
20 శాతం తగ్గనున్న గ్యాస్ ధరలు
న్యూఢిల్లీ: సహజ వాయువు ధరలు మరోసారి తగ్గనున్నాయి. అక్టోబర్1 నుంచి యూనిట్కు (ఎంబీటీయూ) 20 శాతం మేర తగ్గనున్నాయి. ప్రస్తుతం 3.06 డాలర్ల నుంచి 2.45 డాలర్లకు దిగి రానున్నాయి. తగ్గించిన ధరలు అక్టోబర్ 1వ తేది నుంచే అమల్లోకి వస్తాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
కాగా గత 18 నెలలుగా ఇది నాలుగవ తగ్గింపు. 2014 లో ఎన్డీయే ప్రభుత్వం ఆమోదించిన నిర్దిష్ట ఫార్ములా ప్రకారం ఈ చర్యలు తీసుకున్నారు. గత ఏప్రిల్ లో 3.82 డాలర్లనుంచి 3.06 డాలర్లకు తగ్గించారు. దీంతో ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఓన్ జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ ధరలు తగ్గనున్నాయి. ఈ పథకం అమలు తరువాత గ్యాస్ ధరలు దాదాపు 39 శాతం క్షీణించాయి.గత ఏడాది ప్రభుత్వం ఆమోదించిన ఫార్ములా ప్రకారం గ్యాస్ ధర ను ప్రతి ఆరు నెలలకు ఒకసారి సవరించాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగానే తాజాగా మార్పులు జరగనున్నాయి.