ... వారు త్వరలోనే బోనస్ తీసుకునే రోజు వస్తుందేమోనని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన ఎన్పీఆర్, ఎన్నార్సీపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందన్నారు. హైదరాబాద్లో సీఏఏ అనుకూల, వ్యతిరేక ర్యాలీలు జరిగాయని... కాంగ్రెస్ పార్టీ వాళ్లు సరూర్నగర్లో చేసుకుంటామంటే పోలీసులు అనుమతి ఇచ్చేవారేమోనని వ్యాఖ్యానించారు. ర్యాలీకి అనుమతి ఇవ్వలేదని దుర్బాషలాడటం సరికాదని హితవు పలికారు. ఇక దిశ ఘటనపై తాము మానవీయంగా స్పందించామని కేటీఆర్ తెలిపారు. అదే విధంగా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. ఏపీ వాళ్ళు ట్విటర్లో ఏపీలో టీఆర్ఎస్ రావాలని కోరుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని ఇగ్నోర్ చేయడానికి లేదని కేటీఆర్ అన్నారు. ఇక బీజేపీ గురించి మాట్లాడుతూ.. తన చిన్నప్పుడు ఆ పార్టీ ఎలా ఉందో.. ఇప్పుడు కూడా అలాగే ఉందని ఎద్దేవా చేశారు. తాను ముఖ్యమంత్రిని అవబోతున్నానంటూ వస్తున్న ఊహాగానాలపై స్పందిస్తూ.. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో స్పష్టంగా చెప్పారు కదా అని పేర్కొన్నారు. అయినప్పటికీ ఇంకా ఎందుకు అనుమానాలు అని ప్రశ్నించారు. -
వరంగల్కు మాస్టర్ప్లాన్.. పాతబస్తీకి మెట్రో
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో తీవ్ర నీటి కొరత ఏర్పడుతుందని నీతి ఆయోగ్ చెప్పిందన్న ఒక ప్రశ్నకు సమాధానంగా.. ఇతర నగరాలతో పోల్చితే హైదరాబాద్లో నీటి కొరత చాలా తక్కువగా ఉంద ని, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత హైదరా బాద్కి నీటి సరఫరా సమస్య తలెత్తదని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ను టూరిస్ట్ డెస్టినేషన్గా మార్చేందుకు, ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ ప్రైవేట్ సంస్థలకు అప్పగిం చామని, చార్మినార్, గోల్కొండలకు ప్రపంచ వారసత్వ హోదా సంపాదించేందుకు ప్రయత్నిస్తు న్నామన్నారు. యూరప్, అమెరికా వంటి ప్రాంతా ల నుంచి మరిన్ని ఎక్కువ విమాన సౌకర్యాలను కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. హైదరాబాద్లో చేపట్టిన ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులకు నిధుల కొరత లేదని, అవసరమైన మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా కార్యక్రమం కొనసాగుతుందన్నారు. హైదరాబాద్లో నూతనంగా 50 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, స్కైవాక్ నిర్మాణాలకు ఆమోదం తెలిపామన్నారు. తెలంగాణ ప్రజలు తెలివైన వారు రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టం అమలుపై సీఎం నేతృత్వంలోని కేబినెట్ సరైన నిర్ణయం తీసుకుంటుందని, ఈ చట్టాన్ని పార్లమెంట్లో వ్యతిరేకించినందుకు మద్దతుగా నిలుస్తున్న నెటిజ న్లకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో రాజకీయంగా బలోపేతం కావడానికి బీజేపీ హిందూ–ముస్లిం కమ్యూనల్ కార్డుని వాడుతుం దని, దీన్ని ఎదుర్కొనేందుకు ఏం చేస్తారని ఒకరు అడిగిన ప్రశ్నకు.. ప్రజలను విభజించే ఎలాంటి ఎజెండానైనా ఎదుర్కొనేంత తెలివైనవారు తెలంగాణ ప్రజలు అని కేటీఆర్ బదులిచ్చారు. తెలంగాణ దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే శాంతియుతమైందని, ఈ శాంతిని ఇలాగే కొనసాగించేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. సల్వకాలమే అవి సక్సెస్.. హైదరాబాద్లో శాంతియుత ధర్నాలకు అనుమతు ల విషయాన్ని అడగ్గా, కొద్దిరోజుల సమయంలోనే ఆర్ఎస్ఎస్, ఎంఐఎం లాంటి సంస్థలు తమ కార్యక్రమాలను నిర్వహించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. దేశంలో 45 ఏళ్లల్లో ఎన్నడూ లేనంత నిరుద్యోగం, ఐదు త్రైమాసికాల్లో వరుసగా తగ్గుతున్న ఆర్థికాభివృద్ధి, పెరుగుతున్న ద్రవ్యోల్బణం వంటి అంశాలను పక్కదారి పట్టించేందుకు కేంద్రం ప్రయత్నాలను చేస్తుందన్న ప్రశ్నకు సమాధానంగా ఒకవేళ ఇలాంటి ప్రయత్నాలు చేస్తే అవి స్వల్పకాలం మాత్రమే సక్సెస్ అవుతాయని, అంతిమంగా ఉద్యోగాల కల్పన, ఆర్థికాభివృద్ధి వంటి కఠిన ప్రశ్నలకు కచ్చితంగా ప్రభుత్వాలు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందన్నారు. అత్యధికంగా ప్రభావితం చేసే రాజకీయ నేత ఆయనే.. రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం లేకున్నా, తమ 60 లక్షల కార్యకర్తలతో ఎప్పటికప్పుడు ప్రభుత్వ పనితీరుపై తమకు అవసరమైన క్షేత్రస్థాయి సమాచారం వస్తుందని కేటీఆర్ అన్నారు. 2009లో రోడ్లపైన తెలంగాణ కోసం ఉద్యమాలు చేస్తున్న పరిస్థితి నుంచి, 2019లో మంత్రి స్థాయిలో పాలన చేస్తున్న పరిస్థితి వరకు జరిగిన పరిణామ క్రమాన్ని ‘టెన్ ఇయర్ చాలెంజ్’అంటూ స్పందించారు. టీఆర్ఎస్ కార్యకర్తల కృషి వల్లనే తనకు మంత్రి పదవి దక్కిందన్న కేటీఆర్, మంత్రి పదవి కన్నా తనకు పార్టీ పదవే విలువైందని తెలిపారు. తనను అత్యధికంగా ప్రభావితం చేసే రాజకీయ నాయకుడు సీఎం కేసీఆరే అని చెప్పారు. 2019 లో అన్ని జిల్లా పరిషత్ లను గెలుచు కోవడం ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిందన్నారు. పాతబస్తీకి మెట్రో.. గచ్చిబౌలికి బీఆర్టీఎస్! హైదరాబాద్లో బీఆర్టీఎస్ (బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్)లో కూకట్పల్లి, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఏరియాలను కలిపే ప్రణాళిక ప్రారంభమైందన్నారు. పాతబస్తీకి కూడా మెట్రో రైలు సౌకర్యం వస్తుందని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ తూర్పు వైపు ఐటీ పరిశ్రమలను తీసుకెళ్లాలని తాము చేస్తున్న ప్రయత్నానికి మంచి స్పందన వస్తోందన్నారు. గోపనపల్లిలో విస్తృతంగా పెరుగుతున్న పలు గేటెడ్ కమ్యూనిటీలకు ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ నుంచి రోడ్డు లేదని, దీన్ని నూతన స్లిప్ రోడ్డు నిర్మాణంలో కవర్ చేస్తామన్నా రు. ఎల్బీనగర్లో ఇప్పటికే ఒక ఫ్లైఓవర్ పూర్తయిం దని మరో మూడు ఫ్లై ఓవర్ల నిర్మాణాలు వస్తాయ న్నారు. 111 జీవోలో ఏదైనా మార్పు, చేర్పులు అవసరమైతే ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. అనంతగిరి, వికారాబాద్ ప్రాంతాలను గత ప్రభుత్వాల మాదిరిగా నిర్లక్ష్యం చేస్తారా అన్న ప్రశ్నకు ఈ ప్రాంతాల అభివృద్ధి కోసం అనేక ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని వాటి ఫలాలు త్వరలో చూస్తారని చెప్పారు. చేనేతకు పెద్ద ఫ్యాన్.. సోషల్ మీడియా ద్వారా ప్రజల నుంచి నేరుగా స్పందన తెలుస్తుందని, తన పైన మర్యాద పూర్వకమైన మీమ్లు (హాస్యపూరిత చిత్రాలు) వచ్చినా తనకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఇప్పటికే దాదాపు మంత్రులంతా సోషల్ మీడియా లో చురుగ్గా భాగస్వాములయ్యారన్నారు. చేనేత వస్త్రాలకు తాను పెద్ద అభిమానినని చెప్పారు. పెద్దఎత్తున చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆరోగ్యం విద్య పట్టణ గ్రామీణ మౌలిక వసతుల రంగాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందన్నారు. జనవరిలో వరంగల్కు మాస్టర్ప్లాన్ నూతన మున్సిపల్ చట్టంతో పౌరులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని, మున్సిపల్ అధికా రుల విచక్షణతో సంబంధం లేకుండా ప్రజల అవస రాలు తీరుతాయని, ఈ మార్పులను వ్యవస్థీకృతం చేసేందుకు నూతన చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో డంప్ యార్డులు, వేస్టు టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వరంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మాస్టర్ ప్లాన్ జనవరి మొదటి వారంలో ఉంటుందన్నారు. ఇంకా వెతుకుతున్నా.. తన కూతురితో ఉన్న ఫొటోపై ఓ నెటిజన్ కోరిక మేరకు కేటీఆర్ స్పందించారు. నా కూతురు వేగం గా ఎదుగుతోందని ఉప్పొంగిపోయారు. రాష్ట్ర పోలీసులు చేపట్టిన ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని అభినందించారు. డీజీపీ, హైదరాబాద్ సీపీకి శుభా కాంక్షలు తెలిపారు. కుటుంబాన్ని, వృత్తిని ఎలా సమన్వయం చేసుకుంటారన్న నెటిజన్ ప్రశ్నకు.. ‘ఇంకా వెతుకుతున్నా’అని సమాధానమిచ్చారు. జగన్ పాలన.. మంచి ప్రారంభం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఆరు నెలల పాలనపైన స్పందించిన కేటీఆర్.. ‘ఒక మంచి ప్రారంభం’అని అన్నారు. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు సరైందో కాదో ఆ రాష్ట్ర ప్రజలే నిర్ణయిస్తారని, తాను కాదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు నాయకత్వ లేమితో తెలంగాణ తల్లడిల్లుతుందన్న కామెం ట్లు చేసిన పలువురు, ఆంధ్ర రాష్ట్రంలో తమ పార్టీ పోటీ చేయాలని కోరడం, ఆ దిశగా తెలం గాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ నడిపినం దుకు సంతోషంగా ఉందన్నారు. వచ్చే ఏడాది పూర్తయ్యేవి ఇవే..! అంతర్జాతీయ స్థాయి తయారీ రంగ కంపెనీల నుంచి హైదరాబాద్ తీసుకొస్తామని.. ఇప్పటికే టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్, ఫుడ్ ప్రాసెసింగ్లో పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొ చ్చాయని కేటీఆర్ చెప్పారు. 2020లో ఫార్మా సిటీ ప్రారంభమవుతుందన్నారు. హైదరాబాద్ లో రెండో దశ టీహబ్–టీవర్క్స్ 2020 మొదటి అర్ధసంవత్సరంలో, జూన్లో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తవుతాయన్నారు. 4వ పారిశ్రామిక విప్లవం దిశగా అనేక ప్రభుత్వాలు వివిధ చర్యలు తీసు కుంటున్నాయని, ఇందులో భాగంగా తెలం గాణ ప్రభుత్వం కూడా ఇన్నొవేషన్, ఇన్ఫ్రా స్ట్రక్చర్, ఇన్క్లూజివ్ గ్రోత్ అనే త్రీ ఐ మంత్రాన్ని పాటిస్తోందని, పట్టణాభివృద్ధితో పాటు మౌలిక వసతులు, ఉద్యోగాల కల్పన వంటి అంశాలకు కూడా సమాన ప్రాధాన్యత ఇస్తుందన్నారు. -
మున్సిపోల్స్పై టీఆర్ఎస్ నజర్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మొత్తం 142 మున్సిపాలిటీలకు గాను, 130కి పైగా మున్సిపాలిటీ పాలకవర్గాల ఎన్నిక జనవరి మూడో వారంలో జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం వార్డుల పునర్విభజన ప్రక్రియ కొనసాగుతుండగా, డిసెంబర్ 25లోగా వార్డులు, చైర్మన్ పదవుల రిజర్వేషన్ల ఖరారు కొలిక్కి వచ్చే అవకాశముంది. డిసెంబర్ నెలాఖరులోగా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే సూచనలు కనిపిస్తుండటంతో, పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడంపై టీఆర్ఎస్ అధిష్టానం దృష్టి సారించింది. దీంతో మున్సి పాలిటీల పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు, పారిశుధ్యం, తాగునీటి సరఫరా వంటి అంశాలపై ఎమ్మెల్యేలు, నేతలు దృష్టి సారించారు. మున్సిపోల్స్ వ్యూహంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త్వరలో పార్టీ ఇన్చార్జులు, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి. బలంపై అంచనా లోక్సభ మినహా అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఇటీవల జరిగిన హుజూర్నగర్ అసెంబ్లీ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఏకపక్ష విజయం సాధించింది. ఎంపీటీసీ స్థానాల్లో 61 శాతం, జెడ్పీటీసీ స్థానాల్లో 83 శాతం విజయం నమోదు చేసిన టీఆర్ఎస్.. 32 జిల్లా పరిషత్ పీఠాలనూ కైవసం చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లోనూ ఏకపక్ష విజయం సాధించడం లక్ష్యంగా సుమారు 4 నెలలుగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది జూన్, జూలై నెలల్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించిన టీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మున్సిపాలిటీల్లో సంస్థాగత నిర్మాణాన్ని వాయిదా వేసింది. ఆగస్టులో 17 లోక్సభ సెగ్మెంట్లకు 64 మంది పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులను మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జు లుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. మున్సిపాలిటీ, జనాభా, వార్డులు, ఓటర్లు, గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పార్టీల వారీగా సాధించిన ఫలితం తదితర వివరాలతో పాటు 2018 అసెంబ్లీ, 2019 లోక్సభ ఎన్నికల్లో మున్సిపాలిటీల పరిధిలో సాధించిన ఓట్ల వివరాలను క్రోడీకరించి ఇన్చార్జులు కేటీఆర్కు నివేదికలు ఇచ్చారు. తాజా పరిస్థితిపై మళ్లీ నివేదికలు ఇవ్వాల్సిందిగా కేటీ ఆర్ ఆదేశించినట్లు సమాచారం. వార్డులు, డివిజన్ల వారీగా.. ఒక్కో మున్సిపాలిటీ పరిధిలో టీఆర్ఎస్తోపాటు వివిధ పార్టీలు ఎంతమేర ప్రభావం చూపుతాయనే దానిపై టీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. టీఆర్ఎస్తో పాటు ఇతర పార్టీల్లో క్రియాశీలకంగా ఉండే కార్యకర్తల వివరాల సేకరణపైనా దృష్టి సారిస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేయనుండగా సుమారు 50కి పైగా మున్సిపాలిటీల్లో ఎంఐఎం కొంత మేర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎంఐఎం పోటీ చేసే స్థానాల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో, అలాంటి చోట్ల అనుసరించాల్సిన వ్యూహంపైనా టీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. -
ఉప రాష్ట్రపతిని కలసిన మంత్రి కేటీఆర్
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ బుధవారం సాయంత్రం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అంతకుముందు ఉదయం మేఘాలయ సీఎం సీకే సంగ్మాను కూడా కేటీఆర్ కలుసుకున్నారు. ఈ భేటీపై సీకే సంగ్మా సామాజిక మాధ్యమంలో.. ‘నా ప్రియమైన స్నేహితుడు కేటీ రామారావును కలుసుకోవడం గొప్పగా ఉంది’అంటూ పంచుకున్నారు. సంగ్మాతో చిన్న సమావేశమే అయినా అద్భుతంగా జరిగిందని కేటీఆర్ పేర్కొన్నారు. కొత్త పథకాన్ని ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ గిరిజన యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు రూపొందించిన ‘సీఎం ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్షిప్, ఇన్నోవేషన్ స్కీం’ను గురువారం ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. గతంలో ఐఎస్బీలో జరిగిన సమావేశంలో పిజ్జా అవుట్ కార్యక్రమానికి హాజరవుతానని కేటీఆర్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. -
కార్యకర్తల కష్ట సుఖాల్లో అండగా ఉంటాం
సాక్షి, హైదరాబాద్: కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అండగా నిలుస్తుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు అన్నారు. ‘మీ కుటుంబ పెద్ద మనతో లేకపోయినా, పార్టీ మీకు అండగా నిలబడుతుందనే విశ్వాసం కల్పించేందుకు పార్టీ రాష్ట్ర కార్యాలయానికి ఆహ్వానించాం’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇటీవల మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు బుధవారం తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ జీవిత బీమా చెక్కులు అందజేశారు. బీమా కింద 1,581 మంది కార్యకర్తల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల చొప్పున రూ. 31.62 కోట్లు చెల్లించామన్నారు. దేశంలోని ఏ ప్రాంతీయ పార్టీకి లేని విధంగా టీఆర్ఎస్ 60 లక్షల మంది సభ్యత్వం కలిగి ఉండటం గర్వకారణమన్నారు. కుటుంబ పెద్దగా, ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా సీఎం కేసీఆర్ ఆపదలో ఉన్న కార్యకర్తల కుటుంబాలను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటారని కేటీఆర్ అన్నారు. కార్యకర్తల కుటుంబాల్లో విశ్వాసం కల్పించండి కార్యకర్తల కుటుంబాల ఇళ్లకు వెళ్లి జీవిత బీమా చెక్కులు అందజేయడం ద్వారా వారిలో స్థైర్యం కల్పించి, వారి సమస్యల పరిష్కారం దిశగా కృషి చేయాలన్నారు. బీమా చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని పార్టీ పరంగా వ్యవస్థీకృతంగా చేపట్టాలని, తద్వారా కార్యకర్తల కుటుంబాలతో పార్టీ అనుబంధం మరింత పెరుగుతుందని కేటీఆర్ అన్నారు. చెక్కుల పంపిణీ కార్యక్రమం తర్వాత పార్టీ కార్యకర్తల కుటుంబాలతో తెలంగాణ భవన్లో సహపంక్తి భోజనం చేశారు. కార్యకర్తల కుటుంబ సభ్యులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. -
తెలంగాణలో శానిటేషన్ హబ్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో శానిటేషన్ హబ్ నెలకొల్పనున్నామని, దేశవ్యాప్తంగా, దక్షిణాసియాలోనూ పారిశుద్ధ్య నిర్వహణలో సేవలందించేలా ప్రణాళిక రూపొందించామని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు కేంద్రానికి నివేదించారు. ఈ మేరకు కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురిని కలసి ఈ అంశమై చర్చించారు. తాము హైదరాబాద్లో నెలకొల్పబోయే ‘అర్బన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’లో ఇది ఒక భాగంగా ఉంటుందని వివరించారు. ‘అత్యంత నివాస యోగ్యమైన నగరాలున్న ప్రాంతంగా నిలవడమే లక్ష్యంగా తెలంగాణ ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణలో వృద్ధి సాధిస్తోంది. తెలంగాణ, అలాగే దేశంలోని ఇతర ప్రాంతాలు, దక్షిణాసియా దేశాలకు పారిశుద్ధ్య సేవలు అందించేలా ఒక దీపస్తంభం వంటి శానిటేషన్ హబ్ నెలకొల్పేందుకు చక్కటి అవకాశముంది. ఇది ఆవిష్కరణల సృష్టికి కేంద్రంగా కూడా పనిచేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి హబ్ను నెలకొల్పేందుకు ఆసక్తితో ఉంది. అడ్మిని్రస్టేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) ఇందుకోసం అత్యున్నత స్థాయి బ్లూప్రింట్ రూపొందించింది. పెట్టుబడులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తగిన నిధులు కేటాయిస్తుంది. వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం కూడా చూస్తున్నాం..’అని తెలిపారు. ‘ఈ హబ్ కోసం కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ నుంచి ప్రారంభ మూలధనంగా రూ.1,00 కోట్లు ఇచ్చి సాయపడాలి..’అని కేటీఆర్ అభ్యరి్థంచారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే స్థలాన్ని గుర్తించిందని, వనరుల మద్దతు అందిస్తోందని తెలిపారు. డిసెంబర్లో ఈ శానిటేషన్ ఇన్నోవేషన్ హబ్పై అధికారిక ప్రకటన ఉంటుందని మంత్రి వెల్లడించారు. ఆర్థికవృద్ధికి దోహదం ‘ప్రతిపాదిత శానిటేషన్ హబ్ వల్ల ప్రజల ఆరోగ్య వృద్ధితోపాటు ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉంటాయి. దీర్ఘకాలంలో రూ.20 వేల కోట్ల ఆరి్థక వృద్ధితోపాటు, 20 వేల ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుంది. ఐదేళ్లలో స్వయం సమృద్ధి సాధిస్తుంది..’అని కేటీఆర్ నివేదించారు. జీహెచ్ఎంసీకి రూ.400 కోట్లివ్వండి హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం నిర్వహిస్తున్న సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టుకి అదనంగా చేపట్టాల్సిన కార్యక్రమాల కోసం మరో రూ.400 కోట్లను స్వచ్ఛ భారత్ మిషన్ లేదా మరే ఇతర కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం కింద అయినా కేటాయించాల్సిందిగా మంత్రి కేటీఆర్ మరో వినతిపత్రంలో కోరారు. దీంతోపాటు హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కోసం కేటాయించిన నిధుల్లో కేంద్రం నుంచి రావాల్సిన రూ.254 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాల్సిందిగా అభ్యర్థించారు. శిక్షణ కార్యక్రమాలకు బేగంపేట ఎయిర్పోర్టు.. ఏరోస్పేస్ రంగంలో తెలంగాణ ప్రభుత్వం యునైటెడ్ కింగ్డం (యూకే)లోని ప్రముఖ యూనివర్సిటీతో కలసి శిక్షణ కార్యక్రమాలు అందించేందుకు సిద్ధంగా ఉందని, ఇందుకోసం బేగంపేట ఎయిర్పోర్ట్ను ఉపయోగించుకునేలా వెసులుబాటు కల్పించాలని హర్దీప్సింగ్ పురిని మంత్రి కేటీఆర్ కోరారు. రక్షణ శాఖ మంత్రితో భేటీ రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో మంత్రి కేటీఆర్ బుధవారం మధ్యాహ్నం సమావేశమయ్యారు. హైదరాబాద్లో ప్రతిపాదిత స్కైవేల నిర్మాణం కోసం రక్షణ శాఖ భూములను అప్పగించాల్సిందిగా కోరారు. ఇండ్రస్టియల్ కారిడార్ ఏర్పాటు చేయండి.. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ అధ్యక్షతన జరిగిన రాష్ట్రాల పారిశ్రామిక మంత్రుల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాలపై మాట్లాడారు. దీంతో పాటు పారిశ్రామికీకరణ మరింత వేగంగా జరగాలంటే కేంద్రప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై పలు సలహాలు, సూచనలు చేశారు. టీఎస్ ఐపాస్ ద్వారా, ఇతర పారిశ్రామిక విధానాల ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక వర్గాలకు చేయూతనందిస్తున్న తీరు, దీంతో తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతున్న తీరును వివరించారు. హైదరాబాద్ భౌగోళికంగా దేశానికి నడిరోడ్డున ఉందని, ఈ నేపథ్యంలో హైదరాబాద్–బెంగళూరు–చెన్నై ఇండ్రస్టియల్ కారిడార్ ఏర్పాటు చేసే విషయాన్ని కేంద్రప్రభుత్వం పరిశీలించాలని సూచించారు. నేడు అమిత్ షాతో భేటీ? కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మంత్రి కేటీఆర్ గురువారం కలిసే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి. అలాగే వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ను కూడా కలవనున్నట్లు వెల్లడించాయి. -
వ్యాధుల నివారణకు క్యాలెండర్
సాక్షి, హైదరాబాద్: సీజనల్ వ్యాధుల నివారణ, నియంత్రణలకు ఏ నెలలో, ఏమేం చేయాలో వార్షిక క్యాలెండర్ను రూపొందించనున్నామని మునిసిపల్, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు చెప్పారు. మంగళవారం నుంచే వివిధ స్థాయిల్లోని అధికారులతోపాటు ప్రజాప్రతినిధు లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తారని, పారిశుధ్య కార్యక్రమాలు పరిశీలిస్తారని, ప్రజలకు అవగాహన కల్పిస్తారని తెలిపారు. వ్యాధులు, పారిశుధ్యం, రహదారులు తదితర అంశాలపై మంత్రి ఈటల రాజేందర్తో కలిసి మునిసిపల్ పరిపాలన, వైద్యారోగ్యశాఖల ఉన్నతాధికారులతో సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. వివరాలను విలేకరుల సమావేశంలో కేటీఆర్ వెల్లడించారు. సీజన్ మార్పుతో వైరల్ వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని, జ్వరాలన్నీ డెంగీకాదని అన్నారు. ఈ విషయంలో ప్రైవేట్ ఆస్పత్రులు, ప్రతిపక్షాలతోపాటు మీడియా కూడా ప్రజలను భయభ్రాంతులకు గురిచేయవద్దని కోరారు. పోస్టర్లు, కరపత్రాలతో ప్రచారం వ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోస్టర్లు, కరపత్రాలు, హోర్డింగులతో సçహా వివిధ మాధ్యమాల ద్వారా విస్తృతం గా ప్రచారం నిర్వహించనున్నట్లు కేటీఆర్ తెలిపా రు. పారిశుధ్య కార్యక్రమాలు మెరుగుపడేందుకు యుద్ధప్రాతిపదికన రేçపు ఉదయం 5.30 నుంచే హైదరాబాద్లో మేయర్, డిప్యూటీ మేయర్, మునిసిపాలిటీల్లో కమిషనర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. వెయ్యికిపైగా ఉన్న గార్బేజి పాయింట్లలోని చెత్తను 16వ తేదీలోగా తొలగిం చాలని నిర్ణయించామన్నారు. పాఠశాలలు/కళాశాలలు, స్లమ్స్/బస్తీలు, అపార్ట్మెంట్లు/కాలనీల్లో అవగాహన సమావేశాలు నిర్వహిస్తారన్నా రు. ఈ కార్యక్రమాల్లో తాను, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కూడా పాలుపంచుకుంటామని తెలిపారు. ఆయా ప్రాంతాల్లోని ఒక ఇంటిని కూడా సందర్శించి ప్రజలకు వివరించాలన్నారు. బస్తీ దవాఖానాల్లో సాయంత్రం కూడా ఓపీ నగరంలో యూహెచ్పీలు సహా 106 బస్తీ దవా ఖానాల్లో సాయంత్రం కూడా ఓపీ సేవలు అందు బాటులో ఉంటాయని కేటీఆర్ చెప్పారు. వచ్చిన రోగుల్ని గంటలోగా తిరిగి పంపించే ప్రయత్నం జరుగుతోందన్నారు. సీఎం అనుమతితో బస్తీదవాఖానాలను 300కు పెంచేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. నగరంలో ప్రత్యేకంగా 25 మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామని చెప్పారు. దాదాపు 53 వేల గణేశ్ మండపాల వద్ద వ్యాధులు ప్రబలకుండా అవసరమైన సిబ్బందిని కూడా నియమిస్తామన్నారు. వ్యర్థాలు వేస్తే కఠిన చర్యలు.. నిర్మాణ, కూల్చివేతల వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ వేసేవారిపై, వాటిని ఇష్టానుసారం తరలించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటా మని కేటీఆర్ అన్నారు. ఈ మేరకు మునిసిపల్ పరిపాలన ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేయడంతోపాటు రవాణాశాఖతో కూడా మాట్లాడి త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. నగరంలో రహదారుల పరిస్థితి మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. సమావేశంలో పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్కుమార్, డైరెక్టర్ టీకే శ్రీదేవి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, వాటర్బోర్డు ఎండీ దానకిశోర్, మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిబంధనలు పాటించకుంటే శిక్షలే.. ట్రాఫిక్ ఉల్లంఘనలపై భారీ జరిమానాలకు సంబంధించిన ప్రశ్నకు బదులిస్తూ పౌరస్పృహ లేనివారికి జరిమానాలు, శిక్షలు ఉండాల్సిందేనని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. నగరంలో పారిశు ధ్యం మెరుగుకు చర్యలు తీసుకుంటామన్నారు. డెంగీపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. వందలాది మరణాలంటూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయన్నారు. విమర్శలు సహేతుకమైతే స్వీకరిస్తామన్నారు. తమిళిసై నియామకంపై మాట్లాడేదేముంటుంది: కేటీఆర్ రాష్ట్ర గవర్నర్గా తమిళిసై సౌందరరాజన్ను నియమించడంపై కేంద్రం నిర్ణయం తీసుకుందని, రాష్ట్రపతి నియమించారని, ఈ అంశంపై మాట్లాడేందుకేముంటుందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. సోమవారం జీహెచ్ఎంసీలో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఇటీవల రాజకీయసంబంధాలు కలిగినవారిని గవర్నర్లుగా నియమిస్తున్నారు. దీనిపై మీ స్పం దన ఏమిటన్న’ విలేకరుల ప్రశ్నకు బదులిస్తూ.. ఈ అంశంపై నేనేం కామెంట్ చేయగలనంటూ పైవిధంగా వ్యాఖ్యానించారు. ఆమె గవర్నర్గా వచ్చాక మంత్రిగా తాను ప్రమాణం చేశానని, ఆమెను గవర్నర్గానే చూస్తామన్నారు. -
కేంద్రం తీరువల్లే సమస్యలు
సాక్షి, హైదరాబాద్: వివిధ అంశాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో కేంద్ర రక్షణ శాఖ అవలంబిస్తున్న వైఖరివల్లే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో సుదీర్ఘ కాలంగా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించినా.. బోర్డు, రక్షణ శాఖ ఆంక్షలతో పనులు ముందుకు సాగడం లేదన్నారు. ఎమ్మెల్యే సాయన్నతో పాటు, కంటోన్మెంట్ బోర్డులో టీఆర్ఎస్ సభ్యులతో తెలంగాణ భవన్ లో బుధవారం కేటీఆర్ సమావేశమయ్యారు. జంటనగరాల పరిధిలో స్కైవేల నిర్మాణానికి కేం ద్రం నుంచి అనుమతులు రాకపోవడంతో కంటోన్మెంట్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు తీరడం లేదన్నారు. స్కైవేల నిర్మాణ అనుమతుల కోసం రాష్ట్ర మంత్రులు, ఎంపీలు పలు మార్లు కేంద్రానికి వినతులు సమర్పించినా స్పందన లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు కంటోన్మెంట్ బోర్డు నుంచి సహకారం లభించడం లేదని, బోర్డు లోని టీఆర్ఎస్ సభ్యులు కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. రామన్నకుంట చెరువులోకి మురికినీరు చేరకుండా రూ. రెండున్నర కోట్లతో రాష్ట్ర పురపాలక శాఖ సిద్ధం చేసిన ప్రతిపాదనలకు ఒకట్రెండు రోజుల్లో అనుమతులు వచ్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. బోర్డు ఎన్నికల్లో టీఆర్ఎస్దే విజయం కంటోన్మెంట్ బోర్డుకు ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధిస్తారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బోర్డు పాలక మండలి ఎన్నికలను పార్టీ చిహ్నాలతో నిర్వహించేలా కేంద్రానికి లేఖ రాయాలని ఎమ్మెల్యే సాయన్న కేటీఆర్ను కోరారు. సమావేశంలో టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ చిరుమిల్ల రాకేశ్, టీఆర్ఎస్ నేత మర్రి రాజశేఖర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
గులాబీ జెండా ఓనర్..
సాక్షి, హైదరాబాద్ : ‘మేం గులాబీ జెండా ఓనర్లం’అంటూ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు.. టీఆర్ఎస్లో చర్చనీయాంశమయ్యాయి.ఈ నేపథ్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు శనివారం టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసేందుకు వచ్చిన ఆయన.. మీడియాతో ముచ్చటించారు.ఇటీవల మంత్రి ఈటల చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా.. ‘గులాబీ జెండా ఓనర్ కేసీఆర్.. పార్టీ జెండాను రూపొందించింది ఆయనే కదా’అని వ్యాఖ్యానించారు. మంత్రివర్గం నుంచి ఈటలను తొలగిస్తారనే వార్తలు నిజమేనా అని ప్రశ్నించగా.. ఈటల అంశం సమసిపోయింది. ఆయన పదవికి ఎలాంటి ఢోకా లేదన్నారు. మీరు టీఆర్ఎస్లోకి ఆలస్యంగా వచ్చారు కదా అని విలేకరులు ప్రశ్నించగా.. తెలుగుదేశంలో ఉన్నా మేమూ తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా పార్టీ నుంచి లేఖ ఇప్పించాం కదా. అందులో నేను చేసిన కృషి ఏంటో అందరికీ తెలుసు’అంటూ మంత్రి తన సంభాషణను ముగించారు. పార్టీ నేతలతో కేటీఆర్ భేటీ.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు శనివారం తెలంగాణ భవన్లో పలువురు పార్టీ నేతలతో భేటీ అయ్యారు. ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్కు చేరుకున్న కేటీఆర్.. సాయంత్రం ఐదు గంటల వరకు పార్టీ కార్యాలయంలోనే ఉన్నారు. రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో పాటు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్రెడ్డి, రెడ్యా నాయక్, బాల్క సుమన్, గాందీ, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎంపీ కవిత తదితరులు కేటీఆర్తో భేటీ అయ్యారు. -
తిరుపూర్ స్థాయిలో సిరిసిల్ల
సిరిసిల్ల: రాష్ట్రంలో చేనేత, మరమగ్గాల లెక్క తేల్చామని, అన్నింటికీ జియోట్యాగింగ్ చేశామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కె.తారక రామారావు అన్నారు. సిరిసిల్లలో బుధవారం ఆయన చేనేత, జౌళిశాఖ అధికారులతో సమీక్షించారు. కేటీఆర్ మాట్లాడుతూ.. దేశంలో వ్యవసాయరంగం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న వస్త్ర పరిశ్రమను ఆధునీకరించేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో వస్త్రఉత్పత్తి రంగంలో గణనీయమైన ప్రగతి సాధించిందన్నారు. రూ.70 కోట్లు ఉన్న రాష్ట్ర చేనేత, జౌళి శాఖ బడ్జెట్ ఇప్పుడు ఏటా రూ.1200 కోట్లతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పాటు అయ్యాక నేతన్నలకు ఉపాధి కలి్పంచే లక్ష్యంతో కోటి మంది మహిళలకు బతుకమ్మ కానుకగా చీరలు అందిస్తోందని చెప్పారు. తమిళనాడులోని తిరుపూర్ స్థాయిలో సిరిసిల్ల చీరలు బ్రాండ్ ఇమేజ్ సాధించాలని ఆయన ఆకాంక్షించారు. నాలుగేళ్లలో సిరిసిల్లకు రూ.1,600 కోట్ల వస్త్రఉత్పత్తి ఆర్డర్లు ఇచ్చామని తెలిపారు. ఆర్వీఎం బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్లు, రంజాన్, క్రిస్మస్ వ్రస్తాలు, సంక్షేమశాఖల ఆర్డర్లు అందించామని కేటీఆర్ వివరించారు. సిరిసిల్ల కార్మికులు గతంలో నెలకు రూ.7వేలు సంపాదిస్తే ఇప్పుడు రూ.16 వేలు సంపాదిస్తున్నారని స్పష్టం చేశారు. రూ.22.52 కోట్లతో 11,262 మరమగ్గాలు ఆధునీకరించామని వివరించారు. 50 శాతం రాయితీలు చేనేత కార్మికులకు నూలు, రంగు, రసాయనాలకు 50 శాతం రాయితీలు, పవర్లూం కార్మికులకు పది శాతం నూలు రాయితీని కల్పించినట్టు కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలోని 11వేల మంది నేత కార్మికులకు రూ.29 కోట్ల రుణాలు మాఫీ చేశామని స్పష్టం చేశారు. సిరిసిల్ల శివారులో 64 ఎకరాల్లో అపెరల్ పార్కు నిర్మిస్తున్నామని, పది వేల మంది మహిళలకు ఉపాధి కలి్పంచే లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు. సిరిసిల్లలోని 1104 మంది కార్మికులను యజమానులుగా మార్చేందుకు రూ.386 కోట్లతో 88 ఎకరాల్లో వర్క్òÙడ్లను నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ఏటా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా రాష్ట్ర స్థాయిలో అవార్డులు ఇస్తున్నామని చెప్పారు. చేనేత కళాకారులకు అండగా సర్కారు రాష్ట్రంలోని చేనేత కళాకారులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని కేటీఆర్ తెలిపారు. సిరిసిల్లతోపాటు పోచంపల్లి, దుబ్బాక, నారాయణపేట, గద్వాల లాంటి ప్రాంతాల్లోని నేతకార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అభివృద్ధికి బాటలు వేస్తున్నామని చెప్పారు. కార్మికులకు బీమా సదుపాయాన్ని కలి్పస్తున్నామని, త్రిప్ట్ పథకంలో 8 శాతం కార్మికుడు చెల్లిస్తే 16 శాతం ప్రభుత్వం చెల్లిస్తూ కారి్మకులకు పొదుపును అలవాటు చేస్తున్నామని పేర్కొన్నారు. సిరిసిల్లలో తయారైన బతుకమ్మ చీరలను ఆయన పరిశీలించి బాగున్నాయని కితాబిచ్చారు. పవర్లూం కార్ఖానాలోకి వెళ్లి బతుకమ్మ చీరల ఉత్పత్తిని పరిశీలించారు. చేనేత, జౌళి శాఖ డైరెక్టర్ శైలజరామయ్యార్, జాయింట్ కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా, టెస్కో జీఎం యాదగిరి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, జౌళి శాఖ జాయింట్ డైరెక్టర్ కె.శ్రీనివాస్, ఆర్డీడీ తస్నీమా, జౌళి శాఖ ఏడీ అశోక్రావు పాల్గొన్నారు. -
కేటీఆర్ చొరవతో వైకల్యంపై విజయం
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతో 4వతరగతి చదువుతున్న అంగవైకల్యంతో బాధపడుతున్న సాయిరాం అనే బాలుడు అందరిలాగా నడిచే స్థితికి చేరుకున్నాడు. ఈ విషయాన్ని కేటీఆర్ ట్విటర్లో వెల్లడిస్తూ.. ‘సీఎంఆర్ఎఫ్ సాయంతో పలు శస్త్రచికిత్సల అనంతరం సాయిరాం సాధారణ స్థితికి చేరుకోవడం ఆనందంగా ఉంది’అని పేర్కొన్నారు. గోదావరిఖనికి చెంది న సాయిరాం అనే బాలుడికి పోలియో వల్ల బాల్యంలోనే రెండు కాళ్లు వంకరగా మారి.. నడవలేని స్థితికి చేరుకున్నాడు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో కలిసి బాలుడు సాయిరాం ఈ ఏడాది జనవరిలో కేటీఆర్ను కలిసి, సాయం కోరారు. సాయిరాంకు వైద్యం అందేలా చూడాల్సిన బాధ్యతను హైదరాబాద్కు చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కట్టెల శ్రీనివాస్ యాదవ్కు అప్పగించారు. దీంతోపాటు సీఎం సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా అవసరమైన ఆర్థిక సాయా న్ని బాలుడి కుటుంబానికి అందజేశారు. నగరం లోని ప్రముఖ ఆస్పత్రిలో శస్త్ర చికిత్సల అనంతరం .. సాయిరాం ప్రస్తుతం సొంతగా నడవగలిగే స్థితికి చేరుకున్నాడు. చికిత్సల ద్వారా పూర్తిగా కోలుకున్న సాయిరాం తన తల్లిదండ్రులతో కలిసి బుధవారం టీఆర్ఎస్ వర్కిగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను.. ఆయన బంజారాహిల్స్ నివాసంలో కలుసుకున్నారు. సాయిరాం సాధారణ స్థితికి చేరుకోవడంపై కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. -
ఆరోగ్య తెలంగాణ లక్ష్యం
సిరిసిల్ల: ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు అన్నారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో హైదరాబాద్కు చెందిన ఎల్వీ ప్రసాద్ వైద్యవిజ్ఞాన సంస్థ సిరిసిల్లలో ఏర్పాటు చేస్తున్న కంటి ఆస్పత్రి భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కంటి సమస్యల పరిష్కారానికి కంటి వెలుగు పథకాన్ని కేసీఆర్ అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రం లో కంటి సమస్యలు లేకుండా చేస్తామని వివరించారు. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరి ఆరోగ్య స్థితిగతులను సేకరించి హెల్త్ ప్రొఫైల్ తయారు చేస్తున్నామని వివరించారు. ఆరోగ్య తెలంగాణను సాధించేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. ప్రైవేటు సంస్థలూ ముందుకు రావాలి.. సర్వేంద్రియానాం నయనం ప్రధానమని, మనిషికి ప్రపంచాన్ని చూపించేవి కళ్లని, అలాంటి కంటి వైద్యంలో ఎల్వీ ప్రసాద్ కంటి వైద్యశాల పేదల సేవలో ముందుందని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వం చేస్తున్న సేవలకు తోడుగా ప్రైవేటు సంస్థలు కూడా పేదల సేవకు ముందుకు వస్తే బాగుంటుందన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్)లో భాగంగా ఎల్వీ ప్రసాద్ కంటి వైద్యశాల, హెటెరో వంటి సంస్థలు సిరిసిల్లలో పేదలకు సేవలందించేందుకు ముందుకు రావడం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. హెటెరో ఫౌండేషన్ సిరిసిల్లలో రూ.5 కోట్లతో 15,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కంటి ఆస్పత్రి భవనాన్ని నిర్మిస్తుందని వివరించారు. వీరి స్ఫూర్తితో మరిన్ని సంస్థలు పేదల వర్గాలకు సేవలందించేందుకు ముందుకు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎల్వీ ప్రసాద్ సంస్థ వైస్చైర్మన్ ఆత్మకూరి రామన్ మాట్లాడుతూ.. 32 ఏళ్లుగా ఎల్వీ ప్రసాద్ కంటి వైద్యశాల 2.80 కోట్ల మంది పేదలకు వైద్య సేవ లు అందించిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కంటి వైద్యసేవల్లో ఎల్వీ ప్రసాద్ సంస్థ ముందుందని పేర్కొన్నారు. హెటెరో సంస్థ ప్రతినిధి రత్నాకర్రెడ్డి మాట్లాడుతూ.. మా సంస్థ సంపద సృష్టించి పది మందికి పంచాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుందని తెలిపారు. భవన నిర్మాణానికి రూ.50 లక్షల చెక్కును కేటీఆర్కు అందించారు. -
ప్రతిభకు సాయం.. పేదలకు ఊతం
సాక్షి, హైదరాబాద్ : ప్రతిభ ఉన్నా పేదరికంతో వైద్యం, ఇతర వృత్తివిద్యా కోర్సుల్లో చేరలేని విద్యార్థులకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. తెలంగాణ ఎంసెట్లో మొదటి ర్యాంకు, ఏపీ ఎంసెట్లో 8 వర్యాంకు, నీట్ జాతీయ స్థాయిలో 50వ ర్యాంకు సాధించిన ఏంపటి కుష్వంత్కు ఢిల్లీ ఎయిమ్స్లో సీటు వచ్చినా పేదరికం అడ్డుగా నిలిచింది. కుష్వంత్ కుటుంబం మంచిర్యాల జిల్లా శ్రీరాంపురంలో ఉంటుండగా,. కొన్ని నెలల క్రితం అతని తండ్రి లక్ష్మీనారాయణ రోడ్డు ప్రమాదంలో మరణిం చారు. తల్లి అనిత ప్రస్తుతం భూపాలపల్లిలో కుట్టు పనిచేస్తూ తన కుమారులను పోషిస్తున్నారు.తన తల్లి, తన ఉన్నత చదువులకు అవసరమైన ఫీజులను భరించలేని నేపథ్యాన్ని కుష్వంత్ సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న కేటీఆర్ సాయం అందిస్తామని హమీ ఇచ్చారు. ఈ మేరకు కుష్వంత్ పరిస్థితిని సీఎం దృష్టికి తీసుకెళ్లి రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని మం జూరు చేయించారు. శుక్రవారం మంత్రి శ్రీనివాస్ గౌడ్, భూపాలపల్లి జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి సమక్షంలో రూ.5 లక్షల చెక్కును అందజేశారు. మరో ఇద్దరు విద్యార్థులకు కూడా... మరో ఇద్దరు విద్యార్థులకు కేటీఆర్ వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం చేశారు. నేషనల్ ఇస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ పోటీ పరీక్షలో దేశ వ్యాప్తంగా మొదటి ర్యాంకు సాధించిన కె. లావణ్య ఫీజుకు అవసరమైన మొత్తం అందించారు. మేడ్చల్ జిల్లాలోని గాజుల రామారానికి చెందిన లావణ్య తండ్రి స్థానికంగా ఉన్న ఒక కంపెనీలో రోజువారీ కూలి. తన పేదరికం వలన తన ఫీజులు చెల్లించలేక పోతున్నానని కేటీఆర్కు ట్విట్టర్ ద్వారా లావణ్య తన సమస్యను తెలిపింది. దీనిపై స్పందించిన కేటీఆర్ ఫీజుల కోసం ఆర్థిక సహాయం అందజేశారు. సిరిసిల్ల పట్టణం, సుందరయ్య నగర్కు చెందిన యస్.పవన్ ఫ్రీ సీటు సాధించి వీయన్అర్ విజ్ఞాన జ్యోతి కళాశాలలో మూడో ఏడాది బీటెక్ చదువుతున్నారు. తన తండ్రి చిన్న టీకొట్టు ద్వారా జీవనం సాగిస్తున్నారు. పవన్ ఫీజుల కోసం సాయాన్ని కేటీఆర్ అందించారు. దివ్యాంగునికి త్రిచక్రవాహనం... ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి ప్రమాదంలో తన కాళ్లు పోగొట్టుకున్న దివ్యాంగుడు సాగర్ కు తెలంగాణభవన్లో కేటీఆర్ త్రిచక్ర వాహనాన్ని అందజేశారు. సిరిసిల్ల నియోజకవర్గం రాచర్ల తిమ్మాపూర్కు చెందిన కాంభోజ సాగర్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి అక్కడ జరిగిన ట్రక్కు ప్రమాదంలో తన కుడి కాలును కోల్పోయారు. జీవనోపాధి మెరుగుకు వైకల్యం అడ్డుగా వస్తున్న విషయాన్ని కేటీఆర్కు ట్విట్టర్ ద్వారా తెలిపారు. దీన్ని తెలుసుకున్న టీఆర్ఎస్ నేత గడ్డం పల్లి రవీందర్ రెడ్డి కాంభోజ సాగర్కు త్రిచక్ర వాహ నాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు. శుక్రవారం కేటీఆర్ చేతుల మీదుగా సాగర్కు ఆ వాహనాన్ని అందించారు. కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని చేపట్టిన ‘గిఫ్ట్ ఏ స్మైల్ ’కార్యక్రమంలో భాగంగా ఈ సహాయం అందించడం సంతోషంగా ఉందని రవీందర్ రెడ్డి తెలిపారు. సాగర్ జీవనోపాధికి సహాయాన్ని అందిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. -
చిరునవ్వులు కానుకగా ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: నిస్సహాయులకు సహాయపడి వారి ముఖాలపై చిరునవ్వులు తీసుకురావాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. పార్టీ నేతలు, కేడర్కు పిలుపునిచ్చారు. ఈ నెల 24న తన పుట్టిన రోజు సందర్భంగా ప్రకటనలు, హోర్డింగ్లు, పూల బొకేల కోసం అనవసర ఖర్చులు చేయొద్దని ట్విటర్లో విజ్ఞప్తి చేశారు. కాగా, చంద్రయాన్–2ను విజయవంతంగా కక్ష్యలోకి పంపిన ఇస్రో శాస్త్రవేత్తల బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రయోగం తో భారత్ తన సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిందని, ఈ క్షణం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ క్షణంగా అభివర్ణించారు. -
అవినీతి అంతం తథ్యం!
సాక్షి, హైదరాబాద్: అర్థవంతమైన సంస్కరణలు అభివృద్ధిలో భాగమేనని, కొత్త మున్సిపల్ చట్టాన్ని చాలా పదును, పటుత్వంతో శక్తివంతంగా రూపొందించారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు పేర్కొన్నారు. పురపాలనలో సామాన్యుల పాలిట శాపంగా మారిన అవినీతి చీడ ఈ చట్టంతో తొలగిపోతుందని, రాజకీయ జోక్యం కూడా తగ్గిపోతుందని వెల్లడించారు. సీఎం కేసీఆర్ మొండితనం, సంకల్పం తెలిసినవారు పూర్తిగా చట్టాన్ని అవగాహన చేసిన తర్వాతే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని సూచించారు. శుక్రవారం శాసనసభ నిరవధిక వాయిదా అనంతరం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో కేటీఆర్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. శాసనసభ్యులమైన తాము శాసనాలు చేయడం మర్చిపోయి రోడ్లు, డ్రైనేజీలంటూ అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోందని, ఈ కొత్త చట్టంతో అలాంటి పరిస్థితి మారిపోతుందని.. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల భాగస్వామ్యం, బాధ్యతలు ఈ చట్టంతో పెరిగాయని వివరించారు. కొత్త చట్టం పౌరుల చేతుల్లోనే స్వీయ నిర్ణయాధికారాన్ని పెట్టిందని, తద్వారా ప్రజలపై కూడా బాధ్యతలు మోపినట్టవుతుందన్నారు. ప్రజలపై బాధ్యతలు పెట్టడంతో పాటు విధులను విస్మరించినా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినా అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు పదవీచ్యుతులయ్యేలా చట్టాన్ని రూపొందించారని చెప్పారు. నలుగురు గెలిస్తేనే ఆగట్లేరు.. ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే ఈవీఎంలలో చిప్లు పెట్టామన్నారు. మరి బ్యాలెట్ పోరు ద్వారా జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మా విజయం గురించి ఏమంటారు? రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా పరిషత్ స్థానాలు ఒకే పార్టీ గెలుచుకోవడం స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీకైనా సాధ్యమైందా’’ అని కేటీఆర్ ప్రశ్నించారు. నలుగురు ఎంపీలు గెలిస్తేనే బీజేపీ నేతలు ఆగట్లేరని, ఎగిరెగిరి పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ బలమేంటో మున్సిపల్ ఎన్నికల్లో తేలుతుందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ నుంచి ఎవరు దొరుకుతారా అని, ఎవరిని పార్టీలోకి తీసుకోవాలా అని బీజేపీ ఎదురుచూస్తోందని విమర్శించారు. బీజేపీకి క్షేత్రస్థాయిలో బలం లేదన్న కేటీఆర్.. ఆ పార్టీకి చెందిన ఎవరో ఏదో మాట్లాడితే స్పందించాల్సిన ఖర్మ తనకు లేదన్నారు. గవర్నర్ మారతారంటూ వస్తున్న వార్తలు ఊహాజనితమేనని, అలాంటిదేదైనా జరిగినప్పుడు వ్యాఖ్యానించడం మంచిదని అభిప్రాయపడ్డారు. ఏపీ రాజకీయాలపై ప్రశ్నించగా.. ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో ఏవో జరుగుతున్నాయి.. వాళ్ల గొడవ మనకెందుకని దాటవేశారు. 35 లక్షల సభ్యత్వాలు పూర్తి.. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ కార్యక్రమం బ్రహ్మాండంగా నడుస్తోందని కేటీఆర్ తెలిపారు. ఈనెల 17 వరకు 35 లక్షల సభ్యత్వాలు అయ్యాయని వివరించారు. ఇంకా చాలా చోట్ల సభ్యత్వాలు పూర్తయినా పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకోలేదని, ఇప్పటివరకు సభ్యత్వాల ద్వారా రూ.7 కోట్లు వసూలయ్యాయని చెప్పారు. గతం కన్నా ఎక్కువ సభ్యత్వాలు అవుతాయని ఆశాభావం వ్యక్తంచేశారు. జర్నలిస్టుల బాధ్యత నాది.. రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించే బాధ్యత తనదేనని కేటీఆర్ హామీ ఇచ్చారు. ‘‘ఇళ్ల స్థలాల కోసం సీఎంను కొందరు ఎమ్మెల్యేలు కూడా ఈ రోజు కలిశారు. వారం రోజుల్లో ప్రక్రియ ప్రారంభించాలని ఆయన సీఎంవో అధికారులకు చెప్పినట్టు నాకు సమాచారం ఉంది. ఎమ్మెల్యేలతో పాటే జర్నలిస్టులకు కూడా ఇళ్ల స్థలాలు వస్తాయి. ఈ విషయంలో ఐ అండ్ పీఆర్ కమిషనర్, ప్రెస్ అకాడమీ చైర్మన్లతో మాట్లాడతా. త్వరలోనే జర్నలిస్టు ప్రతినిధులతోనూ సమావేశమవుతా’’ అని కేటీఆర్ తెలిపారు. గుండెకాయలాంటి హైదరాబాద్ను కాపాడుకోవాలి రాజధాని శివార్లలోని 7 మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా మార్చడం చాలా మంచి నిర్ణయమని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ముంబై చుట్టూ ఏడు కార్పొరేషన్లు ఉంటాయని, అలాగే హైదరాబాద్ శివార్లలోని మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా మార్చారని చెప్పారు. గుండెకాయ లాంటి హైదరాబాద్ను సవ్యంగా కాపాడుకోవాలంటే అలాంటి నిర్ణయం తీసుకోవాల్సిందేనని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటైన కార్పొరేషన్ల ద్వారా సిబ్బంది పెరిగి ప్రజలకు సేవలు విస్తృతంగా అందుతాయని వివరించారు. ఆయా కార్పొరేషన్ల పరిధిలో పన్నులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సీఎం కేసీఆర్ చెప్పినట్టు వెల్లడించారు. కొత్త మున్సిపల్ చట్టంలోని స్ఫూర్తి జీహెచ్ఎంసీకి కూడా వర్తిస్తుందని స్పష్టంచేశారు. అందరూ కట్టుకుంటున్నారు.. ‘‘ఐదారు రాష్ట్రాలు కొత్త సచివాలయాలు, అసెంబ్లీలు కట్టుకుంటున్నాయి. గాంధీనగర్లో మొత్తం మార్చేశారు. మనం మార్చుకుంటే తప్పేముంది? ఈ భవనాలు ఇంకో 100 ఏళ్ల పాటు ఉపయోగపడతాయి కదా’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రీజనల్ రింగ్రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఆగిపోయిందని కేంద్రం చెప్పలేదని, భూసేకరణ భారంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా 50శాతం ఇవ్వాలని చెప్పినట్టు తనకు సమాచారం ఉందని వెల్లడించారు. ప్రతిపక్షాలకు ఏ అంశంపై మాట్లాడాలో అర్థం కాక ఇలాంటి వాటిపై స్పందిస్తున్నాయని, ప్రజలకు సంబంధించిన అంశాలను గుర్తించడంలో ప్రతిపక్షాలు విఫలమ్యాయని విమర్శించారు. ప్రతిపక్షంలో నాయకత్వ సంక్షోభం కూడా ఉందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం చేయాల్సింది చేసింది.. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు బాధ్యత ఎమ్మెల్యేలదేనని, ఎమ్మెల్యేలు లేని చోట్ల నియోజకవర్గ ఇన్చార్జులు చూసుకుంటారని కేటీఆర్ తెలిపారు. పెంచిన పింఛన్లు కూడా పంపిణీ చేస్తున్నామని, 75 గజాల భూమికి ఆస్తి పన్ను తగ్గించామని, భగీరథ ద్వారా దాదాపు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు నీళ్లు అందించడం.. ఇలా ప్రభుత్వం తరఫున చేయాల్సిందంతా చేశామని స్పష్టంచేశారు. ఇక స్థానిక నేతలు సమన్వయం చేసుకుని మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలని అన్నారు. ఈ ఎన్నికల్లో అగ్రభాగం తామే గెలుచుకుంటామని, రెండో స్థానంలో ఎవరుంటారో కాంగ్రెస్, బీజేపీలే తేల్చుకోవాలని వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడనేది కోర్టు నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుందని, త్వరలోనే జరుగుతాయని తాను అనుకుంటున్నానని చెప్పారు. -
సభ్యత్వ నమోదు ‘గుబాళించాలి’..
సాక్షి, హైదరాబాద్: పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం కావాలని, త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆదివారం తెలంగాణభవన్లో నియోజకవర్గాలవారీగా సభ్యత్వ నమోదు ఇన్చార్జీలతో ఆయన భేటీ అయ్యారు. పార్టీలో సభ్యత్వ నమోదు, మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుపై ఆయన దిశానిర్దేశం చేశారు. ఇందుకోసం సరైన వ్యూహం, పక్కా ప్రణాళిక ఏర్పర్చుకోవాలని సూచించారు. 60 లక్షల సభ్యత్వాలు పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ మార్గనిర్దేశం మేరకు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని కేటీఆర్ పార్టీ ఇన్చార్జీలను కోరారు. ఇప్పటికే 119 నియోజకవర్గాలకు దాదాపు 60 లక్షల సభ్యత్వ నమోదు పుస్తకాలను పంపిణీ చేశామని, జూలై 20 కన్నా ముందే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తిచేయాలని కేటీఆర్ కోరారు. మొత్తం పార్టీ సభ్యత్వంలో 35 శాతం క్రియాశీలక సభ్యులను నమోదు చేయడం లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలతో కలసి సమన్వయం చేసుకుంటూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సమన్వయం చేసుకునేందుకు రెండు నియోజకవర్గా లకు ఒకరు చొప్పున ఇన్చార్జీలను పార్టీ ప్రకటించింది. దీంతోపాటు హైదరాబాద్ పరిధిలో ప్రతి నియోజకవర్గానికి ఒక ఇన్చార్జీని పార్టీ ప్రకటించింది. పార్టీ నియమించిన ఇన్చార్జీలు సీఎం ఆదేశాల మేరకు రాబోయే రెండు వారాలపాటు ఆయా నియోజకవర్గాల్లో ఉంటూ పార్టీ సభ్యత్వ నమోదులో స్థానిక నాయకులందరినీ భాగస్వాములను చేస్తూ పర్యవేక్షించాలన్నారు. మరో వారం రోజుల్లో ఆన్లైన్, మొబైల్ ద్వారా సభ్యత్వాన్ని నమోదు చేసుకునే సౌకర్యాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు. సభ్యత్వ నమోదు సందర్భంగా తీసుకోవాల్సిన పలు చర్యలను సమావేశంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సూచించారు. సభ్యత్వ నమోదు సందర్భంగా కార్యకర్తల పూర్తి సమాచారం సేకరించాలని కోరారు. ముఖ్యంగా కార్యకర్తలకు ప్రమాదబీమా ఉన్నందున, పూర్తి చిరునామా, మొబైల్, ఆధార్ నంబర్, నామినీ వివరాలను సేకరించాలన్నారు. వివరాలుంటే పార్టీ అందిస్తున్న బీమా సౌకర్యానికి ఎలాంటి ఇబ్బందులు భవిష్యత్తులో తలెత్తవని తెలిపారు. తొలి సభ్యత్వం కేటీఆర్దే! ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వ నమోదు కేటీఆర్తోనే ప్రారంభమైంది. సమావేశ ప్రారంభానికి ముందు కేటీఆర్ అందరి కంటే ముందుగా సభ్యత్వం తీసుకున్నారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్ మన్నె కవిత చేతుల మీదుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు తొలి సభ్యత్వం అందజేశారు. బీసీలకు పెద్దపీట వేయండి పార్టీ కమిటీల ఏర్పాటులో బీసీల ప్రాధాన్యతకు సంబంధించి కేటీఆర్ పలు ఆదేశాలు జారీ చేశారు. పార్టీ అధ్యక్షుల ఆదేశం మేరకు పార్టీ కమిటీల్లో కనీసం 51 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఉండేలా చూడాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ, మండల కమిటీలను, నగరాలు, పట్టణాల్లో వార్డు, డివిజన్ కమిటీ ఏర్పాట్లను జూలై 20 నాటికి సభ్యత్వ నమోదుతో సమాంతరంగా పూర్తి అయ్యేలా స్థానిక నాయకత్వంతో సమన్వయం చేసుకోవాలని ఇన్చార్జీలకు సూచించారు. ప్రతి కమిటీలో 15 మందికి తగ్గకుండా చూడాలని, అన్ని కమిటీల్లో నూ పార్టీ క్రియాశీలక సభ్యులకు మాత్రమే అవకాశం ఇవ్వాలన్నారు. పార్టీ అనుబంధ సంఘాలైన రైతు, యువజన, కార్మిక, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళాకమిటీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. సభ్యత్వ నమోదు ప్రక్రియను తానే స్వయంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాన ని తెలిపారు. సభ్యత్వ నమోదు వివరాలను ఎక్కడికక్కడే డిజిటలీకరణ చేస్తున్నామని, ప్రతి జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమం కొనసాగుతుం దని తెలిపారు. కార్యక్రమాన్ని పర్యవేక్షించే జిల్లా ఇన్చార్జీలను ప్రకటించారు. -
138 మున్సిపాలిటీల్లో గులాబీ జెండా
సిరిసిల్ల: రాష్ట్రంలోని 138 మున్సిపాలిటీల్లోనూ గులాబీ జెండా ఎగురుతోందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు ధీమా వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శనివారం ఆయన టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లా పరిషత్ ఎన్నికల్లో 32 జెడ్పీలను టీఆర్ఎస్ దక్కించుకోవడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. తెలంగాణ సాధించిన పార్టీగా టీఆర్ఎస్ రాష్ట్రానికి శ్రీరామ రక్షగా ప్రజలు భావిస్తున్నారని కేటీఆర్ వివరించారు. 2018 శాసససభ ఎన్నికల్లో 50 శాతం ఓట్లతో 75 శాతం మంది ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపించారని, లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు అందించారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుగులేని శక్తిగా టీఆర్ఎస్ నిలిచిందని కేటీఆర్ చెప్పారు. జూలై నుంచి రెట్టింపు పింఛన్లు జూలై నుంచి ఆసరా పింఛన్లు రెట్టింపు చేసి చెల్లిస్తామని కేటీఆర్ తెలిపారు. పింఛన్లు కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తోందని కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, పింఛన్లకు ఢిల్లీ నుంచి వచ్చేది సున్నా అని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అవి అప్పులు కాదు.. భవిష్యత్తుకు పెట్టుబడి అని వివరించారు. రాష్ట్రంలో జూలై 20వ తేదీ నాటికి 60 లక్షల టీఆర్ఎస్ సభ్యత్వాలు చేర్పించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఇందులో 35 శాతం క్రియాశీల సభ్యత్వాలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రతీ సభ్యత్వాన్ని కంప్యూటరీకరణ చేస్తామన్నారు. ప్రతి కార్యకర్త ఆధార్ నంబరు, ఫోన్ నంబరుతో సహా సమగ్ర సమాచారాన్ని పార్టీ కేంద్ర కార్యాలయంలో రికార్డు చేస్తున్నామని చెప్పారు. క్రియాశీల కార్యకర్తలకు పార్టీ పరంగా గుర్తింపు కార్డులు జారీ చేస్తామని, ఇళ్లలో కూర్చుని బోగస్ సభ్యత్వాలు నమోదు చేయొద్దని సూచించారు. కార్యకర్తలకు రూ.2 లక్షల ప్రమాద బీమా కోసం ఏటా రూ.15 కోట్లు ప్రీమియంగా చెల్లిస్తున్నామని వివరించారు. కేటీఆర్ విరాళం సిరిసిల్లలో టీఆర్ఎస్ భవన నిర్మాణం కోసం తన వంతుగా నెల జీతం రూ.2.50 లక్షలు విరాళంగా అందిస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. వేదికపై ఉన్న టీఆర్ఎస్ నేతలు కేటీఆర్ను స్ఫూర్తిగా తీసుకుని రూ.40 లక్షల మేర భవనానికి విరాళాలు అందించారు. దసరా నాటికి అద్భుతమైన టీఆర్ఎస్ భవనం సిద్ధం చేస్తామన్నారు. సిరిసిల్లలో మోడల్ డిజిటల్ లైబ్రరీ ప్రారంభం జిల్లా కేంద్రంలో డాక్టర్ సి.నారాయణరెడ్డి స్మారకమందిరం పేరుతో మోడల్ డిజిటల్ లైబ్రరీని కేటీఆర్ ప్రారంభించారు. రూ.3.60 కోట్లతో నిర్మించిన భవనాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా సిరిసిల్లలో మోడల్ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశామన్నారు. పిల్లలకు పుస్తక పఠనంపై ఆసక్తి తగ్గిపోతున్న ఈ రోజుల్లో తెలుగు భాషావృద్ధికి దోహదపడేలా ఆధునిక హంగులతో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశామన్నారు. డిజిటల్ నెట్వర్క్తో కంప్యూటర్లను ఏర్పాటు చేసినట్లు కేటీఆర్ తెలిపారు. గొప్ప సమాచార, విజ్ఞాన కేంద్రంతో గ్రంథాలయం ఉంటుందన్నారు. -
‘త్రీఐ’లతోనే దేశం పురోభివృద్ధి
రాయదుర్గం: ఇన్నోవేషన్, ఇన్క్లూజివ్ గ్రోత్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ (త్రీఐ)లతో దేశం పురోభివృద్ధి సాధిస్తుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. రాయదుర్గంలో శుక్రవారం ‘ది స్టార్టప్ వే– మేడ్ ఇన్ హైదరాబాద్’అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో భారతదేశం బాగుపడేందుకు ఏం చేయాలని ప్రశ్నించగా.. తాను పలు సలహాలు ఇచ్చినట్లు చెప్పారు. అందుకోసం ‘త్రీఐ’ల గురించి వివరించినట్లు కేటీఆర్ తెలిపారు. వీటకి ప్రాధాన్యం ఇస్తే దేశీయ ఉత్పత్తులు పెరిగి, పోటీతత్వంతో అభివృద్ధి సాధ్యమని చెప్పినట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహించడంతోనే స్టార్టప్లు దేశానికే ఆదర్శంగా మారారని చెప్పారు. యువకులు, ఉత్సాహవంతులంతా వినూత్నంగా ఆలోచించి, ఉత్పత్తి ఆధారిత స్టార్టప్లకు ప్రాధాన్యత ఇస్తే, వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ముందుంటోందన్నారు. హెడ్కానిస్టేబుల్ కుమారుడు దేశంలో మొదటిసారిగా మారుత్డ్రోన్స్ స్టార్టప్ ద్వారా ప్రేమ్ దోమల నివారణకు మంచి పరిష్కారం కనుగొని డ్రోన్ సేవలను ప్రభుత్వం వినియోగి స్తోందని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం టీహబ్, వీ–హబ్, రిచ్, వంటివి ఎన్నో ప్రారంభించిందని, త్వరలో టీహబ్–2ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోందన్నారు. 48 ఇంక్యుబేషన్ సెంటర్లు తెలంగాణ రాష్ట్రంలో మెంటర్ నెట్వర్క్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర ఐటీ శాఖా ముఖ్యకార్యదర్శి జయేష్రంజన్ వెల్లడించారు. మెంటర్లు రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతం లోని వినూత్నంగా ఆలోచించే సామాజిక సమస్యల పరిష్కారానికి రూపొందించే స్టార్టప్లకు చేయూత, ప్రోత్సాహం, సలహాలు ఇచ్చేందుకు ఈ వ్యవస్థ ఏర్పాటు అవసరమని గుర్తించిందన్నారు. 2014లో ట్రిపుల్ఐటీలోని సీఐఈ, డీల్యాబ్ రెండు ఇంక్యుబేషన్ సెంటర్లలో 200 వరకు స్టార్టప్లుండేవని, ప్రస్తుతం 48 ఇంక్యుబేషన్సెంటర్లలో 3వేలకుపైగా స్టార్లప్లు రూపొందాయని రాష్ట్ర ఐటీశాఖా ముఖ్య కార్యదర్శి జయేష్రంజన్ పేర్కొన్నారు. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఏర్పాటు చేసి రెడ్బస్ వ్యవస్థాపకులు ఫణీంద్రసమాను బా«ధ్యతలు అప్పగించామని గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాలలోని వారిని ప్రొత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. – ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ వారి విజయమే.. ‘మేడ్ ఇన్ హైదరాబాద్’ హైదరాబాద్లో విజయవంతంగా స్టార్టప్లను ప్రారంభించి నిర్వహిస్తున్న 25 మంది స్టార్టప్ వ్యాపారుల విజయగాథలతో కూడిన పుస్తకమే ‘మేడ్ ఇన్ హైదరాబాద్’. దీన్ని ఎం.సోమశేఖర్, సత్య అయ్యగారి, సురేశ్థరూర్, వర్షాబిల్గారీ, శుష్మనాయక్, నేహజా రైటర్స్గా వ్యవహరించగా, ఎడిటర్గా వనజా బనగారి వ్యవహరించారు. సంతోషంగా ఉంది.. సక్సెస్ స్టార్టప్ ఎంటర్ప్రెన్యూర్గా గుర్తింపు వచ్చి ఒక పుస్తకంలో మా స్టార్టప్గురించి వ్రాయడం ఎంతో సంతోషంగా ఉంది. అమెరికా నుంచి వచ్చి హైదరాబాద్లో ఈ గుర్తింపు పొందడం ఎంతో గర్వకారణంగా ఉంది. ఇప్పుడు 25 మంది మా కంపెనీలో పనిచేస్తున్నారు’ – హేమంత్ సత్యనారాయణ, స్టార్టప్ ఎంటర్ప్రెన్యూర్ ఏపీఎల్కు కేటరింగ్ చేస్తాం.. బిలిగ్రే పేరిట హోటల్స్ను 2000లో ప్రారంభించాం. వీటి ద్వారా ఐపీఎల్ పోటీలకు కేటరింగ్ చేస్తుంటాం. మా వద్ద 150 మంది పనిచేస్తున్నారు. దివ్యాంగుడిని అయినా హోటల్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తిచేసి ఏ ఇబ్బంది లేకుండా కష్టపడుతూ పనిచేస్తున్నాను. – కిరణ్, బిలిగ్రే వ్యవస్థాపకుడు -
బలమైన శక్తిగా టీఆర్ఎస్
సిరిసిల్ల: తెలంగాణలో బలమైన రాజకీయ శక్తిగా టీఆర్ఎస్ అవతరించిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సోమవారం ఆయన టీఆర్ఎస్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ 2001లో పార్టీ ప్రారంభించినప్పుడు ఈ స్థాయికి చేరుకుంటుందని ఎవరూ ఊహించలేదన్నారు. రాష్ట్రంలో రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతోపాటు సీఎం కేసీఆర్ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేసి రికార్డు సృష్టించారని అన్నారు. కృష్ణా, గోదావరి జలాలను బీడు భూములకు మళ్లించేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ అజేయమైన శక్తిగా నిలిచిందన్నారు. దేశ చరిత్రలోనే తొలిసారి 32 జెడ్పీ స్థానాల్లో గులాబీ జెండా ఎగరడం విశేషమన్నారు. ఈనెల 27 నుంచి టీఆర్ఎస్ సభ్యత్వాల నమోదు ఉంటుందని, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో భాగంగా అన్ని జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. బూత్ కమిటీల నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ కార్యకర్తలకు శిక్షణ ఇస్తామన్నారు. పండుగ వాతావరణంలో సభ్యత్వాల నమోదు జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరితోనైనా తలపడతాం రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతోనే కాదు దేవుడితోనైనా తలబడేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ అన్నారు. ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా ప్రభుత్వ పాలన సాగుతోందని చెప్పారు. బీడు భూములకు సాగునీరు వస్తే సీఎం ఫొటో ప్రతీరైతు గుండెలో ఉంటుందని, ఆయన ఫొటోను పెట్టుకుని మొక్కేరోజులు వస్తాయన్నారు. రైతు సంక్షేమంలో తెలంగాణ దేశానికి దిక్సూచి అయిందన్నారు. కోటి ఎకరాలకు సాగునీరు అందించి హరిత తెలంగాణ సాధిస్తామన్నారు. ఆకుపచ్చని తెలంగాణ లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని వివరించారు. వస్త్ర పరిశ్రమను విస్తరించాలి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను విస్తరించాలని కేటీఆర్ కోరారు. సిరిసిల్ల పద్మశాలి నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారంలో ఆయన పాల్గొన్నారు. తమిళనాడులోని తిరువూరుకు దీటుగా కొత్త ఆలోచనలతో వస్త్రోత్పత్తి రంగాన్ని అభివృద్ధి చేయాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చేనేత జౌళిశాఖకు రూ.70 కోట్లు ఉన్న బడ్జెట్ ఇప్పుడు తెలంగాణలో రూ.1,270 కోట్లకు చేరిందని పేర్కొన్నారు. సిరిసిల్లలో అపెరల్ పార్కు నిర్మాణంతో 10 వేల మంది మహిళలకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని మరమగ్గాలు, చేనేత మగ్గాలకు జియో ట్యాగింగ్ చేశామని కేటీఆర్ తెలిపారు. కార్యక్రమాల్లో వేములవాడ, చొప్పదండి, మానకొండూరు ఎమ్మెల్యేలు చెన్నమనేని రమేశ్బాబు, సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, కలెక్టర్ కృష్ణభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. నిర్వాసితుల సమస్యలు సీఎంకు తెలుసు ప్రాజెక్టుల నిర్మాణంలో భూములు కోల్పోతున్న నిర్వాసితుల త్యాగం మరువలేనిదని కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్ నిర్మాణ పనులను కేటీఆర్ పరిశీలించారు. సొరంగం తవ్వకాలను ఆయన క్షేత్ర స్థాయిలో చూశారు. నిర్వాసితుల త్యాగాలతోనే ప్రాజెక్టులు నిర్మాణం అవుతున్నాయని, కొందరి త్యాగం కోట్ల మందికి ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. నిర్వాసితులందరికీ న్యాయం చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. -
ప్రస్తుతం జిల్లాల్లో.. తర్వాత నియోజకవర్గాల్లో!
సాక్షి, హైదరాబాద్: జిల్లా కేంద్రాల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల నిర్మాణానికి ఈనెల 24న ఏకకాలంలో శంకుస్థాపన చేసేందుకు శరవేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. శంకుస్థాపన ఏర్పాట్లపై పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కె.తారక రామారావు శనివారం మంత్రులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, పార్టీ ముఖ్యనేతలతో జిల్లాల వారీగా ఫోన్లో సమీక్షించారు. భూమి పూజ జరిగే స్థలాలను శనివారం సాయంత్రంలోగా పరిశీలించి, ఏర్పాట్లపై దృష్టి సారించాల్సిందిగా సూచించారు. నూతనంగా నిర్మించే పార్టీ భవనాల నమూనాను సీఎం కేసీఆర్ త్వరలో ఎంపిక చేస్తారని వెల్లడించారు. సోమవారం ఉదయం 10 నుంచి 11 గంటల నడుమ మంచి ముహూర్తం ఉన్నందున శంకుస్థాపన నిర్వహించాలన్నారు. మంత్రుల ప్రాతినిథ్యం ఉన్నచోట ఆయా జిల్లా కేంద్రాల్లో వారే శంకుస్థాపన చేస్తారని, మిగతా జిల్లాల్లో జెడ్పీ చైర్మన్లు నిర్వహిస్తారన్నారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కేటీఆర్ ఆదేశించారు. శంకుస్థాపన కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు పార్టీ పక్షాన ఎన్నికైన ప్రాదేశిక సంస్థల ప్రతినిధులు, సర్పంచ్లు, పార్టీ సీనియర్ నేతలను కూడా ఆహ్వానించాలని పార్టీ కీలక నేతలకు సూచించారు. భూమి పూజలో పాల్గొనే తొమ్మిది మంది మంత్రులతోపాటు, 19 మంది జిల్లా పరిషత్ చైర్మన్ల జాబితాను కేటీఆర్ విడుదల చేశారు. జిల్లాకు ఎకరా చొప్పున కేటాయింపు జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయం నిర్మాణానికి వీలుగా ఈ నెల 18న సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరిగిన రాష్ట్ర కేబినెట్ ఒక్కో జిల్లాలో ఎకరా చొప్పున భూమి కేటాయించింది. సీఎం ప్రకటనకు అనుగుణంగా ఈ నెల 21న 24 జిల్లా కేంద్రాల్లో టీఆర్ఎస్ పార్టీ భవనాల నిర్మాణానికి భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 34 జిల్లాలకుగాను ఖమ్మంలో ఇదివరకే పార్టీ జిల్లా కార్యాలయాన్ని నిర్మించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన కేటీఆర్ కొద్ది రోజులకే గత ఏడాది డిసెంబర్ 20న వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. రాజధాని హైదరాబాద్లో ఇప్పటికే రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్ ఉన్నా, నగర శాఖ కోసం మరో కార్యాలయాన్ని నిర్మించాలని నిర్ణయించారు. అయితే హైదరాబాద్ నగరంతో పాటు, వరంగల్ రూరల్ జిల్లా కేంద్రంలో కార్యాలయ నిర్మాణం కోసం అనువైన స్థలం కోసం పార్టీ అన్వేషిస్తోంది. మరో ఆరు జిల్లా కేంద్రాల్లో భూ కేటాయింపుపై స్పష్టత రావాల్సి ఉంది. రూ.19.20 కోట్లు పార్టీ నిధులు క్షేత్ర స్థాయిలో పార్టీని వ్యవస్థీకృతం చేయాలని భావిస్తున్న టీఆర్ఎస్.. తొలుత జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణంపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం పార్టీ పేరిట రూ.225 కోట్ల డిపాజిట్లు ఉండగా, వడ్డీ రూపంలో రూ.1.25 కోట్ల ఆదాయం వస్తోంది. పార్టీ నిధుల నుంచే ఒక్కో భవనానికి రూ.60లక్షల చొప్పున కేటాయిస్తున్నట్లు పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. తమిళనాడులో డీఎంకే తరహాలో ఇంటికో పార్టీ కార్యకర్త ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్న టీఆర్ఎస్.. త్వరలో నియోజకవర్గ స్థాయిలోనూ పార్టీ కార్యాలయాలను నిర్మించాలనే యోచనలో ఉంది. నియోజకవర్గ కేంద్రాల్లో స్థల కేటాయింపులో సాధ్యాసాధ్యాలపై పార్టీ అధినేత కేసీఆర్ అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. -
కేటీఆర్ చొరవతో సౌదీ నుంచి రాష్ట్రానికి..
సాక్షి, హైదరాబాద్: ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన 39 మంది తెలంగాణ వాసులు.. టీఆర్ఎస్ కార్వనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చొరవతో సోమవారం రాష్ట్రానికి చేరుకున్నారు. కరీంనగర్, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన సుమారు 60 మంది కార్మికులు సౌదీ అరేబియాలోని ఓ నిర్మాణరంగ సంస్థలో పని కోసం వెళ్లారు. 2018 ఏప్రిల్ తర్వాత సదరు కంపెనీ పూర్తి స్థాయిలో మూతపడింది. దీంతో అక్కడే చిక్కుకున్న కార్మికులు ఆహారం, వసతి వంటి కనీస మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కార్మికులు తమ కష్టాలను ట్విట్టర్ ద్వారా కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన కేటీఆర్.. వారికి సహాయం అందించేందుకు అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని ఆదేశించారు. అలాగే ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా రియాద్లోని భారత రాయబార కార్యాలయం అధికారులకు విజ్ఞప్తి చేశారు. దీంతో సౌదీలోని భారత రాయబార కార్యాలయం స్పందిం చి.. కార్మికుల సమాచారం ఆధారంగా వారిని గుర్తించి తెలంగాణకు పంపేందుకు ఏర్పాట్లు చేసింది. కార్మికుల వద్ద ఉన్న వర్క్ పర్మిట్ వీసా గడువు పూర్తవడంతో భారత రాయబార కార్యాలయం వారికి తాత్కాలిక ఎగ్జిట్ వీసాలను మంజూరు చేసింది. దీంతోపాటు తిరుగు ప్రయాణానికి వీలుగా విమాన టికెట్లు సమకూర్చింది. కేటీఆర్ హర్షం.. కార్మికులు సౌదీ నుంచి స్వరాష్ట్రానికి చేరుకోవడం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. సౌదీలోని భారత రాయబార కార్యాలయంతోపాటు, తెలంగాణ ఎన్నారై శాఖాధికారులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎన్నారై శాఖ అధికారి చిట్టిబాబు కార్మికులను సోమవారం శంషాబాద్ విమానాశ్రయం నుంచి వారి స్వస్థలాలకు పంపేలా ఏర్పాట్లు చేశారు. చాలా ఇబ్బందులు పడ్డాం.. కంపెనీ మూతపడటంతో చాలా ఇబ్బందులు పడ్డాం. ఏడాదిగా జీతాలు కూడా లేవు. మా పత్రాలు రెన్యువల్ కాకపోవడంతో బయట కూడా తిరగలేని పరిస్థితి ఎదురైంది. విదేశాంగ అధికారులు చొరవ తీసుకున్నారు. మాజీ మంత్రి కేటీఆర్, ఎన్నారై సెల్ వారందరూ సహకరించడంతో స్వదేశానికి వచ్చాం. – రవి, నిర్మల్ జిల్లా -
తిరుపతిరెడ్డికి కేటీఆర్ అభినందనలు
సాక్షి, హైదరాబాద్: ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తిరుపతిరెడ్డిని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు అభినందించారు. వికారాబాద్ జిల్లా నవాబు పేట ఎల్లకొండకు చెందిన తిరుపతిరెడ్డి ఇటీవలే ఎవరెస్టును అధిరోహించారు. టీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు వి.నందు సహకారంతో ఆయన మంగళవారమిక్కడ కేటీఆర్ను కలిశారు. స్థానికులు కొందరు రూ.3లక్షలిచ్చి ప్రోత్సహించారని, శంకర్పల్లి మాజీ సర్పంచ్ ఆత్మలింగం రూ.11.5 లక్షలు, బీడీఎల్ విన్నర్స్ ఫౌండేషన్ కొంత ఆర్థిక సహాయం చేయడంతో తాను ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించినట్లు తిరుపతి తెలిపారు. వికలాంగుడికి వాహనం కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన వికలాంగు డు సంబరబోయిన శివ(20) ఉద్యోగం చేసుకుందామనుకుంటే ప్రయాణంలో ఇబ్బంది పడేవారు. దీంతో తనకు ఒక వాహనాన్ని ఇప్పించాలని కోరుతూ ఆయ న కేటీఆర్కు వాట్సాప్లో మెసేజ్ పెట్టారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. శివకు వాహనం ఏర్పాటు చేయించాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు సూచించారు. కేటీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ ఒక హోండా యాక్టివాను కొనుగోలు చేశారు. మంగళవారం కేటీఆర్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద సమక్షంలో శివకు యాక్టివాను అందజేశారు. కొత్తగా ఎన్నికైన ఆదిలాబాద్, నిర్మల్ జెడ్పీ చైర్పర్సన్లు రాథోడ్ జనార్దన్, కె.విజయలక్ష్మిలు కేటీఆర్ను కలిశా రు. ఈ సందర్భంగా సమన్వయంతో జిల్లాల అభివృద్ధికి కృషి చేయాలని కేటీఆర్ వారికి సూచించారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ఎమ్మెల్యే జోగు రామన్న, ఎమ్మెల్యేలు విఠల్రెడ్డి, రేఖానాయక్, డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ లోక భూమారెడ్డి, పలువురు జెడ్పీటీసీలు కేటీఆర్ను కలిసిన వారిలో ఉన్నారు. -
సమష్టిగా అభివృద్ధి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఎన్నికైన జెడ్పీ చైర్పర్సన్లు ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి పనిచేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గ్రామపంచాయతీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం వరకు అందరు సమష్టిగా పనిచేయాలని సూచించారు. సమష్టి కృషితోనే బంగారు తెలంగాణ సాకారమవుతుందన్నారు. కొత్తగా ఎన్నికైన జెడ్పీ చైర్పర్సన్లు పుట్ట మధు (పెద్దపల్లి), కోవా లక్ష్మి (కుమ్రం భీమ్ ఆసిఫా బాద్), లింగాల కమల్రాజ్ (ఖమ్మం), పద్మ (నాగర్కర్నూలు), లోక్నాథ్రెడ్డి (వనపర్తి), హేమలత (మెదక్), నరేందర్రెడ్డి (నల్లగొండ), సందీప్రెడ్డి(యాదాద్రి భువనగిరి), మంజుశ్రీ (సంగారెడ్డి), సుధీర్కుమార్(వరంగల్ అర్బన్), జ్యోతి (వరంగల్ రూరల్), సంపత్రెడ్డి (జన గామ), కుసుమ జగదీష్ (ములుగు), బిందు (మహబూబాబాద్), శ్రీహర్షిణి (జయశంకర్ భూపాలపల్లి) సోమవారం హైదరాబాద్లో కేటీ ఆర్ను కలిశారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, జగదీశ్రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్రెడ్డి, వరంగల్ ఉమ్మడి జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మా నర్సింగరావు, ఎంపీలు పసునూరి దయాకర్, మాలోతు కవిత, ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, పల్లా రాజేశ్వర్రెడ్డి, సత్యవతి రాథోడ్, వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, సండ్ర వెంక టవీరయ్య, కోనేరు కోనప్ప, గొంగడి సునీత, గండ్ర వెంకటరమణారెడ్డి, శంకర్నాయక్, గ్యాదరి కిషోర్, సుమన్, గువ్వల బాలరాజు, ధర్మారెడ్డి, సతీష్ కుమార్, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, నన్నపునేని నరేందర్, హరిప్రియ, క్రాంతి కిరణ్ తదితరులు కేటీఆర్ను కలిశారు. -
ఇది అఖండ విజయం
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తమ పార్టీకి అసాధారణ, అఖండ, చారిత్రక విజయం అందించారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వానికి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు మరోసారి సంపూర్ణ మద్దతు తెలిపారని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కంటే ఎక్కువ విజయాన్ని కట్టబెట్టారన్నారు. పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఏకపక్ష విజయం సాధించిన నేపథ్యంలో కేటీఆర్ మంగళవా రం తెలంగాణభవన్లో మాట్లాడారు. మూడు జిల్లా ల్లోని మూడు స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజ యం సాధించిన పట్నం మహేందర్రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, తేరా చిన్నపరెడ్డికి ఆయన అభినందనలు తెలిపారు. వరంగల్లో పోలైన ఓట్లలో ఏకంగా 96 శాతం ఓట్లు సాధించి పోచంపల్లి దేశంలోనే రికార్డు సాధించారన్నారు. దీనికి కొనసాగింపుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అసాధారణ విజయం దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు. ఇదొక చారిత్రక, అసాధారణ, అఖండ విజయమని, ఈ విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. 5 సార్లు ఎదుర్కొన్నాం.. ‘దేశ స్థానిక ఎన్నికల చరిత్రలో ఇంతటి తీర్పు లేదేమో. ఎన్నిక ఏదైనా తెలంగాణ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరు కుంటున్నారనేందుకు తాజా ఫలితాలు నిదర్శనం. రాష్ట్రంలోని 32 జిల్లా పరిషత్లను ఎవరి మద్దతు లేకుండా టీఆర్ఎస్ గెలుచుకుంటుంది. 90 శాతానికిపైగా మం డల పరిషత్ పదవుల విషయంలోనూ తీర్పు ఇలాగే ఉంది. 2001లో టీఆర్ఎస్ తొలినాళ్లలోనే స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొని నిజామాబాద్, కరీంనగర్ జిల్లా పరిషత్ పీఠాలను కైవసం చేసుకుంది. అప్పటి నుంచి చూస్తే ఇప్పటికి ఐదు సార్లు స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొన్నాం. ఇప్పటి గెలుపు టీఆర్ఎస్ చరిత్రలోనే ఇది అతిపెద్ద విజయం. వంద శాతం జెడ్పీ స్థానాల ను కైవసం చేసుకోవడం ఆనందంగా ఉంది. ఇంతటి విజయాన్ని కట్టబెట్టిన లక్షలాది మంది టీఆర్ఎస్ కార్యకర్తలకు, ఓట్లు వేసి గెలి పించిన ప్రజలకు హదయపూర్వక ధన్యవాదాలు. వరంగల్రూరల్, వరంగల్ అర్బన్, కరీంనగర్, మహబూబ్నగర్, జనగామ, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అన్ని జెడ్పీటీసీ స్థానాల్లో టీఆర్ఎస్ గెలిచింది. సిద్దిపేట, ఆసిపాబాద్, వనపర్తి, సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో ఒక్కో స్థానం మాత్రమే కోల్పోయాం. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ సొంత నియోజకవర్గంలో ఏడు జెడ్పీటీసీ స్థానాలుంటే ఐదు స్థానాల్లో టీఆర్ఎస్ గెలిచింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నియోజకవర్గం మధిరలోని ఐదు జెడ్పీటీసీ స్థానాల్లో నాలుగు చోట్ల టీఆర్ఎస్ విజయం సాధించింది. గత 18 ఏళ్లలో టీఆర్ఎస్ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. ఒకానొక దశలో పార్టీ కనుమరుగైపోతుందేమోనన్న స్థితి ఏర్పడింది. గెలిచినా, ఓడినా టీఆర్ఎస్ ఎప్పుడూ ఒకేలా ఉం టుంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పినట్లు ఇది విజయం కాదు. ప్రజలు మాపై పెట్టిన బాధ్యత. పార్లమెంట్ ఎన్నికలకు, ఈ ఎన్నికలకు ఓటింగ్లో తేడా కనిపించింది. నరేంద్ర మోదీ ప్రధాని కావాలనే భావనలో ఆ ఎన్నికలు జరిగాయి. జగిత్యాల జిల్లాలోని ఒక్క స్థానం మినహా అన్ని జెడ్పీటీసీ స్థానాల్లో టీఆర్ఎస్ గెలిచింది. లోక్సభ ఎన్నికల్లో అక్కడ బీజేపీకి ఆధిక్యత వచ్చింది. సిరిసిల్ల జిల్లాలోనూ ఒకే స్థానం కోల్పోయాం. కరీంనగర్ లోక్సభ సీటును బీజేపీ గెలిచింది. 4 ఎంపీ సీట్లు గెలవగానే బీజేపీ నేత లు ఏదేదో మాట్లాడుతున్నారు. అది మంచి పద్ధతి కాదు. ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు. అనేక జిల్లాల్లో ప్రతిపక్ష పార్టీలు ఖాతాలు తెరవలేదు. మేం విజయం వస్తే పొంగిపోం. ఓటమితో కుంగిపోం. కార్యకర్తలు విజయాన్ని ఆస్వాదిస్తూనే బాధ్యతగా ఉండాలి. ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎన్నిక అయ్యే దాకా ఈ ఎన్నికల టీఆర్ఎస్ ఇన్చార్జీలు జిల్లాల్లోనే ఉండాలి. 90 శాతానికిపైగా ఎంపీపీలు టీఆర్ఎస్ గెలుచుకునేలా ఫలితాలు ఉన్నాయి’ అని కేటీఆర్ అన్నారు. సీఎంఆర్ఎఫ్కు విరాళం.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎన్నికైన కూర్మయ్యగారి నవీన్కుమార్ మిత్రబృందం ముఖ్యమంత్రి సహాయనిధికి భారీ విరాళం ఇచ్చారు. నవీన్ కుమార్ ఎమ్మెల్సీగా విజయం సాధించిన శుభ సందర్భంగా ఆయన మిత్రబృందం ఈ నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ నవీన్కుమార్ సూచన మేరకు రూ.1,40,50,000 చెక్కును సీఎంఆర్ఎఫ్కు అందజేశారు. ఈ మేరకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు చెక్కును మంగళవారం అందజేశారు. -
టీఆర్ఎస్ క్లీన్స్వీప్
సాక్షి, హైదరాబాద్: శాసనమండలిలో టీఆర్ఎస్ పూర్తి ఆధిపత్యం సాధించింది. తాజాగా ఎన్నికలు జరిగిన 4 ఎమ్మెల్సీ స్థానాలనూ టీఆర్ఎస్ గెలుచుకుంది. మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థులు భారీ ఆధిక్యతతో విజయం సాధించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఫిబ్రవరిలో ఎమ్మెల్యే కోటాలోని 5 స్థానాలకు జరిగిన సాధారణ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ 4, ఎంఐఎం ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి. వరుస గెలుపులతో మండలిలో టీఆర్ఎస్ పూర్తి ఆధిపత్యం సాధించింది. ప్రతిపక్ష హోదాను కోల్పోయిన కాంగ్రెస్ తెలంగాణ శాసనమండలిలో 40 స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన 37 స్థానాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు 31 మంది ఉన్నారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ మండలిలో ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. ప్రస్తుతం ఆ పార్టీకి ఒక్క ఎమ్మెల్సీ మాత్రమే మిగిలారు. ఇటీవల ఎన్నిక జరిగిన కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానంలో కాంగ్రెస్ నేత టి.జీవన్రెడ్డి గెలిచారు. ప్రస్తుతం శాసనమండలిలో ఆయన ఒక్కరే పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజాగా ఎన్నికలు జరిగిన మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పరా జయం పాలయ్యారు. నల్లగొండ ఎమ్మెల్సీ స్థానంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహించేది. తాజా ఎన్నికల్లో అక్కడా ఓటమి పాలైంది. ఇలా శాసనమండలిలో కాంగ్రెస్కు ఒకే స్థానం ఉండటంతో సంఖ్యా పరంగా బీజేపీతో కలిసి మూడో స్థానానికి పరిమితమైంది. బీజేపీ, కాంగ్రెస్లకు పెద్దలసభలో చెరొక సభ్యుడు ఉన్నారు. ఉపాధ్యాయుల నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన సభ్యులు ఇద్దరు ఉన్నారు. శాసనమండలిలో ఇద్దరు సభ్యులతో ఎంఐఎం రెండో అతిపెద్ద పార్టీగా ఉంది. టీఆర్ఎస్కు ఎదురులేదు : కేటీఆర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకులకు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో టీఆర్ఎస్కు ఎదురులేదని ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో మరోసారి రుజువైందని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల తరహాలోనే పరిషత్ ఎన్నికల్లోనూ ఫలితాలు పునరావృతమవుతాయని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన పట్నం మహేందర్రెడ్డి (రంగారెడ్డి), తేరా చిన్నపరెడ్డి (నల్లగొండ), పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి (వరంగల్)లను కేటీఆర్ అభినందించారు. టీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి కృషి చేసిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, తలసాని శ్రీనివాస్యాదవ్, జగ దీష్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, మల్లారెడ్డిలతోపాటు ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను అభినందించారు. నేడు జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రి యలో, ఆ తర్వాత జరిగే జిల్లా పరిషత్ చైర్మన్, మం డల పరిషత్ అధ్యక్షుల ఎన్నిక వరకు ఇదే ఉత్సాహం తో పనిచేయాలన్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలకు కేటీఆర్ ట్విట్టర్లోనూ అభినందనలు తెలిపారు. పోచంపల్లికి దేశంలోనే సరికొత్త రికార్డు.. వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి రికార్డు విజయం సాధించారు. శ్రీనివాస్రెడ్డి గెలుపు దేశంలోనే సరికొత్త రికార్డుగా నమోదైంది. పోలైన ఓట్లలో 96.06 శాతం ఓట్లు శ్రీనివాస్రెడ్డి దక్కించుకున్నారు. పోలైన 883 ఓట్లలో 848 ఓట్లు శ్రీనివాస్రెడ్డికి దక్కాయి. కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి 23 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో పోచంపల్లి రికార్డు గెలుపు నమోదు చేసుకున్నారు. -
అన్ని మతాల పేదలకు చేయూత: కేటీఆర్
సిరిసిల్ల: మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు అన్నారు. జిల్లాకేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండలంలో బుధవారం సాయంత్రం ముస్లింలకు రంజాన్ కానుకలను కేటీఆర్ పంపిణీ చేశారు. అనంతరం జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 700 గురుకులాలలో లక్షలాది మంది పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం రూ.లక్షకు పైగా వెచ్చిస్తోందని తెలిపారు. నాణ్యమైన విద్యతో పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుం దని, పేదరికం శాశ్వతంగా తొలగిపోతుందని చెప్పారు. గురుకులాల్లో ముస్లిం పిల్లలు ఎక్కువగా చదువుకుంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. సర్వమతాల నిలయంగా తెలంగాణ రాష్ట్రం ఉందని ఆయన పేర్కొన్నారు. ముస్లిం యువతుల వివాహానికి షాదీముబారక్ అమలు చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో మత సామరస్యం వెల్లివిరిసేలా కేసీఆర్ పాలన సాగిస్తున్నారని స్పష్టం చేశారు. మీ అందరి దీవెనలతో రెండోసారి తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అందిస్తామని కేటీఆర్కు వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా, ఎస్పీ రాహుల్హెగ్డే తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో కేటీఆర్ పాల్గొన్నారు. అంతకు ముందు కేటీఆర్ గంభీరావుపేటలో జరిగిన రేణుకాఎల్లమ్మ సిద్దోగంలో పాల్గొన్నారు. కేటీఆర్ను కలిసిన సమీర్ తల్లి సౌదీ అరేబియాలో బందీ అయిన మహ్మద్ సమీర్ (21) తల్లి రఫియా కేటీఆర్ను కలసి తన కొడుకును స్వదేశానికి తెప్పించాలని వేడుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన సమీర్ ఏప్రిల్ 15 గల్ఫ్ ఏజెంట్ వాహిద్ మాటలు నమ్మి సౌదీ అరేబియా వెళ్లాడు. ఫామ్ హౌస్లో పని అని చెప్పి గొర్రెలు కాపిస్తున్నారని పేర్కొంటూ సమీర్ ఏడుస్తూ.. ఇటీవల వాట్సప్ ద్వారా కేటీఆర్ పంపించారు. దీనిపై స్పందించిన కేటీఆర్ సౌదీలోని భారత రాయభార కార్యాలయానికి సమాచారం అందించారు. పక్షం రోజులుగా సమీర్ ఇల్లు చేరకపోవడంతో అతని తల్లి రఫి యా కేటీఆర్ను కలిసి కొడుకును ఇంటికి పం పించే ఏర్పాటు చేయాలని వేడుకోవాలని కోర గా కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. -
ఎడారిలో నరకయాతన
సిరిసిల్ల: బతుకుదెరువు కోసం గల్ఫ్ వెళ్లిన మరో యువకుడికి కన్నీళ్లు, కష్టాలు ఎదురయ్యాయి. రెక్కల కష్టాన్ని నమ్ముకుని వెళ్లిన యువకుడు ఏజెంట్ మోసం తో నరకయాతన అనుభవిస్తున్న సంఘటన బుధవారం వెలుగు చూసింది. బాధితుడు గల్ఫ్ దేశంలో అనుభవిస్తున్న కష్టాలను వివరిస్తూ తీసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తనను విడిపించాలని కోరుతూ కన్నీటి పర్యంతమయ్యాడు. తనను స్వదేశానికి రప్పించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కె.తారక రామారావును వేడుకున్నాడు. ఇదీ ఏజెంట్ మోసం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన మహ్మద్ సమీర్ (21) నిజామాబాద్ జిల్లాకు చెందిన ఏజెంట్ వాహిద్ సౌదీ అరేబియాలోని సిటీలో ఫామ్హౌస్లో పని అని, నెలకు రూ.1,200 రియాళ్లు (రూ.22 వేలు) జీతం అని చెప్పాడు. అరబ్బు షేక్లకు అసిస్టెంట్గా పనిచేయాలని, ఫామ్ హౌస్ పని సులభంగా ఉంటుందని వివరించాడు. అతడి మాటలు నమ్మిన సమీర్.. రూ.83 వేలు చెల్లించి వీసా తీసుకున్నాడు. 2019 ఏప్రిల్ 15 సమీర్ సౌదీ అరేబియా వెళ్లాడు. విమానాశ్రమంలో రిసీవ్ చేసుకున్న కఫిల్ (వీసా ఇచ్చిన యజమాని) నేరుగా సిటీకి 1,200 కిలోమీటర్ల దూరంలోని గొర్రె షెడ్డు వద్దకు తీసుకెళ్లి వదిలేశాడు. 300 గొర్రెలకు కాపలా ఉండాలని చెప్పడంతో సమీర్ కంగుతిన్నాడు. ఎడారిలో ఒంటరిగా.. సౌదీ అరేబియాలోని ఎడారిలో ఒంటరిగా గొర్రెలను కాస్తూ సమీర్ ఇబ్బందుల పాలవుతున్నాడు. దయనీయమైన పరిస్థితిలో సమీర్ వద్ద ఫోన్ కూడా లేదు. ఎవరో వస్తే.. వారి ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు తన పరిస్థితిని వివరించాడు. ఈ విషయమై ఏజెంట్ వాహిద్ను కుటుంబ సభ్యులు నిలదీస్తే.. అక్కడ చెప్పిన పని చేయాలి.. లేకుంటే.. రూ.1.20 లక్షలు చెల్లిస్తేనే ఇంటికి పంపిస్తామని ఏజెంట్ వాహిద్ చెప్పాడు. ఇరవై రోజులుగా తిండి సరిగా ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నాడని సమీర్ ఆవేదన వ్యక్తం చేశాడు అన్నా నీ కాల్మొక్త.. ఇంటికి తెప్పించుండ్రి.. సమీర్ తన దయనీయ స్థితిని వివరిస్తూ వీడియో పంపించాడు. ‘కేటీఆర్ అన్నా నీ కాల్మొక్త.. జెర ఇంటికి పంపించుండ్రి అన్నా..’అంటూ కన్నీరు పెట్టాడు. ‘బండిలో ఎక్కడికో తీసుకపోయి టార్చర్ చేస్తుండు. బెదిరిస్తుండు’ అంటూ సమీర్ వాపోయాడు. ఇక్కడుంటే తనకు చావే శరణ్యమంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆస్పత్రి పాలైన తల్లి రఫియా సమీర్ ఇంటికి పెద్దోడు. తండ్రి ఇబ్రహీం బాబు అనారోగ్యంతో ఏడేళ్ల కిందట మరణించాడు. తల్లి రఫియా, తమ్ముడు సుమీర్, చెల్లెలు నౌషియా ఉన్నారు. అప్పుల బాధలతో సిద్దిపేటలో ఇల్లు అమ్ముకుని ఇల్లంతకుంటలో స్థిరపడ్డారు. గతంలో దుబాయి వెళ్లి వచ్చిన సమీర్.. మెరుగైన జీతం కోసం సౌదీ అరేబియా వెళ్లి బందీ అయ్యాడు. కొడుకు పరిస్థితి తెలిసి తల్లి రఫియా హైబీపీ, షుగర్తో సిద్దిపేటలోని ఆస్పత్రిలో చేరింది. సమీర్ను ఎలాగైనా ఇండియా రప్పించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అతడిపైనే కుటుంబం ఆధారపడి ఉందని సమీర్ మేనమామ అబిద్ తెలిపారు. సమీర్ను స్వదేశానికి రప్పించేందుకు చర్యలు: కేటీఆర్ ఏజెంట్ మోసం చేయడంతో సౌదీలో చిక్కుకుని కష్టాలు పడుతున్న మహ్మద్ సమీర్ను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు తెలిపారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంటకు చెందిన 21 ఏళ్ల మహ్మద్ సమీర్ జీవనోపాధి కోసం గత నెలలో సౌదీ అరేబియాకు వెళ్లాడు. ఫంక్షన్హాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని ఓ ఏజెంట్ ఆశ చూపించాడు. ఉద్యోగం చేస్తే ఆర్థిక ఇబ్బందులు తీరతాయని భావించిన సమీర్... ఏజెంట్కు పెద్దమొత్తంలో నగదును ఇచ్చాడు. తీరా అక్కడికి వెళ్లాక తనను గొర్రెల కాపరిగా పెట్టారని కన్నీటి పర్యంతమైన సమీర్, తన ను రక్షించమంటూ వీడియో సందేశాన్ని పంపాడు. దీనిపై స్పందించిన కేటీఆర్.. సమీర్ను స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా రియాద్లోని భారత దౌత్యకార్యాలయ ప్రతినిధిని కోరుతూ ట్వీట్ చేశారు. -
ఓ తండ్రిగా వారి బాధను అర్థం చేసుకోగలను!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల వ్యవహారంలో జరిగిన పరిణామాలు దురదృష్టకరమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రుల బాధను ఒక తండ్రిగా అర్థం చేసుకోగలనని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా బాధ్యులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆదివారం ‘ఆస్క్ కేటీఆర్’పేరిట నెటిజన్లతో ట్విట్టర్లో సంభాషించారు. రాజకీయాలు, వ్యక్తిగత జీవితం గురించి పలు అంశాలపై కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. ఇంటర్మీడియట్ వివాదంపై.. రాష్ట్రంలో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా ఉన్న ఇంటర్మీడియట్ ఫలితాలపై పలువురు నెటిజన్లు కేటీఆర్ను ప్రశ్నించారు. ‘ఇంటర్ వివాదంలో నాకేదో మోసం ఉందనిపిస్తోంది సర్. కావాలని చేసినట్లున్నారు కదా?’అని ఓ నెటిజన్ అభిప్రాయపడగా... ‘ఈ సమస్యను మరింత వివాదాస్పదం చేయొద్దు’అని కేటీఆర్ కోరారు. ‘అన్నింటికీ సమాధానాలు ఇస్తున్నారు. పిల్లల విషయంలో మాత్రం మాట దాటేస్తున్నారు. ఇంటర్ బోర్డు విషయంలో కొంచెం క్లారిటీ ఇవ్వండి. మీపై మాకున్న నమ్మకాన్ని పోగొట్టుకోకండి’అని మరో నెటిజన్ కోరారు. దీనికి కేటీఆర్ స్పందిస్తూ.. ‘ఏం క్లారిటీ ఇవ్వాలో మీరే చెప్పండి సర్. జరిగిన ఘటనల పట్ల నేనూ బాధపడుతున్నాను. ఇందుకు కారకులైనవారిని కఠినంగా శిక్షించాలి. నేనూ ఓ తండ్రినే. పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రుల బాధను నేనూ అర్థంచేసుకోగలను’అన్నారు. ఎన్డీయే ప్రభుత్వం అన్యాయం చేసింది నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పలు అంశాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందని అన్నారు. కేంద్రంలో కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వంలో తెలంగాణ డిమాండ్లను సాధించుకుంటామని చెప్పారు. ‘ఎన్డీయే ప్రభుత్వం హైస్పీడ్ రైల్ కనెక్టివిటీ నెట్వర్క్ విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసింది. కనీసం రాబోయే కేంద్ర ప్రభుత్వమైనా అన్యాయాన్ని సరిదిద్దుతుందని ఆశిస్తున్నాం. కేంద్రంలో రానున్నది ఖచ్చితంగా హంగ్ పార్లమెంటే. ఏ పార్టీకీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సరిపోయే మెజార్టీ రాదు. టీఆర్ఎస్కు కచ్చితంగా 16 లోక్సభ స్థానాలు వస్తాయి. కేంద్ర పన్నుల్లో వాటా, అధికార వికేంద్రీకరణ ఫెడరల్ ఫ్రంట్ ప్రధాన అంశాలుగా ఉంటాయి’అని కేటీఆర్ తెలిపారు. దీంతో రాష్ట్రాలు బలోపేతమవుతాయని.. తద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. అత్యుత్తమ ఆర్థిక విధానాలతోనే దేశంలో ఉద్యోగిత, సంపద సష్టి జరుగుతుందని చెప్పారు. ఉత్తమ ఆర్థిక విధానాలే రాజకీయ పార్టీల మేనిఫెస్టోల్లో ఉండాలని అన్నారు. ‘కేంద్రంలో కొత్తగా ఏర్పడనున్న ప్రభుత్వం అయినా నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తుందని ఆశిస్తున్నాం. దీని కోసం మా ప్రభుత్వం తరఫున ప్రయత్నాలు కొనసాగిస్తాం’అని ఆయన అన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు కాళేశ్వరం ప్రాజెక్టు పంపుల ప్రారంభంపై హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్.. పాలమూరు ఎత్తిపోతల పథకంతో మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలతోపాటుగా.. నల్లగొండలోని కొన్ని ప్రాంతాల్లో సాగునీరు అందుతుందన్నారు. రెండోసారి కొలువుదీరిన తమ ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం.. వైద్య, ఆరోగ్య సేవలను మెరుగుపరచడం, విద్యాప్రమాణాలను పెంచడం, మౌలిక సదుపాయాల కల్పనతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల అభివృద్ధి తమ ప్రభుత్వ ప్రాధాన్యతలను తెలిపారు. ‘సర్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలపై దృష్టి సారించవచ్చు కదా? ఎందుకు ఓ సాధారణ వ్యక్తి ఏదన్నా సాయం కావాలంటే ట్విట్టర్లో మిమ్మల్ని సంప్రదించాల్సి వస్తోంది?’అని ఓ నెటిజన్ ప్రశ్నించారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ... ట్విటర్ మరో సదుపాయం మాత్రమేనని మౌలిక సదుపాయాల మెరుగుపై నిరంతరం పనులు జరుగుతూనే ఉన్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్పై ఆసక్తి లేదు 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయాలన్న నెటిజన్ల ప్రశ్నకు.. 2024 చాలా దూరంలో ఉందని కేటీఆర్ చమత్కరించారు. ఏపీ సీఎంగా వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి సరిపోతాడా అన్న ప్రశ్నకు.. ఈ విషయం లో తన అభిప్రాయం ఏ మాత్రం అవసరంలేదని, దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ణయిస్తారని తెలిపారు. ఏపీ రాజకీయాలపై తనకు పెద్దగా ఆస క్తి లేదన్నారు. తమిళనాడులో టీఆర్ఎస్ పార్టీని విస్తరించాలని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇప్పటికే అక్కడ చాలామంది నాయకులు ఉన్నారన్నారని కేటీఆర్ అన్నారు. మాటలతో ఇమేజ్ చెరిగిపోదు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో బ్రాండ్ హైదరాబాద్కు సంబంధించిన ప్రచారం జరిగిందన్న విషయానికి స్పందిస్తూ.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కేవలం మాటలతో చెరిగిపోదని తెలిపారు. హైదరాబాద్ స్టార్టప్ ఎకో సిస్టమ్ కోసం ప్రభుత్వంవైపు నుంచి అవసరమైన సహాయ సహకారాలు కొనసాగిస్తామన్నారు. ఇమేజ్ టవర్స్, యానిమేషన్ ఇండస్ట్రీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని కేటీఆర్ వెల్లడించారు. ఎంఎంటీఎస్ రెండో దశ కోసం రూ.400 కోట్ల రూపాయలు విడుదల చేశామన్నారు. ఎంఎంటీఎస్ రెండో దశ కోసం నిధులు విడుదల కావడంలేదని బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని అన్నారు. రవాణా అనుసంధానతకు సంబంధించిన సమస్య అన్ని నగరాలకు ఎదురయ్యేదేనని.. హైదరాబాద్లో దీన్ని అధిగమించేందుకు ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ఎల్బీనగర్–నాగోలు మధ్య మెట్రో రైలు అనుసంధానం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. హైదరాబాద్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కార్యాచరణ ప్రణాళిక దశలో ఉందని అన్నారు. జవహర్నగర్ డంపింగ్కు సంబంధించి ట్యాపింగ్ పనులు జరుగుతున్నాయని.. మరికొంత పని పూర్తి చేయాల్సి ఉందని తెలిపారు. కంటోన్మెంట్ భూమిపై కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే స్కైవే పనులు జరుగుతాయని చెప్పారు. - కఠిన పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్ చేసుకుంటారని ఓ నెటిజన్ కేటీఆర్ను అడగ్గా.. ‘ప్రశాంతంగా ఉండటం. బుద్ధిబలంతో వ్యవహరించడంతో’అని సమాధానమిచ్చారు. - మున్సిపల్ కార్యాలయాల్లో లంచగొండితనాన్ని అరికట్టడానికి ఏమన్నా ప్లాన్ చేస్తున్నారని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. ‘నూతన మున్సిపల్ చట్టాన్ని తెచ్చి ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు యత్నిస్తున్నాం’అని అన్నారు. - ‘అవెంజర్స్: ఎండ్గేమ్’సినిమా చూశారా? మరో నెటిజన్ కేటీఆర్ను అడిగారు. దీనికి కేటీఆర్ స్పందిస్తూ.. ‘లేదు సర్. నాకు అవెంజర్స్ గురించి ఏమీ తెలీదు’అన్నారు. - ఇప్పటివరకు 100 ట్వీట్లు చేసినా, కేటీఆర్ ఒక్కసారీ స్పందించలేదని, ఇప్పడైనా స్పందించకపోతే నారా లోకేశ్ మీద ఒట్టు అని ఒక నెటిజన్ పోస్టు చేయగా.. మధ్యలో ఆయన (నారా లోకేశ్) ఏం చేశాడు బ్రదర్ అని కేటీఆర్ అన్నారు. - ‘మతాలపై ప్రసంగాలు చేసేవారిని అరికట్టండి. దీని వల్ల మతఘర్షణలు, బాంబు పేలుళ్లు తగ్గుతాయని అనిపిస్తోంది’అని ఒక నెటిజన్ కోరగా.. దాని వల్ల ఉపయోగం ఉంటుందని నేననుకోను అని సమాధానమిచ్చారు. - టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులందరూ సోషల్ మీడియాలో పాల్గొనేందుకు ప్రయత్నం చేస్తానని కేటీఆర్ అన్నారు. పలువురు మంత్రులు ట్విట్టర్లో అందుబాటులో ఉన్నారని చెప్పారు. - ప్రధాని మోదీ, నటుడు అక్షయ్కుమార్ ముఖాముఖి కార్యక్రమంపై అభిప్రాయం చెప్పాలని ఓ నెటిజన్ అడిగారు. ‘ఈ కార్యక్రమాన్ని నేను చూడలేదు. కానీ.. అక్షయ్ వేసుకున్న గులాబీ రంగు ప్యాంట్ నచ్చింది’అని కేటీఆర్ అన్నారు. ‘కేఏ పాల్ గురించి ఒక్క మాట చెప్పండి’అని మరో నెటిజన్ కోరగా.. ‘ఆయన ప్రచార కార్యక్రమం చాలా వినోదాత్మకంగా ఉంద’ని కేటీఆర్ చెప్పారు. గ్లోబరీనా అంటే తెలియదు? ‘మీరిప్పుడు ఏ శాఖకూ మంత్రి కాదు. అలాంటప్పుడు ఎందుకు ప్రభుత్వానికి సంబంధించిన కార్యకలాపాల్లో తలదూరుస్తున్నారు. కొందరు కలెక్టర్లు ఏ మంచి పని చేసినా మిమ్మల్ని ఎందుకు ట్యాగ్ చేస్తున్నారు? గ్లోబరీనా వివాదంలోనూ మీపేరు వినిపిస్తుంది? దీనిపై మీరేం చెప్పదలచుకున్నారు’అని ఓ నెటిజన్ కేటీఆర్ను ప్రశ్నించారు. దీనికి కేటీఆర్ స్పందిస్తూ.. ‘నన్ను ప్రజలు ఎంచుకున్నారు. ప్రజలకు ఏదన్నా సమస్య వస్తే అధికారులకు సూచించే హక్కు నాకుంటుంది. దీని వల్ల ఇప్పుడు మీకొచ్చిన సమస్యేంటి? ఇక గ్లోబరీనా విషయమంటారా.. ఇంటర్ ఫలితాలు వెల్లడిలో అవకతవకలు జరిగాయని తెలిసే వరకూ నాకు అసలు గ్లోబరీనా అంటే ఏంటో కూడా తెలియదు’అని కేటీఆర్ స్పష్టం చేశారు. -
ఢిల్లీ జుట్టు మనచేతిలోనే..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘కేంద్రంలో అధికారంలోకి వచ్చేది ఫెడరల్ ఫ్రంటే.. 16 మంది ఎంపీలు గెలిస్తే ఢిల్లీ జుట్టు మన చేతిలోనే ఉంటుంది..’అని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజైన మంగళవారం నల్లగొండలో ఆయన రోడ్ షోలో పాల్గొన్నారు. అనంతరం క్లాక్టవర్ సెంటర్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘బీజేపీలో ప్రస్తుత పరిస్థితి మనం చూస్తున్నాం. తెలంగాణ సాధించిన మొదట్లో ఏడు మండలాలను అన్యాయంగా ఆంధ్రాలో కలిపారు. అప్పుడు చంద్రబాబు చేతిలో ఎంపీల సంఖ్య ఎక్కుగా ఉండటం.. బాబు అవసరం మోదీకి ఎక్కువగా ఉండటంతో రాత్రికి రాత్రే బలవంతంగా ఆ ఏడు మండలాలను ఆం«ధ్రాలో కలిపేసుకోగలిగారు. అదే 16 మంది ఎంపీలను టీఆర్ఎస్ గెలిపించుకుంటే.. కేంద్ర ప్రభుత్వం మనం చెప్పినట్టు వింటుంది..’అని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం బలం ఎవరికి ఉందో.. వారిదే రాజ్యం అన్న విధంగా పరిస్థితి తయారైందని చెప్పారు. మంద బలం ఉన్నవారి మాట నెగ్గుతుందనడానికి .. కేంద్రంలో ఎవరు రైల్వే మంత్రిగా ఉంటే వారి రాష్ట్రాలకే రైళ్లు పరుగులు పెట్టాయి తప్ప నల్లగొండకు రాలేదన్నారు. మమత బెనర్జీ ఉంటే పశ్చిమ బెంగాల్కు, లాలు ప్రసాద్ యాదవ్ ఉంటే బిహార్కు, ఆయన అత్తగారింటికి కూడా వెళ్లాయన్నారు. మోదీ ప్రధానిగా బుల్లెట్ రైలు గుజరాత్కే పరుగులు పెడుతుంది తప్ప, నల్లగొండకు కాదన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికలు దేశం దశను మార్చేవని, కాబట్టి ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే రాహుల్కు లాభం, బీజేపీ ఎంపీలు గెలిస్తే మోదీకి లాభం.. టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రానికి లాభం అవుతుందని కేటీఆర్ వివరించారు. ఇన్నేళ్లు ఎందుకు అభివృద్ధి చేయలేదు? నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిస్సిగ్గుగా జాతీయ పార్టీలతోనే అభివృద్ధి అంటున్నాడని, 71 ఏళ్ల స్వతంత్ర భారతంలో 55 ఏళ్లు కాంగ్రెస్, 14 ఏళ్లు బీజేపీ పాలించిందని, ఇన్నాళ్లు అభివృద్ధి ఎందుకు చేయలేక పోయారని కేటీఆర్ ప్రశ్నించారు. ఈసారి సంకీర్ణ ప్రభుత్వమేనని, ఢిల్లీలో ప్రతి ఎంపీ కీలకం కాబోతున్నాడని చెప్పారు. తాను హైదరాబాద్ నుంచి వస్తూ ఫ్లెక్సీలు చూశానని.. కాంగ్రెస్ పెద్దపెద్ద యాడ్స్ ఇచ్చింది.. ఇకపై న్యాయం జరుగుతుందని ఆ యాడ్స్లో ఉంది. అంటే.. ఇప్పటి వరకు అన్యాయం జరిగిందని వాళ్లే ఒప్పుకుంటున్నట్టేగా అని వ్యాఖ్యానించారు. ఈసారి మోదీ పీఎం పదవి ఊడటం ఖాయమని, కేసీఆర్ నాయకత్వంలోనే చక్రం తిప్పబోతున్నామని జోస్యం చెప్పారు. కేసీఆర్ రైతుబంధు పథకాన్ని మోదీ కాపీ కొట్టారని అన్నారు. టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే నిధులు రాబట్టడంతో పాటు ప్రాజెక్టులకు జాతీయ హోదాను సాధిస్తామని, ప్రజలు ఎలాంటి గాబరాకు గురికాకుండా ఆలోచించి వేమిరెడ్డి నర్సింహారెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు. ఈ బహిరంగ సభలో అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, భాస్కర్రావు, నల్లగొండ లోక్సభ ఎన్నికల పార్టీ ఇన్చార్జి రవీందర్రావు, సీనియర్ నేత బండా నరేందర్ రెడ్డి, చాడ కిషన్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. హామీలు విస్మరించిన మోదీ నరేంద్ర మోదీ గత ఎన్నికల్లో చాయ్ వాలా అని, పేదల కష్టాలు తెలుసని చెప్పి ప్రస్తుతం వాటిని అన్నింటినీ విస్మరించాడని కేటీఆర్ పేర్కొన్నారు. అధిక మెజార్టీతో గెలిపిస్తే శూన్య హస్తాలు, శుష్క వాగ్దానాలు తప్ప మరొకటి చేయలేక పోయారని విమర్శించారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అంటూ యువతను మభ్య పెట్టారని విమర్శించారు. ‘మోదీ గ్రాఫ్ తగ్గింది. ఈసారి 150 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్కు 80 సీట్లు దాటవు. జిల్లా ప్రజలు ఆలోచించి దెబ్బ కొట్టాలి. 16 ఎంపీలు గెలిస్తే మనమే చక్రం తిప్పుతాం. సారు.. కారు.. పదహారు... ఢిల్లీలో మనవారు అనేదే మన నినాదంగా ముందుకు పోవాలి..’అని కేటీఆర్ పేర్కొన్నారు. -
గత ఐదేళ్లలో ‘ఐటీ’ రెట్టింపు..
హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో గత ఐదేళ్ల కాలంలో అనూహ్య ప్రగతి సాధించామని, 2014 నాటికి రూ. 50 వేల కోట్ల ఐటీ ఉత్పత్తులు ఎగుమతి కాగా, ఇప్పుడు రూ.1.10 లక్షల కోట్లకు పెంచగలిగామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పేర్కొన్నారు. ఆదివారం రాయదుర్గంలోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాజశేఖర్రెడ్డిని ఐటీ ఉద్యోగులకు పరిచయ కార్యక్రమం కేటీఆర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బెంగళూర్కు దీటుగా ఐటీ రంగాన్ని విస్తరిస్తున్నామని, నగరంలో 200 స్టార్టప్లు పనిచేస్తున్నాయన్నారు. టీహబ్ ప్రారంభించామని, టీహబ్ ఫేస్–2ను త్వరలో అందుబాటులోకి తెస్తామన్నారు. 2014కు ముందు మైక్రోసాఫ్ట్ మాత్రమే ఉండేదని, ప్రస్తుతం గూగుల్, యాపిల్, ఫేస్బుక్, అమెజాన్ వంటి కంపెనీలు తమ ప్రధాన కార్యాలయాలను హైదరాబాద్లోనే ప్రారంభించాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇండస్ట్రియల్, ఐటీ పాలసీలతో ఇక్కడ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు కంపెనీలు ముందుకొస్తున్నాయన్నారు. 24 గంటలు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ను అందించడంలో సక్సెస్ అయ్యామని చెప్పారు. అభివృద్ధి అన్ని వైపులా... ఐటీ కారిడార్.. గచ్చిబౌలి, మాదాపూర్కే పరిమితం కాకుండా అన్ని వైపులా విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేటీఆర్ అన్నారు. కొంపల్లి, మల్కాజిగిరి, ఎల్బీనగర్, ఉప్పల్, షామీర్పేట్ వైపు ఐటీ కంపెనీలను విస్తరిస్తామని చెప్పారు. సనత్నగర్, కాటేదాన్, జీడిమెట్లలోని పరిశ్రమలతో కాలుష్యం పెరిగిందన్నారు. నగరానికి ఉత్తర, దక్షిణ, తూర్పు వైపులా అన్ని రకాల పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందిం చామని తెలిపారు. మెట్రో రైలు సౌకర్యాన్ని నగర శివార్లకు విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎయిర్పోర్టుకు కనెక్టివిటీ కల్పించడంపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. మైండ్స్పేస్ నుంచి ఎయిర్ పోర్ట్.. నాగోల్æ, ఫలక్నుమా నుంచి ఎయిర్పోర్టుకు పొడిగిస్తామన్నారు. రెండవ దశ మెట్రోకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చిందని, అందులో భాగంగా చందానగర్, లక్డీకాపూల్, నాగోల్, ఎల్బీనగర్, ఈసీఐఎల్ వంటి ప్రాంతాలకు కూడా కలుపుతామన్నారు. స్మార్ట్, సేఫ్ సిటీగా హైదరాబాద్.. ఐదేళ్లుగా దేశంలోనే అత్యంత నివాసయోగ్య నగరంగా హైదరాబాద్ గుర్తింపు పొందిందని, దీన్ని స్మార్టర్, సేఫర్ సిటీగా మారుస్తున్నామన్నారు. ప్రధానంగా మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. మహిళలు, వృద్ధులు, పిల్లలు ఇతరులకు పూర్తి భద్రత కల్పించడంపై దృష్టి పెట్టామన్నారు. నగరంలో 6 లక్షలకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, వీటిని మరింతగా పెంచుతామన్నారు. న్యూయార్క్, లండన్ తర్వాత కమాండ్ కంట్రోల్ ఉన్న నగరంగా హైదరాబాద్కు గుర్తింపు రానుందని తెలిపారు. నీటి సరఫరా మెరుగు.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు దూరదృష్టితోనే నగరంలో నీటి సరఫరాకు సమగ్ర విధానం రూపొందించారని కేటీఆర్ తెలిపారు. 10 టీఎంసీల కెపాసిటీ ఉన్న రిజర్వాయర్ను కేశవాపూర్, మరో 10 టీఎంసీలతో చౌటుప్పల్ సమీపంలో దేవలమ్మ నాగారంలో నిర్మాణం చేస్తామని తెలిపారు. ఓఆర్ఆర్, రీజనల్ రింగ్ రోడ్డు లోపల నీటి సమస్య లేకుండా చేయడానికి రిజర్వాయర్లు నిర్మాణం చేస్తున్నామని, అలాగే ఇప్పటికే సాగుతున్న హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ను కూడా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, కాప్రా వంటి ప్రాంతాల్లో రూ.2,100 కోట్లతో మంచినీటి సమస్య తీరుస్తున్నామని, రూ.3,100 కోట్లతో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తున్నామని పేర్కొన్నారు. నగరంలో వాహన, పారిశ్రామిక కాలుష్య నివారణకు చర్యలు ప్రారంభించామన్నారు. పరిశ్రమలన్నింటినీ ఓఆర్ఆర్ బయటకు మారుస్తున్నామని చెప్పారు. దశలవారీగా ఆర్టీసీ బస్సులన్నింటినీ ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చాలని నిర్ణయించామని తెలిపారు. సంకీర్ణంలో టీఆర్ఎస్ పార్టీది కీలక పాత్ర.. కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కీలకపాత్ర పోషించాలంటే రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లు గెలవాల్సిన అవసరం ఉందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు పేర్కొన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ‘జిస్కా లాఠీ ఉస్కా భైన్స్’ అన్నట్లుగా నడుస్తోందని ఆయన గుర్తు చేశారు. బీజేపీ 150–160 సీట్లు, కాంగ్రెస్ పార్టీ 100 సీట్ల లోపే గెలుస్తాయని సర్వేలు చెబుతున్నాయని వెల్లడించారు. ఇక కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే నేపథ్యంలో 16 సీట్లు గెలిస్తే ప్రధాని నియామకంలో టీఆర్ఎస్ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ఈ సందర్భంగా చేవెళ్ల నుంచి పోటీ చేస్తున్న రంజిత్రెడ్డిని, మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తున్న రాజశేఖర్రెడ్డిని ఆయన ఐటీ ఉద్యోగులకు పరిచయం చేశారు. వీరిని గెలిపించాలని ఆయన కోరారు. అనంతరం ఉద్యోగులు అడిగిన పలు ప్రశ్నలకు కేటీఆర్, రంజిత్రెడ్డి, రాజశేఖర్ రెడ్డి సమాధానమిచ్చారు. -
నిధులు రావాలంటే.. టీఆర్ఎస్ గెలవాలి
హైదరాబాద్: తెలంగాణకు కేంద్రం నుంచి నిధులు, పథకాలు, ప్రాజెక్టులు, హక్కులు పక్కాగా రావాలంటే కేంద్రంలో మన ఎంపీలు ఉండాలని, అందుకు టీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు అన్నారు. సోమవారంరాత్రి ఇక్కడ బాలాపూర్ చౌరస్తాలో చేవెళ్ల టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రంజిత్రెడ్డితో కలసి రోడ్షో నిర్వహించారు. కేటీఆర్ మాట్లాడుతూ లోక్సభ ఎన్నికలతో సీఎం కేసీఆర్కు సంబంధం లేదని కాంగ్రెస్, బీజేపీలు ప్రచారం చేస్తున్నాయని, తెలంగాణ నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే రాహుల్గాంధీకి, బీజేపీ అభ్యర్థులు గెలిస్తే మోదీకి లాభమని, టీఆర్ఎస్ గెలిస్తే తెలంగాణకు లాభం ఉంటుందన్నారు. మోదీ ఏదో చేస్తారని 2014 ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే ఐదేళ్లలో ఆయన చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు. 16 మంది టీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో ఉంటే కేంద్రం మెడలు వంచి మనకు రావాల్సిన ని«ధులను రప్పించే శక్తి సీఎం కేసీఆర్కు ఉంటుందని స్పష్టం చేశారు. ఆదాయం పెరగాలి.. అభాగ్యులకు పంచాలి.. రాష్ట్ర ఆదాయం పెంచాలి... నిరుపేదలకు, అభాగ్యులకు పంచాలన్న సూత్రంతో కేసీఆర్ ప్రభుత్వం ముందుకెళుతోందని, నిరంతర విద్యుత్, పెన్షన్లు, కల్యాణలక్ష్మితోపాటు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. ఇల్లులేని ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్రూం ఇల్లు అందజేసి సొంతింటి కలను నిజం చేస్తామని హామీ ఇచ్చారు. మహేశ్వరం నియోజకవర్గంలో 17 వేల డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మిస్తున్నామని, అర్హులందరికీ ఇళ్లను కేటాయిస్తామన్నారు. వచ్చేనెల నుంచి 2 వేల పెన్షన్ను అందజేయనున్నట్లు తెలిపారు. కందుకూరు, మహేశ్వరం ప్రాంతాల్లో ఫార్మాసిటీతోపాటు పెద్ద ఎత్తున కంపెనీలు ఏర్పాటు కానున్నాయని, నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని త్వరలో ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. మహేశ్వరం, కందుకూరు మండలాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సమస్యను పరిష్కరించామన్నారు. ఈ ప్రాంతానికి సాగునీరు రావాలంటే పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారానే సాధ్యమని, ఈ పథకం పూర్తి కావాలంటే కేంద్రంలో మన ఎంపీలు ఉండాలని, అప్పుడే ప్రాజెక్టుకు జాతీయ హోదా వస్తుందన్నారు. మీర్పేట మున్సిపాలిటీ పరిధిలోని చెరువుల ప్రక్షాళనకు రూ.23 కోట్లతో ట్రంకులైన్ ఏర్పాటు చేస్తున్నామని, త్వరలోనే చెరువుల సుందరీకరణ జరుగుతుందన్నారు. ప్రజల దీవెన ఉంటే కేసీఆర్ మరో పదేళ్లు సీఎంగా ఉంటారని, నిరంతరం పేదల సంక్షేమాన్ని ఆకాంక్షించే నాయకుడు మన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అని కేటీఆర్ తెలిపారు. రోడ్షోలో చేవెళ్ల టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రంజిత్రెడ్డి, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, నాయకులు పట్లోళ్ల కార్తిక్రెడ్డి, కొత్త మనోహర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దేశానికి కేసీఆర్ కావాలి
సాక్షి, భూపాలపల్లి: జోర్దార్, ఇమాన్దార్, జిమ్మేదార్ అయిన కేసీఆర్ నాయకత్వం ఈ దేశానికి అవసరమని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారకరామారావు అన్నారు. ములుగులో శనివారం పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ ఐదేళ్ల క్రితం బీజేపీకి 280 స్థానాలు కట్టబెడితే తెలంగాణకు ఏం ఒరిగిందని ప్రశ్నించారు. ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వలేదని మండిపడ్డారు. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీకి 150 సీట్లు, కాంగ్రెస్కు 100 సీట్లు కూడా దాటవని జోస్యం చెప్పారు. కేంద్రంలో చక్రం తిప్పేది ప్రాంతీయ పార్టీలేనని, ఏర్పడేది నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ కూటములేనన్నారు. జాతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్యమనుకుంటే 55 ఏళ్ల కాంగ్రెస్, 13 ఏళ్ల బీజేపీ పాలనలో దేశం ఎందుకు అభివృద్ధి చెందలేదని నిలదీశారు. దక్షిణాదిలో 130 సీట్లకు గాను 10 కూడా గెల వని కాంగ్రెస్, బీజేపీలు ప్రాంతీ య పార్టీలే తప్పితే జాతీయ పార్టీలు కావన్నారు. కేసీఆర్ వైపు దేశం చూపు దేశం మొత్తం కేసీఆర్ వైపే చూస్తోందని, రాజకీయాలను మలుపు తిప్పే ఎన్నికలు ఇవే అని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. 71 ఏళ్ల స్వాతం త్య్ర చరిత్రలో ఎవరూ అమలు చేయలేని రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను ఒక్క కేసీఆర్ మాత్రమే తెలంగాణలో తీసుకువచ్చారని పేర్కొన్నారు. ప్రధాని మోదీ రైతుబంధు పేరు మార్చి పీఎం కిసాన్ పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఇవ్వాళ కేసీఆర్ ఆలోచన దేశానికి ఆచరణ అయిందని, చివరకు ఆంధ్రా సీఎం సైతం రైతుబంధు స్ఫూర్తితో అన్నదాత సుఖీభవ ప్రవేశపెట్టారన్నారు. రాష్ట్రంలో 3,400 గిరిజన సర్పంచ్లుగా ఉన్నారంటే దానికి కేసీఆరే కారణమన్నారు. ఎన్నికల తర్వా త పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామ న్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్, ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, మాజీ మంత్రి చందూలాల్ పాల్గొన్నారు. -
కారెక్కిన మరో ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతూనే ఉంది. లోక్సభ ఎన్నికలకు ముందు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే 9 మంది టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించగా.. తాజాగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఈ జాబితాలో చేరారు. బుధవారం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావును కలిసిన సురేందర్.. కాంగ్రెస్కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. త్వరలోనే టీఆర్ఎస్లో చేరనున్నారు. సురేందర్ ప్రకటనతో టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 10కి చేరింది. అసెంబ్లీ ఎన్నికల్లో 19 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించగా.. ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే ఆత్రం సక్కు, రేగ కాంతారావు, చిరుమర్తి లింగయ్య, పట్లోళ్ల సబితారెడ్డి, బానోతు హరిప్రియా నాయక్, కందాల ఉపేందర్రెడ్డి, బీరం హర్షవర్ధన్రెడ్డి, డి.సుధీర్రెడ్డి, వనమా వెంకటేశ్వర్రావు టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. తాజాగా సురేందర్ కూడా కాంగ్రెస్కు గుడ్బై చెప్పారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య తొమ్మిదికి తగ్గింది. మరో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని అధికార పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదే జరిగితే కాంగ్రెస్ శాసనసభపక్షాన్ని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసే ప్రక్రియ అధికారికంగా పూర్తి కానుంది. కాంగ్రెస్ శాససన సభాపక్షం విలీనమైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసే అవసరం ఉండదు. లోక్సభ ఎన్నికల పోలింగ్ లోపే కాంగ్రెస్ శాసనసభ పక్షం విలీన ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్లో ఒంటెత్తు పోకడలు: జాజాల కాంగ్రెస్ నాయకత్వం ప్రజలకు దూరమైందని... అంతా ఒంటెత్తు పోకడలతో ఉన్నారని జాజాల సురేందర్ విమర్శించారు. కాంగ్రెస్కు రాజీనామా చేస్తున్నానని, అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. ఈ మేరకు ఓ లేఖ విడుదల చేశారు. ‘2001 లో కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమంలోకి వచ్చాను. ఆయనతో కలిసి అనేక పోరాటాల్లో పాల్గొన్న. ఇప్పుడు కూడా ఆయనతోనే కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్న. ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం మళ్లీ ఇప్పుడు కేసీఆర్తో కలిసి నడుస్తా. నా నియోజకవర్గ అభివృద్ధికి, ముఖ్యంగా కొత్తగా ఏర్పడ్డ కామా రెడ్డి జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు సీఎం అనేక పథకాలను రూపొందించి అమలు చేస్తున్నారు. వీటిని కొనసాగేలా చూడడంలో నా పాత్ర ఉండాలని కోరుకుంటున్న. రాష్ట్ర ప్రజలు కేసీఆర్ నాయకత్వా న్ని కోరుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే దీనికి నిదర్శనం. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడుచుకోవడం నా బాధ్య త. టీఆర్ఎస్తో గతం నుంచి నాకు అనుబంధం ఉంది. నా నియోజకవర్గ ప్రజలు, నా అభిమానులు, కార్యకర్తలు అంతా టీఆర్ఎస్తో కలిసి నడవాలని.. కేసీఆర్తో కలిసి రాష్ట్ర అభివృద్ధిలో భాగం పంచుకోవాలని కోరారు. అందరినీ సంప్రదించిన తర్వాత టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్న. కాంగ్రెస్ నాయక త్వం ప్రజలకు దూరమైంది. అంతా ఒంటెద్దు పోకడలతో ఉన్నారు. కాంగ్రెస్కి రాజీనామా చేస్తున్న. అవసరమైతే ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేస్తా’ అని లేఖలో పేర్కొన్నారు. -
16 ఇస్తే ఢిల్లీని శాసించలేమా?
సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఇద్దరు ఎంపీలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ చేతికి 16 మంది ఎంపీలను ఇస్తే ఏం చేస్తారో దేశ ప్రజలు చూస్తారని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు అన్నారు. కేవలం టీఆర్ఎస్లో మాత్రమే సత్తా ఉన్న నాయకులు ఉన్నారని, అందుకే ప్రజలు రెండోసారి కూడా టీఆర్ఎస్కే పట్టం కట్టారని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పేగులు తెగేదాకా పోరాడే సత్తా టీఆర్ఎస్ నాయకుల్లో మాత్రమే ఉందన్నారు. శనివారం నల్లగొండ జిల్లాకేంద్రంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జి.జగదీశ్రెడ్డి అధ్యక్షతన టీఆర్ఎస్ నల్లగొండ పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేటీఆర్ పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో దేశం మొత్తం నరేంద్ర మోదీ హవా ఉందని, మూడు సార్లు గుజరాత్కు సీఎంగా పనిచేసిన మోదీ మీద నమ్మకంతో దేశ ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇచ్చారని ఆయన అన్నారు. అయితే ఏదో జరుగుతుందని ప్రజలంతా ఆశించారని, కానీ ఐదేళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఏమీ చేయలేదని, మాటలకు, నినాదాలకే పరిమితమైందని దుయ్యబట్టారు. మీడియా సంస్థలు చేస్తున్న సర్వేలు, అన్ని అధ్యయనాల్లో ఎన్డీయే కూటమికి ఈ సారి 150 నుంచి 160 సీట్లు కూడా వచ్చేలా లేవని తెలుస్తోందని, దీన్ని బట్టి ప్రధాని మోదీ మీటర్ తగ్గినట్లు స్పష్టం అవుతోందని అన్నారు. అలా అని కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూడా బలం పుంజుకోలేదని, 2014 ఎన్నికల్లో కేవలం 44 స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్, యూపీఏ కూటమికి ఈ సారి 100 నుంచి 110 సీట్లు దాటే పరిస్థితి కనిపించడం లేదని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో లోక్సభ ఎన్నికలు ఎంతో కీలకమైనవని, ప్రజలంతా ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు. ఎక్కువ సీట్లు గెలిస్తే.. దేశ రాజకీయాల్లో మనమే కీలకం ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎక్కువ పార్లమెంట్ స్థానాలు గెలిస్తే దేశ రాజకీయాల్లో మనమే కీలకమవుతామని, రాష్ట్రానికి అవసరమైన నిధులను రాబట్టుకోవచ్చని కేటీఆర్ అన్నారు. అభివృద్ధి చేస్తారని గత ఎన్నికల్లో మోదీకి అవకాశమిస్తే.. శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు అన్నట్లుగా ఆయన పనితీరు ఉందని ఎద్దేవా చేశారు. బీజేపీ, కాంగ్రెస్ వల్ల దేశానికి ఒరిగిందేమీ లేదన్నారు. ఎన్నికలనగానే, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అని కొందరు అంటున్నారని, మోదీ, రాహుల్ను మాత్రమే ప్రజలు ఎన్నుకోవాలా అని నిలదీశారు. 71 ఏళ్లు కాంగ్రెస్, బీజేపీలు దేశాన్ని పాలించాయని, అయినా దేశంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉందని విమర్శించారు. ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తెచ్చిన మొనగాడు సీఎం కేసీఆర్ అని, అలాంటిది 16 మంది ఎంపీలు మనవాళ్లే ఉంటే కేంద్రాన్ని శాసించలేమా అని అన్నారు. దేశానికి అంత ఖర్మ పట్టలేదు ఈ పార్లమెంటు ఎన్నికలను మోదీ వర్సెస్ రాహుల్ గాంధీగా చిత్రీకరించేందుకు చూస్తున్నారని, ఆ ఇద్దరిని మాత్రమే ఎంచుకోవాల్సిన ఖర్మ దేశ ప్రజలకు పట్టలేదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. పుల్వామా ఉగ్రదాడిలో జవాన్లు చనిపోతే సీఎం కేసీఆర్ స్పందించిన రీతిలో ఎవరూ స్పందించలేదన్నారు. వారం రోజులపాటు రాజకీయ కార్యకలాపాలను రద్దు చేసుకున్నామని, అయితే ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ మాత్రం రాజకీయాలు చేయకుండా ఆగలేక పోయారని దుయ్యబట్టారు. మన పథకాలను కాపీకొట్టారు.. కేసీఆర్ ఆలోచనలు, ఆయన మానస పుత్రికలైన పథకాలను దేశం యావత్తూ అనుసరిస్తోందన్నారు. రైతుబంధు పథకాన్ని ప్రధాని సహా అన్ని రాష్ట్రాల సీఎంలు కాపీ కొట్టారని కేటీఆర్ అన్నారు. రైతుబంధు పేరు మార్చి ప్రధాని కిసాన్ సమ్మాన్ పథకం అమలు చేసు ్తన్నారని, ఆ ఘనత సీఎం కేసీఆర్ది కాదా! అని పేర్కొన్నారు. వ్యవసాయం అంటే దండగన్న ఏపీ సీఎం చంద్రబాబుకు ఆ రాష్ట్ర ప్రజలపై ప్రేమ లేకున్నా అనివార్యంగా మన పథకాన్ని కాపీ కొట్టి అన్నదాత సుఖీభవ పేరుతో ఏపీలో ప్రవేశ పెట్టలేదా? అని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో ఒక్కో ఎంపీ సీటు ఎంతో కీలకమన్నారు. రైల్వే మంత్రి ఎవరైతే వాళ్ల ప్రాంతానికి రైళ్లు పోతున్నాయని, ప్రధాని గుజరాత్కి చెందిన వ్యక్తి కావడం వల్లనే బుల్లెట్ రైలు గుజరాత్ మీదుగా ముంబైకి పోతోందన్నారు. నిరాశలో కాంగ్రెస్.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తే 103 స్థానాల్లో ఆ పార్టీకి డిపాజిట్ రాలేదని కేటీఆర్ అన్నారు. టీడీపీ తట్టాబుట్టా సర్దుకుని అమరావతికి పోయిందన్నారు. కాంగ్రెస్ నైరాశ్యంలో కూరుకుపోయిందని, పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ ఉంటే మళ్లీ చావుదెబ్బ తప్పదని ఆ పార్టీ ఎమ్మెల్యే ఒకరు ఇటీవలే పేర్కొన్నారని అన్నారు. జాతీయ హోదా ఎందుకు ఇవ్వరు? ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి రంగంలో జరిగిన వివక్ష మూలంగానే తెలంగాణ ఉద్యమం పుట్టిందని, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు గానీ, కాళేశ్వరం ప్రాజెక్టుకు గానీ జాతీయ హోదా ఇవ్వాలని సీఎం కేసీఆర్, ప్రధానిని అడిగితే శాలువా కప్పుకుని ముసిముసి నవ్వులు నవ్వారన్నారు. అందుకే 16 మంది ఎంపీలు టీఆర్ఎస్ నుంచి గెలిస్తే మన ప్రాజెక్టులకు జాతీయ హోదా రాదా.. అని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే ఏమీ కాదని, వారిపని రాహుల్ గాంధీ సిట్ అంటే సిట్ .. అని వ్యాఖ్యానించారు. అదే టీఆర్ఎస్ నాయకులు పేగులు తెగేదాకా కొట్లాడతారని పేర్కొన్నారు. నల్ల గొండ పార్లమెంటు స్థానాన్ని 3 లక్షల మెజారిటీతో గెలవాలని టీఆర్ఎస్ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా మంత్రి జి.జగదీశ్రెడ్డి, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, రవీంద్రకుమార్, నోముల నర్సింహయ్య, ఎన్.భాస్కర్ రావు, బొల్లం మల్లయ్య యాదవ్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
కారు ప్లస్ సారు.. కేంద్రంలో సర్కారు!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ కూటములకు మెజారిటీ రాదని.. కేసీఆర్ నేతృత్వంలో ఏర్పాటయ్యే ఫెడరల్ ఫ్రంట్ కీలకం కాబోతుందని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు జోస్యం చెప్పారు. రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లను గెలిపిస్తే ఇతర రాష్ట్రాల్లోని భావసారూప్యత ఉన్న పార్టీలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసే ఫెడరల్ ఫ్రంట్ నిర్ణయాత్మక శక్తిగా మారుతుందని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేసే ప్రక్రియలో భాగంగా బుధవారమిక్కడ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేటీఆర్ ప్రసంగిస్తూ.. బీజేపీ, కాంగ్రెస్లపై విరుచుకుపడ్డారు. 2014 ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీపై ప్రజలకు ఎన్నో భ్రమలు ఉండేవని.. అయితే, మోదీ పాలనలో దేశం బాగుపడదని ఇప్పుడు అర్థమైందని పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమికి వచ్చే ఎన్నికల్లో 150 నుంచి 160 సీట్లు మాత్రమే వస్తాయని జోస్యం చెప్పారు. ఇక కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ పరిస్థితి మరింత దిగజారిందని.. ఆ పార్టీ నేతృత్వంలోని యూపీఏకు 110 సీట్లు రావడమే కష్టమని వ్యాఖ్యానించారు. ఎన్డీఏ, యూపీఏ ఇలా రెండు కూటములు కలిసినా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే పరిస్థితి ఉండదన్నారు. లోక్సభ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ అంటూ కొందరు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని.. కానీ ఆ పార్టీలు దొందూ దొందే అని తేలిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ నుంచి గెలిచే 16 మంది ఎంపీలే ఢిల్లీ గద్దె మీద ఎవరు కూర్చోవాలో నిర్ణయిస్తారన్నారు. ఎన్నికల తర్వాత దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి ఏర్పాటవుతుందని, కేసీఆర్ నేతృత్వంలోని కొత్త కూటమి 100పైగా సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ‘కారు ప్లస్ సారు.. ఢిల్లీలో సర్కారు’అనే నినాదంతో ముందుకు సాగాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అది విడదీయరాని సంబంధం: కేసీఆర్కు కరీంనగర్తో ఉన్న సంబంధం మామూలుది కాదని, ఆయన ఏ పని ప్రారంభించినా కరీంనగర్ నుంచే మొదలుపెట్టి విజయాలు అందుకున్నారని కేటీఆర్ గుర్తు చేశారు. ‘కేసీఆర్ కరీంనగర్ అల్లుడు. ఆయనకు కరీంనగర్తో ఎంతో అనుబంధం ఉంది. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో కరీంనగర్కు ప్రత్యేక స్థానం ఉంది. 2001 మే 17న ఇదే ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన సింహగర్జన సమయంలో నేను అమెరికాలో ఉన్నా. 2006లో కరీంనగర్ ఉప ఎన్నిక సందర్భంగా అమెరికాలో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చా. నేను ఇక్కడే మిషన్ హాస్పిటల్లో పుట్టిన. ఇక్కడి స్కూల్లోనే చదివిన. అప్పర్ మానేరులో నాయినమ్మ భూములు పోయినయి. మిడ్ మానేరులో అమ్మమ్మ భూములు కోల్పోయినం. ఇక్కడ బాలకృష్ణ, తీరందాస్, శ్రీనివాస సినిమా థియేటర్లు నాకు తెలుసు. కరీంనగర్ వస్తున్నానని రాత్రి కేసీఆర్ను కలిసిన. చాలా జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. ముస్తాబాద్ మండలం గూడూరు దగ్గరుండే మానేరు కాలువలో చిన్నప్పుడు స్నానాలు చేసిన విషయాలను గుర్తు చేశారు. కేసీఆర్ నా కుమారుడంత వయసులో ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి కరీంనగర్ రైల్వే లైన్ కోసం అక్కడ సర్వే చేసి కొయ్యలు గొట్టిన విషయాలు చెప్పారు. కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే ఆ రైల్వే లైన్ మంజూరైంది’అని వివరించారు. అందరూ మనోళ్లే.. కేసీఆర్ మనుషులే.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైనా, ఇతర పార్టీ కార్యకర్తలైనా అందరూ మనోళ్లే.. అందరూ కేసీఆర్ మనుషులే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కేటీఆర్ సూచించారు. ‘సిరిసిల్లలో నాపై పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి కూడా రైతుబంధు పథకం కింద డబ్బులు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలందరూ ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన తర్వాత వాళ్ల ఓటు అడగడానికి మనకు మొహమాటం అవసరం లేదు. మనోడు కాదనే ముద్ర వేయొద్దు. మనకు వ్యతిరేకంగా ఉన్నవారిని కూడా అనుకూలంగా మలుచుకోవాలి. ఇక ఎంపీ అభ్యర్థి ఎవర న్నది ముఖ్యం కాదు. ఓటేసేది కేసీఆర్కి మాత్రమే అనేది గుర్తు పెట్టుకోవాలి. ఓటు వేసేటప్పుడు ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. తెలంగాణ తీర్పు ఏకపక్షంగా ఉంటేనే మన హక్కులు సాధించుకోగలం’అని కేటీఆర్ స్పష్టం చేశారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థికి 5 లక్షల మెజారిటీ ఇవ్వాలని కోరారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్, హోంమంత్రి మహమూద్ అలీ, జిల్లాకు చెందిన మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు వొడితెల సతీష్, సీహెచ్ రమేష్బాబు, సుంకు రవిశంకర్, రసమయి బాలకిషన్, బాల్క సుమన్, చందర్, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, కర్నె ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. గులాబీలా.. గులాములా.. నిర్ణయించుకోవాలి ‘పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎంపీలను గెలిపించుకోవాలి. తప్పిపోయి ఒకటో రెండో సీట్లు కాంగ్రెస్ గెలుస్తే ఏమవుద్ది? ఢిల్లీకి గులాములుగా మారిపోతారు. ఏ పనికైనా ఢిల్లీలో రాహుల్ అనుమతి తప్పనిసరి. టికెట్లు, బీ ఫారం సహా ఏది కావాలన్నా ఢిల్లీకి వెళ్లాల్సిందే. అలాంటి ఢిల్లీ గులాములు రాష్ట్రానికి న్యాయం చేస్తారా ప్రజలు ఆలోచించాలి. తెలంగాణకు న్యాయం చేసే గులాబీలు కావాలా? ఢిల్లీ గులాములు కావాలో తేల్చుకోవాలి’అని కేటీఆర్ పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కరీంనగర్ ఎంపీగా వ్యవహరించిన పొన్నం ప్రభాకర్ పేరు ప్రస్తావించకుండా ఆయనపై పరోక్ష విమర్శలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఏనాడూ కలిసిరాని ఆయన కేసీఆర్ దీక్ష తర్వాత తానే ఉద్యమకారుడిగా బిల్డప్ ఇచ్చుకున్నారని విమర్శించారు. -
కేంద్రం మెడలు వంచుదాం
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ 16 సీట్లను గెలుచుకుంటుందని, కేంద్రంలో కీలకపాత్ర పోషిస్తుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసినా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి ఉండదన్నారు. ఎన్నికల తర్వాత కేంద్రంలో ప్రాంతీయ పార్టీలదే ముఖ్య పాత్ర అవుతుందని చెప్పారు. దేవరకద్ర నియోజకవర్గానికి చెందిన జడ్పీటీసీ, పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్లు సోమవారం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ‘రాహుల్ పాము, చంద్రబాబు ముంగీస. మొన్న ఎన్నికల్లో వీరిద్దరు ఒక్కటయ్యారు. ప్రజాకూటమి అధికారంలోకి వస్తోందని కలలు కన్నారు. మన రైతు బంధు పథకాన్ని మోదీ కాపీ కొట్టారు. ఏపీ సీఎం చంద్రబాబు మన పథకాలను కాపీ కొడుతున్నారు. ముసుగుకు, కుట్రలు, కుతంత్రాలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు. కేసీఆర్ సొంతంగా పార్టీ పెట్టుకుంటే... చంద్రబాబు మామ పెట్టిన పార్టీని గుంజుకున్నారు. ముసుగులు తీసేసి రండి అని బాబు మాట్లాడారు. కేసీఆర్ను ఓడించి తెలుగు వాళ్ల సత్తా చాటుదాం అని అన్నారు. మొన్న బాబును తెలంగాణలో ఓడించింది తెలుగోళ్లు కాదా? సీఎం కేసీఆర్ చక్రవర్తిలా పాలిస్తున్నాడని ఆయన అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. కేసీఆర్ చెట్లు నాటిన అశోక చక్రవర్తిలా పాలిస్తున్నారు. బాబు పోతేనే జాబు వస్తుందని ఏపీ యువత నమ్ముతోంది’అని కేటీఆర్ అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులొస్తాయి... ‘ఈ దేశం మోదీ, రాహుల్ జాగీర్ కాదు. కాంగ్రెస్కు 100, బీజేపీకి 150 సీట్లు దాటవు. ఆ రెండు పార్టీలు కలిసినా ప్రభుత్వం ఏర్పాటు చేయలేవు. మోదీకి అధికారమిస్తే చీపుర్లు ఇచ్చి ఊడవమనడం తప్ప ఆయన ఏం చేయలేదు. ప్రాంతీయ పార్టీలు దేశాన్ని శాసించబోతున్నాయి. టీఆర్ఎస్ నేతలను గెలిపించి లోక్సభకు పంపితే మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు పట్టుకొస్తారు. ఆంధ్రప్రదేశ్లో పోలవరానికి జాతీయ హోదా ఇచ్చినట్లు మనకు పాలమూరు ప్రాజెక్టుకో, కాళేశ్వరం ప్రాజెక్టుకో జాతీయ హోదా ఇవ్వాలని కేసీఆర్ ప్రధానిని కోరారు. మోదీ మనకు మొండిచేయి చూపారు. మొన్న జరిగిన ఎన్నికల్లో పాలమూరు ప్రజలు టీఆర్ఎస్కు సంపూర్ణ మెజారిటీ ఇచ్చారు. కాంగ్రెస్లోని హేమాహేమీలకు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే రీతిలో తగిన బుద్ధి చెప్పారు. దేవరకద్రలో 130 గ్రామ పంచాయతీల్లో టీఆర్ఎస్ 110 గెలిచింది. కేసీఆర్ ఇద్దరే ఇద్దరు ఎంపీలతో రాష్ట్రాన్ని సాధించారు. రేపు 16 లోక్సభ స్థానాల్లో టీఆర్ఎస్ను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతాం. దేవరకద్ర నియోజక వర్గం కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరుతున్న నాయకులకు స్వాగతం. పార్లమెంటు ఎన్నికల్లో దేవరకద్ర సెగ్మెంట్లో టీఆర్ఎస్ మెజారిటీ 50 వేలు దాటాలి’అని కేటీఆర్ అన్నారు. -
ఏకగ్రీవానికే కాంగ్రెస్ మొగ్గు
సాక్షి, హైదరాబాద్: డిప్యూటీ స్పీకర్ ఎన్నికల్లో పోటీ చేయకూడదని, టీఆర్ఎస్ అభ్యర్థి ఏకగీవ్రంగా ఎన్నికయ్యేందుకు సహకరించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టినా గెలిచే బలం లేకపోవడంతోపాటు తమ అభ్యర్థికి మద్దతివ్వాలని మర్యాదపూర్వకంగా అధికార పార్టీ నుంచి వచ్చిన విజ్ఞప్తిపట్ల సానుకూలంగా స్పందించాలని నేతలు నిర్ణయించారు. తమ అభ్యర్థికి మద్దతివ్వాలని కాంగ్రెస్ ముఖ్యనేతలను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు కోరారు. ఉత్తమ్ కోసం వేచి చూసి..! డిప్యూటీ స్పీకర్గా టీఆర్ఎస్ పక్షాన పద్మారావు బరిలో ఉంటున్నారని, ఆయనకు మద్దతిచ్చి డిప్యూటీ స్పీకర్ ఎన్నికను ఏకగ్రీవం చేయాలని కోరేందుకు కేటీఆర్ శనివారం ఉదయం 9:30 గంటల సమయంలో సీఎల్పీ కార్యాలయానికి వచ్చారు. మంత్రులు తలసాని, ప్రశాంత్రెడ్డిలతోపాటు డిప్యూటీ స్పీకర్ అభ్యర్థి పద్మారావు కూడా కేటీఆర్తో ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత మంత్రులు, పద్మారావు వెళ్లిపోగా కేటీఆర్ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో సమావేశమయ్యారు. అయితే, ఉత్తమ్ రావడం ఆలస్యం కావడంతో అరగంటకుపైగా ఆయన కోసం కేటీఆర్ ఎదురుచూశారు. తర్వాత ఉత్తమ్, భట్టితో చర్చలు జరిపారు. స్పీకర్ ఎన్నిక తరహాలోనే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా ఏకగ్రీవమయ్యేలా సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికపై ముగ్గురు నేతల మధ్య చర్చ వచ్చింది. సంఖ్యాబలం ప్రకారం తమకు ఒక ఎమ్మెల్సీ స్థానం వస్తుందని, టీఆర్ఎస్ నుంచి నలుగురు అభ్యర్థులను ప్రకటించి, మరో స్థానం ఎంఐఎంకు ఎలా ఇస్తారని కేటీఆర్ను ఉత్తమ్, భట్టి ప్రశ్నించారు. అయితే, అది సీఎం కేసీఆర్ నిర్ణయమని కేటీఆర్ దాటవేసినట్టు తెలుస్తోంది. నంబర్ బ్లాక్ చేశావా? ఫోన్ ఎత్తకపోవడంపై ఉత్తమ్, కేటీఆర్ల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. సీఎల్పీ కార్యాలయంలోకి వస్తూనే ఆలస్యమైనందుకు క్షమించాలన్న ఉత్తమ్ ‘నా నంబర్ బ్లాక్ చేశావా’ అని కేటీఆర్నుద్దేశించి వ్యాఖ్యానించారు. అలాంటిదేమీ లేదని కేటీఆర్ సమాధానం ఇవ్వగా, తాను ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయడం లేదని, తానేమో ప్రయత్నిస్తున్నానని అన్నారు. తాను ఫోన్లో మెసేజ్లు మాత్రమే చూస్తానంటూ ‘మీ నంబర్ నేను బ్లాక్ చేయగలనా?’ అని కేటీఆర్ చమత్కరించారు. ఆ తర్వాత ముగ్గురు నేతలు రాజకీయ చర్చల్లోకి వెళ్లారు. -
ప్రతి పేదోడికి ఇల్లు.. అదే సీఎం స్వప్నం
సాక్షి, సిరిసిల్ల: రాష్ట్రంలో ఇళ్లులేని వారు ఉండొద్దన్నదే తమ లక్ష్యమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కె.తారకరామారావు అన్నారు. గూడులేని వారికి ఇళ్లను అందించి పేదరికాన్ని రూపుమాపడం కోసం డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కిందని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలో గతంలో పేదలకు ప్రభుత్వం అందజేసిన ఇళ్ల స్థలాలకు సంబంధించిన పట్టాలను కేటీఆర్ బుధవారం అందజేశారు. ఒకేసారి 3,052 మందికి పట్టాలు పంపిణీ చేసిన కార్యక్రమం రాష్ట్రంలో ఎక్కడా లేదన్నారు. నేతన్నలు, గీతన్నలు, కులవృత్తుల పేదరికాన్ని నిర్మూలించడానికి కేసీఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో నిరుపేదలు ఇళ్లు లేనివారిగా ఉండరాదన్నది సీఎం స్వప్నమని తెలిపారు. ఎవరికీ లంచం ఇవ్వొద్దు పేదలకు నిర్మించి ఇచ్చే డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇళ్ల కోసం ఎవరికీ ఒక్కపైసా లంచం ఇవ్వొద్దని చెప్పారు. గతంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఫలితంగా ప్రభుత్వం దగ్గర సమగ్ర సమాచారం ఉందని పేర్కొన్నారు. ఒకవేళ లబ్ధిదారులు ఎక్కువ సంఖ్యలో ఉండి డబుల్ ఇళ్లు పరిమితంగా ఉంటే లాటరీ వేసైనా సరే పైసా లంచం లేకుండా పారదర్శకంగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. సిరిసిల్ల పేరు ప్రతి ఆడబిడ్డ తలచుకుంటోంది సిరిసిల్ల నేతన్నల కళానైపుణ్యానికి ప్రతిరూపమైన బతుకమ్మ చీరలను కట్టుకుని రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డ సిరిసిల్ల పేరు తలచుకుంటోందని కేటీఆర్ చెప్పారు. అలాంటి బతుకమ్మ చీరలు ఇంకా బాగా తయారుచేసి, బ్రహ్మాండమైన చీరతో ఆడబిడ్డల ఆశీర్వాదం పొందాలన్నారు. సిరిసిల్లలో అపెరల్ పార్కు ద్వారా మహిళలకు నెలకు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు ఆదాయం లభించేలా శిక్షణ ఇస్తామన్నారు. నేతన్నలకు రూ.30 వేల నుంచి రూ.40 వేల స్థిరమైన ఆదాయం లభించేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రానికి ఇంటి పెద్దలా ఉండి అన్ని వర్గాలను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నారని, అలాగే ప్రజలు కూడా కడుపు నింపేలా బ్రహ్మాండమైన తీర్పునిచ్చారన్నారు. తనను 89 వేల భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజల రుణం ఎన్నటికీ తీర్చుకోలేనని, పేదలకు సాయం చేసి మాత్రమే కొంత రుణం తీర్చుకోగలనని పేర్కొన్నారు. -
కార్టూనిస్టులకు రాష్ట్రస్థాయి అవార్డులు
సాక్షి, హైదరాబాద్: ప్రతి ఏడాది వివిధ రంగాల్లోని ప్రముఖులకు ఇచ్చినట్లే కార్టునిస్టులకు కూడా రాష్ట్ర స్థాయిలో అవార్డులిస్తే బాగుంటుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు తక్షణమే సిద్ధం చేసి సీఎం కేసీఆర్కు అందించాలని భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణను ఆదేశించారు. శనివారం రవీంద్రభారతిలోని ఐసీసీఆర్ ఆర్ట్ గ్యాలరీలో ఇండియన్ ఫైనార్ట్స్ ఆధ్వర్యంలో ది ఇంక్డ్ ఇమేజ్ పేరుతో రెండు దశాబ్దాల రాజకీయ చిత్రాలు, కార్టూన్లు, క్యారికేచర్ల ప్రదర్శనను కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అంతర్జాతీయ స్థాయి కార్టూనిస్టు పామర్తి శంకర్ తెలంగాణవాడు అయినందుకు గర్వంగా ఉందన్నారు. పొలిటికల్ కార్టూన్లు కత్తిమీద సాములాంటివని, ఒక కార్టూన్కు ప్రభుత్వాలను అతలాకుతలం చేసేంత శక్తి ఉంటుందన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ తలకట్టులో శంకర్ 10 జిల్లాల తెలంగాణ రేఖా చిత్రం గీసి అద్భుతం సృష్టించారని కొనియాడారు. ఒక కార్టూన్ వెయ్యి అక్షరాల సమాచారాన్ని తెలియజేస్తుందని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ చెప్పారు. 2016లో రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా విశిష్ట పురస్కారాన్ని అందజేసి ప్రభుత్వం శంకర్ను గౌరవించిందని మామిడి హరికృష్ణ అన్నారు. తాను గీసిన కార్టూన్లు, క్యారికేచర్లను ప్రదర్శనలో ఉంచానని కార్టూనిస్టు శంకర్ తెలిపారు. ఈ ప్రదర్శన ఏర్పాటుకు హరికృష్ణ ప్రోత్సాహంతోపాటు ఆర్థిక సహకారం అందించారన్నారు. ఈ సందర్భంగా ది ఇంక్డ్ ఇమేజ్పై శంకర్ తీసుకువచ్చిన పుస్తకాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు. -
సాయికృష్ణకు అండగా ఉంటాం
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో దుండగుల చేతిలో కాల్పులకు గురై చికిత్స పొందుతున్న మహబూబాబాద్ జిల్లాకు చెందిన విద్యార్థి సాయికృష్ణకు అండగా ఉంటామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు తెలిపారు. సాయికృష్ణ కుటుంబ సభ్యులు మంగళవారం హైదరాబాద్లోని కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిశారు. ప్రభుత్వం సహకరించాలని కోరారు. సాయికృష్ణ తల్లిదండ్రులు వెంటనే అమెరికా వెళ్లేందుకు అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామని కేటీఆర్ వారికి హామీ ఇచ్చారు. సాయికృష్ణ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం సాయికృష్ణ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారని, అయితే పలు శస్త్ర చికిత్సలు అవసరమని అక్కడ ఉన్న సాయికృష్ణ మిత్రులు తెలియజేశారని తల్లిదండ్రులు కేటీఆర్కు తెలిపారు. సాయికృష్ణకు అవసరమైన తక్షణ వైద్య సహాయంపై అమెరికాలోని కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయానికి ఎన్ఆర్ఐ శాఖ అధికారులు సమాచారం అందించారని, అవసరమైతే మరింత సహకారం కోసం విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్తో మాట్లాడతామని వారికి కేటీఆర్ హామీ ఇచ్చారు. దీనికోసం మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ నేరుగా సుష్మాస్వరాజ్ని కలిసినట్లు కేటీఆర్ తెలిపారు. సాయికృష్ణకు ప్రస్తుతం ఎలాంటి ఆటంకం లేకుండా వెద్య సహాయం అందుతోందని, అయితే బీమా సౌకర్యం లేకపోవడంతో తమకు ఆర్థికంగా సాయం అవసరమవుతుందని వారు కేటీఆర్ను కోరారు. ముందుగా కుటుంబ సభ్యులు అమెరికా వెళ్లేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని తక్షణం అందించాలని ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. అత్యవసర వీసాలను జారీ చేయాల్సిందిగా హైదరాబాద్లోని అమెరికా కాన్సుల్ జనరల్ కేథరిన్ హెడ్డాతోనూ కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. రవా ణా ఖర్చులతోపాటు, కొంత ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున తక్షణమే అందిస్తామని తెలిపారు. కష్టకాలంలో తమ కుటుంబానికి ఆసరాగా నిలబడుతున్న తెలంగాణ ప్రభుత్వానికి సాయికృష్ణ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. -
ఢిల్లీని శాసించే స్థాయికి ఎదుగుదాం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రజలు ఢిల్లీ నుంచి ఆశించడం కాదు.., శాసించే స్థాయికి ఎదగాలన్న ప్రొఫెసర్ జయశంకర్ సారు కలను సాకారం చేసే అవకాశం ఇప్పుడు వచ్చిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు అన్నారు. 16 మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించుకొని ఢిల్లీకి పంపడం ద్వారా తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకునే దిశగా ప్రతీ ఒక్కరూ ఆలోచించాలని పిలుపునిచ్చారు. ఆదివారం సికింద్రాబాద్, కూకట్పల్లి నియోజకవర్గాల్లో జరిగిన పద్మారావుగౌడ్, మాధవరం కృష్ణారావుల విజయోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అపూర్వ విజయానికి కారణమైన సీఎం కేసీఆర్తో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు, అశేషంగా ఆదరించిన ప్రజలందరికీ ఈ విజయాన్ని అంకితమిస్తున్నట్లు తెలిపారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ 150, యూపీఏ 100 సీట్లు దాటే పరిస్థితిలేదన్నారు. టీఆర్ఎస్ను పూర్తిస్థాయిలో 16 ఎంపీ స్థానాల్లో గెలిపిస్తే దేశానికి తెలంగాణ దిక్సూచిగా మారుతుందన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు రెట్టింపు మెజార్టీలు సాధించేలా కృషిచేయాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 119 స్థానాల్లో పోటీచేసి.. 103 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ కూటమి పేరిట వచ్చి ఓటమిని చవిచూసిందన్నారు. గడచిన నాలుగున్నరేళ్ల కాలంలో కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ పాలన పట్ల రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. అధికారంలోకి రావాలన్న తపనతో భావసారూప్యత లేని పార్టీలు మహాకూటమి పేరిట ఏకమైనా... ఇంటి కిరాయిల చెల్లింపుతో పాటు లెక్కకుమించిన హామీలు ఇచ్చినా ఓటర్లు ఆ పార్టీలను తిరస్కరించారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబీమా, రైతుబంధు వంటి పథకాలు దేశవ్యాప్త ప్రచారం పొందుతున్నాయన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలతో దేశానికి ఆదర్శవంతమైన సీఎంగా కేసీఆర్కు ప్రాముఖ్యత లభించిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంతకాలం గరీబోళ్లకు అన్నివిధాలా న్యాయం జరిగిందన్నారు. ప్రస్తుత రాజకీయాలకు ఆదర్శంగా, దిక్సూచిగా కేసీఆర్ నిలుస్తున్నారన్నారు. ఓటరు నమోదుపై దృష్టి పెట్టండి.... గడిచిన ఎన్నికలలో ఓట్లువేయలేకపోయిన లక్షలాది మంది ఆశీర్వాదాన్ని టీఆర్ఎస్ పార్టీ అందుకోలేకపోయిందని, అందరూ ఓటువేసి ఉంటే మెజార్టీ మరింతగా పెరిగేదన్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రజలంతా టీఆర్ఎస్వైపు నిలిచి నగరంలోనే అత్యధిక ఓటింగ్శాతాన్ని అందించారని తెలిపారు. ఓటరు నమోదులోను కూకట్పల్లి నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు ముందంజలో నిలవాలని కోరారు. ప్రతీ పోలింగ్బూత్ స్థాయిలోనూ నమోదు చేపట్టి అందరికీ ఓట్లు వచ్చేలా చూడాల్సిన బాధ్యతను డివిజన్ స్థాయి నాయకులు తీసుకోవాలని సూచించారు. -
కుంభమేళాలో పాల్గొనండి
సాక్షి ,హైదరాబాద్: ప్రయాగ్రాజ్లో జనవరి 15 నుంచి ప్రారంభమయ్యే కుంభమేళాలో పాల్గొనాలంటూ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రాథమిక సదుపాయాలు, పారిశ్రామికాభివృద్ధి శాఖ మంత్రి సతీశ్ మహాన్ తెలంగాణ ప్రజలను ఆహ్వానించారు. బంజారాహిల్స్లోని తాజ్ బంజారాలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. యునెస్కో వారసత్వపు హోదా పొందిన కుంభమేళాకు దేశంలోని గ్రామ గ్రామాల నుంచి ప్రజలు వస్తారని తాము ఆశిస్తున్నామన్నారు. అలాగే అన్ని రాష్ట్రాల గవర్నర్లు, సీఎంలను వ్యక్తిగతంగా కలసి ఆహ్వానిస్తున్నామని మహాన్ తెలిపారు. ఆధ్యాత్మికం, ప్రభుత్వం ఏకతాటిపై నడుస్తూ నిర్వహిస్తున్న కార్యక్రమం ఇదనీ, మేళా విజయవంతానికి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పూర్తి సహకారం అందిస్తున్నారని మంత్రి వెల్లడించారు. గతం కంటే మిన్నగా ఏర్పాట్లు రూ.ఐదు వేల కోట్లు వెచ్చించి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో అన్ని రకాల వసతులు గతం కన్నా మిన్నగా సమకూర్చినట్లు ఉత్తరప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ (ప్రాథమిక సదుపాయాలు, ప్రారిశ్రామికాభివృద్ధి) రాజేశ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ తెలిపారు. జనవరి 15న ప్రయాగ్రాజ్లో ప్రారంభమయ్యే కుంభమేళా మార్చి 4వరకు జరుగుతుందన్నారు. ముఖ్యమైన మౌని అమవాస్య రోజున 4 కోట్లమంది భక్తులు పాల్గొనవచ్చని, మొత్తం మేళా పూర్తయ్యేనాటికి ఈ సంఖ్య 15 కోట్లకు చేరవచ్చన్నారు. ప్రతీరోజూ ప్రయాగలో 7 క్యూసెక్కుల నీరు ఉండేలా చూస్తున్నామని, మౌని అమావాస్య మొదలు 5 ముఖ్యమైన కుంభమేళా రోజుల్లో 8 క్యూసెక్కుల నీరు ఉంటుందని రాజేశ్ కుమార్ తెలిపారు. అందరూ కలసి పాల్గొనే వీలున్న ఈ అవకాశాన్ని తెలంగాణ ప్రజలు వినియోగించుకోవాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఏటిఓ చైర్మన్ రంగారెడ్డి, ఫిక్కీ తెలంగాణ కౌన్సిల్ సాంస్కృతిక కమిటీ చైర్పర్సన్ ప్రశాంత్ లహోటి పాల్గొన్నారు. గవర్నర్ , కేటీఆర్ను ఆహ్వానించిన యూపీ సర్కార్ కాగా కుంభమేళాలో పాల్గొనాలని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావును యూపీ ప్రభుత్వం ఆహ్వానించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఆ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి సతీష్ మహాన శనివారం రాజ్భవన్, ప్రగతిభవన్లను సందర్శించి గవర్నర్ నరసింహన్, కేటీఆర్లకు ఆహ్వానలేఖలను అందించారు. -
కేబినెట్లో స్థానం అనుమానమే!
