
'ఆ సీన్ నా జీవితంలో అత్యుత్తమమైనది'
ముంబై : ముంబై మహానగరంలో దారుణ మారణహోమం సృష్టించిన 26/11 దాడుల్లో మృతి చెందిన వారికి ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మ ఘనంగా నివాళులర్పించారు. ఈ మారణహోమంపై ఆయన దర్శకత్వంలో 'ది అటాక్స్ ఆఫ్ 26/11' చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని సన్నివేశాలను వర్మ బుధవారం గుర్తు చేసుకున్నారు. ఈ చిత్రంలోని నానా పటేకర్ పోలీస్ ఉన్నతాధికారిగా నటించారు. అయితే ఈ దాడుల్లో సజీవంగా దొరికిన కసబ్ను మృతి చెందిన సహచర తీవ్రవాదుల మృతదేహాల వద్దకు నానా పటేకర్ తీసుకు వెళ్తాడు.
ఆ క్రమంలో కసబ్కు నానా పటేకర్ కొన్ని ప్రశ్నలు సంధిస్తాడు. కాగా ఆ సన్నివేశంలో పోలీస్ ఉన్నతాధికారి పాత్రలో నానా ఒదిగిపోయిన తీరు... భావోద్వేగానికి గురయ్యే సన్నివేశాలు చాలా సహజ సిద్ధంగా ఉన్నాయని వర్మ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అంతేకాదు... తాను ఇప్పటి వరకు చూసిన సినిమాలన్నీంటిలో నానా పటేకర్ నటించిన ఆ సన్నివేశం అత్యుత్తమైనదని వర్మ కితాబు ఇచ్చారు. ఈ మేరకు వర్మ ట్విట్టర్లో బుధవారం తెలిపారు.
2008, నవంబర్ 26న 10 మంది పాకిస్థాన్ తీవ్రవాదులు సముద్ర మార్గం ద్వారా ముంబై నగరంలో ప్రవేశించి... తాజ్ హోటల్తోపాటు పలు అత్యంత రద్దీ ప్రాంతాలను ఎంచుకుని విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 166 మంది మరణించగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే ఈ దాడుల్లో కోట్లాది రూపాయిల ఆస్తి నష్టం జరిగిన సంగతి తెలిసిందే.