Border dispute
-
బెదిరింపులు.. దౌర్జన్యం.. గుణదల సీఐ ఓవర్యాక్షన్
సాక్షి, విజయవాడ: సరిహద్దు తగాదాలో ఒక వర్గానికి కొమ్ముకాస్తూ ఓ సీఐ అత్యుత్సాహం ప్రదర్శించారు. సరిహద్దు విషయమై కొద్దికాలంగా ఎస్ఎల్వి రియల్ ఎస్టేట్, కైలాష్ హైట్స్ రియల్ ఎస్టేట్ యజమానుల మధ్య కోర్టులో వివాదం నడుస్తోంది. అయితే, గుణదల సీఐ శ్రీనివాస్ రియల్టర్ల మధ్య వివాదంలో తలదూర్చారు. ఎస్ఎల్వి రియల్ ఎస్టేట్ యజమానికి కొమ్ముకాసిన సిఐ.. కోర్టులో వివాదం ఉండగానే ఎస్ఎల్వి యజమాని ఫిర్యాదు మేరకు దేవినేని శ్రీహరిపై కేసు నమోదు చేశారు.కైలాష్ హైట్స్ రియల్ ఎస్టేట్ యజమాని దేవినేని శ్రీహరి ఇంటికెళ్లి సీఐ శ్రీనివాస్ దౌర్జన్యం చేశారు. రౌడీ షీట్ తెరుస్తానంటూ బెదిరింపులకు దిగారు. శ్రీహరి భార్య పట్ల కూడా సీఐ అసభ్యకరంగా వ్యవహరించారు. సీఐ శ్రీనివాస్ వ్యవహారశైలిపై స్పెషల్ బ్రాంచి పోలీసులు ఆరా తీస్తున్నారు. మొత్తం ఘటనపై సీపీకి నివేదిక ఇవ్వనున్నారు. -
భారత్-చైనా సరిహద్దు వివాదం.. స్పందించిన రష్యా
మాస్కో: వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంట సైనికులను ఉపసంహరణపై భారత్, చైనాల మధ్య జరిగిన అవగాహనను రష్యా స్వాగతించింది. సరిహద్దు వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ఇరు దేశాల నుంచి సంకల్పం, విశ్వాసం అవసరమని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ సోమవారం అన్నారు.‘‘ ఐదేళ్ల విరామం తర్వాత కజాన్లో చైనా, భారత్ల నేతల మధ్య తొలి సమావేశం జరగడాన్ని మేం (రష్యా) స్వాగతిస్తున్నాం. ఆనందం వ్యక్తం చేస్తున్నాం. భారత్, చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో ఇది.. చాలా సానుకూల పరిణామం. భారత్-చైనా సరిహద్దు వివాదం చాలా సంక్లిష్టమైన సమస్య.దీనికి సుదీర్ఘమైన చర్చల ప్రక్రియ అవసరం. భారత్, చైనా తమ మధ్య ఉన్న సరిహద్దు సమస్యలపై చివరికి విజయం సాధిస్తాయనే విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు.దానికి సంకల్పం, సహృదయం, నమ్మకం అవసరం. సామరస్యానికి ఇవి చాలా అవసరం’’ అని అలిపోవ్ తెలిపారు.అక్టోబరు 23న రష్యాలోని కజాన్ నగరంలో జరిగే బ్రిక్స్ సమ్మిట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ల భేటీకి రెండు రోజుల ముందే ఎల్ఏసీ వెంట పెట్రోలింగ్ ఏర్పాట్లపై చైనాతో భారత్ ఒప్పందాన్ని ప్రకటించింది. సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడం ద్వారా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను సాధారణ స్థితికి వచ్చాయి. చదవండి: 2100 నాటికి ఉష్ణోగ్రతలో... 3.1 డిగ్రీల పెరుగుదల! -
చైనాతో వాణిజ్య బంధం తెంచుకోవాలనడం సరికాదు
న్యూఢిల్లీ: సరిహద్దులో అతిక్రమనలకు ప్రతీకారంగా చైనాతో భారత్ వాణిజ్య సంబంధాలు తెగతెంపులు చేసుకోవలన్న డిమాండ్ సరికాదని నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ పనగారియా స్పష్టం చేశారు. అలాచేయడం వల్ల భారత్ ఆర్థిక వృద్ధి వేగమూ మందగిస్తుందని హెచ్చరించారు. అందుకు బదులుగా ముందు భారతదేశం తన వాణిజ్యాన్ని విస్తరించడానికి బ్రిటన్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) వంటి దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్టీఏ)కుదుర్చుకోవడానికి ప్రయత్నించాలని కొలంబియా విశ్వవిద్యాలయంలో ఎకనమిక్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఆయన సూచించారు. ‘‘ రెండు దేశాలు వాణిజ్య ఆంక్షలు విధించుకోవచ్చు. అయితే 17 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ (చైనా)కు మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ (భారతదేశం)ని దెబ్బతీసే సామర్థ్యమే అధికంగా ఉంటుంది’’ అని ఆయన విశ్లేషించారు. ‘‘మనం చైనాను శిక్షించాలని ప్రయత్నిస్తే, అది వెనక్కి తగ్గదు. అమెరికా ఆంక్షల విషయంలో చైనా ఎలా ప్రతిస్పందించిందన్న విషయాన్ని, ఇందుకు సంబంధించి అమెరికాలో పరిణామాలను మనం ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి’’ అని ఆయన అన్నారు. ఆంక్షల విధింపు వల్ల లాభంకన్నా నష్టాలే ఎక్కువనే అన్నారు. రష్యాపై ఆంక్షల విధింపు ద్వారా అమెరికా, యూరోపియన్ యూనియన్లు ఎలాంటి ప్రతికూల పర్యవసానాలను ఎదుర్కొంటున్నాయో కూడా మనం గమనించాలని అన్నారు. చౌక కాబట్టే కొంటున్నాం... భారతదేశం దిగుమతి చేసుకునే అనేక ఉత్పత్తులకు చైనా చౌకైన సరఫరాదారు కాబట్టే భారత్ బీజింగ్ నుండి కొనుగోలు చేస్తోందని పనగారియా చెప్పారు. భారతదేశం ఎగుమతి చేయాలనుకుంటున్న వస్తువులకు చైనా మంచి ధరను అందించబోదని అన్నారు. ఇక్కడే మనం అమెరికా వంటి వాణిజ్య భాగస్వాములకు మన వస్తువులను భారీగా అమ్మడంపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. దీని ఫలితంగా చైనాతో వాణిజ్య లోటు– అమెరికాతో వాణిజ్య మిగులుతో భర్తీ అవుతుందని అన్నారు. వెరసి చైనాతో వాణిజ్యలోటు తీవ్రత వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదన్నారు. ఏటేటా భారీ వాణిజ్యలోటు భారత్– చైనాల మధ్య వాణిజ్య లోటు (ఎగుమతులు–దిగుమతుల మధ్య వ్యత్యాసం) ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–అక్టోబర్ మధ్య కాలంలో 51.5 బిలియన్ల డాలర్లకు చేరుకుంది. 2021–22లో ఈ లోటు 73.31 బిలియన్ డాలర్లు. 2020–21లో 44.03 బిలియన్లతో పోల్చితే వాణిజ్యలోటు భారీగా పెరగడం గమనార్హం. తాజా ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్–అక్టోబర్ మధ్య చైనా దిగుమతులు 60.27 బిలియన్ డాలర్లు. ఎగుమతులు 8.77 బిలియన్ డాలర్లు. క్యాడ్పై ఇప్పటికి ఓకే... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) భారత్ కరెంట్ ఖాతా లోటు (క్యాడ్) 2 నుండి 3 శాతం (జీడీపీ విలువతో పోల్చి) మధ్య ఉండవచ్చని అన్నారు. ఇది భారత్ తట్టుకునే పరిమితిలో ఉందని పేర్కొన్నారు. ఈ స్థాయి క్యాడ్తో స్థూల ఆర్థిక స్థిరత్వానికి ఎటువంటి ముప్పు ఉండబోదని స్పష్టం చేశారు. 2020–21లో భారతదేశం జీడీపీలో 0.9 శాతం కరెంట్–ఖాతా మిగులు నమోదయ్యింది. 2021–22లో 1.2 శాతం కరెంట్–ఖాతా లోటు ఏర్పడింది. ఒక నిర్దిష్ట కాలంలో ఒక దేశంలోకి వచ్చీ–దేశంలో నుంచి బయటకు వెళ్లే విదేశీ మారకద్రవ్య విలువ మధ్య నికర వ్యత్యాసాన్ని ‘కరెంట్ అకౌంట్’ ప్రతిబింబిస్తుంది. దేశానికి సంబంధిత సమీక్షా కాలంలో విదేశీ నిధుల నిల్వలు అధికంగా వస్తే, దానికి కరెంట్ అకౌంట్ ‘మిగులు’గా, లేదా దేశం చెల్లించాల్సిన మొత్తం అధికంగా ఉంటే ఈ పరిస్థితిని కరెంట్ అకౌంట్ ‘లోటుగా’ పరిగణిస్తారు. దీనిని సంబంధిత సమీక్షా కాలం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువతో పోల్చి శాతాల్లో పేర్కొంటారు. -
కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు వివాదం.. రంగంలోకి కేంద్రం
బెంగళూరు: మహారాష్ట్ర, కర్ణాటక మధ్య సరిహద్దు వివాద పరిష్కారానికి కేంద్రం రంగంలోకి దిగింది. ఇరు రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా వచ్చే వారం భేటీ కానున్నారు. కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై శనివారం మీడియాకు ఈ విషయం చెప్పారు. ‘‘వివాదంపై తమ ప్రభుత్వ వైఖరి, వాస్తవాలను షాకు ఫోన్లో వివరించా. దీనిపై అఖిలపక్షం కూడా నిర్వహిస్తాం’’ అన్నారు. మహారాష్ట్రలో విపక్ష కూటమి మహావికాస్ అగాడీ ఎంపీలు అమిత్ షాను కలవడం తెలిసిందే. ‘‘కర్నాటక బీజేపీ ఎంపీలు సోమవారం అమిత్ షాను కలవనున్నారు. నేనూ ఆయనతో మాట్లాడా. ఇరువురు సీఎంలతో సమావేశం నిర్వహిస్తానని షా చెప్పారు. డిసెంబర్ 14, లేదా 15 తేదీల్లో భేటీ ఉంటుంది’’ అని బొమ్మై వివరించారు. ఇదీ చదవండి: మోదీని ఎదుర్కొనే నేత కేజ్రీవాలా? రాహులా? -
మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దులో ఉద్రిక్తత.. భారీగా బలగాల మోహరింపు
బెంగళూరు: కర్ణాటక, మహారాష్ట్రల మధ్య సరిహద్దు వివాదం మరింత ముదిరింది. సరిహద్దు ప్రాంతం బెళగావిలో ఉద్రిక్త పరస్థితులు నెలకొన్నాయి, ‘కర్ణాటక రక్షణ వేదిక’ ఆధ్వర్వంలో బెళగావిలో ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో మహారాష్ట్ర నంబర్ ప్లేట్స్ ఉన్న వాహనాలే లక్ష్యంగా దాడులు చేపట్టారు ఆందోళనకారులు. ఓ లారీ అద్దలు పగలగొట్టిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. కర్ణాటక రక్షణ వేదిక్కు చెందిన ఆందోళనకారులు సుమారు 400 మంది కర్ణాటక జెండాలు పట్టుకుని ధార్వాడ్ జిల్లా నుంచి బెళగావికి వెళ్లి నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర వాహనలపై రాళ్లు రువ్వారు. పుణె నుంచి బెంగళూరు వెళ్తున్న ఓ లారీ విండ్షీల్డ్, అద్దం ధ్వంసమైంది. ఈ క్రమంలో భారీగా బలగాలను మోహరించింది ప్రభుత్వం. అయినప్పటికీ పోలీసుల మాట పట్టించుకోకుండా రోడ్లపై బైఠాయించారు. మహారాష్ట్ర, కర్ణాటక మధ్య 21 చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. సరిహద్దు గ్రామల వద్ద వెయ్యి మందికిపైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు.. 1960లో భాష ఆధారంగా రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా మరాఠీ మెజారిటీ ప్రాంతాన్ని కర్ణాటకకు తప్పుగా ఇచ్చారని మహారాష్ట్ర వాదిస్తోంది. దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్లింది మహారాష్ట్ర. ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇదిలా ఉంటే మహారాష్ట్రలో తమకు చెందిన కొన్ని గ్రామాలు ఉన్నాయని కర్ణాటక ఇటీవల పేర్కొంది. దీంతో వివాదం మరింత ముదిరింది. మహారాష్ట్రకు చెందిన మంత్రులు చంద్రకాంత్ పాటిల్, శంభురాజ్ దేశాయ్లు బెళగావిలో మంగళవారం పర్యటించేందుకు సిద్ధమయ్యారు. అయితే, వారి పర్యటన శాంతిభద్రతల సమస్య తలెత్తేలా చేస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సోమవారం హెచ్చరించటంతో తమ పర్యటనను రద్దు చేసుకున్నారు. సరిహద్దు వివాదంపై ఈ ఇరువురు మంత్రులను కోఆర్డినేటర్లుగా నియమించింది మహారాష్ట్ర. వారం క్రితం సైతం బెళగావిలో ఓ కళాశాల ఉత్సవాల్లోనూ సరిహద్దు వివాదం తెరపైకి వచ్చింది. ఓ విద్యార్థి కర్ణాటక జెండాను ప్రదర్శించటంతో మరాఠీ విద్యార్థులు అతడిపై దాడి చేశారు. #Maharashtra-#Karnataka border row simmers as protests erupt at the #Belagavi border; security tightened @NehaHebbs reports | #BREAKING_NEWS pic.twitter.com/ohpUguWcif — Mirror Now (@MirrorNow) December 6, 2022 ಸಾವಿರಾರು ಕನ್ನಡಿಗರನ್ನಾ ಪೊಲೀಸರು ವಶಕ್ಕೆ ಪಡೆದುಕೊಂಡಿದ್ದಾರೆ ~ Police have detained 1000's of Pro Kannada Activists#Belagavi #belagavimarvellous pic.twitter.com/BEK2oTf5H8 — Belagavi_marvellous (@Belagavi_BM) December 6, 2022 ఇదీ చదవండి: Bengaluru: బెంగళూరులో దారుణం..ఇటుక రాయితో తల పగలగొట్టి చంపేశారు -
భారత్ విషయంలో జోక్యం వద్దు.. అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన చైనా!
వాషింగ్టన్: అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. భారత్తో సంబంధాల విషయంలో జోక్యం చేసుకోవద్దని అగ్రరాజ్యం అధికారులను చైనా హెచ్చరించిందని యూఎస్ కాంగ్రెస్కు నివేదిక సమర్పించింది. ఈ రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం సమయంలో ఇది జరిగినట్లు పేర్కొంది. వాస్తవాధీన రేఖ విషయంలో భారత్తో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినప్పుడు సరిహద్దు గొడవల ప్రభావం ఇతర ద్వైపాక్షిక సంబంధాలపై ఏమాత్రం పడకుండా చైనా జాగ్రత్తపడిందని పెంటగాన్ నివేదిక స్పష్టం చేసింది. అలాగే ఆ సమయంలో భారత్కు అమెరికా మరింత దగ్గర కాకుండా చేయాలనుకున్నట్లు పేర్కొంది. అందుకే అగ్రరాజ్యం అధికారులకు చైనా వార్నింగ్ కూడా ఇచ్చిందని నివేదిక స్పష్టం చేసింది. సరిహద్దు వివాద సమయంలో 2021 మొత్తం చైనా బలగాలను మోహరిస్తూనే ఉందని, మౌలిక సుదుపాయాల కోసం భారీఎత్తున నిర్మాణాలు చేపట్టిందని నివేదిక వెల్లడించింది. ఇరు దేశాలు వెనక్కి తగ్గకపోవడంతో ఎన్నిసార్లు చర్చలు జరిగినా ఎలాంటి పురోగతి లేదని తెలిపింది. తమ సరిహద్దులో భారత్ నిర్మాణాలు చేపడుతోందని చైనా, తమ భూభాగంలోకి చైనా వస్తోందని భారత్ పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయని పెంటగాన్ నివేదిక పేర్కొంది. 2020 జూన్ 15న గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య భీకర ఘర్షణ చెలరేగింది. గత 46 ఏళ్లలో ఇరు దేశాల మధ్య ఇదే అతిపెద్ద హింసాత్మక ఘటన. ఈ గొడవలో రెండు దేశాలకు చెందిన సైనికులు చనిపోయారు. ఆ తర్వాత ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. చదవండి: పెళ్లైన కొద్ది గంటలకే చనిపోయిన సింగర్.. షాక్లో ఫ్యాన్స్.. -
భారత్-చైనా సరిహద్దు వివాదం.. రష్యా కీలక వ్యాఖ్యలు
సాక్షి,న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దు వివాదంపై రష్యా కీలక వ్యాఖ్యలు చేసింది. ఎట్టిపరిస్థితుల్లోనూ తాము ఈ విషయంలో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ఇది రెండు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక సమస్య అని.. భారత్, చైనానే చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. ఈమేరకు భారత్కు రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ శుక్రవారం తెలిపారు. కొన్ని దేశాలు చైనా పట్ల, మరికొన్ని దేశాలు భారత్ పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయని డెనిస్ అన్నారు. కానీ తాము అలా కాదని చెప్పారు. వీలైనంత త్వరగా రెండు దేశాలు పరస్పర అంగీకారంతో ఓ తీర్మానానికి రావాలని తాము కోరుకుంటున్నామన్నారు. ఈ చర్చల్లో ఇతర దేశాల పాత్ర అవసరం లేదని తాము అభిప్రాయపడుతున్నట్లు వివరించారు. అలాగే ఒప్పందం ప్రకారం భారత్కు తాము అందించాల్సిన ఎస్-400 వాయు క్షిపణి వ్యవస్థ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని స్పష్టం చేశారు. 5 బిలియన్ డాలర్లు విలువ చేసే ఈ ఒప్పందం భారత్-రష్యా మధ్య 2018 అక్టోబర్లో కుదిరింది. దీని ప్రకారం ఐదు యూనిట్ల వాయు క్షిపణి వ్యవస్థలను రష్యా భారత్కు అందించాల్సి ఉంది. 2020లో గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణలు తలెత్తినప్పటినుంచి ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 16 సార్లు కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు జరిపిన అనంతరం సెప్టెంబర్ 12న గోగ్రా హాట్స్ప్రింగ్స్ పెట్రోలింగ్ పాయింట్ 15నుంచి తమ బలగాలను ఉపసంహరించుకున్నాయి. చదవండి: 'పేసీఎం' పోస్టర్పై ఫోటో.. కాంగ్రెస్కు వార్నింగ్ ఇచ్చిన నటుడు -
భారత్-చైనా సరిహద్దు వివాదంలో కీలక పురోగతి
సాక్షి, న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దు వివాదంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేలా కీలక ముందడుగు పడింది. తూర్పు లద్దాక్ పెట్రోలింగ్ పాయింట్ 15 సమీపంలోని గోగ్రా హైట్స్ హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో ఇరుదేశాలు తమ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకున్నాయి. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రక్రియ మంగళవారం పూర్తయినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అంతేకాదు ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కోసం ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక నిర్మాణాలను కూడా ఇరు దేశాల సైన్యాలు తొలగించాయి. దీంతో 2020 మే తర్వాత ఈ ప్రాంతంలో ప్రశాంత వాతావరణం నెలకొంది. గోగ్రా హాట్స్ప్రింగ్స్లో బలగాల ఉపసంహరణ ప్రక్రియ సెప్టెంబర్ 12న పూర్తవుతుందని భారత విదేశీ వ్యవహారాల శాఖ గతవారమే చెప్పింది. భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే కూడా మంగళవారంతో ఈ ప్రక్రియ పూర్తవుతుందని సోమవారం వెల్లడించారు. శనివారం ఈ ప్రాంతాన్ని సందర్శించిన ఆయన తూర్పు లద్దాక్లో పరిస్థితిపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. 2020 మే 5న భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ తలెత్తినప్పటినుంచి తూర్పు లద్దాక్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తర్వాత సరిహద్దులోని ఇతర ప్రాంతాలకు ఈ వివాదం విస్తరించింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇరు దేశాల సైనికాధికారులు రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. మొత్తం 16 సార్లు కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు జరిపారు. పరస్పర ఒప్పందం ప్రకారం ఎట్టకేలకు బలగాల ఉపసంహరణ ప్రక్రియను పూర్తి చేశారు. చదవండి: అందరూ దొంగలే.. అవినీతిపై మంత్రి సంచలన వ్యాఖ్యలు.. -
చైనాకు చెక్ పెట్టడంలో ‘భారత్’ కీలక పాత్ర: అమెరికా
వాషింగ్టన్: ఆసియా పసిఫిక్ ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్న చైనాను ఎదుర్కోవటంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంది అమెరికా. రానున్న భవిష్యత్తులో అమెరికాకు భారత్ కీలకమైన భాగస్వామిగా మారనుందని పేర్కొన్నారు ఆ దేశ నౌకాదళ అడ్మిరల్ మైక్ గిల్డే. ఈ వ్యాఖ్యలు.. చైనా-భారత్ల మధ్య సరిహద్దు వివాదంతో బీజింగ్పై ఒత్తిడి పెంచేందుకు వీలు కలుగనుందనే అమెరికా వ్యూహకర్తల ఆలోచన నేపథ్యంలో చేయటం ప్రాధాన్యం సంతరించుకుందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. వాషింగ్టన్లో నిర్వహించిన ఓ సెమినార్లో ఈ మేరకు అమెరికా-భారత్ సంబంధాలపై మాట్లాడారు నేవి ఆపరేషనల్ అడ్మిరల్ మైక్ గిల్డే. ఇతర దేశాలతో పోలిస్తే భారత్లోనే తాను ఎక్కువ సమయం పర్యటించినట్లు చెప్పారు. అప్పుడే.. సమీప భవిష్యత్తులో అమెరికాకు భారత్ వ్యూహాత్మక భాగస్వామిగా మారనుందని భావించినట్లు తెలిపారు గిల్డే. గత ఏడాది ఐదురోజుల పాటు ఢిల్లీ పర్యటనను గుర్తు చేసుకున్నారు. ‘హిందూ మహాసముద్రం అమెరికాకు చాలా కీలకమైన అంశంగా మారుతోంది. ప్రస్తుతం చైనా-భారత్లు సరిహద్దు వివాదంలో ఉన్నాయి. అది వ్యూహాత్మకంగా చాలా కీలకం. చైనాను తూర్పు, దక్షిణ చైనా సముద్రం, తైవాన్ జలసంధి వైపు చూడాలని బలవంతం చేయొచ్చు. కానీ, భారత్ వైపు చూడాల్సి ఉంది.’ అని పేర్కొన్నారు గిల్డే. ఇండో-యూఎస్ సైనిక విన్యాసాలు.. భారత్-అమెరికాలు సంయుక్తంగా హిమాలయ పర్వతాల్లో నిర్వహించే వార్షిక సైనిక విన్యాసాలు అక్టోబర్లో జరగనున్నాయి. ఈ సైనిక ప్రదర్శనపై చైనా ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడనుందని నిక్కీ ఆసియా పేర్కొంది. యుద్ధ అభ్యాస్ పేరుతో నిర్వహించే ఈ విన్యాసాలు అక్టోబర్ 18 నుంచి 31వ తేదీ వరకు ఉత్తరాఖండ్లో జరగనున్నాయి. ఇదీ చదవండి: తైవాన్ జలసంధి గుండా అమెరికా యుద్ధ నౌకలు -
‘ఈశాన్యం’లో సామరస్యం
సరిహద్దుల విషయంలో తరచు సంఘర్షించుకుంటున్న ఈశాన్య రాష్ట్రాలన్నిటికీ ఆదర్శంగా అస్సాం, మేఘాలయ మంగళవారం ఒక ఒప్పందానికొచ్చాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వా శర్మ, మేఘాలయ ముఖ్యమంత్రి కొన్రాడ్ సంగ్మా మంగళవారం ఈ ఒప్పందంపై సంతకాలు చేయడం ద్వారా అర్ధ శతాబ్దిగా ఇరు రాష్ట్రాల మధ్యా సాగుతున్న సుదీర్ఘ వివాదానికి తెరదించారు. రాష్ట్రాల మధ్య సరిహద్దులపై వివాదా లుండటం ఈశాన్య రాష్ట్రాలకే పరిమితమైన సమస్య కాదు. కానీ ఈశాన్య రాష్ట్రాల్లో అవి తరచు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. ఏళ్ల తరబడి సహాయ శిబిరాల్లో సాధారణ పౌరులు తలదాచు కోవడం అక్కడ కనబడుతుంది. అస్సాం–నాగాలాండ్ మధ్య 2014 ఆగస్టులో దాదాపు పక్షం రోజులపాటు ఘర్షణలు చెలరేగి 14 మంది చనిపోగా, అనేకమంది ఆచూకీ లేకుండా పోయారు. గృహదహనాలు సైతం చోటుచేసుకున్నాయి. 1985లో అయితే ఆ రెండు రాష్ట్రాల పోలీసులూ పరస్పరం కాల్పులు జరుపుకోవడంతో వందమంది వరకూ మరణించారు. ఉద్రిక్తతలున్నప్పుడు సంబంధిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంప్రదింపులు జరుపుకోవడం, పరిస్థితులు అదుపు తప్ప కుండా చూడటంలాంటివి చేయకపోవడం వల్ల సమస్యలు మరింత జటిలమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అస్సాం, మేఘాలయ ఒక అవగాహనకు రావడం హర్షించదగ్గ పరిణామం. అస్సాం నుంచి కొన్ని ఇతర రాష్ట్రాల మాదిరే మేఘాలయ కూడా 1972లో విడివడి కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించింది. రెండింటిమధ్యా 885 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. అయితే అప్పర్ తారాబరి, గజంగ్ రిజర్వ్ ఫారెస్టు, బోక్లాపారా, లాంగ్పీ, నాంగ్వా తదితర 12 ప్రాంతాల్లో నిర్ణ యించిన సరిహద్దులు వివాదాస్పదమయ్యాయి. తమకు న్యాయబద్ధంగా చెందాల్సిన ప్రాంతాలను అస్సాంలోనే ఉంచారన్నది మేఘాలయ ఆరోపణ. ఈ కారణంగానే అది అస్సాం పునర్విభజన చట్టం 1972ని సవాల్ చేస్తూ న్యాయస్థానానికి ఎక్కింది. అటు అస్సాం సైతం మేఘాలయ కోరు తున్న స్థానాలు బ్రిటిష్ కాలంనుంచే తమ ప్రాంత అధీనంలో ఉండేవని వాదిస్తూ వస్తోంది. అస్సాంకు కేవలం మేఘాలయతో మాత్రమే కాదు... నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం లతో కూడా సరిహద్దు వివాదాలున్నాయి. ఆ వివాదాలు అనేకసార్లు హింసకు దారితీశాయి. ఇంత క్రితం ఈశాన్య రాష్ట్రాలను ఏలే ముఖ్యమంత్రుల్లో చాలామంది కాంగ్రెస్ వారే అయినా, కేంద్రంలో ఆ పార్టీ నేతృత్వంలోనే చాన్నాళ్లు కేంద్ర ప్రభుత్వాలు కొనసాగినా వివాదాల పరిష్కారానికి అవి ఏమాత్రం తోడ్పడలేదు. పరిస్థితులు అదుపు తప్పినప్పుడు ఉద్రిక్త ప్రాంతాల్లో సీఆర్పీఎఫ్ బలగా లను దించడం, ఉద్యమించే పౌరులపై అణచివేత చర్యలు ప్రయోగించడం మినహా చేసిందేమీ లేదు. అందువల్లే గత యాభైయ్యేళ్లుగా సరిహద్దు సమస్యలు సజీవంగా ఉంటున్నాయి. చొరవ, పట్టుదల, చిత్తశుద్ధి, ఓపిక ఉండాలేగానీ పరిష్కారం కాని సమస్యలంటూ ఉండవు. ఎక్కడో ఒకచోట ప్రారంభిస్తే వివాదాలపై అన్ని పక్షాలకూ అవగాహన ఏర్పడుతుంది. ఇచ్చిపుచ్చు కునే విశాల దృక్ప థాన్ని ప్రదర్శిస్తే, స్వరాష్ట్రంలో ఆందోళన చెందుతున్నవారిని ఒప్పించగలిగితే సమస్యలు పటాపంచ లవుతాయి. కానీ ఆ చొరవేది? ఈశాన్య రాష్ట్రాలు భౌగోళికంగా చైనా, మయన్మార్, బంగ్లాదేశ్ వంటి దేశాలతో సరిహద్దులను పంచుకుంటాయి. మిలిటెంట్ సంస్థలు ఆ దేశాల సరిహద్దుల వద్ద ఆశ్రయం పొందుతూ ఈశాన్య రాష్ట్రాల్లో తరచూ దాడులకు దిగడం రివాజు. ప్రభుత్వాలు తమ సమ యాన్నంతా శాంతిభద్రతలకే వెచ్చించే పరిస్థితులుండటం మంచిది కాదు. అందుకే ఆలస్యంగానైనా అస్సాం, మేఘాలయ రాష్ట్రాల మధ్య ఒక ఒప్పందం కుదరడం సంతోషించదగ్గది. అయితే ఇప్పుడు కుదిరిన ఒప్పందంతోనే అస్సాం, మేఘాలయ మధ్య ఉన్న వివాదాలన్నీ సమసిపోతాయని భావించలేం. మొత్తం 12 అంశాలకు సంబంధించి వివాదాలుంటే ఇప్పుడు ఆరింటి విషయంలో ఒప్పందం కుదిరింది. రాజీ కుదిరిన ప్రాంతాలు మొత్తం సరిహద్దులో 70 శాతం. మిగిలిన 30 శాతంలో 36 చదరపు కిలోమీటర్ల ప్రాంతం ఉంది. అయితే ఈ విషయమై అస్సాంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించినప్పుడు దాదాపు అన్ని పార్టీలూ ప్రభుత్వ ముసా యిదాపై వ్యతిరేకత వ్యక్తం చేశాయి. ‘ఇచ్చిపుచ్చుకునే’ పేరుతో మేఘాలయకు ఉదారంగా ఇస్తున్నదే ఎక్కువనీ, ఆ రాష్ట్రం మాత్రం బెట్టు చేస్తున్నదనీ ఆ పార్టీలు విమర్శించాయి. అయితే అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లోని రాజకీయ పక్షాలు ఒకటి గుర్తుంచుకోవాలి. సమస్యను నాన్చుతూ పోవడం వల్ల అవి మరింత జటిలమవుతాయి. ఏళ్లు గడిచేకొద్దీ కొరకరాని కొయ్యలుగా మారతాయి. ఒకపక్క బ్రహ్మపుత్ర నది ఏటా ఉగ్రరూపం దాలుస్తూ జనావాసాలను ముంచెత్తుతుంటుంది. ఈశాన్య రాష్ట్రాల్లో ఈనాటికీ మౌలిక సదుపాయాలు అంతంతమాత్రమే. అక్కడ తగినన్ని పరిశ్రమలు లేవు. యువకులకు ఉపాధి అవకాశాలు కూడా తక్కువ. ఆ ప్రాంత అభివృద్ధికంటూ చేసే వ్యయంలో సామాన్యులకు దక్కేది స్వల్పమే. ఈ పరిస్థితులు ఎల్లకాలం ఇలాగే ఉండటం మంచిది కాదు. ఇప్పుడు కుదిరిన ఒప్పందం ఎలాంటి అడ్డంకులూ లేకుండా సవ్యంగా సాగిపోవాలనీ, ఇతర అంశాలపై కూడా సాధ్యమైనంత త్వరగా రెండు రాష్ట్రాలూ అంగీకారానికి రావాలనీ ఆశించాలి. నాగాలాండ్, అరుణాచల్ప్రదేశ్, మిజోరం సైతం సరిహద్దు వివాదాల పరిష్కారానికి ఇదే మార్గంలో కృషి చేస్తే ఈశాన్యం ప్రశాంతంగా మనుగడ సాగించగలదు. -
50 ఏళ్ల వివాదానికి చరమగీతం
న్యూఢిల్లీ: సుదీర్ఘ కాలంగా అపరిష్కరితంగా ఉన్న సరిహద్దు వివాదానికి అసోం, మేఘాలయ రాష్ట్రాలు చరమ గీతం పాడాయి. 50 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న తమ సరిహద్దు వివాదాల పరిష్కారానికి సంబంధించిన చారిత్రక ఒప్పందంపై రెండు రాష్ట్రాలు అంగీకారానికి వచ్చాయి. అసోం ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా మంగళవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖతో పాటు రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 70 శాతం సరిహద్దు వివాదం పరిష్కారం ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. ఒప్పందంపై ఇరువురు ముఖ్యమంత్రులు సంతకాలు చేయడాన్ని ‘చరిత్రాత్మక రోజు’గా వర్ణించారు. ఈ ఒప్పందం ద్వారా ఇరు రాష్ట్రాల మధ్య 70 శాతం సరిహద్దు వివాదం పరిష్కారమైందని వెల్లడించారు. ఈశాన్య ప్రాంతంలో శాంతి, సంస్కృతి పరిరక్షణ, అభివృద్ధిపై దృష్టి సారించిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. సామరస్య పరిష్కారం ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న 884.9 కిలోమీటర్ల సరిహద్దులో ఆరు చోట్ల సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న వివాదాన్ని ఈ ఒప్పందం పరిష్కరించనుంది. ఈ ఆరు ప్రాంతాల్లో 36 గ్రామాలు ఉండగా.. 36.79 చదరపు కిలోమీటర్ల వివాదానికి సంబంధించి ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం అసోం 18.51 చదరపు కి.మీ. ప్రాంతాన్ని తమ అధీనంలో ఉంచుకుని మిగిలిన 18.28 చదరపు కి.మీ. ప్రాంతాన్ని మేఘాలయకు ఇస్తుంది. (క్లిక్: గూర్ఖాల్యాండ్ డిమాండ్ను వదిలిన మోర్చా) 50 ఏళ్ల వివాదం 1972లో అస్సాం నుంచి మేఘాలయను విభజించినప్పటి నుంచి రెండు రాష్ట్రాల మధ్య ఈ వివాదం కొనసాగుతోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం చొరవతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందుకు రావడంతో సమస్య పరిష్కారమైంది. కాగా, అసోం సీఎంతో పాటు ప్రధాని మోదీ, అమిత్ షాలకు మేఘాలయ ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. (క్లిక్: యోగి ఆదిత్యనాథ్ వద్దే హోంశాఖ) -
పాక్లో బలపడుతున్న ఉగ్రమూకలు
పాకిస్తాన్ ఉగ్రవాదులకు అడ్డా అనేది కొత్త విషయం కాదు. దశాబ్దాలుగా భారత్కు వ్యతిరేకంగా సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. తీవ్రవాదులకు పాక్ సురక్షిత స్థావరంగా మారిందని అమెరికా సహా చాలాదేశాలు ఎంతోకాలంగా చెబుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టులో అఫ్గానిస్తాన్లో తాలిబన్లు అధికారాన్ని హస్తగతం చేసుకోవడం... ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులకు నూతనోత్తేజాన్ని ఇచ్చింది. ఆఫ్గానిస్తాన్ను తీవ్రవాదలకు సురక్షిత స్థావరం కానివ్వకూడదని, వారికెలాంటి ఆర్థిక సహాయం అందకూడదని... తాలిబన్లతో కుదిరిన ఒప్పందంలో అమెరికా, నాటోదళాలు స్పష్టం చేశాయి. భారత్తో పాటు మిగతా దేశాలూ ఇదే కోరుతున్నాయి. అయితే అఫ్గాన్తో పాటు పొరుగున్న పాక్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు... భారత్కు ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి. అతివాద ఇస్లామిక్ ఉద్యమాన్ని నడుపుతున్న తెహ్రీక్– ఇ– లబ్బాయిక్ పాకిస్తాన్ (టీఎల్పీ) ముందు ఈ నవంబరులో పాక్లోని ఇమ్రాన్ఖాన్ ప్రభుత్వం పూర్తిగా లొంగిపోయింది. మహ్మద్ ప్రవక్త గౌరవానికి ఎట్టి పరిస్థితుల్లో భంగం కలగనివ్వకూడదు, దైవదూషణకు పాల్పడే వారికి మరణశిక్ష విధిస్తున్న పాక్ చట్టాలను గట్టిగా బలపరచడం... ఈ రెండు టీఎల్పీ సిద్ధాంతాల్లో ముఖ్యమైనవి. 2015లో ఏర్పాటైంది. పంజాబ్ ఫ్రావిన్సులో దీనికి గట్టి పునాదులు, జనాదరణ ఉన్నాయి. దీన్ని రాజకీయ లబ్ధికి ఇమ్రాన్ ఖాన్, మిలటరీ ఉపయోగించుకున్నాయి. ఇమ్రాన్తో చేతులు కలిపిన అతివాదశక్తులు 2018 సార్వత్రిక ఎన్నికల్లో ఉదారవాద భావాలున్న నవాజ్ షరీఫ్ను గద్దెదింపడంలో సఫలమయ్యాయి. ప్రధాని పదవి చేపట్టిన ఇమ్రాన్... తర్వాత టీఎల్పీ నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో టీఎల్పీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించారు. అయితే అక్టోబరులో ఈ సంస్థ వేలాది మందితో ఇస్లామాబాద్ ముట్టడికి బయలుదేరడంతో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. 20 మంది పోలీసులు చనిపోయారు. సైన్యాన్ని దింపుతామని హెచ్చరికలు జారీచేసినా... తర్వాత తెరవెనుక ఏ శక్తులు పనిచేశాయో టీఎల్పీతో పాక్ ప్రభుత్వం రాజీ కుదుర్చుకుంది. ఉగ్రవాద సంస్థల జాబితా నుంచి టీఎల్పీని తొలగించింది. టీఎల్పీ చీఫ్ హఫీజ్ మొహమ్మద్ సాద్ను జైలు నుంచి విడుదల చేసింది. కేసులను ఎత్తివేయడానికి అంగీకరించింది. స్తంభింపజేసిన బ్యాంకు అకౌంట్లను పునరుద్ధరించింది. అతివాద భావాలున్న ఈ సంస్థ శ్రేణుల నుంచి జైషే మొహమ్మద్ (జేఈఎం), లష్కరే తోయిబా (ఎల్ఈటీ) లాంటి ఉగ్రసంస్థలు రిక్రూట్మెంట్లు చేసుకునే ప్రమాదం పొంచివుంది. పాక్లో అతివాద శక్తులు బలపడటం... భారత్కు ఆందోళన కలిగించే విషయమే. భావజాల వ్యాప్తితో ప్రమాదం తాలిబన్లు.. ప్రపంచం ఒత్తిడి మేరకు ఆఫ్గాన్కే పరిమితమైనా... వారి ప్రభుత్వంలో భాగమైన హక్కానీ నెట్వర్క్ అలా కాదు. భారత్లో సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్న సంస్థలకు దీనినుంచి మద్దతు తప్పకుండా లభిస్తుంది. అలాగే మరో ఉగ్రసంస్థ ఐసిస్–కె కూడా కశ్మీర్ను విముక్తం చేయాలని ఆగస్టులో ప్రకటన చేసింది. ఇకపై ఉగ్రసంస్థలు కశ్మీర్పై దృష్టి సారిస్తాయి. తదుపరి లక్ష్యంగా చేసుకుంటాయి. తాలిబన్ల విజయంతో ఈ ఉగ్రసంస్థలు ద్విగుణీకృత ఉత్సాహంతో చొరబాటు యత్నాలు మొదలుపెట్టాయని రక్షణశాఖలోని విశ్వసనీయవర్గాల సమాచారం. భారత్లో అతివాద భావాజాలన్ని వ్యాప్తిచేయడానికి ఇవి ప్రయత్నిస్తాయి. పాక్ గూడఛార సంస్థ (ఐఎస్ఐ) అండతో పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్ర కార్ఖానాలను నడుపుతున్న లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్లతో పాటు ఐసిస్ కూడా రిక్రూట్మెంట్ల మీద దృష్టి సారిస్తాయి. గతంతో పోలిస్తే ఇంటర్నెట్ ఇప్పుడు బాగా విస్తృతమైంది. సోషల్ మీడియాలో పోస్టుల ఆధారంగా అతివాద భావాలున్న యువతను గుర్తించి .. వారితో టచ్లోకి వస్తాయి. ‘జిహాద్’ పవిత్ర కార్యమంటూ నూరిపోసి ఉగ్రవాదం వైపు మళ్లిస్తాయి. ఎన్ఐఏ ఇప్పటికే కశ్మీర్తో పాటు కేరళ తదితర ప్రాంతాల్లో రిక్రూట్మెంట్లపై ప్రత్యేక నిఘా పెట్టింది. గతంలో తాలిబన్లు అధికారంలో (1996–2021) ఉన్న ఐదేళ్లలో కశ్మీర్లో ఉగ్రదాడుల్లో 5,715 సాధారణ పౌరులు మరణించగా... తర్వాత 20 ఏళ్లలో (2001– 2021 అక్టోబరు వరకు) 3,194 మంది చనిపోయారు. తాలిబన్లు అధికారంలో ఉంటే కశ్మీర్ మిలిటెన్సీ పెరిగినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఎడమ వైపు గ్రాఫ్లో ఆ వివరాలను చూడొచ్చు. కశ్మీర్లో అలజడికి యత్నాలు తాలిబన్లు అధికారం చేపట్టగానే.. ఉగ్రవాద సంస్థల నైతిక స్థైర్యం పెరిగిపోయింది. దీని ప్రభావం కశ్మీర్లో అక్టోబరు, నవంబరు నెలల్లో స్పష్టంగా కనిపించింది. సాధారణ ప్రజలను అకారణంగా పొట్టనబెట్టుకొని... భయోత్పాత వాతావరణాన్ని సృష్టించడానికి తీవ్రవాద సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. స్కూలు టీచర్లు, శ్రీనగర్లో ప్రముఖ మెడికల్ షాపును నిర్వహించే కశ్మీర్ పండిట్ను, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలను... ఇలా పలువురిని ఉగ్రమూకలు కాల్పిచంపాయి. ఈ ఏడాదిలో నవంబరు 15 నాటికి కశ్మీర్లో 40 మంది సాధరణ పౌరులు ఉగ్రదాడులకు బలయ్యారని కేంద్ర ప్రభుత్వం గతనెల 30న రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపింది. ఇందులో ఎక్కువగా అక్టోబరు– నవంబరులోనే జరిగాయి. అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం... నవంబరులో 5,500 మంది సాయుధ బలగాల(సీఆర్పీఎఫ్–3,000, బీఎస్ఎఫ్–2,500)ను అదనంగా జమ్మూ కశ్మీర్కు పంపింది. శీతాకాలంలో దట్టంగా మంచు కురుస్తుంది.. దూరాన ఉన్నవి ఏవీ కనపడని వాతావరణం ఉంటుంది కాబట్టి పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి చొరబాటు యత్నాలూ పెరిగాయి. దీన్ని అడ్డుకోవడానికి నెలరోజుల పాటు భారత ఆర్మీ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. పలువురు చొరబాటుదారులను కాల్చి చంపింది. అలాగే ఉగ్రవాద సానుభూతిపరులు, మస్తిష్కాలను కలుషితం చేస్తూ కాలేజీల్లో యువతను ఉగ్రవాదం వైపు మళ్లించే వారినీ గుర్తించేందుకు జమ్మూ కశ్మీర్ పోలీసు యంత్రాంగ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఆర్థిక మూలాలను దిగ్భందం చేస్తోంది. కన్సల్టెన్సీల పేరిట పాక్లో వైద్య కళాశాలల్లోని సీట్లను కశ్మీర్ విద్యార్థులకు వేర్పాటువాద సంస్థ హురియత్ కాన్ఫరెన్స్ నాయకులు అమ్ముతూ... వచ్చే నిధులను ఉగ్ర కార్యకలాపాలకు మళ్లిస్తున్నారని గుర్తించారు. ఆగస్టులో నలుగురు హురియత్ నేతలను అరెస్టు కూడా చేశారు. మొత్తానికి కశ్మీర్లో ఉగ్రవాదుల యాక్టివిటీ పెరిగింది. – నేషనల్ డెస్క్, సాక్షి -
సరి‘హద్దు’లు సామరస్యమేనా?
అస్సాం, మిజోరం మధ్య సరిహద్దు సమస్య చిలికిచిలికి గాలి వానలా మారింది. ఏకంగా కాల్పుల వరకు వెళ్లి అస్సాం పోలీసులు, సామాన్యులను బలితీసుకుంది. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో సరిహద్దు వివాదాలు ఉన్నాయి. వివాదాలను పరిష్కరించాల్సిన కేంద్రం చోద్యం చూస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఏడేళ్ల క్రితం ఏర్పడ్డ తెలంగాణకూ సరిహద్దున ఉన్న పలు రాష్ట్రాల నుంచి వివాదాలు ఉన్నాయి. తెలంగాణ, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో పలుమార్లు వివాదాలు జరిగాయి. వికారాబాద్లో అంతర్రాష్ట్ర సరిహద్దు గ్రామాలైన బషీరాబాద్ మండలం క్యాద్గిరా, కర్ణాటకలోని సేడం తాలూకా పోతంగల్ మధ్య కాగ్నా నది ప్రవహిస్తోంది. నదీ తీరంలో ఇసుక తవ్వకాల విషయమై ఇరు రాష్ట్రాల మధ్య పలుమార్లు వివాదాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో 2018లో ఇరు రాష్ట్రాలకు చెందిన సరిహద్దు జిల్లాల కలెక్టర్లు సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయించారు. తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దుల్లోనైతే విచిత్ర పరిస్థి తులు నెలకొని ఉన్నాయి. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలానికి చెందిన 14 గ్రామాలను ఇప్పటికీ రెండు రాష్ట్రాల ప్రభుత్వం తమ పరిధిలోనివే నని చెబుతూ ఉంటాయి. 1983 ఫిబ్రవరిలో రెండు రాష్ట్రాల అధికారులు ఈ గ్రామాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందినవని నిర్ణయం తీసుకొని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చేర్చారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా రాజుర ఎమ్మెల్యే వామనరావు చాటప్ మహారాష్ట్ర శాసనసభలో ఈ అంశంపై మాట్లాడారు. ఈ గ్రామాలపై నిర్ణయం తీసుకునే హక్కు కేంద్రానికి మాత్రమే ఉంటుందని, మరాఠి మాట్లాడేవారు ఎక్కువగా ఉన్నందున మహారాష్ట్రలోనే ఉంచాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఈ గ్రామాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఇస్తూ జారీ చేసిన కేబినెట్ ఉత్తర్వులను రద్దు చేస్తూ, 1996లో బీజేపీ –శివసేన ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. మహారాష్ట్ర ప్రభుత్వానికి ఈ గ్రామాలపై హక్కు లేదంటూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. దీంతో మహా రాష్ట్ర సుప్రీంకోర్టుకు వెళ్లింది. సరిహద్దు సంగతి తేల్చేవరకూ రెండు రాష్ట్రాలూ ఈ గ్రామాల ప్రజల బాగోగులు చూసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అస్సాం–మిజోరం విషయంలో కేంద్ర ప్రభుత్వం సమస్యను ఆయా రాష్ట్రాలే పరిష్కరించుకోవాలని, కేవలం తాము సహాయకారిగా మాత్రమే పనిచేస్తామని లోక్సభలో ప్రకటించింది. ఇది సరైంది కాదు. తెలంగాణ ప్రభుత్వం సరిహద్దున ఉన్న రాష్ట్రాలతో సరిహద్దు సమస్యల పరిష్కారానికి అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలి. అన్ని సమస్యలకూ పూర్తిస్థాయి పరిష్కారం దొరకక పోవచ్చు. ప్రయత్నలోపం జరగకుండా చూసుకోవాలి. - ఫిరోజ్ ఖాన్ వ్యాసకర్త, సీనియర్ జర్నలిస్ట్ -
Assam-Mizoram: సరిహద్దు వివాదంలో కొత్త ట్విస్ట్
డిస్పూర్: అసోం–మిజోరం సరిహద్దు వివాదానికి సంబంధించి చెలరేగిన హింసలో ఐదుగురు పోలీసులు మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా ఇరు రాష్ట్రాల సరిహద్దు వివాదంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మపై మిజోరాంలో హత్యాయత్నం కేసు నమోదయ్యింది. సీఎంతో పాటు మరో నలుగురు పోలీసు ఉన్నతాధికారులపై కూడా ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ) అనురాగ్ అగర్వాల్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీఐజీ) కచార్ దేవోజ్యోతి ముఖర్జీ, కచార్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చంద్రకాంత్ నింబాల్కర్, ధోలై పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఉద్దీన్, నీహ్లయా మీద ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. ఈ సందర్భంగా ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ.. ‘‘సరిహద్దు పట్టణానికి సమీపంలో మిజోరాం, అసోం పోలీసు బలగాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల తరువాత సోమవారం సాయంత్రం రాష్ట్ర పోలీసులు వైరంగ్టే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. కచార్ డిప్యూటీ కమిషనర్ కీర్తి జల్లి, కచార్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ సన్నీడియో చౌదరిపై కూడా అదే అభియోగాల కింద కేసులు నమోదు చేశాం’’ అని తెలిపారు. వీరితో పాటు మరో 200 మంది అసోం పోలీసు సిబ్బందిపై కూడా కేసులు నమోదు చేసినట్లు సదరు అధికారి పేర్కొన్నారు. మిజోరాం సరిహద్దులోని అసోం జిల్లాలు కచర్, హైలకండీలో అక్టోబర్ 2020 నుంచి ఉద్రిక్తతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో తరచుగా ఇళ్లు తగలబెట్టడం, భూమిని ఆక్రమించుకోవడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రెండు ఈశాన్య రాష్ట్రాలు 164.6 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్నాయి. అసోంలోని కచార్, హైలకండీ, కరీంగంజ్ జిల్లాలు.. మిజోరంలోని కొలాసిబ్, మమిత్, ఐజ్వాల్ సరిహద్దును పంచుకుంటున్నాయి. ప్రాదేశిక సరిహద్దుకు సంబంధించి రెండు రాష్ట్రాలు భిన్నమైన వివరణలు వెల్లడిస్తున్నాయి . 1875 లో గిరిజనులను బాహ్య ప్రభావం నుంచి కాపాడటానికి రూపొందించిన ఒక అంతర్గత రేఖ వెంబడి తమ సరిహద్దు ఉందని మిజోరాం విశ్వసిస్తుండగా.. అస్సాం 1930 లలో చేసిన జిల్లా సరిహద్దు ద్వారా వెళుతుంది. -
శత్రుత్వం కన్నా మిత్రత్వం మిన్న..
శత్రుత్వాన్ని శాశ్వతీకరించడం చాలా సులభం. సరిహద్దుకు ఇరువైపులా ఉన్న పక్షాలకు యుద్ధాలు రాజకీయ ప్రయోజనాలను తీసుకురావచ్చు కానీ ఆర్థిక, భౌగోళిక, చారిత్రక సత్యాలు ఎంతో విలువైనవి. చైనా జాతి చైతన్యంలో శతాబ్దాలుగా భారత్ ఒక భాగమై ఉంటూ వస్తోంది. చరిత్ర, హిమాలయన్ అనుసంధానం రీత్యా భారత్, చైనా ప్రజల మధ్య శత్రుత్వం శాశ్వతంగా ఉంటుందన్న అభిప్రాయాలు నేడు తిరస్కరణకు గురవుతున్నాయి. పైగా, భౌగోళిక రాజకీయాలు, పాలకుల పేరాశలు, సరిహద్దు వివాదాలు వంటివాటిని కఠిన వాస్తవాల ప్రాతిపదికన నిశితంగా విశ్లేషించాల్సి ఉంది. అతిపెద్ద పొరుగుదేశాల్లోని దాదాపు 300 కోట్ల మంది ప్రజల మధ్య సంబంధాలను కొద్దిమంది నేతలకు, వారి సలహాదార్లకు విడిచిపెట్టడం ప్రశ్నించాల్సిన విషయమే. చైనా ప్రెసిడెంట్ షి జిన్పింగ్ ఇటీవల టిబెట్ లోని నింగ్చి మెయిన్లింగ్ విమానాశ్రయంలో దిగి, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు సమీపంలోని లాసాకు బుల్లెట్ ట్రెయిన్లో ప్రయాణించడం రెండు అంశాలపై ఆసక్తి కలిగించింది. ఒకటి, పాక్షికంగా పూర్తిచేసిన ప్రమాదకరమైన 1,629 కిలోమీటర్ల రైల్ ప్రాజెక్టు. ఇది చైనాలో అతిపెద్ద ఇన్నర్ సిటీ అయిన చెంగ్డును పశ్చిమాన ఉన్న లాసాతో అనుసంధానిస్తుంది. ఈ మార్గంలోని చాలా భాగం అతిపెళుసైన, ఎల్తైన, భూకంపాలు చెలరేగే, పర్యావరణపరంగా ప్రమాదకరమైన భూభాగంనుంచి వెళుతుంది. ఈ ప్రాజెక్టులో తొలి భాగమైన చెంగ్డు నుంచి యాన్ మార్గం దాదాపుగా పూర్తయింది. నింగ్చి నుంచి లాసా మార్గం కూడా పూర్తయింది. అయితే యాన్ నుంచి నింగ్చి మార్గంలోనే అత్యంత పొడవైన మధ్య భాగం నిర్మాణం పూర్తి కావడానికి మరొక పదేళ్ల సమయం పట్టవచ్చు. రెండోది, దక్షిణ టిబెట్కి షీ జిన్పింగ్ యాత్ర... భారత్తో సరి హద్దు ఘర్షణకు చైనా జాతీయ ఎజెండాలో ఆయన అత్యంత కీలక స్థానం ఇస్తున్నట్లు సూచించింది. టిబెట్ పరిణామాలను అధ్యయనం చేస్తున్న బ్రిటిష్ స్కాలర్ రాబర్ట్ బర్నెట్ దీన్నే నొక్కి చెబుతున్నారు. చైనా ప్రభుత్వ మీడియా ఇప్పుడు భారత్కు ప్రాధాన్యమివ్వడం ద్వారా బర్నెట్ అంచనా మరోసారి నిజమైంది. 1980లలో రాజీవ్గాంధీ నుంచి 2014లో నరేంద్ర మోదీ వరకు భారత ప్రధానుల హయాంలో భారత్ సైనిక సామగ్రి పరంగా సాధించిన విజయాలను విస్తృతంగా గుర్తిస్తూ చైనా మీడియా ఇప్పుడు స్పందిస్తోంది. భారత్, చైనా మధ్య శత్రుత్వం కొనసాగే అవకాశముందని, ఘర్షణలకు సన్నద్ధమయ్యే ఆవశ్యకత కూడా ఉంటుందని వాస్తవికవాదులు తప్పక గుర్తించాల్సి ఉంది. అదేసమయంలో పవిత్రమైన హిమాలయాలను ఒక భారీ శ్మశాన వాటికగా మార్చిన ఆ విషాద ఉన్మాదాన్ని, యుద్ధం అనే ప్రమాదకరమైన ప్రయోగం ద్వారా హిమాలయా పర్వతాలకు, నదులకు నష్టం కలిగించే పర్యవసానాలను కూడా వీరు మనసులో ఉంచుకోవాల్సి ఉంది. శత్రుత్వాన్ని శాశ్వతీకరించడం చాలా సులభం. సరిహద్దుకు ఇరువైపులా ఉన్న పక్షాలకు యుద్ధాలు రాజ కీయ ప్రయోజనాలను తీసుకురావచ్చు కానీ ఆర్థిక, భౌగోళిక, చారి త్రక సత్యాలను లెక్కించడం కూడా విలువైనదేనని చెప్పాలి. చైనా జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ (జీఏసీ) అంచనా ప్రకారం లద్దాఖ్ ఘర్షణలు చెలరేగిన 2020 సంవత్సరం నాటికి భారత్, చైనా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 87.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. గత సంవత్సరంలో ఇది 5.6 శాతానికి పడిపోయింది. చైనా నుంచి భారత్కు దిగుమతులు 66.7 శాతంగా నమోదయ్యాయి. 2016 నుంచి చూస్తే ఇది అతితక్కువ శాతం అన్నమాట. దాదాపు 10.8 శాతం పతనమైందన్నమాట. కానీ చైనాకు భారత్ ఎగుమతులు 2020లో 16 శాతం పెరిగి 20.86 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందాయి. వీటిలో ఇనుప ఖనిజం ఎగుమతులు అత్యధికంగా పెరిగాయి. భారత వాణిజ్య లోటు అయిదేళ్ల స్వల్పానికి అంటే 45.8 శాతానికి పడిపోయింది. కానీ ఈ సంవత్సరం ఇరుదేశాల మధ్య వాణిజ్యంలో మళ్లీ పెరుగుదల కనిపించింది. చైనా ప్రభుత్వ పత్రిక ‘గ్లోబల్ టైమ్స్ చైనా’ జీఏసీ నివేదికనుంచి పేర్కొన్నట్లుగా గత సంవత్సరంలో డాలర్ల రూపంలో పోలిస్తే, భారత్తో చైనా వాణిజ్యం 2021 జనవరి నుంచి జూన్ నెలలో 62.7 శాతానికి పెరిగింది. అంటే చైనా–భారత్ వాణిజ్యం వృద్ధి మొత్తం చైనా వాణిజ్యంలో రెండో స్థానం ఆక్రమించింది. దక్షిణా ఫ్రికా తొలి స్థానంలో ఉంది. కోవిడ్–19 మహమ్మారిని ఎదుర్కొనేం దుకు అవసరమైన చైనా సరఫరాలు భారత్కు దిగుమతి కావడం బాగా పెరగడం దీంట్లో భాగమేనని చెప్పాలి. మరీ ముఖ్యంగా 2020 సంవత్సరంలో చైనా విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో 23 వేలమంది భారతీయ విద్యార్థులు విభిన్న కోర్సులలో చేరి అధ్యయనం సాగించారు. వీరిలో 21 వేలమంది డాక్టర్లు అయ్యేందుకు తమ పేర్లు నమోదు చేసుకోవడం విశేషం. 2021లో కూడా ఈ సంఖ్య మారలేదు. పైగా, చైనాలోని భారత్ లేక బహుళ జాతి సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్న బారతీయుల సంఖ్య కూడా తక్కువగా లేదు. చైనాలో మొత్తం 36 వేలమందికి పైగా భారతీయులు పనిచేస్తున్నారని అంచనా. ఈ సంఖ్య తక్కువేమీ కాదు. ఎర్రచైనా పెట్టుబడిదారీ విధానాన్ని పరిధికి మించి అధికంగా అనుమతించినట్లయితే, మతపరమైన, తాత్వికపరమైన విశ్వాసాలకు సంబంధించిన వాస్తవాలను కూడా అది ఆమోదిస్తున్నట్లు కనిపిస్తోంది. కన్ఫ్యూసియనిజంను గౌరవించి, చైనా ప్రభుత్వం స్వీకరించగా, మావో కాలంలో బౌద్ధమతం పట్ల సర్వసాధారణంగా అవలంబించిన సైద్ధాంతిక అవహేళనను నేటి చైనాలో అనుసరిస్తున్న సూచనలు లేవు. ఇప్పుడు టిబెట్లోనే కాకుండా చైనాలో ప్రతి చోటా బుద్ధిజం చొచ్చుకుపోయిందని పలువురు భారతీయులు గుర్తించడంలేదు. సంఖ్యలకు ప్రాధాన్యం ఉందంటే, చైనాలో పెరుగుతున్న లక్షలాది బౌద్ధమతానుయాయులు భారత్లో కంటే ఎక్కువ సంఖ్యలో ఉండి ప్రభావం చూపగలరన్నది వాస్తవం. బౌద్ధమత గ్రంథాలను పొందడం కోసం శతాబ్దాల క్రితం అత్యంత కష్టభూయిష్టమైన ప్రయాణాలు సాగించి భారత్కు చేరుకున్న చైనా పండితులు... అదృశ్యమయ్యే అవకాశమున్న భారతీయ చరిత్రను తమ రచనల్లో నమోదు చేశారు. ఇలాంటి పండితుల్లో సుప్రసిద్ధుడైన హుయాన్త్సాంగ్ భారతదేశంలో అత్యంత గౌరవం పొందాడు. చైనాలో అత్యంత జనాదరణ పొందిన 16వ శతాబ్దం నాటి చారిత్రక గాథ ‘గ్జియుజి లేదా పశ్చిమానికి పయనం’ అనే కథ... హుయాన్త్సాంగ్ 7వ శతాబ్దిలో భారత్కి సాగించిన తీర్థయాత్రను అత్యంత ఉత్కంఠతో, సరదాతో కూడిన సాహస యాత్రకు కాల్పనిక రూపమిచ్చిందని బహుశా చాలామంది భారతీయులకు తెలీకపోవచ్చు. 2015లో మరణించిన ఆంథోనీ సి. యు అనే అమెరికన్ పండితుడు ‘ఎ జర్నీ టు ది వెస్ట్’ అనే ఈ పుస్తకానికి చేసిన నాలుగు సంపుటాల అనువాదం ఇంగ్లిష్ అనువాదాల్లో అత్యుత్తమ రచనగా నిలిచిపోయింది. బుద్ధుడికి, జర్నీ టు ది వెస్ట్ గ్రంథానికి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే చైనా జాతి చైతన్యంలో శతాబ్దాలుగా భారత్ ఒక భాగమై ఉంటూ వస్తోంది. ఈ చరిత్ర రీత్యా, హిమాలయన్ వారధి రీత్యా భారత ప్రజలు, చైనా ప్రజల మధ్య శత్రుత్వం శాశ్వతంగా ఉంటుందన్న అభిప్రాయాలు ఇప్పుడు తిరస్కరణకు గురవుతున్నాయి. మరోవైపున భౌగోళిక రాజకీయాలు, పాలకుల పేరాశలు, సరిహద్దు వివాదాలు వంటి వాటిని కఠిన వాస్తవాల ప్రాతిపదికన నిశితంగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కాలమిస్టులకు అందుబాటులో ఉండవు. కాబట్టి వీటి నుంచి విశాల దృష్టితో కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఒకటి, అతిపెద్ద పొరుగు దేశాల్లోని దాదాపు 300 కోట్ల ప్రజల మధ్య సంబంధాలను కొద్దిమంది నాయకులకు, వారి సలహాదార్లకు విడిచిపెట్టడం అన్నది ఆలోచించదగిన కీలక విషయం. రెండు.. అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియాతో కూడిన క్వాడ్ కూటమిలో కొన్ని ఉపయోగకరమైన అంశాలు కూడా ఉండవచ్చు. ఎందుకంటే, ఒకటి అమెరికా నేతృత్వంలో, మరొకటి చైనా నేతృత్వంలో ఉండే రెండు శిబిరాల మధ్య ఆసియా, ప్రపంచ ప్రజలను విడదీసే ప్రయత్నాలు చెడు ఫలితాలను ఇవ్వవచ్చు. కాబూల్ ప్రభుత్వం తెలుసుకున్నట్లుగా అగ్రరాజ్యాలు శాశ్వతమైన రక్షణ ఛత్రాలను అందించవు. అందుకే, క్వాడ్ కూటమి కంటే ఎక్కువగా, భారతీయ స్వతంత్ర పౌరుల స్వేచ్ఛ, రాజకీయ నేతలను ఓటు వేసి సాగనంపే భారత పౌరుల సామర్థ్యం అనేవి చైనా ప్రజలకు అత్యంత ప్రభావం కలిగించే సందేశాన్ని ఇస్తాయి. చైనా ప్రజలు ఈర‡్ష్య పడేవిధంగా, భారత్లో ఉన్న మనం మన నేతలను పరిహాసం చేయవచ్చు, అవహేళన చేయవచ్చు లేదా ఇంటికి సాగనంపవచ్చు కూడా. మనం ఈ ప్రయోజనాన్ని కూడా కోల్పోయామంటే ఇక ఆట ముగిసినట్లే. -రాజ్మోహన్ గాంధీ వ్యాసకర్త ప్రస్తుతం ఇలినాయ్ యూనివర్సిటీలో బోధకుడుగా ఉన్నారు -
Assam- Mizoram: 150 ఏళ్ల వివాదం
దేశాల మధ్య సరిహద్దు వివాదాలు సహజం కానీ రాష్ట్రాల మధ్య సరిహద్దులు భగ్గుమనడమేంటి ? భూభాగం గురించి సీఎం మధ్య మాటల యుద్ధం ఎందుకు? దాని వెనుకనున్న అసలు కారణాలు తెలుసుకోవాలంటే 150 ఏళ్ల కిందట నాటి చరిత్ర మూలాల్లోకి వెళ్లాలి. ఈశాన్య రాష్ట్రాలంటే పచ్చని కొండలు, సుందరమైన మైదాన ప్రాంతాలు, దట్టమైన అటవీ ప్రాంతాలు, నదీనదాలు.. ఇలా ప్రకృతి అందాలే మన కళ్ల ముందు కదులుతాయి. అవే అటవీ ప్రాంతాలు అస్సాం, మిజోరం మధ్య అగ్గిరాజేశాయి. బ్రిటీష్ పాలకులు తమ దేశం వెళుతూ వెళుతూ కశ్మీర్ను రావణ కాష్టం చేయడమే కాకుండా ఈశాన్య రాష్ట్రాల సరిహద్దుల్ని కూడా వివాదాస్పదం చేశారు. దేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అతి పెద్ద భూభాగమైన అస్సాం నుంచి మిగిలిన ప్రాంతాలను వేరు చేస్తూ మణిపూర్, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం రాష్ట్రాలు 1963–1987 మధ్య కాలంలో ఏర్పాటు అయ్యాయి. ఆ ప్రాంత ప్రజల సంస్కృతి, అలవాట్లు, చరిత్రను ఆధారంగా చేసుకొని ఆనాటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. మిజోరం ప్రాంతాన్ని 1972లో కేంద్ర పాలిత ప్రాంతం చేయగా, 1987లో పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కట్టబెట్టారు. అస్సాంలోని మూడు జిల్లాలైన కచర్, హైలకండి, కరీంగంజ్లు, మిజోరంలోని మూడు జిల్లాలైన అయిజ్వాల్, కొలాసిబ్, మమిత్లు 165 కిలోమీటర్ల పొడవునా సరిహద్దుల్ని పంచుకుంటున్నాయి. బ్రిటీష్ ప్రభుత్వం ఏం చేసింది ? అసోం–మిజోరం మధ్య ఉన్న 165 కి.మీ. సరిహద్దు ప్రాంతం వివాదాస్పదం కావడానికి బ్రిటీష్ పాలకులు ఇచ్చిన రెండు వేర్వేరు నోటిఫికేషన్లే కారణం. లుషాయి కొండలు (అవే ఇప్పటి మిజోరం), కచర్ మైదాన ప్రాంతాల (అస్సాం భూభాగం) మధ్య సరిహద్దుల్ని నిర్ణయిస్తూ 1875లో తెల్లదొరలు ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. 1873 నాటి బెంగాల్ తూర్పు సరిహద్దు నియంత్రణ చట్టం ప్రకారం ఇన్నర్ లైన్ పర్మిట్ (ఐఎల్పీ) పద్ధతి ప్రకారం సరిహద్దుల్ని గుర్తించారు. అప్పట్లో మిజోరం ప్రాంతంలో నేతల్ని కూడా సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ 1933లో మణిపూర్ లుషాయి కొండల సరిహద్దుల్ని నిర్ణయిస్తూ మరో నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో లుషాయి కొండలు అంటే ప్రస్తుత మిజోరంలో కొంత భాగం అస్సాం, మణిపూర్లలో కలిసింది. అయితే 1933 నోటిఫికేషన్ను తమని సంప్రదించకుండా చేశారన్న కారణంతో మిజో నేతలెవరూ దానిని అంగీకరించలేదు. 1875లో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం 1,318 చదరపు కిలో మీటర్ల భూభాగం తమదేనని మిజోరం వాదిస్తోంది. ఆ ప్రాంతంలో ఇప్పటికీ మిజో ప్రజలు వ్యవసాయం చేస్తున్నారు. మరోవైపు అస్సాం ప్రభుత్వం మిజోరం తమ భూభాగాన్ని దురాక్రమణ చేస్తోందని ఆరోపిస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ ఘర్షణలు ఇలా.. ►అస్సాం, మిజోరం మధ్య ఘర్షణలు ఇప్పుడు కొత్తేం కాదు. 1994లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. మిజోరం తమ భూభాగంలోకి చొరబడుతోందంటూ అస్సాం ప్రభుత్వం గగ్గోలు పెట్టింది. అప్పట్నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్యకు ప్రయత్నించినా ఫలించలేదు. ►2018లో మిజోరంకు చెందిన విద్యార్థి సంఘాలు వివాదాస్పద భూభాగంలో రైతులు విశ్రాంతి తీసుకోవడానికి కొన్ని చెక్క భవనాలు నిర్మించడంతో మళ్లీ వివాదం రాజుకుంది. అస్సాం పోలీసులు వాటిని ధ్వంసం చేశారు. ►2020 అక్టోబర్లో ఇరపక్షాల మధ్య జరిగిన ఘర్షణలతో ఎందరో గాయపడ్డారు. మిజోరంకు గుండెకాయ వంటిదైన జాతీయ రహదారి 306 ఏకంగా 12 రోజులు మూత పడింది. ►జూన్లో మిజోరం ప్రజలు ఆ భూభాగంలో వ్యవసాయం చేస్తూ ఉండడంతో మళ్లీ ఇరు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ßోంమంత్రి అమిత్ షా పర్యటన జరిగిన మర్నాడే ఘర్షణల్లో ఐదుగురు అస్సాం పోలీసులు, ఒక పౌరుడు మరణించడంతో విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. సరిహద్దు వివాదం పరిష్కా రానికి ఇప్పుడు అస్సాం ప్రభుత్వం సుప్రీం జోక్యాన్ని కోరుతోంది. -
చట్టం చెబితే భూమినీ వదిలేస్తాం
న్యూఢిల్లీ/సల్చార్/గువాహటి: అస్సాం, మిజోరం రాష్ట్రాల సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. పార్లమెంట్ చట్టం చేస్తే రాష్ట్రానికి చెందిన భూమిని సైతం వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. సరిహద్దుల్లోని రక్షిత అటవీ ప్రాంతాన్ని ఆక్రమణల నుంచి, విధ్వంసం నుంచి రక్షించుకునేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు చెప్పారు. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లోని లైలాపూర్ వద్ద సోమవారం జరిగిన కాల్పుల్లో అస్సాంకు చెందిన ఐదుగురు పోలీసులు, ఒక పౌరుడు మృతి చెందగా మరో 60 మంది గాయపడిన విషయం తెలిసిందే. సరిహద్దుల్లో రిజర్వు ఫారెస్టులో రోడ్ల నిర్మాణం, పోడు వ్యవసాయం కోసం అడవుల నరికివేతను కొనసాగనీయమన్నారు. అటవీ ప్రాంతంలో నివాసాలు లేవు. ఒక వేళ ఉన్నాయని మిజోరం ఆధారాలు చూపితే, వాటిని వెంటనే తొలగిస్తాం’ అని స్పష్టం చేశారు. పార్లమెంట్ చట్టం చేస్తే అస్సాంకు చెందిన ప్రాంతాన్ని వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. అప్పటి వరకు ఒక్క అంగుళం భూమిని కూడా ఆక్రమణకు గురికానివ్వం’ అని ఆయన అన్నారు. నేడు హోం శాఖ కార్యదర్శి సమావేశం అస్సాం, మిజోరం సరిహద్దుల్లో హింసాత్మక ఘటనలపై చర్చించేందుకు రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో బుధవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా చర్చలు జరపనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో ఒక రాజీ ఫార్ములా కుదిరే చాన్సుంది. ఘటనకు నిరసనగా సరిహద్దుల్లోని అస్సాంలోని చచార్ జిల్లా ప్రజలు మిజోరం వైపు వాహనాలను రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకున్నారు. హింసాత్మక ఘటనలకు హోం మంత్రి అమిత్ షా వైఫల్యమే కారణమని కాంగ్రెస్ నేత రాహుల్ ధ్వజమెత్తారు. -
హద్దులు దాటిన వ్యవహారం
ఒక రాష్ట్ర పోలీసులు, మరో రాష్ట్ర పోలీసులపై కాల్పులు... ట్విట్టర్లో పొరుగు రాష్ట్రాల సీఎంల పరస్పర ఆరోపణలు... ఇది అంతర్ రాష్ట్ర వివాదమా? అంతర్జాతీయ యుద్ధమా? ఈశాన్య భారతావనిలో అస్సామ్, మిజోరమ్ల సరిహద్దులో సోమవారం రేగిన ఘర్షణలు... మిజోరమ్ కాల్పుల్లో అయిదుగురు అస్సామీ పోలీసులు అమరులవడం... 60 మంది గాయపడడం... ఇవన్నీ చూశాక ఎవరైనా అనే మాట – అనూహ్యం... అసాధారణం. రాష్ట్రాల హద్దులపై దశాబ్దాలుగా సాగుతున్న వివాదం చివరకు ఈ స్థాయిలో ఇరువైపులా భద్రతాదళాలకూ, పౌరులకూ మధ్య హింసాకాండగా మారడం మునుపెన్నడూ ఎరుగని విషయం. కేంద్ర హోమ్ మంత్రి రంగంలోకి దిగి, ఇరు రాష్ట్రాల సీఎంలకూ ఫోన్ చేసి, హితవు పలకాల్సి వచ్చిందంటే, పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈశాన్య రాష్ట్రాల సరిహద్దు వివాదాలు ఈనాటివి కావు. కాకపోతే, ఈసారి ఇలా అంతర్జాతీయ సరిహద్దు యుద్ధాల లాగా పోలీసుల పరస్పర కాల్పులకు విస్తరించడమే విషాదం. ఈశాన్య ప్రాంత సీఎంలతో కేంద్ర హోమ్ మంత్రి షిల్లాంగ్లో సమావేశమై, హద్దుల వివాదాలపై చర్చించి వెళ్ళిన రెండు రోజులకే ఇలా జరగడం మరీ విచిత్రం. మిజోరమ్ భూభాగాన్ని అస్సామ్ ఆక్రమించిందని ఆ ప్రభుత్వం ఆరోపిస్తోంది. రిజర్వు అటవీ భూమిని మిజోరమ్ గ్రామీణులు కబ్జా చేస్తున్నారని అస్సామ్ ప్రత్యారోపణ చేస్తోంది. అస్సామ్ గడ్డపై మిజోలు తరతరాలుగా స్థిరపడి, సాగు చేస్తున్నంత మాత్రాన ఆ ప్రాంతం మిజోలది అయిపోదన్నది అస్సామీల వాదన. తాజా ఘటనలో అస్సామ్ పోలీసులే అత్యుత్సాహంతో సరిహద్దు గస్తీ కేంద్రాన్ని ఆక్రమించి, సామాన్యులపై జులుం చేశారని మిజోరమ్ నేరారోపణ. ఇది ఇంతటితో ఆగేలా లేదు. అటవీ భూమిలో అంగుళం కూడా ఆక్రమించుకోనివ్వకుండా సుప్రీమ్ కోర్టులో పిటిషన్ వేస్తామని అస్సామ్ సీఎం గర్జిస్తున్నారు. అగ్నికి ఆజ్యం పోస్తూ, 4 వేల మంది కమెండోలను హద్దుల్లో మోహరిస్తామని విస్మయకర ప్రకటన చేశారు. గమ్మత్తేమిటంటే, మూడున్నర కోట్ల పైగా జనాభా ఉన్న అస్సామ్ను పాలిస్తున్న ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, కేవలం 11 లక్షల పైచిలుకు జనసంఖ్య ఉన్న మిజోరమ్ ముఖ్యమంత్రి జొరామ్థాంగా – ఇద్దరూ కేంద్రంలోని పాలక బీజేపీ తానుగుడ్డలే! అస్సామ్ సాక్షాత్తూ బీజేపీ ఏలుబడిలో ఉంటే, మిజోరమ్లోని పాలక ‘మిజో నేషనల్ ఫ్రంట్’ (ఎంఎన్ఎఫ్) సైతం కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏలో భాగం. చరిత్రలోకి వెళితే – 1972 వరకు మిజోరమ్ సైతం అస్సామ్లో భాగమే. ఆదిలో కేంద్రపాలిత ప్రాంతంగా ప్రత్యేక గుర్తింపు పొందిన మిజోరమ్, 1987లో రాష్ట్ర హోదా పొందింది. మిజోరమ్తో దాదాపు 164 కిలోమీటర్ల సరిహద్దున్న అస్సామ్ పెద్దన్న పాత్ర పోషిస్తుండడం మిజోరమ్కు మొదటి నుంచి ఇబ్బందిగా మారింది. 1875లో తమ నేతలను సంప్రతించి, బ్రిటీషు కాలంలో చేసిన హద్దులనే అనుసరించాలని మిజోలు కోరుతున్నారు. కానీ, ఆ తరువాత 1933లో చేసిన హద్దులదే తుది మాట అని అస్సామ్ వాదన. ఇదీ ఎంతకీ తెగని పీటముడిగా మారింది. దీనికి సమర్థమైన రాజకీయ పరిష్కారం అవసరం. కానీ, సాయుధ పోలీసు పరిష్కారం కనుక్కోవాలని తాజాగా ప్రయత్నించి స్థానిక పాలకులు ఘోర తప్పిదానికి పాల్పడ్డారు. నిజానికి, సహజసిద్ధమైన వనరులతో, అడవులు, పర్వతాలు, లోయలతో సంక్లిష్టమైన భౌగోళిక ప్రాంతం ఈశాన్య భారతం. ఫలితంగా అక్కడి 7 రాష్ట్రాల మధ్య కచ్చితమైన సరిహద్దుల నిర్ణయం మరింత క్లిష్టమైనది. అందుకే అక్కడి భూములు, హద్దులపై ఇన్ని వివాదాలు! దేశానికి స్వాతంత్య్రం రాక ముందు నుంచీ, వచ్చిన తరువాతా అక్కడ వివిధ జాతుల మధ్య సంఘర్షణలు తలెత్తుతూనే ఉన్నాయి. కానీ, తాజా కాల్పుల లాంటివి మాత్రం అరుదు. ఒకే దేశంలో అంతర్భాగమైన రెండు రాష్ట్రాలు కాల్పులు జరుపుకొనే పరిస్థితికి రావడం ఇన్నేళ్ళుగా సమస్యలను మురగబెట్టి, ద్వేషాన్ని పెంచిపోషించిన స్థానిక, కేంద్ర పాలకుల వైఫల్యమే! అందుకే ఇప్పుడు ఆమోదయోగ్యమైన హద్దుల నిర్ణయంతో ఘర్షణలకు ముగింపు పలకడంపై పాలకులు దృష్టి పెట్టక తప్పని పరిస్థితి వచ్చింది. సున్నితమైన అంతర్జాతీయ సరిహద్దులకు దగ్గరలో ఉన్న ఈశాన్య రాష్ట్రాలలో అంతర్ రాష్ట్ర సంఘర్షణ ఎలా చూసినా అవాంఛనీయం. ఆందోళనకరం. 1995 నుంచి అస్సామ్, మిజోరమ్ల చర్చల్లో కేంద్రం పాలుపంచుకున్నా, ఫలితం రాలేదు. అయితే, వచ్చే 2024 కల్లా ఈశాన్యంలో హద్దుల వివాదాలకు ఫుల్స్టాప్ పెడతామని పాలకుల మాట. అది నిజం చేయాలంటే, కేవలం స్థానిక ఓటుబ్యాంకు రాజకీయాలతో కాక, సువిశాలమైన దేశప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, దౌత్యనైపుణ్యం చూపే నేతలు ఇప్పుడు అవసరం. వారికి కావాల్సిందల్లా సమస్యల సమగ్ర అవగాహన, చిత్తశుద్ధి! ఆ యా ప్రాంతీయుల్ని భాగస్వాములను చేసి, స్థానిక సెంటిమెంట్లనూ, ఆలోచనలనూ పరిగణనలోకి తీసుకొంటే దీర్ఘకాలిక పరిష్కారం, ప్రజల మధ్య శాశ్వత సామరస్యం సాధించడం అసాధ్యమేమీ కాదు. రాష్ట్ర పాలకులతో అది సాధ్యం కాకపోతే, కేంద్రమే పెద్దమనిషి పాత్ర పోషించాలి. అయితే అంతకన్నా ముందుగా తమను పరాయివారిగా చూస్తున్నారని భావిస్తున్న ఈశాన్యంలోని స్థానిక జాతులకూ, అభివృద్ధికి నోచుకోని సుదూర ప్రాంతాలకూ వారూ ఈ దేశంలో అంతర్భాగమనే నమ్మకం కలిగించాలి. పరస్పర సోదరభావం పెంపొందించాలి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, పడమటి చివరి నుంచి ఈశాన్యం కొస వరకు దేశాన్ని తమ ఏలుబడిలోకి తెచ్చుకోవాలని కోరుకొనే పాలకుల నుంచి ఆ మాత్రం ఆశిస్తే అది తప్పు కాదేమో! -
మాటకి కట్టుబడి వెనుదిరిగిన చైనా సైన్యం
న్యూఢిల్లీ: శిబిరాలు తీసేస్తున్నారు. జెట్టీలు ధ్వంసం చేస్తున్నారు. హెలిప్యాడ్లను తొలగిస్తున్నారు. యుద్ధ ట్యాంకుల్ని వెనక్కి మళ్లిస్తున్నారు. భారత్, చైనా మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి గత 10 నెలలుగా నెలకొన్న ఉద్రిక్తతల నివారణకు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం చైనా అందరినీ ఆశ్చర్య పరిచేలా వాయువేగంతో ఉపసంహరణ పూర్తి చేస్తోంది. పాంగాంగ్ సరస్సుకి తూర్పుగా ఫింగర్ 8వైపు చైనా దళాలు మళ్లుతూ ఉంటే, భారత్కు చెందిన దళాలు ఫింగర్ 3లోని శాశ్వత శిబిరంలో ఇకపై ఉంటారు. ఈ మధ్య ప్రాంతాన్ని నో మ్యాన్ ల్యాండ్ కింద ప్రకటించారు. అంటే ఆ ప్రాంతంలో ఏ దేశ సైనికులు కూడా పెట్రోలింగ్ నిర్వహించకూడదు. అనుకున్న మాటకి కట్టుబడి చైనా సైన్యం వెనక్కి మళ్లుతుండడానికి సంబంధించిన పలు వీడియోలను భారత ఆర్మీ మంగళవారం విడుదల చేసింది. చైనా వాయువేగంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తోంది. ఉపసంహరణ కార్యక్రమం ఇదే స్థాయిలో కొనసాగితే పాంగాంగ్ సరస్సు వెంబడి ఉన్న సైనిక ఉపసంహరణ మరొక్క రోజులోనే ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలున్నాయి. గత ఏడాది ఏప్రిల్ నుంచే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మొదలయ్యాయి. చైనా జవాన్లు జూన్లో భారత్ సైనికులపై దాడికి దిగడంతో సంక్షోభం మరింత ముదిరింది. చర్చల ద్వారా ఈ సమస్యని పరిష్కరించుకోవాలని భారత్ భావించినా చైనా మొదట్లో సహకరించలేదు. ఎట్టకేలకు గత నెల 24న తొమ్మిదో రౌండు కమాండర్ స్థాయి చర్చల్లో బలగాలను ఉపసంహరించాలన్న నిర్ణయానికి వచ్చారు. గత వారంలోనే ఈ ఉపసంహరణ కార్యక్రమం మొదలైనప్పటికీ డ్రాగన్ దేశం ఇప్పుడు మరింత ముమ్మరం చేసింది. క్రేన్ల సాయంతో అన్నీ ధ్వంసం చైనా తమ దేశానికి చెందిన 200 యుద్ధ ట్యాంకుల్ని కేవలం ఎనిమిది గంటల వ్యవధిలో 100 కి.మీ. మళ్లించారు. తూర్పు లద్దాఖ్లోని పాంగాంగ్ సదస్సు ఉత్తర, దక్షిణ తీరాల వెంబడి ఉన్న బలగాలు వెనక్కి మళ్లుతున్నాయి. గత పది నెలలుగా ఎదురెదురుగా ఉన్న ఇరు దేశాలకు చెందిన సైన్యం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన శిబిరాలను ఎత్తేస్తున్నారు. యుద్ధ ట్యాంకులను వెనక్కి మళ్లిస్తున్నారు. భారత ఆర్మీ విడుదల చేసిన వీడియోల్లో చైనా సైనికులు జెట్టీలు, బంకర్లను ధ్వంసం చేసి బరువైన ఆయుధాలను మోసుకుంటూ పర్వతాల వెంబడి నడుచుకుంటూ వెళుతున్న దృశ్యాలు ఉన్నాయి. ఇక శిబిరాలను తొలగించడానికి భారీ క్రేన్లను వాడుతున్నారు. ఏప్రిల్ 2020 తర్వాత నిర్మించిన కట్టడాలన్నీ ధ్వంసం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని భారతీయ ఆర్మీ నిరంతరం పర్యవేక్షిస్తోంది. మానవరహిత ఏరియల్ వెహికల్స్, ఉపగ్రహ ఛాయా చిత్రాల ద్వారా ఈ మొత్తం ప్రక్రియను రికార్డు చేస్తోంది. తొలి విడత బలగాల ఉపసంహరణ పూర్తి కావడానికి మరో రెండు వారాలు పట్టే అవకాశం ఉందని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ప్రసుతం ఇరువైపులకి చెందిన యుద్ధట్యాంకులు 100 వరకు మోహరించి ఉన్నాయి. చైనా వాయువేగంతో ఉపసంహరణ పూర్తి చేస్తున్నప్పటికీ ఆ దేశాన్ని పూర్తిగా నమ్మే పరిస్థితి అయితే లేదు. ‘‘చైనా వెనక్కి తగ్గింది. కానీ ఆ దేశం పట్ల ఉన్న అపనమ్మకం ఇంకా అలాగే ఉంది’’అని రాజకీయ విశ్లేషకుడు పథిక్రిత్ పైనే అన్నారు. -
మోదీ వద్దకు సరిహద్దు వివాదం
సాక్షి, ముంబై: రోజురోజుకు ముదురుతున్న మహారాష్ట్ర–కర్నాటక సరిహద్దు వివాదంపై చర్చించేందుకు శివసేన త్వరలో ప్రధాని నరేంద్రమోదీ నుంచి అపాయింట్మెంట్ తీసుకోవాలని భావిస్తోంది. అదేవిధంగా ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సాయంతో నరేంద్రమోదీతో భేటీ అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు శివసేన ఎంపీ వినాయక్ రావుతే స్పష్టంచేశారు. స్వాతంత్య్రం, ఆ తరువాత ప్రత్యేక మహారాష్ట్ర ఏర్పడిన తరువాత మొదలైన మహారాష్ట్ర–కర్నాటక సరిహద్దు వివాదం రోజురోజుకు తీవ్రరూపం దాల్చసాగింది. ఇటీవల కాలంలో ఈ వివాదం మరింత రాజుకుంది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరస్పరంగా ఘాటు వ్యాఖ్యలు చేసుకునే వరకు దారితీసింది. మూడు రోజుల కిందట కర్నాటకకు చెందిన ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు మరింత రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం తమదేనని, కర్నాటకలో భాగమని చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చుపెట్టే విధంగా మారాయి. దీంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతోపాటు మహా వికాస్ ఆఘాడీ ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు ఆగ్రహానికి గురయ్యారు. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలు పూర్తికాగానే ఫిబ్రవరి మొదటి వారంలో ప్రధాని మోదీతో శివసేన ఎంపీలు భేటీ కానున్నారు. వీరితోపాటు శరద్ పవార్ కూడా భేటీ అవుతారు. అంతకుముందు సరిహద్దు వివాదం అంశాలపై సమగ్రంగా చర్చించేందుకు శివసేన ఎంపీలందరూ శరద్ పవార్తో భేటీ అవుతారు. ఈ భేటీలోనే ప్ర«ధాని మోదీతో భేటీ అయ్యేందుకు శరద్ పవార్ మధ్యవర్తిగా వ్యవహరించాలని శివసేన ఎంపీలు విజ్ఞప్తి చేయనున్నారు. ఒకవేళ ప్రధాని కార్యాలయం నుంచి అపాయింట్మెంట్ లభిస్తే శరద్ పవార్తో కలిసి శివసేన ఎంపీలందరు మోదీతో చర్చించనున్నట్లు రావుతే తెలిపారు. -
అస్సాం, మిజోరాంల సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు
గువాహటి: అస్సాం, మిజోరాం మధ్య ఉద్రిక్తత పెరుగుతోంది. చెట్లు నరికేసే విషయంలో రెండు రాష్ట్రాల్లోని సరిహద్దు గ్రామాల్లో ఇటీవల ఘర్షణ చోటుచేసుకుంది. తాజాగా తమ భూభాగంలో మిజోరాం పోలీసులు బంకర్ల లాంటి నిర్మాణాలు చేపట్టారని అస్సాం ప్రభుత్వం ఆరోపించింది. ఈ మేరకు అస్సాంలోని చాచర్ జిల్లా డిప్యూటీ కమిషనర్ కీర్తి జల్లీ అస్సాంలోని కొలాషిబ్ జిల్లా అధికారులకు లేఖ రాశారు. కులిచెరా ప్రాంతంలో ఇలాంటి నిర్మాణాల వల్ల స్థానికంగా శాంతి భద్రతలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తంచేశారు. వాటిని వెంటనే తొలగించాలని కోరారు. జాతీయ రహదారి 306 పక్కన జేసీబీలతో బంకర్లు నిర్మించారని అస్సాం సర్కారు చెబుతోంది. -
మళ్లీ చైనా కాల్పులు
న్యూఢిల్లీ/జమ్మూ: భారత సైనికులను బెదిరించే ఉద్దేశంతో ప్యాంగాంగ్ సరస్సు ఉత్తర తీరం వద్ద చైనా సైనికులు గతవారం మరోసారి గాలిలో కాల్పులు జరిపారు. భారత్, చైనా దేశాల విదేశాంగ మంత్రులు జైశంకర్, వాంగ్ యిల మధ్య రష్యా రాజధాని మాస్కోలో చర్చలు జరగడానికి ముందు ఫింగర్ 4 రిడ్జ్లైన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. వ్యూహాత్మకంగా కీలకమైన ఆ ప్రాంతంలో ఉన్న భారత జవాన్ల వైపు భారీ సంఖ్యలో చైనా సైనికులు దూకుడుగా వచ్చారని, అయితే, భారత జవాన్లు దీటుగా ఎదుర్కోవడంతో వెనక్కు వెళ్లారని వివరించాయి. వెనక్కు వెళ్తూ.. భారత సైనికులను బెదిరించేందుకు గాలిలో 100 నుంచి 200 రౌండ్లు కాల్పులు జరిపారని వెల్లడించాయి. 45 ఏళ్ల తరువాత తొలిసారి సెప్టెంబర్ 7న తూర్పు లద్దాఖ్లోని చైనా సరిహద్దుల్లో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ప్యాంగాంగ్ సరస్సు దక్షిణ తీరంలోని రెజాంగ్ లా రిడ్జ్లైన్ వద్ద ఉన్న భారత జవాన్లను బెదిరించే లక్ష్యంతో చైనా సైనికులు గాలిలో పలు రౌండ్లు కాల్పులు జరిపారు. మనవాళ్లే మెరుగు తూర్పు లద్దాఖ్లో ప్రతికూల వాతావరణం ఉండే చలి కాలంలో కూడా.. చైనాతో పూర్తి స్థాయి యుద్ధానికి భారత సైన్యం సిద్ధంగా ఉందని ఆర్మీ రిటైర్డ్ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. యుద్ధం తప్పని పరిస్థితులనే చైనా కల్పిస్తే.. సుశిక్షితులైన, సంసిద్ధంగా ఉన్న, మానసికంగా ధృఢంగా ఉన్న భారత బలగాలను వారు ఎదుర్కోవాల్సి ఉంటుందని బ్రిగేడియర్(రిటైర్డ్) హేమంత్ మహాజన్ హెచ్చరించారు. మానసికంగా, శారీరకంగా చైనా సైనికుల కన్నా.. భారత జవాన్లు దృఢమైనవారన్నారు. చైనా సైనికులు ప్రధానంగా పట్టణ ప్రాంతాల నుంచి వచ్చిన సున్నితమైన వారని, విధుల్లో భాగంగా సంక్లిష్ట క్షేత్ర పరిస్థితుల్లో ఎక్కువకాలం ఉన్నవారు కాదని వివరించారు. మొదట బుధవారం ఉదయం ఈ ప్రకటన భారత సైన్యం నార్తర్న్ కమాండ్ ప్రజా సంబంధాల అధికారి(పీఆర్ఓ) నుంచి మీడియాకు వచ్చింది. కానీ, ఆ తరువాత ఆ ప్రకటనలోని అంశాలు నార్తర్న్ కమాండ్ లేదా ఇండియన్ ఆర్మీ అభిప్రాయాలు కావని ఆ పీఆర్ఓ వివరణ ఇచ్చారు. ఈ వివరాలన్నీ పదవీ విరమణ చేసిన బ్రిగేడియర్ హేమంత్ మహాజన్వని వివరించారు. శాంతి, సుస్థిరతకు కట్టుబడి ఉన్నాం భారత్ సరిహద్దుల్లో శాంతి, సుస్థిరతకు కట్టుబడి ఉన్నామని చైనా ప్రకటించింది. భారత్తో కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందాలను గౌరవిస్తున్నట్లు తెలిపింది. అదే సమయంలో తమ దేశ సార్వభౌమత్వానికి, ప్రాదేశిక సమగ్రతకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లోక్సభలో చేసిన ప్రకటనపై స్పందించాలన్న మీడియా ప్రశ్నకు.. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ బుధవారం పై విధంగా స్పందించారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు తాము కారణంకాదని చైనా తెలిపింది. దీర్ఘకాల మోహరింపునకు సిద్ధం బ్రిగేడియర్(రిటైర్డ్) హేమంత్ మహాజన్ వాదన ప్రకారం.. సరిహద్దుల్లో దీర్ఘకాలం మోహరించేందుకు భారత దళాలు సిద్ధమై ఉన్నాయి. లద్దాఖ్ అత్యంత ఎత్తైన పర్వత శిఖరాలున్న ప్రాంతం. ఇక్కడ నవంబర్ తరువాత 40 అడుగుల వరకు మంచు పేరుకుపోయే పరిస్థితి ఉంటుంది. మైనస్ 30 నుంచి మైనస్ 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఇక్కడ సర్వసాధారణం. దానికి తోడు చలిగాలులు పరిస్థితిని మరింత దిగజారుస్తాయి. రోడ్లను మంచు కమ్మేస్తుంది. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లోనూ.. భారత్కు ఉన్న సానుకూల అంశం సుశిక్షితులైన మన సైనికులే. చలి కాలంలో యుద్ధం సాగించేందుకు అవసరమైన అనుభవం మన సైనికులకు ఉంది. స్వల్ప వ్యవధిలోనే రంగంలోకి దిగగల మనోస్థైర్యం కూడా మనవారికి ఉంది. చైనా సరిహద్దుల కన్నా దారుణమైన వాతావరణ పరిస్థితులు ఉండే సియాచిన్లో నెలల తరబడి ఉన్న అనుభవం మన సైనికులకు ఉంది. లద్దాఖ్కు చేరుకునేందుకు ఇప్పటివరకు రెండు మార్గాలు ఉన్నాయి. తాజాగా ‘దార్చా టు లేహ్’ మార్గం అందుబాటులోకి రావడంతో యుద్ధ, సహాయక సామగ్రి తరలింపు మరింత సులభమైంది.పెద్ద సంఖ్యలో ఎయిర్బేస్లు ఉండటం భారత్కు కలసివచ్చే అంశం. -
దురాక్రమణ దుస్సాహసం
మాస్కో: పరస్పర విశ్వాసపూరిత వాతావరణం, దురాక్రమణ రహిత విధానం, అంతర్జాతీయ నిబంధనల అమలు, శాంతియుతంగా విభేదాల పరిష్కారం.. తదితర విధానాలను అవలంబించడం ద్వారానే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) ప్రాంతంలో శాంతి, సుస్థిరత సాధ్యమవుతాయని భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. చైనా రక్షణ మంత్రి జనరల్ వీ ఫెన్ఘీ సమక్షంలోనే రాజ్నాథ్ పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తూర్పు లద్దాఖ్లోని భారత్ సరిహద్దుల్లో తరచుగా దురాక్రమణ దుస్సాహసానికి పాల్పడుతున్న చైనాకు పరోక్ష సందేశంగా దీనిని భావిస్తున్నారు. రష్యా రాజధాని మాస్కోలో శుక్రవారం జరిగిన ఎస్సీఓ రక్షణ మంత్రుల సమావేశంలో రాజ్నాథ్ పాల్గొన్నారు. రెండో ప్రపంచ యుద్ధానికి కారణమైన దురాక్రమణ విధాన దుష్ఫలితాలను ఈ సందర్భంగా రాజ్నాథ్ ఎస్సీఓ సభ్య దేశాలకు గుర్తు చేశారు. ఎస్సీఓలో భారత్, చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, పాకిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ సభ్యదేశాలుగా ఉన్నాయి. ఈ దేశాల మొత్తం జనాభా ప్రపంచ జనాభాలో సుమారు 40% ఉంటుంది. సుమారు గత నాలుగు నెలలుగా తూర్పు లద్దాఖ్లో దురాక్రమణలకు ప్రయత్నిస్తూ చైనా భారత్ను కవ్విస్తున్న విషయం తెలిసిందే. ఐదు రోజుల క్రితం పాంగాంగ్ సరస్సు దక్షిణ తీరంలోని భారత భూభాగాన్ని ఆక్రమించేందుకు చైనా విఫల యత్నం చేసింది. ‘రెండో ప్రపంచ యుద్ధం ముగిసి, ఐక్యరాజ్య సమితి ఏర్పడి ఈ సంవత్సరంతో 75 ఏళ్లు అవుతుంది. శాంతియుత ప్రపంచం లక్ష్యంగా ఐరాస ఏర్పడింది. ఏకపక్ష దురాక్రమణలకు వ్యతిరేకంగా, దేశాల సార్వభౌమత్వాన్ని, అంతర్జాతీయ నిబంధనలను గౌరవించాలని స్పష్టం చేస్తూ ఐరాస రూపుదిద్దుకుంది’అని రాజ్నాథ్ ఎస్సీఓ సమావేశంలో పేర్కొన్నారు. అన్ని రకాలైన ఉగ్రవాదాన్ని, ఉగ్రవాద సహాయక చర్యలను భారత్ విస్పష్టంగా ఖండిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, ముఖ్యంగా సైబర్ టెర్రరిజానికి వ్యతిరేకంగా ఎస్సీఓ ‘రీజనల్ యాంటీ టెర్రరిజం స్ట్రక్చర్ (ర్యాట్స్)’చేపట్టిన చర్యలను భారత్ ప్రశంసిస్తోందన్నారు. అతివాద, ఉగ్రవాద ప్రచారాన్ని తిప్పికొట్టే దిశగా ఎస్సీఓ తీసుకున్న నిర్ణయాలను భారత్ స్వాగతిస్తోందన్నారు. అంతర్జాతీయంగా స్వేచ్ఛాయుత, పారదర్శక, సమ్మిళిత రక్షణ వ్యవస్థ ఏర్పాటుకు భారత్ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా రాజ్నాథ్ స్పష్టం చేశారు. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోందన్నారు. ఆ ప్రాంతంలోని అన్ని దేశాలతో భారత్కు సత్సంబంధాలున్నాయన్నారు. శాంతియుతంగా విభేదాలను పరిష్కరించుకోవాలని ఆయా దేశాలను విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ‘పీస్ మిషన్’పేరుతో ఉగ్రవాద వ్యతిరేక వార్షిక సదస్సును చేపట్టడంపై రష్యాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలన్నీ విభేదాలను విస్మరించి ఒక్కటి కావాలని రాజ్నాథ్ పిలుపునిచ్చారు. అఫ్గానిస్తాన్ పరిస్థితిపై ఆందోళన అఫ్గానిస్తాన్లో అంతర్గత భద్రత పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని రాజ్నాథ్ పేర్కొన్నారు. ‘అఫ్గాన్ నియంత్రణలో, అఫ్గాన్ నేతృత్వంలో సాగే సమ్మిళిత శాంతి ప్రక్రియకు భారత్ సహకారం అందించడం కొనసాగిస్తుంది. అఫ్గానిస్తాన్ ప్రజలు, ఆ దేశ ప్రభుత్వం ఈ దిశగా చేస్తున్న కృషికి మద్దతునిస్తుంది’అని స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరత నెలకొనాల్సిన అవసరం ఉందన్నారు. ఫిబ్రవరిలో అఫ్గాన్ తాలిబన్లతో అమెరికా కుదుర్చుకున్న శాంతి ఒప్పందం అనంతరం అఫ్గానిస్తాన్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. భారత్, చైనా రక్షణ మంత్రుల భేటీ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ముందడుగు మాస్కో: సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్రమైన నేపథ్యంలో మాస్కోలో భారత, చైనా రక్షణ మంత్రుల మధ్య కీలక భేటీ జరిగింది. మాస్కోలోని ప్రముఖ హోటల్లో శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్, చైనా రక్షణ మంత్రి వీ ఫెన్ఘీ సమావేశమయ్యారు. చర్చల్లో పాల్గొన్న భారత ప్రతినిధి బృందంలో రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్, రష్యాలో భారత రాయబారి వెంకటేశ్ వర్మ కూడా ఉన్నారు. ఈ సమావేశాన్ని సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తొలగించే దిశగా చోటు చేసుకున్న కీలక ముందడుగుగా భావిస్తున్నారు. తూర్పు లద్దాఖ్లోని సరిహద్దుల్లో ఈ సంవత్సరం మేలో తీవ్రస్థాయి ఉద్రిక్తతలు ప్రారంభమైన తరువాత ఇరు దేశాల మధ్య కీలక మంత్రిత్వ స్థాయి ముఖాముఖి చర్చలు జరగడం ఇదే ప్రథమం. గతంలో విదేశాంగ మంత్రి జై శంకర్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో ఫోన్లో చర్చించారు. కానీ, వారిద్దరి మధ్య ముఖాముఖీ భేటీ జరగలేదు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు రాజ్నాథ్, వీ ఫెన్ఘీ రష్యాకు వెళ్లిన విషయం తెలిసిందే. చైనా అభ్యర్థన మేరకే రెండు దేశాల రక్షణ మంత్రుల సమావేశం జరిగిందని భారత ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. -
డ్రాగన్ డ్రామాలకు చెక్!
సాక్షి, న్యూఢిల్లీ : సరిహద్దుల్లో చైనా యథాతథ స్థితిని పునరుద్ధరించే వరకు భారత సేనలు తూర్పు లడఖ్లోని 1,597 కిలోమీటర్ల వాస్తవ నియంత్రణ రేఖ వెంబడే ఉంటాయని డ్రాగన్కు భారత్ తేల్చిచెప్పింది. చైనాతో ద్వైపాక్షిక సంబంధాలకు తూర్పు లడఖ్లోని వివాదాస్పద ప్రాంతాల్లో ఏప్రిల్ 20కి ముందున్న పరిస్థితులు నెలకొనాలని భారత్ షరతు విధించింది. పలుమార్లు డ్రాగన్కు ఇదే విషయం స్పష్టం చేసినా సంప్రదింపుల పేరుతో చైనా సరికొత్త ప్రయత్నాలతో ముందుకొస్తూనే ఉంది. సరిహద్దు వివాదం ద్వైపాక్షిక సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని చైనా గ్రహించేలా తాము చర్యలు చేపడుతున్నామని ప్రతిష్టంభనపై ప్రభుత్వంతో చర్చిస్తున్న అధికారి ఒకరు వెల్లడించారని ఓ జాతీయ వెబ్సైట్ పేర్కొంది. చైనా దూకుడుకు బ్రేక్ వేసేందుకు భారత్ ఇప్పటికే 100కు పైగా చైనా యాప్లను నిషేధించగా, ప్రభుత్వ కాంట్రాక్టులు బీజింగ్కు దక్కకుండా నిబంధనలను మార్చింది. ఇక భారత యూనివర్సిటీలతో భాగస్వామ్యంతో ముందుకొచ్చిన చైనా వర్సిటీలు నిబంధనలను పాటిస్తున్నాయా అనే అంశంపై తాజాగా ప్రభుత్వం దృష్టిసారించింది. చైనాపై భారత్ పలు రకాలుగా ఒత్తిడి పెంచుతున్నా డ్రాగన్ దారికి రాకపోగా సరికొత్త ఎత్తుగడలతో ముందుకొస్తోంది. ఇండో-చైనా ప్రతిష్టంభన సమసిపోయిందని, లడఖ్లో సేనల ఉపసంహరణ పూర్తయిందని ప్రపంచాన్ని నమ్మబలుకుతోంది. అయితే డ్రాగన్ తీరు మార్చుకుని సరిహద్దుల్లో చేపట్టిన సానుకూల చర్యలపై మాట్లాడాలని భారత్ కోరుతోంది. చైనా ఇప్పటికీ పెట్రోలింగ్ పాయింట్ 17, 17 ఏ (గోగ్రా)ల వద్ద, ప్యాంగాంగ్ సరస్సు వద్ద తన సేనలను మోహరించిందని భారత సైన్యం ప్రభుత్వానికి క్షేత్రస్ధాయి పరిస్ధితులను నివేదించింది. చదవండి : చైనాకు మరో దెబ్బ : 2500 ఛానళ్లు తొలగింపు -
డ్రాగన్పై పెద్దన్న ఫైర్
వాషింగ్టన్ : డ్రాగన్పై వీలుచిక్కినప్పుడల్లా విరుచుకుపడుతున్న అమెరికా మరోసారి చైనా తీరుపై మండిపడింది. భూటాన్ భూభాగంపై చైనా తెరపైకి తెచ్చిన వాదన, భారత్ భూభాగంలోకి ఇటీవల చొచ్చుకురావడం చూస్తే డ్రాగన్ ఉద్దేశాలు వెల్లడవుతున్నాయని అగ్రరాజ్యం ఘాటు వ్యాఖ్యలు చేసింది. చైనా దుందుడుకు వైఖరిని ప్రస్తావిస్తూ అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు భారత్-చైనా సరిహద్దు వివాదానికి కేంద్ర బిందువైన తూర్పు లడఖ్లో సేనల ఉపసంహరణ దాదాపు పూర్తయిందని, సరిహద్దుల్లో పరిస్ధితులు సాధారణ స్థితికి చేరుకున్నాయని చైనా పేర్కొనడం పట్ల భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉద్రిక్తతలు సమసిపోయి క్షేత్రస్ధాయిలో పరిస్థితి చక్కబడిందని, సరిహద్దుల్లో సేనల ఉపసంహరణ పూర్తయినట్టేనని భారత్లో చైనా రాయబారి సన్ వెడాంగ్ వెల్లడించారు. అయితే చైనా వాదనతో భారత్ విభేదించింది. సరిహద్దుల్లో సేనల ఉపసంహరణపై కొంత పురోగతి కనిపించినా ఈ ప్రక్రియ ఇంకా పూర్తికాలేదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ స్పష్టం చేశారు. ఈ దిశగా తదుపరి చర్యలు చేపట్టేందుకు ఇరు దేశాల సీనియర్ కమాండర్లు త్వరలో సమావేశమవుతారని చెప్పారు. చదవండి : అక్కడ బలగాల ఉపసంహరణకు చైనా నిరాకరణ -
ఇలాగైతే చైనాతో కటీఫ్!
సాక్షి, న్యూఢిల్లీ : వాస్తవాధీన రేఖ వెంట సేనలను పూర్తిగా ఉపసంహరించేంత వరకూ చైనాతో సాధారణ కార్యకలాపాలు జరగవని రష్యాలో భారత రాయబారి వెంకటేష్ వర్మ స్పష్టం చేశారు. ద్వైపాక్షిక ఒప్పందాలు, ప్రోటోకాల్స్ ప్రకారం నియంత్రణ రేఖ వెంబడి చైనా సైనిక దళాలు పూర్తిగా వెనక్కిమళ్లేంతవరకూ ఆ దేశంతో ఎలాంటి వాణిజ్య, సాధారణ కార్యకలాపాలను పునరుద్ధరించబోమని డ్రాగన్కు స్పష్టం చేశామని రష్యన్ వార్తాసంస్థతో మాట్లాడుతూ వర్మ పేర్కొన్నారు. విస్తరణవాదానికి కాలం చెల్లిందని, ఇది అభివృద్ధి యుగమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను భారత రాయబారి వర్మ గుర్తుచేశారు. భారత్-రష్యాల మధ్య ఉమ్మడి ప్రయోజనాలను ఇరు దేశాలు కాంక్షిస్తున్న క్రమంలో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్ధిరత, ఆర్ధిక సౌభాగ్యం వెల్లివిరుస్తున్నాయని అన్నారు. ఈ ప్రాంత ప్రయోజనాలకు విఘాతం కలిగేలా ఏ ఒక్క దేశం వ్యవహరించరాదని అన్నారు. కాగా గల్వాన్ లోయలో భారత్-చైనా సేనల మధ్య జూన్ 15న జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు మరణించిన నేపథ్యంలో సరిహద్దుల్లో పరిస్ధితిని రష్యాకు భారత్ ఇటీవల వివరించింది. మరోవైపు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సైతం విక్టరీ డే ప్రదర్శనలో పాల్గొనేందుకు జూన్లో మాస్కోను సందర్శించారు. చదవండి : ‘చైనాను మార్చకుంటే అది మనల్ని మింగేస్తుంది’ -
40 వేల మంది చైనా సైనికుల తిష్ట!
న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దు వివాదం విషయంలో భారత వాయుసేన చురుకుగా వ్యవహరించి ప్రత్యర్థికి బలమైన సందేశాన్ని పంపిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ కొనియాడారు. తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో యుద్ధవిమానాలను వేగంగా మోహరించడం ద్వారా వాయుసేన తన యుద్ధ సన్నద్ధతను చాటిందని, తద్వారా పాకిస్థాన్పై భారత్ జరిపిన బాలాకోట్ దాడిని చైనాకు గుర్తు చేసిందని ఆయన బుధవారం ఢిల్లీలో మొదలైన వాయుసేస సదస్సులో అన్నారు. వాయుసేన ఉన్నతస్థాయి అధికారులు ఈ సదస్సులో పాల్గొన్నారు. సార్వభౌమత్వాన్ని కాపాడుకునే విషయంలో దేశ ప్రజలందరి నమ్మకం త్రివిధ దళాలపై ఉందని రాజ్నాథ్ అన్నారు. సరిహద్దులు దాటి మరీ బాలాకోట్పై వాయుసేన జరిపిన దాడిని గుర్తు చేస్తూ వాయుసేన ఈ విషయంలో అత్యంత నైపుణ్యంతో వ్యవహరించిందని అన్నారు. (చైనా వ్యాక్సిన్పై స్పందించిన ట్రంప్) తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో వాయుసేన యుద్ధ విమానాల మోహరింపు ఇలాంటిదేనని మంత్రి పేర్కొన్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలను తగ్గించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను వివరించిన మంత్రి ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకైనా వాయుసేన సిద్ధంగా ఉండాలని కోరారు. శత్రువులను ఎదుర్కొనేందుకు వాయుసేన సన్నద్ధంగా ఉంటుందని సదస్సులో ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బధూరియా స్పష్టం చేశారు. 40 వేల మంది చైనా సైనికుల తిష్ట! తూర్పు లద్ధాఖ్ సెక్టార్లో భారత్–చైనా సరిహద్దు నుంచి తమ బలగాలను వెనక్కి మళ్లిస్తున్నామని పైకి చెబుతున్న చైనా ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. బలగాల మళ్లింపుపై ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని చైనా పీపుల్స్ రిబరేషన్ ఆర్మీ లెక్కచేయడం లేదు. ప్రస్తుతం అక్కడ దాదాపు 40,000 మంది చైనా సైనికులు తిష్ట వేసినట్లు ఓ వార్తా సంస్థ వెల్లడించింది. భారీ ఎత్తున ఆయుధ సామగ్రిని సైతం కలిగి ఉన్నట్లు తెలియజేసింది. భారత్–చైనా కమాండర్ల స్థాయి చర్చలు గత వారంలోనే జరిగాయి. సరిహద్దు ప్రాంతాల నుంచి బలగాలను వెనక్కి తీసుకోవాలని ఇరు దేశాల అధికారులు నిర్ణయించుకున్నారు. అయినా చైనా తన పంథా మార్చుకోవడం లేదు. (చైనా కాన్సులేట్లో పత్రాల కాల్చివేత) -
22 నుంచి వైమానిక ఉన్నతాధికారుల భేటీ
న్యూఢిల్లీ: తూర్పు లద్ధాఖ్లో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్–చైనా సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితిని పూర్తిస్థాయిలో సమీక్షించేందుకు, చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు వైమానిక దళం ఉన్నతాధికారులు ఈ నెల 22వ తేదీ నుంచి మూడు రోజులపాటు సమావేశం కానున్నారు. ఈ భేటీలో ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బదౌరియా, ఏడుగురు కమాండర్ ఇన్ చీఫ్లు పాల్గొంటారని భారత వైమానిక దళం ప్రతినిధి తెలిపారు. చైనా సరిహద్దుల్లో వైమానిక దళం ఇప్పటికే మోహరించింది. మిరేజ్–2000, సుఖోయ్–30, మిగ్–29 తదితర అత్యాధునిక యుద్ధ విమానాలను పలు బేస్ స్టేషన్లలో సిద్ధంగా ఉంచింది. మరోవైపు మొదటి దశ రఫేల్ ఫైటర్లు జెట్లు ఈ మాసాంతంలోనే ఫ్రాన్స్ నుంచి భారత్కు చేరుకోనున్నాయి. ఈ ఫైటర్ జెట్లను లద్ధాఖ్ సెక్టార్లో మోహరించాలని యోచిస్తున్నారు. ఉన్నతాధికారుల సమావేశంలో దీనిపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. -
చైనా సరిహద్దుల్లో కీలక నిర్మాణాల వేగవంతం
సాక్షి, న్యూఢిల్లీ : భారత్-చైనా సరిహద్దు వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో లడఖ్లో 20,000 కోట్ల రూపాయల విలువైన రహదారి ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. రహదారుల ప్రాజెక్టులపై సమీక్షలో భాగంగా కీలక ప్రాజెక్టులన్నింటినీ వేగవంతం చేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధికారులకు సూచించారు. ప్రస్తుతం భారత్-చైనా ప్రతిష్టంభనకు కారణమైన దర్బక్-శ్యోక్-దౌలత్ బేగ్ ఓల్దీ రోడ్ నిర్మాణ పనులనూ వేగవంతం చేయాలని చెప్పారు. ఈ రోడ్డు నిర్మాణాన్ని రెండు నెలల కిందటే భారత్ చేపట్టిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. రోడ్డు నిర్మాణ పనులతో పాటు వాస్తవాధీన రేఖతో అనుసంధానించేలా 30 వంతెనల నిర్మాణాన్నీ వేగవంతం చేయనున్నారు. 30 శాశ్వత వంతెనలు ఇప్పటికే నిర్మాణంలో ఉండగా 20,000 కోట్ల రూపాయల విలువైన రహదారి నిర్మాణ పనులను ముందుకు తీసుకువెళ్లాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. వీటిలో పలు హైవేలు, సొరంగ మార్గాలు వివిధ నిర్మాణ దశల్లో ఉండగా మరికొన్ని ప్రాజెక్టులకు ప్రణాళికలు చేపట్టాల్సి ఉందని చెప్పారు. చైనా సరిహద్దు వెంబడి ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో లేహ్, తోస్, కార్గిల్ ఎయిర్ఫీల్డ్ల్లో వైమానిక దళ కార్యకలాపాలూ ఊపందుకున్నాయి. ఫార్వర్డ్ స్ధావరాలకు దళాలను, సామాగ్రిని తరలించేందుకు మెరుగైన కనెక్టివిటీ అవసరమని అధికారులు చెబుతున్నారు. సరిహద్దు వెంబడి ప్రాంతాల్లో నివసించే సైనికులతో పాటు పౌరులకూ సౌకర్యంగా ఉండేలా రోడ్ కనెక్టివిటీని మెరుగుపరచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. చదవండి : రష్యాకు రాజ్నాథ్.. కీలక చర్చలు -
గల్వాన్పై ఎందుకు చైనా కన్ను?
న్యూఢిల్లీ/బీజింగ్: భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం మూడు దఫాలు చర్చలు జరిగినా సమసిపోలేదు. చైనా మరో అడుగు ముందుకు వేసి తూర్పు లద్దాఖ్లోని గల్వాన్ లోయ తమదేనని సార్వభౌమాధికారం ప్రకటించుకొని మరింత అగ్గి రాజేసింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాలకు గల్వాన్ ప్రాంతమే ఎందుకంత కీలకం? 1962 యుద్ధంలో గల్వాన్ లోయ ఎందుకు ప్రాధాన్యంగా మారింది? పర్వత సానువుల్లో భారత్ బలగాలు పటిష్టంగా ఎలా ఉన్నాయి? ఎవరి సైనిక సత్తా ఎంత? వంటివన్నీ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. రెండు పక్షాలకీ వ్యూహాత్మక ప్రాంతం భారత్, చైనా దేశాలకు వ్యూహాత్మకంగా గల్వాన్ లోయ అత్యంత కీలకం. సబ్ సెక్టార్ నార్త్ (ఎస్ఎస్ఎన్)లో గల్వాన్ లోయ ఉంది. వివాదాస్పద ప్రాంతమైన ఆక్సాయిచిన్ నుంచి భారత్లోని లద్దాఖ్ దాకా గల్వాన్ నది ప్రవహిస్తూ ఉంటుంది. లేహ్కు చెందిన అన్వేషకుడు గులామ్ రసూల్ గల్వాన్ పేరునే ఈ నదికి పెట్టారు.వాస్తవాధీన రేఖ వెంబడి పశ్చిమాన నదీ పరివాహక ప్రాంతాల్లో గల్వాన్ లోయ ప్రాంతం ఎత్తు తక్కువగా ఉంటుంది. భారత్ బలగాలు ఆక్సాయిచిన్ చేరుకోవాలంటే గల్వాన్ లోయ గుండా చేరుకోవడం సులభం. అంతేకాకుండా పాకిస్తాన్, చైనాలోని జిన్జియాంగ్, లద్దాఖ్ సరిహద్దులతో గల్వాన్ లోయ కలిసి ఉంది. గల్వాన్ నది టిబెట్ నుంచి ప్రవహిస్తూ షివోక్ నదిలో కలుస్తుంది. ఈ నదికి సమీపంలో ఉత్తర లద్దాఖ్ను కలుపుతూ ప్రధాన రహదారి ఉంది. చైనా బలగాలు దీనిని ఆక్రమిస్తే మనకి రోడ్డు ఉండదు. అందుకే గల్వాన్ ప్రాంతం భారత్కు అత్యంత కీలకం. ఈ ప్రాంతంలో భారత్ మౌలిక సదుపాయాల కల్పన, షియోక్ నది వీదుగా వంతెన నిర్మాణం, లేహ్, దౌలత్ బేగ్ ఓల్దీలను కలుపుతూ 255 కి.మీ. పొడవున రోడ్డు నిర్మాణం వంటివి చైనాకు కంటగింపుగా మారాయి. లద్దాఖ్ని కేంద్ర పాలిత ప్రాంతం చేసిన దగ్గర్నుంచి డ్రాగన్ దేశం సరిహద్దుల్లో విషం చిమ్ముతూనే ఉంది. దేశం కోసం ప్రాణత్యాగానికి జవాన్లు సిద్ధం భారత సైన్యం అత్యంత ఉత్సాహంతో ఉందనీ, గతంలో మాదిరిగానే జవాన్లు దేశం కోసం జీవితాలను త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఇండో టిబెటన్ బోర్డర్ పోలిస్ (ఐటీబీపీ)డైరెక్టర్ జనరల్ ఎస్.ఎస్.దేశ్వాల్ పేర్కొన్నారు. చైనాతో సరిహద్దుల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో ప్రధాని మోదీ ఇటీవల లద్దాఖ్లో పర్యటించడం, నిములో చేసిన ప్రసంగంతో సరిహద్దుల్లో ఉన్న సైన్యంలో ధైర్యం ఇనుమడించిందని అన్నారు. పర్వత శ్రేణుల్లో మనకి లేరు పోటీ ! ప్రపంచంలో అత్యధిక సైనికులున్న మన బలగానికి ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదుర్కొనే, పోరాడే శక్తి ఉంది. సైనిక బలగాల సంఖ్యలో భారత్, ఉత్తర కొరియా తర్వాత స్థానమే చైనాకు దక్కుతుంది. అయితే ఆయుధాల పరంగా చైనా అత్యంత బలంగా ఉంది. వాస్తవాధీన రేఖ వెంబడి ఏప్రిల్ నుంచి చెలరేగుతున్న ఘర్షణల్లో మన సైనికులు చైనాకు గట్టిగానే బుద్ధి చెబుతున్నారు. పర్వత శ్రేణుల్లో, పీఠభూముల్లో భారత్ సైనికులకు మించిన వారు లేరని స్వయంగా చైనా నిపుణులే కితాబు ఇచ్చిన సందర్భాలున్నాయి. ‘‘ప్రస్తుతం ప్రపంచంలోనే అతి పెద్ద, అత్యంత అనుభవమైన, పటిష్టమైన సైనిక బలగాలున్న దేశం అమెరికా, రష్యా, యూరప్ కానే కాదు. అది భారత్’’అని చైనాలో మోడర్న్ వెపనరీ మ్యాగజైన్ సీనియర్ ఎడిటర్ హాంగ్ ఘాజి ఇటీవల తాను రాసిన ఆర్టికల్లో ప్రశంసించారు. వాస్తవాధీన రేఖ వెంబడి మొత్తం 12 డివిజన్లలో 2 లక్షలకుపైగా మన సైనికులు రేయింబగళ్లు గస్తీ తిరుగుతున్నారు. 1970 నుంచి భారతీయ ఆర్మీ తన పరిధిని విస్తరిస్తూ పర్వతాల్లో పెద్ద ఎత్తున సైనికుల్ని మోహరిస్తోంది. భారతీయులెవరైనా సైన్యంలో చేరాలంటే పర్వతారోహణ చెయ్యడం తప్పనిసరి. ప్రపంచం లోనే అత్యంత ఎత్తైన ప్రాంతమైన సియాచిన్లో వందలాది శిబిరాలను భారత్ ఏర్పాటు చేసిందని హాంగ్ తన వ్యాసంలో వివరించారు. నాటి యుద్ధంలోనూ... 1962లో భారత్, చైనా యుద్ధం కూడా గల్వాన్ లోయ ప్రాంతంలోనే జరిగింది. అప్పట్లో చైనా జిన్జియాంగ్ నుంచి టిబెట్కు 179 కి.మీ. పొడవున రోడ్డు నిర్మించింది. ఈ రోడ్డు భారత్కు చెందిన ఆక్సాయిచిన్ ప్రాంతం గుండా వెళుతుంది. భారత్ అనుమతి లేకుండానే ఈ రోడ్డు నిర్మాణం చేపట్టడమే అప్పట్లో ఇరుపక్షాల మధ్య అగ్గి రాజేసింది. యుద్ధం తర్వాత కూడా చైనా ఎన్నో ప్రాంతాలను ఆక్రమించింది. ఆక్సాయిచిన్ తమదేనని ప్రకటించుకుంది. గల్వాన్ ప్రాంతంపై పట్టు సాధిస్తే భారత్ బలగాలు ఆక్సాయిచిన్ చేరే అవకాశం లేదని భావిస్తున్న చైనా పథకం ప్రకారమే దాడులకు తెగబడుతోంది. పీఠభూముల్లోనూ, పర్వత శ్రేణుల్లో భారత్ సైనికులు బలంగా ఉంటే, ఆక్సాయిచిన్ ప్రాంతంలో చైనా బలంగా ఉంది. అత్యాధునికమైన ఆయుధాలు కూడా ఆ దేశం దగ్గర ఉండడం కలవర పెట్టే అంశం. అయితే 1962తో పోల్చి చూస్తే భారత్ అన్ని రకాలుగా బలమైన దేశంగా అవతరించింది. ‘‘ఆక్సాయిచిన్లో చైనా బలంగా ఉంది. అయితే కరోనా వైరస్తో చైనా అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ దౌత్యపరంగా బలహీనంగా ఉండటం మనకు లాభం చేకూరే అంశం’’ అని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు ఎస్డీ ముని వ్యాఖ్యానించారు. -
‘భారత ఉద్యోగులకు టిక్టాక్ భరోసా’
సాక్షి, న్యూఢిల్లీ : సరిహద్దు వివాదం నేపథ్యంలో చైనాకు చెందిన టిక్టాక్ సహా 59 యాప్లను భారత్ నిషేధించిన క్రమంలో చైనా వీడియో షేరింగ్ యాప్ టిక్టాక్ సీఈఓ కెవిన్ మేయర్ భారత ఉద్యోగులకు బుధవారం లేఖ రాశారు. ఉద్యోగ భద్రతపై ఆందోళన చెందుతున్న భారత ఉద్యోగులకు బాసటగా నిలిచారు. ఇంటర్నెట్ ప్రజాస్వామీకరణకు కట్టుబడి టిక్టాక్ను తాము నడిపిస్తామని, ఈ ప్రక్రియలో తాము విజయవంతం అయినట్టు నమ్ముతున్నామని పేర్కొన్నారు. ఈ దిశగా తమ లక్ష్యానికి అంకితభావంతో కట్టుబడి ఉన్నామని, సంస్థ భాగస్వాముల ఇబ్బందులను తొలగించే దిశగా కసరత్తు చేస్తున్నామని ఉద్యోగులకు రాసిన లేఖలో కెవిన్ స్పష్టం చేశారు. భారత చట్టాలకు అనుగుణంగా టిక్టాక్ డేటా ప్రైవసీ, భద్రతా ప్రమాణాలను పాటించడం కొనసాగిస్తోందని, యూజర్ల గోప్యత, సమగ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని కంపెనీ వెబ్సైట్లో పోస్ట్ చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. భారత ఉద్యోగులకు సందేశం అనే పేరుతో ఆయన పోస్ట్ సాగింది. 2018 నుంచి భారత్లో తమ ప్రయాణం 20 కోట్ల యూజర్లను చేరుకుని వారి సృజనాత్మకత, ఉత్సాహం, వారి అనుభూతులను మిగతా ప్రపంచంతో పంచుకునేలా సాగిందని చెప్పారు. తమ ఉద్యోగులే తమ బలమని, వారి బాగోగులే తమ తొలి ప్రాధాన్యతని అన్నారు. 2000 మంది సిబ్బందికి వారు గర్వపడే అనుభూతులు, అవకాశాలను అందించేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తామని ఉద్యోగ భద్రతపై ఆందోళన చెందుతున్న భారత ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. చదవండి : ‘టిక్టాక్ నిషేధం నోట్ల రద్దు వంటిదే’ -
చైనా మూకలను ఎప్పుడు ఖాళీ చేయిస్తారు: రాహుల్ గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ: చైనా మూకలను లడక్ నుంచి ఎప్పుడు తరిమేస్తారో చెప్పాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి నరేంద్రమోదీని ప్రశ్నించారు. చైనా భారత భూభాగాన్ని ఆక్రమించిందని దేశం మొత్తానికి తెలుసు. లడక్లో నాలుగు స్థావరాలలో చైనా ట్రూప్స్ ఉన్నాయి. మీరు దేశ ప్రజలకు చెప్పండి ఎప్పుడు, ఎలా చైనా మూకలను తరిమివేస్తారో? అని రాహుల్ గాంధీ వీడియో ద్వారా మోదీని ప్రశ్నించారు. (‘చైనా సరిహద్దు వివాదంపై చర్చకు సిద్ధం’) గత వారం చైనా చర్యలను పబ్లిక్గా ఖండించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. దీనిపై మోదీ ఏవిధంగాను స్పందించలేదు. జూన్ 15న లడక్లోని గల్వాన్ లోయలో చైనా- భారత్ సరిహద్దు వివాదంలో 20 మంది భారత సైనికులు అమరులు కావడంతో దేశమంతట ఆందోళనలు చెలరేగిన విషయం తెలిసిందే. మంగళవారం ఇరు దేశాల సీనియర్ మిలటరీ కమాండర్స్ మధ్య సరిహద్దు వివాదానికి సంబంధించి చర్చలు జరిగాయి. ఇండియా సార్వభౌమత్వానికి, భద్రతకి, రక్షణకి ప్రమాదకరంగా ఉన్నాయంటూ 59 చైనా యాప్స్ను సోమవారం కేంద్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. (‘మోదీ మౌనంగా ఉంటూ కరోనాకు లొంగిపోయారు’) -
సరిహద్దు వివాదం : భారత్కు ఫ్రాన్స్ బాసట
పారిస్/న్యూఢిల్లీ : భారత్- చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో వాస్తవాధీన రేఖ వెంబడి డ్రాగన్ దళాలు మోహరించడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెచ్చుమీరాయి. చైనాతో ముప్పు ముంచుకొస్తున్న క్రమంలో ఈ సంక్లిష్ట సమయంలో భారత్కు ఫ్రాన్స్ బాసటగా నిలిచింది. తమ సాయుధ బలగాలను తరలించడంతో పాటు భారత్కు ఎలాంటి సాయం అవసరమైనా ముందుంటామని పేర్కొంది. గల్వాన్ లోయలో జూన్ 15న చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో 20 మంది భారత జవాన్లు మరణించడం పట్ల ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ రక్షణ మంత్రి రాజ్నాథ సింగ్కు రాసిన లేఖలో సంతాపం వ్యక్తం చేశారు. ఈ సంక్లిష్ట సమయంలో ఫ్రాన్స్ సాయుధ దళాల తరపున తాను భారత్కు స్నేహపూర్వకంగా బాసటగా నిలుస్తానని లేఖలో పేర్కొన్నారు. భారత్ దక్షిణాసియా ప్రాంతంలో తమ వ్యూహాత్మక భాగస్వామని ఫ్రాన్స్ రక్షణ మంత్రి స్పష్టం చేశారు. భారత్లో రాజ్నాథ్ సింగ్తో కలిసి సంప్రదింపులు జరిపేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. మరోవైపు జులై చివరికి ఫ్రాన్స్ నుంచి తొలిదశ రఫేల్ జెట్స్ భారత్కు చేరుకోనున్నాయి. చదవండి : కరోనా: వచ్చేవారం చైనాకు డబ్ల్యూహెచ్ఓ బృందం -
భారత్- చైనా మధ్య కమాండో స్థాయి చర్చలు
సాక్షి, న్యూఢిల్లీ : వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలను నివారించడంతో పాటు ఇరువైపులా సైనిక బలగాల ఉపసంహరణ కోసం మంగళవారం లడఖ్లోని చుసుల్లో భారత్-చైనాల మధ్య లెఫ్టినెంట్ జనరల్ స్ధాయి చర్చలు జరగనున్నాయి. ఈ ఏడాది మేలో ఇరు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొన్న తర్వాత సీనియర్ సైనికాధికారుల భేటీ జరగడం ఇది మూడవసారి. గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల ఘర్షణలో 20 మంది భారత జవాన్లు మరణించిన అనంతరం జూన్ 22న చివరిసారిగా జరిగిన సమావేశంలో వాస్తవాధీన రేఖ వెంబడి సమస్యాత్మక ప్రాంతాల్లో ఇరు దళాలు వెనక్కితగ్గేందుకు అంగీకారం కుదిరింది. ఇరు పక్షాలు అంగీకారానికి వచ్చినా గల్వాన్ లోయ సహా పలు ప్రాంతాల్లో డ్రాగన్ సేనల కార్యకలాపాలకు బ్రేక్పడలేదు. ఆయా ప్రాంతాల్లో చైనా సేనలు పూర్తిగా వెనక్కిమళ్లాలని, వ్యూహాత్మక ప్రాంతాల్లో యథాతథ స్ధితి కొనసాగించాలని తాజా చర్చల్లో భారత్ డిమాండ్ చేయనుంది. ఇక మంగళవారం నాటి సమావేశం వాస్తవాధీన రేఖ వెంబడి భారత్ భూభాగంలో జరగనుంది. ఇక ఇరు దేశాలు సరిహద్దుల్లో బలగాలు, యుద్ధవిమానాలతో సన్నద్ధమైన క్రమంలో తాజా భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. చదవండి : చైనా కుట్ర : అజిత్ దోవల్ ఆనాడే హెచ్చరించినా.. -
‘డ్రాగన్కు దీటుగా బదులిచ్చాం’
సాక్షి, న్యూఢిల్లీ : సరిహద్దు వివాదంలో చైనా దూకుడుకు దీటుగా బదులిచ్చామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. డ్రాగన్ సేనలతో వీరోచితంగా పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన 20 మంది సైనికుల త్యాగాలను కొనియాడారు. మనం సుఖంగా జీవించేందుకు వారు తమ ప్రాణాలను పణంగా పెట్టారని ప్రస్తుతించారు. ప్రధాని మోదీ ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ లడఖ్లో చైనా సైనికులను దీటుగా నిలువరించామని అన్నారు. దేశం స్వయం సమృద్ధి సాధించేలా పౌరులంతా చొరవ చూపాలని పిలుపు ఇచ్చారు. స్ధానిక ఉత్పత్తుల వాడకానికే మొగ్గుచూపాలని కోరారు. సవాళ్లను అవకాశాలుగా మలుచుకుంటూ రక్షణ, సాంకేతిక రంగాల్లో భారత్ బలోపేతమవుతోందని అన్నారు. ప్రపంచ శాంతి, అభివృద్ధి కోసం భారత్ పాటుపడుతోందని చెప్పారు. కోవిడ్ నియమాలను అనుసరించకుంటే ప్రమాదంలో పడతామని హెచ్చరించారు. ఈ ఏడాది మనకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని, ధైర్యంగా వాటిని ఎదుర్కోవాలని అన్నారు. ప్రపంచమంతా వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడంపై దృష్టి కేంద్రీకరించగా, ఇమ్యూనిటీని పెంచేవన్నీ భారత్లో ఎప్పటినుంచో వాడుతున్నవేనని గుర్తించాలన్నారు. పీవీకి నివాళి మాజీ ప్రధాని పీవీ నరసింహరావు శతజయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దివంగత నేతకు ఘనంగా నివాళులర్పించారు. భారతదేశ రాజకీయాలపై పట్టుతో పాటు పాశ్చాత్య ఆలోచనల్లో బాగా ప్రావీణ్యం కలవారు పీవీ నరసింహారావని కొనియాడారు. చరిత్ర, సాహిత్యం, విజ్ఞానశాస్త్రంలో ఆయనకు చాలా ఆసక్తి. భారతదేశపు అత్యంత అనుభవజ్ఞులైన నాయకులలో ఒకరైన పీవీకి నివాళులు అర్పిస్తున్నానని అన్నారు. సంక్లిష్ట సమయంలో దేశానికి నాయకత్వం వహించిన పీవీ గొప్ప రాజకీయ నేతే కాకుండా పండితుడని అన్నారు. చదవండి : భారత్ గట్టిగా పోరాడుతోంది: మోదీ -
గల్వాన్పై చైనాలో అసమ్మతి సెగ!
బీజింగ్: గల్వాన్ ప్రాంతంలో దురాక్రమణకు పాల్పడటం ద్వారా పొరుగుదేశం చైనా ఏం బావుకుందో ఏమో తెలియదుగానీ.. దేశంలోనే కాకుండా.. విదేశాల్లోని స్వదేశీయుల నుంచి అసమ్మతిని మాత్రం మూటగట్టుకుంటోంది. చైనాలో ప్రభుత్వం కనుసన్నలలో నడిచే మీడియా, సామాజిక మాధ్యమాల్లో భారత వ్యతిరేక వ్యాఖ్యానాలు చర్చలు కొనసాగుతున్నా.. ఇతర మాధ్యమాల్లో, విదేశాల్లోని చైనీయుల మధ్య జరుగుతున్న ఆన్లైన్ సంభాషణల్లోనూ గల్వాన్ లోయలో చైనా వ్యవహారంపై పలువురు ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటికే పూర్తయి వివరాలు వెల్లడి కావాల్సిన ఓ ఆన్లైన్ సర్వే ద్వారా ఈ విషయం తెలుస్తోందని జాతీయ స్థాయి టెలివిజన్ చానల్ ఒకటి ఒక కథనాన్ని ప్రచురించింది. సుమారు 75 వేల మంది సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్ట్లను విశ్లేషించడం ద్వారా తాము ఈ అంచనాకు వచ్చినట్లు సెక్ల్యాబ్ అండ్ సిస్టమ్స్ అనే సంస్థ చెబుతోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. చైనా ప్రభుత్వం మద్దతుతో నడిచే కొన్ని వ్యూహాత్మక సంస్థల్లో పనిచేసే వారు కూడా ప్రభుత్వం తీరు సరికాదని వ్యాఖ్యానించడం. సెక్ ల్యాబ్ అండ్ సిస్టమ్స్ సోషల్మీడియా నెట్వర్క్లను గణిత శాస్త్ర సూత్రాల ఆధారంగా విశ్లేషించింది. ప్రవాస చైనా జర్నలిస్టుల సోషల్ మీడియా పోస్టుల్లో గల్వాన్ విషయంలో చైనా వైఖరిపై అసంతృప్తి వ్యక్తమవుతూండగా.. అదృశ్య శక్తి ఒకటి ఒకటి వీటన్నింటి వెనుక ఉందని చైనా ప్రభుత్వం ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని వీరు భావిస్తున్నారు. వీరే కాకుండా.. హాంకాంగ్, తైవాన్లలో ప్రజాస్వామ్యానికి మద్దతుగా ఆందోళనలు నిర్వహిస్తున్న వారు, ఇతర మద్దతుదారుల్లోనూ ఇదే తరహా సెంటిమెంట్లు నడుస్తున్నాయి. ట్విట్టర్లో సుమారు 34 వేల మంది ఫాలోయర్లు ఉన్న జర్నలిస్ట్, చైనీస్ కుమిన్టాంగ్ విప్లవ కమిటీ సభ్యుడు డెంగ్ యూవెన్ భారత్తో సరిహద్దు గొడవలు చైనా నేతలకు ఏమాత్రం తగని పని అని ఒక కథనంలో వ్యాఖ్యానించారు. భారత్ చైనాల మధ్య యుద్ధం అసాధ్యమని గతంలో అనుకునేవాళ్లమని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని యూవెన్ వ్యాఖ్యానిస్తున్నారు. ట్విట్టర్లో రెండు లక్షల కంటే ఎక్కువమంది ఫాలోయర్లు ఉన్న హు పింగ్ కూడా యూవెన్ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే చైనాలోనే కొంతమంది పౌరులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు చేస్తూండటం గమనార్హం. ప్రభుత్వ పెద్దల మధ్య అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయని, కమ్యూనిస్టు పార్టీ అంతర్గత సమావేశాల రికార్డింగ్లు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని వాంగ్ కియాన్కిన్ ఒక ట్వీట్ చేశారు. కొంత కాలానికే ఈ ట్వీట్ డెలిట్ కావడం గమనార్హం. భారత్ అత్యవసరంగా రష్యా నుంచి 33 యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తూండటం వారి సంబంధాలు చైనా కంటే ఆ దేశంతోనే బాగున్నాయని నిరూపిస్తున్నాయని ట్వీట్ ద్వారా వ్యాఖ్యానించారు. ఇలాంటి ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు, ట్వీట్లు, ఆలోచనలు ఒక పద్ధతి ప్రకారం వస్తున్నవి ఏమీ కావని, ప్రస్తుతానికి వీటిని గుసగుసలుగానే పరిగణించాలని సెక్ల్యాబ్స్ నిర్వహించిన సర్వే చెబుతోంది. సామాజిక మాధ్యమాల్లో ఊపిరిపోసుకుని ఆ తరువాత ఓ వ్యవస్థీకృత ఉద్యమంగా మారిన పలు ఉద్యమాలు కూడా ఇలాంటి చెదురుమదురు అసంతృప్తికర వ్యాఖ్యలతోనే మొదలైన విషయాన్ని గుర్తించాలని చెబుతోంది. -
చైనా సరిహద్దుల్లో భారత్ బలగాల ప్రదర్శన
సాక్షి, న్యూఢిల్లీ : భారత్-చైనాల మధ్య సరిహద్దు వివాదంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న క్రమంలో సరిహద్దు వెంబడి భారత బలగాలు సర్వసన్నద్ధమయ్యాయి. సేనల సన్నద్ధతపై క్షేత్రస్ధాయిలో సమీక్షించేందుకు ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణే స్వయంగా లేహ్లో పర్యటించిన సంగతి తెలిసిందే. తూర్పు లడఖ్లో పరిస్థితితో పాటు చైనా సరిహద్దుల్లో భారత సేనల సన్నద్ధతను నరవణే పర్యవేక్షించారు. మరోవైపు చైనా సరిహద్దుల్లో డ్రాగన్ సేనలకు దీటుగా భారత్ బలగాలు పెద్ద ఎత్తున ప్రదర్శన చేపట్టాయి. చర్చల్లో శాంతి మంత్రం వల్లెవేస్తూ సరిహద్దుల్లో సేనలను మోహరిస్తున్న చైనా కుయుక్తులకు దీటుగా బుద్ధిచెప్పేందుకు భారత్ సైతం సేనలను తరలించింది. చైనా సరిహద్దుల్లో సేనల సన్నద్ధతను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు ఆర్మీ చీఫ్ నరవణే వివరించనున్నారు. చదవండి :రంగంలోకి అమెరికా బలగాలు -
డ్రాగన్కు చెక్ : రంగంలోకి అమెరికా బలగాలు
వాషింగ్టన్ : భారత్ సహా పలు ఆసియా దేశాలకు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నుంచి ఎదురవుతున్న ముప్పును నిలువరించేందుకు తమ అంతర్జాతీయ బలగాలను తరలించే అవకాశాన్ని సమీక్షిస్తున్నామని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో పేర్కొన్నారు. చైనా సైన్యాన్ని దీటుగా నిలువరించేందుకు సన్నద్ధంగా ఉన్నామని, అందుకు అవసరమైన వనరులు సిద్ధం చేస్తామని బ్రజెల్స్ ఫోరం 2020ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ పాంపియో ఈ వ్యాఖ్యలు చేశారు. జర్మనీలో అమెరికన్ బలగాలను 52,000 నుంచి 25,000కు తగ్గిస్తున్న క్రమంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలకు అనుగుణంగా సైనిక బలగాల సమీక్షను చేపడతామని చెప్పారు. క్షేత్రస్ధాయి పరిస్థితులకు అనుగుణంగా బలగాల మోహరింపుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. నిర్ధిష్ట ప్రాంతాల్లో అమెరికన్ దళాలున్నాయని, తాజాగా భారత్, వియత్నాం, మలేషియా, ఇండోనేషియా వంటి దేశాలకు చైనా నుంచి ముప్పు నెలకొందని అన్నారు. ఏ ప్రాంతానికినా ముప్పు ఎదురైతే ఇతర దేశాలు బాధ్యత తీసుకుని వారిని రక్షించాల్సిన అవసరం ఉందని, ఈ అంశాలపై ఐరోపా దేశాలతో పాటు తమ భాగస్వాములందరితో సంప్రదింపులు జరుపుతామని పాంపియో పేర్కొన్నారు. కాగా భారత్, చైనాల మధ్య సరిహద్దు వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన సంగతి తెలిసిందే. చర్చల్లో శాంతి మంత్రం జపిస్తున్న చైనా మరోవైపు సరిహద్దుల్లో పెద్దసంఖ్యలో సైన్యాన్ని మోహరిస్తుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. చదవండి : నార్త్ కొరియాకు అమెరికా, ద. కొరియా విజ్ఞప్తి! -
మే నుంచే మోహరింపు
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి మే నెల తొలి వారం నుంచే చైనా పెద్ద ఎత్తున బలగాలను, ఆయుధాలను, వాహనాలను మోహరిస్తోందని భారత్ ఆరోపించింది. సరిహద్దుల వద్ద చైనా తీరు గతంలో ఏకాభిప్రాయంతో కుదిరిన ఒప్పందాలను ఉల్లంఘిస్తూ బలగాల మోహరింపు సాగిందంది. తూర్పు లద్దాఖ్లో ఇరుదేశాల జవాన్లు ప్రాణాలు కోల్పోయిన ఇటీవలి ఘర్షణలకు కారణం చైనా వ్యవహరించిన తీరేనని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ గురువారం ఆన్లైన్ ప్రెస్మీట్లో తేల్చిచెప్పారు. ‘మే నెల మొదట్లోనే గల్వాన్ లోయలో భారత్ సాధారణంగా నిర్వహించే పెట్రోలింగ్ విధులను అడ్డుకునేందుకు చైనా ప్రయత్నించింది. వెస్ట్రన్ సెక్టార్లోని ఇతర ప్రాంతాల్లోనూ య«థాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నించింది’ అని శ్రీవాస్తవ వివరించారు. ఆ క్రమంలోనే జూన్ 6న ఇరుదేశాల సీనియర్ కమాండర్లు సమావేశమై, బలగాల ఉపసంహరణపై ఒక అంగీకారానికి వచ్చారన్నారు. ‘అయితే, దీన్ని ఉల్లంఘించిన చైనా, గల్వాన్ లోయలో ఎల్ఏసీ పక్కనే నిర్మాణాలు చేపట్టింది. వారి ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో చైనా జవాన్లు హింసకు దిగారు. ఆ క్రమంలో చోటుచేసుకున్న ఘర్షణల్లో ప్రాణనష్టం చోటు చేసుకుంది. ఆ తరువాత చర్చలు కొనసాగుతుండగానే.. రెండు దేశాలు ఆ ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించాయి’ అని వివరించారు. సరిహద్దుల్లో శాంతి నెలకొల్పేందుకు కుదిరిన కీలక 1993 ఒప్పందం సహా పలు ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘిస్తూ మే తొలి వారం నుంచే చైనా ఎల్ఏసీ వెంట భారీగా బలగాలు, సైనిక సామగ్రిని తరలిస్తోందన్నారు. దాంతో, భారత్ కూడా బలగాల మోహరింపు చేపట్టిందని, ఆ క్రమంలోనే ఘర్షణలు చోటుచేసుకున్నాయన్నారు. భారత్ పైనే బాధ్యత గల్వాన్ లోయలో జూన్ 15న చోటు చేసుకున్న హింసాత్మక ఘర్షణలకు భారత సైనికులే కారణమని భారత్లో చైనా రాయబారి సున్ వీడన్ పేర్కొన్నారు. ఉద్రిక్తత తగ్గించే బాధ్యత ప్రాథమికంగా భారత్పైననే ఉందన్నారు. ‘భారత సైనికులే ఎల్ఏసీని దాటి వచ్చి చైనా జవాన్లపై దాడి చేశారు. ద్వైపాక్షిక ఒప్పందాలను భారత దళాలే ఉల్లంఘించాయి. మరో గల్వాన్ తరహా ఘటనను చైనా కోరుకోవడం లేదు’ అన్నారు. ‘దశాబ్దాలుగా గల్వాన్ లోయలో పరిస్థితి ప్రశాంతంగా ఉంది. 2020 నుంచి క్షేత్రస్థాయిలో యథాతథ స్థితిని మారుస్తూ భారత్ పలు నిర్మాణాలు చేపట్టింది’ అని ఆరోపించారు. అనుమానం, ఘర్షణలు సరైన మార్గం కాదని.. అది రెండు దేశాల ప్రజల ప్రాథమిక ఆకాంక్షలకు విరుద్ధమని పేర్కొన్నారు. పరస్పర విశ్వాసం, సహకారం రెండు దేశాలకు ప్రయోజనకరమన్నారు. సరిహద్దు వివాదాన్ని సరైన రీతిలో పరిష్కరించుకునేందుకు చైనా సిద్ధంగా ఉందన్నారు. -
చర్చలు.. చర్యలు!
న్యూఢిల్లీ: ఒకవైపు చర్చల ప్రక్రియ కొనసాగిస్తూనే.. మరోవైపు వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)కి ఇరువైపులా బలగాలు, ఇతర సైనిక సంపత్తి మోహరింపును భారత్, చైనాలు పెద్ద ఎత్తున చేపడుతున్నాయి. భారత సైన్యంతో పాటు ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) కూడా సరిహద్దు కేంద్రాలకు సుశిక్షితులైన అధికారులు, ఇతర సిబ్బందిని తరలిస్తోంది. ఆర్మీకి మద్దతుగా మరిన్ని ఐటీబీపీ బలగాలను సరిహద్దులకు తరలించాలని శనివారం లెఫ్ట్నెంట్ జనరల్ పరంజిత్ సింగ్, ఐటీబీపీ చీఫ్, మిలటరీ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్ ఎస్ఎస్ దేశ్వాల్ లేహ్ను సందర్శించిన అనంతరం నిర్ణయించారు. ‘జూన్ 15 ఘటనకు ముందే కొన్ని కంపెనీల బలగాలను లద్దాఖ్కు పంపించాం. ఇప్పుడు మరిన్ని బలగాలను తరలించాలని నిర్ణయించాం’ అని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. సైనిక కేంద్రాల్లో ఆర్మీకి సహకారంగా ఐటీబీపీ నుంచి ప్లటూన్ల స్థానంలో కంపెనీలను మోహరించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఘర్షణాత్మక గల్వాన్ లోయ, హాట్ స్ప్రింగ్స్, ప్యాంగ్యాంగ్ సరస్సు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పరిస్థితి నేటికి కూడా ఉద్రిక్తంగానే ఉంది. రెండు దేశాల మిలటరీ అధికారుల మధ్య జరుగుతున్న చర్చల్లో.. ఏప్రిల్ 30, 2020 నాటికి ఉన్న యథాతథ స్థితి నెలకొనాలని భారత్ డిమాండ్ చేస్తోంది. గల్వాన్, గోగ్రా, హాట్ స్ప్రింగ్స్లోని 14, 15, 17 పెట్రోలింగ్ పాయింట్స్(పీపీ)లో బలగాల సంఖ్యను గణనీయంగా తగ్గించాలని రెండు దేశాలు అంగీకారానికి వచ్చినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. అయితే, పీపీ 14, పీపీ 15 దగ్గరలో చైనా పలు తాత్కాలిక నిర్మాణాలు చేపట్టినట్లు ఉపగ్రహ చిత్రాల్లో కనిపిస్తోంది. అలాగే, పీపీ 17 వద్దకు పెద్ద ఎత్తున సైనికులను తరలించింది. దాంతో, పీపీ 17 వద్ద భారత్ కూడా సైనికుల సంఖ్యను పెంచింది. ప్యాంగ్యాంగ్ సరస్సులోని ‘ఫింగర్ 4’ వరకు చైనా దళాలు చేరుకున్నాయి. అక్కడికి చైనా బోట్లు, ఇతర వాహనాలను కూడా తరలించింది. దాంతో భారత్ కూడా అక్కడ దళాలను మోహరించింది. చర్చలు జరపండి లండన్: భారత్, చైనాల మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలపై బ్రిటన్ ఆందోళన వ్యక్తం చేసింది. ‘పరిస్థితి తీవ్రంగా, ఆందోళనకరంగా ఉంది’ అని ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ బుధవారం పార్లమెంట్లో వ్యాఖ్యానించారు. పరిస్థితిని బ్రిటన్ నిశితంగా గమనిస్తోందన్నారు. వివాద పరిష్కారానికి చర్చలు జరపాలని భారత్, చైనాలకు సూచించారు. -
డ్రాగన్తో కటీఫ్ సాధ్యమేనా
చేతిలో రెడ్మి స్మార్ట్ఫోన్... ఓపెన్ చేస్తే టిక్టాక్ వీడియో... చెవిలో షియోమి ఇయర్ ఫోన్... అలీ ఎక్స్ప్రెస్లో నచ్చిన వస్తువుకు ఆర్డర్... పేటీఎంలో ఫ్రెండ్కి క్షణాల్లో నగదు బదిలీ... ఇలా ఒకటేమిటి చేతికి తొడుక్కునే వాచీ నుంచి కాలికి వేసుకునే చెప్పుల వరకూ అన్నింటికీ ఒకటే లింకు.. అరే ఠక్కున భలే చెప్పేశారే! అదేమరి చైనా ‘చౌక’ మహిమ!! భారతీయులను తన చౌక ఉత్పత్తులతో బానిసలుగా మార్చేసిన డ్రాగన్... అదును చూసి మనపైనే బుసలు కొడుతోంది. సరిహద్దుల్లో భారతీయ సైనికులను దొంగదెబ్బతీస్తూ... తన ఉత్పత్తులను మాత్రం రాజమార్గంలో ఎడాపెడా అమ్ముకుంటోంది. దేశంలో ఇప్పుడు ఇదే హాట్టాపిక్. చైనా వస్తువులను బహిష్కరించి డ్రాగన్తో వాణిజ్య యుద్ధం చేయాలంటూ సోషల్ మీడియాలో ఒకటే హల్చల్. మరి ఇది సాధ్యమయ్యే పనేనా? అసలు చైనాతో మనకున్న ఆర్థిక, వాణిజ్య బంధం ఏ స్థాయిలో ఉంది. దీన్ని తెంచుకుంటే మనకొచ్చే ఇబ్బందులేంటి? దిగుమతులు, ఎగుమతులు ఆగిపోతే మన కంపెనీలు పడే అవస్థలు ఎలా ఉంటాయి? వీటన్నింటినీ వివరించే ‘సాక్షి బిజినెస్ డెస్క్’ ప్రత్యేక కథనమిది... చైనా–భారత్ మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. రెండుమూడేళ్లుగా ముదురుతూ వస్తున్న సరిహద్దు ఉద్రిక్తతలు... తాజాగా గల్వాన్ లోయలో 20 మంది భారతీయ సైనికుల ఊచకోతతో మరింత తీవ్రరూపం దాల్చాయి. గడిచిన 40 ఏళ్లలో ఇరు దేశాల మధ్య ఇంత ఘోరమైన ఘర్షణ చోటుచేసుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీనికితోడు ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనా వైరస్కు మూలం కూడా చైనాయే కావడంతో భారతీయులు ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. చైనా ఉత్పత్తులు, కంపెనీలను బహిష్కరించాలంటూ నినాదాలు మిన్నంటుతున్నాయి. అయితే, ప్రపంచీకరణ నేపథ్యంలో దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ ఇప్పుడు ఒకదానితో మరొకటి పెనవేసుకుపోయాయి. మరీ ముఖ్యంగా చైనా లాంటి బాహుబలి ఎకానమీతో అంటీముట్టనట్టుగా ఉండటం మనకేకాదు అమెరికాలాంటి అగ్రదేశానికీ సాధ్యంకాని పరిస్థితి. 14.14 లక్షల కోట్ల డాలర్ల స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)తో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా అంతకంతకూ విస్తరిస్తోంది. భారత్ జీడీపీ 2.94 లక్షల కోట్లు మాత్రమే (ఆసియాలో నంబర్–3, ప్రపంచంలో నంబర్–5). పారిశ్రామిక యంత్రాలు, విడిభాగాలు, ముడి పదార్థాల సరఫరా నుంచి స్టార్టప్లు, టెక్నాలజీ సంస్థల్లో పెట్టుబడుల వరకూ అమెరికా తర్వాత భారత్కు చైనా రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతోంది. చైనా ముడి పదార్థాలు, విడిభాగాలపై అత్యధికంగా ఆధారపడిన మన పరిశ్రమలకు అంత చౌకగా ప్రపంచంలో మరేదేశం కూడా సరఫరా చేయలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో కేవలం సరిహద్దు ఘర్షణ, కరోనా కారణంగా చైనాతో వాణిజ్య, ఆర్థిక బంధాన్ని తెంచుకోవడం అంత సులువేమీ కాదనేది నిపుణుల అభిప్రాయం. ద్వైపాక్షిక వాణిజ్యం @ రూ.7.3 లక్షల కోట్లు 2019–20 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఎగుమతుల్లో 5.33 శాతం అంటే దాదాపు రూ.1.8 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు చైనాకు వెళ్లాయి. అయితే, చైనా నుంచి భారత్ దిగుమతి చేసుకున్న ఉత్పత్తుల విలువ ఎంతో తెలుసా? రూ.5.5 లక్షల కోట్లు. అంటే మూడు రెట్లు ఎక్కువ. మన మొత్తం దిగుమతుల్లో ఇది ఏకంగా 14 శాతం. భారత్కు చైనాయే అతిపెద్ద దిగుమతిదారు కూడా. 2000 సంవత్సరం నుంచి 2018–19 నాటికి చూస్తే చైనా నుంచి బారత్కు దిగుమతులు 45 రెట్లు ఎగబాకి 70 బిలియన్ డాలర్లకు చేరడం గమనార్హం. డ్రాగన్ మన దేశంలోకి చౌక వస్తువులను ఎలా కుమ్మరిస్తోందో... అదేవిధంగా చైనా దిగుమతులపై మనం ఎంతగా ఆధారపడిపోయామో చెప్పేందుకు ఈ గణాంకాలే నిదర్శనం. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య లోటు అంతకంతకూ తీవ్రమవుతోంది. మొబైల్స్, కన్సూమర్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, విద్యుత్ ఉపకరణాలు, పవర్ ప్లాంట్ పరికరాలు, ఎరువులు, వాహన విడిభాగాలు, ఫినిష్డ్ స్టీల్ ఉత్పత్తులు, టెలికం పరికరాలు, మెట్రో రైలు కోచ్లు ఇతరత్రా యంత్ర పరికరాలు, ఔషధ ముడిపదార్థాలు, రసాయనాలు మరియు ప్లాస్టిక్స్, ఇంజినీరింగ్ గూడ్స్... ఇలా చెప్పుకుంటూ పోతే చైనా నుంచి మనం దిగుమతి చేసుకునే ఉత్పత్తుల లిస్టు గ్రేట్ వాల్ ఆఫ్ చైనాలా వెళ్తూనే ఉంటుంది. చైనా ముడి వస్తువులపై ఆధారపడిన మన కంపెనీలు, పరిశ్రమలకు వాటి సరఫరా నిలిచిపోతే లక్షలాది మందికి ఉపాది కరువయ్యే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. మరోపక్క, చైనాకు ఎగుమతులు నిలిచిపోతే వాటిపై ఆధారపడిన మన కంపెనీలకూ తీవ్ర నష్టమే. ప్రధానంగా భారత్నుంచి చైనాకు ఆర్గానిక్ రసాయనాలు, ముడి ఖనిజం, మినరల్ ఆయిల్స్, మినరల్ ఫ్యూయెల్స్ ఇతర పారిశ్రామిక ఉత్పత్తులు ఎగుమతి అవుతాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల జోరు... భారత్లోకి వస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో(ఎఫ్డీఐ) చైనా జోరు గడిచిన రెండుమూడేళ్లుగా పుంజుకుంది. ముఖ్యంగా లోహ సంబంధ పరిశ్రమలు, పునరుత్పాదక ఇంధనం (సోలార్ ప్యానెల్స్), విద్యుత్ పరికరాలు, వాహన రంగం మరియు రసాయన పరిశ్రమల్లోకి చైనా నుంచి ఎఫ్డీఐలు భారీగా వస్తున్నాయి. ఇప్పటిదాకా భారత్లోకి వచ్చిన, ప్రణాళికల్లో ఉన్న చైనా ఎఫ్డీఐల విలువ 2600 కోట్ల డాలర్లుగా (దాదాపు రూ.1.98 లక్షల కోట్లు) అంచనా. భారత్లో చైనాకు చెందిన 75 తయారీ ప్లాంట్లు ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఒప్పో, షావోమి, వివో, ఫోసున్, హేయర్, ఎస్ఏఐసీ, వంటివి భారత్లో ప్లాంట్లున్న అతిపెద్ద బ్రాండ్స్లో కొన్ని. ఇక చైనాలో కార్యకలాపాలున్న తయారీ సంస్థల్లో అదానీ గ్లోబల్, డాక్టర్ రెడ్డీస్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, బీఈఎంఎల్, బీహెచ్ఈఎల్, గోద్రేజ్ అండ్ బాయ్స్, అరబిందో వంటివి ఉన్నాయి. స్టార్టప్స్లోకి నిధుల వరద... భారతీయ స్టార్టప్ సంస్థలకు నిధుల తోడ్పాటును అందించడంలో చైనా కంపెనీలు ముందువరుసలో నిలుస్తున్నాయి. ప్రధానంగా చైనా ఫండ్స్, కంపెనీలు తమ సింగపూర్, హాంకాంగ్, మారిషస్లోని సంస్థల ద్వారా భారత్లోని స్టార్టప్లకు నిధులను మళ్లిస్తున్నాయి. ఉదాహరణకు చైనాకు చెందిన ఈ–కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ పేటీఎంలో పెట్టుబడిని అలీబాబా సింగపూర్ హోల్డింగ్స్ ద్వారా వెచ్చించింది. భారత ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ పెట్టుబడి నేరుగా చైనా నుంచి వచ్చినట్లు కాదు, సింగపూర్ ఖాతాలోకి వెళ్తుంది. ఇలా మారువేషంలో చైనా నుంచి భారత్లోకి వస్తున్న పెట్టుబడులు చాలానే ఉన్నాయని ‘గేట్వే హౌస్’ నివేదిక చెబుతోంది. మొత్తంమీద భారత్లోని 30 స్టార్టప్ యూనికార్స్న్(బిలియన్ డాలర్లకు మించి విలువ కలిగినవి)కు ఈ ఏడాది మార్చివరకూ చైనా టెక్ ఇన్వెస్టర్ల నుంచి లభించిన మొత్తం పెట్టుబడులు 4 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 30,000 కోట్లు) పైనే ఉంటుందని అంచనా. బల్క్ డ్రగ్స్... చైనాయే ఆధారం! పరిమాణం పరంగా భారత ఫార్మా పరిశ్రమ ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. విలువ పరంగా చూస్తే 14 ర్యాంకు మాత్రమే. 2018–19లో భారత్ 1400 కోట్ల డాలర్లకు పైగా విలువైన ఔషధాలను ఎగుమతి చేసింది. అదేసమయంలో ఔషధాల తయారీలో అత్యంత కీలకమైన యాక్టివ్ ఫార్మా ఇంగ్రేడియంట్స్(ముడి పదార్థాలు–ఏపీఐ) దిగుమతుల్లో మూడింట రెండు వంతులు చైనా నుంచే నమోదవడం గమనార్హం. ఇప్పుడు ఉన్నపళంగా చైనా దిగుమతులను తగ్గించుకుంటే... ఆమేరకు మనకు సరఫరా చేసేందుకు ఇతరదేశాలేవీ సిద్ధంగా లేవని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. చైనా గనుక సరఫరా తగ్గిస్తే మన ఔషధ రంగానికి చాలా నష్టం వాటిల్లుతుందనేది ఫార్మా సంస్థల ఆందోళన. స్మార్ట్ ఫోన్స్లో ఆధిపత్యం.. భారత్లో అమ్ముడవుతున్న ప్రతి 100 స్మార్ట్ఫోన్స్లో 72 చైనావే అంటే నమ్ముతారా? అవును ఇది ముమ్మాటికీ నిజం! అంతగా మనం చైనా చౌక మొబైల్స్కు అలవాటుపడిపోయాం. షావోమీ, వివో, ఒప్పో, వన్ప్లస్ వంటి బ్రాండ్స్ మొత్తం కలిపి భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లో 72% వాటాను కొల్లగొట్టాయని గేట్వే హౌస్ నివేదిక పేర్కొంది. చైనా మొబైల్స్ దెబ్బకి శాంసంగ్, యాపిల్ అట్టడుగుకు పడిపోయాయి. టిక్ ‘టాప్’...: భారత్లో చైనా మొబైల్ యాప్ టిక్టాక్కు ఉన్న ప్రాచుర్యం గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. 2016 సెప్టెంబర్లో అందుబాటులోకి వచ్చిన టిక్టాక్కు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 80 కోట్లకు పైగా యాక్టివ్ యూజర్లు(నెలవారీ) ఉన్నారు. దాదాపు 200 కోట్ల మేర డౌన్లోడ్స్ అయ్యాయి. ఇందులో సుమారు 50 కోట్ల డౌన్లోడ్స్ భారత్ నుంచే ఉండటం గమనార్హం. టిక్టాక్ వాడకంలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానం(తర్వాత స్థానాల్లో చైనా–18 కోట్ల డౌన్లోడ్స్, అమెరికా–13 కోట్ల డౌన్లోడ్స్) ఉంది. చైనా ప్రతీకారం.. న్యూఢిల్లీ: భారత్లో స్వదేశీ ఉద్యమం ఊపందుకుంటున్న నేపథ్యంలో చైనా ప్రతీకార చర్యలకు దిగుతోంది. తమ కన్సైన్మెంట్లను హాంకాంగ్, చైనా కస్టమ్స్ అధికారులు నిలిపివేస్తున్నారంటూ ఎగుమతిదారులు తాజాగా ఆందోళన వ్యక్తం చేశారు. చెన్నై పోర్టులో చైనా నుంచి వచ్చిన దిగుమతులకు సంబంధించి భారత అధికారులు తీసుకున్న చర్యలకు ప్రతిగా ఆ దేశం ఇలాంటి చర్యలకు దిగుతోందని ఎగుమతిదారుల సమాఖ్య ఎఫ్ఐఈవో పేర్కొంది. ‘చైనా దిగుమతులన్నింటినీ కస్టమ్స్ శాఖ భౌతికంగా ఒక్కో దాన్నీ తనిఖీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా దిగుమతుల వ్యయం పెరిగిపోతోంది. దీంతో హాంకాంగ్, చైనా కస్టమ్స్ అధికారులు కూడా భారత్ నుంచి వచ్చే కన్సైన్మెంట్ల పై ఇలాంటి వైఖరే చూపిస్తున్నారు‘ అని వాణిజ్య శాఖ కార్యదర్శి అనూప్ వాధ్వాన్కు రాసిన లేఖలో ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ ఎస్కె సరాఫ్ పేర్కొన్నారు. కింకర్తవ్యం..? చైనాతో సరిహద్దు వివాదం ముదిరింది కాబట్టి ఆ దేశంతో పూర్తిగా తెగదెంపులు చేసుకునే అవకాశం లేదని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇలా చేస్తే చైనా కంటే భారత్కే అధిక నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెబుతున్నాయి. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్(స్వయం సమృద్ధి)తో దేశీయంగా తయారీకి ప్రోత్సాహం లభించినప్పటికీ.. చైనా కంపెనీలు, చైనా దిగుమతులను పూర్తిగా లేకుండా చేయలేమని విశ్లేషకులు చెబుతున్నారు. మేకిన్ ఇండియానే చూసుకుంటే... భారత్లో తయారీ ప్లాంట్లను పెట్టాలని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు షావోమీ, వివో, ఒప్పో, హేయర్ తదితర అనేక చైనా కంపెనీలు సైతం భారత్లో ప్లాంట్లు నెలకొల్పాయి. భారీగా పెట్టుబడులు, ఉపాధిని కల్పిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో సరిహద్దు వివాదాలను సాకుగా చూపి వాటిని వెళ్లగొట్టగలమా? అలాచేస్తే అంతర్జాతీయ ఒప్పందాల ఉల్లంఘన కింద మనం భారీగా నష్టపరిహారాన్ని చెల్లించాల్సి రావడంతోపాటు ఇన్వెస్టర్లలో అభద్రతా భావం నెలకొనేందుకు దారితీస్తుంది. దిగుమతుల విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తే ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. అయితే, చైనా నుంచి క్రమంగా దిగుమతులను తగ్గించుకోవచ్చని.. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్కు తైవాన్, మలేషియా, జపాన్, కొన్ని యూరప్ దేశాలను ప్రత్యామ్నాయంగా మార్చుకోవచ్చని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. మేకిన్ ఇండియాలో చైనాకు క్రమంగా ప్రాధాన్యం తగ్గించి ఇతర దేశాలను ప్రోత్సహించేలా దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్లడం మంచిదనేది వారి సూచన!! సాక్షి బిజినెస్ విభాగం -
భారత్-చైనా వివాదం: బ్రిటన్ కీలక వ్యాఖ్యలు
లండన్ : సరిహద్దు వివాదాన్ని భారత్, చైనాలు చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకోవాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పిలుపు ఇచ్చారు. ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణలతో సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయని, ఈ పరిణామాలు ఆందోళనకరమని వ్యాఖ్యానించారు. భారత్-చైనాల మధ్య నెలకొన్న పరిణామాలను బ్రిటన్ నిశితంగా గమనిస్తోందని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. కాగా, సరిహద్దు ఉద్రిక్తతలను నివారించేందుకు సేనల ఉపసంహరణపై భారత్, చైనా సైనికాధికారుల మధ్య ఏకాభిప్రాయం వ్యక్తమైనా డ్రాగన్ దూకుడు తగ్గడం లేదు. చర్చల్లో శాంతి మంత్రం జపిస్తూనే మరోవైపు తూర్పు లడఖ్ సహా వాస్తవాధీన రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో బలగాలను మోహరిస్తూనే ఉంది. చదవండి : బాయ్ కాట్ చైనా : సీఏఐటీ మరో అడుగు -
వేగంగా బలగాలు వెనక్కి
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్లోని ఘర్షణాత్మక సరిహద్దు ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించడానికి సంబంధించి జూన్ 6న ఇరుదేశాల సైన్యాధికారుల మధ్య కుదిరిన ఒప్పందాల అమలును వేగవంతం చేయాలని భారత్, చైనా నిర్ణయించాయి. తద్వారా సరిహద్దుల్లో శాంతి, సామరస్యం నెలకొంటాయని ఏకాభిప్రాయానికి వచ్చినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)ను రెండు దేశాలు విధిగా గౌరవించాలని నిర్ణయించినట్లు తెలిపింది. భారత్, చైనా బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతస్థాయి దౌత్య చర్చలు జరిపాయి. ఈ చర్చల్లో భారత్ తరఫు విదేశాంగ శాఖలోని తూర్పు ఆసియా వ్యవహారాల సంయుక్త కార్యదర్శి నవీన్ శ్రీవాస్తవ, చైనా తరఫున ఆ దేశ విదేశాంగ శాఖలోని డైరెక్టర్ జనరల్ వూ జియాంఘావో పాల్గొన్నారు. దౌత్య, మిలటరీ మార్గాల్లో సంప్రదింపులను కొనసాగించాలని రెండు దేశాలు అంగీకారానికి వచ్చినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఈ చర్చల్లో తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో పరిస్థితిని విపులంగా చర్చించారని, గల్వాన్ లోయలో జూన్ 15న జరిగిన హింసాత్మక ఘర్షణల విషయమై భారత్, చైనాను నిలదీసిందని వెల్లడించింది. అయితే, ఒక వైపు చర్చలు సాగిస్తూనే, మరోవైపు, తూర్పు లద్దాఖ్తో పాటు సిక్కిం, ఉత్తరాఖండ్, అరుణాచల్ప్రదేశ్ల్లోని ఎల్ఏసీ వెంబడి ఉన్న కీలక ప్రాంతాలకు మరిన్ని బలగాలకు చైనా పంపిస్తుండటం గమనార్హం. చైనా నోట మళ్లీ అదే మాట.. గల్వాన్లో ఇరుదేశాల సైనికులు మృతి చెందడానికి భారత్దే బాధ్యత అని చైనా మరోసారి వ్యాఖ్యానించింది. చైనా రక్షణ, విదేశాంగ శాఖల అధికారులు బుధవారం వేర్వేరుగా ఇదే విషయాన్ని వక్కాణించారు. భారత్, చైనాలు ముఖ్యమైన పొరుగు దేశాలని, ప్రస్తుత సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకునేందుకు రెండు దేశాలు కృషి చేయాలని రక్షణ శాఖ అధికార ప్రతినిధి వూ క్వియాన్ పేర్కొన్నారు. జూన్ 15 నాటి గల్వాన్ లోయ ఘర్షణకు భారత దేశమే కారణమని, భారత సైనికులు రెచ్చగొట్టడం వల్లనే ఆ ఘర్షణలు జరిగాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ అన్నారు. భారత విదేశాంగ శాఖ, భారత మీడియా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రెండు దేశాల మధ్య సానుకూల వాతావరణం ఏర్పడుతున్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేయడంపై మీడియా ప్రశ్నించగా.. తాను వాస్తవాలు చెబుతున్నానన్నారు. ఆర్మీ చీఫ్ పర్యటన తూర్పు లద్దాఖ్లోని చైనా సరిహద్దుకు సమీపంగా ఉన్న సైనిక కేంద్రాలను ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె బుధవారం సందర్శించారు. చైనాతో ఇటీవలి ఘర్షణల సమయంలో అత్యంత ధైర్య సాహసాలు చూపిన ఐదుగురు సైనికులకు ప్రశంసాపూర్వక బ్యాడ్జెస్ను అందించారు. లద్దాఖ్లోని సరిహద్దుల్లో సైనిక బలగాల సన్నద్ధతను వరుసగా రెండోరోజు జనరల్ నరవణె పరిశీలించారు. ఫార్వర్డ్ పోస్ట్ల్లో విధుల్లో ఉన్న సైనికులతో మాట్లాడారు. ఆర్మీ చీఫ్కు 14 కార్ప్స్ కమాండర్ లెఫ్ట్నెంట్ జనరల్ హరీందర్ సింగ్, నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్ట్నెంట్ జనరల్ యోగేశ్ కుమార్ జోషి క్షేత్రస్థాయిలో నెలకొన్న వాస్తవ పరిస్థితులను వివరించారు. -
భారత్- చైనా సరిహద్దు ‘చిచ్చు’కు కారణం?
సాక్షి, న్యూఢిల్లీ : సరిహద్దు వివాదం, ఇతర రాజకీయ అంశాల కారణంగా భారత్, చైనా దేశాల మధ్య 1962లో జరిగిన యుద్ధం పునరావృతం కారాదనే ఉద్దేశంతో భారత్ చొరవతో ఇరుదేశాలు పలు చర్యలు తీసుకున్నాయి. అందులో భాగంగా పలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. యుద్ధానంతరం ఇరు దేశాల సరిహద్దు వివాదం పరిష్కారానికి అప్పటి భారత ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ న్యాయ–చారిత్రాత్మక వైఖరిని అవలంబించారు. ఇరు దేశాల మధ్య మరింత మెరుగైన సంబంధాల కోసం ప్రధాని రాజీవ్ గాంధీ 1988లో చైనా పర్యటనకు వెళ్లి అప్పటి చైనా నాయకుడు డెంగ్ జియావోపింగ్తో చర్చలు జరిపారు. పర్యవసానంగా ఇరుదేశాల మధ్య శాంతియుత వాతావరణం ఏర్పడింది. ఆ ఆతర్వాత ఇరుదేశాలు సైనిక బలగాలను ఉపయోగించకుండా, కాల్పులు జరపకుండా ఉండేందుకు 2013లో చైనా, భారత్ దేశాలు ‘బార్డర్ డిఫెన్స్ కొపరేషన్ అగ్రిమెంట్’ చేసుకున్నాయి. 2014లో చైనా అధ్యక్షుడు షిజిన్పింగ్ భారత్ను సందర్శించినప్పుడు ‘డెవలప్మెంటల్ పార్టనర్షిప్’ ఒప్పందం చేసుకున్నారు. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య శాంతియుత వాతావరణమే కొనసాగింది. అప్పుడప్పుడు పాకిస్థాన్కు మద్దతు ఇస్తోందన్న కారణంగా చైనా పట్ల దేశం పట్ల ద్వేషం పెరిగినా అది అంతట్లోనే చల్లారిపోయేది. ఎప్పుడులేని విధంగా ఇప్పుడు భారత్ పట్ల చైనా దురుసుగా వ్యవహరిస్తోంది. ఎందుకు? భారతీయ విద్యార్థుల అంతర్జాతీయ చదువులు, అమెరికాలో భారతీయ టెకీలకు ఉద్యోగాలను దృష్టిలో పెట్టుకొని భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు విదేశాంగ విధానంలో మొగ్గు చూపడం, రానున్న ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకొని ట్రంప్.. మోదీవైపు మొగ్గుచూపడం చైనాకు కంటగింపుగా మారిందని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. అది కంటగింపు కాదని, చైనాకు కడుపు మంట అని, ఆసియా దేశాలన్నీ ఒక్కతాటిన నడవాల్సిన సమయంలో భారత్ పాశ్చాత్య దేశమైన అమెరికాకు దగ్గరవుతుండడం చైనా మంటకు కారణమని కొందరు విశ్లేషకులు అంటున్నారు. 2015లో ‘ఢిల్లీ డిక్లరేషన్ ఆఫ్ ఫ్రెండ్షిప్’ కుదుర్చుకోవడం, 2016లో ‘లాజిస్టిక్స్ ఎక్స్ఛేంజ్ మెమోరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్’ చేసుకోవడం, 2018లో ‘కమ్యూనికేషన్స్ కంపాటిబిలిటీ అండ్ సెక్యూరిటీ అరెంజ్మెంట్స్ కదుర్చుకోవడం, ఆ తర్వాత ‘బెసిక్ ఎక్స్ఛేంజ్ అండ్ కోపరేషన్ అగ్రిమెంట్ ఫర్ జియో స్ఫేషియల్ కోపరేషన్’ తుది ఒప్పందంపై సంతకానికి సిద్ధమవడం, నమస్తే ట్రంప్ పేరిట ఫిబ్రవరి నెలలో 300 కోట్ల రూపాయల డాలర్లతో సైనిక ఒప్పందం కుదుర్చుకోవడం అమెరికావైపు భారత్ మొగ్గు చూపిందనడానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. (‘బాయ్ కాట్ చైనా’ సాధ్యమేనా?) చైనాలోని వుహాన్లో ఉద్బవించిన కరోనా వైరస్ కారణంగా ఆ దేశ ప్రజలు జిన్పింగ్ ప్రభుత్వం పట్ల మండిపడుతున్నారని, వారి దృష్టిని మళ్లించడం కోసం జిన్పింగ్ సరిహద్దు వివాదాన్ని రాజేశారని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. జమ్మూ కశ్మీర్ను రాష్ట్రాన్ని విభజించి లద్ధాఖ్ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడం కూడా వ్యూహాత్మకంగా తమకు విరుద్ధమని చైనా భావిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. (చైనా జనరల్ ఆదేశంతోనే భారత్ పై దాడి!) -
సరిహద్దు వివాదం : చర్చల్లో పురోగతి
సాక్షి, న్యూఢిల్లీ : గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల ఘర్షణలతో పెచ్చుమీరిన సరిహద్దు ఉద్రిక్తతలను నివారించేందుకు ఇరు దేశాల సైనికాధికారుల మధ్య సోమవారం జరిగిన చర్చలు సానుకూలంగా సాగాయని సైన్యం ప్రకటించింది.పూర్తి సామరస్య, సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయని, ఇరు పక్షాల సేనలు వెనక్కితగ్గాలనే అంశంపై పరస్పర అంగీకారానికి వచ్చాయని పేర్కొంది. తూర్పు లడఖ్లోని సమస్యాత్మక ప్రాంతాల్లో సైన్యం వెనక్కిమళ్లేందుకు అంగీకారం కుదిరిందని, ఇరు పక్షాలు ఇదే స్ఫూర్తితో ముందుకు వెళతాయని సైన్యం పేర్కొంది. భారత్-చైనా సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో ఉద్రిక్తతలను నివారించే ఉద్దేశంతో తూర్పు లడఖ్లో చైనా భూభాగంలోని మోల్దో ప్రాంతంలో సోమవారం ఇరు దేశాల మధ్య లెఫ్టినెంట్ జనరల్ స్ధాయి చర్చలు జరిగిన విషయం తెలిసిందే. జూన్ 6న చివరిసారిగా జరిగిన ఈ చర్చల్లో సరిహద్దు ప్రాంతాల నుంచి సేనల ఉపసంహరణకు భారత్, చైనా అంగీకరించాయి. తొలి భేటీ అనంతరం కొద్దిరోజులకే భారత్, చైనా సేనల మధ్య భీకర ఘర్షణలు చోటుచేసుకోవడంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చదవండి : ‘బాయ్ కాట్ చైనా’ సాధ్యమేనా? -
సరిహద్దు వివాదంపై మన్మోహన్ సింగ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : చైనాతో సరిహద్దు ఘర్షణల విషయంలో ప్రభుత్వం తాత్సారం చేయవద్దని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హితవు పలికారు. కరోనా మహమ్మారిని ప్రభుత్వం దీటుగా ఎదుర్కోవడంలో విఫలమైందని విమర్శలు గుప్పిస్తూ సరిహద్దు వివాదంలోనూ ఇలాగే వ్యవహరించవద్దని అన్నారు. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం సమర్ధవంతంగా చేపట్టలేకపోతోందని ఆరోపించారు. మహమ్మారి కట్టడికి ప్రభుత్వం ధైర్యంగా ముందుకు వెళ్లడం లేదని దుయ్యబట్టారు. మంగళవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో తలెత్తిన మరో సంక్షోభాన్నీ ఇదే తరహాలో ఎదుర్కొంటే తీవ్ర పరిస్థితికి దారితీస్తుందని మన్మోహన్ ఆందోళన వ్యక్తం చేశారు. సీడబ్ల్యూసీ సమావేశంలో మన్మోహన్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి రణ్దీప్ సింగ్ సుర్జీవాలా ట్వీట్ చేశారు. సింగ్ వ్యాఖ్యలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని పేర్కొన్నారు. చదవండి : పర్యవసానాలపై అవగాహన ఉండాలి -
పర్యవసానాలపై అవగాహన ఉండాలి
న్యూఢిల్లీ: గల్వాన్ ఘటన, తదనంతర పరిణామాలపై ప్రభుత్వం, ప్రధాన విపక్షం కాంగ్రెస్ల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తి మాటలు.. చైనా తన చర్యలను సమర్ధించు కునేందుకు ఉపయోగపడేలా ఉండవద్దని మాజీ ప్రధాని మన్మోహన్ వ్యాఖ్యానించారు. అత్యంత బాధ్యతాయుత పదవిలో ఉన్న వ్యక్తికి తన వ్యాఖ్యల పర్యవసానాలపై కచ్చితంగా అవగాహన ఉండాలన్నారు. ‘దేశానికి నాయకత్వం వహిస్తున్న వారిపై పవిత్రమైన బాధ్యత ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఆ బాధ్యత ప్రధానిపై ఉంటుంది’ అన్నారు. ‘దేశ ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వడం అనేది దౌత్య నీతికి, సమర్ధ నాయకత్వానికి ప్రత్యామ్నాయం కాబోదు’ అని తేల్చిచెప్పారు. ‘చైనా భారత భూభాగంలో అడుగుపెట్టలేదు. భారత పోస్ట్లను స్వాధీనం చేసుకోలేదు’ అని ఇటీవల అఖిలపక్ష భేటీలో మోదీ చేసిన వ్యాఖ్యలపై మన్మోహన్ పై విధంగా స్పందించారు.సరిహద్దుల రక్షణలో ప్రాణాలు అర్పించిన జవాన్లకు సరైన న్యా యం జరగాలని పేర్కొన్నారు. ‘అందులో ఏమా త్రం లోపం జరిగినా అది ప్రజల విశ్వాసాలకు చేసిన చరిత్రాత్మక ద్రోహం అవుతుంది’ అన్నారు. -
సరిహద్దు వివాదం: ఆర్మీచీఫ్ క్షేత్రస్థాయి పర్యటన
సాక్షి, న్యూఢిల్లీ : చైనాతో సరిహద్దు ఉద్రికత్తలు తీవ్రమవడంతో క్షేత్రస్ధాయి పరిస్థితులను సమీక్షించేందుకు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె మంగళవారం లేహ్, కశ్మీర్లను సందర్శిస్తారని సమాచారం. బలగాల సన్నద్ధతతో పాటు చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖల వెంబడి దళాల మోహరింపును ఆర్మీ చీఫ్ సమీక్షిస్తారు. తూర్పు లడఖ్లోని గల్వాన్ లోయలో గత వారం భారత్-చైనా సైనికుల ఘర్షణలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో జనరల్ నరవణే లేహ్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా నరవణే సోమవారం ఢిల్లీలో ఉన్నత సైనికాధికారులతో భద్రత పరిస్థితిపై చర్చించారు. కమాండర్ల సదస్సు సందర్భంగా సైనికాధికారులు, కమాండర్లు దేశ రాజధానిలో అందుబాటులో ఉన్నారు. మరోవైపు సరిహద్దు వివాద పరిష్కారానికి, తూర్పు లడఖ్లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు చైనా భూభాగంలోని మోల్దో-చుసుల్ లోయలో ఇరు దేశాల కార్ప్స్ కమాండర్ల చర్చలు కొనసాగుతున్నాయి. చదవండి : నోరువిప్పిన చైనా.. కమాండర్ మృతి! -
‘మన్మోహన్ హయాంలో చైనాకు లొంగిపోయారు’
సాక్షి, న్యూఢిల్లీ : లడఖ్ ఘర్షణలకు సంబంధించి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలపై బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తీవ్రంగా మండిపడ్డారు. చైనాతో ఘర్షణలో మరణించిన 20 మంది వీరజవాన్లకు న్యాయం చేయాలని, వారికి ఏ మాత్రం తక్కువ చేసినా ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసినట్టేనని మన్మోహన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. మన భద్రతా దళాల స్ధైర్యాన్ని పలుమార్లు నిర్వీర్యం చేసిన పార్టీకి మన్మోహన్ సింగ్ ప్రాతినిథ్యం వహిస్తున్నారని నడ్డా ఎద్దేవా చేశారు. చైనాకు బెంబేలెత్తి 43,000 కిలోమీటర్ల భూభాగాన్ని బీజింగ్కు గతంలో అప్పగించారని దుయ్యబట్టారు. యూపీఏ హయాంలో చైనాతో పోరాడాకుండానే మన భూభాగంపై రాజీపడ్డారని నడ్డా ట్వీట్ చేశారు. మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలో వందలాది కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనాకు అప్పగించారని ఆరోపించారు. 2010 నుంచి 2013 మధ్య మన్మోహన్ హయాంలో చైనా 600 సార్లు భారత్ భూభాగంలోకి చొరబాట్లు సాగించిందని నడ్డా అన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ ఏ అంశంలో అయినా తన విజ్ఞానాన్ని పంచుకోవచ్చని కానీ ప్రధాని కార్యాలయం బాధ్యతల్లో మాత్రం కాదని చురకలంటించారు. పీఎంఏ ప్రతిష్టను యూపీఏ మసకబార్చిందని విమర్శించారు. డాక్టర్ సింగ్..కాంగ్రెస్ పార్టీలు పదేపదే మన సేనలను అవమానించడం మానుకోవాలని హితవుపలికారు. చదవండి : ప్రకటనలపట్ల మోదీ జాగ్రత్తగా ఉండాలి: మన్మోహన్ -
ఆయన ‘సరెండర్’ మోదీ: రాహుల్
న్యూఢిల్లీ: భారత భూభాగాన్ని చైనాకు అప్పగించారు(సరెండర్ చేశారు) అంటూ ప్రధాని మోదీపై శనివారం నిప్పులు చెరిగిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం మరో అడుగు ముందుకేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అసలు పేరు సరెండర్ మోదీ అని ఎద్దేవా చేశారు. అయితే, ఇంగ్లిష్ పదం సరెండర్ స్పెల్లింగ్ను surrenderకు బదులు surender అని ఆయన పేర్కొనడం గమనార్హం. ఈ మేరకు ఆయన ‘చైనాతో భారత్ బుజ్జగింపు విధానం బట్టబయలు’అనే శీర్షికతో ఉన్న విదేశీ పత్రికలోని కథనాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. భారత భూభాగాన్ని ఎవరూ ఆక్రమించుకోలేదని ప్రధాని చెబుతున్నప్పటికీ పాంగాంగ్ త్సో సమీపంలోని భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకున్నట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా వెల్లడవుతోందని చెప్పారు. ఇందుకు సంబంధించిన టీవీ వార్తా కథనం క్లిప్పింగ్ను కూడా జత చేశారు. -
భారత్, చైనాలతో మాట్లాడుతున్నాం: ట్రంప్
వాషింగ్టన్: భారత్, చైనాల మధ్య సయోధ్యకు ప్రయత్నిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం పేర్కొన్నారు. గల్వాన్ ఘటన నేపథ్యంలో.. రెండు దేశాల మధ్య నెలకొన్న తీవ్రస్థాయి ఉద్రిక్తతలను తగ్గించేందుకు సహాయపడే ఉద్దేశంతో తమ ప్రభుత్వం భారత్, చైనాలతో మాట్లాడుతోందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘పరిస్థితి సీరియస్ గానే ఉంది. మేం భారత్తో, చైనాతో మాట్లాడుతున్నాం. వాళ్లు పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నారు. వాళ్లు ముఖాముఖి తలపడ్డారు. అక్కడేం జరిగిందో చూసాం. వివాద పరిష్కారంలో వారికి సాయం చేయాలని ప్రయత్నిస్తున్నాం’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘చైనా సైన్యమైన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ భారత్తో సరిహద్దు ఉద్రిక్తతలను పెంచుతోంది. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో కూడా తనవి కాని ప్రాంతాలను తనవేనని ప్రకటిస్తూ ఉద్రిక్తతలను రాజేస్తోంది’ అని యూఎస్ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. చైనాలోని అధికార కమ్యూనిస్ట్ పార్టీని ధూర్త వ్యవస్థగా అభివర్ణించారు. ట్రంప్ ప్రభుత్వం గల్వాన్ ఘటనపై భారత్కు మద్దతిస్తోంది. -
‘భావోద్వేగాలతో చెలగాటం తగదు’
సాక్షి, న్యూఢిల్లీ : గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల ఘర్షణ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను భావోద్వేగాలతో తప్పుదారిపట్టించరాదని నటుడు, రాజకీయనేత కమల్ హాసన్ కోరారు. చైనా మన భష్త్రభాగాన్ని ఆక్రమించలేదని, మన పోస్ట్ను స్వాధీనం చేసుకోలేదని అఖిలపక్ష భేటీలో ప్రధాని చేసిన వ్యాఖ్యలను ప్రశ్నించిన వారిపై తప్పుడు వక్రీకరణలు చేస్తున్నారని ప్రచారం చేయడం పట్ల కమల్ విస్మయం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తన ప్రకటనలతోనే ప్రజల్ని భావోద్వేగపూరిత పద్ధతుల్లో తప్పుదారిపట్టిస్తోందని మక్కల్ నీది మయ్యం చీఫ్ దుయ్యబట్టారు. ఈ తరహా ప్రచారం మానుకోవాలని ప్రధానితో పాటు ఆయన మద్దతుదారులకు విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. ప్రశ్నించేవారిని జాతివ్యతిరేకులుగా చిత్రించడం సరికాదని, ప్రశ్నించడం ప్రజాస్వామిక హక్కని అన్నారు. వాస్తవం తమ చెవిన పడేవరకూ తాము ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ప్రధాని అఖిలపక్ష సమావేశంలో వెల్లడించిన అంశాలు ఆర్మీ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటనలకు భిన్నంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. కాగా అఖిలపక్ష భేటీలో ప్రభుత్వం వాస్తవాధీన రేఖ వెంబడి వాస్తవ పరిస్థితులను పూర్తిగా వివరించలేదని విపక్ష పార్టీలు పేర్కొన్నాయి. చదవండి : ‘ప్రభుత్వం వాస్తవాలను వెల్లడించలేదు’ -
‘చైనా దురాక్రమణకు అవే సాక్ష్యం’
సాక్షి, న్యూఢిల్లీ : తూర్పు లడఖ్లో గతవారం భారత్, చైనా సేనలు తలపడిన గల్వాన్ లోయలో శాటిలైట్ ఫోటోలను పరిశీలిస్తే ప్యాంగాంగ్ సరస్సు వద్ద భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని చూపుతున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోదీ సర్కార్పై విమర్శలు గుప్పించారు. చైనా సేనలు మన భూభాగంలోకి రాలేదని, మన పోస్టులను ఆక్రమించలేదని ప్రధాని నరేంద్ర మోదీ అఖిలపక్ష భేటీలో చెప్పిన దానికి విరుద్ధంగా శాటిలైట్ ఇమేజ్లు ఉన్నాయని రాహుల్ ఆదివారం ట్వీట్ చేశారు. కాగా, శాటిలైట్ చిత్రాల్లో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సోమవారం రాత్రి చోటుచేసుకున్న ఘర్షణలకు పదిరోజుల ముందే గల్వాన్ ప్రాంతానికి 200కి పైగా ట్రక్కులు, బుల్డోజర్లు, ఇతర పరికరాలను తరలించినట్టు వెల్లడైంది. చదవండి : ప్రధాని వ్యాఖ్యలకు వక్రభాష్యాలు.. పీఎంవో స్పష్టత! -
ఫేక్ ట్వీట్కు లైక్: అభాసుపాలైన కాంగ్రెస్ నేత
న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్.. చైనా యువతి చేసిన ఓ ఫేక్ ట్వీట్కు లైక్ కొట్టి అభాసుపాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. శనివారం చైనాకు చెందిన ఈవా ఝంగ్ అనే యువతి తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఓ వీడియోను ఆయన లైక్ చేశారు. చైనా సైన్యం గల్వాన్ ఘర్షణల సందర్భంగా గాయపడ్డ భారత సైన్యానికి సహాయం చేసిందని, ఈ సంఘటనలో చైనా సైనికులెవ్వరూ మరణించలేదని సదరు యువతి ట్వీట్ చేసింది. ఘర్షణల్లో గాయపడి ఆక్సిజన్ అందక ఇబ్బంది పడుతున్న భారత సైనికులకు చైనా సైనిక స్థావరాల్లో సహాయం అందిందని ఆమె పేర్కొంది. ఈవా ట్వీట్ అయితే అందులో నిజానిజాలు తెలుసుకోకుండా ఆయన దాన్ని చూసిన వెంటనే లైక్ కొట్టేశారు. ఆ వీడియో గల్వాన్ ఘర్షణలకు చెందినది కాదని, 2017 సంవత్సరానిదని కొందరు నెటిజన్లు గుర్తించడంతో కొద్దిసేపటి తర్వాత ఆ ట్వీట్ను ఈవా డిలేట్ చేసింది. దీంతో నెటిజన్లు శశిథరూర్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి : గల్వాన్ లోయ మాదే -
గల్వాన్ వంతెన నిర్మాణం విజయవంతం
చైనా కంటగింపునకు, గల్వాన్ ఘటనకు ప్రధాన కారణమైన గల్వాన్ వంతెన నిర్మాణాన్ని భారత సైన్యం విజయవంతంగా పూర్తి చేసింది. గల్వాన్ ఘటనతో ఏమాత్రం వెనుకంజ వేయని భారత సైనికాధికారులు మంగళవారం ఉదయం.. ఆర్మీ కంబాట్ ఇంజనీర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ‘గల్వాన్ నదిపై తలపెట్టిన వంతెన నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలి’ అనేది ఆ ఉత్తర్వుల సారాంశం. వెంటనే రంగంలోకి దిగిన ఇంజనీర్లు, సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలుపెట్టారు. (చైనా కాఠిన్యంపై అమెరికా ఆగ్రహం) ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా ఆ పనులను ఏకబిగిన 72 గంటల పాటు కొనసాగించి, గురువారం మధ్యాహ్నం కల్లా పూర్తి చేశారు. వంతెనపై రెండు గంటలపాటు వాహనాలను నడిపి విజయవంతంగా పరీక్షించి చూశారు. జూన్ 15వ తేదీన రెండు బలగాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగిన ‘పెట్రోల్ పాయింట్ 14’కు ఈ వంతెన కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. 60 మీటర్ల పొడవైన ఈ బెయిలీ(ఎక్కడికైనా తీసుకెళ్లగలిగే వీలున్న) వంతెనపై ఫిరంగి దళ వాహనాలతోపాటు ఇతర అన్ని రకాల వాహనాలు రాకపోకలు సాగించవచ్చు. (చైనా ఆక్రమించినవి స్వాధీనం చేసుకుంటాం) వాస్తవ నియంత్రణ రేఖ వద్దకు బలగాలు వేగంగా చేరుకునేందుకు ఈ వంతెన కీలకంగా మారనుంది. ఈ వంతెనతో దర్బాక్ నుంచి దౌలత్ బేగ్ ఓల్దీ వరకు 255 కిలోమీటర్ల మేర రహదారిని భారత్ కాపాడుకోగలదు. భారత్, చైనాలకు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన గల్వాన్ నది పరీవాహక ప్రాంతంలో మన దేశం చేపట్టిన నిర్మాణాల్లో ఈ వంతెన కూడా ఒకటి. సరిహద్దు ప్రాంతాల్లో భారత ఆర్మీ ఇంజనీర్ల సాయంతో బోర్డర్ రోడ్డు ఆర్గనైజేషన్(బీఆర్వో) తలపెట్టిన మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులు.. చైనా ఎన్ని కుట్రలు పన్నినా కొనసాగుతాయని ఓ ఉన్నతాధికారి స్పష్టం చేశారు. (చైనా దురాగతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి..) -
గల్వాన్ లోయ మాదే
న్యూఢిల్లీ/బీజింగ్: గల్వాన్ లోయ తమదేనంటూ శనివారం చైనా చేసిన ప్రకటనను భారత్ తీవ్రంగా ఖండించింది. అతిశయోక్తితో కూడిన చైనా వాదన ఏమాత్రం ఆమోదయోగ్యంకాదని స్పష్టం చేసింది. విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘గల్వాన్ లోయ చారిత్రకంగా భారత్దే. గతంలో ఎన్నడూ ఇది చైనా భూభాగం కాదు. రెండు దేశాల బలగాలు ఈ ప్రాంతంలో గస్తీ చేపడుతున్నా చాలాకాలంగా ఎటువంటి ఘటనలు జరగలేదు. ఇదే తీరును చైనా కొనసాగించాలి. ఉల్లంఘించేందుకు చేసే ఎలాంటి ప్రయత్నాన్నైనా భారత బలగాలు తగిన విధంగా తిప్పికొడతాయి’ అని అన్నారు. ఇటీవల రెండు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య కుదిరిన అవగాహన మేరకు చైనా వ్యవహరిస్తుందని భావిస్తున్నామన్నారు. చైనా ట్విట్టర్లో కనిపించని మోదీ ప్రసంగం గల్వాన్ ఘటనపై ఈనెల 18వ తేదీన ప్రధాన మంత్రి మోదీ చేసిన ప్రసంగంతోపాటు, విదేశాంగ శాఖ ప్రతినిధి శ్రీవాస్తవ చేసిన వ్యాఖ్యలను చైనాలోని ప్రధాన సోషల్ మీడియా సైట్లు తొలగించాయి. వీబో, వుయ్చాట్ సైట్లలో వీటిని తమకు కనిపించకుండా చేశారని చైనాలోని భారత దౌత్యాధికారులు తెలిపారు. చైనా ట్విట్టర్ ‘సినావీబో’, ‘ఉయ్చాట్’కు కోట్లాదిగా యూజర్లున్నారు. అన్ని దౌత్య కార్యాలయాలు, ప్రధాని మోదీ వంటి పలువురు ప్రపంచ నేతలకు ఇందులో అకౌంట్లున్నాయి. వీబో, వుయ్చాట్ల్లో భారత్తో సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలకు సంబంధించి ఎలాంటి పోస్టులు లేవు. అది దుర్మార్గమైన భాష్యం భారత, చైనా సరిహద్దుల్లో పరిస్థితులపై ప్రధాని మోదీ ఇచ్చిన వివరణకు కొందరు దుర్మార్గపూరితంగా పెడార్థాలు తీస్తున్నారని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) పేర్కొంది. ‘తూర్పు లద్దాఖ్లోని భారత భూభాగంలోకి ఎవరూ అడుగు పెట్టలేదు. భారత సైనిక పోస్టులను ఎవరూ ఆక్రమించుకోలేదు.. ’అంటూ శుక్రవారం ప్రతిపక్షాలతో భేటీలో ప్రధాని మోదీ ఇచ్చిన వివరణపై కాంగ్రెస్ నేతల నుంచి వచ్చిన వ్యాఖ్యలపై పీఎంవో వివరణ ఇచ్చింది. ‘మన జవాన్ల వీరోచిత పోరాటం ఫలితంగానే భారత్ వైపునున్న వాస్తవ నియంత్రణ రేఖ దాటి చైనా బలగాలు అడుగుపెట్టలేదని ప్రధాని మోదీ శుక్రవారం ప్రతిపక్షాలకు చెప్పారు. బిహార్ రెజిమెంట్లోని 16 మంది జవాన్ల త్యాగాల ఫలితంగానే ఆరోజు చైనా సైన్యం ఎల్ఏసీ దాటి వచ్చి, నిర్మాణాలు చేపట్టేందుకు చేసిన ప్రయత్నం సాగలేదు. మన జవాన్లు వారికి తగిన బుద్ధి చెప్పారు. దేశ సరిహద్దులు కాపాడేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ భారత్ వదులుకోదని ప్రధాని అన్నారు. కానీ, కొన్ని వర్గాలు ప్రధాని మోదీ వ్యాఖ్యలకు దుర్మార్గపూరితంగా వక్రభాష్యాలు చెప్పేందుకు ప్రయత్నించాయి’అని శనివారం పీఎంవో పేర్కొంది. మన భూభాగాన్ని చైనాకు అప్పగించారు: రాహుల్ భారత భూభాగాన్ని ప్రధాని మోదీ చైనాకు అప్పగించారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. భారత భూభాగంలోకి ఎవరూ అడుగుపెట్టలేదనీ, సైనిక పోస్టులను ఎవరూ ఆక్రమించుకోలేదని శుక్రవారం ప్రధాని మోదీ ఇచ్చిన వివరణపై ఆయనతోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఈ మేరకు స్పందించారు. ‘ప్రధాని మోదీ భారతీయ భూభాగాన్ని చైనా దురాక్రమణకు అప్పగించారు. అది చైనా ప్రాంతమే అయితే మన సైనికులు ఎందుకు, ఎక్కడ ప్రాణాలర్పించారు’అని ట్విట్టర్లో రాహుల్ ప్రశ్నలు సంధించారు. చిల్లర రాజకీయాలు వద్దు: అమిత్ షా గల్వాన్ లోయలోని భారత భూభాగాన్ని ప్రధాని మోదీ చైనాకు అప్పగించారంటూ కాంగ్రెస్ నేత రాహుల్ చేసిన వ్యాఖ్యలపై హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ చిల్లర రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన ట్విట్టర్లో విమర్శించారు. గల్వాన్ ఘటనలో గాయపడిన జవాను తండ్రి.. సరిహద్దు ఉద్రిక్తతలను రాజకీయం చేయొద్దంటూ రాహుల్ను కోరుతున్నట్లుగా ఉన్న వీడియోను పోస్ట్ చేశారు. ‘రాహుల్ గాంధీకి సాహస సైనికుడి తండ్రి ఒక స్పష్టమైన సందేశం ఇచ్చారు. జాతి యావత్తూ కలిసికట్టుగా ఉండాల్సిన ఈ క్లిష్ట సమయంలో చిల్లర రాజకీయాలను పక్కనబెట్టి, జాతి ప్రయోజనాల కోసం సంఘీభావంగా నిలవాలి’అని హోం మంత్రి పేర్కొన్నారు. -
మన సరిహద్దు క్షేమం
న్యూఢిల్లీ: మన భూభాగంలోకి ఎవరూ రాలేదని, సరిహద్దు క్షేమమని, మన ఆర్మీ పోస్ట్లను ఎవరూ స్వాధీనం చేసుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. చైనా సాగించిన దురాగతానికి యావద్దేశం గాయపడిందని, ప్రజలంతా ఆగ్రహంగా ఉన్నారని పేర్కొన్నారు. భారత్ శాంతిని, స్నేహ సంబంధాలనే కోరుకుంటుందని, అదే సమయంలో, దేశ సార్వభౌమత్వం విషయంలో రాజీ లేదని, అదే మనకు సర్వోన్నతమని స్పష్టం చేశారు. సరిహద్దులను కాపాడే విషయంలో సైన్యం సమర్ధంగా వ్యవహరిస్తోందన్నారు. అవసరమైన చర్యలు తీసుకునేందుకు ఆర్మీకి పూర్తి స్వేచ్ఛనిచ్చామన్నారు. వాస్తవాధీన రేఖకు సంబంధించి భారత్ విధానాన్ని దౌత్య మార్గాల ద్వారా చైనాకు స్పష్టం చేశామని ప్రధాన రాజకీయ పార్టీల అగ్రనేతలతో పేర్కొన్నారు. తూర్పు లద్దాఖ్లో చైనాతో సరిహద్దు ఘర్షణల్లో 20 మంది భారతీయ జవాన్లు అమరులై, చైనాతో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రధాని∙మోదీ శుక్రవారం అఖిలపక్ష భేటీ నిర్వహించారు. ప్రభుత్వానికి అండగా ఉంటామని భేటీలో పాల్గొన్న అన్ని రాజకీయ పార్టీలు ప్రకటించాయి. రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఇతర ప్రధాన పార్టీల అగ్రనేతలు ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాల్వన్ లోయలో జూన్ 15 రాత్రి చైనా సైనికులతో చోటు చేసుకున్న ఘర్షణ తదనంతర పరిణామాలను, ప్రస్తుత పరిస్థితిని మంత్రులు రాజ్నాథ్ సింగ్, జై శంకర్ పార్టీల నేతలకు వివరించారు. చైనాతో వ్యవహరించాల్సిన తీరుపై దాదాపు 4 గంటల పాటు సాగిన ఈ భేటీలో వివిధ పార్టీల నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. మొదట, చైనాతో సరిహద్దు ఘర్షణల్లో అమరులైన 20 మంది వీర జవాన్లకు ప్రధాని, మంత్రులు, పార్టీల నేతలు 2 నిమిషాల పాటు మౌనం పాటించి, నివాళులర్పించారు. జవాన్ల త్యాగం వృధా కాబోదని ప్రధాని పునరుద్ఘాటించారు. భారత్ వైపు చూసే ధైర్యం చేసినవారికి మన వీర జవాన్లు తగిన గుణపాఠం చెప్పారని ప్రధాని వ్యాఖ్యానించారు. గాల్వన్ లోయ, ప్యాంగ్యాంగ్ సరస్సు ప్రాంతాల్లోని భారత భూభాగాల్లోకి చైనా సైనికులు చొచ్చుకువచ్చారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రధాని వివరణ ఇచ్చారు. మన భూభాగంలో ఒక అంగుళాన్నైనా ఎవరూ ఆక్రమించుకునే ధైర్యం చేయలేనంత స్థాయిలో సామర్థ్యాన్ని పెంపొందించుకున్నామన్నారు. ఈ భేటీలో ఎన్సీపీ నేత శరద్పవార్, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కే చంద్ర శేఖర రావు, పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ, డీఎంకే నేత స్టాలిన్, బిహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్ కుమార్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే, సీపీఎం నేత సీతారాం యేచూరి పాల్గొన్నారు. చైనా పెట్టుబడులు వద్దు: మమత భారత్లోని మౌలిక వసతుల రంగంలో చైనా పెట్టుబడులను అంగీకరించవద్దని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ సూచించారు. ఈ సంక్షోభ సమయంలో తమ పార్టీ కేంద్రానికి మద్దతుగా నిలుస్తుందన్నారు. కమిటీ ఏర్పాటు చేస్తారా?: యేచూరి చైనాతో సరిహద్దుల్లో ఘర్షణాత్మక వాతావరణం ఏర్పడ్డానికి, 20 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవడానికి నిఘా వైఫల్యం కారణమా అని తేల్చేందుకు ఏదైనా కమిటీని నియమిస్తారా? అని సీపీఎం నేత సీతారాం యేచూరి ప్రశ్నించారు. గతంలో కార్గిల్ వార్ అనంతరం.. వైఫల్యాలపై విచారణ జరిపేందుకు అప్పటి ప్రధాని వాజ్పేయి ఒక కమిటీ వేసిన విషయాన్ని యేచూరి గుర్తు చేశారు. మీ సైనికులెవరూ మా ఆధీనంలో లేరు:చైనా బీజింగ్: భారతీయు సైనికులు ఎవరూ ‘ప్రస్తుతం‘తమ ఆధీనంలో లేరని చైనా శుక్రవారం స్పష్టం చేసింది. తూర్పు లడాఖ్ సరిహద్దుల్లో జూన్ 15న భారత్ చైనాల మధ్య ఘర్షణలో పొరుగుదేశం మన సైనికులను బందీలుగా చేసి తీసుకెళ్లిందన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావ్ లిజియాన్ మీడియాకు ఈ విషయం తెలిపారు. నిఘా వైఫల్యమా?: సోనియా సరిహద్దుల్లో చైనాతో ఘర్షణల్లో 20 మంది భారత జవాన్ల మృతికి నిఘా వైఫల్యం కారణమా? అని సోనియాగాంధీ ప్రశ్నించారు. గాల్వన్ లోయలో యథాతథ స్థితి నెలకొంటుందని, చైనా వెనక్కు వెళ్తుందని హామీ ఇవ్వాలని ప్రధానమంత్రిని కోరారు. భేటీ ప్రారంభంలో సోనియా పలు ప్రశ్నలను సంధించారు. చైనా దళాలు తూర్పు లద్దాఖ్లో భారత భూభాగంలోకి వచ్చాయా? వస్తే ఎప్పుడు వచ్చాయి? ఆ ప్రాంతంలో చైనా దళాల అసాధారణ కదలికలపై మన నిఘా సంస్థలు సమాచారం ఇవ్వలేదా? అని ఆమె ప్రశ్నించారు. తదుపరి కార్యాచరణ ఏమిటన్నారు. సైనికుల మధ్య ఘర్షణలు ప్రారంభమైన మే 5 నుంచి జూన్ 6 వరకు విలువైన కాలాన్ని ప్రభుత్వం వృధా చేసిందని ఆరోపించారు. మమ్మల్ని ఆహ్వానించరా? ఈ భేటీకి ఆహ్వానించకపోవడంపై ఆప్, ఆర్జేడీ, ఎంఐఎం ఆగ్రహం వ్యక్తం చేశాయి. దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరాయి. ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్యాదవ్, ఆయన కూతురు మీసాభారతి, ఆ పార్టీ ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన తెలిపారు. బిహార్లో తమది ప్రధాన ప్రతిపక్షమని, ఈ భేటీకి ఆహ్వానించకపోవడం సరికాదన్నారు. అయితే, అన్ని గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు, లోక్సభలో ఐదుగురు, లేదా ఆపై ఎంపీలున్న పార్టీలు, ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలు, కేబినెట్లో మంత్రులున్న పార్టీలను మాత్రమే భేటీకి ఆహ్వనించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. లేహ్లో ఐఏఎఫ్ చీఫ్ భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమైన నేపథ్యంలో.. భారత వైమానిక దళాధిపతి చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా లేహ్, శ్రీనగర్ల్లో పర్యటించారు. ఎయిర్ఫోర్స్ సన్నద్ధతను పరిశీలించారు. -
తొందరపడొద్దు.. తలవంచొద్దు: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: భారత్–చైనా సరిహద్దుల్లో ఘర్షణలు తలెత్తిన నేపథ్యంలో ఏమాత్రం తొందరపాటు ఉండొద్దని, అదే సమయంలో దేశ ప్రయోజనాల విషయంలో తలవంచాల్సిన అవసరం లేదని సీఎం కె.చంద్రశేఖర్రావు అభిప్రాయపడ్డారు. చైనాను ఎదుర్కొనేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలు అవలంబించాలని ప్రధానికి సూచించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి పూర్తి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. దేశంలో ఇప్పుడు కావల్సింది రాజ కీయం (రాజనీతి) కాదని, యుద్ధనీతి (రణనీతి) కావాలని పేర్కొ న్నారు. దేశంలో పాలన సుస్థిరంగా ఉండడంతోపాటు గొప్ప ఆర్థిక శక్తిగా ఎదగడం ఓర్వలేకనే చైనా కయ్యానికి కాలు దువ్వుతోందని అభిప్రాయపడ్డారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అఖిలపక్ష భేటీలో పాల్గొన్న సందర్భంగా ప్రధాని మోదీతో కలసి అమర జవాన్లకు నివాళులర్పిస్తున్న సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్రెడ్డి చైనాతో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వ హించిన అఖిలపక్ష సమావేశంలో టీఆర్ఎస్ అధ్యక్షుడి హోదాలో సీఎం కేసీఆర్ తన అభిప్రాయాలు వెల్లడించారు. ‘చైనా, పాకిస్తాన్ లకు తమ దేశాల్లో అంతర్గత సమస్యలున్నప్పుడు సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం సృష్టించడం అలవాటు. ఇప్పుడు చైనాలో అంతర్గత సమస్యలున్నాయి. దక్షిణ చైనా సముద్ర తీర దేశాలైన మలేసియా, ఫిలిప్పీన్స్, జపాన్ తదితర దేశాలతో కూడా చైనా ఘర్షణలకు దిగుతోంది. చైనా వైఖరి ప్రపంచవ్యాప్తంగా బాగా బద్నాం అయింది’అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అది తొందరపాటు చర్య అవుతుంది... ‘చైనా నుంచి వస్తువుల దిగుమతులు ఆపాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అది తొందరపాటు చర్య అవుతుంది. ప్రస్తుతం దిగుమతి చేసుకుంటున్న వస్తువులు మన దేశంలోనే తయారు కావాలి. ప్రజలకు సరసమైన ధరల్లో వస్తువులు దొరకాలి. ముందుగా మనం ఈ విషయాలపై దృష్టి పెట్టాలి’అని కేసీఆర్ సూచించారు. రక్షణ వ్యవహారాల్లో మిత్రదేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. బ్రిటన్ ప్రతిపాదించిన డి–10 గ్రూపులో కలవాలని, ఓరాన్ అలయెన్సులో చేరాలని, హువాయ్ కంపెనీ ఎత్తుగడను తిప్పికొట్టాలని అభిప్రాయపడ్డారు. ‘భారతదేశంతో చైనా మొదటి నుంచి ఘర్షణ వైఖరి అవలంభిస్తోంది. గాల్వన్ లోయ వంటి సంఘటనలు గతంలోనూ జరిగాయి. ఇది మొదటిది కాదు.. చివరిదీ కాదు. 1957లో సరిహద్దు వివాదం లేవనెత్తింది. 1962లో ఏకంగా భారత్–చైనా మధ్య పూర్తిస్థాయి యుద్ధమే జరిగింది. ఇక ఇటీవల చైనా మనదేశంతో ఘర్షణాత్మక వైఖరి అవలంభించడానికి ప్రత్యేక కారణాలున్నాయి. కాశ్మీర్ విషయంలో కొత్త చట్టాలు తెచ్చాం. అక్కడి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నాం. మనది శాంతికాముక దేశం. అదే సమయంలో సహనానికి హద్దు ఉంటుంది. ఎవరైనా మన మీదకి వస్తే తీవ్రంగా ప్రతిఘటించాలి. దేశ రక్షణ, ప్రయోజనాల విషయంలో రాజీపడొద్దు. ఈ పరిస్థితుల్లో రాజకీయం అవసరం లేదు. రణనీతి కావాలి. దేశమంతా ఒక్కతాటిపై నిలబడాల్సిన సమయమిది. గతంలో కూడా ఇతర దేశాలతో ఘర్షణలు, యుద్ధాలు జరిగినప్పుడు ఇలాగే నిలబడిన సందర్భాలున్నాయి’అని కేసీఆర్ పేర్కొన్నారు. భారతదేశ పురోగతి చైనాకు నచ్చట్లేదు.. ‘కరోనా వైరస్కు చైనాయే కారణమనే అపఖ్యాతి వచ్చింది. ఆ దేశం నుంచి చాలా బహుళ జాతి సంస్థలు బయటకు వస్తున్నాయి. అవి భారతదేశంవైపు చూస్తున్నాయి. పెట్టుబడులకు భారతదేశం అత్యుత్తమైనదని ప్రపంచవ్యాప్తంగా భావిస్తున్నారు. ప్రపంచబ్యాంకు రిపోర్టు ప్రకారం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భారత్ 142వ స్థానం నుంచి 63వ స్థానానికి ఎదిగింది. భారతదేశంలో ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీలు బాగా అమలవుతున్నాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా పెరుగుతున్నాయి. 2014 నుంచి 2017 వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 36 బిలియన్ డాలర్ల నుంచి 61 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఇంకా పెరగడానికి అవకాశాలున్నాయి. చైనా నుంచి తీసుకొచ్చి తెలంగాణలో తమ కంపెనీలు పెట్టడానికి చాలా మంది ముందుకొస్తున్నారు. ఇది చైనాకు నచ్చడంలేదు’అని సీఎం కేసీఆర్ వివరించారు. -
చైనా వ్యతిరేక బాటలో మరో తరం
హిందీ చీనీ భాయి భాయి అనే స్ఫూర్తికి 1962 నాటి యుద్ధంలో చైనా తూట్లు పొడిచిందనే భావం భారతీయ తరాలను వెంటాడుతూ వస్తోంది. తాజాగా ఇరుదేశాల సరిహద్దుల పొడవునా చైనా దూకుడు చర్యలకు పాల్పడుతుండటంతో ప్రస్తుత తరం భారతీయుల్లో కూడా చైనా వ్యతిరేక భావాలు ప్రబలిపోతున్నాయి. కరోనా వైరస్ను చైనా వైరస్ అని ఆరోపించేంత స్థాయిలో చైనా పట్ల వ్యతిరేకత నేటి భారతీయ తరంలోనూ వ్యాపిస్తోంది. చైనాపై ఇంతటి వ్యతిరేకతకు సహేతుకమైన, అహేతుకమైన కారణాలు కూడా ఉండవచ్చు కానీ.. చైనా పట్ల దృఢమైన ప్రతికూల అభిప్రాయంతోనే మరో భారతీయ తరం కూడా గడిపేయడంలో నిజమైన ప్రమాదం పొంచి ఉందని భావిస్తున్నాను. నాతల్లిదండ్రుల తరం నుంచి భారతీయులు సర్వసాధారణంగా చైనాపట్ల వ్యతిరేక భావనలతోనే పెరుగుతూ వస్తున్నారు. 1962లో భారత్–చైనా యుద్ధ కాలం నాటి వారి జ్ఞాపకాలనుంచే ఈ వ్యతిరేక భావన పుట్టుకొస్తూ ఉంది. మన ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, చైర్మన్ మావో జెడాంగ్ ప్రోత్సహించిన హిందీ చీనీ భాయి భాయి అనే స్ఫూర్తికి నాటి యుద్ధం ద్వారా చైనా వెన్నుపోటు పొడిచిందని, ద్రోహపూరితంగా వ్యవహరించిందని భారతీయులు భావిస్తూ వస్తున్నారు. ఆ తరంలో బలపడిన భావాలను మనం ఒకమేరకు అర్థం చేసుకోవచ్చు. కానీ ఇంతవరకు తటస్తంగా ఉంటూ వస్తున్న ప్రస్తుత తరం భారతీయులు కూడా గత కొన్నేళ్లుగా చైనా పట్ల ప్రతికూల భావాలను పెంచుకుంటూ పోతున్నారు. దీనికి మూడు కీలకమైన ఘటనలు దోహదం చేస్తున్నట్లు కనబడుతోంది. ఒకటి, భారత్–చైనా సరిహద్దులోని మూడు సెక్టార్లలోనూ చైనా దూకుడు చర్యలకు పాల్పడుతుండటం. రెండు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ పోరును ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో చైనా వ్యతిరేకించడం. మూడు. అణు సరఫరా బృందంలో (ఎన్ఎస్జి) చేరడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలను చైనా వ్యతిరేకించడం. భారతీయ నూతన తరం ప్రధానంగా పాశ్చాత్య దృక్పధంతో ప్రభావితమవుతోంది. అమెరికాలో లేక యూరప్లో చదువులు, విదేశీ ఉత్పత్తుల వినియోగం, సినిమాలు, టీవీ షోలు చూడటం, విహారయాత్రలు, ఉద్యోగావకాశాలు వంటి అనేక విషయాల్లో మన యువతరం పశ్చిమ దేశాలవైపే ఉంటోంది. 2019 నాటికి అమెరికాలో చదువుతున్న మొత్తం భారతీయ విద్యార్థుల సంఖ్య 2,02,014 కాగా చైనాలో చదువుతున్న వారి సంఖ్య 23,000 మాత్రమే. అమెరికాలో 26 లక్షల 50 వేలమంది భారతీయులు నివసిస్తున్నారని అధికారిక లెక్కలు. ఇక చైనాలో కేవలం 55 వేల మంది భారతీయులు మాత్రమే నివసిస్తున్నారు. అది కూడా షాంఘై, బీజింగ్, గాంగ్జౌ వంటి మహానగరాలకే వీరు పరిమితం. ఇక హాంకాంగ్లో 31,569మంది భారతీయులు నివసిస్తున్నారు. ఈవిధంగా పాశ్చాత్య, ఇంగ్లిష్ చలామణిలో ఉన్న దేశాల పట్ల ఇంత మక్కువ చూపుతున్నందువల్లే భారతీయ యువతరం సాధారణంగానే ఆ దేశాల పట్ల సానుకూలవైఖరిని, సదభిప్రాయాన్ని కలిగి ఉంటోంది. లోవీ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన 2013 ఇండియా పోల్ ఆయా దేశాలపై భారతీయులు పెంచుకున్న జనరంజక మనోభావాలు, ఆసక్తి, స్నేహపూర్వకమైన ఆత్మీయ భావనలకు సంబంధించిన థెర్మోమీటర్ సూచిని తయారు చేసింది. ఈ సూచిక ప్రకారం అమెరికా పట్ల భారతీయ యువతరం 62 డిగ్రీల మేరకు సానుకూలత ప్రదర్శిస్తుండగా చైనా పట్ల 44 డిగ్రీల సదభిప్రాయాన్ని మాత్రమే ప్రదర్శిస్తున్నారు. ఇక పాకిస్తాన్ పట్ల అయితే 20 డిగ్రీల కనిష్ట స్థాయి సానుకూలతనే మనవాళ్లు ప్రదర్శిస్తున్నారు. అలాగే ప్యూ గ్లోబల్ సంస్థ ఇటీవలే నిర్వహించిన ఒపీనియన్ పోల్స్ ప్రకారం 23 శాతం భారతీయులు మాత్రమే చైనాకు అనుకూల వైఖరితో ఉండగా, 46 శాతం మంది చైనా వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నట్లు తేలింది. అంటే ఇటీవలికాలంలో చైనా పట్ల భారతీయుల వ్యతిరేకత బాగా పెరిగిందన్నమాట. కాగా, తక్షశిల ఇన్స్టిట్యూషన్ నిర్వహించిన ర్యాపిడ్ పోల్లో పాల్గొన్న 1299 మందిలో 67 శాతం మంది భారతీయులు కోవిడ్–19 వైరస్ వ్యాప్తికి చైనాదే బాధ్యత అని నమ్ముతున్నట్లు స్పష్టమైంది. వీరిలో 50 శాతంమందికి పైగా ఈ వ్యాధిని చైనీస్ వైరస్ అని పిలుస్తూ, కరోనా వ్యాధిని వ్యాపింపచేయడంలో తన బాధ్యతను పొరుగుదేశమైన చైనా తప్పించుకోలేదు అనే అభిప్రాయాన్ని కలిగి ఉన్నట్లు తేలింది. భారత్, చైనాలు 1962లో పరిమితమైన సరిహద్దు యుద్ధంలో పాల్గొన్నాయి. దీంతో ఆనాటి నుంచి 1989 వరకు ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా స్తంభించిపోయాయి. సరిహద్దు సమస్యపై భారత్, చైనాలకు చెందిన ప్రత్యేక ప్రతినిధులు ఇంతవరకు 22 దఫాలుగా చర్చలు నిర్వహిస్తూ వచ్చారు కానీ ఈ సమస్యపై ఒక సమగ్ర పరిష్కారాన్ని చేరుకోలేకపోయారు. అయితే సరిహద్దులలో చొరబాట్ల కారణంగానే సరిహద్దు సమస్యలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయంటూ భారత మీడియాలో పదే పదే జరుగుతున్న ప్రచార, ప్రసార అంశాలు మన యువతరంపై తమదైన ప్రభావాన్ని ప్రతిఫలింపచేస్తున్నాయి. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజహర్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించే విషయంలో మొదట్లో చైనా తీవ్రంగా వ్యతిరేకించడం తెలిసిన విషయమే. కాగా 2001లో పార్లమెంటుపై దాడి, 2008లో ముంబై దాడులు మొదలుకుని భారతదేశంలో అత్యంత హీనాతిహీనమైన ఉగ్రదాడులకు మసూద్ అజహర్ సూత్రధారి అని ప్రపంచానికంతటికీ తెలుసు. 2016లో పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై, 2019లో పుల్వామాలో జాతీయరహదారిలో సైనికుల కాన్వాయిపై ఉగ్రదాడులు మసూద్ పథకరచనే అని అందరూ భావిస్తున్నారు. గత 20 ఏళ్లుగా మసూద్ అజహర్ నేతృత్వంలో జరుగుతూ వస్తున్న ఈ ఉగ్రవాద దాడులు దేశంలో వందలాదిమంది ప్రాణాలను బలిగొనడమే కాదు.. దేశవ్యాప్తంగా ప్రజాజీవితంలో బీభత్సం సృష్టించాయి. కానీ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థను నిషిద్ధ జాబితాలో పెట్టించేందుకు భారతదేశం చేసిన తీవ్ర ప్రయత్నాలను 2009, 2016, 2017 సంవత్సరాల్లో చైనా నాయకత్వం అడ్డుకుంది. అంతర్జాతీయ సమాజం ఉగ్రవాద బాధిత దేశంగా భారత్ను గుర్తించి మద్దతు పలుకుతున్న నేపథ్యంలో చైనా ఎట్టకేలకు సాంకేతికపరమైన తన అభ్యంతరాలను పక్కనబెట్టి మసూద్ అజహర్ని గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించాలనే ఐరాస భద్రతామండలి ప్రతిపాదనకు 2019 మే నెలలో ఆమోదం తెలిపింది. భారత్ ప్రయత్నాల పట్ల చైనా ఇంతగా వ్యతిరేకత ప్రదర్శించడం పాకిస్తాన్కి మద్దతు తెలుపడంలో భాగమేనని తెలిసిన విషయమే. అమెరికాతో 2005లో కీలకమైన పౌర అణు ఒప్పందాన్ని కుదుర్చుకున్న తర్వాత 2016 మే నుంచి అణు సరఫరా బృందంలో చేరడానికి భారతదేశం తీవ్ర ప్రయత్నాలు సాగిస్తోంది. అణుపరీక్షల నిషేధ ఒప్పందం (ఎన్పీటీ) పై సంతకం చేయకుండా అణుసరఫరా బృందం (ఎన్ఎస్జీ)లో చేరడానికి భారత్కు మినహాయింపు ఇవ్వకూడదంటూ చైనా చేస్తున్న వ్యాఖ్యానం సరైందే కావచ్చు. కానీ ఇదే అంశంలో పాకిస్తాన్కు మధ్దతు తెలుపడం ద్వారా చైనా తన నిబద్ధతకు తానే తూట్లు పొడుస్తోంది. పాకిస్తాన్ సైతం అణుపరీక్షల నిషేధ ఒప్పందంపై సంతకం పెట్టలేదు. కానీ అణుసరఫరా బృందంలో సభ్యత్వం కోసం పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలకు చైనా తొలినుంచి మద్దతు ఇస్తూనే ఉంది. అణుసరఫరా బృందంలో సభ్యత్వం విషయంలో భారత్ ప్రయత్నాలకు చైనా అడ్డుపడుతుండటంపై భారతదేశానికి చెందిన ప్రముఖ మేధోచింతన బృందాల్లో ఒకటైన అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ వ్యాఖ్యానిస్తూ, ఎన్ఎస్జీలో చేరిక విషయంలో భారతదేశం ఏకంగా చైనా గోడతోనే తలపడుతోందని పేర్కొంది. ఈరోజు భారతీయ యువతరం ఇండియన్ మార్కెట్లో సింహభాగం ఆక్రమించిన వివో, ఒప్పో, జియోమి వంటి సంస్థలకు చెందిన స్మార్ట్ ఫోన్లతో పాటు పలు చైనా ఉత్పత్తులను వినియోగిస్తోంది. ఇక చైనా ఉత్పత్తి అయిన టిక్ టాక్ భారత్లో ఎంత పాపులర్ అయిందో చెప్పనవసరం లేదు. అయితే ఇటీవలి సరిహద్దు వివాదం తర్వాత ‘రిమూవ్చైనాయాప్స్’అనే భారతీయ యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి పదిలక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. దీంతో ఒక దేశం వ్యాపార ప్రయోజనాలకు భంగకరంగా వ్యవహరిస్తోందని చెబుతూ గూగుల్ ప్లే స్టోర్ ఈ యాప్ను తొలగించింది. వినియోగదారులు వాడుతున్న ఫోన్లలో చైనా అప్లికేషన్లు ఏవి అని వారికి చూపిస్తూ చైనా యాప్లను తమ స్మార్ట్ ఫోన్లనుంచి తొలగించడానికి ‘రిమూవ్చైనాయాప్స్’ అనే యాప్ తోడ్పడుతుంది. అలాగే చైనా నుంచి విదేశీ పెట్టుబడిపై నూతన ఆంక్షలను భారత ప్రభుత్వం విధించడాన్ని సోషల్ మీడియా చక్కగా స్వాగతించడం విశేషం. ఈ అంశంలో కూడా భారతీయ యువత అత్యుత్సాహాన్ని ప్రదర్శించింది. అంతర్జాతీయ వ్యవహారాల్లో అధ్యాపకుడిగా, నా విద్యార్థులు కోవిడ్ సాంక్రమిక వ్యాధి విస్తరణకు గాను చైనానే నిందించడానికి ప్రయత్నించే టాపిక్స్నే తమ చర్చల్లో ఎక్కువగా ఎంచుకుంటుండటాన్ని చూస్తుంటాను. భారతీయ మునుపటి తరాలు 1962 యుద్ధం తర్వాత చైనా గురించి తమ మనస్సుల్లో నిర్దిష్టంగా వ్యతిరేక వాతావరణం పెంపొందించుకున్నారు. అయితే ప్రస్తుత భారతీయ తరం కూడా అదే క్రమాన్ని అనుసరిస్తున్నారేమోనని నేను భీతిల్లుతున్నాను. మార్కెట్ వాటాపై తాత్కాలిక ప్రభావాన్ని మించి, చైనా గురించిన దృఢమైన వ్యతిరేక అభిప్రాయంతోనే మరోతరం కూడా గడిపేయడంలో నిజమైన ప్రమాదం పొంచి ఉందని భావిస్తున్నాను. వ్యాసకర్త ప్రొఫెసర్, ఇంటర్నేషనల్ పాలిటిక్స్, ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్శిటీ డాక్టర్ రాజ్దీప్ పాకనాటి. mail : rpakanati@jgu.edu -
ముక్తకంఠం
లద్దాఖ్లోని గాల్వాన్ లోయలో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద మన భూభాగంలోకి చొచ్చుకొచ్చి 20మంది జవాన్ల ఉసురు తీసిన చైనా కుతంత్రంపై శుక్రవారం కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. సంక్షోభాలు తలెత్తినప్పుడు, ఇరుగు పొరుగు దేశాలతో సమస్యలెదురైన ప్పుడు అఖిల పక్ష సమావేశాలు నిర్వహించడం, అందరి అభిప్రాయాలూ తీసుకోవడం మన దేశంలో రివాజు. అందులో వ్యక్తమయ్యే విలువైన సూచనల్ని స్వీకరించడం, వాస్తవ పరిస్థితిపై అందరికీ అవగాహన కలిగించడం ప్రభుత్వం చేసే పని. ఎన్నికల్లో గెలుపోటములతో సంబంధం లేకుండా అన్ని పక్షాలకూ ప్రజల్లో అంతో ఇంతో పలుకుబడి వుంటుంది. అందువల్ల ఆ పార్టీలకు సమస్య పూర్వాపరాలు వివరించి, ఆ సమస్య పరిష్కారానికి అనుసరిస్తున్న విధానాలను, వాటి వెనకున్న కారణాలను తెలియజెప్పడం...వారి మనోగతాన్ని తెలుసుకోవడం, సందేహాలను తీర్చడం అఖిల పక్ష సమావేశాల నిర్వహణ వెనకుండే ఆంతర్యం. తమ నిర్ణయానికి అనుగుణంగా అందరినీ కూడ గట్టడం కోసం చేసే ప్రయత్నమిది. ప్రధానమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఏకపక్షంగా కాకుండా, ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తున్నదన్న అభిప్రాయం ప్రజానీకంలో కలగడానికి, సమష్టి భావనకు ఇవి దోహదపడతాయి. ముఖ్యంగా పొరుగు దేశాలతో సంబంధాలు క్షీణించినప్పుడు, అవి సైనిక ఘర్షణకు దారితీసే పరిస్థితులున్నప్పుడు అఖిల పక్ష సమావేశాలు జాతీయంగానే కాదు... అంతర్జాతీయ కోణంలో కూడా చాలా అవసరం. తాము నిర్ణయాత్మకంగా వ్యవహరిం చబోతున్నామన్న స్పష్టమైన సందేశం ఘర్షణ పడే పొరుగు దేశానికి పంపడం ముఖ్యం. అఖిలపక్ష సమావేశంలో వ్యక్తమయ్యే అభిప్రాయాలు సమస్య తీవ్రతను ప్రపంచానికి చాటుతాయి. అవి నైతిక మద్దతిచ్చేందుకు దోహదపడతాయి. కల్నల్ సంతోష్ బాబుతో సహా 20మంది జవాన్లను అయిదు రోజులక్రితం చైనా సైనికులు అత్యంత దారుణంగా రాళ్లతో, ఇనుప రాడ్లతో కొట్టి చంపారు. మరో పది మంది జవాన్లను అపహ రించుకుపోయారు. చర్చల తర్వాత విడుదల చేశారు. ఎప్పటినుంచో మన అధీనంలోవుంటున్న గాల్వాన్ లోయ నుంచి వెనక్కు వెళ్లాలని, ఈ విషయంలో అంతక్రితం కుదిరిన ఉమ్మడి అవ గాహనను గౌరవించాలని కోరినందుకు వారు విరుచుకుపడ్డారు. సరిహద్దుల్లో సైనిక ఘర్షణలెలా వుంటాయో మన సినిమాల్లో చూపిస్తుంటారు. ఆ దృశ్యాలను చూడటానికి అలవాటుపడినవారికి చైనా సైనికులతో జరిగిన ఘర్షణలుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో వున్న దృశ్యాలు చూసిన ప్పుడు సహజంగానే ఆశ్చర్యం కలిగింది. అత్యాధునిక ఆయుధాల వినియోగం, పరస్పరం కాల్పులు, అందుకోసం పొజిషన్లు తీసుకోవడం వంటివిలేవు. ఒకరినొకరు తోసుకోవడం, ఆగ్రహంతో ఊగి పోతూ మాట్లాడటం కనబడింది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి కూడా ఇలాంటి సందేహమే కలిగింది. చైనా సైనికులతో సమావేశానికెళ్లే మన జవాన్లు నిరాయుధంగా ఎందుకెళ్లవలసి వచ్చిందని ప్రశ్నించారు. అందుకు 1996, 2005 సంవత్సరాల్లో ఇరు దేశాల మధ్యా కుదిరిన ఒప్పందాలు కారణమన్నది విదేశాంగమంత్రి జైశంకర్ జవాబు. వాటి ప్రకారం ఎల్ఏసీకి రెండు కిలోమీటర్ల లోపులో కాల్పులు జరపకూడదని, పేలుడు పదార్ధాలు, ప్రమాదకరమైన రసాయనాలు వినియోగిం చకూడదన్నవి షరతులు. ఉపయోగించాల్సిన పరిస్థితి వుంటే అయిదు రోజుల ముందు చెప్పాలని కూడా ఆ ఒప్పందాల్లో వుంది. భవిష్యత్తులో అనుకోనివిధంగా సరిహద్దులు ఉద్రిక్తంగా మారిన ప్పుడు మారణాయుధాలు, బాంబులు వినియోగిస్తే ఇరువైపులా ప్రాణనష్టంతో పరిస్థితి చేయిదాటి పోతుందని, పరిష్కారం జటిలమవుతుందని భావించబట్టే ఇవి ఉనికిలోకి వచ్చాయని ఎవరికైనా అర్ధమవుతుంది. కానీ చైనాకు ఇదంతా పట్టలేదు. మారణాయుధాలు వినియోగించకూడదు కాబట్టి కర్రలతో, ఇనుపరాడ్లతో, రాళ్లతో ఏమైనా చేయొచ్చని అది భావించినట్టుంది. ఇలాంటి కుతంత్రాన్నే మన జవాన్లు కూడా అనుసరిస్తే పరిస్థితి వేరుగా వుండేది. కుదుర్చుకున్న ఒప్పందాలను గౌరవిం చడం, వాటికి కట్టుబడటం ఏ దేశానికైనా గౌరవప్రతిష్టలు తెస్తుందే తప్ప వాటిని మసకబార్చదు. సమస్య పరిష్కారానికి వివిధ ప్రత్యామ్నాయాలున్నాయి. స్థానికంగా సైన్యంలోని బ్రిగేడ్ కమాండర్ స్థాయి అధికారులు మొదలుకొని దౌత్యపరమైన మార్గాల వరకూ అనేకం వున్నాయి. అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నవారంతా కేంద్రం తీసుకోబోయే ఎలాంటి చర్యలకైనా సంపూర్ణ మద్దతునిస్తామని చెబుతూనే దౌత్యపరంగా, వాణిజ్యపరంగా అన్ని రకాల ప్రయత్నాలూ చేయాలని సూచించడం హర్షించదగ్గది. చైనా దురాగతానికి దేశమంతటా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతు న్నాయి. అయితే యుద్ధమే అన్నిటికీ పరిష్కారమనే వైఖరి ఎప్పుడూ మంచిది కాదు. గాల్వాన్ లోయ వద్ద ఇప్పుడు జరిగిన పరిణామాల్లో అంతర్జాతీయంగా ప్రతిష్ట కోల్పోయింది చైనాయే. ఎల్ఏసీ పొడవునా వున్న దాదాపు 23 సమస్యాత్మక ప్రాంతాల్లో గాల్వాన్ ఎప్పుడూ లేదని ప్రపంచ దేశాలు గుర్తించాయి. చైనా ఎత్తుగడల్లోని ఆంతర్యాన్ని గ్రహించాయి. ఈ సమయంలో దౌత్యపరంగా ఒత్తిళ్లు తీసుకురావడం అవసరం. అలాగే సరిహద్దుల్లో నిఘా పెంచడం కూడా కీలకం. మన జవాన్లతో చైనా సైనికులు తగాదాకు దిగే సమయానికి సంఖ్యాపరంగా వారు తక్కువుండటం...తోపులాటలతో, వాగ్వాదాలతో కాలక్షేపం చేసి, తమవారిని సమీకరించుకున్నాక దాడికి దిగడం వారి కుటిలత్వానికి అద్దం పడుతుంది. గాల్వాన్లో చైనా సైనికుల కదలికలు గురించి నెల్లాళ్లుగా స్థానికులు చెబుతున్నా ఆ సమాచారం మన సైన్యానికి లేదన్న విమర్శలున్నాయి. ఈ ఘర్షణల సమయంలోనూ అంతే. వెనకనుంచి వారికి మద్దతుగా మరిన్ని బలగాలు వస్తున్నాయన్న సమాచారం లేదు. ఇలాంటి లోటుపాట్లు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. సరైన సమయంలో అప్రమత్తమయ్యే స్థితివున్నప్పుడు ప్రత్యర్థిపక్షం ఆటలు సాగవు. -
కీలక భేటీకి ఆహ్వానించరా..?
సాక్షి, హైదరాబాద్ : చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం జరిగిన అఖిలపక్ష భేటీకి ఏఐఎంఐఎంను ఆహ్వానించకపోవడం పట్ల ఆ పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అసంతృప్తి వ్యక్తం చేశారు. చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై జరిగిన అఖిలపక్ష సమావేశానికి తమ పార్టీని పిలవకపోవడం నిరాశకు గురిచేసిందని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు. కీలక భేటీకి తమను ఆహ్వానించకపోవడంపై ఓవైసీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఇండో-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో జాతీయ ఏకాభిప్రాయం, సమిష్టి స్పందన అవసరం కాగా ఈ సమావేశానికి ఏఐఎంఐఎంను పిలవకపోవడం దురదృష్టకరమని లేఖలో పేర్కొన్నారు. తమ పార్టీ చిన్న రాజకీయ పార్టీయే అయినా ఆ పార్టీ అధ్యక్షుడిగా తాను భారత భూభాగాన్ని చైనా ఆక్రమించడంపై మాట్లాడిన తొలి కొద్ది మంది ఎంపీల్లో తాను ఒకడినని గుర్తు చేశారు. విదేశీ సైన్యం సరిహద్దులు దాటి దేశ భూభాగాన్ని ఆక్రమించడం జాతీయ సవాల్ అని, అన్ని రాజకీయ పార్టీలను విశ్వాసంలోకి తీసుకుంటేనే ఈ సవాల్ను అధిగమించగలమని ఓవైసీ అన్నారు. చదవండి : డ్రాగన్ అంతపని చేసిందా..? -
అఖిలపక్ష సమావేశం షురూ
సాక్షి, న్యూఢిల్లీ : భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని విపక్ష నేతలతో సమావేశమయ్యారు. ప్రధానితో పాటు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షాలు సమావేశానికి హాజరయ్యారు. ఈ భేటీకి 20 పార్టీలకు చెందిన నేతలకు ఆహ్వానం అందింది. తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు శరద్ పవార్, సోనియా గాంధీ, ఉద్ధవ్ ఠాక్రే, మమతా బెనర్జీ, సీతారాం ఏచూరి సహా పలువురు నేతలు సమావేశంలో పాల్గొన్నారు. గాల్వన్ లోయలో జరిగిన పరిస్ధితులపై రాజ్నాథ్ సింగ్ వివరణ ఇవ్వగా, ఉద్రిక్తతల నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై అఖిలపక్ష భేటీలో చర్చించారు. సమావేశం ప్రారంభం కాగానే అమర జవాన్ల మరణానికి సంతాపంగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అఖిలపక్ష భేటీలో ఏపీ సీఎం ప్రధానితో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. సీఎం జగన్తో పాటు హోంమంత్రి మేకతోటి సుచరిత ఈ సమావేశంలో పాల్గొన్నారు. చదవండి : వ్యాపారం గాడిలో పడింది -
ఫార్వార్డ్ బేస్లకు యుద్ధ విమానాలు
సాక్షి, న్యూఢిల్లీ : డ్రాగన్ కవ్వింపు చర్యలకు పాల్పడితే దీటుగా బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధమవుతోంది. గాల్వన్ లోయలో భారత్, చైనా సైనికుల ఘర్షణతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న క్రమంలో భారత వైమానిక దళ చీఫ్ ఆర్కేఎస్ భదౌరియా శుక్రవారం లీ, శ్రీనగర్లో వైమానిక స్ధావరాలను సందర్శించారు. ఆయా ప్రాంతాల్లో వైమానిక శిబిరాల సన్నద్ధతను సమీక్షించారు. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు తీవ్రమైన క్రమంలో వైమానిక దళం యుద్ధవిమానాలను ఫార్వార్డ్ బేస్లకు కదలడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇండో-చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో వైమానిక దళ చీఫ్ లీ, శ్రీనగర్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. చైనాతో సరిహద్దు వివాదం నెలకొన్న క్రమంలో ఎలాంటి పరిస్థితి తలెత్తినా ఎదుర్కొనేందుకే వైమానిక దళ చీఫ్ భదౌరియా పర్యటన సాగిందని చెబుతున్నారు. కాగా తూర్పు లడఖ్లోని గాల్వన్ లోయలో సోమవారం రాత్రి భారత్-చైనా దళాల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. చదవండి : బయటపడ్డ చైనా కుట్ర.. తాజా ఫొటోలు! -
చైనా కంపెనీ రైల్వే కాంట్రాక్టు రద్దు
న్యూఢిల్లీ: భారత–చైనా సరిహద్దుల్లోని గాల్వన్ ప్రాంతంలో 20 మంది భారత సైనికుల వీర మరణం నేపథ్యంలో రైల్వే శాఖ తీవ్ర నిర్ణయం తీసుకుంది. చైనా కంపెనీకి అప్పగించిన రూ.471 కోట్ల ప్రాజెక్టును రద్దు చేసింది. కాన్పూర్ నుంచి మొగల్సరాయి వరకు ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లోని 417 కి.మీ.ల మార్గంలో సిగ్నలింగ్, సమాచార వ్యవస్థ ఏర్పాటు కోసం చైనాకు చెందిన బీజింగ్ నేషనల్ రైల్వే రీసెర్చ్, డిజైన్ ఇన్స్టిట్యూట్కు చెందిన సిగ్నల్,కమ్యూనికేషన్ గ్రూప్తో 2016లో రైల్వే శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కాంట్రాక్టును 2019కల్లా పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటిదాకా 20 శాతం పనులే పూర్తయ్యాయి. ఇంజినీర్ల పర్యవేక్షణ లేకుండానే పనులు జరుగుతున్నాయని, ఒప్పందం ప్రకారం లాజిక్ డిజైన్ వంటి సాంకేతిక పత్రాలను చైనా సంస్థ ఇప్పటి వరకు తమకు అందించలేదని రైల్వే శాఖ అధికారులు అన్నారు. కాంట్రాక్టును వేగవంతం చేయాలంటూ పలు దఫాలుగా ఆ సంస్థ అధికారులతో చర్చలు జరిపినా ప్రయోజనం కనిపించ లేదన్నారు. సకాలంలో పనులను పూర్తి చేయలేక పోవడంతోపాటు పనుల్లో పురోగతి చాలా స్వల్పంగా ఉండటం వల్లే చైనా సంస్థతో కాంట్రాక్టును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ విషయమై ప్రపంచ బ్యాంకుకు ఇప్పటికే సమాచారం అందించినట్లు చెప్పారు. అయితే, సరిహద్దుల్లో చైనా పాల్పడుతున్న చర్యలకు ప్రతీకారంగానే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. -
‘వివో’ వల్ల మనకే లాభం!
న్యూఢిల్లీ: సరిహద్దు వివాదంతో భారత్లో చైనా వ్యతిరేక ఉద్యమం మొదలైంది. చైనా బ్రాండ్లు, ఉత్పత్తులు కొనుగోలు చేయవద్దని, యాప్లకు దూరంగా ఉండాలని డిమాండ్లు దేశవ్యాప్తంగా ఊపందుకున్నాయి. అయితే భారత క్రికెట్కు బంగారు బాతులాంటి ఐపీఎల్ను ఒక చైనా కంపెనీ (వివో) స్పాన్సర్షిప్ చేస్తోంది. ఇటీవలి వరకు మరో కంపెనీ ‘ఒప్పో’ టీమిండియా ప్రధాన స్పాన్సర్గా వ్యవహరించగా...ఇప్పుడున్న బైజూస్లో కూడా చైనా పెట్టుబడులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైనా కంపెనీలతో అనుబంధం కొనసాగించడంపై వస్తున్న ప్రశ్నలకు బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ సమాధానమిచ్చారు. ‘వివో’ వల్లే మనకే లాభం తప్ప చైనాకు కాదని ఆయన స్పష్టం చేశారు. బోర్డు భావోద్వేగాలతో నిర్ణయం తీసుకోదని, వాస్తవాలు చూడాలని ఆయన అన్నారు. ‘ఇప్పుడంతా భావోద్వేగంతో స్పందిస్తున్నారు. దీన్ని పక్కనబెట్టి యథార్థంగా ఆలోచించండి. చైనా కంపెనీలకు మద్దతు ఇస్తున్నామా లేక అక్కడి నుంచి రాబడి అందుకుంటున్నామా అనే తేడా తెలుస్తుంది. చైనా కంపెనీల ఉత్పత్తుల్ని భారత్లో విక్రయించేందుకు అనుమతిస్తే మన వినియోగంతో వారికి డబ్బు వెళ్తుంది. అదే చైనా కంపెనీ వారి బ్రాండ్ ప్రమోషన్ కోసం మనకు చెల్లిస్తే అక్కడి నుంచి రాబడి వస్తుంది. అంటే భారత ఆర్థిక రంగానికి ఇది లాభించేది! ఎలాగంటే టైటిల్ స్పాన్సర్ కోసం వివో కంపెనీ బీసీసీఐకి సాలీనా రూ. 440 కోట్లు చెల్లిస్తుంది. ఇందులో 42 శాతం పన్నుల రూపంలో ప్రభుత్వానికి వస్తాయి. అంటే ఇది ఆర్థికంగా మనకు మేలు చేసే అంశమే’ అని వివరించారు. ఒక వేళ మనం వద్దనుకుంటే ఆ మొత్తం చైనాకు తరలిపోతుందన్నారు. మరో వైపు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) మాత్రం అవసరమైతే చైనా స్పాన్సర్లను బాయ్కాట్ చేస్తామని తెలిపింది. చైనా స్పోర్ట్స్ పరికరాల కంపెనీ ‘లి–నింగ్’ భారత ఆటగాళ్లకు కిట్ స్పాన్సర్గా ఉందని, టోక్యో ఒలింపిక్స్ వరకు ఈ కాంట్రాక్టు ఉన్నప్పటికీ జనరల్ బాడీ మీటింగ్లో అభ్యంతరాలుంటే రద్దు చేసుకునేందుకు వెనుకాడమని చెప్పారు. -
ఎల్ఏసీకి అదనపు బలగాలు
న్యూఢిల్లీ: గాల్వన్ లోయలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో 3,500 కిలోమీటర్ల భారత్–చైనా సరిహద్దు వెంట అదనపు సైనిక బలగాలను మోహరించాలని కేంద్రం నిర్ణయించింది. ఎల్ఏసీలో సైనిక, వైమానిక దళం హై అలర్ట్ ప్రకటించాయి. చైనా యుద్ధ నౌకలు తిష్టవేసిన హిందూ మహాసముద్రంలో ఇకపై మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని భారత నావికా దళం తమ సిబ్బందికి అదేశాలు జారీ చేసింది. అరుణాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్, లద్దాఖ్లోని ఎల్ఏసీ వద్దకు అదనపు బలగాలు, ఆయుధాలను పంపించినట్లు భారత సైనిక దళం వెల్లడించింది. ఇకనుంచి సన్నద్ధత విభిన్నంగా ఉంటుందని సైనికాధికారి వ్యాఖ్యానించారు. మరోవైపు, గాల్వన్ లోయలో రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణలు జరిగిన ప్రాంతంలో భారత్, చైనాల మధ్య మేజర్ జనరల్ స్థాయి చర్చలు అసంపూర్తిగా నిలిచిపోయాయి. -
‘మీ త్యాగం సమున్నతం’
సాక్షి, న్యూఢిల్లీ : చైనా సేనలతో సోమవారం రాత్రి జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన 20 మంది సైనికులకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ బుధవారం సంతాపం తెలిపారు. అమరవీరుల సమున్నత త్యాగాలను ఆయన కొనియాడారు. దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడేందుకు అత్యున్నత త్యాగం చేసిన సైనికుల ధైర్యానికి సాయుధ దళాల సుప్రీం కమాండర్గా శిరస్సు వంచి ప్రణమిల్లుతున్నానని రాష్ట్రపతి కోవింద్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పేర్కొన్నారు. లడఖ్లోని గాల్వన్ లోయలో నేలకొరిగిన సైనికులందరూ భారత సాయుధ దళాలు నెలకొల్పిన సంప్రదాయాలను సమున్నతంగా నిలబెట్టారని కొనియాడారు. వారి కుటుంబాలకు తాను ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని రాష్ట్రపతి పేర్కొన్నారు. చదవండి : కరోనాపై పోరులో రాష్ట్రపతి సాయం -
ముందస్తు ప్రణాళికతోనే డ్రాగన్ దుశ్చర్య!
సాక్షి, న్యూఢిల్లీ : లడఖ్లోని గాల్వన్ లోయలో చైనా సైనికులు ముందస్తు ప్రణాళికతో వ్యవహరించడం ఘర్షణకు దారితీసిందని ఫలితంగా 20 మంది భారత సైనికులు మరణించారని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీకి వివరించారు. జయశంకర్ బుధవారం వాంగ్తో ఫోన్లో మాట్లాడుతూ లడఖ్లో చోటుచేసుకున్న అసాధారణ ఘటనతో ఇరు దేశాల దౌత్య సంబంధాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని జైశంకర్ హెచ్చరించారు. ఈ ఘటన ఇరు దేశాల దౌత్య ఒప్పందాలపై పెనుప్రభావం చూపుతుందని స్పష్టం చేశారు. సరిహద్దుల్లో పరిస్థితిని చైనా పునఃసమీక్షించుకుని వాస్తవాధీన రేఖను గౌరవించాలని అన్నారు. ఏకపక్ష చర్యలకు పాల్పడరాదని చైనాకు జయశంకర్ తేల్చిచెప్పారు. ఇక ఈ భేటీలో జూన్ 6న సైనికాధికారుల సమావేశంలో కుదిరిన అవగాహన మేరకు ఇరు దేశాల సేనల ఉపసంహరణపై అంగీకారం కుదిరింది. ఉద్రిక్తతలను తగ్గించి సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం నెలకొనేలా వ్యవహరించాలని నిర్ణయించారు.ఇక లడఖ్లోని గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు నేలకొరిగిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ వీర జవాన్ల త్యాగం వృధా కాదని అన్నారు. భారత్ శాంతికాముక దేశమే అయినా తమ సార్వభౌమత్వానికి సవాల్ ఎదురైతే దీటుగా స్పందిస్తుందని స్పష్టం చేశారు. చదవండి : చైనీస్ ఎంబసీ వెలుపల నిరసన -
సరిహద్దు వివాదం : చర్చలతోనే పరిష్కారం
సాక్షి, న్యూఢిల్లీ : భారత్, చైనాల మధ్య సరిహద్దు ప్రతిష్టంభనను ఇరు దేశాలు సైనిక, దౌత్య సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆదివారం జమ్మూలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ భారత్, చైనాల మధ్య ప్రస్తుతం లడఖ్లో సరిహద్దు వివాదం నెలకొందని దీనిపై విపక్షాలు పలు ప్రశ్నలు లేవనెత్తాయని చెప్పారు. ఇరు దేశాల చర్చలపై ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం చేరవేస్తున్నామని చెప్పారు. ఈ వివాద పరిష్కారానికి సైనిక కమాండర్ల స్ధాయి చర్చలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. భారత్ బలహీన దేశం కాదని, జాతి ప్రయోజనాలతో ఎన్నడూ రాజీపడబోమని తేల్చిచెప్పారు. అంతర్జాతీయ స్ధాయిలో భారత్ సామర్ధ్యం ఎన్నో రెట్లు పెరిగిందని చెప్పుకొచ్చారు. దేశాన్ని కాపాడుకునేందుకు భారత్ తన సైన్యాన్ని బలోపేతం చేస్తోందని, మనం ఏ ఒక్కరికీ భయపడేదిలేదని స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వం కాలయాపన చేయకుండా రక్షణ దళాల చీఫ్ను నియమించిందని గుర్తుచేశారు. చదవండి : అడకత్తెరలో పోకచెక్క... భారత్ -
చర్చలపై డ్రాగన్ కీలక వ్యాఖ్యలు
బీజింగ్ : సరిహద్దుల్లో ప్రతిష్టంభనను నివారించేందుకు భారత్-చైనాల మధ్య జరుగుతున్న సైనిక చర్చల్లో ఏకాభిప్రాయం వ్యక్తమైందని బీజింగ్ బుధవారం వెల్లడించింది. ఈనెల 6న ప్రారంభమైన సైనిక అధికారుల స్ధాయి చర్చల్లో వ్యక్తమైన సానుకూల ఏకాభిప్రాయం దిశగా సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించే చర్యలను ఇరు దేశాలూ చేపట్టాయని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హు చునింగ్ చెప్పారు. కాగా బుధవారం జరిగే తాజా చర్చలకు ముందు తూర్పు లడఖ్లో పలు ప్రాంతాల్లో భారత్, చైనా దళాలు కొంతమేర వెనుతిరిగాయని భారత్ ప్రకటించిన క్రమంలో చైనా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సరిహద్దు ప్రతిష్టంభనకు శాంతియుతంగా తెరదించే క్రమంలో ఇరు దేశాల సేనలు వెనక్కిమళ్లాయా అని ప్రశ్నించగా సరిహద్దుల్లో ఉద్రిక్తతలను నివారించేందుకు ఇరు దేశాలు చర్యలు చేపడుతున్నాయని చునింగ్ వ్యాఖ్యానించారు. భారత్-చైనాలు ఇటీవల సరిహద్దు సమస్యలపై పరస్పర అవగాహనతో సంప్రదింపులు జరుపుతూ సానుకూల ఏకాభిప్రాయానికి వచ్చాయని ఆమె పేర్కొన్నారు. మరోవైపు నియంత్రణ రేఖ వెంబడి మోహరించిన 10 వేల బలగాలను పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) ఉపసంహరించుకున్నపుడే సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభన పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉందని భారత్ స్పష్టం చేసింది. చదవండి : ‘10 వేల బలగాలను చైనా వెనక్కి పిలవాలి’ -
‘భారత్-చైనా చర్చల్లో కీలక పరిణామం’
సాక్షి, న్యూఢిల్లీ : సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితిని శాంతియుత పరిష్కారం ద్వారా చక్కదిద్దాలని భారత్, చైనాలు నిర్ణయించాయని ఇరు దేశాల మధ్య జరిగిన సైనికాధికారుల చర్చలపై భారత్ వ్యాఖ్యానించింది. ద్వైపాక్షిక ఒప్పందాలకు అనుగుణంగా సరిహద్దు సమస్యల పరిష్కారానికి ఇరు దేశాలు అంగీకరించాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం పేర్కొంది. భారత్, చైనాల మధ్య జరిగిన సైనికాధికారుల సమావేశాలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయని, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి సరిహద్దు సమస్యలను ద్వైపాక్షిక ఒప్పందాలకు అనుగుణంగా సామరస్యంగా పరిష్కరించుకునేందుకు అంగీకారం కుదిరిందని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా, ఇండో-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలను నివారించేందుకు ఇరు దేశాల సైనికాధికారుల మధ్య శనివారం లడఖ్లో కీలక సంప్రదింపులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. కాగా, భారత్- చైనా మధ్య ప్రారంభమైన మిలటరీ స్థాయి చర్చల్లో భారత్ తరఫున లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ హాజరుకాగా.. చైనా తరఫున టిబెట్ మిలటరీ కమాండర్ సమావేశంలో పాల్గొన్నారు. ఉద్రిక్తతలకు దారితీసిన గాల్వన్ లోయ, పాంగాంగ్ లేక్, గోగ్రా ప్రాంత సరిహద్దు వివాదాలే ప్రధాన ఎజెండాగా చర్చలు కొనసాగాయని సమాచారం. ఈ క్రమంలో పాంగాంగ్ సరస్సు, గాల్వన్ లోయ నుంచి చైనా బలగాలు వెనుదిరగాలని.. అదే విధంగా అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆర్మీ శిబిరాలను వెంటనే తొలగించాలని భారత్ స్పష్టం చేసింది. చదవండి : చైనా కట్టడికి అంతర్జాతీయ కూటమి -
సరిహద్దు వివాదం.. నేపాల్ మరింత ముందుకు
ఖాట్మండు: భారత్తో సరిహద్దు వివాదాన్ని నేపాల్ మరింత ముందుకు తీసుకువెళుతోంది. మన దేశ భూభాగాలను తమ దేశంలో చూపిస్తూ రూపొందించిన కొత్త మ్యాప్కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును ఆదివారం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. నేపాల్లో ప్రధాన ప్రతిపక్షం నేపాలీ కాంగ్రెస్ ఈ బిల్లుకు మద్దతు ఇస్తామని ప్రకటించిన ఒక్క రోజు తర్వాత న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శివమయ్యా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. భారత్ భూభాగానికి చెందిన లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురాలను వ్యూహాత్మకంగా తమ దేశ భూభాగాలుగా పేర్కొంటూ సవరించిన మ్యాప్లను నేపాల్ విడుదలచేయడం తెల్సిందే. ఈ మ్యాప్కు చట్టబద్ధత రావాలంటే రాజ్యాంగాన్ని సవరించాలి. రాజ్యాంగంలోని షెడ్యూల్ 3లో కొత్త సరిహద్దులతో కూడిన మ్యాప్ను చేర్చాలని ప్రధాని కేపీ శర్మ ఓలి రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకువచ్చారు. చదవండి: సరిహద్దుల్లో తొలగని ప్రతిష్టంభన -
అక్కడ ఏం జరుగుతుందో చెప్పండి : రాహుల్
న్యూఢిల్లీ : భారత-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులు అనేక ఊహాగానాలకు తావిస్తుందని అన్నారు. ఈ మేరకు ట్విటర్లో రాహుల్.. ఓ పోస్ట్ చేశారు. ఈ సంక్షోభ సమయంలో కేంద్రం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. సరిహద్దు పరిస్థితులపై కేంద్రం మౌనం వీడి వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. (చదవండి : హద్దు మీరుతున్న డ్రాగన్) ఇదివరకే ఈ పరిస్థితులపై స్పందించిన భారత విదేశాంగ శాఖ.. చైనాతో మిలటరీ స్థాయిలో, దౌత్య మార్గాల్లో వివాద పరిష్కార ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించింది. అయితే, దేశ రక్షణ, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునే విషయంలో రాజీ లేదని తేల్చి చెప్పింది. శాంతియుత పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నాం అని పేర్కొంది. కాగా, ప్రపంచ దేశాలు కరోనాపై పోరు చేస్తుంటే.. చైనా మాత్రం భారత సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులను సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవాధీన రేఖ వద్ద బలగాలను పెంచి భారత్లో హెచ్చరికలు పంపిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు హాంకాంగ్ విషయంలో చైనా తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కరోనా విషయంలో ప్రపంచ దేశాలనుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న చైనా.. వాటి నుంచి దృష్టి మరల్చడానికే సరిహద్దు వివాదాలతో సరికొత్త డ్రామా ఆడుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.(చదవండి : ‘చైనాతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి’) -
‘చైనాతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి’
న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలపై భారత్ స్పందించింది. చైనాతో మిలటరీ స్థాయిలో, దౌత్య మార్గాల్లో వివాద పరిష్కార ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించింది. అయితే, దేశ రక్షణ, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునే విషయంలో రాజీ లేదని తేల్చి చెప్పింది. ‘శాంతియుత పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నాం’ అని విదేశాంగ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ గురువారం ఆన్లైన్ మీడియా భేటీలో వ్యాఖ్యానించారు. చైనాతో సరిహద్దుగా భావిస్తున్న వాస్తవాధీన రేఖ వెంట శాంతి, సామరస్యతలను నెలకొల్పే బాధ్యతకు భారత్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సరిహద్దుల నిర్వహణ విషయంలో భారత దళాలు చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నాయన్నారు. భారత్, చైనాల మధ్య సరిహద్దు వివాదంలో మధ్యవర్తిత్వం చేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనపై శ్రీవాస్తవ స్పందించలేదు. ఈ ప్రతిపాదన అమెరికా వైపు నుంచి భారత్కు వచ్చిందా?, ఒకవేళ వస్తే.. భారత్ ఏమని సమాధానమిచ్చింది? చైనాతో ప్రస్తుతం నెలకొన్న వివాదంపై అమెరికాకు భారత్ సమాచారమిచ్చిందా?.. తదితర ప్రశ్నలకు ఆయన జవాబు దాటవేశారు. -
మధ్యవర్తిత్వం చేస్తా
న్యూఢిల్లీ/వాషింగ్టన్/బీజింగ్: భారత్, చైనా సరిహద్దు వివాదంలోకి అనూహ్యంగా అమెరికా వచ్చి చేరింది. లదాఖ్, సిక్కిం ప్రాంతాల్లో భారత్– చైనా సరిహద్దు వెంట ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో.. మధ్యవర్తిత్వానికి సిద్ధమంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ప్రకటించారు. కశ్మీర్ అంశంలోనూ భారత్, పాకిస్తాన్ల మధ్య మధ్యవర్తిత్వం వహిస్తానంటూ గతంలో ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, కశ్మీర్ విషయంలో మూడో జోక్యాన్ని అంగీకరించబోమని భారత్ తేల్చిచెప్పింది. ‘ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణమైన సరిహద్దు వివాదంలో మధ్యవర్తిత్వం వహించేందుకు ఆసక్తిగా, సిద్ధంగా ఉన్నాం. మధ్యవర్తిత్వం వహించే సామర్థ్యం కూడా మాకుంది. ఈ విషయాన్ని భారత్, చైనాలకు తెలియజేశాం’ అని ట్రంప్ బుధవారం తెల్లవారుజామున ఒక ట్వీట్ చేశారు. భారత్ సరిహద్దుల్లో చైనా తరచూ ఘర్షణలకు దిగుతోందని, యథాతథ స్థితిని మార్చేందుకు ప్రయత్నిస్తోందని గతవారం అమెరికా దక్షిణాసియా వ్యవహారాల సీనియర్ దౌత్యవేత్త అలిస్ వెల్స్ ఆరోపించారు. చైనా దూకుడుకు అంతేస్థాయిలో అడ్డుకట్ట వేయాలని కూడా ఆమె భారత్కు సూచించారు. పదవీ విరమణకు కొన్నిరోజుల ముందు మే 20న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆ మర్నాడే చైనా స్పందించింది. ఆ వ్యాఖ్యలను నాన్సెన్స్ అని కొట్టేసింది. వివాద పరిష్కారానికి దౌత్య మార్గాల ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ విషయంలో అమెరికాకు ఎలాంటి సంబంధం లేదని చైనా విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. వాస్తవాధీన రేఖగా పేర్కొనే సరిహద్దుకు సంబంధించి భారత్, చైనాల మధ్య చాన్నాళ్లుగా వివాదం కొనసాగుతోంది. ఇటీవల లదాఖ్, సిక్కిం ప్రాంతాల్లో సరిహద్దుల వెంట ఇరుదేశాల సైనికుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో రెండు దేశాలు సరిహాద్దుల్లో బలగాలను, మౌలిక వసతులను భారీగా పెంచుకుంటున్నాయి. ప్రశాంతంగానే పరిస్థితి భారత్తో సరిహద్దు వివాదం విషయంలో చైనా బుధవారం కొంత సంయమన ధోరణిలో స్పందించింది. భారత్తో సరిహద్దుల వెంబడి పరిస్థితి ప్రశాంతంగానే ఉందని వ్యాఖ్యానించింది. ‘భారత్ సరిహద్దుల్లో మొత్తానికి పరిస్థితి స్థిరంగా, నియంత్రణలోనే ఉంది’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావొ లిజియన్ ప్రెస్మీట్లో వ్యాఖ్యానించారు. ‘చర్చలు, సంప్రదింపుల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకునేందుకు అవసరమైన దౌత్య, సమాచార వ్యవస్థ ఇరుదేశాల మధ్య ఉంది’ అన్నారు. ఆయా మార్గాల ద్వారా వివాదాలను ఇరుదేశాలు పరిష్కరించుకోగలవన్నారు. ప్రస్తుత వివాదానికి సంబంధించి భారత్తో దౌత్యపరమైన చర్చలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. ఏ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయన్న ప్రశ్నకు.. దౌత్య మార్గాల్లో, సరిహద్దుల్లోని బలగాల మధ్య స్పష్టమైన సమాచార వ్యవస్థ ఇరుదేశాల మధ్య ఉందన్నారు. సరిహద్దు విషయాలకు సంబంధించి చైనా స్పష్టమైన ధోరణితో ఉందన్నారు. ‘రెండు దేశాల నేతల సమక్షంలో కుదిరిన ఏకాభిప్రాయానికి, రెండు దేశాల మధ్య ఉన్న ఒప్పందాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నాం’ అని చైనా అధ్యక్షుడు జిన్పింగ్, భారత ప్రధాని నరేంద్రమోదీల మధ్య జరిగిన అనధికార భేటీలను ప్రస్తావిస్తూ జావొ వ్యాఖ్యానించారు. యుద్ధ సన్నద్ధతను పెంచుకోవాలంటూ తమ ఆర్మీని జిన్పింగ్ ఆదేశించిన మర్నాడే ఆ దేశ విదేశాంగ శాఖ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
భారత్–చైనా సరిహద్దుల్లో కలకలం
భారత్–చైనా సంబంధాలు చిత్రమైనవి. అనేక అంశాల్లో విభేదాలుంటాయి. సరిహద్దుల్లో అప్పు డప్పుడు చిన్నపాటి ఘర్షణలు సాగుతుంటాయి. కానీ వీటికి సమాంతరంగా ద్వైపాక్షిక సంబంధాలు యధావిధిగా కొనసాగడమే కాదు... అవి విస్తృతమవుతుంటాయి. ఇరు దేశాధినేతల మధ్య ఏటా శిఖ రాగ్ర స్థాయి చర్చలుంటాయి. అధినేతలిద్దరి దేహభాష చూసిన వారికి ఇకపై రెండు దేశాలూ సమష్టిగా సాగుతాయన్న అభిప్రాయం కలుగుతుంది. మళ్లీ కొన్ని రోజులకే సరిహద్దుల్లో ఎక్కడో ఒకచోట సమస్యలు తలెత్తుతాయి. ఆ వెనకే మిగిలినవన్నీ చోటుచేసుకుంటాయి. ఇప్పుడు వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) పొడవునా లద్దాఖ్ ప్రాంతంలో మూడుచోట్ల భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణలు జరిగాయి. వాస్తవానికి గత రెండు వారాలుగా చైనా సైన్యం గల్వాన్ లోయ వద్ద దాదాపు వంద శిబిరాలు ఏర్పాటు చేసి బంకర్ల నిర్మాణం కోసం భారీ యంత్రాలను తెచ్చింది. తూర్పు లద్దాఖ్లో ఈ నెల మొదటివారంలో ఇరుపక్షాల సైనికులూ తలపడ్డారు. రాళ్లు రువ్వుకున్నారు. రెండువైపులా వంద మందికి గాయాలయ్యాయి. కమాండర్ల స్థాయిలో చర్చలు జరిగాక ఇది పరిష్కారమైంది. ఆ తర్వాత ఈనెల 9న ఉత్తర సిక్కింలోని నకులా సెక్టార్ వద్ద కూడా ఆ మాదిరి ఘటనే జరిగింది. తూర్పు లద్దాక్లో గత వారం రోజుల్లో పలుమార్లు చైనా సైనికులు సరిహద్దులు అతిక్రమించినట్టు వార్త లొచ్చాయి. లద్దాఖ్ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చినప్పటినుంచీ చైనా గుర్రుగానే వుంది. జమ్మూ–కశ్మీర్ రాష్ట్రంలో భాగంగా వున్న ఆ ప్రాంతానికి ఏ ప్రతిపత్తి ఇవ్వాలో నిర్ణయించుకునే హక్కు మన దేశానికుంటుంది. దాంతో చైనాకు పేచీ వుండటం అర్ధరహితం. మూడేళ్లక్రితం డోక్లామ్ ట్రై జంక్షన్ వద్ద 73 రోజులపాటు రెండు దేశాల సైన్యాల మధ్యా ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఒక దశలో ఈ పరిణామాలు యుద్ధానికి దారితీస్తాయేమోనన్న ఆందోళన చోటుచేసుకుంది. ఒకపక్క ఇరు దేశాల అధినేతలూ వుహాన్ నగరంలో శిఖరాగ్ర సదస్సులో పాల్గొనబోతుండగా చైనా ఎందుకిలా ప్రవర్తిస్తున్నదన్న సందేహాలు ఏర్పడ్డాయి. తీరా శిఖరాగ్ర సదస్సు సమయానికల్లా ఉద్రిక్తతలు సడలి, అంతా సర్దుకుంది. రెండు దేశాల సైన్యాల మధ్యా కమ్యూనికేషన్ల వ్యవస్థను పటిష్టం చేయడానికి అవసరమైన ‘వ్యూహాత్మక మార్గనిర్దేశం’ చేద్దామని, అలా చేయడం వల్ల పరస్పర విశ్వాసమూ, అవ గాహన ఏర్పడతాయని వుహాన్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ నిర్ణయించారు. అది ఎంతవరకూ ఆచరణకొచ్చిందో ఎవరికీ తెలియదు. తిరిగి రెండు దేశాల సైన్యాల మధ్యా ఇప్పుడు అగ్గి రాజుకుంది. భారత, చైనాల మధ్య 3,488 కిలోమీటర్ల వాస్తవాధీన రేఖ పొడవునా పలుచోట్ల సమస్యలు న్నాయి. ఈ సరిహద్దును పశ్చిమ, మధ్య, తూర్పు సెక్టార్లుగా విభజించారు. ఈ రేఖ ఏ ప్రాంతంలో ఎలా వుందన్న అంశంలో ఇరు దేశాలకూ భిన్నాభిప్రాయాలున్నాయి. అసలు ఎల్ఏసీ 2,000 కిలోమీటర్లు మించదని చైనా వాదిస్తోంది. ఎల్ఏసీ పొడవునా తమ భూభాగమని భావించినచోట సైన్యాలు గస్తీ తిరుగుతున్నప్పుడు ఘర్షణలు జరుగుతుంటాయి. తాము గస్తీ తిరిగే చోటు తమదేనని ఒక పక్షం, కాదు తమదని మరో పక్షం వాదించుకున్నప్పుడు చివరికి అవి ఘర్షణలుగా పరిణమిస్తున్నాయి. ఎక్కువగా ఉత్తర లద్దాఖ్లోవున్న పాంగాంగ్ సో సరస్సు వద్ద ఈ ఘర్షణలు పరిపాటి. ఆ సరస్సులోని జలాల్లో భారత్ సరిహద్దు ముగిసేచోటు, చైనా సరిహద్దు ప్రారం భమయ్యేచోటు ఎక్కడన్నది వివాదాస్పదం. ఈ సరస్సు పశ్చిమ ప్రాంతం మన దేశం అధీనంలో వుంది. 1962 యుద్ధ సమయంలో ఈ సరస్సున్న ప్రాంతంనుంచే చైనా మొదటిసారిగా సాయుధ దాడులు మొదలు పెట్టింది గనుక ఈ ప్రాంతంలో అత్యంత జాగురూకతతో వ్యవహరించి దాన్ని పరిరక్షించుకోవాలని మన దేశం నిర్ణయించింది. పోంగాంగ్ సో సరస్సు తీరం పొడవునా గత కొన్నే ళ్లుగా చైనా రహదార్ల నిర్మాణం పనులు చురుగ్గా సాగిస్తోంది. అవసరమైన పక్షంలో సులభంగా ట్రక్కుల ద్వారా సైన్యాన్ని, ఇతర సామగ్రిని తరలించడానికే ఇదంతా. 1999లో పాకిస్తాన్తో కార్గిల్లో తలపడవలసి వచ్చిన ప్పుడు సరస్సు ప్రాంతంలోవున్న సైన్యాన్ని మన దేశం కార్గిల్కు తర లించవలసి వచ్చింది. అదే అదునుగా చైనా మన భూభాగంలోకి చొచ్చుకొచ్చి 5 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించింది. నేరుగా కారకోరం రహదారికి అనుసంధానించే వివిధ రహదారుల్లో ఇది కూడా భాగమైంది. మరోపక్క అరుణాచల్ ప్రదేశ్ భూభాగం తమ దక్షిణ టిబెట్లో అంతర్భాగమని చైనా ఎప్పటినుంచో వాదిస్తోంది. సమస్యలెన్నివున్నా ఇరు దేశాల మధ్యా వాణిజ్య, వ్యాపార సంబంధాలను పెంపొందించుకోవాలని... ఈ రంగాల్లో బంధం బలపడితే సరిహద్దు సమస్యలు సులభంగా సమసిపోతాయని రెండు దేశాలూ ఒక అంగీకారానికొచ్చాయి. చెప్పాలంటే ఆ సంబంధాలు పెంపొందుతూనే వచ్చాయి. అవి 2017–18నాటికే 7,600 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. అయితే 2018–19కల్లా అది కొంత తగ్గి 7,000 కోట్ల డాలర్ల వద్ద ఆగింది. దాన్ని 10,000 కోట్ల డాలర్లకు పెంచుకోవాలని నిరుడు భారత్, చైనాలు రెండూ అనుకున్నా అది సాధ్యపడలేదు. ఇందుకు కారణం ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక మాంద్యమే తప్ప ఇరు దేశాల మధ్యా వచ్చిన పొరపొచ్చాలు కాదు. ఐటీ, ఫార్మా రంగాల్లో కూడా తమ ఎగుమతులకు చోటు కల్పించాలని మన దేశం కొన్నేళ్లుగా చెబుతూ వచ్చినా, ఆ అంశంపై చర్చిద్దామంటూ చైనా దాటవేస్తూ వచ్చింది. ఈలోగా కరోనా వైరస్ మహమ్మారి కాటేయడంతో వ్యాపార, వాణిజ్య బంధంలో మరింత స్తబ్దత చోటు చేసుకుంది. ప్రపంచ పరిణామాలు వేగంగా మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రెండు దేశాలూ పరస్పరం చర్చించుకుని సమస్యను పరిష్క రించుకోవడానికి ప్రయత్నించాలి. ఆ చర్చలకు ముందు వాస్తవాధీన రేఖ వద్ద యధాపూర్వ స్థితి నెలకొనేలా చూడాలి. ఘర్షణలు పెరిగితే అది రెండు దేశాలకూ మంచిది కాదు. -
సరిహద్దు వివాదంలో కుటుంబం ఆత్మహత్యాయత్నం
కైకలూరు : సరిహద్దు వివాదంలో మనస్తాపం చెందిన భార్యాభర్తలు.. కూతురుతో సహా ఆత్మహతాయత్నానికి ఒడిగట్టారు. కైకలూరులో ఈ ఘటన ఆదివారం జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం సంత మార్కెట్ సమీపంలోని అబ్బాస్ వీధిలో కారుమూరి రాజేంద్రప్రసాద్, కొనిజేటి నారాయణ..లవి సరిహద్దు దారులు. ఇరువురు మధ్య మూడేళ్లుగా గోడ విషయంలో వివాదం సాగుతోంది. ఇరువురు ఒకే సామాజికవర్గం కావడంతో పెద్దల పంచాయతీలో వివాదాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించినా సఫలం కాలేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 4న కొనిజేటి నారాయణ కుమారుడు వెంకటేష్ తమపై దౌర్జన్యం చేశారని రాజేంద్రప్రసాద్ భార్య లక్ష్మీకుమారి టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. అయినప్పటికి సమస్య పరిష్కారం జరగడం లేదని భావించి రాజేంద్రప్రసాద్, ఆయన భార్య లక్ష్మీకుమారి అదే రోజున ఆత్మహత్య చేసుకుంటామని లేఖ రాసి విజయవాడ వెళ్లిపోయారు. పోలీసులు అన్ని చోట్ల గాలించారు. 5వ తేదీ దంపతులు గ్రామానికి తిరిగి వచ్చారు. చివరకు నియోజకవర్గస్థాయిలో టీడీపీ నాయకుడి వద్ద సెటిల్మెంట్కు పెట్టారు. లిఖితపూర్వకంగా అగ్రిమెంట్ రాసుకుని గోడ నిర్మాణం చేయాలని సరిహద్దుదారుడితో ఒప్పించారు. కొద్ది రోజులుగా అగ్రిమెంట్ రాయడానికి సదరు సరిహద్దుదారుడు రాకపోవడంతో మనస్తాపం చెందిన రాజేంద్రప్రసాద్ (43), భార్య లక్ష్మీకుమారి (41), మూడో తరగతి చదువుతున్న కూతురు సుస్మిత (8) గుళికల మందు తిని ఆత్మహత్యకు యత్నించారు. బంధువులు విషయం తెలుసుకుని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ముగ్గురూ చికిత్స పొందుతున్నారు. ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారు. కైకలూరు పోలీసులు బాధితుల నుంచి వివరాలు సేకరించారు. -
భారత్తో దోస్తీ: జపాన్పై చైనా ఘాటు వ్యాఖ్యలు!
మూడో వ్యక్తి జోక్యం చేసుకోకూడదు! ఈశాన్యం భారతంలో పెట్టుబడులు వద్దంటూ.. జపాన్కు చైనా పరోక్ష హెచ్చరికలు బీజింగ్: భారత్-చైనా సరిహద్దు వివాదంలో మూడో వ్యక్తి జోక్యం చేసుకోకూడదని జపాన్ను ఉద్దేశించి చైనా ఘాటు వ్యాఖ్యలు చేసింది. తమ భూభాగంగా చెప్పుకొంటున్న అరుణాచల్ ప్రదేశ్లో జపాన్ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురావడంతో చైనా ఈ విధంగా అక్కసు వెళ్లగక్కింది. తాజాగా నరేంద్ర మోదీ-షింజో అబె భేటీ నేపథ్యంలో భారత్-జపాన్ సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనపై చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ స్పందించింది. దక్షిణ చైనా సముద్రంలో స్వేచ్ఛాయుత నౌకాయానం, చైనా తలపెట్టిన వన్ రోడ్డు-వన్ బెల్ట్ ప్రాజెక్టుపై ఆందోళన తదితర అంశాలు ఈ సంయుక్త ప్రకటనలో ఉన్న సంగతి తెలిసిందే. 'భారత్-జపాన్ యాక్ట్ ఈస్ట్ ఫోరమ్'ను ఏర్పాటుచేస్తున్నట్టు ఈ ప్రకటనలో వెల్లడించారు. ఈ ఫోరమ్లో భాగంగా ఈశాన్య భారతంలో జపాన్ పెట్టుబడులు పెట్టనుంది. ఈ విషయాన్ని ప్రస్తావించిన చైనా విదేశాంగ అధికార ప్రతినిధి హ్యు చున్యింగ్.. తూర్పు సెక్టార్లో ఇరుదేశాల సరిహద్దులు స్పష్టంగా ఖరారు కాలేదని, సరిహద్దుల విషయమై పలు వివాదాలు ఉన్నాయని, ఈ వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఇరుదేశాలు భావిస్తున్నాయని, ఇందులో మూడో వ్యక్తి జోక్యం చేసుకోకూడదని జపాన్ను ఉద్దేశించి పేర్కొన్నారు. అంతేకాకుండా దక్షిణ చైనా సముద్రం విషయంలో భారత్-జపాన్ భాగస్తులు కాదని, కాబట్టి ఈ వివాదంతో ఆ దేశాలకు సంబంధం లేదని చెప్పుకొచ్చారు. -
‘చైనా, కశ్మీర్’ పై అఖిలపక్షం చర్చ
న్యూఢిల్లీ: గత మూడు వారాలుగా పొరుగు దేశం చైనాతో సరిహద్దు వివాదంపై పెరుగుతున్న ఉద్రిక్తతలు, కశ్మీర్లో వరుస హింసాత్మక అల్లర్లు, భూటాన్తో మైత్రి వంటి అంశాలపై కేంద్రం అన్ని పార్టీలతో కలసి శుక్రవారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. వచ్చే సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న దృష్ట్యా విపక్షాలు ఈ అంశాలు లేవనెత్తే అవకాశాలు ఉన్నందున కేంద్రం సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ అంశాలపై వివరణనిచ్చింది. ఈ అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ తరఫున గులాం నబీ అజాద్, మల్లికార్జున్ ఖర్గే, సీపీఎం తరఫున సీతారాం ఏచూరి, సమాజ్వాదీ పార్టీ తరఫున ములాయంసింగ్ యాదవ్, ఏల్జేపీ నుంచి రామ్ విలాస్ పాశ్వాన్, ఎన్సీపీ నుంచి తారిఖ్ అన్వర్, శరద్ యాదవ్, జేడీయూ నుంచి కేసీ త్యాగి, టీఎంసీ నుంచి దెరెక్ ఓ బ్రీన్లు హాజరయ్యారు. -
సిక్కింకు మరిన్ని బలగాలు
► చైనాతో కొనసాగుతున్న వివాదం ► 1962 తర్వాత ఇదే సుదీర్ఘ ఉద్రిక్తత న్యూఢిల్లీ: సిక్కిం సరిహద్దులో ఉద్రిక్తత పెరుగుతోంది. చైనాతో వివాదం నేపథ్యంలో భారత ఆర్మీ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి డోకా లా ప్రాంతానికి మరిన్ని బలగాలను పంపింది. అయితే ఇవి కాల్పులు జరపవని, తుపాకీ గొట్టాలను కిందికి దించి ఉంచుతాయని అధికార వర్గాలు చెప్పాయి. చైనాతో 1962నాటి యుద్ధం తర్వాత ఇరు దేశాల ఆర్మీల మధ్య నెలకుపైగా సుదీర్ఘ ఉద్రికత్త కొనసాగడం ఇదే తొలిసారి. 2013లో జమ్మూకశ్మీర్లోని లడఖ్ డివిజన్ దౌలత్ బేగ్ ఓల్దీలోకి చైనా జవాన్లు చొచ్చుకురావడంతో 21 రోజులపాటు ఉద్రిక్తత కొనసాగింది. సిక్కిం సెక్టార్లోని చుంబీ లోయ పరిధిలోకి వచ్చే డోకా లా ప్రాంతంలోని భారత బంకర్లను చైనా ఇటీవల ధ్వంసం చేయడంతో ఘర్షణ తలెత్తడం తెలిసిందే. ఈ వివాదంపై అధికార వర్గాలు తొలిసారి పూర్తి వివరాలను అందించాయి. ఆ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం.. భారత్–భూటాన్–టిబెట్ కూడలిలోని డోకా లా ప్రాంతం లాల్తెన్లో ఉన్న రెండు భారత బంకర్లను తొలగించాలని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) జూన్ 1న భారత ఆర్మీకి చెప్పింది. దీనిపై భారత జవాన్లు ఉత్తర బెంగాల్లోని తమ హెడ్క్వార్టర్స్కు సమాచారం అందించారు. అయితే జూన్ 6న రాత్రిపూట రెండు చైనా బుల్డోజర్లు ఆ బంకర్లను ధ్వంసం చేశాయి. డోకా లా తమదేనని, భారత్, భూటాన్లకు దీనిపై హక్కులేదని ప్రకటించాయి. చైనా జవాన్లు, యంత్రాలు మరింత నష్టం కలిగించకుండా భారత బలగాలు అడ్డుకున్నాయి. సమీపంలోని తమ బలగాలనూ పిలిపించుకున్నాయి. దీంతో జూన్ 8న ఘర్షణ తలెత్తి, ఇరు పక్షాల సైనికులు స్వల్పంగా గాయపడ్డారు. తర్వాత జరిగిన ఫ్లాగ్ మీటింగ్లో లాల్తెన్ నుంచి జవాన్లను వెనక్కి పంపాలని చైనా భారత్కు స్పష్టం చేసింది. భారత జవాన్లు తాము నిర్మిస్తున్న రోడ్డు పనులను అడ్డుకున్నారని ఆరోపించింది. మానస సరోవర్ యాత్రకు వెళ్తున్న తొలి బృందంలోని 47 మంది యాత్రికులను అడ్డుకుని, మరో బృందంలోని 50 మంది వీసాలను రద్దు చేసింది. తర్వాత పీఎల్ఏ అదనపు బలగాలు ఆ ప్రాంతానికి చేరుకోవడంతో భారత ఆర్మీ కూడా మరిన్ని బలగాలను అక్కడికి తరలించింది. చైనా జవాన్లు డోకా లాలోకి 2008లో కూడా చొరబడి భారత ఆర్మీ బంకర్లను ధ్వంసం చేశారు. చుంబీ లోయపై ఆధిపత్యం కోసం చైనా యత్నిస్తోందని, భారత్–భూటాన్ సరిహద్దుపై గరిష్ట నిఘా కోరుకుంటోందని రక్షణరంగ నిపుణులు చెబుతున్నారు. ‘చొరబాటు మ్యాపు’ డోకా లా ప్రాంతంలోకి భారత జవాన్లు చొచ్చుకు వచ్చిన వివరాలని పేర్కొంటూ చైనా విదేశాంగ శాఖ ఓ మ్యాపును విడుదల చేసింది. తమ రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకోవడానికి భారత జవాన్లు చొరబడ్డారని ఆరోపించింది. ఈ మ్యాపులో డోకా లాను చైనాలో అంతర్భాగంగా చూపారు. భారత జవాన్లు తమ భూభాగంలోకి వచ్చినప్పుడు తీసినవిగా పేర్కొంటూ చైనా గురువారం రెండు ఫొటోలను విడుదల చేసింది. ఉద్రిక్తతకు ముగింపు పలికేందుకు భారత్ తమ జవాన్లను డోలా కా నుంచి ఉపసంహరించుకోవాలని చైనా వార్తాసంస్థ జినువా పేర్కొంది. ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని అడ్డుకోవద్దని చెప్పుకొచ్చింది. చైనా–పాకిస్తాన్ ఆర్థిక కారిడార్పై భారత్ ‘వ్యూహాత్మక ఆందోళన’ను పక్కనపెట్టి వన్ బెల్ట్–వన్ రోడ్ ప్రాజెక్టులో చేరాలని సూచించింది. చైనాతో గొడవేంటి..? భారత్, చైనా సరిహద్దుల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డోకా లా ప్రాంతంలో ఇరు దేశాలు భారీగా బలగాల్ని మోహరించి ఢీ అంటే ఢీ అంటున్నాయి. డోకా లాలోని భూటాన్ ప్రాంతంలో చైనా నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణంతో గొడవ మొదలైంది. భూటాన్కు మద్దతుగా భారత్ బలగాలు రంగంలోకి దిగడం చైనాకు కోపం తెప్పించింది. నాటి యుద్ధాన్ని గుర్తు చేసుకోవాలని భారత్ను చైనా హెచ్చరించగా.. భారత్ అప్పటి దేశం కాదని రక్షణ శాఖ మంత్రి జైట్లీ దీటుగా బదులిచ్చారు. మరోవైపు సరిహద్దుల్లో చైనా యుద్ధ ట్యాంకుల్ని మోహరించడంతో.. భారత ఆర్మీ చీఫ్ స్వయంగా ఆ ప్రాంతానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఉద్రిక్తతలకు సంబంధించిన వివరాలివి... భారత్, చైనా, భూటాన్ ఉమ్మడి సరిహద్దుల్లోని కీలక భూభాగమే డోకా లా.. సిక్కిం వైపున ఉన్న ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా భారత్కు ఎంతో కీలకం. అయితే ఇక్కడ భూటాన్ అధీనంలో ఉన్న ప్రాంతంలో తేలికపాటి యుద్ధ ట్యాంకులు, పరికరాల్ని మోసుకెళ్లేలా చైనా రోడ్డు నిర్మాణం కొనసాగిస్తోంది. పాత ఒప్పందాల్ని గౌరవించాలని, రోడ్డు నిర్మాణం నిలిపివేయాలని రాయల్ భూటాన్ సైన్యం కోరినా చైనా వినిపించుకోలేదు. రోడ్డు నిర్మాణం పూర్తయితే.. ఈశాన్య భారతంతో మిగతా దేశాన్ని కలిపే బెంగాల్లోని సన్నని కోడి మెడ ప్రాంతం(చికెన్ నెక్) చేరుకునేందుకు చైనాకు వీలవుతుంది. దేశ భద్రత పరంగా ఈ నిర్మాణాన్ని ముప్పుగా భావిస్తోన్న భారత్ వెంటనే రంగంలోకి దిగింది. భూటాన్కు మద్దతుగా తన సైన్యాన్ని ఆ ప్రాంతంలో మోహరించి రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకుంది. ప్రతీకారంగా భారత బంకర్లను పీఎల్ఏ ధ్వంసం చేసింది. ఇండియా, చైనా దళాల కమాండర్లు చర్చలు జరిపినా ఉద్రిక్తతలు తగ్గలేదు. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య ప్రకటనల యుద్ధం కొనసాగుతోంది. తమ భూభాగంలోకి భారత్ బలగాలు ప్రవేశించాయంటూ చైనా నిరసన తెలపడంతో పాటు.. గత వివాదాల నుంచి గుణపాఠం నేర్చుకోవాలని గత సోమవారం చైనా హెచ్చరించింది. ఇదే సమయంలో భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ గురువారం సిక్కిం వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. చైనా దూకుడు ప్రదర్శిస్తే ఎలా బదులివ్వాలన్న అంశంపై ఆర్మీ జనరల్స్ తో చర్చలు కొనసాగించారు. భారత్పై ఆగ్రహంతో కైలాస మానస సరోవర్ యాత్రకు పోయే నాథూ లా మార్గాన్ని మూసివేస్తున్నట్టు చైనా ప్రకటించింది.హిమాలయ రాజ్యమైన భూటాన్కు భారత్ అత్యంత సన్నిహిత మిత్రదేశం. ఆ కారణంగా భూటాన్కు చైనాతో దౌత్య సంబంధాలు లేవు. ఆ దేశ రక్షణ బాధ్యత మొత్తం భారత్దే. ఆ క్రమంలోనే చైనా దూకుడును అడ్డుకునేందుకు భారత బలగా లు రంగప్రవేశం చేశాయి. 2013, 2014లో కూడా చైనా దళాలు పశ్చిమ సరిహద్దుల్లో దుందుడుకు చర్యలకు పాల్పడినప్పుడు భారత్, చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
‘సరిహద్దు’ చిచ్చు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య మరోసారి సరిహద్దు వివాదం రాజుకుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే తెలంగాణ లారీలను చెక్పోస్టుల వద్ద అడ్డుకుని రోజుల తరబడి నిలిపేయటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రెండు రాష్ట్రాల మధ్య సింగిల్ పర్మిట్ విధానానికి ఒప్పందం కుదరకపోవటంతో ఇబ్బంది పడుతున్న తమను ఇప్పుడు ఏపీ అధికారులు కావాలనే వేధిస్తున్నారంటూ తెలంగాణ లారీ యజమానుల సంఘం భగ్గుమన్నది. రాష్ట్ర విభజన అనంతరం సరిహద్దు దాటాలంటే పన్ను కట్టాల్సిందేనంటూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ‘సరిహద్దు’ వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రెండు రాష్ట్రాల అధికారుల చర్చల ఫలితంగా వివాదం సద్దుమణిగింది. నాలుగు రోజులుగా దాచేపల్లి, పొందుగుల, నాగార్జునసాగర్ తదితర చెక్పోస్టుల వద్ద వందల సంఖ్యలో తెలంగాణ లారీలను ఏపీ అధికారులు నిలిపేస్తున్నారు. ఇందులో ఎక్కువగా ఇసుక లారీలే ఉన్నాయి. సరైన వే బిల్స్ ఉన్నా స్థానికంగా కంప్యూటరీకరణ లేనందున వాటిని నర్సరావుపేట కార్యాలయానికి వెళ్లి సరిచూసుకోవాలనే కారణంతో లారీలను రెండు, మూడురోజులపాటు నిలిపేశారు. దీంతో తెలంగాణ లారీ యజమానులు ధర్నాలకు కూడా దిగారు. ఇది రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మారుతోందని గుర్తించిన ఏపీ అధికారులు గురువారం చాలా లారీలను వదిలేశారు. ‘తోక బిల్లు’ లేదని... ఓ చెక్పోస్టులో లారీని తనిఖీ చేశాక పత్రాలన్నీ సరిగా ఉంటే ‘పత్రాలు సరిగానే ఉన్నాయి సరిహద్దు దాటేందుకు అభ్యంతరం లేదు’ అని పేర్కొంటూ ఓ పత్రం ఇస్తారు. దానిని లారీల డ్రైవర్లు తోక బిల్లుగా వ్యవహరిస్తారు. ఆ బిల్లు లేదనే సాకుతో అధికారులు లారీ డ్రైవర్లను వేధిస్తున్నారని తెలంగాణ లారీ యజమానుల సంఘం ఆరోపిస్తోంది. ఒక్కో లారీ నుంచి ఏపీ అధికారులు రూ.400 వరకు వసూలు చేస్తున్నారని, ఇప్పుడు అంతకంటే ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా రెండు ప్రభుత్వాలు చర్చించుకుని లారీలకు సింగిల్ పర్మిట్ విధానం ప్రారంభించాలని తెలంగాణ లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు భాస్కర్రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఇసుక దందా... ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఒకరు అక్రమంగా సిలికా ఇసుకను తెలంగాణకు సరఫరా చేస్తున్నట్టు బయటపడింది. తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల నుంచి ఇసుక సరఫరా బాగా తగ్గిపోయింది. దీంతో హైదరాబాద్తోపాటు ఇతర ప్రాంతాల్లో ఇసుక కొరత ఏర్పడింది. దీన్ని ఆసరా చేసుకున్న ఆ ఎమ్మెల్యే చిలుకలూరిపేట, రేపల్లె తదితర ప్రాంతాల నుంచి సిలికా ఇసుక అక్రమ సరఫరాకు తెరలేపారు. దీనికి ఆ ఎమ్మెల్యే హైదరాబాద్కు చెందిన లారీలనే వినియోగించటం గమనార్హం. అధికారులు పట్టుకున్న లారీల్లో ఇవీ ఉండటంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. -
నువ్వా.. నేనా!
నిజాంసాగర్ శిఖంలో సాగుకు రైతుల పోటీ గొడవలకు కేంద్ర బిందువైన సరిహద్దు వివాదం ఏటా తప్పని పరస్పర దాడులు పట్టించుకోని అధికారులు కల్హేర్: నిజాంసాగర్ ప్రాజెక్టు శిఖం భూముల్లో పంటల సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. సాగు విషయంలో పోటీ నెలకొనడంతో నువ్వా నేనా.. అన్నట్టుగా మారింది వ్యవహారం. రెండు జిల్లాల పరిధిలో శిఖం ఉండడంతో సరిహద్దు వివాదం నెలకొంది. ఏటా శిఖం సాగు విషయంలో రెండు జిల్లాల రైతులు పరస్పరం దాడులకు దిగుతున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు శిఖం క్యాచ్మెంట్ ఏరియా 38 వేల ఎకరాలకుపైగా ఉంది. కల్హేర్ మండలంలోని రాంరెడ్డిపేట, ఖానాపూర్(బి), దామర్చెరువు, పెద్దశంకరంపేట మండలం జుక్కల్, వీరోజీపల్లి, నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్, ఎల్లారెడ్డి మండలాల పరిధిలోని నిజాంసాగర్ ప్రాజెక్టు శిఖంలో పంటలు వేసేందుకు రైతులు ట్రాక్టర్లతో దున్నుతున్నారు. 30 నుంచి 40 మంది రైతులు ఒక్కో గ్రూప్గా ఏర్పడి సరిహద్దులు ఏర్పాటు చేసుకుంటున్నారు. సాగర్ పరీవాహకంలో వేలాది ట్రాక్టర్లతో నిత్యం దున్నుతున్నాయి. ఫలితంగా సరిహద్దు విషయంలో రైతుల మధ్య వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో రైతులు పరస్పర దాడులకు దిగుతున్నారు. శిఖంలో పంటలు వేసేందుకు తరుచూ గొడవలు జరుగుతున్నాయి. సరిహద్దు జిల్లాల మధ్య.. నిజామాబాద్ జిల్లా ఆరేడు, ఆరేపల్లి, బ్రహ్మణ్పల్లి గ్రామాలకు చెందిన రైతులు, కల్హేర్ మండలం మహదేవుపల్లికి చెందిన రైతులు ఇటీవల ఘర్షణకు దిగి పరస్పరం దాడులు చేసుకున్న విషయం విదితమే. గొడవల కారణంగా పోలీసు కేసులు నమోదయ్యాయి. రాంరెడ్డిపేట, దామర్చెరువు గ్రామాలు, పెద్దశంకరంపేట, నిజాంసాగర్, ఎల్లారెడ్డి మండలాల్లో ఏదో ఒక చోట రైతులు గొడవలు, దాడులకు పాల్పడడం ఆనవాయితీగా మారింది. లాభదాయకం కావడంతో పెరిగిన పోటీ.. గత రెండేళ్లుగా ప్రాజెక్టులో నీరులేకపోవడంతో రైతులు శనగ, మొక్కజొన్న తదితర పంటలు వేసి సిరులు పండించారు. దీంతో సాగర్ శిఖంలో పంటలు సాగు చేసేందుకు రైతులు పోటీపడడంతో ఈ భూమి కోసం డిమాండు పెరిగింది. సరిహద్దులు ఏర్పాటు చేసుకునేందుకు రైతులు గొడవలు, దాడులకు దిగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. శిఖంలో గొడవలు జరగకుండా నియంత్రించాలని రైతులు అధికారులను కోరుతున్నారు. -
భారత్పై చైనా కొత్త పల్లవి!
బీజింగ్: అణు సరఫరాదారుల బృందం (ఎన్ఎస్జీ)లో భారత సభ్యత్వానికి సర్వశక్తులొడ్డి మోకాలడ్డిన చైనా.. తాజాగా మన దేశంతో సంబంధాలపై కొత్త పల్లవి అందుకుంది. భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధికి ఇరుదేశాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదంతోపాటు కొత్తగా తెరపైకి వస్తున్న అంశాలు పెద్ద సవాలుగా మారుతున్నాయని ఆ దేశం సన్నాయి నొక్కులు నొక్కుతోంది. ‘పొరుగుదేశాలైన భారత్-చైనా సంబంధాల అభివృద్ధికి చరిత్రాత్మకమైన అంశమైన సరిహద్దు వివాదంతోపాటు కొత్తగా తెరపైకి వస్తున్న అంశాలు అడ్డుగా ఉన్నాయి. ఈ అంశాలను ఎలా ఎదుర్కోవాలని అనేది ఇరుదేశాలకు పెద్ద సవాలుగా మారింది’ అని చైనా విదేశాంగ సహాయమంత్రి లీ హుయిలై చెప్పారు. పీటీఐ వార్తాసంస్థతో మాట్లాడిన లీ కొత్తగా తెరపైకి వస్తున్న అంశాలు ఏమిటన్న దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. తాజాగా చైనాలో పర్యటించిన కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సరిహద్దు వివాదం, ఇతర వివాదాలు భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాలపై కనీస ప్రభావాన్ని మాత్రమే చూపే అవకాశముందని పేర్కొనగా.. చైనా మాత్రం ఈ కొత్త రాగాన్ని తెరపైకి తెచ్చింది. -
నిక్సన్ మ్యాజిక్ మోదీకి సాధ్యమా?
త్రికాలమ్ భారత్ కోసం పాకిస్తాన్ను వదులుకునే పరిస్థితిలో చైనా లేదు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలంటూ భారత్-చైనా సంయుక్త ప్రకటనలో పేర్కొన్నప్పటికీ ఉగ్రవాదానికి ప్రధాన స్థావరం పాకిస్తాన్ అని చెప్పడానికి చైనా సిద్ధంగా లేదు. సౌత్ చైనా సముద్రం వ్యవహారంలో ఊపిరి సలపడం లేదు కనుక భారత్తో సరిహద్దు వివాదానికి స్వస్తి చెబుతామని బీజింగ్ నిర్ణయించుకునే అవకాశం లవలేశం లేకపోలేదు. ఇటువంటి పరిణామం సంభవిస్తుందనుకోవడం కేవలం ఆశాభావమే కానీ వాస్తవిక దృష్టి కాదు. మోదీ పర్యటన ఫలితంగా రెండు దేశాల మధ్య రాకపోకలు పెరుగుతాయి. నరేంద్రమోదీ కంటే ముందు చైనా సందర్శించిన భారత ప్రధాన మంత్రులు న్నారు. కానీ వారందరికంటే మోదీ భిన్నం. మోదీ చైనా యాత్ర జయప్రదం అవుతుందా; శుభప్రదం అవుతుందా లేక ఇదివరకటి ప్రధానుల పర్యటనల లాగే యథాతథ స్థితి కొనసాగడానికే పరిమితం అవుతుందా? అమెరికా అధ్య క్షుడుగా ఉన్న కాలంలో రిచర్డ్ నిక్సన్ అమెరికా-చైనా సంబంధాలలో నవశకం ప్రారంభించినట్టు మోదీ భారత్-చైనా సంబంధాలలో అడ్డుగోడలను ఛేదించి శాశ్వత మైత్రికి బాటలు వేయగలరా? ప్రధాని నరేంద్రమోదీ రాజీవ్గాంధీ లాగా యువకుడు కాదు. పీవీ నరసింహారావులాగా వయోవృద్ధుడూ కాదు. రాజీవ్ ఆశాభావం, పీవీ విషయ పరిజ్ఞానం మోదీలో ఉన్నాయి. 64 సంవత్సరాల వయస్సులో 53 అంగుళాల ఛాతీని చాటుకుంటూ ఎన్నికల గోదాలో కలబడి ఘనవిజయం సాధించిన రాజ కీయ మల్లుడుగా గాంధీనగర్ నుంచి ఢిల్లీకి ప్రస్థానం చేసినవాడు మోదీ. చైనా అధ్యక్షుడు సి జిన్పింగ్ కూడా శరీర దారుఢ్యంపైన శ్రద్ధ చూపిస్తారు. సాహసో పేతమైన నిర్ణయాలు తీసుకోవడానికి సంకోచించరు. ఇద్దరూ ప్రయోగశీలురు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత పుట్టినవారు. దేశ రాజకీయా లలోనూ, విదేశీ వ్యవహారాలలోనూ అంతా తామే అన్నట్టు వ్యవహరిస్తూ ఆధిపత్యం ప్రదర్శించే ధోరణి కలిగినవారు. నిరుడు సెప్టెంబర్లో చైనా అధ్య క్షుడు ఇండియా వచ్చినప్పుడు మొదట గుజరాత్ (మోదీ స్వరాష్ట్రం) సందర్శిం చిన అనంతరం ఢిల్లీ చేరుకున్నారు. మోదీ సైతం సి జిన్పింగ్ తండ్రి, మావో జెడాంగ్ సహచరుడు పుట్టిన షాన్సీ పట్టణం దర్శించిన తర్వాతనే బీజింగ్ చేరుకున్నారు. చైనా అంటే ఇష్టం మోదీ హృదయంలో చైనాకు ప్రత్యేక స్థానం ఉంది. హిందీ-చీనీ భాయ్భాయ్ అంటూ, పంచశీల సూత్రం అంటూ చైనా ప్రధాని చౌఎన్లైని మనస్పూర్తిగా విశ్వసించి, మితిమీరిన ఆత్మవిశ్వాసం ప్రదర్శించి నెహ్రూ భంగపడ్డాడు. 1961-62 సరిహద్దు యుద్ధంలో ఘోరపరాజయం నుంచి పూర్తిగా కోలుకో కుండానే 1964 మే 27న గుండెపోటుతో మరణించాడు. అప్పుడు రెండు దేశాల మధ్య ఘనీభవించిన మంచు కరగడానికి కొంత వ్యవధి అవసరమైంది. జనతా ప్రభుత్వంలో విదేశాంగమంత్రిగా అటల్ బిహారీ వాజపేయి చైనా పర్యటన ఇందుకు కొంత దోహదం చేసింది. రాజీవ్గాంధీ చైనా పర్యటన చారిత్రక మైనది. సరిహద్దు వివాదాన్ని పక్కన పెట్టి ద్వైపాక్షిక సంబంధాల పెంపుదలకు కృషి చేయాలని రెండు దేశాల ప్రధానులూ నిర్ణయించారు. అనంతరం పీవీ నరసింహారావు సందర్శన వాస్తవికతకు దగ్గరగా రెండు దేశాలనూ నడిపిం చింది. ఇప్పటికీ చైనాను మిత్రదేశంగా భారత్ భావించజాలదు. భారత్ను శత్రు దేశంగా భావిస్తున్న పాకిస్తాన్తో చైనాకు అత్యంత సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి. మోదీ పర్యటిస్తున్న సమయంలో సైతం చైనా విడుదల చేసిన భారత దేశ పటంలో అరుణాచల్ ప్రదేశ్ లేదు. కశ్మీర్ కూడా లేదు. పాకిస్తాన్ అధీనంలో ఉన్న కశ్మీర్లో నివసిస్తున్నవారికి చైనా గౌరవప్రదమైన వీసాలు ఇస్తుంది. భారత దేశంలో ఉన్న కశ్మీర్వాసులకు మాత్రం షరతులతో కూడిన (స్టీపుల్డ్) వీసాలు ఇస్తుంది. నాలుగు వేల కిలోమీటర్ల వివాదాస్పదమైన సరిహద్దుపైన చర్చలు నామ మాత్రంగానే సాగుతున్నాయి. వివాదాన్ని పరిష్కరించుకోవాలన్న సంక ల్పం లేదు. ఇంతవరకూ పొరుగు దేశాలలో 17 సరిహద్దు వివాదాలను చైనా పరిష్కరించుకున్నది. వాటిలో 15 వివాదాల పరిష్కారానికి తానే చొరవ తీసు కొని కొంత భూభాగాన్ని వదులుకున్నది. భారత్తో రాజీకి మాత్రం ససేమిరా అంటున్నది. 1962లో భారత్ను చిత్తుగా ఓడించిన చైనాను 1979లో బుల్లి వియత్నాం నిలువరించి నియంత్రించలిగింది. అగ్రరాజ్యాలైన అమెరికా, చైనాల మెడలు వంచిన ధీరచరిత్ర వియత్నాంది. భారత్ చైనాతో సమఉజ్జీ అని చాటుకోజాలదు. చైనా కంటే బలహీనమైన దేశం అని ఒప్పుకోజాలదు. తగ్గి ఉండలేదు. హెచ్చులు ప్రదర్శించలేదు. సరిహద్దు సమస్యను సైనికంగా పరిష్కరించుకోజాలదు. దక్షిణ టిబెట్ అని చైనా పిలుచుకుంటున్న అరుణాచల్ ప్రదేశ్పై కన్నువేస్తే ఖబడ్దార్ అని హెచ్చరించనూలేదు. మరో యుద్ధానికి కాలు దువ్వలేదు. చైనా అధ్యక్షుడు ఇండియా పర్యటనలో ఉండగానే చైనా సైనికులు సరిహద్దులో కవ్వింపు చర్యలకు దిగితే సన్నాయి నొక్కులు నొక్కడం తప్పితే చేయగలిగింది ఏమీ లేదు. (నాటి కవ్వింపు చర్య చైనా అధ్యక్షుడికి కూడా ఇబ్బందికరంగా పరిణమించిందనీ, ఆయన స్వదేశం తిరిగి వెళ్ళిన తర్వాత సరిహద్దులో సైనిక చర్యను ప్రేరేపించిన కమాండర్పైన వేటు వేశారనీ దౌత్యవర్గాల కథనం). చైనా ఆధిక్య ప్రదర్శనలనూ, అమిత్ర వైఖరినీ మౌనంగా భరిస్తూ, సహిస్తూ, దౌత్యపరంగా, వ్యూహాత్మకంగా పావులు కదపడం ఒక్కటే మార్గం. సరిహద్దు వివాదంపైన రచ్చ చేయకుండా చైనాకు అత్యంత కీలకమైన దక్షిణ చైనా సముద్రంపైన యాగీ చేయవచ్చు. జనవరి చివరివారంలో అమెరికా అధ్యక్షుడు ఒబామా, మోదీ సంయుక్తంగా ఢిల్లీ మీడియా గోష్టిలో చేసిన ప్రకటనలో సౌత్ చైనా సీ ప్రస్తావన ప్రస్ఫుటంగా ఉంది. ఆ సముద్ర ప్రాం తంలో నౌకాయానంపై ఎవరి ఆంక్షలనూ అంగీకరించేది లేదంటూ అమెరికా, భారత్ స్పష్టం చేసిన సందర్భం అది. అదే సమయంలో చైనా సరిహద్దు పొడవునా భారత సైనికుల సంఖ్యను రెట్టింపు చేయబోతున్నట్టు భారత ప్రభు త్వం ప్రకటించింది. ఒక వేళ చైనా మరో దురాక్రమణ తలపెడితే తిప్పికొ ట్టడానికి అవసరమైన సన్నాహాలు చేస్తూనే మరో వైపు అమెరికా, జపాన్ వంటి చైనా ప్రత్యర్థులతో జత కడుతూనే ఇంకోవైపు చైనాతో సత్సంబంధాలకు సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలు పంపడం మోదీ ప్రభుత్వం చేస్తున్న పని. స్నేహా నికైనా, సమరానికైనా సిద్ధమేనంటూ విన్యాసాలు చేయడమే ప్రస్తుత దౌత్యనీతి. అమెరికా, జపాన్లతో అంటకాగకుండా ఉండటం భారత్కే క్షేమదాయక మంటూ చైనా అధికార ఆంగ్ల పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ హితవచనం చెప్పడం ఈ నేపథ్యంలోనే. చైనా అభివృద్ధి అధ్యయనం ఇతర భారత ప్రధానులకంటే అధికంగా మోదీకి చైనా పట్ల ఆసక్తి ఉంది. గుజ రాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన చైనాలో పలుమార్లు పర్యటించారు. చైనాలో హిందూ దేవాలయాలను సందర్శించడంతో పాటు అక్కడ జరుగు తున్న అభివృద్ధినీ, అందుకు అనుసరిస్తున్న వ్యూహాలనూ అధ్యయనం చేశారు. గుజరాత్లో గోధ్రా అనంతర మారణకాండ కారణంగా అమెరికా, బ్రిటన్, ఇతర పాశ్చాత్య దేశాలు వీసా ఇవ్వకుండా మోదీని అవమానించిన సమ యంలో చైనా హార్దిక స్వాగతం పలికి విశేషంగా గౌరవించింది. మోదీకి చారిత్రక స్పృహ ఉంది. చైనా యాత్రికుడు హ్యూన్సాంగ్ గుజరాత్లో మోడీ జన్మస్థలంలో కొంత కాలం నివసించాడు. అక్కడి నుంచి సి జిన్పింగ్ పుట్టిన ఊరు వెళ్ళాడు. వేల సంవత్సరాల నాగరికత వారసత్వం రెండు దేశాలను కలుపుతున్నదని మోదీకి తెలుసు. జనచైనా పట్ల సగటు భారతీయులలో సదభిప్రాయం ఉన్న దనీ, రెండు దేశాల ప్రజలూ స్నేహసంబంధాలు కోరుకుంటున్నారనీ తెలుసు. ఆసియా దిగ్గజాలు రెండూ భుజం భుజం కలిపితే ప్రపంచ శాంతికి పూచీ పడవచ్చుననే అవగాహన ఉంది. ఆతిథ్యం ఇచ్చిన దేశాధినేతలు ఏమనుకుం టారోనన్న వెరపు లేకుండా మోదీ విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడి భారత సంతతి యువతీయువకుల సమావేశాలను ఏర్పాటు చేసి ఆవేశపూరితంగా, ఆలోచనాత్మకంగా, అద్భుతంగా ప్రసంగాలు చేయడం అంతర్జాతీయ సంబం ధాలలో ఒక కొత్త ఒరవడి. న్యూయార్క్లో, ఇతర నగరాలలో చేసిన విధంగానే షాంఘై మహానగరంలో కూడా యువతీయువకులను ఉద్దేశించి మోదీ ఉత్తేజ కరమైన ప్రసంగం చేశారు. ‘మోదీ... మోదీ’ అంటూ యువత హంగామా చేశారు. ఈ వేషాలు చూసే ఒబామా ఢిల్లీ వచ్చినప్పుడు మోదీకి బాలీవుడ్ స్టార్ గ్లామర్ ఉన్నదంటూ వ్యాఖ్యానించారు. దాన్ని చురకగా కాకుండా అభినందనగా మోదీ స్వీకరించినట్టున్నారు. ఆయన ఏ విధంగా పరిగణించి నప్పటికీ ఈ అభిభాషణల వల్ల ఎంతో కొంత ప్రయోజనం ఉంటోంది. మోదీ షాంఘై వచోవిన్యాసం వల్ల భారత్-చైనా సంబంధాలకు మేలు జరుగుతుందే కాని కీడు మాత్రం జరగదు. ఈ సభలో కూడా ఆత్మస్తుతి కొనసాగించినా పరనిందకు పాల్పడలేదు. యూపీయే ప్రభుత్వాన్ని విమర్శించలేదు. కుంభ కోణాల ప్రస్తావన లేదు. ప్రధానిగా ప్రమాణం చేసిన తర్వాత సంవత్సరంలోగా చైనాలో పర్యటిస్తానని ప్రకటించిన మోదీ అన్నట్టుగానే ప్రధాని పద విలో ఏడాది పూర్తయిన సందర్భాన్ని షాంఘైలో భారత సంతతి యువజనుల హర్షధ్వానాల మధ్య ఆనందంగా గడిపారు. మూడు రోజుల చైనా పర్యటనలో రెండు విశ్వవిద్యాలయాలలో విద్యార్థుల సభలలో మాట్లాడారు. ఇటువంటి విస్తృతి, అవకాశం, వాక్చాతుర్యం లోగడ చైనా సందర్శించిన ప్రధానులకు లేదు. అందుకే మోదీ విభిన్నమైన రాజకీయనేత అనీ, చైనా-అమెరికా సంబంధాలలో సమూలమైన మార్పులు సాధించిన నిక్సన్ మాదిరే రెండు ఆసియా దేశాల మధ్య సంబంధాలను పునర్ నిర్వచించే శక్తియుక్తులు మోదీకి ఉన్నాయంటూ ‘గ్లోబల్ టైమ్స్’ శుక్రవారం సంచిక సంపాదకీయ వ్యాసం వ్యాఖ్యానించింది. నిక్సన్ను విశ్వనాథ సత్యనారాయణ ‘నిక్షణుడు’ అంటూ అభివర్ణించాడు. బంగ్లాదేశ్ విమోచన సందర్భంగా ఇందిరాగాంధీని అవమానించినందుకూ, అమెరికా సప్తమ నౌకాదళాన్ని బంగాళాఖాతంలోకి పంపినందుకూ నిరసనగా కవిసమ్రాట్టు ఆగ్రహం ప్రదర్శించారు. వాటర్గేట్ కుంభకోణం కారణంగా నిక్సన్ నిజంగానే అభిశంసనకు గురికావలసి వచ్చింది. కానీ చైనా-అమెరికా సంబంధాలను పెంపొందించడంలో నిక్సన్ది క్రియాశీలకమైన పాత్ర. ఆయనకు అండగా అప్పటి విదేశాంగమంత్రి కిసింజర్ ఉన్నాడు. సోవియెట్ యూనియన్కూ, చైనాకూ మధ్య రగులుతున్న వైరాన్ని అమెరికా వినియో గించుకొని చైనాను చేరదీసింది. చైనాలో 1978లో డెంగ్ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల వల్ల చైనాతో పాటు అమెరికా కూడా ప్రయోజనం పొందింది. అటువంటి వాతావరణం ఇప్పుడు చైనా, భారత్ మధ్య లేదు. భారత్ కోసం పాకిస్తాన్ను వదులుకునే పరిస్థితిలో చైనా లేదు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలంటూ భారత్-చైనా సంయుక్త ప్రకటనలో పేర్కొన్నప్పటికీ ఉగ్రవా దానికి ప్రధాన స్థావరం పాకిస్తాన్ అని చెప్పడానికి చైనా సిద్ధంగా లేదు. సౌత్ చైనా సముద్రం వ్యవహారంలో ఊపిరి సలపడం లేదు కనుక భారత్తో సరిహద్దు వివాదానికి స్వస్తి చెబుతామని బీజింగ్ నిర్ణయించుకునే అవకాశం లవలేశం లేకపోలేదు. ఇటువంటి పరిణామం సంభవిస్తుందనుకోవడం కేవలం ఆశాభావమే కానీ వాస్తవిక దృష్టి కాదు. మోదీ పర్యటన ఫలితంగా రెండు దేశాల మధ్య రాకపోకలు పెరుగుతాయి. చైనా నుంచి భారత ఇన్ఫ్రా (రోడ్లు, విద్యుచ్ఛక్తి వగైరా)రంగంలో పెట్టుబడులు ఒక మోస్తరుగా రావచ్చు. వాణిజ్యం అసమానతలను తొలగించేందుకు భారత్ నుంచి దిగుమతులు పెంచడానికి చైనా సమ్మతించవచ్చు. అంతకంటే ఎక్కువ ఫలితాలు ఆశించనక్కరలేదు. ఈ మాత్రం సత్ఫలితాలైనా సాధ్యం కావడానికి మోదీకి చైనాతో ఉన్న విశేష సంబం ధాలూ, ఆయన ప్రాపంచిక దృష్టి కారణం. కె.రామచంద్రమూర్తి