ఐటీ దాడుల్లో వెల్లడైన డిపాజిట్ల వివరాలివే!
నోట్ల రద్దు అనంతరం డార్మెంట్ బ్యాంకు అకౌంట్ల( దీర్ఘకాలికంగా వాడుకలో లేని బ్యాంకు అకౌంట్లు)లో దాదాపు రూ.25,000 కోట్లు డిపాజిట్ అయినట్టు ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది. అంతేకాక లెక్కలో చూపని ఆదాయంగా రూ.3-4 లక్షల కోట్లను గుర్తించినట్టు ఐటీ శాఖ తెలిపింది. పెద్దనోట్ల రద్దు అనంతరం వివిధ బ్యాంకు అకౌంట్లపై ఐటీ శాఖ జరిపిన దాడుల్లో గుర్తించిన డిపాజిట్ వివరాలను ఐటీ శాఖ మంగళవారం వెల్లడించింది.
ఈ వివరాల్లో పెద్దనోట్ల రద్దు అనంతరం సుమారు రూ.80వేల కోట్ల రుణాలు తిరిగి చెల్లింపులు జరిగినట్టు చెప్పింది. సహకార బ్యాంకుల్లో వివిధ బ్యాంకు అకౌంట్లలో డిపాజిట్ చేసిన రూ.16వేల కోట్లకు పైగా డిపాజిట్లను ఐటీ డిపార్ట్మెంట్, ఈడీ విచారిస్తోందని వెల్లడించింది. 'నవంబర్ 9 నుంచి ఈశాన్య రాష్ట్రాలోని వివిధ బ్యాంకు అకౌంట్లలో రూ.10,700 కోట్లకు పైగా నగదు డిపాజిట్ అయ్యాయి. దేశవ్యాప్తంగా 60 లక్షలకు పైగా బ్యాంకు అకౌంట్లలో రూ.2 లక్షల కంటే ఎక్కువగా డిపాజిట్ అయ్యాయి' అని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.