‘ప్రతి ఒక్కరి గుండెలో హోదా మార్మోగుతోంది’
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా అంశం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి గుండెలోనూ మార్మోగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరకు ఎమ్మెల్యే గిడ్డీ ఈశ్వరీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధన కోసం ఇందిరా ప్రియదర్శిని మైదానంలో వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తున్న ‘జై ఆంధ్రప్రదేశ్’ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. ఏపీకి ప్యాకేజీ ఇస్తానన్న అరుణ్జైట్లీ ప్రకటనను అర్ధరాత్రి స్వాగతించిన మహాఘనుడు చంద్రబాబు అని ఆమె మండిపడ్డారు.
‘చంద్రబాబు, వెంకయ్యనాయుడు ఆ రోజు ఏపీకి ఐదేళ్ల కాదు పదేళ్లు ఇవ్వాలని చెప్పి మోసం చేశారు. ఇప్పుడు హోదా వద్దు, ఆర్థిక ప్యాకేజీ చాలు అని ద్రోహం చేస్తున్నారు. హోదా విషయంలో రాత్రికి రాత్రే చంద్రబాబు తన వైఖరి మార్చుకున్నారు. తనకు, తన కొడుకుకు దోచుకోవడానికి అనువుగా ఉంటుందనే ఉద్దేశంతోనే ప్యాకేజీని స్వాగతిస్తున్న చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారు. ఆయన ఓ అబద్ధాల పుట్ట. ఏజెన్సీ ప్రాంతాల్లో పౌష్టికాహారలోపంతో బాధపడుతున్న గిరిజనులకు ఉచితంగా కందిపప్పు ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ వాస్తవంగా కిలో రూ. 40 చొప్పున నాసిరకం కందిపప్పు అందిస్తున్నారు’ అని ఆమె అన్నారు.
‘ చంద్రబాబు, వెంకయ్యనాయుడు కలిసి కులరాజకీయాలు మాట్లాడుకోవడం తప్ప.. ఆంధ్రుల ఆత్మగౌరవం గురించి పట్టించుకోవడం లేదు’ అని ఆమె మండిపడ్డారు. హోదా ఉద్యమంలో ఢిల్లీ నుంచి గల్లీ వరకు పోరాటాలు చేస్తున్న నేత వైఎస్ జగన్కు ప్రజలు అండగా ఉండాలని ఆమె కోరారు. లోకేశ్కు మంత్రి హోదా కాదు.. ఏపీకి ప్రత్యేక హోదా కావాలన్నారు. ప్రతి ఒక్కరూ భాగస్వాములై ప్రత్యేక హోదా పోరాటాన్ని ముమ్మరం చేయాలని పేర్కొన్నారు.