
చెప్పులు, దుస్తులపై జీఎస్టీ మోత
న్యూఢిల్లీ: ఖరీదైన చెప్పులు, రెడీమెడ్ దుస్తులపై జీఎస్టీ మోత మోగించనుంది. రూ. 500 లోపు ఉన్న చెప్పులపై 5శాతం పన్ను విధించాలని, రూ. 500లు దాటితే ఏకంగా 18శాతం పన్ను విధించాలని జీఎస్టీ మండలి తాజాగా నిర్ణయించింది. అలాగే రెడీమెడ్ దుస్తులపై జీఎస్టీ మోత మోగనుంది. నూలు, మిల్లు వస్త్రాలపై 5శాతం పన్ను విధించనుండగా, రెడీమెడ్ దుస్తులపై 12శాతం పన్ను విధించాలని నిర్ణయించారు.
శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో వస్తుసేవల పన్ను (జీఎస్టీ) మండలి 15వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల ఆర్థికమంత్రులు ఈటల రాజేందర్, యనమల రామకృష్ణుడు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో బంగారం, బీడీలు, చెప్పులు, దుస్తులు సహా పలు నిత్యావసరాల వస్తువులపై ఈ సమావేశంలో జీఎస్టీ కింద పన్ను ఖరారు చేశారు. తినే బిస్కెట్లపై ఏకంగా 18శాతం పన్ను విధించగా, సామాన్యులు తాగే బీడీలపై 28శాతం పన్నుతో మోత మోగించారు. భారతీయులకు బాగా ఇష్టమైన బంగారం మీద మాత్రం కాస్తా కనికరం చూపించారు. స్వర్ణం మీద కేవలం 3శాతం జీఎస్టీతో సరిపెట్టారు.