- మూడో వ్యక్తి జోక్యం చేసుకోకూడదు!
- ఈశాన్యం భారతంలో పెట్టుబడులు వద్దంటూ..
- జపాన్కు చైనా పరోక్ష హెచ్చరికలు
బీజింగ్: భారత్-చైనా సరిహద్దు వివాదంలో మూడో వ్యక్తి జోక్యం చేసుకోకూడదని జపాన్ను ఉద్దేశించి చైనా ఘాటు వ్యాఖ్యలు చేసింది. తమ భూభాగంగా చెప్పుకొంటున్న అరుణాచల్ ప్రదేశ్లో జపాన్ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురావడంతో చైనా ఈ విధంగా అక్కసు వెళ్లగక్కింది.
తాజాగా నరేంద్ర మోదీ-షింజో అబె భేటీ నేపథ్యంలో భారత్-జపాన్ సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనపై చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ స్పందించింది. దక్షిణ చైనా సముద్రంలో స్వేచ్ఛాయుత నౌకాయానం, చైనా తలపెట్టిన వన్ రోడ్డు-వన్ బెల్ట్ ప్రాజెక్టుపై ఆందోళన తదితర అంశాలు ఈ సంయుక్త ప్రకటనలో ఉన్న సంగతి తెలిసిందే. 'భారత్-జపాన్ యాక్ట్ ఈస్ట్ ఫోరమ్'ను ఏర్పాటుచేస్తున్నట్టు ఈ ప్రకటనలో వెల్లడించారు. ఈ ఫోరమ్లో భాగంగా ఈశాన్య భారతంలో జపాన్ పెట్టుబడులు పెట్టనుంది. ఈ విషయాన్ని ప్రస్తావించిన చైనా విదేశాంగ అధికార ప్రతినిధి హ్యు చున్యింగ్.. తూర్పు సెక్టార్లో ఇరుదేశాల సరిహద్దులు స్పష్టంగా ఖరారు కాలేదని, సరిహద్దుల విషయమై పలు వివాదాలు ఉన్నాయని, ఈ వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఇరుదేశాలు భావిస్తున్నాయని, ఇందులో మూడో వ్యక్తి జోక్యం చేసుకోకూడదని జపాన్ను ఉద్దేశించి పేర్కొన్నారు. అంతేకాకుండా దక్షిణ చైనా సముద్రం విషయంలో భారత్-జపాన్ భాగస్తులు కాదని, కాబట్టి ఈ వివాదంతో ఆ దేశాలకు సంబంధం లేదని చెప్పుకొచ్చారు.