108 సిబ్బంది సమ్మె విరమణ | The retirement of 108 staff strike | Sakshi
Sakshi News home page

108 సిబ్బంది సమ్మె విరమణ

Published Sun, May 24 2015 7:38 PM | Last Updated on Sun, Sep 3 2017 2:37 AM

The retirement of 108 staff strike

హైదరాబాద్: సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉండటంతో ‘108’ ఉద్యోగులు తమ సమ్మె విరమించారు. దీంతో 11 రోజులుగా జరుగుతోన్న సమ్మెకు తెరపడింది. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి ఉద్యోగులు విధుల్లోకి రానున్నారు. తెలంగాణ ‘108’ ఉద్యోగుల సంక్షేమ సంఘం, జీవీకే-ఈఎంఆర్‌ఐ ప్రతినిధులతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి రెండు రోజులు చర్చలు జరిపారు. అనంతరం మంత్రి ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగుల 15 డిమాండ్ల పరిష్కారానికి పార్లమెంటరీ కార్యదర్శులు వినయ్‌భాస్కర్, గాదరి కిషోర్‌లతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఉద్యోగులు, జీవీకే ప్రతినిధుల నుంచి వాదనలు విని ఆ కమిటీ నిర్ణయాలు తీసుకుంటుందన్నారు.

అయితే ఎప్పటిలోగా కమిటీ నివేదిక సమర్పిస్తుందన్న విషయాన్ని మాత్రం మంత్రి స్పష్టీకరించలేదు. ఉద్యోగుల సమ్మె కాలాన్ని వేతనంతో కూడిన సెలవుగా పరిగణిస్తామని మంత్రి హామీయిచ్చారు. ఈ సందర్భంగా ‘108’ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు మహేందర్‌రెడ్డి, అశోక్‌లు కూడా మాట్లాడుతూ రెగ్యులర్‌గా పెంచే 10 శాతంతో కాకుండా మరో రూ. వెయ్యి అదనంగా వేతనం పెంచుతామని మంత్రి హామీయిచ్చారని తెలిపారు. తీసేసిన 70 మందిపై కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. జీవీకే బదులు ప్రభుత్వమే ‘108’ వ్యవస్థను నిర్వహించాలన్న డిమాండ్‌పైనా కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. రెండు నెలల్లో కమిటీ నివేదిక సమర్పిస్తుందన్నారు. కమిటీలో సంఘం ప్రతినిధులు కూడా ఉంటారన్నారు.


మెడ్‌సెట్ ద్వారానే యాజమాన్య వైద్య సీట్లు కేటాయిస్తాం...
రాష్ట్రంలో ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో తమ కోటా సీట్లన్నింటినీ యాజమాన్యాలు అమ్ముకున్నాయని, ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుందని మంత్రి లక్ష్మారెడ్డిని ప్రశ్నించగా... ‘ప్రత్యేక ప్రవేశ పరీక్ష ఉంటుందన్న విషయం ఇప్పటివరకు చాలామందికి తెలియదు. కొన్ని ప్రైవేటు వైద్య కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి అడ్వాన్సు డబ్బులు తీసుకొని సీట్లను బుక్ చేశారు. ప్రత్యేక ప్రవేశ పరీక్షలో మెరిట్ మార్కులు రాకుంటే ఎవరి డబ్బులు వారికి వాపసు ఇస్తార’ని మంత్రి తెలిపారు. ముందు డబ్బులు తీసుకున్నందున పేపర్ లీక్ అయ్యే అవకాశాలుంటాయని ప్రశ్నించగా... అటువంటి పరిస్థితి తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతిష్టాత్మక సంస్థ ద్వారానే ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు.


ప్రభుత్వ డాక్టర్ల వేతనాలు పెంచుతాం
ప్రభుత్వ డాక్టర్ల వేతనాలు పెంచాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. వారికి ప్రోత్సాహకాలు కూడా ఇస్తామన్నారు. అలాగే ప్రభుత్వ వైద్య విధానాన్ని సమూలంగా మార్చుతామన్నారు. ఆసుపత్రులు, కార్యాలయాల్లో సీసీ కెమెరాలు పెట్టే ఆలోచన ఉందన్నారు. అనేక ఆసుపత్రుల్లో పరికరాలు కూడా సరిగా లేవన్నారు. ఇప్పటివరకు పరికరాలు, డ్రగ్స్ కొనుగోలులో అనేక అవకతవకలు జరిగాయన్నారు. ఎల్1, ఎల్2 వ్యవస్థ కాకుండా సరైన వ్యవస్థను ఏర్పాటుచేస్తామన్నారు. పరికరాల కొనుగోలుకు సంబంధించి బహిరంగ చర్చ పెడతామన్నారు. గాంధీ ఆసుపత్రిలో లిఫ్ట్ పాడయితే అడగడానికి ఆ కంపెనీయే లేదన్నారు. పెంటావలెంట్ టీకాను వచ్చే నెల రెండో తేదీన ప్రారంభిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement