
బీజేపీ మహిళ విభాగం నాయకురాలి అరెస్ట్
పిల్లల అక్రమ రవాణ కేసులో పశ్చిమ బెంగాల్కు చెందిన బీజేపీ మహిళ విభాగం నాయకురాలు జుహీ చౌదురిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.
జల్పాయిగురి: పిల్లల అక్రమ రవాణ కేసులో పశ్చిమ బెంగాల్కు చెందిన బీజేపీ మహిళ విభాగం నాయకురాలు జుహీ చౌదురిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. మంగళవారం రాత్రి భారత్-నేపాల్ సరిహద్దున బటాసియా ప్రాంతంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
జల్పాయిగురి జిల్లాలో పిల్లల అక్రమ రవాణా కేసులో జుహీ చౌదురితో సహా నలుగురిని అరెస్ట్ చేశారు. దేశ వ్యాప్తంగా పలుప్రాంతాల్లో వీరు శిశువులను, చిన్న పిల్లలను అమ్మినట్టు ఆరోపణలు వచ్చాయి. గత కొన్ని నెలలుగా ఓ ఎన్జీవో నుంచి చిన్నారులను విదేశీయులకు అమ్మినట్టు కేసు నమోదైంది. అరెస్ట్ అయినవారిలో జుహీ చౌదురితో పాటు ఎన్జీవో ప్రతినిధులు సోనాలి మొండల్, చందన చక్రవర్తి, చందన సోదరుడు మనాస్ బౌమిక్ ఉన్నారు. ఏడాది నుంచి 14 ఏళ్ల వయసు మధ్య ఉన్న చిన్నారులను కనీసం 17 మందిని ఎక్కువ మొత్తానికి విదేశీయులకు అమ్మినట్టు వీరిపై కేసు నమోదైంది. జుహీ చౌదురి అరెస్ట్పై పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ స్పందిస్తూ.. ఆమె నేరం చేసినట్టు రుజువైతే చర్యలు తీసుకుంటామని చెప్పారు.