
మొన్న బ్యాంక్.. ఇవ్వాళ ఏటీఎం..
ముంబై: ‘గంటలు గంటలు క్యూలైన్లో నిల్చున్నా కరెన్సీ నోట్లు దొరకట్లేదు. నిన్న ఇదే సమయానికి వచ్చి సాయంత్రం దాకా లైన్ లో ఉన్నా. తీరా నా వంతు వచ్చేసరికి డబ్బులు అయిపోయాయి’ అని ఒక సోదరుడు.. ‘చేతిలో డబ్బుల్లేక ఇంట్లో వంట కూడా చేసుకోవట్లేద’ని మరో మహిళ.. ఇలా పలకరించిన అందరూ తమతమ బాధలు విన్నవించుకున్నారు కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి.
నోట్ల రద్దు విషయంలో ప్రధాని మోదీపై వరుస విమర్శనాస్త్రాలు సంధిస్తోన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షడు రాహుల్ గాంధీ బుధవారం మరోసారి ప్రజల ‘నోటు’ పాట్లను తెలుసుకున్నారు. తన దగ్గరున్న పాత కరెన్సీని మార్చుకునేందుకు గత వారం ఢిల్లీలోని బ్యాంకుకు వెళ్లి సామాన్య ప్రజలతో కలిసి క్యూలైన్లో నిల్చున్న రాహుల్ మరోసారి ముంబై వకోలా ప్రాంతంలోని ఏటీఎం వద్దకు వచ్చి ప్రజలను పలకరించారు.
ఈ సందర్భంగా పలకరించిన మీడియాతో రాహుల్ మాట్లాడారు. ఏటీఎంలు, బ్యాంకుల వద్ద ప్రజల ఇబ్బందులు కొంచెమైనా తగ్గించేలా కనీస వసతులు ఏర్పాటుచేయాలని సీఎం ఫడ్నవిస్ ను కోరుతున్నానన్నారు. అంతకుముందు పరునునష్టం కేసులో బీవండి కోర్టుకు హాజరైన రాహుల్ గాంధీకి వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ లభించింది. తదుపరి విచారణ జనవరి 28కి వాయిదా పడింది. 'పెద్ద నోట్ల రద్దు భారీ కుంభకోణం?' అని రాహుల్ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.