
త్వరలో తెలంగాణ ఎన్నారై పాలసీ
రూపకల్పనకు మంత్రి కేటీఆర్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఉపాధి కోసం రాష్ట్రం నుంచి గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్న యువత సంక్షేమం కోసం తెలంగాణ ఎన్నారై పాలసీని రూపొందించాలని ఐటీ, మున్సిపల్, ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. ఇందుకు ఇతర రాష్ట్రాల్లో అమ లుచేస్తున్న పాలసీలను అధ్యయనం చేయాలన్నారు. కేరళ, పంజాబ్లలో ఉన్న ఎన్నారై పాలసీలను పరిశీలించిన కేటీఆర్... అందులోని ప్రధానాంశాలను తెలంగాణ పాలసీలో స్వీకరించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలి స్తున్నామన్నారు. జిల్లాల నుంచి గల్ఫ్కు వలస వెళ్లే యువతకు మరిన్ని సౌకర్యాలు కల్పించే దిశగా పాలసీ ఉంటుందన్నారు.
వారంలో ఎన్నారై సంఘాలు, గల్ఫ్ దేశాల్లో ఎన్నారైల సంక్షేమం కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలతో మంత్రి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి హాజరు కావాలని కార్మిక, ఇతర శాఖల అధికారులను కేటీఆర్ ఆదేశించారని శనివారం ఆయన కార్యాలయం ప్రకటనలో తెలిపింది. విదేశాల్లో ప్రమాదాలకు గురైన వారికి, మరణించిన వారికి అందాల్సిన సాయంపై ఈ భేటీలో చర్చించనున్నారు.
దీంతోపాటు ఎన్నారైల నుంచి వచ్చే పెట్టుబడులు, ఇతర సహాయ సహకారాలను స్వీకరించేందుకు ఓ వ్యవస్థను సైతం ఈ పాలసీ ద్వారా ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నారైల సంక్షేమం కోసం దేశ విదేశాల్లో పనిచేస్తున్న సంస్థల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తామన్నారు. ముసాయిదా పాలసీ సిద్ధమయ్యాక సీఎం సూచనలతో సాధ్యమైనంత త్వరగా తుది పాలసీని ప్రకటిస్తామన్నారు.
నేడు నగరానికి: అమెరికా పర్యటన ముగించుకున్న కేటీఆర్ ఆదివారం నగరానికి వస్తున్నారు. తెల్లవారుజాము 3 గంటలకు ఆయన శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకొంటారని మంత్రి కార్యాలయం శని వారం తెలిపింది.