విజయనగరం: గత రెండు రోజుల క్రితం మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన వోల్వో బస్సు దుర్ఘటన మరవకముందే మరో ఘోరప్రమాదం చోటుచేసుకుంది. విజయనగరం జిల్లాలోని గొట్లాం సమీపంలో శనివారం దీపావళి పండుగపూట పెనువిషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో రైలు కిందపడి 8 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. సిగ్నల్ లేకపోవడంతో బొకారో రైలు అక్కడే ఆగిపోయింది. అప్పుడే బొకారొ ఎక్స్ ప్రెస్ -1, ఎస్-2 బోగీల్లో పొగలు, మంటలు చెలరేగాయంటూ వదంతులు వ్యాపించాయి. దీంతో చాలా మంది ప్రయాణికులు భయపడి రైలులో నుంచి ఒక్కసారిగా పక్క ట్రాకుపై దూకారు. ప్రయణికులంతా చైన్లాగి హడావుడిగా దూకడంతో, అదే సమయంలో పక్క ట్రాక్ పైకి దూసుకొచ్చిన విజయవాడ ప్యాసింజర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇప్పటివరకూ 8 మంది మృతిచెందినట్టు సమాచారం. పలువురు గాయపడ్డారు.
ఈ ఘటన రాత్రి 7.15 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. రైలు ఒక్కసారిగా ఢీకొట్టడంతో ట్రాక్పై మృతదేహాలన్ని చిధ్రమయ్యాయి. తెగిపడిన అవయవాలతో ట్రాక్ భయంకరంగా కనిపిస్తోంది. ఈ ఘోరప్రమాదంలో ఎంతమంది మృతిచెందారో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. మృతుల్లో చిన్నారులు, మహిళలు ఉన్నట్టు తెలుస్తోంది. మృతుల్లో బెంగాల్ వాసులు కూడా ఉన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.