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారకరామారావు మళ్లీ మంత్రి అవుతారా?.. లేదా? అన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంత్రివర్గ విస్తరణ జరపకుండానే కేటీఆర్కు పట్టాభిషేకం చేసి పార్టీ బాధ్యతలు ఆయన భుజాల మీద పెట్టిన విషయం తెలిసిందే. అలాగే ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ ఉండబోదనే సంకేతాల నేపథ్యంలో ‘కేటీఆర్... నెక్ట్సేంటి’అన్నది చర్చనీ యాంశమవుతోంది. దావోస్లో వచ్చే నెల 22 నుంచి 25 వరకు జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి హోదాలో ఆహ్వానం అందుకున్న ఆయన మళ్లీ అదే హోదాలోనే ఆ సదస్సుకు హాజరవుతారా?.. లేదా? అన్నది రాజకీయ వర్గాలు, ఐటీ పరిశ్రమ వర్గాల్లోనూ హాట్టాపిక్గా మారింది. కేటీఆర్ను పార్టీ బలోపేతం కోసమే పూర్తిగా వినియోగించుకుంటారనే అభిప్రాయాలూ వినిపిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ తీసుకునే నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. మంత్రి హోదాలో... దావోస్ వేదికగా జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్)కు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మాత్రమే ఆహ్వానం లభిస్తుంది. అయితే, ఐటీ పెట్టుబడులకు హైదరాబాద్ను అనువైన కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు (జీఈఎస్)ను దిగ్విజయంగా నిర్వహించడంతో డబ్ల్యూఈఎఫ్ అధ్యక్షుడు బోర్గ్ బ్రెండే.. కేటీఆర్ను ప్రత్యేకంగా ఈ సదస్సుకు ఆహ్వానించారు. పలు పెద్ద గ్లోబల్ కంపెనీల సీఈవోలకు ఇచ్చే విందుకు ఆహ్వానించడంతో పాటు వారితో ప్రత్యేక సమావేశాలకు సమయం కేటాయించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ కూడా గత నాలుగేళ్లలో రాష్ట్రంలో జరిగిన ఐటీ, పారిశ్రామిక రంగాల అభివృద్ధి, పట్టణాభివృద్ధి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంస్కరణల గురించి ప్రెజెంటేషన్ ఇవ్వాలని భావించారు. అయితే, ఇప్పుడు కేటీఆర్ను మంత్రిని చేస్తారా? లేదా? అన్నది చర్చనీయాంశం కావడంతో దావోస్ సదస్సు అంశం ప్రాధాన్యత సంతరించు కుంటోంది. ఈ విషయమై ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. గతంలో నిర్ణయించిన విధంగా పలువురు సీఈవోలు, అనేక గ్లోబల్ కంపెనీల సీనియర్ ఎగ్జిక్యూటివ్లతో రాష్ట్ర ప్రభుత్వం విందు కార్యక్రమం ఏర్పాటు చేయాల్సి ఉందని, కేటీఆర్తో చర్చలు జరిపేందుకు వారంతా ఆ విందుకు హాజరుకానున్నారని చెప్పారు. దీంతో పాటు ప్రపంచ ఆర్థిక సదస్సుకు సమాంతరంగా తెలంగాణలో పారిశ్రామిక పెట్టుబడులను ప్రోత్సహించేందుకు గాను మంత్రి హోదాలో ఉన్నప్పుడే కేటీఆర్ చాలా మంది పారిశ్రామికవేత్తలకు సమయం కూడా ఇచ్చారని వెల్లడించారు. ఇప్పుడు ఈ షెడ్యూల్పై ఆసక్తి నెలకొందని, కేటీఆర్ను కేబినెట్లోకి తీసుకుంటేనే ఇవన్నీ సాధ్యమవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకవేళ కేటీఆర్ను మంత్రివర్గంలోకి తీసుకోకపోతే ఆ స్థానంలో ప్రత్యామ్నాయంగా ఎవరుంటున్నారన్న దానిపై కూడా అధికార వర్గాల్లో చర్చ జరుగుతోందని కూడా ఆయన వెల్లడించడం గమనార్హం. పాలనలో తనదైన ముద్ర... రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఐటీ, పరిశ్రమలు, పురపాలక మంత్రిగా కేటీఆర్ సమర్థవంతంగా పనిచేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఏ అంశంపై అయినా ఆంగ్లం, తెలుగులో అనర్గళంగా ప్రసంగించే ఆయన ట్విట్టర్లో లక్షల మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. దేశ, విదేశాల్లో జరిగిన సదస్సుల్లో పాల్గొని రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులను తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిన టీ–హబ్ ఐటీ ఇంక్యుబేటర్ రాష్ట్రంలో వందల సంఖ్యలో స్టార్టప్ కంపెనీల ఏర్పాటుకు ఊతమిచ్చి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారింది. అంతకు ముందు ఆయన కొంత కాలం పంచాయతీరాజ్ మంత్రిగా సైతం పని చేసి ఆ శాఖపై కూడా తనదైన ముద్రవేశారు. భవిష్యత్ ప్రణాళికలు కూడా.. హైదరాబాద్ను ఐటీ హబ్గా తీర్చిదిద్దడంతో పాటు మంత్రిగా ఉన్నప్పుడే తెలంగాణలో పారిశ్రామికా భివృద్ధిపై కేటీఆర్ భవిష్యత్ ప్రణాళికలు రూపొందించారు. ముఖ్యంగా నగరానికి తూర్పు దిక్కున ఉన్న ఉప్పల్ ప్రాంతంలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయాలనే కోణంలో ప్లాన్ చేశారు. మెట్రో రైలుకు సంబంధించి కూడా పలు కొత్త మార్గాలను ఏర్పాటు చేయాల్సి ఉన్నందున అందుకు తగిన ప్రణాళికను ఆయన సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ను కాదని వేరొకరికి బాధ్యతలు అప్పగిస్తే పరిస్థితి అనుకున్నంత సజావుగా ఉండదని గచ్చిబౌలికి చెందిన ఒక డెవలపర్ వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో కేటీఆర్ను ఐటీ బాధ్యతల నుంచి తప్పిస్తే ఆ రంగం అభివృద్ధిలో బ్రేకులు పడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీలో పెద్ద బాధ్యత టీఆర్ఎస్ను మరింత బలోపేతం చేయడంతో పాటు అన్ని ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా తెలంగాణను గులాబీవనం చేయాలనే ప్రణాళిక తోనే కేటీఆర్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేసీఆర్ నియ మించారు. పంచాయతీ నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు టీఆర్ఎస్ను గెలుపు బాటలో నడిపించే బాధ్యతలను కేటీఆర్కు అప్పగించారు. లోక్సభ ఎన్నికల్లో 16 స్థానాలు గెల వాలనే లక్ష్యంతో ఆయన ఇప్పటికే ప్రణాళికలు రూపొందిం చుకున్నారు. కార్యకర్తలకు శిక్షణ ఇచ్చి అన్ని స్థాయిల్లో సమా వేశాలు ఏర్పాటు చేయడం ద్వారా పార్టీ కేడర్ను ఉత్తేజి తుల్ని చేయాలనేది ఆయన భావనగా కనిపిస్తోంది. దీనికి తోడు ఫెడరల్ ఫ్రంట్కు బలం చేకూర్చే ప్రయత్నాలు చేయ గల సమర్థత కేటీఆర్కు ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఉత్తరప్రదేశ్, కర్ణాటకలకు చెందిన యువ నాయకులు అఖిలేశ్ యాదవ్, కుమారస్వామితో కేటీఆర్కు ఉన్న సాన్నిహిత్యం, ఆయనకు స్వతహాగా ఉన్న వాగ్ధాటి లాంటివి ఫ్రంట్కు ఊతమిస్తాయనే చర్చ జరుగుతోంది. దీంతో కేటీఆర్ విషయంలో కేసీఆర్ ఏం నిర్ణయం తీసు కుంటారు.. పూర్తిగా పార్టీకే పరిమితం చేస్తారా.. కేబినెట్లో కి తీసుకుంటారా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. -
వందకు పైగా సీట్లు మావే!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో వందకు పైగా స్థానాలు గెలుస్తామని మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు. 24 గంటల విద్యుత్, రైతుబంధు, రైతుబీమా పథకాలు గత నాలుగేళ్లలో చేపట్టిన అద్భుతమైన కార్యక్రమాలని పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో వ్యవసాయం, పారిశ్రామిక, సేవల రంగాలు శరవేగంగా వృద్ధి చెందుతాయని చెప్పారు. ఆదివారం ఆయన ట్విట్టర్ వేదికగా నెటిజన్ల ప్రశ్నలకు బదులిచ్చారు. ఇల్లు కట్టుకోవడానికి డబ్బులిస్తామని మొదట చెప్పి, ఇప్పుడు రుణం ఇస్తామని కాంగ్రెస్ మాట మార్చిందని చెప్పారు. రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఎన్నికల తర్వాత అమలు చేస్తుందన్న నమ్మకం లేదని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీకి ఏమాత్రం ఉనికి లేదని చెప్పారు. బీజేపీ ఒక్క సీటు గెలవడం కూడా అనుమానమేనని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ఉద్ఘాటించారు. ప్రజాకూటమికి డబ్బుల సంచులు అందుతున్నాయని, అందుకే పత్రికలకు రోజూ ప్రకటనలు జారీ చేస్తోందన్నారు. నల్లగొండలో అన్ని సీట్లు మావే.. ఎన్నికల ఫలితాలపై లగడపాటి రాజగోపాల్ సర్వే జోక్ లాంటిదన్నారు. ఆయన కుప్పిగంతులు పార్లమెంట్లో తెలంగాణను అడ్డుకోలేకపోయాయని, ఆయన సర్వేలు టీఆర్ఎస్ విజయాన్ని ఆపలేవని పేర్కొన్నారు. 67 ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్, టీడీపీలు తెలంగాణను నిర్వీర్యం చేయడం వల్లే ప్రత్యేక రాష్ట్రం అవసరమైందని, మళ్లీ ఆ పార్టీలు అదే పని చేసేందుకు ఉబలాటపడుతున్నాయని చెప్పారు. కాంగ్రెస్లో చాలా మంది సీఎం అభ్యర్థులున్నారని ఎద్దేవా చేశారు. నల్లగొండ జిల్లాలో అన్ని సీట్లు గెలుస్తామన్నారు. సిద్దిపేటలో హరీశ్రావుకు లక్ష ఓట్ల మెజారిటీ రావాలని ఆశించారు. ఓటుకు కోట్లు కేసు తార్కిక ముగింపునకు చేరుతుందన్నారు. వయసు రీత్యా తనలో ఇంకా మార్పు రాదని, భవిష్యత్తులో కూడా ఇలాగే ఉంటానని పేర్కొన్నారు. వచ్చే సారికి మూసీ ప్రక్షాళన యువకులకు నిరుద్యోగ భృతితో పాటు శిక్షణ కూడా అందిస్తామని చెప్పారు. 1.09లక్షల ఉద్యోగాల భర్తీని ఆమోదించామని, 87 వేల ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు జారీ చేసి, ఇప్పటివరకు 38 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు చెప్పారు. వచ్చేసారి ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనాన్ని నిర్మిస్తామన్నారు. మళ్లీ అధికారం చేపట్టాక మూసీ ప్రక్షాళన ప్రారంభిస్తామని చెప్పారు. మీడియాకు సైతం జవాబుదారీతనం ఉండాలని సూచించారు. హైటెక్ సిటీ ప్రాంతానికి మెట్రో రైలు ట్రయల్ రన్ ఇప్పటికే ప్రారంభమైందని, త్వరలో సేవలు అందిస్తామన్నారు. పాతబస్తీలో మెట్రో నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామన్నారు. ఎంఐఎం పోటీ చేస్తున్న రాజేంద్రనగర్ స్థానాన్ని టీఆర్ఎస్ కచ్చితంగా గెలుస్తుందన్నారు. నేరచరిత్ర ఉన్న అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయకుండా కఠినమైన చట్టాలు అవసరమన్నారు. హైదరాబాద్లోని నాలాల దుస్థితిపై ఒకరు ప్రశ్నించగా, రూ.541 కోట్లతో 40 చెరువుల అభివృద్ధి పనులు ప్రారంభించామని చెప్పారు. హైదరాబాద్లోని రోడ్ల పరిస్థితిపై తాను ఆనందంగా లేనని చెప్పారు. పోల్ మేనేజ్మెంట్ అంటే? పోల్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టారా.. అని ప్రశ్నించగా, అదేంటని కేటీఆర్ ఎదురు ప్రశ్నించారు. ప్రైవేటు నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత సమస్యను తక్షణమే పరిష్కరిస్తామని చెప్పారు. ప్రైవేటు విద్యా సంస్థల వైపు ప్రజలు మొగ్గు చూపకుండా ప్రభుత్వ విద్యా వ్యవస్థను పటిష్టపర్చాల్సిన అవసరముందని అంగీకరించారు. ఉప్పల్లో త్వరలో ఐటీరంగ అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభిస్తామని చెప్పారు. హైదరాబాద్లో కాలుష్యానికి కారణమవుతున్న 3,800 సిటీ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతామన్నారు. వెయ్యి ఎంఎల్డీల సామర్థ్యంతో మురుగు శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు. 50 వేల మెజార్టీతో గెలుస్తా సిరిసిల్లలో 50 వేల మెజారిటీతో విజయం సాధిస్తానని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఆదివారం పరేడ్గ్రౌండ్స్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభ సందర్భంగా కేటీఆర్ మీడియా ఇష్టాగోష్టిలో ముచ్చటించారు. ఈసారి కూడా సిరిసిల్లలో గెలుపు తథ్యమన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 17 అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నాగార్జునసాగర్లో జానారెడ్డి, కొడంగల్లో రేవంత్రెడ్డి, మధిర లో భట్టి విక్రమార్క ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఓటమి భయంతోనే రేవంత్రెడ్డి డ్రామాలు మొదలు పెట్టాడని, కొడంగల్లో గెలవలేక ఎన్నికలను వాయిదా వేయించాలని ప్రయత్నాలు చేస్తున్నాడని చెప్పారు. మహిళలు, ముస్లిం లు టీఆర్ఎస్ వైపే ఉన్నారని, సెటిలర్లు కూడా మావైపే ఉన్నారని పేర్కొన్నారు. శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్లో టీఆర్ఎస్ జెండా ఎగరటం ఖాయమని చెప్పారు. కేసీఆర్ స్థాయి నేత కాంగ్రెస్లో లేడని, రానున్న రోజుల్లో ఏపీలో కూడా తాను తిరుగుతానని చెప్పారు. చివరి రోజు 5న ఎవరి నియోజకవర్గాల్లో వారే ప్రచారం చేసుకుంటారని చెప్పారు. -
కాంగ్రెస్ పవర్ పోతేనే కరెంటొచ్చింది
సాక్షి, సిరిసిల్ల: కాంగ్రెస్ పవర్ కట్ అయితేనే తెలంగాణకు కరెంటు వచ్చిందని మంత్రి కె.తారకరామారావు అన్నారు. నాటి చీకటి రోజులను గుర్తుకు తెచ్చుకుని.. ఆలోచించి ఓటెయ్యాలని ఆయన ప్రజలకు విజ్ఙప్తి చేశారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో బహిరంగ సభలో, గంభీరావుపేటలో రోడ్ షోలో కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో ఆరు గంటలు కూడా కరెంటు ఇవ్వలేదన్నారు. అప్పుడు కరెంటు ఉంటే వార్త, ఇప్పుడు కరెంటు పోతే వార్త అవుతోందని చెప్పారు. సోనియాగాంధీ వల్లే తెలంగాణకు కరెంటు వచ్చిందని కాంగ్రెసోళ్లు నీతిలేని కూతలు కూస్తున్నారని, అదే నిజమైతే వాళ్లు అధికారంలో ఉన్న కర్నాటక, పంజాబ్ రాష్ట్రాల్లో ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ది కుటుంబ పాలన అంటూ రాహుల్ చేసిన విమర్శలపై స్పందిస్తూ.. ‘కాంగ్రెస్లో మోతీలాల్ నెహ్రూ నుంచి రాహుల్గాంధీ దాకా అందరూ ఉంటే తప్పులేదు కానీ కేసీఆర్ కుటుంబం ఉండొద్దా? ఎన్టీఆర్ మనమలు, మనమరాళ్లు, చంద్రబాబు కొడుకు ఎమ్మెల్యే కాకుండానే మంత్రి కావొచ్చు.. కానీ మేం రాజకీయాల్లో ఉండొద్దా?’అని ప్రశ్నించారు. ప్రజలు గెలిపిస్తేనే తాము రాజకీయాల్లో ఉన్నామని, పనిచేయకపోతే ఎందుకు గెలిపిస్తరని కేటీఆర్ ప్రశ్నించారు. సింహం సింగిల్గానే.. ‘ఒక్క సీఎం కేసీఆర్ను ఎదుర్కొనేందుకు అందరూ ఒక్కటవుతున్నరు. కాంగ్రెస్, టీడీపీ, కోదండరాం, సీపీఐ ఒక్కటై ఐదారు కండువాలు కప్పుకొని వస్తున్నరు. వాళ్లను చూసిన జనం సంక్రాంతికి గదరా గంగిరెద్దులు వచ్చేది గిప్పుడెందుకు అని ముచ్చట్లు పెడున్నారు’ అని కె.తారకరామారావు ఎద్దేవా చేశా>రు. నలుగురైదురుగు కలసి ఒక్కటవుతున్నారంటే అది మన బలమా? కాదా? రాహుల్గాంధీ, చంద్రబాబు, మోదీ, మాయావతి ఇట్లా ఢిల్లీ, యూపీ, అమరావతి నుంచి వచ్చేవాళ్లు అందరూ టూరిస్టులే. ఎన్నికలప్పుడు వచ్చి పోయేవాళ్లే.. మిగిలేది పక్కా లోకల్ మనిషి కేసీఆర్ మాత్రమే’అని వ్యాఖ్యానించారు. సింహం సింగిల్గానే వస్తుందన్నారు. గుంపులుగా వచ్చేవారెవరో మీకే తెలుసని చెప్పారు. మోదీ చుట్టపు చూపోడే .. ‘తెలంగాణకు చుట్టపుచూపుగా వచ్చిన ప్రధాని నరేం ద్ర మోదీ.. తెలంగాణలో కరెంటు వస్తలేదు. కనబడుతలేదు అని నిజామాబాద్లో అన్నారు.. హెలికాప్టర్లో తిరిగితే కనబడదు. ముట్టుకొని చూడు నీకే కనబడుతది’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. పని బాగుంటే లక్ష మెజార్టీ ఇవ్వండి ‘కేసీఆర్ను గద్దె దించేదాక సిపాయి ఉత్తరకుమార్రెడ్డి గడ్డం తీసుకోడట. దాంతో మనకు పోయేదేముంది? గడ్డం పెంచేటోడు గబ్బర్సింగ్ అయితడా. కాంగ్రెసోళ్లు ఇంటి కిరాయి కడుతాం, బాసన్లు తోముతాం, డైపర్లు మార్చుతాం అంటూ వస్తున్నరు. వాళ్లు మామూలోళ్లు కాదు’అని కేటీఆర్ అన్నారు. బడిపిల్లలకు ఏడాదికోసారి పరీక్షలు వచ్చినట్లు, తమకు ఐదేళ్లకోసారి పరీక్ష వస్తుందని, ఈ సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని ఓటర్లను కోరారు. సొల్లు మాటలను నమ్మి ఆగం అయితే 50 ఏళ్లు వెనక్కి వెళతారని చెప్పారు. ‘కాంగ్రెస్కు 60 ఏళ్లు అధికారం ఇచ్చారు. నాలుగేళ్లు మాకు అవకాశం ఇచ్చారు. మా పనితీరు బాగుంటే లక్ష మెజార్టీతో గెలిపించండి. అభివృద్ధి చేయకపోతే డిపాజిట్ గల్లంతయ్యేలా తీర్పునివ్వండి’ అని కేటీఆర్ కోరారు. నాది లోకలే.. ‘సిరిసిల్లలో పోటీ చేయడానికి నేను లోకల్ కాదట.. సోనియా ఈదేశానికి లోకలా? ఆమెను నెత్తిమీద పెట్టుకుని ఊరేగించాలా?’ అని కేటీఆర్ అన్నారు. పదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేశాక కూడా అవే మాటలా అని ప్రశ్నించారు. తన తాతది ముస్తాబాద్ మండలం మోహినికుంట అని, నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టు భూములు కోల్పోయిన నిర్వాసితులమేనని కేటీఆర్ అన్నారు. నాన్లోకల్ అని మాట్లాడుతున్న వాళ్లు బతుకుదెరువు కోసం ఎలా హైదరాబాద్లో ఉంటున్నారో.. తాము కూడా హైదరాబాద్ వెళ్లామన్నారు. కూటమిని బొందపెట్టండి కాంగ్రెస్ సొల్లు కబుర్లు నమ్మొద్దు సీల్డ్ కవర్ సీఎంలు మనకొద్దు మోమిన్పేట రోడ్ షోలో కేటీఆర్ మోమిన్పేట: తెలంగాణ అభివృద్ధి చెందకుండా అడ్డుపడుతున్న ఏపీ సీఎం చంద్రబాబును కాంగ్రెస్ పార్టీ భుజాలపై మోస్తోందని, కూటమి పేరుతో ఓట్లడుగుతున్న ఆ పార్టీలను బొంద పెట్టాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. వికారాబాద్ జిల్లా మోమిన్పేటలో శుక్రవారం రాత్రి రోడ్షోలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే వరకు గడ్డం తీయనని శపథం చేసిన ఉత్తమ్కుమార్రెడ్డి మాటలు నమ్మొద్దన్నారు. గడ్డం పెంచుకున్న ప్రతిఒక్కరూ గబ్బర్సింగ్ కాలేరని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్సోళ్ల సొల్లు మాటలకు జనం నవ్వుకుంటున్నారని తెలిపారు. చంద్రబాబు 30 లేఖలు రాశారు వికారాబాద్ నియోజకవర్గంలోని లక్ష ఎకరాలకు సాగు నీరిచ్చేందుకు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని తీసుకువస్తే..దీన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు కేంద్రానికి 30 లేఖలు రాశారన్నారు. ఎవరాపినా జిల్లాకు సాగునీరు తెచ్చే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. ఉత్తరాలు రాసి నీళ్లను అడ్డుకున్న బాబును ఆయనతో జతకట్టిన కాంగ్రెస్ను ఓటు ద్వారా తరిమికొట్టాలని సూచించారు. రాష్ట్రంలో నేడు 24గంటలు విద్యుత్ సరఫరా చేస్తుంటే.. ప్రధాని నరేంద్రమోదీ కరెంటు లేదనడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా..ఎప్పుడైనా విద్యుత్ తీగలను పట్టుకొని చూడాలని..అప్పుడే సరఫరా ఉందా లేదా అనేది తెలుస్తుందని చెప్పారు. ఒక్క కేసీఆర్ను ఎదిరించడానికి దేశంలోని పహిల్వాన్లందరూ వస్తున్నారని, ఎంతమంది వచ్చినా..అధికారంలోకి వచ్చేది టీఆర్ఎస్ పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు. సీల్డు కవర్ సీఎంలు మనకొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలన్న వారు చేతులు ఎత్తాలని కేటీఆర్ పేర్కొనగా.. అక్కడున్న వారంతా చేతులు ఎత్తారు. మొండి చేతులు కాదు పిడికిలి బిగించి చెప్పాలని..ఇప్పటికే మొండి చేతులతో మోసపోయామని చమత్కరిస్తూ ప్రజలను ఉత్తేజపరిచారు. మోమిన్పేట రోడ్షోలో మాట్లాడుతున్న కేటీఆర్ -
భ్రష్టు పట్టించడానికే కూటమి
వీర్నపల్లి (సిరిసిల్ల): తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడానికి మహాకూటమి ఏర్పాటైందని మంత్రి కె.తారకరామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలకేంద్రంలో ఆదివారం నిర్వహించిన రోడ్షోలో కేటీఆర్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణపై పెత్తనం చలాయించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కరెంటు ఇవ్వాలని అడిగిన పాపానికి చంద్రబాబు బషీర్బాగ్లో రైతులపై కాల్పులు జరిపాడన్నారు. అదే టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే 24 గంటలపాటు ఉచిత కరెంటు ఇస్తోందని పేర్కొన్నారు. దేశంలోనే రైతుబంధు, రైతుబీమా పథకాలు ఆదర్శంగా నిలిచాయని అన్నారు. గుంట భూమి ఉన్న రైతులకు కూడా రూ.5 లక్షల బీమా కల్పిస్తున్న ఘనత కేసీఆర్దే అని పేర్కొన్నారు. మహాకూటమికి ఓట్ల ద్వారానే తగిన బుద్ధి చెప్పి కేసీఆర్ను మరోసారి సీఎం అయ్యేలా ఆశీర్వదించాలని కోరారు. గత ప్రభుత్వాలు 60 ఏళ్లలో చేసిన అభివృద్ధిని టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో చేసి చూపించిందని చెప్పారు. మారుమూల అటవీప్రాంతమైన వీర్నపల్లిని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడ మే కాకుండా తండాలకు లింకురోడ్లు, ఎల్లారెడ్డిపేట నుంచి వీర్నపల్లి వరకు డబుల్రోడ్డు ఏర్పాటు చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. మండలాన్ని సాగునీటితో సస్యశ్యామలం చేయడానికి సీఎం రూ.168 కోట్లు కేటాయించారని ఆయన తెలిపారు. ఎంతోకాలంగా గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు కేంద్రంతో కొట్లాడి పట్టాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. పింఛన్ల ద్వారా వృద్ధులకు బతుకుపై భరోసా కల్పించామన్నారు. అధికారంలోకి రాగానే పింఛన్లను రెట్టింపు చేస్తామని తెలిపారు. ఈ ఎన్నికల్లో నియోజకవర్గం లోనే వీర్నపల్లి మండలం మెజార్టీలో రికార్డు సాధించాలన్నారు. తన సేవలను గుర్తించి ఓటువేసి మీ బిడ్డలాగా ఆశీర్వదించాలని కోరారు. -
కేటీఆర్పై సీఈసీ కన్నెర్ర!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ విభాగం ఆయుష్ వైద్యులతో మంత్రి కె.తారకరామారావు ఎన్నికల ప్రచార సమావేశం నిర్వహించడంపై కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) తీవ్రంగా పరిగణించింది. 24 గంటల్లోగా సంజాయిషీ ఇవ్వాలని కేటీఆర్ను బుధవారం ఆదేశించింది. గతనెల 7న హైదరాబాద్లోని బోల్క్లబ్లో ‘ఆయుష్ డాక్టర్స్ విత్ కేటీఆర్’పేరుతో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ఆయుష్ వైద్యులకు పలు హామీలిచ్చారు. ఈ ఘటనపై కొందరు నేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సీఈసీ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ అధికారులు విచారణ జరిపి నివేదిక సమర్పించారు. ఇది అధికారిక సమావేశం కాదని, ప్రైవేటు సమావేశమని వారు నివేదికలో పేర్కొన్నారు. దీనిపై సీఈసీ స్పందిస్తూ.. ప్రభుత్వ వైద్యులతో ఎన్నికల ప్రచార సమావేశం నిర్వహించడాన్ని తప్పుపట్టింది. -
ఎన్నికల్లో సెంచరీ కొడతాం
సాక్షి, హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో సెంచరీ కొడతామని మున్సిపల్, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కంచుకోటలు బద్దలు కొడతామన్నారు. అసలు ఆ పార్టీలో ఎవరిని చూసి ఓటెయ్యాలని మంత్రి ప్రశ్నిం చారు. కాంగ్రెస్ నేతలను దద్దమ్మలు, సన్నాసు లని ప్రగతి నివేదన సభలో తిట్టనందుకు వారు బాధ పడుతున్నట్లు ఉందన్నారు. మంగళవారం కాంగ్రెస్కు చెందిన కామారెడ్డి ఎంపీపీ ఎల్.నర్సింగరావు తదితరులు టీఆర్ఎస్లో చేరారు. మంత్రి కేటీఆర్ పార్టీ కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..గతంలో పార్టీని వీడినవారు తిరిగి రావడం సంతోషకరమని, తప్పిపోయిన పిల్లలు ఇంటికి వచ్చినట్లుగా ఉందన్నారు. టీఆర్ఎస్ విధానాలు, ప్రగతిని చూసి 40 ఏళ్లుగా కాంగ్రెస్లో ఉన్న నేతలు చేరు తున్నారని చెప్పారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో జరిగిన అన్ని ఉప ఎన్నికలు.. జీహెచ్ఎంసీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ గెలిచిందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరణించిన నియోజకవర్గాల్లోనూ సానుభూతిని అధిగమించి గెలిచామన్నారు. అయినా కాంగ్రెస్ నేతల్లో పులుపు చావలేదని వ్యాఖ్యానించారు. 43 లక్షల పింఛన్లు ఇస్తున్నాం ఉత్తమ్కుమార్రెడ్డి గడ్డం పెంచితే గబ్బర్సింగ్ అవుతాడా అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తన సొంత నియోజకవర్గం అమేథీలో మున్సిపల్ వార్డులను కూడా రాహుల్గాంధీ గెలిపించుకోలేదని.. అలాంటి వ్యక్తి తెలంగాణలో కాంగ్రెస్ను గెలిపిస్తాడా అని ప్రశ్నించారు. కాంగ్రెస్లో అందరూ సీఎం అభ్యర్థులేనని.. ఎవరిని చూసి, ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందుకే కేసీఆర్ను గద్దెదించాలా అన్నారు. రైతుబంధు, కేసీఆర్ కిట్, మిషన్ భగీరథ లాంటి అద్భుత పథకాలు అమలు చేస్తున్నందుకు కేసీఆర్ను దించేయాలా అని ప్రశ్నించారు. తెలంగాణకు కేసీఆర్ కుటుంబం వల్ల ఏం అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రంలో 43 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నట్లు చెప్పారు. మళ్లీ కేసీఆరే సీఎం రాష్ట్రంలో ఫ్లిప్కార్ట్ పెట్టుబడులు ప్రముఖ ఈ–కామర్స్ వ్యాపార సంస్థ ఫ్లిప్కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి మంగళవారం మంత్రి కేటీఆర్ను బేగంపేట క్యాంపు కార్యాల యంలో కలిశారు. తెలంగాణలో తమ సంస్థ వ్యాపార అభివృద్ధితోపాటు రాష్ట్రంలో పెట్టనున్న పెట్టుబడులు, లభించనున్న ఉపాధి అవకాశాలను వివరించారు. -
తెలంగాణ విద్యార్థులు క్షేమం
