
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్పై తెలంగాణ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఈ విషయంపై ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదివారం టెలికాన్ఫరెన్స్ ద్వారా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేస్తున్న పల్మోనాలజిస్ట్లు అందరూ అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అన్ని టీచింగ్ హాస్పిటల్స్లో కరోనా వైరస్ అనుమానితులు వస్తే చికిత్స చేయడం కోసం ఏర్పాట్లు చేసినట్లు సూచించారు. రేపటి నుంచి గాంధీ మెడికల్ కాలేజ్లో కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రతి రోజు 30 మందికి కరోనా వైద్య పరీక్షలు చేసే అవకాశం ఉందని తెలిపారు. ఒక్కొక్క పరీక్షకు 10 గంటల సమయం పడుతుందన్నారు. అయితే ఇప్పటి వరకు తెలంగాణలో ఒక్క కరోనా కేసు కూడా పాజిటివ్గా నమోదు కాలేదన్నారు. (భారత్లో రెండో కరోనా కేసు..!)
ఈ సందర్భంగా చైనా నుండి వచ్చిన ప్రతి ఒక్కరూ ఫీవర్, గాంధీ, చెస్ట్ ఆసుపత్రులలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఈటల రాజేందర్ కోరారు. ఆసుపత్రుల్లో చేరిన వారికి చికిత్స అందించేందుకు అన్నివసతులు కల్పించినట్లు పేర్కొన్నారు. మాస్క్లు, సానిటైజర్లు అదేవిధంగా సరిపోయేంత మంది సిబ్బందిని సిద్ధం చేశామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనలను అమలుచేస్తున్నామని తెలిపారు. ఎంత ఎమర్జెన్సీ వచ్చినా వైద్య సేవలు అందించేందుకు వైద్య ఆరోగ్యశాఖ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని, ప్రజలు ఎంత మాత్రం భయపడొద్దని ఈటల విజ్ఞప్తి చేశారు. (జీజీహెచ్లో కరోనా కలకలం)
Comments
Please login to add a commentAdd a comment