మూడు వేలకు పైగా తగ్గడంపై నిరుద్యోగుల ఆవేదన
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ విస్తరణాధికారుల పోస్టుల తగ్గింపు నిర్ణయం నిరుద్యోగుల్లో గుబులు రేపుతోంది. రాష్ట్రంలో 4,442 సహాయ వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఏఈవో)ను నియమిస్తామని గత ఏడాది ప్రభుత్వం ప్రకటించింది. కానీ వాటిని మూడు వేలకుపైగా తగ్గించి వెయ్యికే పరిమితం చేస్తూ తాజాగా కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై వ్యవసాయ నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారు.
ఇక ప్రత్యేకంగా ఏఏఈవో పోస్టులంటూ ఉండవని, అవన్నీ ఏఈవో పోస్టులేనని వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు స్పష్టంచేస్తున్నారు. ప్రస్తుతం మండలానికో వ్యవసాయాధికారి (ఏవో) ఉన్నారని, ఇంకా క్షేత్రస్థాయిలో రైతులకు సేవలు అందించేలా 5 వేల ఎకరాలకు ఒక ఏఈవో చొప్పున నియమిస్తామంటున్నారు. ఇప్పటికే 1,100 ఏఈవో పోస్టులు ఉన్నందున, మిగిలిన వెయ్యి పోస్టులను ప్రభుత్వం ప్రకటించిందని చెప్తున్నారు.
వీటికి సంబంధించిన మార్గదర్శకాలు త్వరలో విడుదలవుతాయన్నా రు. వాస్తవంగా గతేడాది ప్రభుత్వం ఆదర్శ రైతు వ్యవస్థ స్థానే ప్రకటించిన 4,442 పోస్టుల్లో 90 శాతం వ్యవసాయ, ఉద్యాన కోర్సుల్లో డిప్లొమా పూర్తిచేసిన వారికి, 10 శాతం అగ్రికల్చర్ బీఎస్సీ చేసిన వారికి కేటాయించాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఆ ప్రకారం ఆర్థికశాఖ ఆమోదానికీ పంపారు. కానీ చివరకు వెయ్యి పోస్టులతోనే సరిపెట్టారు.
రెండు మూడు గ్రామాలకొకరు: పోచారం
ఆదర్శ రైతు వ్యవస్థ స్థానే ఏఏఈవో పోస్టులను భర్తీ చేయాలని తొలుత అనుకున్నామని, ఇప్పుడు ఏఏఈవో అని కాకుండా ఏఈవో పోస్టులనే ప్రభుత్వం భర్తీ చేస్తుందని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. ఐదు వేల ఎకరాలకు ఒక ఏఈవో చొప్పున నియమిస్తామని, రెండు మూడు గ్రామాలకు ఒకరు చొప్పున ఉంటారన్నారు.
4,442 నుంచి వెయ్యికి తగ్గిన వ్యవసాయ పోస్టులు
Published Mon, Sep 21 2015 1:50 AM | Last Updated on Sun, Sep 3 2017 9:41 AM
Advertisement
Advertisement