సాక్షి, హైదరాబాద్: కేరళ వరదల్లో చిక్కుకున్న ఇద్దరు తెలంగాణ విద్యార్థినులు మౌర్య రాఘవ్(ఖమ్మం), శరణ్ శ్రావణ్(వరంగల్) క్షేమంగా ఉన్నారని మంత్రి కేటీఆర్ కార్యాలయ అధికారులు తెలిపారు. వారిని స్వరాష్ట్రానికి రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మంత్రి ఆదేశాల మేరకు అధికారులు ఆదివారం విద్యార్థినులు, కొట్టాయం కలెక్టర్తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థినులకు ఎలాంటి ప్రమాదం లేదని వారి తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. ఇప్పటికే విద్యార్థినులకు రైలు టికెట్లు బుక్ చేశామని, వారు సోమవారం తెలంగాణకు బయల్దేరుతారని వెల్లడించారు. -
‘యూఏఈ క్షమాభిక్షను వినియోగించుకోండి’
సాక్షి, హైదరాబాద్: యూఏఈలో ప్రకటించిన క్షమాభిక్ష అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎన్నారై, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు గల్ఫ్ ప్రవాసీయులకు ఆదివారం పిలుపునిచ్చారు. ఆగస్టు 1 నుంచి అక్టోబర్ 31 వరకు క్షమాభిక్ష ప్రసాదించనున్నారని మంత్రి తెలిపారు. గల్ఫ్లో అక్రమంగా నివాసముంటున్న వారు అక్కడి నిబంధనలకు అనుగుణంగా క్రమబద్ధీకరించుకోవడం, ఎలాంటి పత్రాలు లేకుండా యూఏఈలో ఉంటున్న వారు స్వదేశానికి తిరిగిరావడానికి ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు. మళ్లీ కావాంటే వీరు రెండేళ్ల నిషేధం తర్వాత చట్టబద్ధంగా యూఏఈకి వెళ్లే అవకాశం ఉంటుందన్నారు. క్షమాభిక్ష సంద ర్భంగా యూఏఈలోని భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలని రాష్ట్ర ఎన్నారై శాఖ అధికారులను కేటీఆర్ ఆదే శించారు. ఎన్నారై శాఖ రాయబార కార్యాలయం నుంచి తెలంగాణ ప్రవాసీయుల సమాచారాన్ని సేకరిస్తుందని ఆయన తెలిపారు. క్షమాభిక్ష కాలంలో ఎవరికైనా ప్రభుత్వం నుంచి సహాయం అవసరమైతే 9440854433 హెల్ప్లైన్ నం బర్కు ఫోన్ చేయాలన్నారు. ఈ మెయిల్ ద్వారా సాయం కావాలంటే so_nri@ telangana. gov.inకి లేదా యూఏఈ కాన్సులేటులోని హెల్ప్డెస్క్ నంబర్ +71565463903 లేదా indiandubai.amnesty@gmail.com ద్వారా సంప్రదించవచ్చని సూచించారు. -
వారిని క్షేమంగా తెస్తాం: కేటీఆర్
హైదరాబాద్: కేరళ వరదల్లో చిక్కుకున్న తెలంగాణ వైద్య విద్యార్థినులను సురక్షితంగా రప్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ఖమ్మం జిల్లాకు చెందిన డాక్టర్ బింగి మౌర్య రాఘవ్, హన్మకొండకు చెందిన డాక్టర్ శారణ్ శార్వాణిలు కేరళలోని కొట్టాయం వరదల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ సంగతిని మొదట సాంస్కృతిక సమన్వయ కర్త కళారత్న మల్లం రమేష్ పత్రికల ద్వారా వెలుగులోకి తెచ్చారు. నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రాంతీయ అధికారి డాక్టర్ పత్తిపాటి మోహన్ సహకారంతో మంత్రి కేటీఆర్కు శనివారం సమాచారం అందజేశారు. దీనికి స్పందించిన మంత్రి కేటీఆర్ పూర్తి వివరాలు సేకరించి కేరళలో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థినులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సచివాలయంలోని సంబంధిత అధికారులను ఆదేశించారు. యువ గజల్ గాయిని హిమజా సామాజిక మాధ్యమం ద్వారా ఎంపీ కవితకు ఈ విద్యార్థినులకు సంబంధించిన వివరాలను పంపించారు. -
థర్డ్ కాదు..ఫస్ట్ ఫ్రంటే
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయాలనుకుంటున్న కూటమిని థర్డ్ ఫ్రంట్ అనాల్సిన అవసరం లేదని, దాన్నే ఫస్ట్ ఫ్రంట్ అనొచ్చని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కె. తారక రామారావు పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలనను అందించలేని కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా సమాఖ్య స్ఫూర్తిని ప్రతిబింబించేలా మరో కూటమి రావాల్సిన అవసరం ఉందని గుర్తించి ఆ దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా చర్చకు శ్రీకారం చుట్టారన్నారు. ముందుముందు ఈ ఫ్రంట్ ఎలా ఏర్పాటవుతుందన్నది వేచిచూడాల్సి ఉందని, దీనిపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. శనివారం ఢిల్లీలో ప్రారంభమైన 51వ స్కోచ్ సమ్మిట్లో పాల్గొన్న అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ప్రజాకాంక్షలు నెరవేర్చడంలో కాంగ్రెస్, బీజేపీ విఫలం... వచ్చే సాధారణ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ లు పూర్తి మెజారిటీ సాధించే పరిస్థితులు లేని నేపథ్యంలో బలమైన ప్రాంతీయ పార్టీలు తమ హవా కొనసాగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. దేశానికి స్వాత్రంత్యం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలు ఎన్నో అవకాశాలు ఇచ్చారని, అయితే ఆ రెండు పార్టీలు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. దేశంలో ఒకవైపు విద్యుత్ మిగులు ఉందని చెబుతూనే మరోవైపు ఎన్నో గ్రామాలకు విద్యుత్ సదుపాయం లేదన్నారు. దేశవ్యాప్తంగా వివిధ నదుల్లో 75 వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నా వ్యవసాయానికి నీరందే పరిస్థితి లేదన్నారు. బహుముఖ పార్టీ వ్యవస్థ ఉన్న భారత్లో కేవలం రెండు పార్టీల మధ్యే ఎన్నికలను పోటీగా భావించడం సరికాదన్నారు. గత 70 ఏళ్లలో కాంగ్రెస్, బీజేపీలు కేంద్రంలో అధికారంలో ఉండి రాష్ట్రాలపై చేసిన పెత్తనంపై విస్తృత చర్చ జరగాలన్నారు. కేంద్రం గత నాలుగేళ్లలో తెలంగాణకు ఇచ్చిన రూ. 81 వేల కోట్లు కూడా కేంద్ర వాటా కింద ఇచ్చినదేనని, ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వలేదన్నారు. కనీసం విభజన చట్టంలోని హామీలను సైతం కేంద్రం అమలు చేయలేకపోయిందని విమర్శించారు. దీనిపై ప్రధాని, కేంద్ర మంత్రులను ఎన్నిసార్లు కలసి విన్నవించినా ఉపయోగం లేకుండా పోయిందన్నారు. రాష్ట్రాలు బలంగా ఉంటేనే దేశం పురోగతి సాధిస్తుందన్న విషయాన్ని పట్టించుకోకుండా కేంద్రం సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తోందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఎన్డీయేలో మిగిలేది బీజేపీయే... ఎన్డీయే కూటమి నుంచి మిత్రపక్షాలు ఒక్కొక్కటిగా బయటకు వెళ్లిపోతున్న నేపథ్యంలో ఆ కూటమిలో చివరకు మిగిలేది ఒక్క బీజేపీయేనని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాష్ట్రాలపై పెత్తనం చెలాయించాలని చూస్తున్న కేంద్రం వైఖరికి నిరసనగా ఎన్డీయే నుంచి ఇప్పటికే శివసేన వైదొలగిందని, హామీలు అమలు చేయలేదని టీడీపీ కూడా కేంద్ర మంత్రులను ఉపసంహరించుకుందన్నారు. ఇక ఎన్డీయేలో ఏమాత్రం ప్రభావం చూపలేని అకాలిదళ్ లాంటి పార్టీలు మాత్రమే ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ప్రత్యామ్నాయ కూటమి అవసరం ఎంతైన ఉందని గ్రహించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయంలో ముందుకు సాగుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. మూడు ‘ఐ’లు... అభివృద్ధి మంత్రాలు.. రాష్ట్రాల పటిష్టతపై ఆధారపడ్డ దేశాభివృద్ధికి మూడు ‘ఐ’లు ఎంతో ప్రాధాన్యం కలిగి ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. స్కోచ్ 51వ సమ్మిట్లో ఆయన ప్రసంగిస్తూ.. ఇన్క్లూజివ్ గ్రోత్ (సమ్మిళిత వృద్ధి), ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ (మౌలిక సదుపాయాల అభివృద్ధి), ఇన్నోవేషన్ (సృజనాత్మక ఆవిష్కరణ) అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషిస్తాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇదే మంత్రాన్ని అనుసరించి అన్ని రంగాల్లో వృద్ధి సాధిస్తోందన్నారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్, రైతులకు వ్యవసాయ పెట్టుబడి, ఉచితంగా చేప పిల్లల పంపిణీ, మెరుగైన పారిశ్రామిక విధానంతో పరిశ్రమల ఏర్పాటుకు అనుమతుల మంజూరులో పారదర్శకత, డబుల్ బెడ్రూం ఇళ్ల వంటి వినూత్న పథకాలు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ చేరేలా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పాలన అందిస్తున్నారని కేటీఆర్ చెప్పారు. సాఫ్రిన్ ఏరోస్పేస్తో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ స్కోచ్ సమ్మిట్లో భాగంగా భారత్, ఫ్రాన్స్ల మధ్య జరిగిన భాగస్వామ్య ఒప్పందాల సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. విమానాల్లో ఎలక్ట్రికల్ పరికరాలు తయారీ చేసే సాఫ్రిన్ ఏరోస్పేస్ సంస్థతో ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అవగాహనా ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. కేంద్ర మంత్రులు సురేశ్ ప్రభు, ఆర్.కె. సింగ్, మంత్రి కేటీఆర్ సమక్షంలో సాఫ్రిన్ సంస్థ సీఈవో, ఐటీశాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. సాఫ్రిన్ సంస్థ ఇక నుంచి హైదరాబాద్ వేదికగా తన ఉత్పత్తులను ప్రారంభించనుంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని పారిశ్రామిక ప్రాంతంలో సాఫ్రిన్ సంస్థ పరిశ్రమ ఏర్పాటు చేయనుందని మంత్రి కేటీఆర్ మీడియాకు తెలిపారు. -
‘ఆయన చేరిక వెయ్యి ఏనుగుల బలం’
సాక్షి, హైదరాబాద్: భూపాలపల్లి జిల్లాలో గండ్ర సత్యనారాయణ రావు చేరికతో టీఆర్ఎస్కు వెయ్యి ఏనుగుల బలం వచ్చిందని మంత్రి కె. తారక రామారావు పేర్కొన్నారు. దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఉన్న జ్యోతిబసు రికార్డును సీఎం కేసీఆర్ తిరగరాస్తారని కేటీఆర్ పేర్కొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండ్ర సత్యనారాయన రావు, మంథని నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ కర్రు నాగయ్య, రాజన్న సిరిసిల్లా జిల్లా టీడీపీ అధ్యక్షుడు అన్నమనేని నరసింగ రావులు బుధవారం టీఆర్ఎస్లో చేరారు. మంత్రులు కేటీఆర్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఈటల రాజేందర్లు వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీలో చేరిన వారిని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. చరిత్రలో కొన్ని మలుపులు అనివార్యంగా వస్తాయని, కాంగ్రెస్ పార్టీ ఆగడాలను అంతమొందించేందుకు ఎన్టీఆర్ టీడీపీ ఏర్పాటు చేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే ధ్యేయంగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందన్నారు. తెలంగాణలో ఇక టీడీపీ కనుమరుగు అయినట్లేనని కేటీఆర్ అన్నారు. ఢిల్లీ మోచేతి నీళ్లు తాగుతున్న కాంగ్రెస్కు ఇక్కడ పుట్టగతులు ఉండవని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. -
సినిమాలో నటించావా.. సస్పెండ్ చేస్తా !
సాక్షి, హైదరాబాద్: నగరంలో కార్పొరేటర్లతో మంత్రి సమావేశం శనివారం హాటాహాట్గా జరిగింది. రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు కార్పొరేటర్లకు తీవ్ర హెచ్చరికలు చేశారు. పనితీరు మార్చుకోకుంటే పరిమాణాలు చాలా తీవ్రంగా ఉంటాయని కొందరికి స్పష్టం చేశారు. ముఖ్యంగా చైతన్యపురి, హయత్నగర్ కార్పొరేటర్లకు కేటీఆర్ చురకలంటించారు. చైతన్యపురి నీ సామ్రాజ్యం అనుకుంటున్నావా ? అంటూ వ్యంగ్యంగా అడిగారు. అధికారులు మీ డివిజన్లలో తిరిగాలంటే నీ అనుమతి తీసుకోవాలా.? అని నిలదీశారు. ఈ విధమైనవి ఎక్కువ చేస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానంటూ హెచ్చరించారు. సినిమాలో నటించావా.. అని హయత్ నగర్ కార్పొరేటర్ తిరుమల్ రెడ్డిని అడిగారు. వెంగళరావు నగర్ కార్పొరేటర్ కిలారి మనోహర్.. కాఫీ విత్ కార్పొరేటర్ ప్రోగ్రాంను ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రముఖంగా ప్రస్తావించారు. పార్టీకి కార్పొరేటర్లు కీలకమని, ఇష్టం వచ్చినట్లు చేయటం పద్ధతి కాదని ఆయన సూచించారు. అందరూ కలిసి జాగ్రత్తగా పని చేయండని కోరారు. అధికారులు ఇబ్బంది పెడితే తనకు చెప్పాలని కోరారు. అధికారుల వెంట పడి పని చేయించుకోవాలని కోరారు. వినూత్నంగా పని చేసి జనంలోకి వెళ్ళండని మంత్రి కేటీఆర్ సలహా ఇచ్చారు. -
‘కేటీఆర్ మిస్టర్ ఫెయిల్యూర్’
సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్కు మిస్టర్ ఫెయిల్యూర్ బిరుదు సరిపోతుందని శాసనమండిలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. మంగళవారం నాడిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన హీమీల అమలులో విఫలం అవుతున్నాడని అన్నారు. హీమీల అమలులో ఫెయిల్ అని, అవార్డుల ద్వారా ప్రచారం చేసుకోవడంలో మాత్రమే సక్సెస్ అని విమర్శించారు. గల్ఫ్ దేశాల్లపో మగ్గిపోతున్న తెలంగాణవాసులను రాష్ట్రానికి తీసుకురావాలనే విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కొత్త ఎన్ఆర్ఐ పాలసీని తెస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా ఆ పాలసీ ఎక్కడికిపోయిందో చెప్పడంలేదన్నారు. గల్ఫ్ ఎన్ఆర్ఐలకు మంత్రి కేటీఆర్ ఇచ్చిన హీమీల్లో ఏ ఒక్కటీ అమలుకాలేదని షబ్బీర్ అలీ అన్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన దాదాపు 30వేల మంది గల్ఫ్ దేశాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వీరిని ఆదుకోవాలనే స్పృహ ప్రభుత్వనికి ఎందుకు లేదని షబ్బీర్ ప్రశ్నించారు. గల్ఫ్ బాధితులను ఆదుకోవడానికి తక్షణమే సమగ్ర విధానాన్ని తీసుకురావలని కోరారు. గల్ఫ్ బాధితులను కలవడానికి అఖిలపక్ష ప్రతినిధులను ప్రభుత్వం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విదేశాలు తిరుగుతున్న మంత్రి కేటీఆర్కు గల్ఫ్ బాధితులు కనబడటం లేదా అని ప్రశ్నించారు. వీరి కోసం వెంటనే ఎన్ఆర్ఐ బిల్లును అసెంబ్లీలో పెట్టాలని డిమాండ్ చేశారు. కమీషన్ల కక్కుర్తికి ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న వారికి అలవాటుగా మారిందని విమర్శించారు. కమీషన్లను దండుకోవడంలో పేదలకు పంచుతున్న బతుకమ్మ చీరలను కూడా వదలలేదని షబ్బీర్ అలీ విమర్శించారు. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్కు ఇచ్చిన హామీలను అమలుచేయాలని సూచించారు. లక్షకోట్లు ఇస్తామంటూ వట్టిగా మాటలు చెప్పడం మానుకోవాలన్నారు. లక్షకోట్లు కాదు ముందుగా ఇస్తామన్న వేయికోట్లు విడుదల చేయాలని షబ్బీర్ అలీ సూచించారు. -
రోడ్లు ఎవరు నిర్మిస్తే వారిదే బాధ్యత
-
‘ఆ ఇద్దరు మంత్రులపై కేసులు పెట్టాలి’
హైదరాబాద్: పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని చెప్పి అంబేద్కర్నగర్లో ఇళ్లు ఖాళీ చేయించి మోసం చేసినందుకు మంత్రులు కె.తారక రామారావుపై, తలసాని శ్రీనివాస్పై చీటింగ్ కేసులు నమోదు చేయాలని మాజీ మంత్రి మర్రి శశిధర్రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మంత్రులపై కేసులు పెట్టాలంటూ రాష్ట్ర డీజీపీకి గతంలోనే ఫిర్యాదు చేశానని చెప్పారు. హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనం చేస్తే కాలుష్యం అవుతుందని, నిమజ్జనం కోసం అంబేద్కర్ నగర్లో కొలను కట్టిస్తామని 70 శాతం పేదల ఇళ్లు ఖాళీ చేయించారని చెప్పారు. ఇప్పుడు ఇళ్లు కాకుండా చెరువును కట్టించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఇది ప్రజలను మోసం చేయడమేనని, మంత్రులపై కేసులు నమోదు చేయాలని మర్రి శశిధర్రెడ్డి డిమాండ్ చేశారు. సనత్ నగర్లోని వక్ఫ్ భూమిలో ఇళ్లు కట్టుకున్నవారిని ఖాళీ చేయాలని జీహెచ్ఎంసీ నోటీసులను ఇచ్చిందన్నారు. ఈ భూమిని కబ్జా చేయాలని మంత్రులు ఈ కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మంత్రులు కేటీఆర్, తలసానిపై కేసులు పెట్టేదాకా వదిలిపెట్టబోనని మర్రి హెచ్చరించారు. -
హైదరాబాద్ @ 1 జీబీపీఎస్
హైదరాబాద్: దేశంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సర్వీసులకు మహానగరం వేదిక కానుంది. 1 జీబీపీఎస్ ఫైబర్ నెట్ కనెక్షన్ను దేశంలో తొలిసారిగా హైదరాబాద్లో ఈ రోజు ఐటీ మంత్రి కేటీఆర్ లాంచ్ చేశారు. హోటల్ తాజ్ కృష్ణలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఫైబర్నెట్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో అత్యధికంగా డేటాను వినియోగిస్తోంది నగరవాసులే. ఇప్పటి వరకు హాంకాంగ్, సియోల్, సింగపూర్లాంటి కొన్ని దేశాలకు మాత్రమే పరిమితమైన సూపర్ఫాస్ట్ ఇంటర్నెట్ కనెక్షన్ త్వరలోనే మనకు అందుబాటులోకి రానుంది. 1 గిగా స్పీడ్ కనెక్షన్ తీసుకుంటే దానికి కనెక్ట్ అయ్యే అన్ని డివైజులు ఒకే స్పీడ్తో పనిచేస్తాయి. సచివాలయం, అసెంబ్లీ, రాజ్భవన్, సీఎం అధికార నివాసాలకు వన్ గిగా స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలని ఆయన సూచించారు. -
సందడిగా ‘ఓక్రిడ్జ్’ వార్షికోత్సవం
-
‘స్మార్ట్’కు దుబాయ్ సహకారం
* మంత్రి కేటీఆర్ ఆహ్వానానికి ‘దుబాయ్ స్మార్ట్ సిటీ’ సానుకూల స్పందన * వారం రోజుల్లో హైదరాబాద్ను సందర్శించనున్న సంస్థ సీఈఓ ముల్లా * తెలంగాణలో పెట్టుబడులపై ఆసక్తి చూపిన దుబాయ్ పారిశ్రామికవేత్తలు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ను ‘స్మార్ట్ సిటీ’గా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారకరామారావు ఆహ్వానానికి ‘దుబాయ్ స్మార్ట్ సిటీ’ సీఈఓ సానుకూలంగా స్పందించారు. సంస్థ సీఈవో అబ్దుల్ లతీఫ్ అల్-ముల్లా నేతృత్వంలోని బృందం హైదరాబాద్ నగర పర్యటనకు రానుంది. వారం రోజుల్లో హైదరాబాద్ను సందర్శించి తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరపాలని అల్-ముల్లా నిర్ణయించారు. దుబాయ్ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, టీఎస్ఐఐసీ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ జయేష్ రంజన్తో కలసి ఆదివారం అక్కడి ‘దుబాయ్ స్మార్ట్ట్ సిటీ’ కార్యాలయంలో ఆ సంస్థ సీఈవో ముల్లా, మేనేజింగ్ డెరైక్టర్ డాక్టర్ బాజు జార్జ్తో సమావేశమయ్యారు. సమాచార సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడుల ప్రాంతం (ఐటీఐఆర్) ప్రాజెక్టులో అంతర్భాగంగా హైదరాబాద్ నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే విషయంలో సాధ్యాసాధ్యాలపై చర్చించారు. ఐటీఐఆర్ హైదరాబాద్ ప్రాజెక్టుపై ఆసక్తి చూపిన దుబాయ్ స్మార్ట్ సిటీ సీఈవో ముల్లా.. రాష్ట్ర ప్రభుత్వంతో తదుపరి చర్చల నిమిత్తం వారం రోజుల్లో హైదరాబాద్ నగరాన్ని సందర్శించాలని నిర్ణయించారు. దుబాయ్ స్మార్ట్ సిటీ గురించి క్లుప్తంగా.. ఐటీ కార్యాలయాలు, నివాస, వ్యాపార సముదాయాల సమ్మిళిత అభివృద్ధికి మారుపేరుగా దుబాయ్లోని స్మార్ట్ సిటీని అభివర్ణించవచ్చు. అత్యుత్తమ ప్రమాణాల మధ్య పనిచేయడానికి, జీవనం కొనసాగించడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు అక్కడ అందుబాటులో ఉన్నాయి. అక్కడి స్మార్ట్ సిటీ నమూనాను అనుకరించి ఐరోపాలోని మాల్టా ద్వీపంలో స్మార్ట్ సిటీని నిర్మించారు. ఇక భారత్ విషయానికి వస్తే.. కోచీలో 250 ఎకరాల విస్తీర్ణంలో స్మార్ట్ సిటీని నిర్మించేందుకు కేరళ ప్రభుత్వం ‘దుబాయ్ స్మార్ట్ సిటీ’తో 2007లో ఒప్పందం చేసుకుంది. వచ్చే 8 ఏళ్లలో ఇక్కడ దుబాయ్ స్మార్ట్ సిటీ రూ.8 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తెలంగాణపై దుబాయ్ పారిశ్రామికవేత్తల ఆసక్తి తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దుబాయ్ పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపించారు. టెక్స్టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, గనులు, బయోటెక్నాలజీ, సాధారణ ఇంజనీరింగ్ ఆధారిత రంగాలపై ఎక్కువ మంది మొగ్గు చూపారు. ఫిక్కీ, ఐబీపీసీ, దుబాయ్, ఇండియన్ కాన్సులేట్ల సంయుక్త ఆధ్వర్యంలో దుబాయ్లోని క్రౌన్ప్లాజా హోటల్లో ఆదివారం నిర్వహించిన ‘ఇన్వెస్టర్స్ మీట్’లో మంత్రి కె.తారకరామారావు పాల్గొని రాష్ట్రంలో అమల్లోకి తెచ్చిన నూతన పారిశ్రామిక విధానాన్ని వివరించగా..అక్కడి పారిశ్రామికవేత్తల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, టీఎస్ఐఐసీ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ జయేష్ రంజన్, ఫిక్కీ బృంద నేత అరుణ్ చావ్లా, ఐబీపీసీ అధ్యక్షుడు పరాస్ షాదాద్పురి, గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్, కల్చరల్ అసోసియేషన్ ప్రతినిధులు జువ్వాడి శ్రీనివాస రావు, శ్రీనివాస శర్మ, రాజా శ్రీనివాస రావు, విజయభాస్కర్, అంబటి రఘు తదితరులు పాల్గొన్నారు. -
లిఫ్ట్లో ఇరుక్కుపోయిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఐటీ మంత్రి కె.తారక రామారావు లిఫ్ట్లో ఇరుక్కుపోయారు. దీంతో సిబ్బంది కొద్దిసేపు ఆందోళనకు గురయ్యారు. ఈ సంఘటన మంగళవారం బేగంపేట్ వరుణ్ మోటార్స్లో సియాజ్ కారును హైద రాబాద్ మార్కెట్లోకి విడుదల చేసిన సందర్భంగా చోటు చేసుకుంది. కార్యక్రమానికి ముందు వరుణ్ మోటార్స్ భవ నం మూడో అంతస్తు నుంచి పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్తో కలిసి ఆయన లిఫ్ట్లో కిందికి దిగుతుండగా అకస్మాత్తుగా అది ఆగిపోయింది. ఐదు నిమిషాలపాటు మంత్రి, ఎంపీ లిఫ్ట్లో ఉండిపోవాల్సి వచ్చింది. మంత్రి గన్మెన్, వరుణ్మోటార్స్ సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఆరా తీయగా కింది ఫ్లోర్లో దాని గేటు ఓపెన్ చేసినట్లు తెలిసింది. వెంటనే లిఫ్ట్ గేటును వేయడంతో మళ్ళీ లిఫ్ట్ కదిలింది. -
కేటీఆర్తో ముచ్చట!
-
నిజాం షుగర్స్ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం : కేటీఆర్
బోధన్, న్యూస్లైన్: తెలంగాణ రాష్ట్రంలో నిజాం షుగర్స్ను తిరిగి స్వాధీనం చేసుకుంటామని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కె.తారకరామారావు తెలిపారు. నిజామాబాద్ జిల్లా బోధన్లోని నిజాం చక్కెర ఫ్యాక్టరీ స్థాపించి 75 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన వజ్రోత్సవ సభలో ఆయన మాట్లాడారు. ఒకప్పుడు ఆసియా ఖండంలోనే అతిపెద్ద చక్కెర ఫ్యాక్టరీగా పేరున్న నిజాం షుగర్స్ను చంద్రబాబు నష్టాల సాకు చూపి ప్రైవేటీకరించారని, వేలాది మంది కార్మికులను రోడ్డు పాలు చేశారని ధ్వజమెత్తారు. దాదాపు రూ.700 కోట్ల విలువ చేసే ఫ్యాక్టరీ నాలుగు యూనిట్లను అప్పనంగా రూ.67 కోట్లకే ఆంధ్ర ప్రాంతానికి చెందిన అస్మదీయులకు అప్పగించారని ఆరోపించారు. దమ్ముంటే కిరణ్ కుమార్ రెడ్డి కొత్తపార్టీ పెట్టాలని ఆయన సవాల్ విసిరారు. -
సీఎంకు ఇంగితజ్ఞానం లేదు: కేటీఆర్
తప్పుల్లేకుండా తెలుగు మాట్లాడితే లక్ష బహుమతి ఇస్తా వరంగల్, న్యూస్లైన్: ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డికి ఇంగిత జ్ఞానం లేదని, తెలంగాణపై రోజుకో అర్ధరహిత ప్రకటన చేస్తున్నాడని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కె.తారకరామారావు విమర్శించారు. కిరణ్ తెలుగు భాషను ఖూనీ చేస్తున్నాడని, ఐదు నిమిషాలు వ్యాకరణ, భాషాదోషాలు లేకుండా తెలుగు మాట్లాడితే రూ.లక్ష బహుమతిని ఇస్తానని ప్రకటించారు. వరంగల్ జిల్లా భూపాలపల్లిలో ఆదివారం జరిగిన టీఆర్ఎస్ శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే నీటి, నక్సల్స్ సమస్య వస్తుందనడంలో అర్థం లేదన్నారు. ఇండియా, పాకిస్తాన్ ఐదు నదుల నీటిని, నైలు నదీజలాలను 11దేశాలు పంచుకుంటున్న విషయం తెలియదా అని ప్రశ్నించారు. ఢిల్లీలో దీక్ష చేసి అఖిలపక్షం ఏర్పాటు చేయూలని డివూండ్ చేసిన చంద్రబాబు అఖిలపక్షానికి వెళ్లకపోవడంతో ఆడ, వుగ కానీ పార్టీగా టీడీపీని ప్రజలు గుర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. -
సీఎంకు ఇంగితజ్ఞానం లేదు: కేటీఆర్
తప్పుల్లేకుండా తెలుగు మాట్లాడితే లక్ష బహుమతి ఇస్తా వరంగల్, న్యూస్లైన్: ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డికి ఇంగిత జ్ఞానం లేదని, తెలంగాణపై రోజుకో అర్ధరహిత ప్రకటన చేస్తున్నాడని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కె.తారకరామారావు విమర్శించారు. కిరణ్ తెలుగు భాషను ఖూనీ చేస్తున్నాడని, ఐదు నిమిషాలు వ్యాకరణ, భాషాదోషాలు లేకుండా తెలుగు మాట్లాడితే రూ.లక్ష బహుమతిని ఇస్తానని ప్రకటించారు. వరంగల్ జిల్లా భూపాలపల్లిలో ఆదివారం జరిగిన టీఆర్ఎస్ శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే నీటి, నక్సల్స్ సమస్య వస్తుందనడంలో అర్థం లేదన్నారు. ఇండియా, పాకిస్తాన్ ఐదు నదుల నీటిని, నైలు నదీజలాలను 11దేశాలు పంచుకుంటున్న విషయం తెలియదా అని ప్రశ్నించారు. ఢిల్లీలో దీక్ష చేసి అఖిలపక్షం ఏర్పాటు చేయూలని డివూండ్ చేసిన చంద్రబాబు అఖిలపక్షానికి వెళ్లకపోవడంతో ఆడ, వుగ కానీ పార్టీగా టీడీపీని ప్రజలు గుర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు.