Film Director
-
‘సోషల్’ ఘోషలో స్నేహమే సమ్మోహనం
‘చరిత్రని మరచిపోని వాళ్ళు.. ఆ పొరపాట్లు కచ్చితంగా మళ్ళీ చేస్తారు’ అని ఎవరో పెద్దమనిషి అన్నాట్ట. గతం, వర్తమానం, భవిష్యత్తు అనేవి మన మనసు సృష్టించే భ్రమలే అనుకున్నా.. గతం గుర్తుంచుకోవడం మంచిదే. కొత్త భ్రమల్ని, అపోహల్ని సృష్టించుకోకుండా అది మనల్ని అదుపులో పెడుతుంది.ప్రతి సంవత్సరాంతంలో ఆ సంవత్సరం మనం ఏం సాధించాం, శోధించాం అని మనల్ని మనం ప్రశ్నించుకుంటాం. కొత్త సంవత్సరం కేవలం ఓ తారీఖు మారటమే అని హేతువాదులన్నా.. అదేదో కొత్తప్రారంభం అనుకోవడం మనకో ఉత్సాహాన్నిస్తుంది. అందుకే కొత్త నిర్ణయాలు, సరికొత్త ఆశయాలు, ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతాం. వాటిలో ఎన్ని అమలు చేస్తాం? ఎన్ని సాధిస్తాం? అనేది మళ్లీ ఆ సంవత్సరాంతంలో బేరీజు వేసుకుంటాం. ఈ చక్రం కొంత సరదాగా ఉంటుంది. కొంత నిజంగా ఉపయోగపడుతుంది.నా వరకూ నాకు ‘2023’ ఒక విచిత్రమైన సంవత్సరం. 2018లో కోవిడ్కి ముందు ‘సమ్మోహనం’ థియేటర్లలో విడుదలై ఘనవిజయాన్ని అందుకున్న తర్వాత, కోవిడ్లో 2020లో ఓటీటీలో విడుదలైన ‘వి’, ఆ తర్వాత 2022లో థియేటర్లలో విడుదలైన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ నన్ను కొంత గజిబిజికి గురి చేశాయి. ‘వి’ మిశ్రమ ఫలితాలు, ‘ఆ అమ్మాయి..’ వైఫల్యం నా కళా దృక్పథాన్ని గట్టిగా కుదిపాయి. అయితే ఆ సమయంలో సద్విమర్శకులు, శ్రేయోభిలాషులు కొన్ని విషయాలని గట్టిగా విమర్శిస్తూనే, కొన్ని విషయాలలో నాకు అండగా నిలిచి, నా అభిరుచిని బలపర్చారు. 2024లో మళ్లీ ఆత్మస్థైర్యంతో అడుగిడేలా చేశారు. నా 2023 అనుభవాలు 2024 లో నా నిర్ణయాలని గాఢంగా కానీ, ప్రొడక్టివ్ గా కానీ ప్రభావితం చేశాయి అనిపిస్తోంది.గతమైనా, వర్తమానమైనా, భవిష్యత్తైనా మనల్ని నిలబెట్టేది మన స్నేహితులు. నిష్కర్షగా, ద్వేషరహితంగా మన జీవితాన్ని మనకి ప్రతిబింబించగలిగే నిజమైన స్నేహితులు. అందుకే ఈ రోజుల్లో ఉన్న సామాజిక మాధ్యమాల్లో ఎగసిపడుతున్న అకారణ ద్వేషం, నెగిటివిటీ, సంచలనవాదం, పోటీతత్వం, వేలంవెర్రి సొంతడబ్బాల మధ్య నిజమైన స్నేహితుల్ని వెతుక్కోవడమే కొత్త సంవత్సరంలో మన నిర్ణయం, ఆశయం కావాలి. ఈ యూట్యూబ్ ట్రోల్స్, ఇన్స్టా రీల్స్, గొడవలు, అరుపులు, దైనందిన జీవితపు రణగొణధ్వని మధ్య నిజమైన నిష్కల్మషమైన స్నేహాన్ని వెతుక్కుని పట్టుకోవడం కష్టమే. ఉన్న స్నేహితుల్లో ఎవరు హితులో, ఎవరు శత్రువులో తెలుసుకుని, శత్రువుల్ని పాము కుబుసం విడిచినట్టు విడిచి కొత్త సంవత్సరంలో సరికొత్త సహచర్య సౌందర్యంలో ముందుకు వెళ్లడమే ఆశయం కావాలి. నిజానికి ప్రతి సంవత్సరం ఈ నిర్ణయాన్ని మళ్లీ మళ్లీ కొత్తగా తీసుకోవాలి. మన స్నేహసంపదని నలుగురికి పంచి, మన స్నేహిత సంపదని ప్రతి సంవత్సరం పెంచుకోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాలిటీ, లార్జర్ దాన్ లైఫ్, వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ లాంటి నూతన ఆవిష్కారాలు, భావనలూ, ప్రచారాల నుండి మనల్ని మనం సంరక్షించుకోవాలంటే మంచి స్నేహితులే మనకి దిక్కు.2024లో ప్రతి సినిమాలో దాదాపు హీరో అంటే ఊచకోతకి మారుపేరయ్యాడు. నోట్లోంచి గొప్పగొప్ప ఉదాత్తమైన మానవత్వపు ఉపన్యాసాలిస్తూనే, రెండు చేతుల్తో వందలమందిని చంపుతున్నాడు. సున్నితమైన హాస్యం, ప్రేమ, సన్నిహితమైన సంభాషణలు, మానవ సంబంధాలు ట్రెండ్ కాదనే దుష్ప్రచారం మొదలై, బలం పుంజుకుంటోంది. ఈ సమయంలో ఈ కొత్త సంవత్సరంలో మనం ఆ ఒరవడికి కొంత అడ్డుకట్ట వేసి, మామూలు మనుషుల మానవత్వపు గుబాళింపు, తోటి మనిషి ఆనందాన్ని, అభ్యుదయాన్ని, కోరుకునే కొత్తరకం స్నేహితులని వెతుక్కుందాం. అలాంటి సరికొత్త కథానాయకుల్ని సృష్టిద్దాం, ఆదరిద్దాం. కొత్త సంవత్సరం కేవలం ఓ తారీఖు మారటమే అని హేతువాదులన్నా.. అదేదో కొత్తప్రారంభం అనుకోవడం మనకో ఉత్సాహాన్నిస్తుంది. అందుకే కొత్త నిర్ణయాలు, సరికొత్త ఆశయాలు, ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతాం. – ఇంద్రగంటి మోహన కృష్ణ, సినీ దర్శకుడు -
సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ పై దర్శకుడు సునీల్ కుమార్ రియాక్షన్
-
డైరెక్టర్పై కోపంతో సోషల్ మీడియాలో అశ్లీల వీడియోలు.. కేసు నమోదు!
బంజారాహిల్స్: అశ్లీల వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేయడమే కాకుండా అసభ్యకరంగా మాట్లాడిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సినీ దర్శకుడు, నిర్మాత షేక్ నాగుల్ షరీఫ్ పాన్ ఇండియా సినిమాను నిర్మించేందుకు సాగర్ సొసైటీలో కార్యాలయం తెరిచి నటీనటుల కోసం ఆడిషన్స్ సైతం మొదలు పెట్టారు. అంతే కాకుండా సినీ ప్రొడక్షన్లకు సంబంధించి ఇన్స్టా పేజ్ను అందుబాటులోకి తీసుకువచ్చాడు. ఈ పేజీ అడ్మిన్ బాధ్యతలను తన వద్ద పనిచేస్తున్న టి సృజన్కు అప్పగించాడు. కానీ సృజన్ ఇన్స్టా ద్వారా కొంత మందిని రకరకాలుగా వేధించడం మొదలు పెట్టాడు. (చదవండి: త్రివిక్రమ్ను ప్రశ్నించే దమ్ముందా? నిర్మాతపై పూనమ్ కౌర్ ఫైర్)విషయం తెలిసిన నాగుల్ అతన్ని విధుల్లో నుంచి తొలగించాడు. ఈ నెల 6న సృజన్ కార్యాలయానికి వచ్చి నాగుల్ను కలిసి తిరిగి ఉద్యోగం ఇవ్వాలని కోరాడు. దీనికి నాగుల్ ఒప్పుకోలేదు. దీంతో సృజన్ సినీ ప్రొడక్షన్కు చెందిన ఇన్స్టా పేజీలో సినిమాకు సంబంధించిన విషయాలు తొలగించి అశ్లీల వీడియోలు, ఫొటోలను అప్లోడ్ చేశాడు. అంతటితో ఆగకుండా ఆ చిత్రాలను కొంత మంది మహిళలకు పంపించాడు. విషయం తెలుసుకున్న షేక్ నాగుల్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘కల్కి 2898 ఏడీ’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ‘ఐతోలు’ బిడ్డె!
‘కల్కి 2898 ఏడీ’ అద్భుతమైన సైన్స్ విజువల్ సినిమాతో ప్రపంచ ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ చిత్ర దర్శకుడు మన పాలమూరు బిడ్డే. బాలీవుడ్ బిగ్బీ అమితాబ్ బచ్చన్, రెబల్స్టార్ ప్రభాస్, కమల్హాసన్, దీపికా పదుకొణే, విజయ్ దేవరకొండ, దిశా పటానీ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, మాళవిక నాయర్ వంటి టాప్స్టార్లతో రూపొందించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదలై.. భారీ హిట్గా దూసుకెళుతోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్వస్థలం నాగర్కర్నూల్ జిల్లా ఐతోలులో పండుగ వాతావరణం నెలకొంది. సాక్షి, నాగర్కర్నూల్/తాడూరు: దర్శకుడిగా మూడో సినిమానే హాలీవుడ్ తరహా చిత్రీకరణతో ప్రపంచవ్యాప్తంగా ప్రసంశలు అందుకుంటున్న నేపథ్యంలో అందరి దృష్టి నాగ్ అశి్వన్పై పడింది. దీంతో సినిమా డైరెక్టర్ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లలో ఆసక్తి పెరుగుతోంది. తాడూరు మండలం ఐతోలు గ్రామానికి చెందిన నాగ్ అశ్విన్ తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్లే. ఆయన తండ్రి డాక్టర్ సింగిరెడ్డి జయరాంరెడ్డి హైదరాబాద్లో యూరాలజిస్ట్గా, తల్లి జయంతిరెడ్డి గైనకాలజిస్ట్గా సేవలందిస్తున్నారు. వృత్తిరీత్యా వారు హైదరాబాద్కు వెళ్లినా.. గ్రామంలో సొంతిల్లు, దగ్గరి బంధువులు చాలా మందే ఉన్నారు. కుటుంబ, ఇతర శుభకార్యాలు ఉన్నప్పుడు అందరూ ఐతోలుకు వచ్చి వెళుతుంటారు. ⇒ హైదరాబాద్ పబ్లిక్ స్కూలులో చదువుకున్న నాగ్ అశ్విన్కు చిన్నప్పటి నుంచి పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నిర్మూలనపై ఆసక్తి ఎక్కువగా ఉండేది. మాస్ కమ్యూనికేషన్స్, జర్నలిజంలో బ్యాచిలర్స్ పూర్తి చేశాడు. ఆ తర్వాత న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో డైరెక్షన్ కోర్సు చేశాడు. సినిమాలకు దర్వకత్వం వహించాలనే లక్ష్యంగా ‘నేను మీకు తెలుసా?’ చిత్రానికి తొలిసారిగా అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన అశ్విన్.. ఆ తర్వాత శేఖర్ కమ్ముల దగ్గర లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేస్తూనే.. ఆ చిత్రాల్లో చిన్నపాత్రలు సైతం వేశారు. అయితే 2013లో రచయిత, దర్శకుడిగా తీసిన ఇంగ్లిష్ లఘు చిత్రం ‘యాదోం కీ బరాత్’ కేన్స్ షార్ట్ ఫిల్మ్ కార్నర్కు ఎంపికైంది. అనంతరం 2015లో ‘ఎవడే సుబ్రమణ్యం’ దర్శకుడిగా పరిచయమై సూపర్ హిట్తో తొలి చిత్రానికే నంది అవార్డు అందుకున్నారు. అదే ఏడాది వైజయంతి మూవీస్ అధినేత, నిర్మాణ అశ్వినిదత్ కుమార్తె ప్రియాంకను వివాహం చేసుకున్నారు. 2018లో అలనాటి హీరోయిన్ సావిత్రి బయోపిక్గా తీసిన ‘మహానటి’ సినిమా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు నిచ్చింది. ‘బయోపిక్’లో కొత్త ఒరవడి సృష్టించిన ఈ చిత్రం 66వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ తెలుగు సినిమాగా ఎంపికైంది. వీటితో పాటు 2021లో వచ్చిన పిట్టకథలు వెబ్ సిరీస్లో ‘ఎక్స్లైఫ్’ సిగ్మెంట్కు దర్శకత్వం వహించారు. అలాగే అదేఏడాది తెలుగులో సూపర్ హిట్ అయిన జాతిరత్నాలు సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. తాజాగా ఇండియాలోనే భారీ బడ్జెట్ రూ.600 కోట్లతో తీసిన పురాణ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం రికార్డులు కొల్లగొడుతోంది. స్వగ్రామంలో హర్షాతిరేకాలుదర్శకుడు నాగ్ అశి్వన్ తెరకెక్కించిన సినిమా ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తుండటం, ఘన విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఆయన స్వగ్రామం తా డూరు మండలం ఐతోలులో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామంతో పాటు జిల్లాకేంద్రంలోనూ ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తమ సంతోషాన్ని చాటుకుంటున్నారు. నాగ్ అశి్వన్ కుటుంబం హైదరాబాద్లో స్థిరపడినా సొంత ఊరిపైనున్న మమకారాన్ని వదులుకోలేదు. గ్రామంలో సాయిబాబా ఆలయాన్ని నిర్మించి, నిర్వహణ బాధ్యతలను కూడా వారే చూసుకుంటుండటం గమనార్హం. ఏళ్ల నాటి కల నెరవేర్చుకున్నాడు.. మంచి దర్శకుడిగా ఎదగాలన్న తన ఏళ్ల నాటి కలను నాగ్ అశ్విన్ నెరవేర్చుకున్నాడు. కల్కి సినిమా పార్ట్–1 విజయవంతమై అందరి ప్రసంశలు అందుకుంది. భవిష్యత్లోనూ ఈ విజయాల పరంపర కొనసాగాలి. సినిమా గొప్ప విజయం సాధిస్తున్నందుకు సంతోషంగా ఉంది. – డాక్టర్ జయంతిరెడ్డి, నాగ్ అశ్విన్ తల్లిఇంకా గొప్ప విజయాలు సాధించాలి.. ఐతోలు గ్రామానికి చెందిన నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి సినిమా భారీ విజయాన్ని అందుకోవడం సంతోషంగా ఉంది. ఆయన విజయం మాకు అందరికీ గర్వకారణం. భవిష్యత్లోనూ గొప్ప సినిమాలు చేయాలని, దర్శకుడిగా మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాం. – హరికృష్ణ శర్మ, ఐతోలు, తాడూరు మండలం -
‘ఏజెంట్’ తర్వాత అఖిల్ టార్గెట్ ఏంటి..?
‘ఏజెంట్’ తర్వాత అఖిల్ కొత్త సినిమా గురించిన అధికారిక ప్రకటన ఇంకా వెల్లడి కాలేదు. అయితే అనిల్ అనే ఓ కొత్త దర్శకుడితో అఖిల్ సినిమా చేయనున్నారని, ఈ సినిమాకు ‘ధీర’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారని ప్రచారం జరిగింది. తాజాగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతో అఖిల్ ఓ సినిమా చేయనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. శ్రీకాంత్ ఓ కథను రెడీ చేసి, అఖిల్కు వినిపించారట. ఈ స్క్రిప్ట్ అఖిల్కి నచ్చిందని సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే అఖిల్ – శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లోని సినిమా ఉంటుందనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ‘పెద కాపు 1’ ఈ నెలలోనే విడుదల కానుంది. ఒకవేళ అఖిల్తో సినిమా కన్ఫార్మ్ అయితే.. ‘పెద కాపు 1’ విడుదల తర్వాత ప్రకటన వస్తుందేమో? -
తెలుగు సినిమాల్లో ‘తెలంగాణ’ ఆయన కృషే.. అప్పట్లోనే ఆయన అలా..
తెలుగు సినిమా ఇప్పుడు సెకండ్ హాఫ్కు వచ్చింది. ఈ సెకండ్ హాఫ్ తెలంగాణ సినిమాది. తెలంగాణ హీరో, తెలంగాణ హీరోయిన్, తెలంగాణ పల్లె, తెలంగాణ పలుకుబడి.. తెలంగాణ సినిమా ఇప్పుడు తెలుగు సినిమా అయ్యింది. ఇకపై తెలంగాణ లేకుండా తెలుగు సినిమా మనజాలదు. ఈ కొమ్మరెమ్మల పూలు ఫలాలకు ఒకప్పుడు పాదు కట్టినది బి.నరసింగరావు.‘ఈ మట్టికి ఒక చరిత్ర ఉంది. ఈ మాటకు ఒక మిఠాస్ ఉంది. ఇక్కడి పేదకు ఒక గాథ ఉంది. ఇక్కడి ఆగ్రహానికి ఒక ఆయుధం ఉంది’ అని తెలుగు సినిమాలోకి తెలంగాణ జీవనాన్ని మొదటగా తీసుకువచ్చిన దర్శక నిర్మాత బి.నరసింగరావు. న్యూ సినిమా, ఆర్ట్ సినిమా, నియో రియలిస్టిక్ సినిమా, పారలెల్ సినిమా, ఆఫ్బీట్ సినిమా.. ఇలా రకరకాల పేర్లతో నవ సినిమా ఉద్యమం ప్రపంచమంతా వికసిస్తున్నప్పుడు ఆ ప్రభాతం వైపు చూపుడువేలు తిప్పి అటుగా దృష్టి ఇచ్చిన దార్శనికుడు బి.నరసింగరావు. ఆయన వల్ల తెలుగు సినిమా తల ఎత్తుకు తిరిగింది. ఆయనకి తెలంగాణ సినిమా తల వొంచి నమస్కరిస్తుంది. ప్రజలు వెలుతురులో ఉండాలనుకునేవాడు ఒక్కోసారి చీకటిలో దాక్కోక తప్పదు.బి. నరసింగరావు పరిస్థితి అలాగే ఉంది– 1975లో. ‘తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం వస్తుంది’ అనుకునేవారు అడవుల్లోకి మళ్లారు. ‘కుంచెతో కలంతో కూడా ప్రజలను రాజ్యాధికారం వైపు నడిపించవచ్చు’ అని మరికొందరు జనం మధ్య ఉండిపోయారు. కళ అంటే ప్రజాకళ.. కళాకారుడికి ఉండవలసిన దృక్పథం అభ్యుదయ దృక్పథం.. రచన కూడా ఉద్యమమే.. నాలుగు వాక్యాల కవిత కూడా డైనమైటే.. అనుకునే కళాకారులు తయారవుతున్న సమయం అది. దీని కంటే ముందు ‘ఆర్ట్ లవర్స్’ పేరుతో ఒక సమూహాన్ని సిద్ధం చేసి సామన్యుల వద్దకు నాటకాన్ని విస్తృతంగా తీసుకెళుతున్న బి.నరసింగరావు 1974 నాటికి ప్రభుత్వానికి ‘వాంటెడ్’ అయ్యారు. ‘దొరికితే కాల్చేస్తారు. లేదా జైల్లో వేస్తారు’ అని తెలిసిపోయింది. బి.నరసింగరావు చేసిన నేరం? ప్రజల్ని చైతన్యపరచడం. ప్రజలు చైతన్యం కావడం పాలకులకు నచ్చదు. ‘పొత్తుల వ్యవసాయం’, ‘సమాధి’, ‘బీదలపాట్లు’, ‘కొత్తమనిషి’ వంటి నాటకాలు స్వయంగా రాసి, నటిస్తూ, ‘మీ పరిస్థితి ఇలా ఉంది.. మీరిలా చేయాలి’ అని ‘నూరి పోస్తున్న’ బి.నరసింగరావు కనుకనే ప్రభుత్వానికి ‘వాంటెడ్’ అయ్యారు. 1974–75. రెండేళ్లు. ‘అండర్గ్రౌండ్’. హైదరాబాద్లోనే అజ్ఞాత జీవితం. ఉదయం ఐదున్నరలోపు ఎవరినైనా కలిస్తే కలవాలి. రాత్రి తొమ్మిది తర్వాత మళ్లీ. సూర్యుడు తిరుగాడే సమయంలో తిరుగాడ్డానికి వీల్లేదు. పగలంతా గదిలో బందిఖానా అయి ఉన్న నరసింగరావులో ఎన్నో ఆలోచనలు. ‘నేను కళాకారుణ్ణి.. నా కళ జనం చూడాలి.. దానికి స్పందన నేను చూడాలి.. అడవిలోకో అండర్గ్రౌండ్లోకో వెళ్లేలా నా కళా జీవితం ఉండకూడదు.. నా కళ వెలుతురులో ఉండాలి’.. అనే నిర్ణయానికి వచ్చారు. 1976లో అండర్గ్రౌండ్ నుంచి బయటకొచ్చాక ఆయన పెట్టుకున్న మూడు ఆప్షన్లు.. భగత్ సింగ్ గురించి ఒపెరా మాదిరిగా రవీంద్ర భారతిలో ఆరు నెలలు వరుసగా నాటకం ఆడటం లేదా ‘రీడర్స్ డైజెస్ట్’ లాంటి మేగజీన్ను నడపడం లేదా సినిమా తీయడం. అసలు దొరల కుటుంబంలో బంగారు చెమ్చాతో పుట్టిన బి.నరసింగరావు సినిమాల్లో చూపినట్టుగా గుర్రం ఎక్కి తిరుగుతూ అమాయకులను భయభ్రాంతం చేస్తుండాలి గాని ఈ నాటకాలు, పాటలు, పదుగురితో కలసి చాయ్ సిగరెట్ల మధ్య సాహిత్యాన్ని చర్చించడాలు.. ఏమిటిలా.. ఎందుకిలా? ∙∙ ‘లెక్కలు వచ్చేవి కావు. ఎక్కాలు చెప్పలేకపోయేవాణ్ణి. మా నాన్న ఎంత పెద్ద పట్వారీ అయినా లెక్కల పంతులు ఎండలో ఒంటికాలి మీద నిలబెట్టేవాడు. పదో క్లాసు పాస్ అవడం కూడా కష్టమైంది. అందరూ చదివే చదువు వల్ల కాదనిపించింది. అందుకే ఆ తర్వాత ఫైన్ ఆర్ట్స్లో పెయింటింగ్, ఫొటోగ్రఫీ చదివాను’ అంటారు బి.నరసింగరావు. గజ్వేల్ (మెదక్)కు దగ్గరగా ఉన్న ప్రజ్ఞాపూర్ బి.నరసింగరావుది. కాని ఆ తర్వాతి జీవితం అంతా హైదరాబాద్లో ‘అల్వాల్’లో గడిచింది. ‘హైదరాబాద్లోని రీగల్ థియేటర్లో నా చిన్నప్పుడు చూసిన తొలి సినిమా ‘మేనరికం’ (1953). ఆ తర్వాత హిందీ ‘సువర్ణసుందరి’ చూశాను. హైదరాబాద్లోని వివేకవర్ధిని కాలేజ్లో చదువుతున్నప్పుడు కాలేజ్కి వెళ్లనే లేదు. దాని పక్కనే ఉండే థియేటర్లలో ఉండేవాణ్ణి’ అంటారాయన. పుస్తకాల పిచ్చి కూడా అలాగే పట్టింది. ‘మా నాన్నగారి గదిలో చాలా పుస్తకాలు ఉండేవి. ఒకసారి వాటిని చదవడం మొదలెట్టి 40 రోజుల్లో 60 పుస్తకాలు చదివాను. ఆ తర్వాత కోఠి లైబ్రరీలో మకాం వేశాను. టెక్ట్స్బుక్స్ కన్నా ఈ పుస్తకాలు నాకు నచ్చాయి. అధికారం, దర్పం కన్నా గోడ మీద పడే ఉదయపు ఎండ నన్ను ఎక్కువ సంతోషపెట్టేది’ అని గుర్తు చేసుకున్నారాయన.సాహిత్యం, సినిమాలు, నాటకాలు, చిత్రలేఖనం.. ఇవన్నీ బి.నరసింగరావును చేర్చవలసిన చోటుకే చేర్చాయి– సినిమాకు– తన భూమికి– మాభూమికి. ∙∙ సందర్భవశాన మన దేశ దాదాపు తొలి నియో రియలిస్టిక్ సినిమా ‘దో బిఘా జమీన్’ (1953) భూమి సమస్యనే చర్చించింది. పేదవాడికి దక్కని భూమి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత న్యూవేవ్ సినిమా, న్యూ సినిమా మొదలయ్యిందే పేదల గురించి పీడకుల గురించి మాట్లాడటానికి. నిర్మాతల, నటీనటుల గుప్పిట్లో ఉండే కాలక్షేప సినిమాను దర్శకుడు పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుని తెలియని ముఖాలతో, మామూలు మనుషులనే నటులుగా చేసి తక్కువ ఖర్చు, తక్కువ వనరులతో ప్రయోజన్మాతక సినిమాను చెప్పడమే న్యూ సినిమా. సత్యజిత్ రే వచ్చి ‘పథేర్ పాంచాలి’ (1955) తీసి ఆర్ట్ సినిమా అనే మాటను దేశానికి పరిచయం చేశాడు. అయితే ఒక ధోరణిగా ఆర్డ్/పారలెల్ ఫిల్మ్స్ రావాలంటే 1970లు రావాల్సి వచ్చింది. హిందీలో ఎం.ఎస్.సత్యు ‘గరం హవా’ (1973), శ్యాం బెనగళ్ ‘అంకుర్’ (1974) పారలెల్ సినిమాను తీసుకొచ్చాయి. మరోవైపు మలయాళంలో ఆదూర్ గోపాల్కృష్ణన్ వచ్చి ‘స్వయంవరం’ (1972) తీశాడు. కన్నడంలో మన తెలుగు పఠాభి ‘సంస్కార’ (1970) తీశాడు. కాని గమనించవలసిన విషయం ఏమిటంటే తెలుగులో పారలెల్ సినిమా ముగ్గురు బయటి దర్శకుల వల్ల వచ్చింది. మృణాల్సేన్ ‘ఒక ఊరి కథ’ (1977), శ్యామ్ బెనగళ్ ‘అనుగ్రహం’ (1977), గౌతమ్ ఘౌష్ ‘మాభూమి’ (1979). ఈ ‘మాభూమి’ బి. నరసింగరావు చెమటా, నెత్తురు, తెలంగాణ సినిమాకు ఆయన తెరవాలనుకున్న తొలివాకిలి. ∙∙ ‘నవయుగ డిస్ట్రిబ్యూటర్స్ ప్రసాదరావు గారి అబ్బాయి రవీంద్రనాథ్ నా క్లాస్మేట్. వాడు కూడా ఎమర్జన్సీ టైమ్లో కోల్కతా వెళ్లి అండర్గ్రౌండ్లో ఉన్నాడు. తిరిగి వచ్చాక వాణ్ణి ప్రొడక్షన్లో పెట్టారు. మృణాల్సేన్ ‘ఒక ఊరి కథ’కు వాడు పని చేస్తుంటే నేను వెళ్లేవాణ్ణి. అప్పటికే నాకు సినిమా తీయాలని ఉంది. దర్శకత్వం చేయాలని ఉంది. కాని ఎలా తీయాలో తెలియదు. ఒక లక్ష రూపాయల్లో సినిమా తీయమని మృణాల్సేన్ను అడిగితే అంత తక్కువలో నేను చేయలేను.. కొత్త కుర్రాడొకడున్నాడు..అతన్ని ఉపయోగించుకో అని గౌతమ్ ఘోష్ను పంపారు. తెలంగాణ సాయుధ రైతాంగపోరాటం నేపథ్యం ఉన్న కిషన్ చందర్ నవల ‘జబ్ ధర్తీ జాగే’ను తీసుకున్నాం. గౌతమ్ ఘోష్ దానికి రాసుకొచ్చిన స్క్రీన్ప్లే నాకు నచ్చలేదు. మళ్లీ కూచుని అందరం రాశాం. దర్శకత్వం ఎలా చేయాలో తెలుసుకుందామంటే గౌతం ఘోష్ నేర్పే మనిషి కాదు. అందుకని అతని వెంటే తిరుగుతూ అబ్సర్వ్ చేస్తూ సినిమా తీయడం తెలుసుకున్నాను’ అంటారు బి. నరసింగరావు. 1980లో తెలుగులో రిలీజైన రెండు సినిమాలు ‘శంకరాభరణం’, ‘మాభూమి’ సంచలనం సృష్టించాయి. కె. విశ్వనాథ్తో ప్రయోగం అంతో ఇంతో సేఫ్. కాని తెలంగాణ సినిమా కొత్తవాళ్లతో తీసి విడుదల చేయడం చాలా రిస్క్. ‘లక్ష అనుకున్న బడ్జెట్ ఐదున్నర లక్షలు అయ్యింది. ఆస్తి అమ్మాల్సి వచ్చింది. మొత్తం ఔట్డోర్లో తీయడం వల్ల ఎన్నో సమస్యలు. అందరూ పడి దెబ్బలు తగిలించుకునేవారే. రోజుకు ఒక అయొడిన్ సీసా అయిపోయేది’ అన్నారు బి.నరసింగరావు. కాని ఆ శ్రమ వృథా పోలేదు. ‘మాభూమి’ తెలంగాణ కథకు, సినిమాకు అరుగు కట్టింది. దాని మీద బంగారు నందిని కూచోబెట్టింది. హైదరాబాద్లో వంద రోజులు ఆడి అందరినీ చకితులను చేసింది. ఇదే సినిమాతో గద్దర్ని బి. నరసింగరావు యుద్ధనౌకను చేసి జనంలోకి వదిలారు. ‘బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి’ పెద్ద హిట్. ∙∙ ‘రంగుల కల.. దర్శకుడిగా నా మొదటి సినిమా. మన దేశంలో మోడర్న్ పెయింటర్ మీద అప్పటికి ఒక్క సినిమా లేదు. జీవితంలో, కళలో ఒకేసారి దారి తెన్నూ వెతుక్కునే చిత్రకారుల కథ అది. కళ ప్రజల పక్షం ఉండాలి సరే. కళాకారుడు ఏ విధంగా బతకాలి. అతణ్ణి ఎక్స్ప్లాయిట్ చేసే వర్గాల కళారాధనలో బోలుతనం ఎంత.. ఇవన్నీ చర్చించాను. పస్తుల చిత్రకారుల 1980ల స్థితికి దర్పణం ఆ సినిమా’ అన్నారు బి. నరసింగరావు. ‘రంగుల కల’ (1983)లో బి. నరసింగరావు హీరో. హైదరాబాద్ నగరం ఇందులో ఒక పాత్రధారి. ఒక స్లమ్లో నివసించే చిత్రకారుడిగా ఆయన నటన ఆశ్చర్యం కలిగిస్తుంది. రూప హీరోయిన్. గద్దర్ పాడిన ‘భద్రం కొడుకో నా కొడుకో కొమ్రన్న’ పాట రేడియోలో నిత్యం మోగిపోయింది. ∙∙ ‘సీనియర్ జర్నలిస్ట్ జి.కృష్ణగారు నన్ను ఇంటర్వ్యూ చేయడానికి పిలిచారు. అప్పుడాయనొక మాట చెప్పారు– నరసింగరావు.. 1940ల్లో నేనొక దొరల గడీకి వెళ్లాను. అక్కడ ఒక దాసి నా కాళ్ల మీద నీళ్లు పోసి కడగడానికి వచ్చింది. నా కాళ్లు నేను కడుక్కోలేనా అన్నాను. ఇక్కడ ఎవరెవరో వచ్చి ఏమిటేమిటో కడిగించుకుంటారు మీరు కాళ్లకే ఇబ్బంది పడితే ఎలా అంది. అలా కడిగించుకునే మనుషులు ఎలాంటి వాళ్లు– అన్నారు. ఆ మాట నా మనసులో పడింది. మా నాన్న హయాంకు మా ఇంట్లో దాసీలు లేరు. నేను చూళ్లేదు. నేను నేరుగా మా అమ్మ దగ్గరకు వెళ్లి మనింట్లో దాసీలు ఉండేవారా అనంటే నిన్ను చిన్నప్పుడు చూసుకున్న లచ్చవ్వ దాసీయే కదా అంది. లచ్చవ్వ నా చిన్నప్పటికి ముసలిదైపోయింది. అంటే మా తాతల కాలంలో ఉండేవారన్న మాట. అక్కడి నుంచే దాసి సినిమా కథ పుట్టింది’ అన్నారు బి. నరసింగరావు. 1988లో వచ్చిన ‘దాసి’ తెలంగాణ సినిమా కీర్తిని, తద్వారా బి. నరసింగరావు కీర్తిని ప్రపంచానికి చాటింది. ఆరు జాతీయ అవార్డులు వచ్చాయి. ప్రపంచంలోని అనేక సినిమా స్కూళ్లలో ఆ సినిమా సిలబస్. మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు ఆ సినిమా చూసి కదిలిపోయి బి. నరసింగరావుకు ఫ్యాన్గా మారారు. తనకు ఆత్మీయులను చేసుకున్నారు. ఏమిటి ‘దాసి’ గొప్పతనం? అది వేదనను సహజంగా చెప్పింది. మనుషులు క్రూరత్వాన్ని సాధారణ విషయంగా భావించేలా జీవిస్తుంటారు. ఎదుటివారిని హింసించడం వారి ఖర్మ వల్లే అనుకుంటారు. పశ్చాత్తాపం ఎరగని ఇలాంటి మనుషులు ఈనాడు ఇబ్బడి ముబ్బడిగా కనిపిస్తూనే ఉన్నారు. నటి అర్చన ఈ సినిమా మొత్తం ఒకటి రెండు చీరల్లో కనిపిస్తుంది. ఆమెతో దొర గడిపినా ఆమె హోదా ఏమీ మారదు. వంట గదిలో చాలా ఘోరమైన బొచ్చెలో తిండి పెడతారు. ఆమెకు కడుపు వస్తే అది వెలి కడుపు. దొరసానికి కడుపు రాకపోయినా పర్లేదు కాని దాసిదానికి రాకూడదు. ‘కడుపు తీయించు’ అని దొరసాని హుకుం జారీ చేస్తే గడిలోని ముసలి దాసి పచ్చి బొప్పాయి కాయని కత్తి పీట మీద రెండుగా కోస్తుంది. ప్రేక్షకులకు గుండె ఝల్లుమంటుంది. తీవ్రమైన హింస అతి మామూలుగా ఉంటుందని బి. నరసింగరావు చూపుతారు. నేటికీ ‘దాసి’ చూడకపోతే తెలుగువారు ఒక కాలాన్ని ఒక జీవన వేదనని తెలుసుకోనట్టే. అందుకే ముసోరి ట్రైనింగ్లో ఐ.ఏ.ఎస్, ఐ.పి.ఎస్లకు ఈ సినిమా చూపిస్తారు. ∙∙ బి. నరసింగరావుకు సినిమా ఆదాయ మార్గం కాదు. కాంబినేషన్ సెట్ చేసి అడ్వాన్సులు తీసుకోవడం కాదు. ఏరియా వారి కలెక్షన్లు కాదు. సినిమా అనేది బలమైన వ్యక్తీకరణ మాధ్యమం. ‘నా సినిమాలు చూశాక అవి చాలా రోజుల పాటు గుర్తుండిపోతాయి’ అంటారాయన. బి. నరసింగరావు తీసిన ‘మట్టి మనుషులు’ భవన నిర్మాణ కూలీల వ్యథాత్మక జీవితాన్ని చూపిస్తుంది. ఆ సినిమాలో కూలీల పై సాగే భౌతిక దోపిడి ఒక ఎత్తయితే వారిలో స్త్రీల పై సాగే లైంగిక దోపిడి మరో ఎత్తు. ‘మట్టి మనుషులు’ చూస్తే భవన నిర్మాణ కూలీల పట్ల సగటు మనిషి వైఖరి మారుతుంది. ఇదే కాదు హైదరాబాద్ నగరం మీద ‘ది సిటీ’, ఊరి జీవనం మీద ‘మా ఊరు’ డాక్యుమెంటరీలు తీసినా గాఢంగా ముద్రవేసే జీవన దృశ్యాలు. ‘మా ఊరు’ అయితే భావి తరాల కోసం దాచి పెట్టిన తాళపత్రగ్రంథం. ∙∙ బి. నరసింగరావు ఇప్పుడు డెబ్బయిల వయసు దాటారు. కాని నిత్యం సినిమా గురించో చిత్రకళ గురించో ఏదైనా కవిత్వం గురించో కథ గురించో పని చేస్తూనే ఉన్నారు. కొత్తగా వచ్చిన సెల్ఫోన్తో వేలకొలది ఫొటోలు తీస్తూ ప్రతి కొత్త సాంకేతిక పరికరం సాంస్కృతికంగా ఎలా ఉపయోగపడుతుందో చూస్తుంటారు. ఆయన తెలంగాణ సినిమాకు భూమిక ఏర్పరచకపోతే ఇవాళ ఊరూరా ప్రదర్శించిన ‘బలగం’ లాంటి సినిమాలు ఇప్పటికీ సాధ్యమయ్యేవి కావు. ‘తెలంగాణ ఏర్పడ్డాక సాంస్కృతికంగా చేయవలసింది చాలా ఉంది’ అంటారాయన. ‘అందుకై ప్రత్యేకంగా ఎవరితోనూ తలపడాలని నేను అనుకోను. కాని తలపడే సందర్భం వస్తే సిద్ధంగా ఉంటాను’ అన్నారాయన. ఆరగడుగుల పై చిలుకు ఎత్తుతో తన నివాసంలో ఆయన తెలంగాణ సినిమా భీష్మాచార్యుడిలా కనిపించారు. జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీత యు.ఆర్.అనంతమూర్తి ‘దాసి’ చూసి పొంగిపోతూ ‘మై కంట్రీ ఈజ్ ప్రౌడ్ ఆఫ్ యూ’ అన్నారట. నిజమే. ఈ గొప్ప దర్శకుణ్ణి చూసి దేశం గర్విస్తూనే ఉంటుంది. ► ‘మట్టి మనుషులు’లో మొదటిసారి నీనా గుప్తాను పరిచయం చేశారు బి.నరసింగ రావు. ఆ సినిమాలో ఆమె భవన నిర్మాణ కూలీగా నటించింది. అందుకోసం రెండువారాలు హైదరాబాద్లో ఉండి తెలుగు కొద్దిగా నేర్చుకుంది. సినిమాలో ఆమె పాడే బిట్సాంగ్ ఉంది. అది ఆమే పాడింది. ► ‘దాసి’ కోసం నటి అర్చన స్నానం చేసే సీన్ తీయాల్సి ఉంది. ఒప్పుకోదేమో అనుకున్నారు. కాని అప్పటికే షూట్ జరుగుతున్న విధంలోని సీరియస్నెస్ను గమనించిన అర్చన ఆ సీన్ తీయడానికి అంగీకరించింది. కేవలం కెమెరామేన్ ఎ.కె.బీర్, తాను మాత్రమే లొకేషన్లో ఉండి మిగిలిన వారిని బయటకు పంపించి ఆ సీన్ తీశారు. ► ‘దాసి’లో దొర వేషం వేసిన భూపాల్ నిజ జీవితంలో శాంత స్వభావి. కాని దొర మనస్తత్వం ఏర్పడటానికి ఇంట్లో కూడా కటువుగా వ్యవహరించమని భూపాల్కు నరసింగరావు సూచించారు. షూటింగ్ మొదలయ్యాక భూపాల్ ఇంట్లో కూడా భార్యతో కఠినంగా వ్యవహరిస్తుండేసరికి ఆమె బెదిరిపోయి ఏం జరిగిందో తెలుసుకోవడానికి బి. నరసింగరావు దగ్గరకు వచ్చింది. అలా ఉండమని చెప్పింది తనే కనుక ఏం జవాబు చెప్పాలో తెలియక ఏదో సర్దిచెప్పి పంపించారు. ► బి.నరసింగరావు తెలుగు సినిమాకు పరిచయం చేసినవారిలో దర్శకుడు గౌతమ్ ఘోష్, నటుడు భూపాల్, ప్రసిద్ధ చిత్రకారుడు తోట వైకుంఠం, కవి దేవిప్రియ, నటుడు సాయి చంద్, గద్దర్, చిత్రకారుడు చంద్ర తదితరులు ఉన్నారు. తోట వైకుంఠం ‘రంగుల కల’ సినిమాలో కనిపిస్తారు. ‘రంగుల కల’లో గద్దర్ ‘భద్రం కొడుకో’ పాడుతుంటే కోరస్ సింగర్స్లో వంగపండు ఒకరిగా కనపడతారు. ► బి.నరసింగరావుకు సంగీతంలో గొప్ప ప్రవేశం ఉంది. ‘దాసి’కి ఆయన కూర్చిన నేపథ్య సంగీతం చూస్తే ఆ విషయం తెలుస్తుంది. శాస్త్రీయ సంగీతాన్ని తెలుగు సినిమాల్లో నేపథ్య సంగీతంగా బి.నరసింగరావు సమర్థంగా ఉపయోగించారు. ‘ది సిటీ’ డాక్యుమెంటరీ అందుకు ఉదాహరణ. ► ‘రంగుల కల’లో క్రేన్ ఉపయోగించి ఒక షాట్ తీయాల్సి వచ్చింది. కాని క్రేన్కు అద్దె ఎక్కువ. తక్కువ బడ్జెట్లో తీస్తున్న సినిమా కనుక కార్పొరేషన్ వారు వీధి దీపాలు మార్చడానికి ఉపయోగించే నిచ్చెన వాడి ఆ షాట్ తీశారు. ► బి.నరసింగరావు మంచి నటులు. ‘మా భూమి’లో ముఖ్యపాత్ర పోషించారు. రజాకార్లు తల మీద వాత పెట్టగా ఆ బాధ పట్టక జనం కోసం మాట్లాడే పాత్ర అది. ‘రంగుల కల’లో బి.నరసింగరావు హీరో. రూప హీరోయిన్. ఆ సినిమాలో ‘కౌగిలించుకోని’ హీరో హీరోయిన్లను చూపించడం ఒక వింత. ఎందుకంటే అప్పటికి హీరో హీరోయిన్ల గెంతులు శ్రుతి మించి ఉన్నాయి. - ఖదీర్ -
యంత్రాలు రీప్లేస్ చేస్తాయి!
‘‘మనందరం ఇప్పుడు ఏకతాటిపై నిలవక΄ోతే కచ్చితంగా మనల్ని యంత్రాలు రీప్లేస్ చేస్తాయి’’ అన్నారు సాగ్–ఆఫ్ట్రా (సీనియర్ యాక్టర్స్ గిల్డ్–అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ టెలివిజన్ అండ్ రేడియో ఆర్టిస్ట్స్) అధ్యక్షురాలు ఫ్రాన్ డ్రెస్చెర్. కొన్ని వారాలుగా సమ్మె చేస్తున్న డబ్లు్యజీఏ (రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా)కి పూర్తి మద్దతు ప్రకటించారామె. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ‘‘నటీనటులు అణచివేతకు గురవుతున్నారు. వారికి తగిన గౌరవం దక్కడంలేదు. చిత్రపరిశ్రమలో ఏం జరుగుతుందనేది అందరికీ చాలా ముఖ్యం. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందో మిగతా అన్ని రంగాల్లోని కార్మికులకు అదే జరుగుతోంది. యజమానులు అత్యాశకు ΄ోతున్నారు. యంత్రాలను నడిపించే సహాయకులను (కార్మికులను ఉద్దేశించి) మర్చి΄ోతున్నారు. వారు చేస్తున్న సేవలను గుర్తించడంలేదు. ఇది నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. సీఈవోలకు ఏకంగా వందల మిలియన్ల డాలర్లలో అధిక వేతనాలు ఇవ్వడంవల్ల ఆర్థిక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇక్కడ బాధితులు ఎవరంటే మేమే (కార్మికులు). వ్యా΄ారంలో ఉన్నవాళ్లు మా పట్ల వ్యవహరిస్తున్న తీరు షాకింగ్గా ఉంది’’ అని ఘాటుగా స్పందించారు ఫ్రాన్ డ్రెస్చెర్. తగ్గేదే లే... ‘‘ఏఐ వల్ల ముప్పే’’ అంటూ సమ్మెలో భాగంగా నినాదాలు చేస్తున్నారు. ఇప్పటికే ఏఐ న్యూస్ రీడర్స్ వచ్చిన నేపథ్యంలో ఏఐ వల్ల చిత్రపరిశ్రమలోనూ పెను మార్పు సంభవించే అవకాశం ఉందని హాలీవుడ్ కళాకారులు వా΄ోతున్నారు. అయితే ఏఐ వినియోగాన్ని తగ్గించాలన్న కళాకారుల డిమాండ్ని నిర్మాణ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. అలాగే నటీనటుల వేతనాలు పెంపుకు కూడా నిర్మాతలు సుముఖత వ్యక్తపరచడంలేదన్నది హాలీవుడ్ టాక్. ఈ నేపథ్యంలో నటీనటులు కూడా తమ డిమాండ్లను ఆమోదించేవరకూ సమ్మె కొనసాగించే తీరాలనీ, తగ్గేదే లే అనే పట్టుదలతో ఉన్నారనీ సమాచారం. -
Jean Luc Godard: సినీ నవ్య పథగామికి సెలవ్!
‘‘సంగీతానికి బాబ్ డిలాన్ ఎంతో... సినిమాకు గొడార్డ్ అంత!’’ – నేటి మేటి హాలీవుడ్ దర్శకుడు క్వెంటిన్ టరంటినో అవును... గొడార్డ్ అంతటి సినీ దిగ్గజమే! వెండితెర విప్లవమైన ఫ్రెంచ్ న్యూవేవ్ సినిమా ఉద్యమాన్ని తెచ్చిన ఆరేడుగురు మిత్రబృందంలో అగ్రగామి. సినీ రూపకల్పన సూత్రాలను తిరగరాసిన అనేక చిత్రాలకు తన తొలి సినిమాతోనే బీజం వేసిన పెద్దమనిషి. విమర్శకుడిగా మొదలై దర్శకుడైన సినీ మేధావి. ఈ 91 ఏళ్ళ ప్రపంచ ప్రసిద్ధ ఫ్రెంచ్ సినీ దర్శక వరేణ్యుడు విషాదభరిత రీతిలో సెప్టెంబర్ 13న ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు. ఆత్మహత్యకు సాయం తీసుకొని అంతిమ ప్రయాణం చేశారు. అవయవాలేవీ పనిచేయనివ్వని అనేక వ్యాధుల పాలైన ఆయనకు స్విట్జర్లాండ్లో చట్టబద్ధమైన ఆ రకమైన తుది వీడ్కోలు సాంత్వన చూపింది. అంతేకాదు... ఆ రకమైన ఆత్మహత్య సంగతి అధికారికంగా చెప్పాలనీ ముందే ఆయన మాట తీసు కున్నారు. అలా ఆఖరులోనూ గొడార్డ్ది నవ్య పంథాయే! 1930 డిసెంబర్లో పుట్టిన గొడార్డ్ 1950లో కొందరితో కలసి ‘గెజెట్ డ్యూసినిమా’ అనే సినిమా పత్రిక స్థాపించి, అనేక వ్యాసాలు రాశారు. 1952 నుంచి ఆ మిత్ర బృందంతో గొంతు కలిపి, న్యూవేవ్ సినిమాకు దన్నుగా విమర్శ వ్యాసాలు వెలువరించారు. మొదట లఘుచిత్రాలు, ఆనక 1959లో తొలి సినిమా తీశారు. దాన్ని ఖండఖండాలుగా కట్ చేయాల్సి వచ్చినప్పుడు, అవసరానికి ఆయన మొదలెట్టినదే ‘జంప్ కట్’ ఎడిటింగ్. ఇవాళ అదే ప్రపంచ సినిమాలో ఓ వ్యవస్థీకృత విధానమైంది. విమర్శకుడిగా మొదలై దర్శకుడైన ఈ సినీ మేధావి రూటే సెపరేటు. నటీనటులు సహజంగా ప్రవర్తిస్తుంటే, కెమేరా నిరంతరం కదులుతూ పోతుంటే, స్క్రిప్టు అక్కడికక్కడ స్పాట్లో మెరుగులు దిద్దుకుంటూ ఉంటే, ఎడిటింగ్లో మునుపెరుగని వేగం ఉంటే... అదీ గొడార్డ్ సినిమా. స్టయిలిష్గా సాగే తొలి చిత్రం ‘బ్రెత్లెస్’తోనే ఇటు విమర్శక లోకాన్నీ, అటు బాక్సాఫీస్ ప్రపంచాన్నీ కళ్ళప్పగించి చూసేలా చేసిన ఘనత ఆయనది. ఆ పైన ‘కంటెప్ట్’ లాంటి గొప్ప చిత్రాలు తీశారు. మలి చిత్రంలో నటించిన డ్యానిష్ మాడల్ అన్నా కరీనాను పెళ్ళాడి, ఆమెతో హిట్ సినిమాలు చేశారు. 1968లో ఫ్రాన్స్లో విద్యార్థుల, శ్రామికుల నిరసనకు సంఘీభావంగా నిలబడి కాన్ ఫిల్మ్ ఫెస్టివల్ను రద్దు చేయించారు. ఆ ఏడాదే ఓ మార్క్సిస్ట్ సినీ బృందాన్ని స్థాపించి, సామ్యవాదాన్ని అక్కున చేర్చుకోవడం మరో అధ్యాయం. 1960లలో విరామం లేకుండా వరుసగా సినిమాలు తీసిన గొడార్డ్ 1970లకు వచ్చేసరికి స్విట్జర్లాండ్లోని ఓ టీవీ స్టూడియోలో పనిచేస్తూ, కొత్త మీడియమ్ వీడియో వైపు దృష్టి మళ్ళించారు. 1980లలో సినీ రూపకల్పనకు తిరిగొచ్చి, ’94 వరకు అనేక చిత్రాలు తీశారు. దర్శకుడిగా గొడార్డ్లో మూడు దశలు. న్యూవేవ్ గొడార్డ్ (1960–67)గా మొదలైన ఆయన ర్యాడికల్ గొడార్డ్ (1968–72)గా పరిణామం చెంది, 1980ల అనంతరం వీటన్నిటికీ భిన్నమైన దర్శకుడిగా పర్యవసించారు. వస్తువుకూ– శిల్పానికీ, మనసుకూ – మెదడుకూ సమరస మేళవింపు ఆయన సినిమాలు. ఆయన రాజకీయాలు చూపెడతారు. కానీ ప్రబోధాలు చేయరు. సినిమానే శ్వాసించి, జీవించడంతో తెరపై అణువణువునా దర్శనమిస్తారు. ప్రతి సినిమాతో సినీ ప్రేమికుల మతి పోగొడతారు. సినిమాలో కవిత్వాన్నీ, తనదైన తాత్త్వికతనూ నింపేసిన ఆయన, నిర్ణీత పద్ధతిలోనే కథాకథనం సాగాలనే ధోరణినీ మార్చేశారు. స్థల కాలాదులను అటూ ఇటూ కలిపేసిన కథాంశాలతో సినిమాలు తీశారు. ‘కథకు ఆది మధ్యాంతాలు అవసరమే. కానీ, అదే వరుసలో ఉండాల్సిన పని లేద’ని నమ్మారు. దాదాపు 100కు పైగా సినిమాలు తీసినా, ఎప్పటికప్పుడు కొత్తదనం కోసమే పరితపించారు. ఆయన సినిమాల్లో రిలీజ్ కానివి, సగంలో ఆగినవి, నిషేధానికి గురైనవీ అనేకం. నాలుగేళ్ళ క్రితం 87 ఏళ్ళ వయసులో 2018లోనే గొడార్డ్ తాజా చిత్రం రిలీజైంది. కెరీర్లో ఒక దశ తర్వాత ఆలోచనాత్మకత నుంచి అర్థం కాని నైరూప్య నిగూఢత వైపు ఆయన కళాసృష్టి పయనించిందనే విమర్శ లేకపోలేదు. అయితేనేం నేటికీ పాత చలనచిత్ర ఛందోబంధాలను ఛట్ఫట్మనిపించిన వినిర్మాణ శైలి దర్శకుడంటే ముందు గొడార్డే గుర్తుకొస్తారు. అందుకే, 2011లో గొడార్డ్కు గౌరవ ‘ఆస్కార్’ అవార్డిస్తూ ‘సినిమా పట్ల మీ అవ్యాజమైన ప్రేమకు.. నిర్ణీత సూత్రాలపై మీ పోరాటానికి.. నవీన తరహా సినిమాకు మీరు వేసిన బాటకు..’ అంటూ సినీ ప్రపంచం సాహో అంది. రచయితల్లో జేమ్స్ జాయిస్, రంగస్థల ప్రయోక్తల్లో శామ్యూల్ బెకెట్లా సినిమాల్లో గొడార్డ్ కాలాని కన్నా ముందున్న మనిషి. సమకాలికులు అపార్థం చేసుకున్నా, భావి తరాలపై ప్రభావమున్న సృజనశీలి. నవీన మార్గం తొక్కి, ఇతరులు తమ ఆలోచననూ, ఆచరణనూ మార్చుకొనేలా చేసిన ఘనుడు. ఏ రోజు సీన్లు ఆ రోజు సెట్స్లో రాస్తూ, చేతిలో పట్టుకొనే చౌకరకం కెమెరాలతో, ఎదురెదురు అపార్ట్మెంట్లలో, తెలిసిన బంధుమిత్రులే నటీనటులుగా సినిమా తీస్తూ అద్భుతాలు సృష్టించిన జీనియస్. ఆయన ర్యాడికల్ శైలి ఎందరిలోనే సినీ సృజనకు ఉత్ప్రేరకం. ఆ ప్రభావం అనుపమానం. అది ఎంత గొప్పదంటే... ఆయన సినిమాలు చూస్తూ వచ్చిన హాలీవుడ్ కుర్రకారులో అసంఖ్యాకులు కెమేరా పట్టి, లోబడ్జెట్, స్వతంత్ర చిత్రాలు తీయసాగారు. ఆయన టెక్నిక్లే వారి యాడ్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీల రూపకల్పనకు తారకమంత్రమయ్యాయి. సంప్రదాయంపై తిరుగుబాటు చేసి, హాలీవుడ్నే ధిక్కరించిన ఓ దర్శకుడిని ఆ హాలీవుడ్డే అలా ఆరాధించడం వింతల్లో కెల్లా వింత. మరెవరికీ దక్కని ఘనత. హాలీవుడ్ దర్శకుడు క్వెంటిన్ టరంటినో పైనా ‘అమితంగా ప్రభావం చూపిన దర్శకుడు’ గొడార్డే! తన గురువు కాని గురువు తీసిన ‘బ్యాండ్ ఆఫ్ అవుట్సైడర్స్’ స్ఫూర్తితోనే టరంటినో తన స్వీయ సినీ నిర్మాణ సంస్థకు ‘ఎ బ్యాండ్ ఎపార్ట్’ అని పేరు పెట్టారు. అన్ని వ్యవస్థలనూ ప్రతిఘటించిన గొడార్డ్ తనకు తెలియకుండా తానే ఒక వ్యవస్థ కావడం ఓ విరోధాభాస. ఆయన తన సినిమాల్లో చెప్పిన అంశాలు ముఖ్యమైనవే. కానీ, చెప్పీచెప్పకుండా అంతర్లీనంగా అలా వదిలేసినవి మరీ ముఖ్యమైనవి. ‘ఫోటోగ్రఫీ సత్యం. సినిమా సెకనుకు 24 సార్లు తిరిగే సత్యం. ఎడిట్ చేసిన ప్రతిదీ అసత్యమే’ అనేవారాయన. ఆ సత్యాసత్యాల సంఘర్షణలే ఆయన చిత్రాలు. ఒక్కమాటలో సినిమాను తన సెల్యులాయిడ్ రచనగా మలుచుకున్న అరుదైన దర్శకుడు గొడార్డ్. (క్లిక్ చేయండి: బొమ్మలు చెక్కిన శిల్పం) బతికుండగానే ఆయనపై ఆయన శైలిలోనే ఒక సినిమా రావడం విశేషం. గొడార్డంటే ఫ్రెంచ్ న్యూవేవ్ అంటాం. కానీ, జాగ్రత్తగా గమనిస్తే 1960ల తర్వాత ప్రపంచం నలుమూలల్లో ప్రతి నవ్యధోరణిలో ఆయన దర్శనమిస్తారు. ఆయన శైలి, సంతకాలు మన బాలీవుడ్ సినిమాల్లోనూ కనిపిస్తాయి. సినిమా సరిహద్దుల్ని విస్తరించిన గొడార్డ్తో ప్రభావితుడైన దర్శకుడు మార్టిన్ స్కొర్సెసే అన్నట్టు ‘‘సినీ రంగంలో అతి గొప్ప ఆధునిక దృశ్యచిత్రకారుడు.’’ చిత్రకళకు ఒక పికాసో. సినిమాకు ఒక గొడార్డ్! రాబోయే తరాలకూ ఆయన, ఆయన సినిమా గుర్తుండిపోయేది అందుకే! (క్లిక్ చేయండి: నడిచే బహు భాషాకోవిదుడు) – రెంటాల జయదేవ -
విశ్వ భారతం
తపోదీక్షలో ఉన్న వ్యాసుడికి ఉన్నట్టుండి సృజన ఉప్పొంగుతుంది. మానవజాతి చరిత్రను కావ్యరూపంలో రాయ సంకల్పించి, తనకు లేఖకుడిగా కౌమార బాలుడైన పరీక్షిత్తును ఉండమంటాడు. పరీక్షిత్తుకు తన పూర్వీకులను అతి దగ్గరగా పరిచయం చేయడం వ్యాసుడి ప్రాథమికోద్దేశం. మనుషుల అతి సంక్లిష్టమైన స్వభావాలను చిత్రించడం ద్వారా మానవజాతికి తమ ఉనికి పట్ల ఒక జాగరూకతను కలిగించడం పరమ లక్ష్యం. ఎందుకంటే కురుక్షేత్ర యుద్ధం తర్వాత జరిగింది సర్వనాశనమే. ఇంతటి మహోన్నత కార్యం కాబట్టే, సాక్షాత్తూ దేవుడే(గణేశుడు) స్వయంగా వ్యాసుడికి లేఖకుడిగా కుదురుకుంటాడు. ఇటీవల మరణించిన రంగస్థల దిగ్గజం పీటర్ బ్రూక్ దర్శకత్వం వహించిన ‘ద మహాభారత’, తానూ ఒక పాత్రగా ఉన్న భారతాన్ని వ్యాసుడు రాయడానికి పూనుకోవడంతో ప్రారంభమవుతుంది. మనకు మహాభారతం కొత్తది కాదు. మన సారస్వతం మహాభారతంతో ప్రభవించింది. మన రంగస్థలం మహాభారతంతో సంపన్నమైంది. మన చిత్రసీమ మహాభారతంతో పదునెక్కింది. ‘తత్వజ్ఞులు ధర్మశాస్త్రంగా, ఆధ్యాత్మవిదులు వేదాంతంగా, నీతివిచక్షణులు నీతిశాస్త్రంగా, కవులు మహాకావ్యంగా, లాక్షణికులు సర్వలక్షణ సంగ్రహంగా, పౌరాణికులు బహుపురాణ సముచ్ఛయంగా’ గౌరవించే ఇతిహాసం ఇది. ‘ఇందులో ఉన్నదే ప్రపంచంలో ఉన్నది. ఇందులో లేనిదేదీ ప్రపంచంలో లేదు.’ అందుకే బయట తలెత్తిన సమస్యకు మహాభారతంలో సమాధానం వెతకడానికి ప్రయత్నించాడు ఇంగ్లండ్కు చెందిన ‘పద్మశ్రీ’ పీటర్ బ్రూక్(1925–2022). వియత్నాంతో అమెరికా యుద్ధం జరిగిన తర్వాతి విధ్వంసం బ్రూక్కు మహాభారతం మీద ఆసక్తిని కలిగించింది. ప్రతి పాత్రా రక్తమాంసాలతో, తనవైన బలహీనతలతో ఉండి, యుద్ధ బీభత్సాన్ని అనివార్యం చేస్తుంది. ప్రతి మనిషీ సృష్టి విధ్వంసంలో ఏదో ఒక మేరకు పాత్రను పోషిస్తూనే ఉంటాడు; అందుకే అందరూ ఈ ప్రపంచానికి ఉమ్మడిగా బాధ్యులేనని పీటర్కు నమ్మకం కలిగింది. దాన్నే విశ్వ యవనిక మీద ఎలుగెత్తి చాటాడు. క్లాసిక్స్ను స్టేజీ మీదకు తేవడంలో రంగస్థలానికి ప్రమాణాలు నెలకొల్పిన పీటర్ బ్రూక్ ‘అవర్ గ్రేటెస్ట్ లివింగ్ థియేటర్ డైరెక్టర్’ అనిపించుకున్నాడు. భారతం కోసం ఫ్రెంచ్ రచయితలైన జాన్ క్లాడ్ కారియేరీ, మేరీ హెలెనా ఏస్తియన్తో జట్టు కట్టాడు. ఎందరో సంస్కృత పండితులను కలిశారు. ఎనిమిదేళ్ల శ్రమ తర్వాత పన్నెండు గంటల నాటకంగా భారతం రూపొందింది. 1985లో తొలి ప్రదర్శన జరిగింది. పదహారు దేశాలకు చెందిన నటీనటులతో నాలుగేళ్లపాటు వీరి బృందం అమెరికా నుంచి ఆఫ్రికా గ్రామాల వరకూ పర్యటించింది. ముంబయి నగరానికీ వచ్చింది. తెలుపు, నలుపు, గోధుమ వర్ణాల నటులతో ఇది నిజంగానే ప్రపంచ నాటకంగా మారిపోయింది. ‘లార్డ్ ఆఫ్ ద ఫ్లైస్’ లాంటి సినిమాతో సినీ దర్శకుడిగానూ ప్రసిద్ధుడైన బ్రూక్ తన నాటకం ఆధారంగానే 1989లో ఐదున్నర గంటల టెలివిజన్ సిరీస్గా ‘ద మహాభారత’ రూపొందించారు. ఆయన్ని అంచనా కట్టడానికి మనకు ఇప్పుడున్న సోర్సు ఇదే! ‘మ..హా..భా..ర..త్..’ అంటూ దూరదర్శన్ ద్వారా 94 వారాల ధారావాహికను ఇంటింటికీ పరిచయం చేసిన బీఆర్ చోప్రాకు ముందు, లేదా సమాంతరంగా బ్రూక్ అనుసృజన మొదలైంది. మొదటి సీన్ నుంచే మనకు అలవాటైన భారతాన్ని చూడటం లేదని అర్థమైపోతుంది. ద్రౌపది(మల్లికా సారాభాయి) లాంటి ఒకట్రెండు పాత్రలు తప్ప ఎవరూ భారతీయులు కాదు. సెట్టింగులు తక్కువ, ఆభరణాలు అత్యల్పం, కిరీటాలు లేవు, పరిచారికలు కనబడరు, జయజయ ధ్వానాలు శూన్యం, రాజకుమారులందరూ షేర్వానీలు తొడుక్కుంటారు. మహామహా యోధులు బారులు తీరిన చివరి యుద్ధ ప్రారంభ సూచికగా అర్జునుడు శంఖం ఊదినప్పుడు కనబడేది మహా అయితే రెండు తెల్ల గుర్రాలు మాత్రమే. ఒక భారీ విజువల్ ఫీస్ట్ దీన్నుంచి ఆశించలేం. కానీ పీటర్ బ్రూక్ గొప్పతనం ఎక్కడంటే, అవేవీ లేకుండానే ఆ ఉద్వేగాన్ని పలికించగలగడం. రంగస్థలం మీద ఒక ఖాళీ స్థలంలో నువ్వొక విశ్వాన్ని చూపగలవు; నటుడి చేతిలోని ఒక కర్ర, ఒక సీసా, లేదా ఖాళీ మద్య పాత్రతో ఎంతో చేయొచ్చునంటాడు బ్రూక్. ఆ స్ఫూర్తి ఇందులోనూ కనబడుతుంది. కథను వర్తమానంలో చూపడం కంటే జరిగిపోయినదాన్ని వ్యాసుడు నెరేటర్గా చెబుతుండటం వల్ల ఇందులో ఉన్నదేదీ ఇక లోపంగా కనబడదు. కృష్ణుడు నీలవర్ణంలో ఉండకపోవడం, భీష్ముడంతటివాడిని కూడా మనవలు పేరు పెట్టి పిలవడం భారతీయ పద్ధతికి దూరం. గన్నేశా, సత్యవత్తి లాంటి ఉచ్ఛారణలు భారతీయేతరుల పరిమితి. వీటికంటే కూడా భారత వారసత్వాన్ని దొంగిలిస్తున్నాడని పీటర్ నిందలు ఎదుర్కొన్నాడు. అయితే, భారతం ప్రపంచానికి చెందినదని తన ప్రయత్నాన్ని సమర్థించుకున్నాడు. మడుగులో నీళ్లు తాగడానికి అనుమతి ఇచ్చేముందు యక్షుడు అడిగే ప్రశ్న: ‘ఈ ప్రపంచానికి కారణం ఏమిటి?’ దానికి ధర్మరాజు సమాధానం: ‘ప్రేమ!’ ఇదే సర్వకాలావసరం. సాహిత్య ఆదాన ప్రదానాలకు కారణమయ్యే, అన్ని ప్రాంతాల వైవిధ్యమైన కథనాలను ప్రపంచం వినగలిగేట్టు చేసే సాంస్కృతిక దూతలు ఎప్పుడూ అవసరమే. మనుషులను అర్థం చేసుకోవడం ద్వారానే మనుషులు మారగలరు. -
అవధుల్లేని కళ
గోవిందుని అరవిందన్ సినిమాల్లోకి రాకముందు కార్టూనిస్టుగా పనిచేశారు. ఆయన కార్టూన్ స్ట్రిప్ ‘చెరియ మనుష్యారుమ్ వలియ లోకవుమ్’ (చిన్న మనుషులు పెద్ద ప్రపంచం) దశాబ్దానికి పైగా మలయాళ వారపత్రిక మాతభూమిలో వచ్చింది. దీన్ని ఆధారం చేసుకొనే తన మొదటి సినిమా ‘ఉత్తరాయణం’కు(1974) శ్రీకారం చుట్టారు. అప్పటికే నాటకరంగంలో కూడా చేస్తున్న కషి ఆయన్ని చిత్రసీమలోకి అడుగుపెట్టేలా పురిగొల్పింది. స్వాతంత్య్ర సమర కాలంలో ఒక సాధారణ యువకుడి ద్వైదీ భావాలనూ, వేర్వేరు పోరాట మార్గాలనూ, కొందరు మనుషుల అవకాశవాదాన్నీ అతిసహజంగా చిత్రించిన ఈ సినిమా మలయాళ పరిశ్రమలో కొత్తగాలిలా వీచింది. అప్పుడప్పుడే మలయాళ పరిశ్రమ ఉత్తరాదిన వీస్తున్న సమాంతర సినిమా పవనాలకు పరిచయం అవుతోంది. మున్ముందు జి.అరవిందన్గా సుప్రసిద్ధం కాబోతున్న గోవిందుని అరవిందన్(1935–1991) తర్వాతి సినిమాగా ‘కాంచనసీత’ ప్రారంభించారు. 1977లో వచ్చిన ఈ సినిమా చూస్తే గుప్పెడు మందితో, ఏ ఆర్భాటమూ హడావుడీ లేకుండా కూడా రామాయణాన్ని తెరకెక్కించవచ్చా అన్న సంభ్రమాశ్చర్యం కలుగుతుంది. తక్కువ మాటలు, శక్తిమంతమైన ప్రతీకలు, దశ్యబలంతో ఉత్తర రామాయణాన్ని ఒక వ్యక్తిగత కవితా అభివ్యక్తిగా మలిచారు. ఇంకా దీని విశేషం ఏమిటంటే– తారలనూ, అలవాటుగా చూస్తున్న నునుపైన తెలుపు శరీరాలనూ పక్కనపెట్టి రాముడితో దగ్గరి సంబంధం ఉందని చెప్పుకొనే ‘రామచెంచు’ తెగవాళ్లతోనే ప్రధాన పాత్రలను పోషింపజేయడం! దీనివల్ల ఛాందసవాదుల నుంచి దైవదూషణ స్థాయి వ్యతిరేకతనూ ఎదుర్కొన్నారు. కానీ వెనక్కి తగ్గ లేదు. సినిమా పట్ల ఆయన దక్పథం అంత బలమైనది. అందువల్లే మలయాళంలో సమాంతర సినిమాకు దారిచూపిన మొదటి వరుస చిత్రంగా కాంచనసీత చరిత్ర కెక్కింది. ఈ సినిమా షూటింగ్ అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో జరగడంతో తెలుగువారికి కూడా దీంతో మరింత సంబంధం ఏర్పడింది. అరవిందన్ తర్వాతి సినిమా 1978లో వచ్చిన ‘థంపు’. అంటే సర్కస్ డేరా. దీన్ని బ్లాక్ అండ్ వైట్లో తీయాలని పూనుకోవడానికి బహుశా జీవితపు నలుపూ తెలుపుల్నీ అత్యంత గాఢంగా చూపాలని కావొచ్చు. ఒక ఊరికి సర్కస్ వాళ్లు రావడంతో మొదలై, కొన్ని రోజులు చుట్టుపక్కల వాళ్లని ఊరించి, ఊగించి, తిరిగి ఏ ఆదరణా లేని దశకు చేరుకుని కొత్త ఊరిని వెతుక్కుంటూ పోయేదాకా కథ సాగుతుంది. ఏ కళకైనా అవధులు ఉన్నాయనీ, ఆకర్షణ ఎల్లవేళలా నిలిచేది కాదనీ చాటినట్టుగా ఉంటుంది. ఒక గొప్ప కళాకారుడు మాత్రమే కళకు పరిమితులు ఉన్నాయని గుర్తించగలడు. జీవిత రంగం నుంచి అందరమూ ఎప్పుడో ఒకప్పుడు నిష్క్రమించాల్సిన వాళ్లమేనన్న కఠోర సత్యాన్ని కూడా ఇది గుర్తు చేయొచ్చు. దాదాపుగా డాక్యుమెంటరీలా సాగే ఈ సినిమా సర్కస్ చూస్తున్న ప్రతి ఒక్కరి, ప్రతి ఒక్క హావభావాలను పట్టుకుంటుంది. మనుషుల మీద ఎంతో ప్రేమ ఉన్నవాళ్లు మాత్రమే ఇలాంటి సినిమాలు తీయగలరు. ఒక మనిషి మానసికంగా కుప్పగూలే పరిస్థితులు ఎలా వస్తాయన్నది చూపిన చిత్రం ‘పోక్కు వెయిల్’(సాయంసంధ్య–1981). చాలా నెమ్మదైన కథనం. కానీ ‘తీవ్రమైన నెమ్మదితనం’ అది. అందులోంచే ఉద్వేగాన్ని ఉచ్చస్థాయికి తీసుకెళ్తారు. సినిమా అనేది గిమ్మిక్కు కాదంటారు అరవిందన్. దీనితో ఏకీభావం ఉన్నవాళ్లకు ఇది గొప్ప అనుభవాన్ని ఇవ్వగలుగుతుంది. స్త్రీ పురుష సంబంధాలూ, ఆకర్షణల్లోని సంక్లిష్టతనూ, తదుపరి పర్యవసనాలూ, పశ్చాత్తాపాలనూ ఎంతో సున్నితంగా ఆవిష్కరించిన ‘చిదంబరం’(1985) ఆయన మాస్టర్పీస్. మొదటి సినిమా మినహా ఈ అన్నింటికీ మున్ముందు మలయాళంలో మరో ప్రసిద్ధ దర్శకుడిగా అవతరించనున్న షాజీ ఎన్.కరుణ్ సినిమాటోగ్రాఫర్గా పనిచేయడం గమనార్హం. 56 ఏళ్ల వయసులోనే అర్ధాంతరంగా కన్నుమూసిన అరవిందన్ ఉన్ని, కుమ్మట్టి, ఎస్తప్పన్, వస్తుహార లాంటి సినిమాలు తీయడంతోపాటు ఆరో ఓరల్, పిరవి లాంటి చిత్రాలకు సంగీత దర్శకత్వమూ వహించారు. ప్రతి సినిమాకూ ఎప్పటికప్పుడు నెరేటివ్ శైలిని మార్చుకుంటూ ప్రతిదాన్నీ ఒక కొత్త ప్రయోగంగా చేయడం ఆయన ప్రత్యేకత. ‘పాన్ ఇండియా’, ‘పాన్ వరల్డ్’ లాంటి మాటలు కేవలం వ్యాపార లెక్కలు. నిలిచిపోయే సినిమాలకు అవి కొలమానం కాకపోవచ్చు. కానీ ఇప్పుడు దేశంలో సినిమా ప్రేమికులు అత్యంత ఆసక్తి ప్రదర్శిస్తున్న సినీ పరిశ్రమ ఏదైనా ఉందంటే, అది మలయాళ చిత్రసీమే. ఒక నిబద్ధతతో వచ్చిన చిత్రాల ఒరవడిని అద్దుకున్న జీవితపు వాస్తవికతా, కథను చూడబుద్ధేసేట్టుగా చెప్పడంలో కమర్షియల్ సినిమా సాధించిన ఒక వేగపు లయా... ఈ రెండింటినీ మేళవించుకొని ఇండియా మొత్తాన్నీ తమవైపు తిప్పుకొంటోంది. దాని వెనక అరవిందన్ లాంటి వారి స్ఫూర్తి విస్మరించలేనిది. ప్రతి ఏడాదీ ప్రపంచ సినిమా జీవులు ఎంతో ఆసక్తి కనబరిచే ప్రతిష్ఠాత్మక కాన్ ఫిలిం ఫెస్టివల్ ఫ్రాన్స్లో ముగిసింది. మే 17 నుంచి 28 వరకు జరిగిన 2022 సంవత్సరపు ఈ ఉత్సవం మిరుమిట్లు గొలిపే తారల మధ్య ఎంతో వైభవోపేతంగా జరిగింది. భారతదేశం తరఫున క్లాసిక్ విభాగంలో అక్కడ ప్రదర్శనకు నోచుకున్న సినిమాలు రెండే రెండు. ఒకటి, సత్యజిత్ రే ‘ప్రతిద్వంది’ కాగా, రెండవది జి. అరవిందన్ ‘థంప్’. (కొత్త వెర్షన్లో థంపును థంప్గా మార్చారు.) రెండు నిరాడంబర సినిమాలు ఆ ఆర్భాటపు పండుగలో ప్రదర్శన జరగడం విరోధాభాసే కావొచ్చుగానీ అదే జీవితపు తమాషా కూడా! -
డాక్యుమెంటరీ ఫిల్మ్: ఇది నా ఇల్లు
ఎవరినైనా కలిసినప్పుడు మంచీ చెడు మధ్యలో తప్పక వచ్చే ప్రశ్న ‘మీ ఇల్లెక్కడ?!’ ‘ఇదే ప్రశ్నను లద్దాఖ్లోని ఓ పెద్ద మనిషిని అడిగినప్పుడు అక్కడి చుట్టూ కొండలు, విశాల మైదానాలు చూపిస్తూ... ఈ ప్రకృతి ఒడే నా ఇల్లు అని పరిచయం చేస్తే... ఆ ప్రపంచంలో 45 రోజులు ఉండి తీసిన డాక్యుమెంటరీ ఫిల్మ్ ‘ఇది నా ఇల్లు’ అని వివరించారు దీపాకిరణ్. ప్రపంచ వ్యాప్తంగా 75 వేల మందికి పైగా స్టోరీ టెల్లర్స్ను చేరుకున్న దీపాకిరణ్ హైదరాబాద్ వాసి. స్టోరీ ఆర్ట్ ఫౌండేషన్ ఫౌండర్, ప్రొఫెషనల్ స్టోరీ టెల్లర్, ఆర్ట్–బేస్డ్ ఎడ్యుకేషనలిస్ట్. ఈ స్టోరీ టెల్లర్ ఇటీవల ‘దిస్ ఈజ్ మై హోమ్’ అనే డాక్యుమెంటరీ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ యేడాది ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్(ఎమ్ఐఎఫ్ఎఫ్) లో ప్రదర్శనకు వచ్చిన 800 ఎంట్రీలలో ‘దిస్ ఈజ్ మై హోమ్’ టాప్ టెన్ జాబితాలో నిలిచింది. ఈ సందర్భంగా ఆమెతో మాట్లాడినప్పుడు డాక్యుమెంటరీ ఫిల్మ్ రూపకల్పన గురించి ఇలా పంచుకున్నారు. ‘‘సముద్రం నుండి 3,700 మీటర్ల ఎత్తులో లద్దాఖ్ పర్వతాలలోని మారుమూల గ్రామంలో ఒక యువ గ్రాఫిక్ డిజైనర్ జీవితాన్ని డాక్యుమెంటరీని రూపొందించాను. లెహ్–లదాఖ్లోని రెసిడెన్షియల్ కోర్సులో భాగంగా, వర్క్ నేర్చుకుంటూ తీసిన మొదటి డాక్యుమెంటరీ ఫిల్మ్ ఇది. కథ కలిపిన పరిచయాలు కిందటేడాది ఆగస్టులో రెండు వర్క్షాప్స్ కోసం చేసిన ప్లాన్లో భాగంగా లదాఖ్కు వెళ్లాను. లైఫ్లో ఒక ఛేంజ్ కోసం చేసిన ప్రయాణం కూడా. నాతో పాటు వర్క్షాప్ కోసం వచ్చిన స్నేహితులున్నారు. లద్దాఖ్లో ఒక మారుమూల ప్రాంతం అది. విసిరేసినట్టుగా ఉన్నాయి అక్కడి ఇల్లు. ఒక చిన్న కాఫీ షాప్లో కూర్చుని, ఫ్రెండ్స్తో సరదాగా ఓ కథ చెబుతున్నాను. మమ్మల్నే గమనిస్తున్న ఓ యువకుడు మేము చెబుతున్న కథ వింటూ తనని తాను పరిచయం చేసుకున్నాడు. మేమూ అతని గురించి తెలుసుకున్నాం. గ్రాఫిక్ డిజైనర్ అయిన తన పేరు వరుణ్. పట్టణాన్ని వదిలి లద్దాఖ్లో కుండలు తయారు చేసే పనిని నేర్చుకుంటున్నాడని తెలిసి చాలా ఆసక్తిగా అనిపించింది. వరుణ్ ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ నుంచి ఎన్నో కుటుంబాలను కలిశాం. అలాగే, వరుణ్తో పాటు, వారి జీవన శైలిని ఒక కథగా తీసుకోవాలనిపించింది. అక్కడ నుంచి ప్రతీది ఒక ఆసక్తిగా మారిపోయింది. ఒక థీమ్ ప్లాన్ చేసి, వరుణ్తో మాట్లాడి డాక్యుమెంటరీ తీయడం ఆరంభించాను. దిస్ ఈజ్ మై హోమ్ వరుణ్ స్థానికులను కలిసి, ఒక్కో వ్యక్తిని కొన్ని ప్రశ్నలు అడగుతుండగా వారు ఇచ్చిన సమాధానాలను తీసుకున్నాను. ఒక వృద్ధుడిని కలిసి మాట్లాడినప్పుడు అతను తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ ఇల్లు చాలా చిన్నది. కానీ, వారి ముఖాల్లో కనిపించిన సంతోషాన్ని చూసి ‘పట్ణణాల్లో పెద్ద పెద్ద ఇళ్లలో ఉన్నా, ఈ సంతోషం ఎక్కడా కనిపించదు ఎందుకు?’ అని అడిగినప్పుడు... ‘గదులు ఉండటం ఇల్లు కాదు. అలా చూడండి, చుట్టూ కొండలు, చూసినంత మేర పచ్చదనం. ఇంత పెద్ద ఇల్లు ఉంటే ఎంత సంతోషంగా ఉంటుంది’ అన్నాడు. అతని మాటలు నాకు బాగా నచ్చాయి. ఒక కామిక్ స్ట్రిప్ కూడా నేను అంతకుముందే చూసి ఉన్నాను. అన్నీ కలిపి డాక్యుమెంటరీ ఫిల్మ్కి ‘దిస్ ఈజ్ మై హోమ్’ టైటిల్ సరైనదనుకున్నాను. ఈ మూవీ చూసిన కొందరు డైరెక్టర్లు ‘మేమూ ఆ గ్రామంలో ఉన్నట్టు, అక్కడ వాళ్లను కలుసుకున్నట్టుగా ఉంది’ అని చెప్పారు. చాలా ఆనందంగా అనిపించింది. చాలా శక్తిమంతులు మంచుకొండల్లో అతి చల్లటి వాతావరణం లద్దాఖ్. అలాంటి చోట మాతోపాటు టౌన్కి బయల్దేరాలనుకున్న ఒక బామ్మ తెల్లవారు ఝామున నాలుగ్గంటలకే లేచి, చల్లటి నీళ్లతో తలస్నానం చేసి, రెడీ అయిపోయారు. నాకు ఆమె శక్తిని చూసి చాలా అద్భుతం అనిపించింది. మిగతావారూ అలాగే ఉన్నారు. కొత్తగా జీవించాలి.. నా రైటింగ్ బ్యాక్ గ్రౌండ్, స్టోరీ టెల్లింగ్.. నా డాక్యుమెంటరీ వర్క్కి బాగా పనికొచ్చాయి. ఎడిటింగ్ వర్క్, వాయిస్ ఓవర్ పూర్తయ్యాక ముందు వరుణ్కి పంపించాను. వాళ్ల కుటుంబం మొత్తం ఆ డాక్యుమెంటరీ చూసి, చాలా సంతోషించారు. ఆ తర్వాత ఫిల్మ్ కాంపిటిషన్కు పంపించాను. టాప్టెన్లో నిలిచింది. అంతటితో నా పని పూర్తవ్వలేదు. మరిన్ని కొత్త పనులవైపు చూశాను. ఇటీవలే ఒక సర్టిఫికెట్ లైఫ్ కోచ్గా జాయిన్ అయ్యాను. కరోనా సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచి మానసిక శక్తిని అందించింది లద్దాఖ్లో తీసిన డాక్యుమెంటరీ ఫిల్మ్. అక్కడి స్థానికులతో సంభాషణ, ప్రయాణం ఏదీ అంత సులువు కాలేదు. ప్రతిది ఛాలెంజింగ్. అదే నాలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. అక్కడి మనుషులు, ప్రకృతి, నేర్చుకున్న కొత్త వర్క్ నుంచి.. మళ్లీ జీవించడం నేర్చుకున్నాను’’ అని వివరించారు ఈ స్టోరీ టెల్లర్ అండ్ డైరెక్టర్. దీపాకిరణ్ – నిర్మలారెడ్డి -
Satyajit Ray: నవ్యచిత్ర వైతాళికుడు
‘‘ఏమున్నది సార్ గీ సిన్మాల అంతా మా వూరు లెక్కనే వున్నది... మా బతుకులే వున్నయి...’’ సత్యజిత్ రే ‘పథేర్ పాంచాలి’ సినిమా చూసిన తర్వాత కరీంనగర్ జిల్లా ‘పోరండ్ల’ గ్రామ రైతు స్పందన ఇది. ఒక నిజాయతీ కలిగిన వాస్తవిక సినిమాకు ప్రపంచంలో ఎక్కడయినా ఇలాంటి స్పందనే వస్తుందన్నది నిజం. భారతీయ సినిమాకు కళాత్మకతనూ, మానవీయ స్పందనలనూ అందించిన దర్శకుడు రే. తన ముప్పై ఏళ్ల సినీ ప్రస్థానంలో ఆయన ‘పథేర్ పాంచాలి’ నుంచి ‘ఆగంతుక్’ వరకు ముప్పై పూర్తి నిడివి సినిమాలు, అనేక డాక్యుమెంటరీ సినిమాలు తీశారు. ఈ రోజుల్లో లాగా ఎలాంటి ఆధునిక ప్రసార మాధ్యమాలూ, సామాజిక మాధ్య మాలూ లేని ఆ కాలంలో రే కు ప్రపంచ ఖ్యాతి లభించింది. 1921లో మే 2న జన్మించిన సత్యజిత్ రే తన జీవితంలోని అత్యధిక సమయం సినీ రంగంలోనే గడిపినప్పటికీ ఆయన... రచయితగా, చిత్రకారుడిగా, టైపోగ్రాఫర్గా, బాల సాహిత్య సృష్టి కర్తగా, సైన్స్ ఫిక్షన్ రచయితగా తనదైన ముద్రతో సృజన రంగంలో పని చేశారు. సినిమా రంగంలో కూడా దర్శకత్వంతో పాటు సంగీతం, సినిమా టోగ్రఫీ, స్క్రిప్ట్, మాటల రచన తానే నిర్వహించారు. మొదట రవిశంకర్ లాంటి వాళ్ళతో సంగీతం చేయించుకున్నా తర్వాత తానే తన సినిమాలన్నింటికీ సంగీతం సమకూర్చుకున్నారు. ఇంకా సన్నివేశాలకు సంబంధించి సంపూర్ణ స్కెచెస్ వేసుకొని, చిత్రీకరణ జరిపేవారు. సాహిత్యానికీ సినిమాకూ వారధిలా నిలిచి భారతీయ సినిమాను పరిపుష్టం చేశారు. టాగూర్, బిభూతిభూషణ్ బంధోపాధ్యాయ్, తారాశంకర్ బంధోపాధ్యాయ్, ప్రేమ్ చంద్, నరేంద్రనాథ్ లాంటి మహా రచయితల రచనల్ని తెరపైకి ఎక్కించారు రే. అంతేకాదు, పలు సినిమాలకు తన స్వీయ రచనల్ని కూడా ఉపయోగించుకున్నారు. (చదవండి: ఆదర్శ కమ్యూనిస్టుకు జోహార్లు!) 1956లో ‘పథేర్ పాంచాలి’ కాన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘బెస్ట్ హ్యూమన్ డాక్యుమెంట్’ అవా ర్డును గెలుచుకొని భారతీయ సినిమాకు ప్రపంచ స్థాయి గుర్తింపును తెచ్చింది. తర్వాత ‘దేవి’, ‘కాంచన్ జంగా’, ‘చారులత’, ‘తీన్ కన్య’ ‘ఘరె బైరె’, ‘ఆగంతుక్’ లాంటి అనేక విశ్వ విఖ్యాత సిని మాల్ని రూపొందించారు. బహుశా ఆయన సినిమాల్ని ప్రదర్శించని అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు ప్రపంచంలో లేవు. ఆయన అందుకోని అవార్డులూ లేవు. కేంద్ర ప్రభుత్వం ‘భారత రత్న’, దాదా సాహెబ్ ఫాల్కే వంటి అత్యున్నత పురస్కారాలతో సత్కరించింది. ఫ్రాన్స్ దేశానికి చెందిన ‘లెజియన్ ఆఫ్ ఆనర్’, అలాగే ‘ఆస్కార్ జీవిత సాఫల్య పురస్కారం’ లాంటి లెక్కలేనన్ని అంతర్జాతీయ పురస్కారాలూ అందుకున్నారు. భారతీయ సినిమాకు నవ్యచిత్ర వైతాళికుడిగా నిలిచిన సత్యజిత్ రే 1992 ఏప్రిల్ 23న కలకత్తాలోని బెల్లెవీ నర్సింగ్ హోమ్లో తుదిశ్వాస విడిచారు. ఆయన చరిత్ర చిత్రసీమకు మణిహారం. (చదవండి: ‘జై హింద్’ నినాదకర్త మనోడే!) – వారాల ఆనంద్ (మే 2న సత్యజిత్ రే జయంతి) -
కోడి రామకృష్ణ: ‘దిగులుతో మాకు కనపడకుండా ఏడ్చే వారు’
ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్యతో దర్శకునిగా తొలి అడుగు వేశారు. తరంగిణిలో రైలు చేత పాట పాడించారు. అమ్మోరులో గ్రాఫిక్స్ను పరిచయం చేశారు. అరుంధతిలో జేజమ్మను ప్రతిష్ఠించారు.. మానవ సంబంధాలు, దైవభక్తి, ఆధునిక గ్రాఫిక్స్... అన్నిటినీ తెలుగు వెండి తెర మీద ప్రదర్శించిన కోడి రామకృష్ణ... ఇంటి దగ్గర ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా స్నేహంగా ఉండేవారంటున్నారు కోడి రామకృష్ణ పెద్ద కుమార్తె కోడి దివ్య.. కోడి నరసింహమూర్తి, చిట్టెమ్మ దంపతులకు పెద్ద కొడుకుగా నాన్న పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో పుట్టారు. నాన్నకు ఇద్దరు తమ్ముళ్లు, ఒక చెల్లెలు. పాలకొల్లు కాలేజీలో బికామ్ డిగ్రీ చదువుకునే రోజుల్లోనే నాటకాలు వేసేవారు. జై ఆంధ్ర ఉద్యమం సమయంలో స్పీచ్లు రాసి ఇచ్చేవారట, పెయింటింగ్స్, మంచి మంచి స్కెచ్లు కూడా వేసేవారట. నాటకాలు వేయటానికి కావలసిన డబ్బుల కోసం ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా బయటి వాళ్లకు పెయింటింగ్స్ వేసిన సందర్భాలున్నాయని నాన్న చెబుతుండేవారు. పెద్దలు అంగీకరించిన ప్రేమ వివాహం అమ్మ వాళ్లది తెనాలి. తాత (ఎ. సుభాష్) గారు సినిమాలు నిర్మించాలనే ఆసక్తితో మద్రాసు వచ్చి, ‘భారత్ బంద్’ చిత్రం నిర్మించారు. అమ్మ పేరు పద్మ. నాన్నగారి ‘రంగుల పులి’ చిత్రంలో ఇష్టం లేకుండానే అమ్మ నటించింది. నాన్నగారు అమ్మను ఇష్టపడ్డారు. ఇద్దరూ వివాహం చేసుకుందామనుకు న్నారు. సన్నిహితులతా కలిసి అమ్మవాళ్ల నాన్నను ఒప్పించారు. నానమ్మకు ఇచ్చిన మాట ప్రకారం, చెల్లెలికి, తమ్ముళ్లకి వివాహం చేసిన తరవాతే 1983లో అమ్మను వివాహం చేసుకున్నారు. తాతగారు పోయాక నాన్నే ఇంటి బాధ్యత తీసుకు న్నారు. నాన్నకు మేం ఇద్దరు ఆడపిల్లలం. చెల్లి పేరు ప్రవల్లిక. నేను బిబిఏ, చెల్లి ఎంబిఏ చేశాం. నేను యానిమేషన్ కూడా చేశాను. నన్ను ‘దీపమ్మా’ అని, చెల్లిని ‘చిన్నీ’ అని పిలిచేవారు. ఇద్దరూ ఆడపిల్లలేనా అని ఎవరైనా అంటే నాన్నకు నచ్చేది కాదు. స్నేహితునిలా ఉండేవారు.. సినిమాలలో పూర్తిగా బిజీగా ఉండటంతో, ఏ మాత్రం అవకాశం వచ్చినా నాన్న మమ్మల్ని బయటకు తీసుకువెళ్లేవారు. ఒక్కోసారి షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చాక, మమ్మల్ని కార్లో బీచ్కి తీసుకువెళ్లి, ఐస్క్రీమ్ కొనిపెట్టేవారు. ఉదయాన్నే షూటింగ్కి వెళ్లిపోయేవారు. ఎక్కడ ఉన్నా ఫోన్ చేసేవారు. చాలా స్నేహంగా ఉండేవారు. ఒక్క రోజు కూడా కోప్పడలేదు. నేను నాన్న దగ్గర అసిస్టెంట్గా ఉండాలి అని నాన్నతో అన్నప్పుడు, అమ్మ నా పెళ్లి చేసేయమంది. అప్పుడు కూడా నాకు నచ్చినట్లే చేయమన్నారు. ‘తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు’ అని సలహా ఇచ్చేవారు. నాన్నకు ఏదీ షో చేయటం నచ్చదు. అలా ప్రదర్శించటం కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయొద్దు అనేవారు. ఎవరో ఏదో అనుకుంటారనే ఆలోచనే ఉండేది కాదు. అమ్మ తన బంధువులకు ఎంతో సహాయం చేస్తుంటే, ఎన్నడూ అమ్మను ప్రశ్నించలేదు. కథ ఎలా ఉంది అని అడిగేవారు.. వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకునేవారు. ఔట్డోర్ షూటింగ్స్కి ఇతర దేశాలకు మమ్మల్ని కూడా తీసుకువెళ్లేవారు. మేం సినిమా చూసి వచ్చాక మమ్మల్ని కథ ఎలా ఉందో చెప్పమనేవారు. ఇల్లు, షూటింగ్ అంతే. పుట్టినరోజుకి మాత్రమే పార్టీ చేసేవారు. ఇంటి భోజనమే ఇష్టపడేవారు. అది కూడా చాలా మితంగా తినేవారు. దాసరిగారితో అనుబంధం... నానమ్మ వాళ్లు నాన్న సినిమాలలోకి వెళ్తానంటే అభ్యంతరం చెప్పలేదు. మద్రాసులో దాసరి గారిని కలిస్తే, ఆయన డిగ్రీ పూర్తి చేసి రమ్మన్నారు. ఆ ప్రకారమే డిగ్రీ పూర్తి చేశాక, దాసరిగారు ఇచ్చిన టెలిగ్రామ్ చూసుకుని మద్రాసు వెళ్లారు. అలా నాన్న సినీ రంగ ప్రవేశం జరిగింది. దాసరిగారు కన్ను మూయటానికి నెల రోజుల ముందు నాన్నకు ఏమనిపించిందో కానీ, రోజూ ఆయన ఇంటికి వెళ్లేవారు. ఆయన పోయినప్పుడు తట్టుకోలేక పోయారు. ఎంత బాధలో ఉన్నా పని మాత్రం మానేసేవారు కాదు. నేను వచ్చేశాను... నా పెళ్లి కుదిరిన తరవాత, నేను అత్తవారింటికి వెళ్లిపోతానన్న దిగులుతో మాకు కనపడకుండా ఏడ్చే వారు. నాన్నను ఓదార్చవలసి వచ్చింది. మా పెళ్లయ్యాక కొంచెం ఆలస్యంగా పుట్టింది పాప. ‘ఆలస్యం చేసుకుంటున్నారెందుకు’ అని అమ్మ అంటున్నా కూడా నాన్న అననిచ్చేవారు కాదు. నాన్నకు బాగోలేదని తెలియగానే బెంగళూరు నుంచి హైదరాబాద్కి వచ్చేశాం. నా డెలివరీ ముందు రోజు నేను వినాలని హనుమాన్ చాలీసా చదివారు. మరుసటి రోజు నాకు డెలివరీ అయ్యేవరకు మంచి నీళ్లు మాత్రమే తాగారట. పసిపాపను చూస్తూనే, మా అమ్మ నరసమ్మ మళ్లీ పుట్టింది అని పాపాయిని ‘చిట్టి నరసమ్మా!’ అని పిలిచారు. భక్తి ఎక్కువ.. నాన్నకు దేవుడి మీద విపరీతమైన భక్తి. దేవుడికి నాన్నకు మధ్య ఎవరు ఏం చెప్పినా వినరు. ఆరు గంటలకు షూటింగ్ అంటే మూడు గంటలకల్లా నిద్ర లేచి, పూజ చేసుకుని పావు గంట ముందే స్పాట్లో ఉండేవారు. ఆసుపత్రిలో ఉండి కూడా, స్నానం చేయించుకుని, పూజ చేసుకున్నాకే టిఫిన్ తినేవారు. వినాయక చవితి రోజున కథ చదువుతుండగా దగ్గు వస్తే, మళ్లీ మొదటి నుంచి చదివేవారు. పూజ అయ్యాక మాతోనే బ్రేక్ఫాస్ట్ చేసేవారు. దీపావళి రోజున అందరికీ శుభాకాంక్షలు చెప్పి, నా చేత 100 రూపాయలు ఇప్పించేవారు. ఎక్కడకు వెళ్తున్నా నన్ను ఎదురు రమ్మనేవారు. నా పెళ్లయ్యాక నాతో మాట్లాడటం కోసం మొబైల్ కొన్నారు. అప్పుడు కూడా నిర్మాత గురించే... వేళకు ఆహారం తీసుకోకపోవటం వల్ల నాన్న ఆరోగ్యం దెబ్బ తింది. 2012లో ఒక సినిమా ప్రారంభోత్సవం రోజే నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది. ఆపరేషన్ పూర్తయ్యి, స్పృహలోకి వచ్చిన వెంటనే, ‘నిర్మాత ఎలా ఉన్నారు’ అని అడిగారు. మాకు వింతగా అనిపించింది. 104 డిగ్రీల జ్వరంతో కూడా షూటింగ్ చేశారు. నాన్న అంత్యక్రియలు స్వయంగా నేనే చేశాను. కంటిన్యూ చేస్తున్నాను.. కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సినిమా నిర్మాణం చేస్తున్నాను. ‘కోడి పిల్లలు’ అని వాట్సాప్ గ్రూప్ పెట్టాను. ఆ గ్రూపులో మేం నలుగురం, నాన్న దగ్గర అసిస్టెంట్స్గా పనిచేసినవారు, నాన్న అభిమానులు ఉన్నారు. -
ఆయన మాటలకు ఆకర్షితురాలైంది.. రూ.50తో పెళ్లి జరిగిపోయింది
రక్త సంబంధం, వీరాభిమన్యు, ఆరాధన, లక్ష్మీ నివాసం, విక్రమ్.. అన్నీ విజయకేతనం ఎగురవేసిన రజతోత్సవ చిత్రాలే... వీరమాచినేని ఇంటి పేరును విక్టరీగా మార్చిన చిత్రాలు.. ప్రజా నాట్య మండలి భావాలతో కమ్యూనిస్టు వివాహం చేసుకున్నారు... జీవితం మీద ఆశతో జీవించిన తండ్రి వీరమాచినేని (విక్టరీ) మధుసూదనరావు గురించి రెండో కుమార్తె వాణి చెబుతున్న విషయాలు... నాన్న కృష్ణాజిల్లా ఈడ్పుగల్లులో పుట్టారు. నాన్న వాళ్లు ఇద్దరు అన్నదమ్ములు, ఒక చెల్లి. నాన్న ఎనిమిదో ఏటే తల్లిని పోగొట్టుకోవటంతో, మూడు సంవత్సరాల వయసున్న చెల్లిని ఎంతో బాధ్యతగా పెంచారు. నాన్నకు మేం ఇద్దరం ఆడపిల్లలం. అక్క వీణ, నేను వాణి. నా ఎనిమిదో యేట అమ్మ నాన్నలతో మేం చెన్నై వచ్చాం. ప్రకాశ్ స్టూడియోలో చిన్న జీతానికి చేరారు. నాన్నకి ఆర్థికంగా సహాయపడటం కోసం అమ్మ డబ్బింగ్ చెప్పేది. అక్క నేను కేసరి హైస్కూల్లో చదువు పూర్తయ్యాక, అక్క బి.ఎస్.సి, నేను ఎం.ఎస్.సి. చదివాం. నాన్న ప్రారంభించిన మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చూస్తున్నాను. చాలా కష్టజీవి నాన్న సోడా బండి తోసి, పొలంలో నాట్లు వేసి, కూలి పని చేసి డబ్బులు సంపాదిస్తూ వారలబ్బాయిగా చదువుకుంటూ, ఇంటర్మీడియెట్ స్టేట్ ఫస్ట్లో ప్యాసయ్యారు. నటన మీద శ్రద్ధతో సినీ పరిశ్రమలో ప్రవేశించారు. ఎనిమిదేళ్లు ప్రకాశ్ స్టూడియోలో కె. ఎస్. ప్రకాశరావు గారి దగ్గర అసిస్టెంట్గా చేశాక దర్శకులయ్యారు. తన సినిమాలకు దగ్గరుండి మరీ ఆత్రేయతో పాటలు రాయించుకున్నారు. ముందుగానే మ్యూజిక్ సిద్ధం చేసుకునేవారు. రికార్డయిన పాటలను ఇంట్లో వినిపించేవారు. అందరం పాడుకునేవాళ్లం. నాన్నకు ‘ప్రొడ్యూసర్స్ మ్యాన్’ అనీ, కోపిష్ఠి అనీ పరిశ్రమలో పేరుంది. సినిమా పూర్తయ్యే వరకు క్రమశిక్షణతో, యజ్ఞం చేస్తున్నట్లు మౌనంగా మునిలా ఉండేవారు. అప్పుడప్పుడు నాన్నతో షూటింగ్లకి వెళ్లేవాళ్లం. ఒక హిందీ సినిమా షూటింగ్కి వెళ్తూ, నన్ను కాశ్మీర్ తీసుకువెళ్లారు. సినీ నటి జి. వరలక్ష్మిగారికి నాన్న కమిట్మెంట్ నచ్చింది. నాన్నను ఆప్యాయం గా‘మధు’ అని పిలిచేవారు. నాన్న ఆవిడను ‘అమ్మ’ అనేవారు. ‘ఎ డైరెక్టర్ ఈజ్ జస్ట్ లైక్ ఎ గుడ్ రిక్రియేటర్ హిమ్సెల్ఫ్’ అన్నారు నాన్న గురించి ప్రముఖ బాలీవుడ్ నటుడు రాజ్కపూర్. సొంత ఆస్తి వద్దనుకున్నారు.. నాన్న సినిమాలలో బాగా బిజీ అయ్యాక ఉదయాన్నే ఏడు గంటలకు షూటింగ్ ఉంటే, ఐదు గంటలకే రెడీ అయిపోయేవారు. నాన్నతో ఎక్కువ సమయం గడపలేకపోయాం. అమ్మ పంపే క్యారేజీ సెట్లో అందరితో కలిసి తినేవారు. మేం పెద్దవాళ్లం అయ్యాక మమ్మల్ని చూడాలనిపిస్తే ‘వాణిని పేపర్ తెమ్మను’ అనేవారు. అలా మమ్మల్ని చూసేవారు. పర్సనల్ ప్రోపర్టీ వద్దనుకున్నారు. కాని నాన్న సన్నిహితులు నాన్న చేత పొదుపు చేయించి, స్థలం కొనిపించారు. ఎకరం స్థలంలో దగ్గరుండి స్టూడియో కట్టించారు. నాన్న మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించి, చాట్ల శ్రీరాములుగారిని ప్రిన్సిపాల్గా నియమించి ఆయనకు బ్లాంక్ చెక్ ఇచ్చారు. ఆయనంటే నాన్నకు అంత గౌరవం. ప్రజాసేవ అంటే ఇష్టం... ఒకసారి నాకు అనారోగ్యంగా ఉండటంతో ఆసుపత్రిలో చేర్పించారు. అప్పుడు రాయలసీమ కరవు ప్రాంతాల వారికి సహాయం చేయటం కోసం సినిమా వారంతా జోలె పట్టారు. అందరితో పాటు అమ్మనాన్నలు బయలుదేరారు. ‘చంటిపిల్లకు అనారోగ్యంగా ఉంది కదా’ అని బంధువులంటే, ‘నా బిడ్డల్ని దేవుడు చూస్తాడు. అక్కడ వందల మంది ఆకలి బాధతో మరణిస్తున్నారు’ అన్నారట అమ్మ నాన్నలు. సమాజం పట్ల అంత బాధ్యతగా ఉండేవారు. నాకు చిన్నప్పుడు నాలుగు సంవత్సరాల వయసులో లివర్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు నన్ను ఎత్తుకుని డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లారు. అవసరాన్ని బట్టి ఎప్పుడు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలనేది నాన్న ఆలోచించేవారు. నేను సర్జరీ చేయించుకున్నప్పుడు నాన్న ఇంట్లోనే ఉండి, కంటికి రెప్పలా చూసుకున్నారు. నాన్నకు ఆడపిల్లలంటే సాఫ్ట్ కార్నర్. నాన్న ఇష్టాలు... నాన్నకి తెల్ల బట్టలంటే ఇష్టం. మల్లెపూలంటే మక్కువ. మల్లెపూల దండ చేతికి కట్టుకుని, ఆ సువాసనను ఆస్వాదిస్తూ, భోజనం చేసేవారు. శాకాహారమంటేనే ఇష్టం. రోటి పచ్చళ్లు బాగా తినేవారు. రోజూ పెరుగన్నంలో ఉసిరికాయ బద్దలు, మామిడికాయ బద్దలు ఉండవలసిందే. నాన్న కోసం జలాలు రకం మామిడికాయలతో ఆవకాయ పెట్టేది అమ్మ. చిన్న వంటకాన్ని సైతం బాగా ఆస్వాదించే వారు. జుట్టుకు రంగు వేయటం ఇష్టం లేదు. నాన్న ప్రారంభించిన మధు మూవీస్ బ్యానర్లో నన్ను పెళ్లికూతురు గెటప్లో మధుకలశం పట్టుకుని ఉన్న పొజిషన్లో చూపించారు నాన్న. నాన్న ఆశావాది నాన్నకి తీవ్రంగా అనారోగ్యం చేసినా, బతకాలనే కోరికే ఆయనను బతికించింది. పదకొండు సంవత్సరాలు ఆయనను కంటిపాపలా చూసుకున్నాను. ‘‘ఇప్పుడు నువ్వు నన్ను నీ కొడుకులా చూసుకుంటున్నావు. నాకు ఇంకా పదమూడేళ్లు జీవితం ఉంది’’ అన్నారు. కాని 2012లో తన 89వ ఏట కన్నుమూశారు. 2023లో నాన్నగారి శతజయంతి చేయాలనుకుంటున్నాం.పద్నాలుగేళ్ల్ల వయసులోనే, తాతతో కలిసి అమ్మ మీటింగ్స్కి వెళ్లేది. నాన్న 1940లో కమ్యూనిస్టు పార్టీ ప్రెసిడెంట్గా స్పీచ్ ఇస్తుంటే, ఆయన మాటలు విని ఆకర్షితురాలై, ఎలాగైనా నాన్ననే వివాహం చేసుకోవాలనుకుంది. స్కూల్ మాస్టర్గా పనిచేస్తున్న మా తాతయ్యతో అమ్మ, ‘ఉరై సుబ్బన్నా, నన్ను మధుసూదన్కి ఇచ్చి చేయకపోతే కుదరదు’ అందట. అలా యాభై రూపాయల ఖర్చుతో అమ్మనాన్నలకు కమ్యూనిస్టు పెళ్లి జరిగిపోయింది. అమ్మ ఆ రోజుల్లో ప్రజానాట్య మండలిలో బుర్రకథలు చెప్పేదట. సంభాషణ: వైజయంతి పురాణపండ -
పరువు హత్య: దర్శకుడిని దారుణంగా చంపిన తల్లిదండ్రులు
వెబ్డెస్క్: ఇరాన్కు చెందిన దర్శకుడు బాబక్ ఖోర్రామ్డిన్ దారుణ హత్యకు గురయ్యాడు. దేశంలో సంచలన సృష్టించిన ఈ పరువు హత్య కేసుకు సంబంధించి తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఖోర్రామ్డిన్ను అతడి తల్లిదండ్రులే దారుణంగా హత్య చేసినట్లు తెలిసింది. నిందితులు కేవలం ఖోర్రామ్డిన్ని మాత్రమే కాక వారి కుమార్తె, అల్లుడిని కూడా ఏళ్ల క్రితమే ఇంతే దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడించారు. బిడ్డలను చంపినందుకు తాము ఏ మాత్రం బాధపడటం లేదనడం గమనార్హం. ఆ వివరాలు.. ఖోర్రామ్డిన్ దారుణ హత్య ఇరాన్లో సంచలనం సృష్టించింది. దర్శకుడి పొరుగింటి వారు తమ నివాసం ఎదురుగా ఉన్న చెత్తకుప్పలో కొన్ని మానవ శరీర భాగాలున్నాయని పోలీసులకు తెలపడంతో దర్శకుడి హత్య వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి చూడగా రెండు తెగిపడిన చేతులు కనిపించాయి. ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా అవి దర్శకుడు ఖోర్రామ్డిన్విగా గర్తించారు. ఇక దర్శకుడి హత్య గురించి తెలిసిన నాటి నుంచి అందరూ అతడి తల్లిదండ్రుల మీదనే అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు ఖోర్రామ్డిన్ తల్లిదండ్రులు ఇరాన్ ఖోర్రామ్దిన్( 74), అక్బర్ ఖోర్రామ్దిన్(81)లను అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో వారు సంచలన విషయాలు వెల్లడించారు. తమ కొడుకుని తామే హత్య చేశామని తెలిపారు. చైర్కు కట్టేసి.. తలకు ప్లాస్టిక్ కవర్ చుట్టి.. ఊపిరాడకుండ చేసి చంపేశామని.. ఆ తర్వాత అతడిని ముక్కలుముక్కలుగా నరికి రెండు సూట్కేసులలో పెట్టి.. డస్ట్బిన్లో పడేశామని వెల్లడించారు. తలకు ప్లాస్టిక్ కవర్ చుట్టి.. ఖోర్రామ్డిన్ తండ్రి మాట్లాడుతూ.. ‘‘గత శుక్రవారం రాత్రి నా భార్య చికెన్ వండింది. దానిలో విషం కలిపాము. కానీ నా కుమారుడు భోజనం చేయలేదు. తన గదిలోకి వెళ్లి పడుకున్నాడు. దాంతో చికెన్ ఫ్రిజ్లో పెట్టాం. మరుసటి రోజు తింటాడని భావించాం. కానీ అలా జరగలేదు. దాంతో మరుసటి రోజు నా కుమారుడు బయటకు వెళ్లి వచ్చే వరకు ఆగాం. సాయంత్ర ఐదు గంటల సమయంలో ఇంటికి వచ్చిన నా కుమారుడిని చైర్కు కట్టేసి.. తన తలకు ప్లాస్టిక్ ప్లాస్టిక్ కవర్ చుట్టి ఊపిరాడకుండా చేశాం. ఆ తర్వాత కత్తితో తనని పొడిచి చంపేశాం. ఆ తర్వాత తనను ముక్కలుగా నరికి రెండు సూట్కేస్లలో శరీర భాగాలను సర్ది.. బయట పడేశాం’’ అని తెలిపారు. విద్యార్థులతో సంబంధం పెట్టుకున్నాడు.. తమ కుమారుడు తన కోచింగ్ సెంటర్లోని విద్యార్థులతో సంబంధం పెట్టుకున్నాడని.. దాని వల్ల సమాజంలో తమ పరువు పోతుందనే ఉద్దేశంతోనే అతడిని హత్య చేశామని తెలిపారు. అంతేకాక కొన్నేళ్ల క్రితం తమ కుమార్తె, ఆమె భర్తను కూడా ఇలానే హత్య చేశామని వెల్లడించారు. కుమార్తె డ్రగ్స్కు అలవాటు పడిందని.. అల్లుడు తమను తిడుతూ.. శాపనార్థాలు పెట్టేవాడని.. అందుకే వారిద్దరిని అంతం చేశానని వెల్లడించారు. ఇక మేం చేసిన పనికి మాకేం బాధ కలగడం లేదు. నా బిడ్డలు తప్పుడు మార్గంలో పయణిస్తున్నారు. వారి వల్ల మా పరువు పోతుంది. అందుకే నా భార్య సాయంతో వాళ్లని చంపేశాం అన్నాడు. ఈ కేసు దేశంలో సంచలనం సృష్టిస్తోంది. మరణించిన ఖోర్రామ్డిన్ ‘క్రెవిస్’, ‘ఓత్ టు యషర్’ వంటి లఘు చిత్రాలతో సహా పలు ప్రాజెక్టులు తెరకెక్కించాడు. అతను 2009 లో టెహ్రాన్ విశ్వవిద్యాలయంలో సినిమా విభాగంలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశాడు. విద్యార్థులకు బోధించడానికి 2010లో ఇరాన్కు మారాడు. చదవండి: ఇరాన్ను కుదిపేస్తున్న పరువు హత్య -
సినిమా తీస్తానని రూ.7 కోట్లు మోసం.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్!
ప్రముఖ మలయాళీ దర్శకుడు, యాడ్ ఫిలిమ్ మేకర్ వీఏ శ్రీకుమార్ మీనన్ను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. సినిమా చేస్తానని చెప్పి తన వద్ద నుంచి రూ.7 కోట్లు తీసుకుని మోసం చేశాడంటూ శ్రీవాసలం బిజినెస్ గ్రూప్కి చెందిన రాజేంద్రన్ పిళ్లై ఫిర్యాదు చేయడంతో పోలీసులు శ్రీకుమార్ని అరెస్ట్ చేసి గురువారం కోర్డులో హాజరుపరిచారు. అతనిపై సెక్షన్ 406, సెక్షన్ 420ల కింద యాక్షన్ తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. అయితే అంతకు ముందే శ్రీకుమార్ యాంటిసిపేటరీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. దాన్ని కోర్టు తిరస్కరించింది. శ్రీకుమార్ అరెస్ట్ కావడం ఇది మొదటిసారి కాదు. ప్రముఖ నటి మంజు వారియర్ను బెదిరించి, పరువునష్టం కలిగించారన్న ఆరోపణలపై 2019లో శ్రీకుమార్ మీనన్ అరెస్ట్ అయ్యారు. తర్వాత బెయిల్పై విడుదలయ్యారు మంజు వారియర్.. శ్రీకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఓడియన్లో హీరోయిన్గా చేసింది. అంతేకాదు.. అతనితో కలిసి పలు యాడ్లలో కూడా ఆమె నటించింది. -
‘శంకరాభరణం’కు వచ్చిన జాతీయ అవార్డులు ఎన్ని?
తెలుగు సినిమా అందించిన అత్యత్తమ దర్శకుల్లో కళాతపస్వి కె. విశ్వనాథ్ ఒకరు. ఎన్నో గొప్ప సినిమాలను, గొప్ప పాటలను, గొప్ప నిపుణులను తన సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు అందించారాయన. నేడు (ఫిబ్రవరి 19) విశ్వనాథ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన సినీ జర్నీపై స్పెషల్ క్విజ్. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1641344978.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1651344978.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ప్రముఖ సినీ దర్శకుడు కన్నుమూత
బెంగళూరు : ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు దినేష్ గాంధీ కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యం కారణంగా బెంగుళూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన దినేష్ శనివారం ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన దాదాపు పది సంవత్సరాలకు పైగా కన్నడ చిత్ర పరిశ్రమకు తన సేవలు అందించారు. దినేష్ వయస్సు 52 సంవత్సరాలు. ఈ రోజు బెంగుళూరులోని తన నివాసంలోనే కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో దినేష్ అంత్యక్రియలు జరగనున్నాయి. దినేష్ అకాల మరణం కన్న సినీ ఇండస్ట్రీని షాక్కు గురిచేసింది. దర్శకుడి మరణం పట్ల అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చదవండి: మీటూ ఉద్యమానికి మహిళలే బాధ్యులు కాగా సుదీప్ కిచ్చా నటించిన ‘వీర మదకారి’ సినిమా దినేష్కు మంది పేరు తెచ్చిపెట్టింది. 2009లో విడుదలైన ఈ సినిమా విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా 2012లో తెలుగులోనూ రౌడీ ఇన్స్పెక్టర్గా విడుదలైంది. అలాగే సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటించిన చత్రపతి అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే కొన్ని నెలల క్రితం దినేష్ గాంధీ తన కొడుకుతో కలిసి ఓ సినిమా చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. కానీ కోవిడ్ 19 కారణంగా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం ఆలస్యం అయింది. ఈ చిత్రాన్ని సింహాద్రి ప్రొడక్షన్స్ పతాకపై రమేష్ కైషాప్ నిర్మించాల్సి ఉంది. చదవండి: ‘అసహ్యం.. అందుకే నామినేట్ చేశాను’ -
దర్శక నిర్మాత విజయరెడ్డి ఇక లేరు
ప్రఖ్యాత సినీ దర్శక, నిర్మాత బి. విజయరెడ్డి (84) శుక్రవారం సాయంత్రం చెన్నైలో కన్నుమూశారు. చెన్నై, కేకే నగర్లో కుటుంబసభ్యులతో కలిసి నివసిస్తున్న ఆయన అనారోగ్యం కారణంగా ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అయితే కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఆయన తుదిశ్వాస విడిచారు. చెన్నై, కన్నమ్మాపేటలోని శ్మశానవాటికలో శనివారం అంత్యక్రియలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పుట్టి పెరిగిన విజయరెడ్డి 1955లో నటనపై ఆసక్తితో అప్పటి మద్రాస్కు చేరుకున్నారు. దర్శకుడు విఠలాచార్య దృష్టిలో పడ్డారు. విఠలాచార్య దర్శకత్వం వహించిన ‘మన తుంబిడ హెన్ను అరే’ చిత్రానికి సహాయ ఎడిటర్గా పనిచేశారు. ఆ తర్వాత పలు చిత్రాలకు పని చేసిన విజయరెడ్డి సినిమా రంగంలోని పలు శాఖల గురించి తెలుసుకోవడంతో పాటు ఆ తర్వాత సహాయ దర్శకుడిగా చేశారు. 1970లో ‘రంగా మహల్ రహస్య’ అనే కన్నడ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. కన్నడ కంఠీరవ రాజ్కుమార్, విష్ణువర్థ¯Œ వంటి ప్రముఖ నటులతో ఈయన అత్యధిక చిత్రాలను తెరకెక్కించారు. ముఖ్యంగా రాజ్కుమార్ కథానాయకుడిగా ‘మయురా, హుళ్లి హాళినా మేవు’ వంటి చారిత్రక కథా చిత్రాలతో పాటు ‘శ్రీనివాసకల్యాణం, భక్త ప్రహ్లాద’ వంటి పౌరాణిక చిత్రాలను తెరకెక్కించిన ఘనత విజయరెడ్డిది. ఆయన కన్నడలోనే 40 చిత్రాలకుపైగా దర్శకత్వం వహించారు. అమితాబ్ బచ్చన్, రాజేష్ ఖన్నా, అనిల్కపూర్, జితేంద్ర, రజనీకాంత్ వంటి స్టార్ హీరోలతో చిత్రాలను చేశారు. తెలుగులో ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘శ్రీమతి’. ఆ తర్వాత ‘ఏకలవ్య, మా ఇంటి వెలుగు, చలాకీ రాణి కిలాడీ రాజా, మావూరి మొనగాళ్లు’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. విజయరెడ్డికి భార్య దమయంతి, కుమారులు త్రినాథ్ రెడ్డి, నాగిరెడ్డి, కుమార్తెలు నాగలక్ష్మి, శ్యామల రుషి ఉన్నారు. విజయరెడ్డి మృతికి దక్షిణ భారత వాణిజ్య మండలి అధ్యక్షులు కాట్రగడ్డ ప్రసాద్ తదితర చిత్రరంగ ప్రముఖులు సంతాపాన్ని తెలిపారు. -
అలసట తెలీని వలస హీరోలు
ఆశ ఉసిగొల్పుతుంది.. కష్టంలో తనవాళ్లను చేరాలని! ఆ ఆశ అంతే వేగంగా వందల కిలోమీటర్ల గమ్యాన్ని నడిచేలా చేస్తుందా? ఎండ, చీకటి, ఆకలి, దప్పిక.. ఎన్ని అవాంతరాలు? అయినా ముందుకే పరిగెత్తిస్తోంది సొంత ఊరు ఆపేక్ష! ఆ సాహసాన్ని చూడాలనుకున్నాడు వినోద్ కాప్రి.. హిందీ సినిమా డైరెక్టర్, రైటర్, జర్నలిస్ట్ కూడా! కిందటి నెల.. ఏప్రిల్13న ట్విటర్లో ఒక పోస్ట్ చూశాడు వినోద్ కాప్రి. ఘజియాబాద్లోని లోనీలో 30, 40 మంది వలస కార్మికులు తిండి లేక, డబ్బుల్లేక ఇబ్బంది పడ్తున్నారు అని. వెంటనే తన స్నేహితులను కలిసి కొంత డబ్బు సేకరించి వాళ్లకు ఇచ్చాడు. మూణ్ణాలుగు రోజుల తర్వాత ఆ కార్మికుల దగ్గర్నుంచి ఫోన్ ‘మీరు ఇచ్చిన డబ్బులతో కొన్న సరుకులు అయిపోయాయి’ అని మొహమాటం ధ్వనిస్తూ. మరేం పర్లేదు అని భరోసానిస్తూ మళ్లీ సరకులు కొనిచ్చాడు వినోద్. వారం రోజులకు మళ్లీ ఫోన్. ‘మాటిమాటికీ మిమ్మల్ని అడగడం ఇబ్బందిగా ఉంది. అందుకే మా ఊరు సహార్సా వెళ్లడానికి మార్గం ఉంటే చెప్పండి’ అంటూ వేడుకోలు. ‘అయ్యో అంత పని చేయొద్దు. బస్సులు, రైళ్లు ఏం లేవు. ఆ ప్రయత్నం మానుకోండి. ప్రమాదం. మాకు తోచిన సహాయం చేస్తాం’ అని మాటిచ్చాడు. మాట ప్రకారం కొంత డబ్బు సేకరించి వాళ్లకు ఫోన్ చేశాడు వినోద్. అప్పటికే ఆ సమూహంలో ఏడుగురు ఇంటిబాట పట్టేశారు. మిగిలిన వాళ్లూ సిద్ధం అయ్యారు ‘ఇక్కడుంటే కన్నా దార్లో ప్రాణాలు పోయినా సరే’ అని అనుకుని. ఇరుగు పొరుగు దగ్గర సైకిళ్లు అడిగి తీసుకున్నారు ఇంటికి వెళ్లాక డబ్బు పంపిస్తామని బతిమాలుకొని. వాళ్ల సొంతూరు సహార్సా ఉన్నది బీహార్ రాష్ట్రంలో. ఘజియాబాద్ నుంచి 12 వందల కిలోమీటర్లు. ఆ దూరాన్ని తలచుకొని ఆందోళనపడ్డాడు వినోద్. వెంటనే తన టీమ్తో కలిసి కార్లో బయలుదేరాడు వాళ్లను అనుసరించడానికి. ఆ ప్రయాణం గురించి అతని మాటల్లోనే.. గంగను దాటే ప్రయత్నం చేసి... ‘మర్నాడు పొద్దున వాళ్లు మాకు సంభాల్ దగ్గర కనిపించారు పోలీసుల చేతుల్లో దెబ్బలు తింటూ. వచ్చిన దారినే వెనక్కి వెళ్లిపొండి అంటూ వాళ్లకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. వెనక్కి మళ్లకపోగా అక్కడినుంచి తమ ఊరికి అడ్డదార్లేమున్నాయా అని ఆలోచించండం మొదలుపెట్టారు. వాళ్లలో ఒకతను గూగుల్ ఎర్త్ యాప్లో కాలిబాట వెదకసాగాడు. అదేరోజు రాత్రి సైకిళ్లను తల మీద పెట్టుకొని గంగానది ఈదే దుస్సాహసమూ చేశారు. అది చూసి అక్కడున్న జాలరులతో సహా అందరం కలిసి వాళ్లను ఆపాం. సైకిల్ చైన్.. శనగపిండి గట్క సైకిళ్లతో వాళ్లు చాలా ఇబ్బంది పడ్డారు. అయిదారు కిలోమీటర్లు తొక్కగానే చైన్ పడిపోవడం, టైర్ పంక్చరవడం.. సైకిల్ రిపేర్ షాప్ కనపడే వరకు నడవడం వాటిని తోలుకుంటూ! శనగపిండి, బార్లీపిండితో కలిపి చేసిన గట్కా తెచ్చుకున్నారు. 24 గంటలుంది అంతే. రెండోరోజుకల్లా ఖాళీ కడుపు. దార్లో అక్కడక్కడా కనిపించిన చిన్న షాపుల్లో బ్రెడ్, బటర్, జామ్తోపాటు పళ్ల బండ్లు కనపడితే అరటిపళ్లు లాంటివి కొనిచ్చాం. దార్లో ఎక్కడా స్నానాలు చేయలేదు వాళ్లు. పోలీసుల కంట పడతామోనన్న భయంతో. రాత్రిళ్లు అయితే దోమలు, పురుగుపుట్రతో నరకాన్నే చూశారు. ట్రక్.. వేగం.. లక్నో చేరేటప్పటికి వాళ్లలో శక్తి సన్నగిల్లింది. నీరసపడిపోయారు. ఓ ట్రక్కు ఆపి, డ్రైవర్కు విషయం చెప్పాం. సైకిళ్లతో సహా అందరినీ ఎక్కించుకొని 30 కిలోమీటర్లు లిఫ్ట్ ఇచ్చాడు. తర్వాత మళ్లీ సైకిల్ ప్రయాణం. అదృష్టం బాగుండి మరో ట్రక్ డ్రైవర్ గోరఖ్పూర్ వరకు అంటే వంద కిలోమీటర్లు లిఫ్ట్ ఇచ్చాడు. ఈ సహాయం వాళ్ల బడలికను దూరం చేసింది.. మిగతా జర్నీని ఈజీ చేసింది. ఇన్ని ఇబ్బందులతో మొత్తానికి బీహార్ బార్డర్లోకి ఎంటర్ అయ్యారు. అక్కడి నుంచి సహార్సా ఇంకా 350 కిలోమీటర్లు. ఆ చెక్ పోస్ట్ దగ్గర వీళ్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఒక బస్సులో వాళ్లను సహార్సా పొలిమేరలో ఏర్పాటు చేసిన క్వారంటైన్కు తరలించారు. బీహారు ప్రభుత్వం చేసిన మంచి పనేంటంటే వలసల గ్రామాల పొలిమేరల్లో ఐసోలేషన్ క్యాంపులను ఏర్పాటు చేసి.. ఏ ఊరి వాళ్లను ఆ ఊరి క్యాంపుల్లో పెట్టడం. ఘజియాబాద్ వలసకార్మికులను క్యాంప్లోకి పంపించే ముందు వాళ్ల కుటుంబ సభ్యులతో మాట్లాడనిచ్చారు కాసేపు భౌతిక దూరం పాటింపజేస్తూ. వాళ్లు క్వారంటైన్ లోకి వెళ్తుంటే ఒకరితో ఒకరం ప్రామిస్ చేసుకున్నాం ఫోన్లో టచ్లో ఉండాలి ఎప్పటికీ అని. మా టీమ్కు ఆ ఊళ్లో వాళ్లిచ్చిన ఆతిథ్యం, చూపించిన ఆప్యాయతను మాటల్లో చెప్పలేం. తిరిగి మేం వెళ్లిపోతుంటే కళ్లనిండా నీళ్లతో వీడ్కోలు పలికారు’ అంటూ ఆ విషయాలు, విశేషాలను పంచుకున్నారు వినోద్ కాప్రి. మంచితనమే కనిపించింది.. ఇలా వాళ్ల ప్రయాణం ఏడు రోజులు, ఏడు రాత్రులు సాగి సుఖాంతమైంది. కాని దోవంతా ఎంత టెన్షన్ పడ్డామో. హై వే మీద దూసుకెళ్తున్న ట్రక్కుల వేగం ధాటికి పక్కనే సైకిళ్ల మీద వీళ్లు షేక్ అయ్యేవారు. బ్యాలెన్స్ తప్పి ఎక్కడ పడిపోతారేమోనని భయమేసేది. వంద కిలోమీటర్ల వరకు లిఫ్ట్ దొరికినప్పుడు చూడాలి వాళ్ల సంతోషం. పట్టలేక ఏడ్చేశారు. లిఫ్ట్ ఇచ్చిన ట్రక్ డైవర్లదీ సాహసమే. పోలీసులు పట్టుకుంటే 20 వేల జరిమానాతోపాటు ట్రక్కూ సీజ్ అయ్యేది. నిజానికి ఆ దారెంట మాకందరూ మంచివాళ్లే తారసపడ్డారు. తోటివాళ్ల కష్టాన్ని అర్థంచేసుకొని తమకున్న దానిలోంచే ఇతరులకు పంచే పెద్ద మనసున్న వాళ్లు. సైకిల్ పంక్చర్ వేసిన వాళ్లు డబ్బులు తీసుకోలేదు. టీ కొట్టు అతను ఉచితంగా టీ ఇవ్వడమే కాక వాళ్ల కోసం సమోసాలు చేయించిచ్చాడు. ఈ ప్రయాణం ప్రపంచం పట్ల నా దృష్టి్టకోణాన్ని మరింత విశాలం చేసింది. నాలో సానుకూల దృక్పథాన్ని పెంచింది. -
శ్రీనివాస కల్యాణం
చక్కగా డిగ్రీ చదివిన అమ్మాయిని సినిమావాళ్లకిచ్చి చేస్తున్నారేమిటో..! చుట్టు పక్కలవాళ్ల గుసగుసలు. లోపల పెళ్లిచూపుల సీన్ మాత్రం వేరుగా ఉంది. ‘ఇంతాకన్నా ఆనందమేమి, ఓ రామ రామ’ అని రాగం తీస్తోంది అమ్మాయి. ఇకనేం.. అబ్బాయి అమ్మాయికి నచ్చేశాడు. పెళ్లయింది. పెళ్లయి అరవై ఏళ్లూ అయింది. ఈ అరవై ఏళ్లలో సింగీతంగారు.. ఎక్కువసార్లు పలికిన పేరు.. కల్యాణి. ఈ అరవై ఏళ్లలో కల్యాణి గారు.. చెప్పకోడానికి ఇష్టపడిన మాట.. ‘సింగీతం గారి భార్యని’ అరవై ఉగాదులు..! అరవై ఉషస్సులు..! ఎలా గడిచాయని ఇంటర్వ్యూలో అడిగాం. వాళ్లు చెప్పిన ప్రతి మాటా ఏడడుగుల బంధం విలువను చాటింది. రండి... శ్రీనివాస కల్యాణం చూతము రారండి ► ఈ నెల 20తో మీ పెళ్లయి 60 ఏళ్లవుతోంది. సుదీర్ఘ వైవాహిక జీవితం కాబట్టి ప్రత్యేకంగా జరుపుకోవడానికి ప్లాన్ చేస్తున్నారా? సింగీతం: మేమెప్పుడూ పెళ్లి రోజు అంటూ ఆర్భాటాలు చేయలేదు. పిల్లలు వచ్చి మా దంపతులకు నమస్కరించుకుని ఆశీర్వాదాలు తీసుకుంటారు. కల్యాణి: అయితే మా 50 సంవత్సరాల పెళ్లిరోజుని మాత్రం అందరినీ పిలిచి చేసుకున్నాం. మా చిన్నమ్మాయి లండన్లో ఉంటోంది. పోయిన నెల తను ఇక్కడే ఉంది. లండన్ వెళ్లిపోయే లోపు 60 ఏళ్ల పెళ్లి రోజుని ముందే సెలబ్రేట్ చేద్దామని ఫిబ్రవరి 25న చేసుకున్నాం. ఆ వేడుక తర్వాత మా ఆమ్మాయి లండన్ వెళ్లిపోయింది. మా పిల్లల అవకాశాన్ని బట్టి ఎప్పుడు కుదిరితే అప్పుడే మేం వేడుక చేసుకుంటాం. మాకు అదే మంచి రోజు అనుకుంటాం. సింగీతం: వాళ్లకి ఎప్పుడు కుదిరితే అప్పుడే మా మ్యారేజ్ డే అన్నమాట (నవ్వుతూ). ► మీ పెళ్లి ఎలా ఖాయం అయింది? సింగీతం: నేను టీచర్గా కొంతకాలం పనిచేశాక అక్కడక్కడా పని చేస్తూ దర్శక–నిర్మాత కేవీ రెడ్డి గారి దగ్గర చేరాను. సినిమా ఇండస్ట్రీలోకి రాగానే పెళ్లి సంబంధం వచ్చింది. చూసుకోవటం, వెంటనే ఓకే అనుకోవటం.. అలా క్విక్గా జరిగిపోయింది. కల్యాణి: నేను ఇంటర్మీడియేట్ చదువుతున్నప్పుడే మా నాన్నగారు సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. మా నాన్నగారికి ముగ్గురం ఆడపిల్లలమే. నాది ‘ఆశ్లేషా నక్షత్రం’. జాతక రీత్యా నేను చేసుకోబోయే అబ్బాయికి వాళ్ల అమ్మ బతికి ఉండకూడదు. సింగీతం: ఆశ్లేషా నక్షత్రం వారికి తాను చేసుకోబోయే అబ్బాయికి తల్లి ఉంటే ప్రమాదం. అది ఆ జాతకం వారితో ఉన్న లిటికేషన్ అన్నమాట (నవ్వులు). కల్యాణి: అంతకుముందు నాకో సంబంధం వచ్చింది. అబ్బాయికి తల్లి ఉన్నారు. మా నాన్న నా జాతకం విషయం చెబితే వాళ్లు ఫర్వాలేదన్నారు. మంచి సంబంధం అయినప్పటికీ నాన్న ఒప్పుకోలేదు. ఆ సంబంధం గురించి ఆ నోటా ఈ నోటా వైజాగ్లో ఉన్న సింగీతంగారి బాబాయ్ వరకూ వెళ్లింది. ఆయన మా నాన్నగారితో ‘మా అన్నయ్యకి తెలిసిన సింగీతం రామచంద్రరావుగారి అబ్బాయి సినిమా ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేస్తున్నాడట. మీకు అభ్యంతరం లేదంటే నేను మా అన్నయ్యకు లెటర్ రాస్తాను’ అన్నారు. సింగీతం: ఆ రోజుల్లో సినిమా వాళ్లకు పిల్లనివ్వాలంటే అంత తొందరగా ఒప్పుకునేవారు కాదు. కల్యాణి: ‘మావాడు సినిమా ఇండస్ట్రీలో పని చేస్తున్నాడు. మీకు ఇష్టం ఉంటే మీ అమ్మాయి ఫోటో పంపగలరు’ అని మా నాన్నగారికి వీళ్ల నాన్నగారు ఉత్తరం రాశారు. మా నాన్న తన అభిప్రాయం చెప్పకుండా ‘అమ్మడూ.. నీ ఇష్టం’ అని ఆ లెటర్ నాకు ఇచ్చారు. నేను ఆలోచిస్తుంటే మా అమ్మమ్మగారు ‘వాళ్ల కుటుంబం గురించి నాకు తెలుసు. కంగారు పడకుండా ఒప్పుకో. ఆ అబ్బాయి డిగ్రీ, నువ్వు డిగ్రీ చదువుకున్నావు. అంతా మంచే జరుగుతుంది’ అన్నారు. నేను ‘సరే’ అన్నాను. కల్యాణి, సింగీతం ► 60 ఏళ్ల క్రితం పెళ్లంటే అమ్మాయి ఇష్టంతో సంబంధం లేకుండా పెద్దలు పెళ్లి ఖాయం చేసేవారు. అయితే మీ నాన్నగారు మీ అభిప్రాయాన్ని అడిగారంటే, ఆయన ఎంత గొప్పగా ఆలోచించారో అర్థమవుతోంది.. సింగీతం: మా మామగారు ఫార్వార్డ్ థింకింగ్. పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఏది నిర్ణయించుకుంటే అదే ఫైనల్ అనుకునేవారు. మా పెళ్లికి అంతా ఓకే అనుకున్నారు కానీ, కట్నం ఎంత అడుగుతారో అనేది అందరి మనసులోనూ ఉంది. అది గ్రహించి మా నాన్నగారు ‘మా వంశంలో కట్న, కానుకల ప్రసక్తే లేదు. నో డిమాండ్స్, నథింగ్’ అన్నారు. ► ఈ సందర్భంగా కట్న, కానుకలు తీసుకునే వారి గురించి నాలుగు మాటలు? సింగీతం: కట్నం తీసుకోకూడదు, నేరం.. ఈ పరిస్థితిలో మార్పు రావాలని ఏదో నాలుగు మాటలు చెప్పేస్తే సరిపోదు. దీనికి ఒకే ఒక్క సొల్యూషన్ ఏంటంటే ఆడవాళ్లు చదువుకోవాలి. స్త్రీలందరికీ మంచి ఎడ్యుకేషన్ ఇప్పించాలి. ఒకప్పుడు వాళ్ల అమ్మమ్మకు జరిగింది, తర్వాత వాళ్ల అమ్మకు జరిగింది.. ఇప్పుడు కూతురికి జరగకుండా చూసుకుంటే చాలు. మార్పు అదే వస్తుంది. ► అప్పట్లో పెళ్లి చూపుల్లో అమ్మాయిని పాడమనేవారు.. కల్యాణి: ‘ఇంతాకన్నా ఆనందమేమి, ఓ రామ రామ..’ అని పాడాను (నవ్వుతూ). ‘అబ్బాయి నచ్చాడని ఇంతకన్నా అమ్మాయి ఎలా చెబుతుంది’ అని పెద్దవాళ్లు అన్నారు. మా పెళ్లి కుదిరింది. కానీ అమ్మలక్కలు చక్కగా డిగ్రీ చదువుకున్న అమ్మాయిని సినిమా వాళ్లకి ఎందుకిస్తున్నారో అని గుసగుసలాడుకున్నారు. అప్పుడు వాళ్లు అలా అన్నారు. ‘సింగీతంగారి భార్యని’ అని నేను ఇప్పటికీ గర్వంగా చెప్పుకుంటాను. అప్పటికీ ఇప్పటికీ నాది ఒకటే మాట... ఆయన్ని పెళ్లి చేసుకున్నందుకు నేను ధన్యురాలిని. ► పెళ్లి చూపుల్లో ‘ఇంతాకన్నా ఆనందం ఏముంది..’ అని పాడినట్లుగానే మీ లైఫ్ ఆనందంగా సాగుతోందన్న మాట... కల్యాణి: రెండొందల శాతం నా లైఫ్ అలానే ఉంది. పెళ్లికి ముందు నేను పక్కింట్లో పేరంటానికి కూడా వెళ్లేదాన్ని కాదు. మేం మా పుట్టింట్లో అలా పెరిగాం. ఓ సారి చెల్లెలు మద్రాసులో మా ఇంటికి వచ్చింది. నేను అందరితో మాట్లాడటం చూసి ‘అదేంటే... అందరితో అంత బాగా మాట్లాడుతున్నావు! బావగారు నిన్ను భలే మార్చేశారే’ అంది. సింగీతం: కాలేజీ డేస్లోనే మోడ్రన్గా ఉండేవాణ్ణి. మోడ్రన్గా డ్రెస్ చేసుకోవడం మాత్రమే కాదు.. నా ఆలోచనలు కూడా అలానే ఉండేవి. నేను కేవీ రెడ్డిగారి దగ్గర పని చేసేటప్పుడు మద్రాసులో రెండు లైబ్రరీలు ఉండేవి. ఇద్దరం పుస్తకాలు తెచ్చుకుని, చదివేవాళ్లం. ‘నేను ఏది చెబితే అది ఫైనల్ కాదు, నీకు ఈక్వల్ రైట్స్ ఉన్నాయి. మీరు ఎంత చెబితే అంతే అనే తత్వం నుంచి నీకున్న హక్కుతో నువ్వు డిమాండ్ చెయ్’ అని పెళ్లయిన కొత్తలోనే తనకు చెప్పాను. ► ఇప్పుడు కూడా భార్యకి ఈక్వల్ రైట్స్ ఇవ్వడానికి చాలామంది భర్తలు ఇష్టపడటంలేదు. 60 ఏళ్ల క్రితం ‘ఈక్వల్ రైట్స్’ అన్నారంటే సూçపర్బ్. మేల్ డామినేషన్ అంటూ స్త్రీని చిన్నచూపు చూసేవారికి చిన్న సలహా ఏమైనా? సింగీతం: అప్పట్లో మగవాళ్లు ఆఫీసుకు వెళ్లి, తర్వాత క్లబ్లకు వెళ్లి, పేకాట ఆడి ఇలా ఎంతో ఎంటర్టైన్మెంట్ ఉండేది. ఎవరైనా ఇంటికి వచ్చి మాట్లాడితే తప్ప ఆడవాళ్లకు వేరే ఏమీ ఉండేది కాదు. టీవి వచ్చాక కొంత ఎంటర్టైన్మెంట్ వచ్చింది. అయితే మగవాడు ఇంటికి వచ్చినా కూడా ఆడవాళ్లు టీవి చూస్తూనే ఉంటారనే అర్థంతో కార్టూన్లు వేసేవారు. అవి వేసేది కూడా మగవాళ్లే. అన్నిరోజులూ మగవాళ్లు పేకాట ఆడినా ఒక్క కార్టూన్ రాలేదు. ఆడవాళ్ల మీద ‘తిరగబడే ఆడది’, ‘భయపడే మొగుడు’ లాంటి టైటిల్స్తో కార్టూన్లు వచ్చేవి. ఇదంతా మేల్ డామినేషన్. ఇది తరతరాలుగా వస్తోంది. ఈ పరిస్థితి పోవాలంటే ఎడ్యుకేషన్ ఆఫ్ ఉమెన్ ఒక్కటే పరిష్కారం. ప్రతి స్త్రీ తన హక్కుల కోసం డిమాండ్ చేయాలి. ఈ రోజుకీ ఇంట్లో అందరూ ఉన్నప్పుడు మగవాడు ఫస్ట్ అన్నట్లు చూస్తారు. 60 ఏళ్ల మా వైవాహిక జీవితం తర్వాత కూడా ఇప్పుడూ ఈమె కొన్ని విషయాల్లో ‘మేల్ ప్రయారిటీ’ ఇస్తుంది. అలా వద్దంటాను. స్త్రీ బతికినంతకాలం పురుషుడి మీద ఆధారపడాలనే ధోరణి మంచిది కాదు. ఆవిడకూ ఒక లైఫ్ ఉంటుంది. ఈక్వల్ రైట్స్ ఇవ్వాలి. కల్యాణి: అప్పట్లో మా నాన్నగారు ఓ పత్రికకు నాతో కరస్పాండెంట్గా పని చేయించారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఏం జరుగుతుందో రాసి ఇచ్చేదాన్ని. అక్కడ లేడీస్ క్లబ్ మెంబర్గా ఉండేదాన్ని. అక్కడే పాఠాలు, టైప్ రైటింగ్ నేర్చుకున్నా. అలా మా నాన్న బాగా ఎంకరేజ్ చేసేవారు. పెళ్లయ్యాక ఈయన ఇంకా బాగా ఎంకరేజ్ చేశారు. ► మీరు డైరెక్షన్ చేసిన సినిమాల్లో కొన్నింటి కథా చర్చల్లో మీ ఆవిడ కూడా భాగం పంచుకున్నారట... ఆ విషయం గురించి? సింగీతం: ప్రతి సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ మొత్తం ముందుగా ఆమెకు వినిపించేవాణ్ణి. ఆమెతో డిస్కస్ చేసేవాణ్ణి. ఓసారి ఆమెకు ఒక ఫిలిం ఫెస్టివల్లో చూసిన ఓ అర్జెంటీనా సినిమా నచ్చింది. ఆ మాట నాతో అంటే.. అయితే తెలుగుకి తగ్గట్టుగా ఆ కథ రాయమన్నాను. దాన్నే ‘సొమ్మొకడిది–సోకొకడిది’గా తెలుగులో తీశాను. కల్యాణి: ఏ ఫిలిం ఫెస్టివల్కు వెళ్లినా సినిమా చూస్తూ టక టకా నోట్ చేసేదాన్ని. తర్వాత ఆయనతో డిస్కస్ చేసేదాన్ని. కుమార్తెలు సుధా కార్తీక్, శకుంతలా సతీష్తో.... ► మీ 60 ఏళ్ల వైవాహిక బంధం గురించి అందరికీ స్ఫూర్తిగా ఉండే ఓ కొన్ని పాయింట్లు చెప్పండి... కల్యాణి: ఎంత అన్యోన్యంగా ఉండే దంపతుల మధ్య అయినా వాదనలు లేకుండా ఉండవు. వాదించుకున్నా కూడా ఆ తర్వాత కలిసిపోవాలి. సమస్యలు ఉన్నా విడాకులవరకూ వెళ్లకూడదు. పెళ్లికి ముందు నాకు కొంచెం కోపం ఎక్కువ. పిల్లలు పుట్టాక ఆ కోపం ఇంకా పెరిగింది. వాళ్ల అల్లరి తట్టుకోలేకపోయేదాన్ని. దాంతో పిల్లలను తిట్టి, కొట్టేదాన్ని. అలాంటి సమయాల్లో ఆయనే ఎక్కువగా సర్దుకుపోయేవారు. నాకు కోపం వచ్చింది కదా అని ఆయన ఇంకా కోపం తెచ్చుకుని సమస్యని పెద్దది చేసేవారు కాదు. మా ఇద్దరి మధ్య మంచి అండర్సాండింగ్ ఉంది. సింగీతం: నాది ఆబ్సెంట్ మైండ్. అది నిజంగా పెద్ద సమస్యే అయినా తను సర్దుకుంది. నేను చిన్నçప్పటి నుంచీ నాస్తికుడిని. కానీ ఆమె పూజలు చేస్తుంది. నేను దేవుణ్ణి నమ్మను కదా అని తనని మానేయమనలేదు. తనకోసం నేను అష్టోత్తరాలు చదువుతాను. ఎందుకంటే ఆవిడ అభిప్రాయానికి విలువ ఇవ్వాలి కదా. నేను అష్టోత్తరాలు చదవడంవల్ల దేవుడు నన్ను ఇష్టపడతాడని కాదు... ఈమె ఇష్టపడుతుంది కదా (నవ్వుతూ). మనం ఎవరమూ పర్ఫెక్ట్ పీపుల్ కాదు. ప్రపంచంలో అందరం ‘ఇన్పర్ఫెక్ట్ పీపులే’. ఆ ఇన్పర్ఫెక్ట్ని యాక్సెప్ట్ చేస్తే అప్పుడు అందరం హ్యాపీగా ఉంటాం. ► ‘ఆదిత్య 369’ చిత్రంలో టైమ్ మెషీన్ని వెనక్కి తిప్పి ప్రేక్షకులందర్నీ వెనక్కి తీసుకెళ్లిపోయారు.. ఇప్పుడు టైమ్ మెషీన్ వెనక్కి వెళితే మీకు ఏమేం చేయాలని ఉంది? సింగీతం: ఏవీ లేవమ్మా.. నిన్నటికన్నా రేపు బెటర్ అంటాను. అప్పట్లో అన్నీ అద్భుతాలే అంటుంటారు. కానీ ఇవాళ కూడా అద్భుతాలు జరుగుతున్నాయి. ఆ రోజు నేను చేయనివి ఎన్నో ఇప్పుడు ఇండస్ట్రీలో చేస్తున్నారు. వాళ్లను చూసి నేను అప్డేట్ అవుతుంటాను. ► ఫైనల్లీ.. మళ్లీ దర్శకత్వం ఎప్పుడు? సింగీతం: రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.. స్క్రిప్ట్ విషయంలో కల్యాణికి గతంలో చెప్పినట్లు పెద్దగా చెప్పడంలేదు. కాకపోతే ఇలా చేయబోతున్నానని తనకి చెబుతుంటాను. అన్నీ తనకి చెప్పే చేస్తుంటాను. ► చెప్పకుండా చేసినది ఏదైనా మీ జీవితంలో ఉందా? కల్యాణి: అలాంటిది ఏదీ లేదు (నవ్వులు). ► మీరు ‘శ్రీ కల్యాణం’ పుస్తకం రాయడానికి స్ఫూర్తి ఎవరు? కల్యాణి: నీ చిన్నప్పటి విషయాలు, నువ్వు నాన్నని పెళ్లి చేసుకున్న తర్వాత నీ అనుభవాలతో ఓ పుస్తకం రాయొచ్చు కదా? అని మా చిన్నమ్మాయి అంది. నా ఆటోబయోగ్రఫీ రాయడానికి ముఖ్య కారణం తనే. ఎలా ప్రారంభించాలా అనుకునేదాన్ని.. ‘నువ్వు అనుకున్నవన్నీ రఫ్గా రాస్తుండు. ఫైనల్ వెర్షన్ ఒకటి రాయొచ్చు’ అని ఆయన అన్నారు. ఓ డైరీలో రాసుకునేదాన్ని. రఫ్ రాయడానికే ఆర్నెల్లు పట్టింది. సింగీతం: మాకు పెళ్లైన కొత్తలో మాకు పెద్దగా వస్తువులు లేవు. రచయిత పింగళి నాగేంద్రగారు ఒక టేబుల్, నాలుగు కుర్చీలు బహుమతిగా ఇచ్చారు. ఆ టేబుల్ ఇప్పటికీ మా ఇంట్లోనే ఉంది. అది మాకు ప్రత్యేకం. దానిపై కాగితాలు పెట్టుకుని ఆ పుస్తకం రాసింది తను. అది నాకు సంతోషం. ► ఇప్పుడు మీ రోజువారి జీవితం ఎలా సాగుతోంది? సింగీతం: నేను ఉదయం 6:30 గంటలకు నిద్ర లేచి కాసేపు వాకింగ్, శ్వాసకి సంబంధించిన వ్యాయామం చేస్తాను. సాయంత్రం కూడా వాక్ చేస్తాను. ఆహారం అంతా టైమ్ టు టైమ్ జరిగిపోతుంది. రాత్రి కళ్లు మూసుకోగానే నిద్రపట్టేస్తుంది. పాపం తనకి నిద్రపట్టదు. కల్యాణి: నాకు రాత్రి 12 తర్వాత నిద్రపడుతుంది. అందుకని త్వరగా నిద్ర లేవలేను. నా 55వ సంవత్సరం నుంచే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. డాక్టర్ల సలహా మేరకు ఫిజియోథెరపీ చేయించుకున్నాను. డాక్టర్ చెప్పినట్లు కాసేపు చేతులు, కాళ్లకు సంబంధించిన ఎక్సర్సైజ్లు చేస్తాను. నాకు 83 ఏళ్లొచ్చినా ఇప్పటికీ మా ఇద్దరికీ చపాతీలు చేయడం, దోసెలు వేయడం చేస్తాను.. వంట చేయడానికి మనుషులు ఉన్నారనుకోండి. సింగీతం: మేం చెన్నైలో ఉంటున్నాం. నేను డైరెక్షన్ చేస్తున్నప్పుడు నా తమ్ముడు అసిస్టెంట్గా చేసేవాడు. తన అబ్బాయి పూర్ణ ప్రగ్యా, కోడలు, వాళ్ల పిల్లలు మా వద్దే ఉంటూ బాగా చూసుకుంటున్నారు. కల్యాణి: ఆ అమ్మాయి మా సొంత కోడలిలా మమ్మల్ని చూసుకుంటుంది. అందుకని మాకేం ఇబ్బంది లేదు. ► ‘నా జీవితంలో నేను ఎక్కువగా పలికిన పేరు కల్యాణి’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.. సింగీతం: అవును. నేను ఎక్కువసార్లు పలికిన పేరు కల్యాణి. మాది చాలా సింపుల్ లైఫ్. నాకు డైరెక్షన్ తప్ప వేరే ఏదీ తెలియదు. షూటింగ్ కాగానే నేరుగా ఇంటికి వచ్చేవాణ్ణి. మాకు క్లోజ్ ఫ్రెండ్స్ ఆరుగురు మాత్రమే ఉండేవారు. సినిమాలు, ఇల్లు, ఆ ఫ్రెండ్స్.. అంతే. – డి.జి. భవాని -
దర్శకుడు శ్రీవాస్ ఇంట్లో విషాదం
సాక్షి, రాజమండి: టాలీవుడ్ దర్శకుడు శ్రీవాస్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. శ్రీవాస్ తల్లి ఓలేటి అమ్మాజి(68) శనివారం కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తూర్పుగోదావరి జిల్లాలోని స్వగ్రామమైన పురుషోత్తపట్నంలో శనివారం మధ్యాహ్నం 12.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. అమ్మాజికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. దర్శకుడు శ్రీవాస్ అమ్మాజికి రెండో సంతానం. శ్రీవాస్ తల్లి మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. గోపీచంద్ హీరోగా నటించిన లక్ష్యం సినిమాతో శ్రీవాస్ దర్శకుడిగా పరిచయమయ్యారు. రామ రామ కృష్ణ కృష్ణ, పాండవులు పాండవులు తుమ్మెద, లౌక్యం, డిక్టేటర్, సాక్ష్యం సినిమాలను ఆయన తెరకెక్కించారు. దర్శకుడు వీరశంకర్ తండ్రి బైరిశెట్టి సత్యనారాయణ, హీరో శ్రీకాంత్ తండ్రి మేక పరమేశ్వరరావు ఇటీవల మరణించారు. (ప్రముఖ దర్శకుడికి పితృవియోగం) -
ప్రముఖ దర్శకుడి ఇంట్లో విషాదం
సాక్షి, తణుకు: ప్రముఖ దర్శకుడు వీరశంకర్ తండ్రి బైరిశెట్టి సత్యనారాయణ(83) మంగళవారం ఉదయం కన్నుమూశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణానికి సమీపంలో ఉన్న చివటం గ్రామంలో ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా కేన్సర్తో ఆయన బాధ పడుతున్నారు. సత్యనారాయణకు ముగ్గురు కుమారులు వేణుగోపాలరావు, వెంకటేశ్వరావు, వీరశంకర్ ఉన్నారు. (టాలీవుడ్లో మరో విషాదం) తన తండ్రి గురించి వీరశంకర్ మాట్లాడుతూ.. ‘మాకు నిజాయితీని, కష్టపడే తత్వాన్ని నేర్పిన మనిషి. ఆఖరి రోజుల్లో కేన్సర్ కారణంగా బాధని అనుభవించడం మమ్మల్ని కలచివేసింది. వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి మేము చేసే పోరాటానికి ఆయనే స్ఫూర్తి. నాన్న ఎప్పటికీ మాకొక మంచి జ్ఞాపకం’ అన్నారు. వీరశంకర్ తండ్రి మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. శ్రీకాంత్ హీరోగా నటించిన ‘హల్ ఐ లవ్ యూ’ సినిమాతో వీరశంకర్ దర్శకుడిగా పరిచయమయ్యారు. తెలుగుతో పాటు కన్నడ సినిమాలకు దర్శకత్వం వహించారు. పవన్ కళ్యాణ్తో గుడుంబా శంకర్ సినిమా తీశారు. ప్రేమకోసం, విజయరామరాజు, యువరాజ్యం, మన కుర్రాళ్లే తదితర సినిమాలను ఆయన తెరకెక్కించారు. (నటుడు శ్రీకాంత్కు పితృవియోగం) -
దర్శకుడిపై దినపత్రిక సీఈఓ అత్యాచారం
ఇస్లామాబాద్: పాకిస్థాన్కు చెందిన జంషెద్ మెహమూద్ అనే దర్శకుడు తనపై ఓ ప్రముఖ వార్తా పత్రికకు చెందిన సీఈఓ అత్యాచారం చేశాడని చెప్పి సంచలనం క్రియేట్ చేశారు. తనపై ఓ ప్రముఖ సీఈఓ అత్యాచారానికి పాల్పడ్డాడని రెండు నెలల క్రితమే జంషెద్ ఆరోపించినా.. అప్పడు అతని పేరు బయటపెట్టలేదు. కానీ, ఇప్పుడు అతని పేరును ట్విటర్ ద్వారా బయటపెట్టాడు. డాన్ పత్రిక సీఈఓ హమీద్ హరూన్ 13 ఏళ్ళ క్రితం నన్ను అత్యాచారం చేశాడు. ధైర్యం ఉంటే ఈ వార్తను మీ పత్రికలో ప్రచురించండి. చదవండి: వారిది నా రక్తం.. పవన్ రక్తం కాదు: రేణూదేశాయ్ నేను మీటూ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాను. ఈ విషయం గురించి నేను నా స్నేహితులకు చెబితే అందరూ నవ్వారు. కానీ, ఆ దారుణ ఘటనను మర్చిపోవడానికి థెరపిస్ట్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. కొన్ని నెలల పాటు పాకిస్థాన్కు దూరంగా ఉన్నాను. ఆ నీచుడు మా నాన్న చనిపోయినప్పుడు పరామర్శించడానికి కూడా వచ్చాడు. నా జీవితం నాశనం చేసిన విషయం మా నాన్నకు కూడా తెలుసని జంషెద్ మెహమూద్ ట్వీట్లో పేర్కొన్నాడు. చదవండి: మైనర్పై అత్యాచారం.. నిందితుడిని చంపిన అన్న Yes HAMEED HAROON Raped me. Im ready now. R u ready to print this @dawn_com ? — Jami raza (@azadjami1) December 28, 2019 -
గీతా గోవిందం దర్శకుడితో ‘మహేష్బాబు’ సినిమా
సింహాచలం(పెందుర్తి): గీత గోవిందం సినిమా తనని సినీ ప్రేక్షకులను ఎంతో దగ్గర చేసిందని దర్శకుడు పరశురామ్ అన్నారు. వరాహ లక్ష్మీ నృసింహస్వామిని బుధవారం ఆయన సతీసమేతంగా దర్శించుకున్నారు. అంతరాలయంలో అష్టోత్తరం పూజ, గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన నిర్వహించారు. వేద ఆశీర్వచనాన్ని అర్చకులు అందజేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామివారి ప్రసాదాన్ని ఏఈవో రామారావు అందించారు. ఈ సందర్భంగా పరశురామ్ విలేకరులతో మాట్లాడారు. ‘యువత’ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యానని, ఆ తర్వాత ఆంజనేయులు, సోలో, సారొచ్చారు, శ్రీరస్తు శుభమస్తు, గీతగోవిందం సినిమాలకు దర్శకత్వం వహించానన్నారు. గీత గోవిందం సినిమా ప్రేక్షకులను బాగా దగ్గర చేసిందన్నారు. తన తదుపరి చిత్రం నాగచైతన్యతో ఉంటుందన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందన్నారు. అలాగే మహేష్బాబుతో సినిమా ఉంటుందని, ఆ సినిమా కథ ఇప్పటికే సిద్ధమైందన్నారు. నర్సీపట్నం తన సొంత ఊరని పరశురామ్ తెలిపారు. -
కండోమ్ వాడండి.. రేప్లను అంగీకరించండి!
దిశ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఓ సినీ నిర్మాత మహిళలకు ఇచ్చిన కీచక సలహాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. డేనియల్ శ్రావణ్ అనే చిత్ర నిర్మాత ‘మహిళలు ప్రయాణించేటప్పుడు కండోమ్ను తీసుకెళ్లాలి. పురుషుల లైంగిక కోరికను అంగీకరించాలి’ అంటూ తన ఫేస్బుక్ అకౌంట్లో కీచక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో సంబంధిత పోస్టును అతను తొలగించాడు. అతని పూర్తి పోస్టు ఇది.. ‘18 సంవత్సరాలు నిండిన మహిళలు ముఖ్యంగా భారతీయ మహిళలు లైంగిక విద్య పట్ల అవగాహన ఉండాలి. మహిళలు పురుషుల లైంగిక కోరికలను తిరస్కరించకూడదు. అప్పుడే ఇలాంటి చర్యలు జరగవు. 18 సంవత్సరాలు నిండిన యువత కండోమ్లను ఉపయోగించాలి. ఇదోక సాధారణ విషయం. వ్యక్తి తన లైంగిక కోరిక నెరవేరినప్పడు మహిళలను చంపాలని ప్రయత్నించడు. నిజానికి ప్రభుత్వం ఆత్యాచారం తర్వాత జరిగే మరణాలను తగ్గించడానికి ఓ పథకాన్ని రూపొందించాలి. సమాజం, ప్రభుత్వం నిర్భయ చట్టం, పెప్పర్ స్ప్రేలతో రేపిస్టులను భయపెడుతున్నాయి. పురుషులకు కేవలం తన లైంగిక వాంఛను తీర్చుకోవడానికే ఇలాంటి చర్యలకు పాల్పడతారు. దీన్ని మహిళ తిరస్కరించడంతో వారిలో ఒక చెడు ఆలోచన రేకెత్తి ఇలాంటి దారుణానికి దారితీస్తుంది .అంతేగానీ బాధితులను చంపాలనే ఆలోచన వారికి ఉండదు.అందుకే మహిళలు అత్యాచారాన్నిఅంగీకరించాలి‘ అని డేనియల్ పేర్కొన్నాడు. ఈ పోస్ట్ వైరల్గా మారడంతో సెలబ్రిటీలతో సహా నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఇలాంటి పనికిమాలిన సలహాలను ఇచ్చే వారికి కూడా ప్రభుత్వం మరణ శిక్ష విధించాలి. వెధవ డానియల్’. ‘ఇదొక కౄరమైన ఆలోచన ముందు దీన్ని నీకు నువ్వు అమలు చేసుకో’. ‘ఇలాంటి సలహాలను పట్టించుకోకండి. ఇతనికి వైద్య సహాయం అవసరం.’ ఇలాంటి సలహాలను ఇచ్చే వారిని ఉరి తీయాలి. అప్పుడే ఇంకోసారి ఇలా వాగరు’...అంటూ డేనియల్పై నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. -
అమ్మమ్మగారి ఇల్లు అనుబంధాల హరివిల్లు
అతిథితో కాసేపు... ‘ఆప్యాయతలు.. అనుబంధాలంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. నేను పెరిగిన వాతావరణం అలాంటిది. అమ్మ ప్రోత్సాహంతోనే సినిమా రంగంలో రాణిస్తున్నా. 12 ఏళ్ల ప్రయాణంలో ఎంతో నేర్చుకున్నా. ఆనంద క్షణాల్ని గుర్తుచేసుకుంటూ ప్రస్తుత కాలాన్ని గడపాలనే చిన్నలైన్ ఆధారంగానే ‘అమ్మమ్మగారి ఇల్లు’ సినిమా తీశా’ అంటూ బోలెడు ముచ్చట్లు చెప్పారు చిత్ర దర్శకుడు సుందర్ సూర్య. కథా చర్చల కోసం నగరానికి వచ్చిన ఆయన్ని ‘సాక్షి’ పలకరించింది. విశాఖతో తన అనుబంధాన్ని వివరించారు సుందర్. మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే... – ఏయూక్యాంపస్(విశాఖ తూర్పు) అమ్మ ప్రోత్సాహం... చిన్నతనం నుంచి సినిమాలంటే చాలా ఇష్టం. అందుకే సినీరంగాన్ని ఎంచుకున్నా. కుటుంబంలో పెద్దన్నయ్య ప్రభుత్వ ఉద్యోగి, చిన్నన్నయ్య వ్యాపారి. నాకు నచ్చిన రంగంలో రాణించాలని అమ్మ మణి ప్రోత్సహించింది. నా నమ్మకం అదే... మనసుకు నచ్చిన పనిచేయడంలో ఉన్న ఆనందం మరెక్కడా ఉండదు. దీనిని నేను బలంగా విశ్వసిస్తాను. అందుకే చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవాలనే బలమైన కాంక్షతో ముందుకు సాగా. ‘అమ్మమ్మగారి ఇల్లు’ చిత్రీకరణ నా బలమైన ఆకాంక్షను సాకారం చేసింది. ఆనంద క్షణాల్ని గుర్తుచేసుకుంటూ ప్రస్తుత కాలాన్ని గడపాలనే చిన్న లైన్ను ఆధారంగా చేసుకుని సిద్ధం చేసిన కథే ఇది. నటుడు రావు రమేష్కు సీన్ వివరిస్తూ సినిమా కోసం కాకినాడ నుంచి విశాఖకు... పిఠాపురంలో శివదుర్గా థియేటర్ మా మావయ్యది. చిన్నతనం నుంచి అక్కడ సినిమాలు చూడటం అలవాటైంది. డిగ్రీ చదివే రోజుల్లో విశాఖకు సినిమా చూసేందుకు వచ్చేవాడ్ని. ఉదయం కాకినాడ ప్యాసింజర్లో నగరానికి వచ్చి.. మధ్యాహ్నం భోజనం చేసి చిత్రాలయ థియేటర్లో సినిమా చూసి సాయంత్రం అదే పాసింజర్లో తిరిగి కాకినాడ వెళ్లేవాడ్ని. ఈ ఒక్క మాట చాలు నాకు సినిమాలంటే ఎంత ఆసక్తో చెప్పేందుకు..! కథలు రెడీ చేస్తున్నా.. ప్రస్తుతం యాక్షన్ థ్రిల్లర్, రొమాంటిక్, కామెడి కథల్ని సిద్ధం చేసుకుంటున్నాను. త్వరలో యూత్–యాక్షన్ ప్రధానంగా సాగే కథను సిద్ధం చేస్తున్నా. నా కథల్లో భావోద్వేగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తా. ప్రతీ మనిషిని కట్టిపడేసేది అనుబంధాలే. వీటికే అధిక ప్రాధాన్యం. పుష్కరకాలంగా... చిత్రపరిశ్రమలో 12 ఏళ్లుగా పనిచేస్తున్నాను. జి.నాగేశ్వరరెడ్డి, ఎన్.శంకర్, బొమ్మరిల్లు భాస్క ర్ల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. టీవీ సీరియల్స్, పలు ప్రకటనలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. అనంతరం పూర్తిస్థాయిలో దర్శకుడిగా మారాలని నిర్ణయించుకున్నాను. ‘అమ్మమ్మగారి ఇల్లు’ నా తొలి ప్రయత్నం. కుటుంబ సంబంధాల నేపథ్యంలో తెరకెక్కించాను. ‘సిరివెన్నెల’ శైలి చాలా ఇష్టం... ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి రచనా శైలి నాకు చాలా ఇష్టం. నేను చెప్పాలనుకున్న కథని ఆయన కేవలం తన పాటలో రెండు చరణాలతో చెప్పేస్తారు. అందుకే తొలి చిత్రానికి ఆయనతో పట్టుబట్టి, ఒప్పించి మరీ పాట రాయించుకున్నా. విశాఖ.. ఓ సెంటిమెంట్.. చిత్రపరిశ్రమకు అనుకూలమైన పరిస్థితులు విశాఖలో ఉన్నాయి. అదే విధంగా విశాఖలో చిత్రీకరణ చేసుకున్న ప్రతీ చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకం చిత్ర పరిశ్రమలో ఉంది. వచ్చే నాలుగేళ్లలో చిత్రపరిశ్రమ నగరానికి వచ్చేస్తుందని నా నమ్మకం. కథలో బలం ఉంటే చాలు... తెలుగు నటులు కొత్తగా ఆలోచిస్తున్నారు. కేవలం కథను నమ్మి అవకాశాలు ఇస్తున్నారు. నూతన దర్శకుడైనా కథలో బలం ఉంటే వారు చేయడానికి వెంటనే ఆసక్తి చూపుతున్నారు. ఇది చాలా మంచి పరిణామం. ఈ చిత్రం నాకు విజయాన్నిస్తే, తరువాత చిత్రం నాకు బోనస్గా భావిస్తా. -
సినిమా అనేది అద్దంలా ఉండాలి
‘‘గతంలో సినిమాలు సమాజాన్ని ప్రభావితం చేసేవి.. కానీ, ఇప్పుడు సమాజం సినిమాలను ప్రభావితం చేస్తోంది. ఇండస్ట్రీ కంటే ముందుగా సొసైటీ చాలా ఫాస్ట్గా ఉంది. అందుకే సొసైటీని చూసి చిత్రాలు చేసే పరిస్థితి. సినిమా అన్నది అబద్ధంలా కాకుండా అద్దంలా నిజాలను చూపాలి.. అప్పుడే హిట్ అవుతుంది’’ అని దర్శక–నిర్మాత అల్లాణి శ్రీధర్ అన్నారు. నేడు ఆయన పుట్టినరోజుని పురస్కరించుకుని చెప్పిన విశేషాలు. ► ‘చిలుకూరు బాలాజి’ సినిమా తర్వాత ‘బిచ్చగాడు’ సినిమా నిర్మాత చదలవాడ శ్రీనివాస్గారి బ్యానర్లో ఓ ప్రేమకథా చిత్రం చేస్తున్నా. క్లైమాక్స్ ప్యాచ్వర్క్ మినహా షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రంతో డైరెక్టర్ కె.ఎస్. నాగేశ్వరరావుగారి అబ్బాయి పవన్ హీరోగా పరిచయమవుతున్నాడు. సీనియర్ నటుడు సురేశ్, దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ వైవిధ్యమైన పాత్రలు చేశారు. ఆగస్టులో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం. ► నేటి తరం పిల్లలు డిజిటల్ మాధ్యమాలకు ఎలా బానిసలవుతున్నారనే కథాంశంతో ‘డూడు.. డీడీ’ అనే చిన్నపిల్లల సినిమా తీశా. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో, కలకత్తా చిల్డ్రన్ ఫెస్టివల్లో ఈ చిత్రం ప్రదర్శితమైంది. త్వరలో విడుదల చేయనున్నాం. ∙‘కొమరం భీమ్’ సినిమాని నా దర్శకత్వంలో హిందీలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని నేటి ట్రెండ్కి తగ్గట్టు డిజిటలైజ్ చేసి మళ్లీ తెలుగులోనూ విడుదల చేయాలనుకుంటున్నా. ► నా దర్శకత్వంలో థ్రిల్లర్ జోనర్లో వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నా. వ్యవసాయం, ఆరోగ్యంపై చైతన్యం వచ్చేలా నేను తీసిన షార్ట్స్ ఫిల్మ్స్కి మంచి పేరొచ్చింది. ఇటీవల వచ్చిన ‘మల్లేశం’ సినిమా బాగా నచ్చింది. ఇలాంటి సినిమాలకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సబ్సిడీ ఇవ్వాలి. ► ప్రస్తుతం సమాజంలో 9 నెలల పసికందు నుంచి 90ఏళ్ల మహిళలపై ఎందుకు లైంగిక దాడులు జరుగుతున్నాయి? అనే అంశంపై ఓ టీనేజ్ గర్ల్ పరిశోధన చేశారు. నా దర్శకత్వంలో దాన్ని సినిమాగా చేస్తున్నాం. వాస్తవ సంఘటన ఆధారంగా ఈ చిత్రం చేయనున్నాం. -
దర్శకుడు కట్టా రంగారావు మృతి
ప్రముఖ దర్శకులు కట్టా రంగారావు అనారోగ్యంతో సోమవారం హైదరాబాద్లో కన్నుమూశారు. 1957 మే 5న జన్మించారాయన. ‘ఇంద్రధనస్సు’ చిత్రంతో దర్శకుడిగా మారిన రంగారావు ‘ఉద్యమం, అలెగ్జాండర్, నమస్తే అన్నా, బొబ్బిలి బుల్లోడు’తో పాటు మరికొన్ని చిత్రాలను రూపొందించారు. దర్శకుల సంఘంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన రంగారావు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. సోమవారం సాయంత్రం సూర్యాపేటలోని మేడారం గ్రామంలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. -
దర్శకురాలు కల్పనా లాజ్మి కన్నుమూత
బాలీవుడ్ దర్శకురాలు కల్పనా లాజ్మి కన్నుమూశారు. కొన్ని రోజులుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆమె ఆదివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. నిర్మాతగా, దర్శకురాలిగా, స్క్రీన్ రైటర్గా లో బడ్జెట్తో రియలిస్టిక్ చిత్రాలను రూపొందించారామె. కల్పన తెరకెక్కించినవన్నీ దాదాపు లేడీ ఓరియంటెడ్ చిత్రాలే. దర్శకుడు గురు దత్కి మేనకోడలు కల్పనా లాజ్మి. అలాగే మరో ప్రసిద్ధ దర్శకుడు శ్యామ్ బెనగల్ కూడా కల్పనకు బంధువే. ‘రుడాలి, దర్మియాన్, దమన్, చింగారి’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారామె. ‘రుడాలి’ సినిమాకు డింపుల్ కపాడియాకు, ‘దమన్’ సినిమాకుగాను రవీనా టాండన్కు నేషనల్ అవార్డులు లభించాయి. ‘చింగారి’ (2006) తర్వాత కల్పన సినిమాలు తీయలేదు. చివరి రోజుల్లో తన మెడికల్ బిల్స్ అన్నీ ఇండియన్ ఫిల్మ్ అండ్ టీవీ డైరెక్టర్స్ అసోసియేషన్స్, నటుడు ఆమిర్ఖాన్, దర్శకుడు రోహిత్ శెట్టి చూసుకునేవారని సమాచారం. కల్పనా లాజ్మి మృతిపట్ల బాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. -
నాకు సంబంధం లేదు
బుల్లితెర నటి నీలాణి ప్రియుడి ఆత్మహత్య కేసులో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నీలాణికి ఇంతకుముందే పెళ్లి అయ్యిందని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్టు తెలిసింది. భర్తను వదిలి పిల్లలతో నివశిస్తున్న నీలాణికి సహాయ దర్శకుడు గాంధీలలిత్కుమార్ పరిచయం కావడం, అతనితో ప్రేమ, సహజీవనం చేసిన విషయాలు బయటపడ్డాయి. తిరువణ్ణామలైకి చెందిన గాంధీలలిత్కుమార్కు తల్లిద్రండులు లేరు. అన్నయ్యనే పెంచి పెద్ద చేశాడు. సినిమారంగంపై ఆశతో చెన్నైకి వచ్చిన లలిత్కుమార్కు నటుడు ఉదయనిధిస్టాలిన్ సంస్థలో పని లభించింది. ఆ తరువాత సహాయ దర్శకుడిగా కొన్ని చిత్రాలకు పని చేశారు. తిరువణ్ణామలై ప్రాంతంలో ఉదయనిధిస్టాలిన్ అభిమాన సంఘం నిర్వాహకుడిగా ఉన్నాడు. కొంత కాలం తరువాత లలిత్కుమార్కు పని లేకుండా పోయింది. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. దీంతో నిలాణీ, లలిత్కుమార్ను వదిలి ఒంటరిగా జీవిస్తోంది. ఇటీవల టీవీ సీరియల్ షూటింగ్లో ఉన్న నీలాణి వద్దకు వచ్చి పెళ్లి చేసుకుందామని లలిత్కుమార్ ఒత్తిడి చేశాడు. దీనిపై ఆమె మైలాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మనస్తాపం చెంది లలిత్కుమార్ ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. ఇదిలాఉండగా నటి నీలాణితో లలిత్కుమార్ అనుబంధాన్ని తెలిపే వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లలిత్కుమార్తో తనకు సంబంధం ఉన్న మాట నిజమే.. నటి నీలాణి మంగళవారం సాయంత్రం చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వచ్చి లలిత్కుమార్ ఆత్మహత్మకు తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. అనంతనం మీడియా ముందుకు వచ్చి లలిత్కుమార్తో తనకు సంబంధం ఉన్న మాట నిజమేనని, ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నామని, అయితే ఇప్పుడే పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పానని తెలిపింది. లలిత్కుమార్ తన గురించి అసభ్యకరమైన దృశ్యాలను ఫేస్బుక్లో పెట్టడం, వేధించడంతోనే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని పేర్కొంది. అంతేగాకుండా తన వద్ద సొమ్ము తీసుకుని మోసం చేశాడని ఆరోపిస్తూ కంటతడి పెట్టింది. -
నటిపై అత్యాచారం కేసులో దర్శకుడికి ఊరట!
ముంబై : వర్థమాన నటిపై లైంగిక దాడి కేసులో భోజ్పురి సినీ దర్శకుడికి ఊరట లభించింది. ముంబై సెషన్ కోర్టు తాజాగా అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. భోజ్పురి చిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శకుడైన రాంకుమార్ కుమావత్ (51)పై ఓ వర్ధమాన నటి లైంగిక దాడి కేసు నమోదు చేసింది. సినిమాల్లో అవకాశమిస్తానని తన కార్యాలయానికి పిలిచిన రాంకుమార్.. అక్కడ తనపై లైంగిక దాడి చేశాడని నటి ఆరోపించింది. అయితే, వారిద్దరూ పరస్పర సమ్మతితోనే శృంగారంలో పాల్గొన్నారని, సినిమాలో అవకాశం ఇవ్వకపోవడంతోనే ఆమె కేసు నమోదు చేశారని వాదనల సందర్భంగా డిఫెన్స్ లాయర్ నిరూపించారు. ప్రాసిక్యూషన్ కేసు ప్రకారం.. 2009 జూలై 21న తన సినిమాలో ‘ఐటెం గర్ల్’ అవకాశం ఇస్తానంటూ నటిని కుమావత్ తన కార్యాలయానికి పిలిచి.. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ మరునాడు డ్యాన్స్ రిహార్సల్ పేరిట మరోసారి పిలిచి.. ఆమెపై మళ్లీ అత్యాచారం చేశాడు. కానీ చివరకు ఆ అవకాశం వేరే అమ్మాయికి ఇచ్చాడు. దీంతో నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సినిమాల్లో అవకాశం దొరుకుతుందన్న ఆశతోనే తాను కుమావత్ ఇంటికి వెళ్లానని, తనకు అవకాశం దొరికి ఉంటే కేసు నమోదుచేసేదాణ్ని కాదని డిఫెన్స్ లాయర్ల క్రాస్ఎగ్జామినేషన్లో నటి తెలిపింది. బాధితురాలి శరీరం మీద ఉన్న గాయాలు కల్పితమైనవేనని వైద్యులు తమ నివేదికలో తేల్చారు. అంతేకాకుండా ఆమె వాంగ్మూలంలోనూ పలు వైరుధ్యాలు ఉండటంతో కోర్టు డైరెక్టర్ కుమావత్ను నిర్దోషిగా తేల్చింది. -
‘వర్మను వెంటనే అరెస్ట్ చేయండి’
-
‘వర్మను వెంటనే అరెస్ట్ చేయకపోతే..’
సాక్షి, విశాఖపట్నం: వివాదాస్పద సినీ దర్శకుడు రాంగోపాల్వర్మను వెంటనే అరెస్ట్ చేయాలని విశాఖ మహిళాసంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. మంగళవారం ఈ మేరకు నగర జాయింట్ పోలీస్ కమిషనర్కు వినతిపత్రం అందజేసింది. ఆడవాళ్లను అంగడి సరుకుగా చేసి తన వ్యాపారంగా మార్చుకుంటున్నాడని మహిళా సంఘాల నేతలు దుయ్యబట్టారు. సమాజంపై చెడు ప్రభావం చూపే వికృత దుర్మార్గపు ఆలోచనలను ప్రచారం చేస్తూ యువతను పెడతోవ పట్టిస్తున్నాడని మండిపడ్డారు. మహిళా దినోత్సవం సందర్భంగా విశాఖలో సభ ఏర్పాటు చేస్తానని రాంగోపాల్వర్మ రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నాడని, ఇక్కడకు వస్తే తప్పకుండా ఆయనను అడ్డుకుంటామని హెచ్చరించారు. తక్షణమే రాంగోపాల్ వర్మను అరెస్టు చేయాలని, లేని పక్షంలో మహిళా సంఘాలన్నీ ఏకమై ఉద్యమాన్ని ఉధృతం చేస్తాయని తెలిపారు. -
దర్శకుడు అజయ్ కౌండిన్యపై కేసు
సాక్షి, హైదరాబాద్ : మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేసిన భూత్ బంగళా సినిమా దర్శకుడు అజయ్ కౌండిన్యపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని మల్కాజ్గిరి వసంతపురి కాలనీకి చెందిన శ్రీ లలితా మహిళా మండలి సమితి అధ్యక్షురాలు జిన్నెల సురేఖ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జనవరి 26న ఫిలించాంబర్లో జరిగిన భూత్ బంగళా సినిమా ఫంక్షన్లో అజయ్ కౌండిన్య మహిళల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటమే కాకుండా 30న ఓ చానెల్ డిబేట్లో కూడా తన వ్యాఖ్యలను సమర్ధించుకుంటూ నిరూపిస్తానని సవాల్ విసిరాడన్నారు. అమీర్పేట్లోని విద్యార్థులు, కొందరు పోలీస్ బాస్లు వ్యభిచారులేనని ఆయన చెప్పడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అతడిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఉద్యమ గురువును ఉపేక్షిస్తారా?
తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ కోసం 1969 తొలి దశ ఉద్యమం నుంచి మొన్నటి మలిదశ ఉద్యమం వరకు ప్రొఫెసర్ జయశంకర్కు సరి సమానంగా పోరాటం చేసిన సోషలిస్ట్ నాయకుడు, కోదండరాం, గద్దర్, కూర రాజన్న లాంటి ఎందరో ఉద్యమ నాయకులకే గురువు ప్రొ.కేశవరావు జాదవ్. ఆయన 85వ జన్మదినాన్ని (27.01.2018) తెలంగాణ సమాజం విస్మరించడం దారుణం. ఇప్పుడున్న ఉద్య మ పితామహుల్లో ఈయన ఒకరు. యావత్తు తెలంగాణ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వంపై జాదవ్ని గౌరవించవలసిన బాధ్యత ఉన్నది. కానీ ప్రభుత్వం నుంచి ఈ సందర్భంగా ఒక చిన్న ప్రకటన కూడా రాకపోవడం బాధాకరం. ఉద్దేశపూర్వకంగా మరచిపోతే అది కుట్రపూరితమే. పొరపాటుగా ఆయన పుట్టినరోజును మరిచారంటే అజ్ఞానులే! మన పెద్దలను, ఉద్యమ దిగ్గజాలనే మరచిపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? 1969 తెలంగాణ ఉద్యమానికి ఆయన సజీవ సాక్ష్యం! మృదు భాషే కానీ అన్యాయాన్ని నిర్భయంగా నిలదీసే తత్వం ఆయనలో ఎల్ల ప్పుడూ కనిపించేది. సాదా సీదా జీవితం గడిపారు, ఇంకా గడుపుతున్నారు. సమైక్యవాదులను గౌరవిస్తూ, తెలంగాణ సాధనే జీవిత లక్ష్యంగా తమ జీవితాన్ని అంకితం చేసిన వారిని విస్మరించడం సబబేనా? – సయ్యద్ రఫీ, చిత్ర దర్శకుడు -
వర్థమాన సినీ దర్శకుడు మృతి
చెన్నై: కోలీవుడ్ వర్థమాన సినీ దర్శకుడు కన్నన్ రంగస్వామి (27) అనారోగ్యంతో కన్నుమూశారు. ఇటీవల గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. తమిళంలో గత మార్చిలో విడుదలైన ‘దాయం’ చిత్రంకు కన్నన్ రంగస్వామి దర్శకత్వం వహించారు. ఆయన ఈ చిత్రంలో కొత్తవారిని నటీనటులుగా పరిచయం చేశారు. కాగా కన్నన్ రంగస్వామి గతవారం గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను చెన్నై వడపళణిలోని ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తూ వచ్చారు. ఆయన ఆరోగ్యం క్షీణించి కోమాలోకి వెళ్లారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం కన్నన్ రంగస్వామి తుదిశ్వాస విడిచారు. దాయం చిత్ర సంగీత దర్శకుడు సతీష్ సెల్వం దర్శకుని మృతదేహానికి అంజలి ఘటించారు. -
భార్యను మోసం చేసిన టాలీవుడ్ డైరెక్టర్
-
‘లవ్ చేయాలా వద్దా’ దర్శకుడిపై ఫిర్యాదు
సాక్షి, పెదవాల్తేరు (విశాఖపట్నం): లవ్ చేయాలా వద్దా చిత్ర దర్శకుడు నిజ జీవితంలో ప్రేమించి పెళ్ళిచేసుకుని తరువాత మొహం చాటేశాడు. తనను చిత్ర దర్శకుడు మోసం చేశాడంటూ లావణ్య అనే మహిళ బుధవారం మూడో పట్టణ పోలీస్స్టేషన్ను ఆశ్రయించింది. వివరాలివి.. మురళీనగర్కు చెందిన సినీ దర్శకుడు సయ్యద్ నౌషద్ చినవాల్తేరుకు చెందిన లావణ్యతో పరిచయం ఏర్పడింది. మతాలు వేరైనప్పటికీ 2004లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. మూడునెలల కాపురం అనంతరం తానో ప్రాజెక్ట్ విషయమై బయటకు వెళ్తున్నానంటూ చెప్పి తిరిగి రాలేదు. ఇంతలో నౌషద్కు చిత్ర దర్శకుడిగా అవకాశం వచ్చింది. 10నెలలు పాటు హైదరాబాద్లోనే ఉన్నాడు. భార్యను పట్టించుకోలేదు. స్నేహితుల సహాయంతో నౌషద్ చిరునామా తెలుసుకుని ఆయన్ను లావణ్య విశాఖ రప్పించింది. రూ.3లక్షల వ్యయంతో‘ కాఫీషాప్ పెట్టించింది. ఇదే దుకాణంలో మరో యువతితో నౌషద్ పరిచయం పెంచుకున్నాడు. లావణ్యను పట్టించుకోకుండా ఆ అమ్మాయితోనే సన్నిహితంగా మెలిగేవాడు. తనకు అర్జెంట్గా రూ.10లక్షలు కావాలని నౌషద్ అడిగాడు. ఇవ్వలేనని లావణ్య చెప్పింది. కొత్తగా పరిచయం అయిన యువతి విషయమై నిలదీసింది. సమాధానం లేకపోవడంతో పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేసింది. అయితే నౌషద్ను పిలిపించి మందలించామని, అయినా లావణ్య ఒప్పుకోకపోవడంతో కౌన్సెలింగ్ నిమిత్తం కేసును మహిళా పోలీస్స్టేషన్కు బదలాయిస్తున్నామని సీఐ వెంకటరావు స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం వ్యవహరిస్తున్నామని స్పష్టం చేశారు. -
పాతనోట్ల కేసులో సినీ డైరెక్టర్ అరెస్ట్
హైదరాబాద్: పాత నోట్ల మార్పిడి కేసులో పరారీలో ఉన్న సినీ దర్శకుడు నల్లూరి రామకృష్ణ అలియాస్ కిట్టు(కేటుగాడు మూవీ ఫేం)ను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. గతంలో నోట్ల మార్పిడి దందా చేస్తున్నాడని సమాచారంతో పోలీసులు అతని ఆఫీసుపై దాడి చేయగా గోడ దూకి కిట్టు పరారైన విషయం తెలిసిందే. ఈ సినీ డైరెక్టర్ హైదరాబాద్ నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి రద్దైన పాత నోట్లకు బదులుగా కమీషన్ పద్ధతిలో కొత్త నోట్లు ఇస్తానంటూ ప్రచారం చేసుకున్నాడు. ఈ మేరకు గత మార్చి 13వ తేదీన బంజారాహిల్స్ రోడ్ నంబర్ -2 కమలాపురి కాలనీలోని తన సినిమా కార్యాలయంలో నోట్ల మార్పిడి చేపట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి రూ.1.3 కోట్ల మేర పాత నోట్లను స్వాధీనం చేసుకొని అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. అతని కారు, కార్యాలయాన్ని సీజ్ చేశారు. ఈ ఘటనలో కిట్టుపై బంజారాహిల్స్ పోలీసులు ఛీటింగ్ కేసు నమోదు చేశారు. అయితే కిట్టు ప్రముఖ సినీ నిర్మాత మనువడితో రాయబారం నడిపినా ఉపయోగం లేకుండా పోయింది. దీంతో బెంగళూరుకు చెక్కేశాడు. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గురువారం ఖమ్మం జిల్లా భద్రాచలం సమీపంలోని చర్ల వద్ద అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని బంజారాహిల్స్ పోలీసులు వెల్లడించారు. -
లైంగిక దాడి కేసులో సినీ డైరెక్టర్కు రిమాండ్
బోడుప్పల్: వివాహితపై లైంగిక దాడికి పాల్పడిన ఓ సినిమా డైరెక్టర్ను శుక్రవారం మేడిపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఎస్ఐ వెంకట్రెడ్డి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. అమీర్పేట మధురానగర్కు చెందిన కార్తికేయ సినిమా డైరెక్టర్గా పని చేసేవాడు. ఇతనికి వైజాగ్కు చెందిన ఓ వివాహిత పేస్ బుక్లో పరిచయం కావడంతో ఇద్దరు కలిసి సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో సదరు వివాహిత ల్యాండ్ డాక్యుమెంట్లను కుదువ పెట్టి డబ్బులు తీసుకున్న అతను వాటితో సినిమా తీద్దామని చెప్పాడు. అయితే సినిమా తీయకపోగా వివాహితకు మాయమాటలు చెప్పి మణికొండలోని అపార్టుమెంట్కు పిలిపించి కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి ఇచ్చాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన తరువాత ఆమెను ఫొటోలు తీశాడు. వాటిని అడ్డుపెట్టుకుని పలుమార్లు తనపై లైంగిక దాడికి పాలుపడినట్లు బాధితురాలు మేడిపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం రిమాండ్కు తరలించారు. -
ప్రముఖ దర్శకుడిపై గృహహింస కేసు!
విమర్శల ప్రశంసలందుకున్న ప్రముఖ చిత్ర దర్శకుడు సిద్ధార్థ శ్రీనివాసన్ గృహహింస కేసు ఎదుర్కొంటున్నారు. సాండ్స్ ఆఫ్ సోల్స్ (పైరన్ తల్లె) సినిమాతో విమర్శకుల ప్రశంసలందుకున్న శ్రీనివాసన్పై ఆయన భార్య దివ్యా భరద్వాజన్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. తన తల్లిగారింటికి వెళ్లివచ్చిన తర్వాత తిరిగి ఇంట్లోకి రాకుండా తనను శ్రీనివాసన్ అడ్డుకుంటున్నారని, తన భర్త, అత్త మామ వేధిస్తున్నారని ఆమె కోర్టుకు నివేదించారు. తాను ఇంట్లోకి వచ్చేందుకు అనుమతించాలని, తనకు భరణం చెల్లించాలని ఆమె అభ్యర్థించారు. అయితే, కోర్టు ఆమె అభ్యర్థనను కొంతమేరకు మాత్రమే అంగీకరించింది. ఢిల్లీలోని న్యూఫ్రెండ్స్ కాలనీలో ఉన్న శ్రీనివాసన్ ఇంట్లోకి భార్యను అనుమతించాలని, ఆమెకు అటాచెడ్ టాయ్లెట్తో కూడిన ఒక గదిని ప్రత్యేకంగా కేటాయించాలని ఆదేశించింది. ప్రాథమిక ఆధారాలను బట్టి దివ్య గృహ హింస ఎదుర్కొంటున్నట్టు కనిపిస్తున్నదని, ఇలాంటి పరిస్థితిలో సొంతిల్లు లేని ఆమెకు ఆశ్రయం, రక్షణ కల్పించడానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నామని, కాబట్టి భర్త ఇంట్లో ఆమె భాగం కింద గది కేటాయించాలని ఆదేశిస్తున్నామని అడిషనల్ సెషన్స్ జడ్జి వినోద్ కుమార్ పేర్కొన్నారు. 2013లో తాను అనారోగ్యంతో ఉన్నప్పుడు భర్త శ్రీనివాసన్, ఆయన తల్లి అకస్మాత్తుగా చెప్పాపెట్టకుండా ఇల్లు విడిచి వెళ్లిపోయారని, దీంతో తనకు గత్యంతరం లేన తన తల్లి ఇంటికి వెళ్లానని, కాగా, ఇప్పుడు తాను తిరిగిరాగా, తన భర్త మకాం మార్చడమే కాదు.. కొత్తింట్లోకి తాను రాకుండా అడ్డుకున్నారని ఆమె కోర్టుకు తెలిపారు. విడాకులు ఇవ్వాలని తనను ఆయన బలవంతపెడుతున్నారని చెప్పారు. అయితే, ఆమెపై క్రూరంగా వ్యవహరించామన్న ఆరోపణలను శ్రీనివాసన్ తోసిపుచ్చారు. ఆమెను ఇంటి నుంచి గెంటివేయలేదని శ్రీనివాసన్ లాయర్ కోర్టుకు తెలిపారు. ఇద్దరు ఒకే ఇంట్లో కలిసి ఉంటే మున్ముందు వివాదం మరింత పెరిగిపోవచ్చునని లాయర్ వాదించగా.. ఆ వాదనను కోర్టు కొట్టిపారేసింది. -
సింధు విజయంపై అనుచిత వ్యాఖ్యలు చేసి..
న్యూఢిల్లీ: ఒలింపిక్స్ బ్యాడ్మింటన్లో రజత పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు సృష్టించిన పీవీ సింధుకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. సగటు అభిమాని నుంచి ప్రధాని, రాష్ట్రపతి వరకు అందరూ తెలుగుతేజాన్ని అభినందించారు. కాగా మలయాళీ అవార్డు దర్శకుడు సనల్ కుమార్ శశిధరన్ ఫేస్బుక్లో సింధు విజయాన్ని అవహేళన చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. 'సింధు విజయాన్ని ప్రతి ఒక్కరూ సంబరాలు చేసుకుంటున్నారు. దీన్ని అంతగా సెలెబ్రేట్ చేసుకోవడానికి ఏముంది?' అని ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. దీంతో పాటు సింధు విజయంపై మరో అభ్యంతరకరమైన కామెంట్ చేశాడు. దీనిపై నెటిజెన్లు తీవ్రంగా స్పందించారు. శశిధరన్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు చేశారు. నెటిజెన్ల నుంచి విమర్శలు రావడంతో శశిధరన్ వివరణ ఇచ్చాడు. తన వ్యాఖ్యలను సరిగా అర్థం చేసుకోలేదని చెప్పాడు. రియో ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన సింధుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలతో పాటు వివిధ రాష్ట్రాలు, క్రీడా సంఘాలు, పలువురు వ్యక్తులు భారీ పారితోషకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లో ఆమెకు ఘనస్వాగతం పలికారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వం సింధు, కోచ్ గోపీచంద్లను ఘనంగా సన్మానించాయి. -
దర్శకుడికి వార్నింగ్
కరాచీ: బాలీవుడ్ దర్శకుడు కబీర్ ఖాన్ కు పాకిస్థాన్ లోని కరాచీ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. లాహోర్ వెళ్లేందుకు బుధవారం కరాచీ ఎయిర్ పోర్టుకు వచ్చిన 'బజరంగీ భాయిజాన్' దర్శకుడికి వ్యతిరేకంగా కొంతమంది ఆందోళన నిర్వహించారు. భారత్ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాకిస్థాన్ లో భారత్ నిఘా సంస్థ 'రా' సాగిస్తున్న గూఢచర్యంపై ఎందుకు సినిమా తీయరని ఆందోళనకారులు నిలదీశారు. ఒక వ్యక్తి బూటు చేత్తో పట్టుకుని ఆవేశంతో ఊగిపోతూ కబీర్ ఖాన్ వెంట పడ్డాడు. పాకిస్థాన్ సైన్యానికి వ్యతిరేకంగా భారత్ కుట్రలు చేస్తోందని, దీన్ని సహించబోమంటూ పదేపదే హెచ్చరించాడు. కరాచీలో ఓ సదస్సులో పాల్గొనడానికి కబీర్ ఖాన్ పాకిస్థాన్ వచ్చారు. కబీర్ ఖాన్ తీసిన పాంటమ్' సినిమా పాకిస్థాన్ లో వివాదాస్పమైంది. ఈ సినిమా విడుదలపై లాహోర్ హైకోర్టు నిషేధం విధించింది. కరాచీ ఎయిర్ పోర్టులో కబీర్ ఖాన్ ను అడ్డుకోవడాన్ని మరో దర్శకుడు మధు భండార్కర్ ఖండించారు. ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. -
జయలలితపై హిజ్రా పోటీ
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం జయలలితపై సామాజిక కార్యకర్త అయిన ఓ హిజ్రా పోటీకి సిద్ధమైంది. సినీ దర్శకుడు సీమన్కు చెందిన ‘నామ్ తమిళార్ కచ్చి(ఎన్టీకే)’ పార్టీ తరపున ఆర్కేనగర్లో తాను పోటీచేస్తున్నట్లు 33 ఏళ్ల జి.దేవి చెప్పారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో ఆర్కే నగర్ నియోజకవర్గం సమస్యల వలయంగా మారిందని దేవి ఆరోపించారు. ఎన్నికల్లో గెలిస్తే నియోజకవర్గంలో ప్రజారోగ్యం, విద్యకు ప్రాధాన్యమిస్తానని చెప్పారు. సేలం జిల్లాలోని మగుదంచావడిలో పెరిగిన దేవి 12వ తరగతి వరకు చదువుకుంది. దేవి ప్రస్తుతం 200 మంది పేదవిద్యార్థుల చదువు కోసం తన వంతు సాయమందిస్తోంది. దాదాపు 60 మంది వృద్ధులు, అనాథల బాగోగులు తనే చూసుకుంటోంది. ‘ఎదురువారికి సాయం చేసేందుకు దేవుడు మనల్ని ఇలా ప్రత్యేకంగా సృష్టించాడు. నాకు పిల్లలు లేరు. అందుకే వీరందరికీ ఒక తల్లిగా బాధ్యత తీసుకున్నాను. జీవితాంతం సేవ చేస్తాను’ అని దేవి వ్యాఖ్యానించారు. -
సెన్సార్ బోర్డు సంస్కరణకు కమిటీ
శ్యామ్ బెనగల్ సారథ్యం న్యూఢిల్లీ: కొద్ది కాలంగా విమర్శల పాలవుతున్న సెన్సార్ బోర్డును సంస్కరించేందుకు ప్రసిద్ధ సినిమా దర్శకుడు శ్యామ్ బెనగల్ నేతృత్వంలో ఓ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దర్శకుడు రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా, సినీ విమర్శకురాలు భావన సోమయ, నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కౌన్సెల్ ఎండీ నైనా లత్ గుప్తా, సంయుక్త కార్యదర్శి(సినిమాలు) సంజయ్ మూర్తి, ప్రకటనా రంగంలో పనిచేసే పియూష్ పాండే కమిటీలో సభ్యులుగా ఉంటారు. కమిటీ పలు సూచనలతో రెండు నెలల్లోగా ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుందని ప్రభుత్వం తెలిపింది. జేమ్స్ బాండ్ సిరీస్లో తాజా చిత్రం ‘స్పెక్టర్’లో పలు సీన్లను సెన్సార్లో తొలగించడంపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం విదితమే. -
నేల మీద తారలు
దేడ్ కహాని - తారే జమీన్ పర్ అనగనగా ఓ భయంకరమైన అల్లరి అబ్బాయి. వాడికి అయిదేళ్లప్పుడు అన్నలు ఇసుకతో కట్టిన గుడిని కసిగా కూల్చేసి నాన్నతో దెబ్బలు తిన్నాడు. ఇంకో ఆర్నెల్ల తర్వాత స్కూల్లో మాస్టారు వేరే స్టూడెంట్ని కొడుతుంటే భయమేసి నెలరోజులు స్కూలుకెళ్లలేదు. ఇంట్లో బయల్దేరి, గుళ్లో కూర్చుని, ఆడుకుని, పడుకుని మళ్లీ స్కూలు వదిలే టైముకి ఇంటికెళ్లిపోయేవాడు. సినిమాలు చూస్తున్నప్పుడు నిద్ర రాదు. పుస్తకం తెరిస్తే పడుకునేవాడు. స్కూలు విషయం ఇంట్లో తెలిసి అమ్మచేత ఒళ్లంతా రక్తం వచ్చేలా దెబ్బలు తిన్నాడు. అర్ధరాత్రి ఏదో గుర్తొచ్చి వాళ్ల నాన్న తలగడ కింద చెయ్యి పెడితే, పామనుకుని భయపడిన నాన్న తెల్లారేదాకా కొట్టారు. మూడు రోజులు కష్టపడి వత్తిన వందల అప్పడాలు అర సెకనులో చిదిమి ముక్కలు చేసి అమ్మచేత కవ్వం విరిగేలా తన్నులు తిన్నాడు. బైటికెళ్తే రక్తం కారుతూ వచ్చేవాడు. చెప్పకుండా సినిమాలకి పోయేవాడు. ఇంట్లోవాళ్లకి వాడొక పీడకల. వాడు మాత్రం అందమైన కలలు కంటూ పెరిగాడు. రాఘవేంద్రరావులా, దాసరిలా, విశ్వనాథ్లా, బాపులా, బాలచందర్లా, జంధ్యాలలా, సింగీతంలా, మణిరత్నంలా అవ్వాలని, అవుతానని కలలు కనేవాడు. చూసిన సినిమా కథ బాగా చెప్పేవాడు. ఎవరో ఒకరికి చెప్పకుండా నిద్రపోయే వాడు కాదు. ఎక్కువ బలైంది వాళ్లమ్మే పాపం. కాలేజీలో చదువు ఎగ్గొట్టడానికి కల్చరల్ కాంపిటీషన్స్కి వెళ్లేవాడు. వెళ్లగా వెళ్లగా అనుభవం వచ్చి, ప్రైజులు తేవడం మొదలెట్టాడు. ప్రైజులు తేగా తేగా కాన్ఫిడెన్స్ వచ్చి డిగ్రీ అవ్వగానే సినిమాల్లోకి దూకేశాడు. ఈదగా ఈదగా అనుభవం వచ్చి ‘మనసంతా నువ్వే’ సినిమా తీసి దర్శకుడైపోయాడు. ఇది బాల్యం. పెరిగి పెద్దయిన ప్రతి ఒక్కరికీ ఇలా ఒక బాల్యం ఉంటుంది. అది అందరికీ చాలా అందంగా ఉంటుంది. థాంక్ గాడ్... అప్పట్లో ఇంటర్నెట్లు, గూగుల్ సెర్చ్లు, అతిగా నాలెడ్జ్లు లేవు, అనవసరమైన అవేర్నెస్లు లేవు. లేకపోతే నన్ను కూడా ఏ ‘డిస్లెక్సిక్’ పేషెంట్గానో భావించి, మా పేరెంట్స్ ఏ స్పెషల్ చైల్డ్ గానో ట్రీట్మెంట్ ఇప్పించేస్తే, ఎటో పారిపోయేవాణ్ని, ఏదో అయిపోయే వాణ్ని. కోపం వస్తే నాలుగు దెబ్బలేసినా, ప్రేమను పంచి, అందరు పిల్లల్లానే మామూలుగానే పెంచేశారు. కాబట్టి సమాజంలో ఉండగలిగాను. అనుకున్నది చేయగలిగాను. ఇది నా కథ. ఇలా మనలో అందరికీ ఒక కథ ఉంటుంది. దాని నుంచి ఈ రోజున మనం తీసుకోగలిగిన స్ఫూర్తి ఉంటుంది. నేర్చుకోవలసిన పాఠం ఉంటుంది. చిన్నప్పుడు చదువంటే ఉండే భయం నుంచి, జీవితంలో పైకి రావడమనే జయం వరకు మనని, ప్రతి ఒక్కరినీ ఏదో ఒక పాత్ర, ఒక సంఘటన, ఒక తల్లో, తండ్రో, స్నేహితుడో, గురువో, అంకులో, ఆంటీయో, తాతగారో, నానమ్మో, అమ్మమ్మో... ఎవరో ఒక వ్యక్తి ప్రభావితం చేసి ఉంటారు. అలా కూడా ఎవరూ లేని వాళ్లకోసం ‘తారే జమీన్ పర్’ అనే ఒక సినిమా ఉంది. మన నిన్నటికి, మన రేపటికి మధ్య సంధి కాలం చీకటైతే, అందులో వెలుగునిచ్చే నక్షత్రం... ‘తారే జమీన్ పర్’. దర్శీల్ సఫారీ అనే ఎనిమిదేళ్ల కుర్రాడు ‘ఇషాన్ నందకిషోర్ అవస్థీ’గా జీవించిన చిత్రం. విపిన్శర్మ, టిస్కాచోప్రా మన అమ్మానాన్నలే అనిపించేంత సహజంగా నటించి, అలరించిన చిత్రం. ఆమిర్ఖాన్ రామ్శంకర్ నికుంభ్గా అత్యద్భుతంగా ఇమిడిపోయి, నటుడిగా ఎదిగిపోయిన చిత్రం. ‘తారే జమీన్ పర్’ ఆమిర్ఖాన్కి దర్శకుడిగా మొదటి చిత్రం. ఈ సినిమా కథ గురించి రాసే ముందు ఈ సినిమా పుట్టుక వెనుక ఉన్న కథని కచ్చితంగా చెప్పాలి. బాలీవుడ్లో దీపా భాటియా అనే ఫేమస్ ఫిమేల్ ఎడిటర్ ఒకామె ఉన్నారు. ఆమె భర్త అమోల్ గుప్తే కథలు రాసుకుంటూ, సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ, దర్శకత్వ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూ తిరుగుతుండేవాడు. ఒకరోజు దీపా భాటియా ప్రపంచ ప్రసిద్ధి చెందిన దర్శక శ్రేష్టుడు ‘అకిరా కురసోవా’ బాల్యం గురించి చదువుతూ... అంతటి మేధావి, దర్శకుడూ చిన్నప్పుడు స్కూల్లో చాలా పూర్ స్టూడెంట్ అని, చదువనే చట్రంలో ఇమడలేక ఇబ్బంది పడ్డాడని తెలిసి, వాళ్లాయనతో దీనిమీద ఒక సినిమా కథ తయారు చేయమంది. భారతీయ బాల్య విద్యా నేపథ్యానికి అకిరా కురసోవా జీవితాన్ని తర్జుమా చేసే ప్రయత్నంలో అమోల్ గుప్తే చాలా రీసెర్చ్ చేశాడు. అందులో ఆయనకి ప్రపంచంలో చాలామంది గొప్పవాళ్లు, ఏదో ఒక రంగంలో ప్రపంచాన్ని శాసించినవాళ్లు కూడా చిన్నప్పుడు ఒక ఫిక్స్డ్ కరిక్యులమ్లో, డిసిప్లిన్డ్ స్టడీస్లో ఫెయిలయ్యారని తెలిసింది. ఆ రీసెర్చ్ లోంచి డిస్లెక్సియా అనే వ్యాధి పిల్లలకి అక్షరాలని గుర్తుండనివ్వదని తెలిసింది. అన్ని విషయాల్లోనూ తెలివిగా ఉండే మూడో తరగతి పిల్లాడు యాపిల్ స్పెల్లింగ్ కూడా గుర్తుంచుకుని సరిగా రాయలేక పోతే, దానికి కారణం ఈ వ్యాధి అని అర్థమైంది. అలా ‘తారే జమీన్ పర్’ కథ పుట్టింది. దానికి సరిగ్గా సరిపోయే కుర్రాడి కోసం వెతుకుతూ, షమ్యక్ దేవర్ సమ్మర్ డ్యాన్స్ క్లాస్లో పిల్లల్ని చూస్తుంటే... దర్శీల్ సఫారీ అనే కుర్రాడు దొరికాడు. చదువుతో నానా అవస్థలు పడే ఇషాన్ అవస్థి పాత్రకు అతడు ఫిక్స్ అవ్వగానే... టీచర్ పాత్రధారి అయిన హీరో కోసం, నిర్మాత కోసం వెతకనారంభించాడు. ముందు హీరోని ఒప్పిస్తే నిర్మాత దొరుకుతాడు కాబట్టి అక్షయ్ఖన్నాని కలిసి కథ చెప్పాడు. కథ వల్లో, అమోల్ గుప్తే దర్శకత్వం వల్లో అక్షయ్ఖన్నా ఒప్పుకో లేదు. అప్పుడు ఆమిర్ఖాన్ని కలిశాడు. తన బాల్యంలో ఆర్ట్ క్లాస్ టీచర్ అయిన రామ్దాస్ సంపత్ నికుంభ్ని స్ఫూర్తిగా తీసుకుని అమోల్ గుప్తే హీరో పాత్రని రూపొందించాడు. అందుకే ఆ పాత్రకి రామ్శంకర్ నికుంభ్ అని పేరు పెట్టాడు. మంచి కథలకి, మంచి పాత్రలకి ఎప్పుడూ ముందుండే ఆమిర్ఖాన్ నికుంభ్ పాత్ర చేయడానికి ఒప్పుకున్నాడు. తనే నిర్మాతగా, అమోల్ గుప్తేకి దర్శకత్వం అవకాశం ఇచ్చాడు. నెలలు గడుస్తున్నాయి. కథ, మాటలు బావున్నా... స్క్రీన్ప్లే, దర్శకత్వం తేడాగా ఉన్నాయని ఆమిర్కి అనుమానం వచ్చింది. అమోల్ వర్క్ అంతా ఎగ్జిక్యూట్ చేస్తున్నా కానీ, క్రియేటివ్గా కాయితం నుంచి వెండితెర మీదకి ఎక్కించే విషయాల్లో ఏదో లోపిస్తోందని ఆమిర్ అనుమానపడ్డాడు. దాంతో అమోల్ని దర్శకుడిగా వద్దన్నాడు. అయితే వేరే దర్శకులని వెతకడం, వాళ్లు దానిని ఎక్కించుకుని తెరకెక్కించేలోపు దర్శీల్ పెరిగి పెద్దయిపోతుండడం - ఇవన్నీ ఎందుకని ఆమిర్ఖాన్ స్వయంగా మెగాఫోన్ పట్టేసుకున్నాడు. తనే నిర్మాతగా, దర్శకుడిగా, నటుడిగా బాధ్యతలు భుజానేసుకుని అమోల్ గుప్తేని క్రియేటివ్ డెరైక్టర్గా పెట్టి ‘తారే జమీన్ పర్’ని మనకందించాడు. ప్రేక్షకులేం తక్కువ తినలేదు. 12 కోట్ల బడ్జెట్కి 89 కోట్లు తిరిగి ఇచ్చారు. ఇంత మంచి చిత్రం తీసిచ్చిన ఆమిర్ ఖాన్కి, కాసులతో పాటు అవార్డుల పంట కూడా పండింది. భారతదేశం తరఫున ఆస్కార్ బెస్ట్ ఫారిన్ ఫిల్మ్గా నామినేట్ కూడా అయ్యింది. చెన్నైలో ప్రతి యేటా ప్రపంచ వ్యాప్తంగా మొదటి సినిమా దర్శకుడికి ఇచ్చే ‘గొల్లపూడి శ్రీనివాస్ అంతర్జాతీయ అవార్డు (తన మొదటి చిత్రానికి దర్శకత్వం వహిస్తూ షూటింగ్లో ప్రమాద వశాత్తూ మరణించిన తన కుమారుడు శ్రీనివాస్ జ్ఞాపకార్థం ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావుగారు ఇరవై ఏళ్లుగా ప్రతి యేటా ఎంతోమంది అంతర్జాతీయ దర్శకులకి ప్రోత్సాహంగా ఈ అవార్డు ఇస్తున్నారు)’ ఆ యేడు ఆమిర్ఖాన్కి దక్కింది. ఇదీ... ‘తారే జమీన్ పర్’ తెర వెనుక కథ. చదవలేక పోవడం నిర్లక్ష్యం కాదు, వ్యాధి అని చెప్పే ఒక ఉపాధ్యాయుడు నిరాశా నిస్పృహలకు లోనైన చిన్నారిని ఉత్తేజితుల్ని చేసి ఆ స్కూల్కి చిన్న సైజు హీరోని చేస్తాడు. ఇది పిల్లలు చూడాల్సిన సినిమా మాత్రమే కాదు. పిల్లలున్న తల్లిదండ్రులు, టీచర్లు అందరూ చూడాల్సిన చిత్రం. నిజానికి ఇది ఒక కమర్షియల్ చిత్రం కాదు. కంపల్సరీగా ప్రతి స్కూల్లోనూ చూపించాల్సిన పాఠం. ముఖ్యంగా ఎలిమెంటరీ స్కూలు స్థాయిలో ఉండాల్సిన పాఠం. ఆమిర్ఖాన్ నటుడిగా, నిర్మాతగా ఎన్నో మంచి చిత్రాలిచ్చాడు. ఇక దర్శకుడిగా మారి ఇచ్చిన ‘తారే జమీన్ పర్’ గురించి చెప్పుకోవాల్సిన పనే లేదు. అదొక ఆణిముత్యం. ర్యాంకుల కోసం పిల్లల నెత్తిమీద మోయలేని బరువును పెట్టేసి, ఒత్తిడికి లోను చేసి, వారి ఆత్మహత్యలకు సైతం కారణమవుతోన్న తల్లిదండ్రులందరికీ గొప్ప సందేశాన్నే ఇచ్చాడు ఆమిర్ ఈ చిత్రం ద్వారా. పిల్లలు వెనుకబడటానికి వాళ్లు మొద్దులు కావడం కారణం కాదని, ఏదైనా సమస్య ఉందేమో చూడమని, ఏదైనా టాలెంట్ ఉంటే వెలికి తీసి వాళ్లని గొప్పవాళ్లను చేయమని కొత్త పాఠం చెప్పాడు. ఎంత గొప్ప పాఠమిది! పిల్లలు... నేలమీది తారలు. వాళ్లని బాగా పెంచితేనే సమాజం బావుంటుంది. -
'ఆ సీన్ నా జీవితంలో అత్యుత్తమమైనది'
ముంబై : ముంబై మహానగరంలో దారుణ మారణహోమం సృష్టించిన 26/11 దాడుల్లో మృతి చెందిన వారికి ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మ ఘనంగా నివాళులర్పించారు. ఈ మారణహోమంపై ఆయన దర్శకత్వంలో 'ది అటాక్స్ ఆఫ్ 26/11' చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని సన్నివేశాలను వర్మ బుధవారం గుర్తు చేసుకున్నారు. ఈ చిత్రంలోని నానా పటేకర్ పోలీస్ ఉన్నతాధికారిగా నటించారు. అయితే ఈ దాడుల్లో సజీవంగా దొరికిన కసబ్ను మృతి చెందిన సహచర తీవ్రవాదుల మృతదేహాల వద్దకు నానా పటేకర్ తీసుకు వెళ్తాడు. ఆ క్రమంలో కసబ్కు నానా పటేకర్ కొన్ని ప్రశ్నలు సంధిస్తాడు. కాగా ఆ సన్నివేశంలో పోలీస్ ఉన్నతాధికారి పాత్రలో నానా ఒదిగిపోయిన తీరు... భావోద్వేగానికి గురయ్యే సన్నివేశాలు చాలా సహజ సిద్ధంగా ఉన్నాయని వర్మ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అంతేకాదు... తాను ఇప్పటి వరకు చూసిన సినిమాలన్నీంటిలో నానా పటేకర్ నటించిన ఆ సన్నివేశం అత్యుత్తమైనదని వర్మ కితాబు ఇచ్చారు. ఈ మేరకు వర్మ ట్విట్టర్లో బుధవారం తెలిపారు. 2008, నవంబర్ 26న 10 మంది పాకిస్థాన్ తీవ్రవాదులు సముద్ర మార్గం ద్వారా ముంబై నగరంలో ప్రవేశించి... తాజ్ హోటల్తోపాటు పలు అత్యంత రద్దీ ప్రాంతాలను ఎంచుకుని విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 166 మంది మరణించగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే ఈ దాడుల్లో కోట్లాది రూపాయిల ఆస్తి నష్టం జరిగిన సంగతి తెలిసిందే. -
బి.నర్సింగరావు తల్లి కన్నుమూత
హైదరాబాద్ : ప్రముఖ సినీ దర్శకుడు బి. నర్సింగరావు తల్లి చంద్రకళ గురువారం తెల్లవారుజామున మరణించారు. మెదక్ జిల్లా గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్లోని నివాసంలో ఆమె కన్నుమూశారు. ఆమె అంత్యక్రియలు ఈరోజు ఉదయం 11.00 గంటలకు ప్రజ్ఞాపూర్లో జరుగుతాయని కటుంబ సభ్యులు తెలిపారు. -
యెద యెదలో రగిలిన స్ఫూర్తి
దేడ్ కహానీ - రంగ్ దే బసంతీ ‘‘మరగకపోతే రక్తం కాదది, నీటితో సమానం. దేశానికి పనికిరాకపోతే యువత కాదది, నిర్వీర్యం’’ అని అర్థం వచ్చేలా టైటిల్ పడింది. చాలా అర్థవంత మైన సినిమా చూడబోతున్నానని అర్థం అయ్యింది. గంటా ఇరవై ఐదు నిమిషాల ఇరవై ఐదు సెకెన్ల దగ్గర వచ్చే ఒక సన్నివేశం - అనూహ్యమైనది. అది రాసిన రచయితలకి, తీసిన దర్శకుడికి, అభిమాని కానివాడు ప్రేక్షకుడే కాడు. భారత స్వాతంత్య్ర సమరయోధుల్ని చంపే బాధ్యతని నిర్వర్తిస్తున్న బ్రిటిషు పోలీసు అధికారి చర్చ్కి వెళ్లి జీసస్ దగ్గర ఏడవడం, తను చంపుతున్న సమర యోధులు చిరునవ్వుతో దేశం కోసం ప్రాణాలని అర్పిస్తుంటే, వారికి అతను అభిమానిగా మారడం... ఒక పక్క పాలకుల ఆజ్ఞ, మరోపక్క మానవ హృదయం - ఈ సంఘర్షణని ఇంత అందంగా చూపించిన సినిమా, ఈ నేపథ్యం ఉన్న కథల్లో ఎక్కడా లేదు. స్వాతంత్య్ర పోరాట నేపథ్యంలో తీసిన ప్రతి సినిమా దేశభక్తిని హీరోని చేసి పాలకుల్ని విలన్లని చేస్తుంది. అది సాధారణ కాన్ఫ్లిక్ట్. కానీ దేశభక్తికి విధి నిర్వహణకి సమానంగా అంతః సంఘ ర్షణని చూపించడం అసాధారణ కాన్ఫ్లిక్ట్. ఇప్పటివరకూ - స్వాతంత్య్ర పోరాట యోధుల కథలు పూర్తిగా పీరియాడికల్ సినిమాలుగానూ, ఈనాటి యువతరం కథలు పూర్తిగా మోడరన్గానూ అంటే తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం అన్నట్టు తీస్తూ వచ్చారు. కానీ మొదటి సారి ఆనాటి యువ దేశభక్తులైన హీరోల కథని, ఈనాటి అల్లరి చిల్లరి యువ హీరోల కథని కలిపి ఒకే కథగా అల్లుకో వడం, అందుకు సూత్రధారిగా ఒక బ్రిటిష్ అమ్మాయి పాత్రనే సృష్టించడం... నిజంగా అద్భుతమైన ఆలోచన. ఆ ఆలోచనకి ఫలితమే... ‘రంగ్ దే బసంతి’. దాన్ని నిర్మించి, దర్శకత్వం వహించిన వ్యక్తి రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా. హీరోగా నటించింది... తన పాత్ర చుట్టూ కథ, కథనాలు పరిభ్రమించాలనుకోకుండా, మంచి కథ, కథనాలతో ప్రేక్షకులకు నచ్చేలా సినిమా ఉండాలనుకునే ఆమిర్ఖాన్. నాకు తెలిసి... ఇలా ఆలోచించి సినిమాలు ఓకే చేసే హీరో ఇండియాలో ఎవరైనా ఉన్నారు అంటే అది ఆయన ఒక్కరే. ఇలాంటి కథలు చేయడానికి అంగీకరించే పెద్ద హీరోల్ని అభినందించి తీరాలి. ఈ దశాబ్దన్నరలో బాలీవుడ్లో మూసధోరణి పోయి ప్రేక్షకులు ఆదరించేలా మంచి కథలు వస్తున్నాయి. ఈ విషయం ఒక్కో సినిమా వచ్చి వెళ్తున్నప్పటికంటే, ఈ వ్యాసం రాయడం కోసం వరసగా ఆ సినిమాలు మళ్లీ చూస్తున్నప్పుడు బాగా తెలుస్తోంది నాకు. ఇక ‘రంగ్ దే బసంతి’ విషయానికి వద్దాం. న్యూఢిల్లీలో నివాసముంటున్న పంజాబీ కుటుంబంలో పుట్టిన రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా యురేకా ఫోర్బ్స్ కంపెనీలో వాక్యూమ్ క్లీనర్లు అమ్మేవాడు. తర్వాత ఒక అడ్వర్టయిజింగ్ కంపెనీని పెట్టి కోక్, పెప్సీ, టయోటా, బీపీఎల్ కంపెనీలకి యాడ్స్ తీశాడు. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్తో ‘అభీ బేబీ’ అనే మ్యూజిక్ వీడియో తీశాడు. 2001లో అమితాబ్ ప్రధాన పాత్రలో, మనోజ్ బాజ్పాయ్ సహనటుడిగా ‘అక్స్’ అనే సినిమా తీశాడు. అక్స్ అంటే రిఫ్లెక్షన్. ఈ దర్శకుడు తన ఆలోచనలని తెరమీదకి సరిగా రిఫ్లెక్ట్ చేయలేడు అనిపించింది ‘అక్స్’ చూసి. కానీ అమితాబ్కి అవార్డుల పంట పండింది. అర్థం కాకపోతే అవార్డులెక్కువొస్తాయేమో అనుకున్నాను నా ఇగోని శాటిస్ఫై చేసుకోడానికి. ఆ తర్వాత రంగ్ దే బసంతి, భాగ్ మిల్కా భాగ్ సినిమాలు తీశాడు మెహ్రా. అంతే... ఫిదా అయిపోయాను అతడి టాలెంట్కి. తను రిటైరైపోయినా ఈ రెండు సినిమాలూ చాలు తనని తరతరాలు గుర్తు పెట్టుకోడానికి. నేను, నాలాంటి చాలామంది దర్శకులు జీవితాంతం టైర్ అవుతూనే ఉండాలి తన సినిమాల స్థాయిని అందుకోడానికి. అందుకే ‘భాగ్ మిల్కా భాగ్’ చూసిన తర్వాత నా ఫేస్బుక్లో పెట్టాను- ‘‘సిగ్గేస్తోంది, దర్శకుడైన పదేళ్లలో ఇలాంటి సినిమా ఒక్కటి కూడా ఇంకా తీయనందుకు’’ అని. దటీజ్ ఓం ప్రకాష్ మెహ్రా. మళ్లీ రంగ్ దే బసంతి విషయానికి వద్దాం. భారత స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో బ్రిటిష్ జనరల్గా ఇండియాలో పనిచేసిన మెకిన్లే మనవరాలు, స్యూ మెకిన్లే బ్రిటన్ టెలివిజన్ చానల్లో ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్గా పని చేస్తూ ఉంటుంది. తాతగారు రాసుకున్న డైరీ చదివితే అందులో భగత్సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి మహామహుల బలిదానాలు, వాటి పర్యవసానాలు ఉంటాయి. దానిని ఫిల్మ్ చేసి, ఆ కథల్ని ప్రజలకి చూపించాలని ఆశ పడుతుంది. చానల్ ఓనర్ని అడిగితే, అవి బ్రిటిషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయంటూ రిజెక్ట్ చేస్తుంది. దాంతో ఎలాగైనా తన తాతగారి డైరీ కథల్ని సినిమాగా తెరకెక్కిస్తానని చాలెంజ్ చేసి ఢిల్లీ వస్తుంది స్యూ. అక్కడ తన ఫ్రెండ్ సోనియాని (సోహా అలీ ఖాన్) కలుస్తుంది. సోనియా ఢిల్లీ యూనివర్శిటీలో చదువుతుంటుంది. ఆమె స్నేహితులు డీజే, కరణ్, అస్లమ్ఖాన్, సుఖీరామ్... నలుగురూ పరమ అల్లరి మూక. జీవితాన్ని బాగా ఎంజాయ్ చేయాలనుకునే ఆధునిక మెట్రో నగరాల యువతలాగ ఉంటారు. వీళ్ల స్నేహితుడు అజయ్సింగ్ రాథోడ్ ఆర్మీలో యుద్ధ విమానాల పైలట్. అతి కష్టమ్మీద తన భారత స్వాతంత్య్ర సమర వీరుల కథలో ముఖ్య పాత్రలకి ఈ అయిదుగురినీ ఒప్పిస్తుంది స్యూ. కానీ వాళ్లకి దేశమంటే లెక్కలేదు. నిన్న ఏం జరిగిందో తెలుసుకోవాలనే కుతూహలం లేదు. రేపు ఎలా ఉండాలో అన్న ఆలోచన లేదు. ఈరోజు బావుంటే చాలు... అంతే. అలాంటి వారిని నెమ్మదిగా దేశభక్తుల, అమరవీరుల పాత్రలు, ఆలోచనలు కొంచెం కొంచెం ప్రభావితం చేస్తాయి. వాళ్లెందుకు ప్రాణ త్యాగం చేసి చిరునవ్వుతో దేశం కోసం చనిపోయారు అన్న ఆలోచన నుంచి... మనం దేశం కోసం ఎలా బతకాలి అని ఆలోచించే స్థాయికి చేరుకుంటారు. అవినీతితో ఆవిరైపోయిన నీతిని సమాజంలో నింపడానికి కంకణం కట్టుకుంటారు. సరిగ్గా అదే సమయంలో వాళ్ల స్నేహితుడు అజయ్ మిగ్-21 యుద్ధ విమానం నడుపుతూ మరణించడం వాళ్లని కుంగదీస్తుంది. గత పదిహేను సంవత్సరాలలో 206 మిగ్ యుద్ధ విమానాలు కూలిపోయాయి, 78 మంది ఆర్మీ పైలట్లు అసువులు బాశారు, 1964 నుంచి మన దేశం వాడుతున్న మిగ్ విమానాల పనిముట్ల దిగుమతిలో జరుగుతున్న స్కామ్... ఈ విమానాలు నాసిరకంగా తయారై మన సైనికుల ప్రాణాలు పోవడానికి కారణం అని తెలుసుకున్న ఈ నలుగులూ తమ స్నేహితుడి మృతికి కారణమైన రక్షణ మంత్రిని చంపేస్తారు. తీవ్ర వాదులుగా ముద్రపడతారు. చివరికి ఆకాశవాణిలో నిజాన్ని నేరుగా ప్రజలకి వివరిస్తారు. అయినా పోలీసుల చేతిలో హతమౌతారు. పరాయివాడి పాలన కోసం అసువులు బాసిన వీరులలాగే చిరునవ్వులు చిందిస్తూ, వారి పాత్రలు తమలో నింపిన స్ఫూర్తిని మొత్తం యువతరానికి రేడియో ద్వారా పంచుతూ, స్వ పరిపాలనలో అవినీతి రాజకీయ నాయకుల రాక్షస ఘాతానికి బలై పోతారు. ఇది కథా? ఒక సినిమా కథా? కాదు... జీవితం. ఇది వాస్తవం. వ్యవస్థలో చెడుని మనం కూకటివేళ్లతో సహా పెకలించి మార్పును తేలేం. కానీ మనం మారడం ద్వారా వ్యవస్థలో మార్పు దానంతట అదే వస్తుంది. ఇవాళ కాకపోయినా రేపు. రేపు కాకపోతే ఎల్లుండి. మారాలన్న ఆలోచన మనకి ఉండాలి. అంతే. బాధ్యతారాహిత్యంగా ఉన్న యువతకి దిశానిర్దేశం చేసేవాడు వట్టి సినిమా దర్శకుడు మాత్రమే కాడు. సమాజానికి దార్శనికుడు కూడా. రాజ్కుమార్ హిరానీ తర్వాత ఆ కోవలోకి వచ్చే రెండో వ్యక్తి రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా అని కచ్చితంగా చెప్పొచ్చు. అతుల్ కులకర్ణి, సిద్ధార్థ, అతిథి పాత్రలో మాధవన్ చాలా బాగా నటించి మెప్పించారు. ఎ.ఆర్.రెహమాన్ పాటలు అత్యద్భుతం. నిజానికి ఆస్కార్కి రెండు ట్రాక్స్ నామినేట్ అయ్యాయి కూడా. ఇవన్నీ ఏమో కానీ, నేను మాత్రం వీలు చూసుకుని రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా దగ్గరకెళ్లాలి అని నిర్ణయించుకున్నా. సినిమాలు ఎలా తీయాలో నేర్చుకోవడానికి కాదు. అది నాకూ కాస్తో కూస్తో వచ్చు. అయినా వెళ్లాలను కుంటున్నాను. దేనికో తెలుసా? ఒక సినిమాని ఎలా ఊహించాలో, మనకొచ్చే కొన్ని వందల థాట్స్లో ఏ థాట్ని సినిమాగా మలచాలో, ఒక దర్శకుడు ఒక వస్తువులో మంచి కథ ఉందని ఎలా గ్రహి స్తాడో, అలాంటి కథని ఎలా ఎంచు కుంటాడో నేర్చు కోవడానికి. వచ్చే వారం మరో మంచి సినిమాతో కలుద్దాం. - వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు -
వెలుగు చాటు చీకటి
దేడ్ కహానీ - పేజ్ 3 జీవితపు పరుగుపందెంలో గమ్యం చేరాలనే తాపత్రయమే తప్ప పక్కన గాని, చుట్టూరా గాని జరుగుతున్న పరిణామాలు, మార్పులు ఏంటో ఎలా తెలుస్తుంది? * చూస్తే వెలుగే కనిపిస్తుంది. * కానీ దాని వెనుక అంతా చీకటే. * పేజ్ 3 చెప్పే వాస్తవాలేంటి? మనుషుల జనన, మరణాల మధ్య సమాజంలో మారుతున్న అంశాలెన్నో. జీవితపు పరుగుపందెంలో గమ్యం చేరాలనే తాపత్రయమే తప్ప పక్కన గాని, చుట్టూరా గాని జరుగుతున్న పరిణామాలు, మార్పులు ఏంటో ఎలా తెలుస్తుంది? కొంతమంది న్యూస్పేపర్ చదువుతారు. కొంతమంది నెట్లో అప్ టు డేట్ ఫాలో అవుతారు. ఇంకొంత మంది నాటకాలు, పుస్తకాల ద్వారా తెలుసుకుంటారు. ఆధునిక యుగంలో సమాజంలో వస్తున్న మార్పుల్ని కళ్లకి కట్టినట్టు చూపించే బలమైన సాధనం మాత్రం సినిమాలే. అవే మన న్యూస్పేపర్లు, మన పుస్తకాలు, మన ఇంటర్నెట్, అన్నీను. వాటిని బాగా చూపించే దర్శకులు దొరికితే ఆ సినిమాలు బాగా ఆడతాయి. లేకపోతే ఎలా వచ్చి, వెళ్లాయో తెలీకుండా వెళ్లిపోతాయి. సమాజాన్ని ప్రతిబింబించే సినిమా బాగా ఆడితే, ఎక్కువమంది ప్రేక్షకులు ఐడెంటిఫై అయ్యారు కాబట్టి, సమాజం అలా ఉందని అర్థం. లేదా ఎక్కువమంది అలా కోరుకోవడం వల్ల సమాజం అలా అవ్వబోతోందని అర్థం. అది సినిమాకి, సమాజానికి ఏళ్ల తరబడి అంతర్లీనంగా ఉన్న సంబంధం. వెండితెర మనం చదవక్కర్లేని న్యూస్ పేపరు. పెద్దగా చూసే టీవీ చానెల్. బ్రౌజ్ చెయ్యక్కర్లేని ఇంటర్నెట్. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే 2005లో ‘పేజ్ 3’ అని ఒక సినిమా రిలీజయ్యింది. అది ఇలాంటి సినిమానే. దాని దర్శకుడు మధుర్ భండార్కర్. సమకాలీన సమాజాన్ని ప్రతిబింబించే సినిమాలు మాత్రమే తీసే దర్శకుడు. చాందినీ బార్, పేజ్ 3, ట్రాఫిక్ సిగ్నల్, ఫ్యాషన్, హీరోయిన్ తదితర అద్భుత చిత్రాలు తీసిన వెండితెర న్యూస్ పేపర్/చానల్కి ఎడిటర్. 2005, జనవరి 21వ తేదీన విడుదలైన పేజ్ 3, కమర్షియల్గా సూపర్హిట్ సినిమాల కోవలోకి వచ్చేంత వసూళ్లు రాబట్టకపోయినా... ప్రేక్షకుల్ని మాత్రం వంద శాతం రీచ్ అయ్యింది. 2005 సంవత్సరానికి స్వర్ణకమలాన్ని గెల్చుకున్న జాతీయ ఉత్తమ చిత్రం ‘పేజ్ 3’. బెస్ట్ స్క్రీన్ప్లేకి, బెస్ట్ ఎడిటింగ్కి రెండు రజత కమలాలు గెల్చుకున్న చిత్రం పేజ్ 3. నాలుగు ఫిల్మ్ఫేర్ అవార్డులు గెల్చుకున్న చిత్రం కూడా. మాధవీశర్మ ముంబైకి బతుకు తెరువు కోసం వచ్చిన మధ్యతరగతి యువతి. దీపక్ సూరి అనే సంపాదకుడు తన పేపర్లో ఆమెకి జర్నలిస్ట్గా ఉద్యోగం ఇస్తాడు. ఆ పేపర్లో పేజ్ 3 సెలెబ్రిటీల న్యూస్ కవరేజ్ చేస్తుంది. సిటీలో ఉన్న గ్లామరస్ పీపుల్ తాలూకు నైట్ లైఫ్ కవర్ చేసి రాయడమే ఆమె జాబ్. మాధవి రూమ్మేట్ పెర్ల్ ఒక ఎయిర్హోస్టెస్. డబ్బున్న వ్యక్తినెవరినైనా చూసి పెళ్లి చేసుకుని సెటిలైపోవాలని కలలు కంటూ ఉంటుంది. గాయత్రి అనే మరో పేద యువతి హీరోయిన్ కావాలని కలలు కంటుంది. ఆమె కూడా మాధవి రూమ్మేట్గా చేరుతుంది. డబ్బు, స్టార్డమ్ రెండింటినీ కవర్ చేయాల్సిన జర్నలిస్ట్కి వాటికోసమే ఆరాటపడే రెండు పాత్రల్ని స్నేహితురాళ్లుగా తీసుకోవడం దర్శకుడిలోని గొప్పదనం. రోహిత్ అనే స్టార్ హీరో గాయత్రిని మోసం చేసి కడుపు చేయడం, ఆమెని అబార్షన్ చేయించుకోమని ఫోర్స్ చేయడంతో ఆమె ఆత్మహత్యకి ప్రయత్నించడం, ఆ ప్రయత్నంలో ఆమె కడుపులోని శిశువు కడుపులోనే చని పోవడం జరుగుతాయి. ఈ కథనాన్ని ప్రచురించి రోహిత్ని ఎండగడదామని ప్రయత్నించిన మాధవికి బాస్ నుంచి వ్యతిరేకత వస్తుంది. ఆ ఆర్టికల్స్ని చించేయడమే కాక, మాధవితో రోహిత్కి బలవంతంగా క్షమాపణలు కూడా చెప్పిస్తాడు బాస్. ఈలోగా పెర్ల్ ఒక ముసలి ధనవంతుడిని పెళ్లి చేసుకుని అమెరికా చెక్కేస్తుంది. మాధవి ప్రేమించిన స్నేహితుడు అభిజిత్ ‘గే’ అని తెలుస్తుంది. దాంతో చాలా బాధపడుతుంది. సెలెబ్రిటీ లైఫ్లో పైకి కనపడినంత సెలెబ్రేషన్ కాని, వైబ్రేషన్ కాని లోపల ఉండవని మాధవికి అర్థమౌతుంది. పేజ్ 3 నుంచి క్రైమ్ న్యూస్కి తన ఉద్యోగం మార్పించుకుంటుంది మాధవి. ఆ వృత్తిలో వినాయక్ అనే ఒక ఏసీపీ పరిచయమవుతాడు. ఆయన సహకారంతో చైల్డ్ ట్రాఫికింగ్ సమస్యని వెలుగులోకి తెచ్చి పిల్లల్ని మాఫియా నుంచి కాపాడుతుంది. గాయత్రి ఒక దర్శకుడి కోరిక తీర్చి, అతని తర్వాతి సినిమాలో హీరోయిన్గా అవకాశం సంపాదిస్తుంది. ఇటు మాధవి ఏమో క్రైమ్ న్యూస్ కూడా తన పత్రికలో వేయించలేకపోతుంది. దాంతో ఆమె ఉద్యోగం పోతుంది. ఒక జర్నలిస్ట్ కోణం లోంచి డబ్బు, పరపతి, తారాపథం వీటిని చూస్తే చీకటిగానూ, ఛండాలంగానూ మాత్రమే కనపడతాయి. కానీ వాటిని సాధించాలనే ఆశయం ఉన్న పాత్రల్ని, ఆ ప్రయత్నంలో వాటి కష్టాల్ని చూస్తే మానవీయ కోణంలో ఇవి మంచిగా కనపడతాయి. రెంటినీ బ్యాలెన్స్ చేశాడు దర్శకుడు - ఈ కథకి తను ఎంచుకున్న పాత్రలు, వాటి తీరుతెన్నుల ద్వారా. పోస్టర్ చూస్తే ఒక సాధారణమైన, యువతని ఆకర్షించడానికే తీసిన సినిమాలా కనిపిస్తుంది కానీ సినిమా చూస్తే మేధావి వంతమైన సినిమాలా కనిపిస్తుంది. ‘నైట్ లైఫ్’ అనే వెస్టర్న్ కల్చర్ భారతీయ సమాజం నలభై ఏళ్ల క్రితం నిద్ర పోతుండగా ప్రవేశించి వేళ్లూనుకుని, మర్రిచెట్టైపోయింది. ఇప్పుడు అన్ని ప్రధాన నగరాల్లోనూ డబ్బున్న వారి పిల్లలు, రాజకీయ నాయకులు, సెలెబ్రిటీలు, అందరూ ఈ నైట్ లైఫ్ అలవాటుదారులే. దాన్ని కథావస్తువుగా తీసుకోవడమే దర్శకుడి నైపుణ్యం. ప్రముఖ బెంగాలీ నటి, దర్శకురాలు అపర్ణాసేన్ కూతురు కొంకణాసేన్ శర్మ పేజ్ 3 చిత్ర కథానాయిక. ఈమె 2002లో నటించిన ‘మిస్టర్ అండ్ మిసెస్ అయ్యర్’ అనే బాలీవుడ్ ఆంగ్ల చిత్రం (తల్లి అపర్ణాసేన్ రచయిత్రి, దర్శకురాలు ఈ చిత్రానికి) కొంకణాసేన్కు జాతీయ ఉత్తమ నటి అవార్డు తెచ్చిపెట్టింది. పేజ్ 3తో పాటు అది కూడా చూసి తీరవలసిన చిత్రం. సహజమైన సినిమాలు ఇష్టపడే ప్రేక్షకుల కోసమే ఈ చిత్రాలు. వచ్చే వారం మరో మంచి సినిమాతో కలుద్దాం. -వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు -
అజరామర ప్రేమకావ్యం
* పాకిస్తానీ అమ్మాయి * హిందుస్తానీ అబ్బాయి * ఇరువురినీ ఒక్కటి చేసిందెవరు? తన తల్లితో ఒక కూతురు ‘‘అతను నన్ను కనీసం ముట్టుకోలేదమ్మా - కానీ, నేను నా సర్వస్వం అతనికి ఇచ్చేసి వచ్చాను’’ అంటుంది. ఆ కూతురి పాత్రని ప్రేమించ కుండా ఉండలేడు ఏ ప్రేక్షకుడూ! ప్రేమించిన అమ్మాయితో ఓ యువకుడు, ‘‘నీకోసం నవ్వుతూ ప్రాణాలు ఇవ్వగలిగిన వాడే నీకు సరైన భర్త’’ అంటాడు. ఆ యువకుణ్ని ఆ అమ్మాయితో సహా ప్రేమిం చకుండా ఉండలేడు ఏ ప్రేక్షకుడూ! ఇలాంటి పరిణతి చెందిన, పదునైన, నిజా యితీ కలిగిన పాత్రలున్న ప్రేమకథా చిత్రాన్ని ప్రతి ప్రేక్షకుడూ ప్రేమిస్తాడు. అందుకే ‘వీర్ - జారా’ని అందరూ ప్రేమించారు. కాసుల వర్షం కురిపించారు. ‘దిల్ తో పాగల్ హై’ వంటి సూర్హిట్ చిత్రం తీసిన యశ్చోప్రా ఏడేళ్ల తర్వాత మళ్లీ అదే షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కించిన అజరామర ప్రేమకావ్యం ‘వీర్-జారా’. జారాఖాన్ అనే పాకిస్తాన్ అమ్మాయికీ, వీర్ ప్రతాప్సింగ్ అనే భారతీయ అబ్బాయికీ మధ్య నడిచే హృద్యమైన ప్రేమకథ ‘వీర్-జారా’. చాలామంది అనుకుంటారు మొదటి చిత్రం తీసే యువకులే మంచి ప్రేమ కథలు తీయగలరని. నిజ జీవితం ఛాయలు వాళ్ల సీన్లలో, పాత్రల స్వభావాల్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి, ప్రేక్షకులు ఐడెంటిఫై అవుతారని. అది కొంతవరకే నిజం. పాతబడినకొద్దీ వైన్లో కిక్ ఎక్కువ అయినట్టు, పరిణతి చెందిన కొద్దీ నిజమైన దర్శకుడు ప్రేమకథా చిత్రాల్ని అత్యద్భుతంగా మలచగలడు. అందుకు యశ్చోప్రా ఒక ఉదాహరణ. ‘ప్రేమన్నది పుస్తకాల్లో ఉంటుంది, పాటల్లో, కవితల్లో ఉంటుంది, జీవితంలో ఉండదు పిచ్చిదానా’... ఇలాంటి మాటలు రాయాలంటే, వాటిని తెరమీద సరైన సందర్భంలో, సరైన పాత్ర ద్వారా చెప్పించాలంటే దర్శకుడికి చాలా పరిణతి, అనుభవం ఉండాలి. ఒక మంచి ప్రేమకథ మనిషి మనసులో అంతర్లీనంగా నిక్షిప్తమై ఉన్న భావోద్వేగాలని పైకి తెస్తుంది. అలా పొంగిన అనుభూతుల వెల్లువలో మనసు తడుస్తుంది. తెలియకుండానే ఆ తడి కంటి నుంచి బైటకొస్తుంది. అది ఆ కథలోని గొప్పదనం కావచ్చు. అందులోని పాత్రల స్వభావాలు ఎక్కడో మనకి తెలుసున్నవో లేదా మనమో కావచ్చు. ఏదో ఒక సంభాషణో, సంఘటనో, అభినయమో, ఆ కథ క్రియేట్ చేసిన ఆరానో, మనని ఆ కథకుడో, దర్శకుడో పెట్టిన మూడో - కారణం ఏదైనా కానీ, రియాక్షన్ మాత్రం కళ్లు చెమ్మగిల్లడమే. అలా కళ్లు చెమర్చేలా చేసే అతికొన్ని మంచి ప్రేమకథల్లో ‘వీర్-జారా’ ఒకటి. ‘బ్యూటీ లైస్ ఇన్ ది బిహోల్డర్స్ ఐస్’ అన్నారు. అలా అని నాకు నచ్చే ప్రతి సినిమానీ నా కళ్లతో చూడమని కాదు. ఎవరి కళ్లతో వారే చూడాలి, ఎవరి మనసు తడిని వారి కళ్లల్లో వారే చూడాలి. ఎవరి బుర్రతో వారే ఆలోచించాలి. పోస్టర్ చూడగానే గొప్ప అభిప్రాయం ఏమీ కలగని సినిమా ‘వీర్-జారా’. యశ్చోప్రా పేరొక్కటే నాకు పర్సనల్గా ఎగ్జయిట్ మెంట్. దానికో కారణం ఉంది. హీరో హీరోయిన్ల ప్రేమ సన్నివేశాలలో ఎప్పుడూ గాలి వాడతారు. జుత్తు ఎగురుతూ ఆర్టిస్టులు చాలా రొమాంటిక్గా ఉంటారు ఈ దర్శకుడి సినిమాలలో. వైడ్ షాట్స్లో స్లో మోషన్లో పరుగెత్తే ప్రతి సన్నివేశంలోనూ హీరోయిన్ల డ్రెస్లో పెద్ద పల్లూ ఉండేట్టు చూసుకుంటారు. ఆ పల్లూ ఎగరడం చాలా అందంగా ఉంటుంది. హీరోలని ఫుల్ ఫిగర్లో బోల్డ్గా చూపిస్తారు సరైన టైమింగ్లో. ఆ షాట్ చూడ్డానికి చాలా బావుంటుంది. ఇది 35 ఎం.ఎం.లో మాత్రమే కుదురుతుందని అనుకునే వాడిని. కానీ, యశ్చోప్రా మాత్రమే సినిమా స్కోప్లో కూడా కుదిరించారు. అన్నిటికన్నా భారతీయ సినిమాలలో ప్రేమకథలకి, కుటుంబ బంధాల నేపథ్యమున్న కథలకి సంగీతం ఎంత ఆయువుపట్టో, సంగీతాన్ని పాటగానో, బ్యాక్గ్రౌండ్గానో ఎప్పుడెలా వాడు కోవాలో యశ్చోప్రా సినిమాలు చూసి నేర్చుకోవాలి. వీటన్నిటినీ మించి ప్రపంచంలో ఏ దేశంలో షూటింగ్ చేసినా, ఈయన సినిమాల్లో భారతదేశం పట్ల, భారతీయత పట్ల విపరీతమైన గౌరవం, అభిమానం కనపడతాయి. అందులోనూ తన సొంత రాష్ట్రం పంజాబ్ని, అక్కడి జీవన విధానాన్ని, పాత్రల్ని చాలా ఇష్టంగా, ఎక్కువ మమకారంతో, అందంగా చూపి స్తారు. అందుకే యశ్చోప్రా సినిమా అన గానే ఒక్కసారైనా ఆ సినిమా చూస్తాను. ఆయన ఆలోచనల్ని, రొమాంటిసిజమ్ని ఆస్వాదిస్తాను. 2004లో వస్తున్న చిత్రాల కథాంశాల స్పీడుని బట్టి చూస్తే ‘వీర్- జారా’ చాలా స్లోగా కనపడు తుంది. కానీ, 1950ల నుంచి 2015 దాకా వచ్చిన అజరా మరమైన చిత్రాలన్నింటిలో ‘వీర్-జారా’ ఒకటిగా నిలుస్తుంది. 25 కోట్లు ఖర్చు పెడితే, 95 కోట్ల వరకూ వసూలు చేసిన చిత్రాన్ని స్లో అని ఎలా అంటాం? ‘సోల్’ ఉన్న చిత్రం అంటాం గానీ. వీర్ ప్రతాప్సింగ్ భారత ఆర్మీ ఆఫీసర్. ఆపదలో చిక్కుకున్నవారిని రెస్క్యూ ఆపరేషన్లు చేసి కాపాడటంలో దిట్ట. జారాఖాన్ గారాబంగా పెరిగిన పాకిస్తానీ ధన వంతుల పిల్ల. లాహోర్లో ఉంటుంది. తన నానమ్మ ఆఖరి కోరికగా ఆమె అస్థికలు పంజాబ్లోని సట్లెజ్ కాలువలో కలపాలని, ఇంట్లో చెప్పకుండా బస్సెక్కి బోర్డర్ దాటేస్తుంది. ఆ బస్సుకి యాక్సిడెంట్ అవుతుంది. వీర్ ఆమెని కాపాడతాడు. అతని సహకారంతో నానమ్మ చివరి కోరిక తీరుస్తుంది. తనకు సాయపడినందుకుగాను వీర్ని ఏదైనా ఒక కోరిక కోరుకోమంటుంది. దాంతో అతడు తనతో ఒకరోజు సరదాగా ఉండమంటాడు. మొదట తటపటా యించినా, మాట ఇచ్చింది కాబట్టి సరే అంటుంది. వీర్తో అతని ఊరెళ్తుంది. అతన్ని పెంచిన మామ సుమీర్ చౌదరి, అత్త సరస్వతీ కౌర్ల ఆప్యాయత, ఆతిథ్యం అన్నీ చూసి మురిసి పోతుంది. ఆ ఊళ్లో బాలుర పాఠశాల మాత్రమే పెట్టి బాలికలని చదువుకోకుండా వివక్ష చూపు తున్నారని, అది తప్పు అని క్లాస్ తీసు కుంటుంది. ఆ సలహా నచ్చడంతో సుమీర్ జారా పేరుమీదే బాలికల ఉన్నత పాఠ శాలకి శంకుస్థాపన చేస్తాడు. ఇవన్నీ జరిగే క్రమంలో జారా పట్ల ఆకర్షితుడవుతాడు వీర్. కానీ ఆ విషయం బయటపెట్టడు. అంతలో జారా వెళ్లాల్సిన సమయం దగ్గర పడుతుంది. ఆమెను తీసుకుని స్టేషన్కి వెళ్తాడు వీర్. జారా రైలు ఎక్కబోతుండగా ఒక యువకుడు రావడం, అతడు తనకు కాబోయే భర్త అని జారా వీర్కి పరిచయం చేయడం, వీర్ను వదిలి అతడితో ఆమె పాకిస్తాన్ వెళ్లిపోవడం జరుగుతుంది. తీరా పాకిస్తాన్ వెళ్ళాక వీర్ జ్ఞాపకాలు జారాని వెంటాడతాయి. తాను వీర్ని ప్రేమిస్తున్న విషయం ఆమెకు అర్థమవుతుంది. అతడి కోసం పరితపిస్తుంది. దాంతో జారా స్నేహితురాలు వీర్ని పిలి పించడం, జారా తల్లిదండ్రులు ఒప్పుకోక పోవడంతో వీర్ త్యాగం చేయడానికి సిద్ధపడి భారతదేశానికి తిరిగి ప్రయాణ మవుతాడు. సరిగ్గా అప్పుడే జారాకి కాబోయే భర్త వీర్ని అరెస్ట్ చేయిస్తాడు. వేరే పేరుతో అస్తిత్వం క్రియేట్ చేసి అతనిపై భారతదేశ గూఢచారిగా ముద్ర వేసి, శిక్ష పడేలా చేస్తాడు. దాంతో 22 సంవత్సరాలు వీర్ జైల్లోనే ఉండిపోతాడు. ఆ తర్వాత పాకిస్తాన్ లాయరు, మానవ హక్కుల సంఘం సభ్యురాలు అయిన సామియా సిద్ధిఖీ... వీర్ కేసును వాదించ డానికి సిద్ధపడుతుంది. చివరికి తనే వీర్, జారాలను కలుపుతుంది. ఈ చిత్రంలో ప్రతి మాటా ఒక రసగుళిక. ప్రతి పాటా ఒక ఆణిముత్యం. ప్రతి ఫ్రేమూ కన్నులపండుగ. ప్రేమించిన యువతి కోసం తన సర్వస్వాన్నీ త్యాగం చేసిన ప్రేమికుడిగా షారుఖ్ కంటతడి పెట్టించాడు. అతడిని కాపాడేందుకు తపించే న్యాయవాదిగా రాణీ ముఖర్జీ నటన అమోఘం. మొత్తంగా అవార్డుల్ని సాధించి, ప్రేక్షకుల కన్నుల్ని తడిపేసిన ‘వీర్-జారా’ ఓ గొప్ప ప్రేమకథగా బాలీవుడ్ చరిత్రలో మిగిలిపోయింది! - వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు హీరో హీరోయిన్ల ప్రేమ సన్నివేశాలలో ఎప్పుడూ గాలి వాడతారు. జుత్తు ఎగురుతూ ఆర్టిస్టులు చాలా రొమాంటిక్గా ఉంటారు ఈ దర్శకుడి సినిమాలలో. వైడ్ షాట్స్లో స్లో మోషన్లో పరుగెత్తే ప్రతి సన్నివేశంలోనూ హీరోయిన్ల డ్రెస్లో పెద్ద పల్లూ ఉండేట్టు చూసుకుంటారు. ఆ పల్లూ ఎగరడం చాలా అందంగా ఉంటుంది. - రాణీముఖర్జీ -
లబ్కి డబ్కి మధ్య జీవితకాలపు కథ
దేడ్ కహానీ - కల్ హో న హో 1999, డిసెంబర్ 31... అర్ధరాత్రి 12 గంటల తర్వాత ప్రపంచవ్యాప్తంగా వైటుకె వచ్చి కంప్యూటర్ వ్యవస్థలన్నీ కొట్టుకుపోతాయి. ఇంక 2000 నంచి టెక్నాలజీ ఉంటుందో, ఉండదో అన్నారు. కల్ హో న హో... ఉంది. ఇంకా బాగా పెరిగింది. 2012... ప్రళయం వచ్చి మొత్తం ప్రపంచమంతా కొట్టుకుపోతుంది అన్నారు. ఇంక మానవాళికి రేపన్నది ఉంటుందో, ఉండదో అన్నారు. కల్ హో న హో... ఉంది. ఇంకా బ్రహ్మాండంగా ఎదిగింది. 2003, నవంబర్ 28న షారుక్ఖాన్, ప్రీతిజింతా, సైఫ్ అలీఖాన్ లాంటి అగ్ర తారాగణంతో కరణ్ జోహార్ కథ, నిర్మాణంలో నిఖిల్ అద్వానీని దర్శకుడిగా పరిచయం చేస్తూ కల్ హో న హో... అన్నారు. ఆడింది. అద్భుతంగా ప్రజాదరణ పొందింది. లబ్... డబ్.. అనే గుండె చప్పుడులో లబ్కి డబ్కి మధ్య జీవితకాలపు కథ. ఇది ట్యాగ్లైన్కి తెలుగు అర్థం. ఎంత అద్భుతమైన ఆలోచన. ‘‘ఈ రోజు ఒక నవ్వు ఎక్కువ నవ్వు... ఈ రోజు ఒక ప్రార్థన ఎక్కువ చెయ్యి... ఈ రోజు ఒక కన్నీటి చుక్క ఎక్కువ త్రాగు... ఈ రోజు ఒక జీవితం ఎక్కువ జీవించు... ఈ రోజు ఒక కల ఎక్కువ కను... ఎవరికి తెలుసు... రేపుంటుందో, ఉండదో’’... కల్ హో న హో... ఈ చిత్రం అమన్ పాత్రధారి షారుక్ఖాన్, నైనా పాత్రధారి ప్రీతిజింతాతో అనే డైలాగ్... ఎంత అద్భుతమైన సంభాషణ. 1971లో వచ్చిన ‘ఆనంద్’ అనే హిందీ సినిమా రాజేష్ ఖన్నా, అమితాబ్ బచ్చన్, సుమితా శాన్యాల్ ప్రధాన పాత్రధారులుగా, హృషికేశ్ ముఖర్జీ రచన, దర్శకత్వం. ఈ ‘ఆనంద్’ కథనే స్ఫూర్తిగా తీసుకుని, 2003లో పూర్తిగా అమెరికా నేపథ్యంలో ఎన్నారైల మధ్య కథగా, భారతీయ ఆధునిక కుటుంబాల భావోద్వేగాలు కలగలిపి తీసిన చిత్రంలా ఉంటుంది ‘కల్ హో న హో’. సాధారణంగా సినిమాలలో కొన్ని అంశాలు చాలా బావుంటాయి. కొన్ని సాధారణంగా ఉంటాయి. ప్రతి మూమెంట్ని మనం ఆస్వాదించే సినిమాలు కొన్నే ఉంటాయి. వాటిలో ‘కల్ హో న హో’ ఒకటి. పాటలు వినగానే సినిమా చూడాలనిపించింది. సంగీత దర్శక త్రయం శంకర్-ఇషాన్-లాయ్ మహత్యం అది. పోస్టర్ చూడగానే సినిమా చూడాలనిపించింది. కరణ్ జోహార్ ప్రతిభ అది. సినిమా చూడగానే మళ్లీ చూడాలనిపించింది. కొత్త దర్శకుడు నిఖిల్ అద్వానీ గొప్పదనం అది. అమన్ పాత్రలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ నటన అమోఘం. కనీసం నాలుగైదుసార్లు కన్నీళ్లు పెట్టిస్తాడు. కొద్దిక్షణాల్లో చనిపోతాడనగా కూడా చిరునవ్వు నవ్విస్తాడు. ఈ సినిమా కచ్చితంగా చూసి తీరవలసిందే. ఇందులో ప్రీతిజింతా పాత్రకి ముందు కరీనా కపూర్ని ఎంచుకున్నార్ట. పారితోషికం దగ్గర తేడా వచ్చి, ఆమె ఈ అవకాశాన్ని వదులుకుంది. అది ప్రీతిజింతాని వరించింది. ఆమె చాలా తెలివిగా ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకొంది. రోహిత్ పాత్రలో సైఫ్ అలీఖాన్ నటన చాలా సహజంగా, ఉన్నతంగా, అంతకంటే ఎక్కువ సరదాగా ఉంటుంది. నైనా జీవితంలో చికాకులతో కోల్పోయిన చిరునవ్వుని వెలిగిస్తాడు పక్కింట్లోకి కొత్తగా వచ్చిన అమన్. అతనితో ప్రేమలో పడుతుందామె. కానీ ఆమె స్నేహితుడు రోహిత్కి నైనా అంటే ప్రేమని తెలిసి, తనకు ఆల్రెడీ ప్రియ అనే అమ్మాయితో (సోనాలీ బింద్రే) పెళ్లయిపోయిందని చెప్తాడు. బాధగా వెళ్లిపోతుంది నైనా. అమన్ తల్లి అడుగుతుంది అమన్ని - ‘‘నువ్వు కూడా ప్రేమించావ్ కదరా నైనాని. అబద్ధం ఎందుకు చెప్పావ’’ని. ‘‘నిజం చెప్పాలా అమ్మా. నా గుండె ఏ క్షణాన్నైనా ఆగిపోవడానికి సిద్ధంగా ఉందని నిజం చెప్పాలా? నాకు తనంటే ఇష్టమున్నా, రేపు అనేది నా జీవితంలో ఉందో లేదో తెలీకుండా ప్రతిరోజూ గడుపుతున్నానని నిజం చెప్పాలా’’ అని ఆవేదనగా అడుగుతాడు. ఈ నిజం ప్రేక్షకుడికి తెలియడమే ఇంటర్వెల్. ఇంక ద్వితీయార్ధంలో నైనా, రోహిత్లని కలపడమనే ప్రహసనాన్ని వీలైనంత కామెడీ జొప్పించి మెప్పించారు రచయితలు, దర్శకుడు, నటీనటులు. చివరికి ప్రేక్షకుడికి తెలిసిన నిజాలన్నీ పాత్రలకి కూడా తెలియడం, బాధలు, ఆవేదనలు, అమన్ చనిపోవడం, నైనా, రోహిత్ ఒకటవ్వడం... ఇవన్నీను! ఎన్నారై మార్కెట్ని పెంచిన ‘కభీ కుషీ కభీ గమ్’ తర్వాత అదే ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్పైన కరణ్ జోహార్ నిర్మించిన ఈ చిత్రం ఎన్నారై మార్కెట్ని కొత్త పుంతలు తొక్కించింది. క్షణ భంగురమైన మానవ జీవితానికి రేపన్నది ఉంటుందో లేదో తెలీదు కానీ, మంచి భారతీయ చలన చిత్రాల జాబితాలో ‘కల్ హో న హో’ ఎప్పుడూ ఉంటుంది. వచ్చేవారం సినిమాలు తీసే ఆలోచనలని అన్నింటినీ కకావికలం చేసి ఇలా తీయాల్రా అని మెదళ్లకి రిపేర్లు చేసిన దర్శక శ్రేష్టుడు రాజ్కుమార్ హిరానీ ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’తో మళ్లీ కలుద్దాం. -వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు -
ఓ తండ్రి మాయాజాలం
కోయీ మిల్ గయా దేడ్ కహానీ - కోయీ మిల్గయా అది 8, ఆగస్ట్, 2013 - ఎవరో... కలిశారు. కోయీ... మిల్గయా. ఆ ఎవరో పేరు జాదూ. ఒక అశక్తుడికి సర్వశక్తి యుక్తులూ సెకన్లలో రావడమే జాదూ అంటే - మాయాజాలం, మ్యాజిక్. కహో నా ప్యార్ హై... లాంటి సూపర్హిట్ సినిమాతో ఎంటర్ అయ్యాక, వరుసగా ‘ఫిజా’, ‘మిషన్ కాశ్మీర్’ లాంటి చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడటం, ‘కభీ కుషీ కభీ గమ్’ హిట్ అయినా అది హీరో షారుక్ ఖాన్కి, డెరైక్టర్ కరణ్ జోహార్కి మాత్రమే ప్లస్ అవ్వడం - దర్శకుడు, నిర్మాత, కథకుడు రాకేష్ రోషన్ని ఆలోచనలో పడేసింది. కొడుకు కెరీర్ని మళ్లీ తానే గాడిలో పెట్టాలనుకున్నట్టున్నాడు - ఇంకో ‘మ్యాజిక్’ చేశాడు - ఆ జాదూ పేరే ‘కోయీ మిల్ గయా’. ఫక్తు కమర్షియల్ అంశాలున్న సైన్స్ ఫిక్షన్ ఇది. ఈ కథ గురించి చెప్పాలంటే, 40 ఏళ్లు వెనక్కి వెళ్లి ఇంకో చిన్న కథ గురించి చెప్పుకోవాలి. టింగ్... టింగ్... టింగ్... (ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్స్) 1962లో విశ్వవిఖ్యాత భారతీయ దిగ్దర్శకుడు సత్యజిత్ రే తన ఫ్యామిలీ మ్యాగజైన్ ‘సందేశ్’ కోసం ‘ది ఎలియన్’ అనే కథ రాసుకుని ప్రచురించారు. మిస్టర్ ‘అంగ్’ అనే ఒక గ్రహాంతర వాసి, బెంగాల్లోని ఒక కుగ్రామంలో అంతరిక్ష విమానంలోంచి దిగి, ఆ పల్లెటూళ్లో ‘హాబా’ అనే ఓ అమాయకపు బాలుడిని కలవడం, ఆ అంతరిక్ష విమానాన్ని గ్రామస్థులు సరస్సులో వెలసిన దేవాలయంలా భావించి పూజించడం... ఇలాంటి ఇతివృత్తంతో రాసుకున్న కాల్పనిక కథ ఇది. హాలీవుడ్ తెరమీద మన కథ! తర్వాత రోజుల్లో ‘ది ఎలియన్’ కథని ఇండో-అమెరికన్ సంయుక్త నిర్మాణంలో కొలంబియా పిక్చర్స్ సంస్థ అప్పటి హాలీవుడ్ సూపర్స్టార్ మార్లన్ బ్రాండోని ప్రధాన పాత్రధారిగా, సత్యజిత్ రే దర్శకత్వంలోనే సినిమా తీద్దాం అనుకున్నారు. అనుకోని పరిస్థితుల్లో ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు. కానీ, ఆ కథని మైక్ విల్సన్ అనే వ్యక్తి తన పేరున రిజిస్టర్ చేసుకుని మార్కెట్ చేసుకోవడం ఆరంభించాడు. ఎక్కువ కాలం వేచి ఉండలేక, సత్యజిత్ రే భారతదేశానికి వచ్చేశారు. ఆ తర్వాత 1977లో ‘క్లోజ్ ఎన్కౌంటర్స్ ఆఫ్ ది థర్డ్ కైండ్’, 1979లో ‘ఎలియన్’, 1982లో స్టీవెన్ స్పీల్బర్గ్ దర్శకత్వంలో ‘ఈ.టీ.’ (ఎక్స్ట్రా టెరస్ట్రియల్) సినిమాలు వరుసగా వచ్చాయి. వాటన్నింటి మూలం భారతీయ దర్శక మేధావి సత్యజిత్ రే కథ ‘ది ఎలియన్’ అని హాలీవుడ్ పరిశ్రమ మొత్తానికి తెలుసు. కథా చౌర్యం కురిపించిన కాసుల ఖజానాలో కథ రాసిన ఒరిజినల్ రైటర్ సత్యజిత్ రేకి రూపాయి కూడా రాలేదు. కానీ, ఆ చిత్రాలకి భారతదేశం ఇచ్చిన రెవెన్యూ వాటి కలెక్షన్ల మొత్తంలో పాతిక శాతం పైనే. టింగ్... టింగ్... టింగ్... (ఫ్లాష్ బ్యాక్ ఎండ్స్) ప్రస్తుతంలోకొస్తే ఇంచుమించు అనే కథావస్తువుతో ‘హాబా’ అనే బాలుడి పాత్రని కొద్దిగా మార్చి, మనిషి ఎదిగినా మెదడు ఎదగని అమాయకుడి పాత్ర రోహిత్ మెహ్రాగా మలచి, తన కొడుకు హృతిక్ రోషన్ సైజుకి తగ్గట్టు పాత్రని కుట్టాడు తండ్రి, దర్శకుడు రాకేష్ రోషన్. రెయిన్ మ్యాన్, ఫారెస్ట్ గంప్, స్వాతిముత్యం తదితర చిత్రాల్లోని హీరో పాత్రల్లా హృతిక్ రోషన్కి స్టార్ హీరోగా మాత్రమే కాదు మంచి నటుడిగా కూడా పేరు, అవార్డులు తెచ్చిపెట్టింది ‘కోయీమిల్ గయా’. ఇంగ్లిష్ టేకింగ్కి భారతీయ మసాలా! గ్రహాంతర వాసి ‘జాదూ’, అమాయకుడైన రోహిత్ మెహ్రాని మామూలు యువకుడిగా మార్చడం, తన అతీత శక్తులతో రోహిత్, అతని స్నేహితులని హీరోలను చేయడం, వాళ్ల శత్రువుల్ని విలన్లను చేసి ఆటపట్టించి, ఓడించడం - ఇందులో భాగంగా ఆ హిల్స్టేషన్ కలెక్టర్ కూతురు నిషా (ప్రీతిజింతా), రోహిత్ ప్రేమలో పడటం, చివరికి ‘జాదూ’ని మానవ మృగాల బారినపడనివ్వకుండా రోహిత్ హీరోచితంగా పోరాడి, అతడిని గ్రహాంతర వాసులతో కలిపి సేఫ్గా స్పేస్షిప్ ఎక్కించి పంపించడం - రాజేష్ రోషన్ అద్భుతమైన పాటలతో, ఇంగ్లిష్ సినిమాలకి ఏ మాత్రం తీసిపోని విజువల్ ఎఫెక్ట్స్తో, భారతీయ ప్రేక్షకుడు కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్లు మసాలా రుచులు పర్ఫెక్ట్గా మేళవించి మిలీనియమ్ మొదలైన మూడేళ్లలో రెండో సూపర్ డూపర్ హిట్ నమోదు చేశారు తండ్రి రాకేష్, తనయుడు హృతిక్ రోషన్లు. తత్ఫలితంగా భారతీయుడి మేధస్సుకి (సత్యజిత్ రే) ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ పట్టం కట్టినట్టు కూడా అయింది. పోస్టర్ చూస్తే... ‘కోయీ మిల్ గయా’ పోస్టర్ చూడగానే, హృతిక్, ప్రీతిజింతాల అందమైన ప్రేమకథ కాబోసు అనిపించింది. రాకేష్ రోషన్ సినిమా కాబట్టి కహో నా ప్యార్ హై తర్వాత కచ్చితంగా ఇంకో ప్రేమకథే తీసుంటారు అనిపించింది. ఆడియో వినగానే అన్ని పాటలూ పక్కగా ప్రేమకథా చిత్రాల్లోని పాటల్లాగే ఉంటాయి. ‘కోయీ మిల్ గయా’ అనే టైటిల్ సాంగ్ పాడినది మన దక్షిణాది మధుర గాయని చిత్రగారు. ఆ పాట సూపర్హిట్. ‘ఇదర్ చలా మై ఉదర్ చలా’ పాట, ‘హైలా..’ పాట కూడా వినడానికి చాలా బావున్నాయి. థియేటర్లో కూచున్నాక, బ్రహ్మాండమైన సర్ప్రైజ్. అది గుర్తుతెచ్చుకోవాలన్నా, అనుభూతి చెందాలన్నా మళ్లీ ఓసారి చూడాల్సిందే. తల్లిగా రేఖ నటన మళ్లీ కనువిందు చేస్తుంది. ఇవాళ్టి ప్రముఖ హీరోయిన్ ‘హన్సిక’ ఇందులో బాల నటి. ఈ చిత్రం సాధించిన ఘనవిజయం బాలీవుడ్ తెరమీద హృతిక్ రోషన్ని ఆబాలగోపాలం మెచ్చే సూపర్ హీరోని చేసింది. ఈ చిత్రానికి రెండు సూపర్ హిట్ సీక్వెల్స్ చేసేలా ప్రేరేపించింది. హాలీవుడ్కి ఒక సూపర్మ్యాన్లా, బ్యాట్మ్యాన్లా మనకి ‘క్రిష్’ అనే ఓ వెండితెర సూపర్ హీరోని అందించింది. వచ్చేవారం...‘కల్ హో న హో’... రేపనేది ఉంటుందో ఉండదో - అని. ఆ ఆర్టికల్ కూడా ఇవ్వాళే రాసేయలేను కదా! కాబట్టి, రేపన్నది ఉందని నమ్మి, వచ్చే ఆదివారం కలుద్దాం. నమస్తే! మాటల్లో మెచ్చు తునకలు కొన్ని... * ‘ఓమ్’ అనేది పవిత్ర హిందూ నాదం. విశ్వంలో ఉన్న శబ్ద తరంగాలన్నీ ఒక్క ‘ఓమ్’లో ఉన్నాయి. * పిచ్చి అనేది ఒక గుణం - రోగం కాదు. కొంత మందికి షాపింగ్ పిచ్చి, కొంతమందికి తిండి పిచ్చి, కొంతమందికి సంగీతం పిచ్చి... ఇలా రకరకాల వ్యాపకాల పిచ్చి ఒక రకం అయితే, మామూలు కన్నా కొంచెం ఎక్కువో, తక్కువో ప్రతిస్పందించడాన్ని కూడా పిచ్చి అనుకోవచ్చు. * రకం పిచ్చికి సైకియాట్రిస్ట్లు మందు ఇస్తారు. నన్ను పిచ్చివాడన్నారు కదా! యస్. నేను పిచ్చివాడినే. మా అమ్మాయి ప్రేమలో పడిన పిచ్చివాణ్ని. * కంప్యూటర్ మనుషుల్ని తయారుచేయదు - మానవ మేధస్సే కంప్యూటర్స్ని తయారుచేసింది. మెదడు చేసేవన్నీ కంప్యూటర్ చేయలేదు. * ఎవరినీ చిన్నపిల్లలని చులకన చేయకండి సర్. ఆ పిల్లలే పెరిగి పెద్దవాళ్లవుతారు ఫ్యూచర్లో. * ఈ ప్రపంచం ప్రతి కొత్త విషయాన్ని ముందు తిరస్కరించింది. తర్వాతే అంగీకరించింది. * ఇలాంటి మంచి సంభాషణలతో పాటు గ్రహాంతర వాసులకి కూడా మంచి మనసు, ఆర్ద్రత, కన్నీరు, ఆనందం అన్నీ మనలాంటి భావాలే ఉంటాయని, ఈ తరం ప్రేక్షకులని ఒప్పించిన ఘనత దర్శకుడిది. - వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు -
స్నేహం... ప్రేమ కలిస్తే!
దేడ్ కహానీ - దిల్ చాహ్తా హై ‘‘మనసు కోతి లాంటిది. యుక్త వయసులో ఏది పడితే అది కోరుకుంటుంది. బుద్ధి... బుద్ధిగా ఉండమని ఎంత చెప్పినా మనసు వినదు. ఎప్పుడో విధి ఒక హెడ్మాస్టారిలా ఏదన్నా ఒక సంఘటన రూపంలో లాగి మనసుని కొట్టినప్పుడు బుద్ధిగా మాట వింటుంది. ఆ అనుభవాన్ని పాఠంలా అవలోకనం చేసుకుంటుంది. ఆ తర్వాత కూడా నిలబడేవే నిజమైన బంధాలు. అవే ఆ జన్మకి అందాలు.’’ ఈ వ్యాసం రాయడం కోసం ‘దిల్ చాహ్తా హై’ సినిమా మళ్లీ చూసినప్పుడు నాకిలా అర్థమైంది. కొన్ని సినిమాలు మొదటిసారి చూస్తే బావుండీ, బాలేక అటు ఇటుగా అనిపిస్తుంటాయి. తర్వాత వాటి రన్లో వాటి విలువ రోజురోజుకీ పెరిగి చివరికి అవి కల్ట్ ఫిల్మ్గానో, ఎపిక్ ఫిల్మ్గానో నిలుస్తాయి. దిల్ చాహ్తా హై... ఆ కోవకు చెందిన సినిమా. ‘షోలే’ రాసిన గొప్ప రచయితలు సలీమ్, జావేద్లలో జావేద్ అఖ్తర్ కొడుకు ఫర్హాన్ అఖ్తర్. చిన్నప్పట్నుంచీ సినిమా కుటుంబం, ఎగువ మధ్య తరగతి, ఆపైన సంపన్న జీవితాల సావాసం. ఆ యువత జీవనశైలితో ఓ కథ రాసుకున్నాడు. అది కూడా నెలన్నరపాటు అమెరికాలో హాలిడేకి వెళ్లినప్పుడు తన స్నేహితుల్ని కలిసి, వారితో సాగిన ముచ్చట్ల నుంచి, వారి ప్రేమకథల గురించి ఒక కథ రాసుకున్నాడు. అందుకే దిల్ చాహ్తా హై సినిమాలో నిజ జీవిత దర్పణం ఉంది. జీవం ఉంది. ప్రాథమిక హిందీ సినిమా కమర్షియల్ సూత్రాలన్నింటినీ బ్రేక్ చేసినా, కమర్షియల్గా హిట్ అవ్వగలిగిన ఆత్మ ఉంది. ఆకాష్, సమీర్, సిద్ధూల పాత్రల్లో ప్రతి మిలీనియం యువకుడూ తనని తాను చూసుకున్నాడు. పక్కింటి ఆంటీకి సైటు కొట్టడం నుంచి, నచ్చిన ప్రతి అమ్మాయినీ ప్రేమించేయడం నుంచి, అమ్మాయి కోసం ఫ్రెండ్స్తో కూడా దెబ్బలాడి దూరం అవ్వడం నుంచి, ప్రేమ, విరహం, బాధ, నవ్వులు, మళ్లీ కలుసుకోవడం, అనుభూతులు - అన్నింట్లోనూ ఐడెంటిఫై అవ్వక తప్పని బలమైన సహజ పాత్రలు సృష్టించాడు దర్శక రచయిత ఫర్హాన్ అఖ్తర్. అలాగే శాలిని, దీప, ప్రియ, పూజ, తార ఆంటీ - ఆధునిక భారతావని వనితల్లో ప్రతి ఒక్కరూ వీళ్లల్లో కనపడతారు. కన్ఫ్యూజన్లు, కోపాలు, ప్రేమలు, విరహాలు... అన్నీ. పోస్టర్ చూశాక: ఒక మోడర్న్ కామెడీ సినిమా విత్ మల్టిపుల్ క్యారెక్టర్స్ అనిపించింది. ఆమిర్ఖాన్, ప్రీతిజింతా కోసం, ‘దిల్ చాహ్తా హై’ అని మంచి టైటిల్ పెట్టాడు కాబట్టి ‘దిల్తో పాగల్ హై’లో సగం ఉన్నా చాలనుకుని వెళ్లాలనుకున్నాను. దర్శకుడి మొదటి సినిమా అనగానే కాస్త భయం ఉంటుంది మనసులో నాకెప్పుడూ - అదృష్టవశాత్తూ ఫర్హాన్ అఖ్తర్ రెండో సినిమా ‘లక్ష్య’కి భయపెట్టాడు కానీ, మొదటి సినిమా ‘దిల్ చాహ్తా హై’ని అద్భుతంగా కన్నా కొంచెం ఎక్కువ బాగా తీశాడు. నిజ జీవిత పాత్రల స్వభావాలు, కొన్ని సంఘటనలు స్నేహితుల నుంచి సేకరించినా, మరికొంత డ్రామాని, కథని షేక్స్పియర్ రాసిన ‘మచ్ ఎడో అబౌట్ నథింగ్’ నుంచి ప్రేరణ పొందినట్టు ఉంటుంది. మొదట ఆమిర్ఖాన్కి సిద్ధూ పాత్రని ఆఫర్ చేస్తే, ఆయన కథంతా విని ఆకాష్ పాత్ర నాకు బాగా దగ్గరగా ఉంది, ఆ పాత్రనే చేస్తానని ఎంచుకున్నార్ట. చాలాకాలం తర్వాత డింపుల్ కపాడియాని ఒప్పించి తార పాత్రకి తెచ్చుకోవడం ఫర్హాన్ కృషే. అలాగే అభిషేక్ బచ్చన్ మొదట సిద్ధూ పాత్రని ఒప్పుకుని, చివరి నిమిషంలో డ్రాప్ అయితే, ఆ అవకాశం అక్షయ్ఖన్నా దక్కించుకున్నాడు. అలా, ఆమిర్ఖాన్, సైఫ్ అలీఖాన్, అక్షయ్ఖన్నా స్నేహితుల పాత్రలకి సెట్ అయ్యారు. కథ గురించి చెప్పుకుంటే... ఆకాష్ ధనవంతుల బిడ్డ - ప్రేమ, దోమ లాంటి ఫీలింగ్స్ని నమ్మడు. ఫ్లర్ట్ చేసి వదిలేస్తుంటాడు ఏ అమ్మాయినైనా. సమీర్, సిద్ధూ ఎగువ, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన పిల్లలు. సమీర్ ఏ అమ్మాయినైనా ఇట్టే ప్రేమించేసి, అదే నిజమని నమ్మేస్తుంటాడు. సిద్ధూ చాలా ముభావి. స్వతహాగా పెయింటర్. వీళ్ల స్నేహంలో వచ్చిపోయే సబ్ క్యారెక్టర్లే హీరోయిన్లు, తల్లిదండ్రులు అందరూ. ఈ స్నేహం విడిపోయినట్టు మొదటి సీన్లో చెప్పి, అక్కణ్నుంచి వీళ్ల ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. విశ్రాంతి సమయానికి సిద్ధూ, ఆకాష్ ఒకరినొకరు తిట్టుకుని విడిపోతారు. సెకెండ్ హాఫ్లో వాళ్ల జీవితాల్లో వచ్చిన మార్పులు, ఒంటరిగా వాళ్లు తీసుకున్న నిర్ణయాలు, వాటి మంచీ చెడులు - చివరికి ముగ్గురూ కలవడం. ఇది కథ కాదు - కొందరి జీవితం. పాత్రల స్వభావాలకు అనుగుణంగా రాసుకున్న సంఘటనలు, వాటివల్ల ఉత్పన్నమయ్యే ఎమోషన్లు - కాబట్టి ఈ సినిమాలో పాత్రలు ఏడిస్తే మనకు ఏడుపొస్తుంది. పాత్రలు నవ్వితే మనకి నవ్వొస్తుంది. పాత్రలు దెబ్బలాడుకుంటే మనకి బాధేస్తుంది. పాత్రలు మళ్లీ కలుసుకుంటే మనకు కళ్లు చెమ్మగిల్లుతాయి. ఈ పాత్రలకి తోడు వాళ్ల స్టైలింగ్, వాళ్లు నివసించే ఇళ్లు, గదులు, ఫర్నిచర్, కాస్ట్యూమ్స్ అన్నీ అంతే న్యాచురల్గా, అంతే అందంగా ఉండటం చెప్పుకోదగ్గ విషయం. శంకర్, ఎహ్సాన్, లాయ్ సంగీతం ఈ చిత్రానికి ఆయువుపట్టు. పాటలెక్కడా అసందర్భంగా ఉండవు. సీన్ల మధ్యలో ఒక్కో సీన్లాగే పాట వచ్చి వెళ్తుంది - సాహిత్యం కూడా క్యారెక్టర్లు మాట్లాడుకున్నట్టే ఉంటాయి. డ్యాన్సర్లు, స్టెప్పులు లేకుండా సినిమాలో అన్ని పాటలూ తీయడం ఈ సినిమాకి క్లాస్ని ఆపాదించింది. ‘దిల్ చాహ్తా హై’ టైటిల్ ట్రాక్, జానెక్యూం లోగ్ ప్యార్ కర్తే హై, తన్హాయీ... అన్ని పాటలూ దేనికవే సూపర్హిట్లు. అన్నీ కథను ముందుకు నడిపించేవే. రవి.కె.చంద్రన్ ఛాయాగ్రహణం, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, చెన్నైలో సౌండ్ ఇంజినీరు మీడియా ఆర్టిస్ట్ శ్రీధర్... వీళ్లంతా భారతీయ మిలీనియం సినిమా మీద దక్షిణాది నుంచి బలమైన ముద్ర వేసిన సాంకేతిక నిపుణులు. జావేద్ అఖ్తర్ అన్ని పాటలూ యువతీ యువకుల మనోభావాల, భావాల సంఘర్షణలని, ఆనందాల్ని అక్షరీకరించాయి. పెట్టిన ప్రతి రూపాయికీ మరో రూపాయి లాభాన్ని తెచ్చి పెట్టిన చిత్రం ‘దిల్ చాహ్తా హై’. ఈ సినిమాలో మాటల్లాగ, ఇది ఆకాష్ మ్యాజిక్. ఇది ఫర్హాన్ అఖ్తర్ మ్యాజిక్ - వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు -
సినీ దర్శకుడి కార్యాలయంలో చోరీ
తమిళసినిమా; సినీ దర్శకుడి కార్యాలయంలో చోరీ జరి గింది.వివరాల్లోకెళితే స్థాపిక వలసరవాక్కంకు చెందిన తంజై కె సరవణన్.ఈయన జమున ఫిలింస్ ఇంటర్నేషనల్ పేరుతో చిత్ర నిర్మాణం నెలకొల్పి ప్రస్తుతం మిస్ పన్నాదీంగ అప్పరం వరుత్తపడువీంగ అనే చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు.తంజై కె సరవణన్ కార్యాలయం వలసరవాక్కం,వెంకటేశ్వర నగర్ 2వ వీధి లో ఉంది.కాగా శనివారం తంజై కె సరవణన్ తన కార్యలయంలో ఉండగా ఆయన వద్ద సహాయ దర్శకుడి గా పనిచేసే ప్రభాకర్ అనే వ్యక్తి కొందరు దుండగులతో వచ్చి తుపాకీ,కత్తులతో బెదిరించి 40 సవర్ల బంగారం *2లక్షల నగదు దోచుకెళ్లాడు. తంజై కె శరవణన్ బుధవారం పోలీసు కమిషనర్కు పిర్యాదు చేశారు. -
సరిహద్దులు దాటిన ప్రేమ కథ
15, జూన్ 2001 మార్నింగ్ షో ‘లగాన్’ చూసిన కళ్లతో వెంటనే వేరే ఏ సినిమా చూడటానికీ ఇష్టపడని కళ్లు... రెండ్రోజుల్లోనే ‘గదర్’ సినిమా ఏ థియేటర్లో ఆడుతోందా అని పేపర్లో వెతికాయి. అనిల్శర్మ అనే పేరు లేని డెరైక్టర్... ఏమాత్రం సదభిప్రాయం లేని సన్నీడియోల్... అమీషాపటేల్, అమ్రిష్పురి తప్ప ఆకట్టుకునే మొహంగానీ, పేరుగానీ పోస్టర్మీద లేని సినిమా అది. అయినా మౌత్ టాక్ చాలా బాగా వచ్చింది... రికార్డులు బద్దలుకొట్టే సినిమా అవుతుందని. అంతగా అందులో ఏముందా అనే కుతూహలం పెరిగింది. థియేటర్కి వెళ్లి చూస్తే బిగ్ సర్ప్రైజ్. ‘గదర్’ కథ చెప్పేముందు చరిత్రలో నిజంగా జరిగిన ఒక ప్రేమకథని చెప్పాలి. రెండో ప్రపంచ యుద్ధకాలంలో భారతదేశ సైనికుడు బూటాసింగ్, తెల్లదొర లార్డ్ మౌంట్బాటన్ వద్ద పనిచేస్తుండేవాడు. సిపాయి విభజన సమయంలో జైనాబ్ అనే ఒక ముస్లిం యువతిని కాపాడాడు, ప్రేమించాడు, పెళ్లాడాడు. విభజన తర్వాత ఆమెని కుటుంబ సభ్యులు పాకిస్తాన్ తీసుకెళ్లిపోయారు... బూటాసింగ్ని, అతని కూతురిని వదిలేసి. ఏమీ జరగనట్టే అక్కడ ఆమెకి మరో పెళ్లి చేసేశారు. ఈలోగా కూతురితో దొంగతనంగా పాకిస్తాన్లోకి చొరబడిన బూటాసింగ్... తన భార్య పెళ్లి చేసుకోవడం చూసి తట్టుకోలేక కూతురితో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. బూటా మరణించాడు. కానీ కూతురు బతికింది. ఇది భారత, పాకిస్తాన్ విభజన సమయంలో జరిగిన ప్రేమకథ. పై కథలో బూటాసింగ్ని తారాసింగ్ చేసి, సిపాయిగా కాకుండా ట్రక్ డ్రైవర్ని చేసి, కూతురి స్థానంలో కొడుకుని పెట్టి, జైనాబ్ పేరుని సఖీనాగా మార్చి, ఆత్మహత్యా ఉదంతాన్ని హీరోచితంగా మార్చి... సఖీనాని, కొడుకుని తీసుకుని తారాసింగ్ తిరిగి హిందుస్తాన్ చేరుకోవడంతో సుఖాంతం చేస్తే... అదే ‘గదర్: ఏక్ ప్రేమ్కథ’. ఎంత బండగా తీసినా, ఎన్ని బడ్జెట్ సమస్యలున్నా, ఒక ఎపిక్ కథని ‘పిక్’చర్గా మాత్రమే తీసినా... ఈ కథలో ఒక ఆత్మ ఉంది. ఒక సందేశం ఉంది. విభజన వల్ల పరస్పరం ద్వేషాగ్నులు రగిలిన హిందూ, ముస్లిముల వైరం మధ్య నలిగిన సున్నితమైన ప్రేమకి ప్రేక్షకులు కాసుల వర్షంతో అభిషేకం చేశారు. ‘షోలే’ తర్వాత భారతదేశంలో సింగిల్ థియేటర్స్లో అత్యధిక టికెట్లు అమ్ముడైన రెండో సినిమాగా ‘గదర్’ రికార్డు సృష్టించింది. ‘వెన్ ద లాజిక్ ఎండ్స్, దెన్ డ్రామా స్టార్ట్స్’ అన్న పాత సినీసూక్తికి నిర్వచనంలా ఉంటుంది ‘గదర్’. ఇన్స్టెంట్గా డ్రామా వస్తుంది. కన్నీళ్లు వస్తాయి. రక్తం ఉప్పొంగుతుంది. డైలాగులు బాంబుల్లా పేలతాయి. ఉద్రేకం కలిగిస్తాయి. వీటన్నింటినీ ఒక మాలలో గుచ్చిన గట్టి దారంలాగ ఉత్తమ్సింగ్ చక్కటి పాటలు, నేపథ్య సంగీతం... ఉదిత్ నారాయణ్ ఆర్ద్రతతో కూడిన స్వరం... అన్నీ కలిసి సన్నీడియోల్ని ప్రేమికుడిగా నమ్మించేశాయి. ఆ రోజుకి మోస్ట్ ట్రేడింగ్ హీరోయిన్ అమీషా పటేల్ ఈ చిత్రానికి సైన్ చేయడం, ఈ సినిమా హిట్ మెట్లెక్కడానికి మొదటి కారణం. అక్కణ్నుంచి సూపర్హిట్ మెట్లు, బాక్సాఫీస్ రికార్డుల మెట్లు ఎక్కించిన ఘనత మాత్రం దర్శకుడు, హీరో, నిర్మాత, ఫైట్ మాస్టర్ టినూవర్మ, సంగీత దర్శకుడు ఉత్తమ్సింగ్, గీత రచయిత ఆనంద్ బక్షి, మాటల రచయిత శక్తిమాన్, కెమెరామెన్ జే బొరాడేలదే. రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ఇవాళ చూసినా బోరు కొట్టదు. ఏదో ఒక హైలైట్ కొత్తగా కనిపిస్తూనే ఉంటుంది. చాలా సెన్సిబుల్ ప్రేమకథలకి అలవాటు పడిన బాలీవుడ్ ప్రేక్షకులకి మసాలా రుచిని చూపించిన చిత్రంలా ఉంటుంది గదర్. క్లైమాక్స్లో వచ్చే పత్తి బస్తాల రైలు మీద ఫైట్, సినిమా మొదట్లో హిందూ, ముస్లిం మత ఘర్షణలు, సఖీనాని కాపాడటానికి తారాసింగ్ చేసే పోరాటాలు... అన్నీ ఆసక్తికరంగా ఉంటాయి. తీసుకున్న పాత్రే అమాయకమైన, బలిష్టమైన, నిరక్షరాస్యుడైన ట్రక్ డ్రైవర్ తారాసింగ్ పాత్ర కాబట్టి సన్నీడియోల్ నటన చాలా బావుంటుంది. స్క్రీన్ప్లేలో ప్రాసెస్ అండ్ స్మూత్ ప్రిపరేషన్ పాటించకపోయినా ప్రేక్షకుడికి కావల్సినవన్నీ కంఫర్టబుల్గా ఇచ్చిన సినిమా కాబట్టి ప్రేక్షకుడు కూడా దీనికి బ్రహ్మరథం పట్టాడు. రికార్డుల రీత్యా మాత్రమే కాదు, అవార్డుల వల్ల కూడా కాదు, కంటెంట్ వల్ల మళ్లీ మళ్లీ చూడదగిన సినిమా గదర్. ‘ఉడ్జా కాలే కవ్వా తేరే’ పాట ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించటం ఈ చిత్రానికి ప్రధాన బలం. వచ్చేవారం మళ్లీ కలుద్దాం... ‘దిల్ చాహ్తా హై’ అంటూ! - వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు -
రోడ్డు ప్రమాదంలో సినీ డెరైక్టర్
తిరువొత్తియూరు: పెరంబలూరు వద్ద కంటైనర్ లారీ పక్కన వస్తున్న కారుపై పడడంతో సినిమా డెరైక్టర్ సహా ముగ్గురు మృతి చెందారు. చెన్నై విరుగంబాక్కంకు చెందిన కన్నా (45). సినిమా డెరైక్టర్ అయిన ఇతను నెజంతొట్టు సొల్లు తదితర చిత్రాలకు దర్శకత్వం చేస్తున్నాడు. ఇతను తన మిత్రుడు విరుగంబాక్కంకు చెందిన విజయకుమార్ (50)తో కలిసి రామనాథపురంలో జరిగిన ఒక కార్యక్రమంలో కలుసుకుని తిరిగి శుక్రవారం రాత్రి చెన్నైకి కారులో బయలుదేరారు. కారును సురేష్ అనే యువకుడు నడుపుతున్నాడు. పెరంబలూరు తిరుమంతురై టోల్గేట్ వద్ద కారు వస్తుండగా ఆ సమయంలో వేగంగా వస్తున్న కంటైనర్ లారీ టైర్ పేలిపోవడంతో అదుపు తప్పి కారుపై బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ఉన్న సినీ ైడె రెక్టర్ సహా ముగ్గురు మృతి చెందారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న మంగళమేడు పోలీసులు సంఘటన స్థలం చేరుకుని మృతి చెందిన ముగ్గురి మృతదేహాలను బయటకు తీసి శవ పరీక్ష నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణమైన లారీడ్రైవర్ కడలూరుకు చెందిన కార్తికేయన్ను అరెస్టు చేశారు. -
కర్రా బిళ్లా VS క్రికెట్
దేడ్ కహానీ లగాన్ అంటే పన్ను, శిస్తు. ‘శిస్తువేత్తి, పస్తువేత్తి - వేత్తి కనకవర్షం సుమీ’... ఇదీ కొత్త సామెత. లగాన్ సృష్టించిన చరిత్ర, కురిపించిన కాసులు ఒక ఎత్తయితే... తెల్ల దొరల పాలనలో పన్నుల బాధల్ని ఎంతో ఎంటర్టైనింగ్గా చెప్పిన చిత్రం అయినందుకు నల్ల దొరల పాలనలో వినోద ‘పన్ను’ మినహాయింపులు పొందడం ఎంత గొప్ప! 15 జూన్ 2001 భారతీయ సినీచరిత్రలో గుర్తించుకోదగిన రోజు. 1983 నుంచీ మన దేశంలో అనధికార మతంగా ఎదిగిన క్రీడ క్రికెట్. దాని మూలాలు బ్రిటిష్వాళ్లవే. స్వాతంత్య్రానికి పూర్వం భారతీయ బానిసత్వం నేపథ్యంగా వచ్చిన చిత్రాలన్నీ స్ఫూర్తిమంతమైన, దేశభక్తిపూరిత చిత్రాలుగా మాత్రమే ఉంటాయి. కానీ అదే స్ఫూర్తి, దేశభక్తిని క్రికెట్ అనే క్రీడావినోదంతో ముడిపెట్టవచ్చనే ఆలోచన దర్శక రచయిత అశుతోష్ గోవారికర్కి రావడమే అద్భుతం. దాన్ని ఆమిర్ఖాన్ అంగీకరించి స్వయంగా నిర్మించడానికి పూనుకోవడం మహాద్భుతం. ‘లగాన్’కి తొమ్మిదేళ్లకు ముందు వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘బాజీ’ అనే మాస్ మసాలా సినిమా అట్టర్ఫ్లాప్. ఆ భయంతోనే ఏమో అశుతోష్ ‘లగాన్’ కథని వేరే హీరోలందరికీ వినిపించాడు ముందర. అన్నిచోట్లా తిరస్కారానికి గురైన ఆ కథ, చివరకు ఆమిర్ఖాన్ ఒప్పుకోవడంతో తెరకెక్కి... అత్యున్నత పురస్కారాలను, ప్రేక్షకుల నీరాజనాలను అందుకోవడానికి తయారైంది. ఈ సినిమా మీద నేను నాలుగు పేజీల వ్యాసం రాయలేను. కనీసం నాలుగొందల పేజీల పుస్తకం రాయాలి. మస్తిష్కం ఉపయోగించి తీసిన సినిమాలు కమర్షియల్గా హిట్ అవుతాయి. కానీ, మనసుపెట్టి తీసిన సినిమాలు హిట్తో పాటు ప్రేక్షకుడి మస్తిష్కాన్ని మధిస్తాయి. ప్రేక్షకుడి మనసు మీద చెరగని ముద్ర వేస్తాయి. ‘లగాన్’ ఆ కోవకు చెందిన సినిమా. పోస్టర్ చూశాక: ఓ స్వాతంత్య్ర సమరయోధుడి ప్రేమకథ కాబోసు అని డౌట్ వచ్చింది. ఓ పక్క బ్రిటిష్ యువరాణి, మరోపక్క సంప్రదాయ భారత వనిత, మధ్యలో చిన్న రూరల్ గెటప్లో అందమైన ఆమిర్ఖాన్. ఇంతకన్నా ఏం చేసుకుంటాడులే - అనుకున్నా. థియేటర్లో కూర్చున్నాక: గంభీరమైన అమితాబ్ బచ్చన్ స్వరంతో... స్వాతంత్య్రం రాకముందు తెల్లదొరలు స్థానిక రాజుల్ని వశపర్చుకుని సామాన్య ప్రజలకి పన్నులెలా బాదేవారు? గుజరాత్లోని చంపానెర్ అనే కుగ్రామంలో జరిగిన కథ అని మొదలై... పాత్రలు ఒక్కొక్కటిగా పరిచయం అవుతూ బ్రిటిష్ సైనికుల దౌర్జన్యం కనపడుతుంది. ఇదేదో ఫ్రీడమ్ ఫైటర్ స్టోరీ అయ్యుంటుంది అనుకున్నా. భువన్ గురించి వేరే పాత్రలు మాట్లాడుకున్నాక, దొంగతనంగా జింకల్ని రాళ్లతో కొడుతున్న భువన్. సరిగ్గా జింకల పక్కనున్న చెట్టుకి రాయి తగిలి జింకలు పరుగెత్తడం, అదే చెట్టుకి ఓ తుపాకీ గుండు తగలడం, ఆ తుపాకీని పేల్చిన తెల్లదొర కెప్టెన్ రసెల్ కనబడటం క్షణాల్లో జరుగుతుంది. భువన్ జింకల్ని కొట్టట్లేదు. ఆ తుపాకీ గుళ్ల నుంచి వాటిని కాపాడుతున్నాడని అర్థమైంది. భువన్ పాత్రని, ఆ పాత్రనలా పరిచయం చేసిన దర్శకుణ్ని ప్రేమించేయడం మొదలుపెట్టాను. ‘ఆహా! ఏం ఐడియా’ అనుకున్నాను. భువన్ మెడమీద తుపాకీ పెట్టి, జింకల్ని కాలుస్తాడు కెప్టెన్ రసెల్. భువన్కి వార్నింగ్ ఇచ్చి పంపిస్తాడు. హీరో ఫెయిల్యూర్తో సినిమా స్టార్ట్ అయ్యింది. చివ్వరి రీలు దాకా ఆ ఓటమి పరంపరలోనే సినిమా అంతా నడుస్తుంది. అయినా అతని పాత్రలోని మొక్కవోని ధైర్యం, పట్టుదల, తెగింపు, దేశభక్తి చూసి చూసి చూసి... చివరి బాల్కి వీడు సిక్స్ కొట్టకపోతే మనం సీట్లోంచి లేచి తెరమీద సిక్స్ కొట్టి భారతీయుల్ని గెలిపించాలన్నంత కసి వచ్చేస్తుంది. ‘చిన్న చిన్న కళ్లల్లో పెద్ద పెద్ద కలలు...’ భువన్ పాత్రని తిడుతూ గ్రామస్తుల మాటలు... క్రికెట్ని తేలిక చేస్తూ భువన్ ‘ఇది మా గిల్లీ దండా ఆటే... చిన్నప్పట్నుంచీ చూస్తున్నాను’ అనడం చప్పట్లు కొట్టించింది. ఈ కథని రాయకూడదు. అనుభవించాలి. ఎందుకంటే... ఈ సినిమాని దర్శకుడు తీయలేదు, తీయగా మలిచాడు కాబట్టి. విశేషాలు: నటీనటులు, సాంకేతిక నిపుణులు ఉండటానికి అనువైన చిన్న హోటల్ కూడా లేని పల్లెటూళ్లో అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న అపార్ట్మెంట్ని పూర్తిచేసి, అన్ని ఫ్లాట్లూ అద్దెకు తీసుకుని, వంటవాళ్లని, సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుని మరీ షూటింగ్ చేయడం గొప్ప విషయం. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా దర్శకుడికి వెన్నులో డిస్కు స్లిప్ అయితే ముప్ఫై రోజుల పాటు మానిటర్ పక్కనే బెడ్మీద పడుకుని డెరైక్షన్ చేయడం ఇంకా గొప్ప విషయం. షూటింగ్ జరిగిన ఏడాది తర్వాత, గుజరాత్లోని కచ్ దగ్గర, భుజ్ గ్రామ సమీపంలో భూకంపం వచ్చి అక్కడి జనం ఆస్తి, ధన, ప్రాణ నష్టాలకు గురైతే... ‘లగాన్’ యూనిట్ అంతా కలిసి తమ తమ వేతనాల్లోంచి ఆ ప్రాంతానికి అండగా నిలబడటం మరో గొప్ప విషయం. ఈ చిత్రం పేరుకు తగ్గట్టే ఆమిర్ఖాన్ పదిహేనేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెప్పి, పన్ను చెల్లించి, ఈ చిత్రానికి సహాయ దర్శకురాలిగా పనిచేసిన కిరణ్రావుని రెండో వివాహం చేసుకోవడం ఓ విచిత్రం. ఆ గొడవల్లో ఆమిర్ దాదాపు నాలుగేళ్లు వృత్తికి దూరంగా ఉండాల్సి రావడం బాధాకరం. ఆస్కార్ అవార్డుల్లో బెస్ట్ ఫిల్మ్ ఇన్ ఫారిన్ ల్యాంగ్వేజ్ కేటగిరీకి ఎంపికైన మూడవ భారతీయ చిత్రం ‘లగాన్’. వసూళ్లు, అవార్డులు, విమర్శకుల ప్రశంసలు అన్నీ అమితంగా దక్కిన మిలీనియం భారతీయ చిత్రాల్లో ‘లగాన్’ తొలి రెండు, మూడు స్థానాల్లో ఉంటుంది. గ్రేసీసింగ్, రేచెల్షెల్లీ ఇద్దరూ రాధ, ఎలిజబెత్ పాత్రల్లో అద్భుతంగా రాణించారు. ఎ.ఆర్.రెహమాన్ సంగీతం ఈ చిత్రానికి ఆయువు పట్టు కావడం మరింత గొప్పగా అనిపించే విషయం. ఈ చిత్రం డీవీడీ అమ్మకాలు 1975లో విడుదలైన ‘షోలే’ అమ్మకాల రికార్డుల్ని బద్దలుకొట్టాయి. నటుడిగా కెరీర్ ప్రారంభించిన అశుతోష్ గోవారికర్ ఈ చిత్రంతో దర్శకుడు, రచయిత అయ్యాడు. నటుడిగా కెరీర్ ప్రారంభించిన ఆమిర్ఖాన్ ‘లగాన్’తో నిర్మాత అయ్యాడు. ఆ విజయం ఇచ్చిన ఊపుతో తర్వాత దర్శకుడూ అయ్యాడు. అదే ఊపుతో అశుతోష్ గోవారికర్ నిర్మాత అయ్యాడు. ఒక ‘సినిమా’ జీవితాల్ని మారుస్తుంది. అదే ‘లగాన్’. ముస్లిముల్ని, హిందువుల్ని విభజించి పాలించిన తెల్లవారి కుతంత్రం క్రికెట్ ఆటలో కళ్లకు కట్టినట్టు చూపాడు దర్శకుడు. మళ్లీ వారిని ఒకటి చేసి, తెల్లవారిని ఓడించిన భువన్ ఆ క్షణంలో గాంధీ మహాత్ముడిలా కనిపిస్తాడు. నిజంగా ఈ కథ జరిగుంటే భారతదేశమంతా క్రికెట్ ఆడేసేదేమో - భువన్ జాతిపిత అయ్యుండేవాడేమో అనిపిస్తుంది. నిజంగానే క్రికెట్ ఇవాళ మతం అయ్యిందిగా. ‘అనగ అనగ రాగమతిశయిల్లుచునుండు, తినగ తినగ వేము తీయనుండు’ అన్నట్టు తీయగా, తీయగా ఒక్కో తపన కలిగిన దర్శకుడి జీవితంలో ముందో వెనకో మధ్యలోనో ఒక్క సినిమా ‘లగాన్’ అవుతుంది. ఈ చిత్రం విడుదలైన రోజే స్వాతంత్య్ర పోరాట నేపథ్యంలో తెరకెక్కిన ప్రేమకథ ‘గదర్... ఏక్ ప్రేమ్ కథ’ విడుదలైంది. ఒకే నేపథ్యం ఉన్న కథలు కాబట్టి జనం పోటీగా భావించారు. పైగా ఆమిర్ఖాన్, సన్నీడియోల్ హీరోలు, నిర్మాతలు అవ్వడం వలన దాయాదుల పోరు (హిందు, ముస్లింలు)గా అభివర్ణించారు. కానీ ప్రేక్షకులు మాత్రం..? వచ్చేవారం కలుద్దాం... ‘గదర్: ఏక్ ప్రేమ్ కథ’ చిత్ర విశేషాలతో! - వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు -
అలా వచ్చి... ఇలా హిట్టిచ్చాడు...
దేడ్ కహానీ ఒకటిన్నర దశాబ్ద కాలంలో బాలీవుడ్ గమనం... ప్రపంచ సాంకేతిక చరిత్రని తిరగరాసిన మిలీనియమ్ సంవత్సరం (2000)... భారతీయ సినిమాని, ముఖ్యంగా బాలీవుడ్ సినిమా చరిత్రని కూడా తిరగ రాసింది. సమాజం ఏ ఇరవై ఏళ్లకో ఒకసారి ఎదిగే స్థాయి నుంచి ప్రతి ఇరవై రోజులకి కొత్త కొత్త విషయాలతో ఎదగడం ప్రారంభించింది 2000 నుంచే. దుకే ఈ కాలమే 2000 కాలం నుంచి ఇవాల్టి దాకా హిందీ సినిమాలలో వచ్చిన మార్పులు, వాటి విశేషాలు, మారుతున్న ప్రేక్షకుడి ధోరణి, దానికనుగుణంగా మారుతున్న సినిమా - వీటి సమాహారం. ఈ శీర్షికలో ఈ వారం సినిమా ‘కహో న ప్యార్ హై’పదిహేనేళ్ల క్రితం ఆరువేళ్ల అందగాడిని చూసి యువత భారతదేశంలోని సినీ ప్రేమికులు మనసు పారేసుకున్నారు. తెర మీద... ‘‘రోహిత్, రోహిత్’’ అని కొన్ని వేల మంది ప్రజలు అరుస్తుంటే, యేటర్లో కూర్చున్న ప్రేక్షకుడికి కూడా ఒక ఉత్కంఠ, ఒక ఉద్వేగం, బిల్డప్ షాట్స్ - పాట హమ్మింగ్- మెస్మరైజింగ్ ఫేస్ - ఏ స్టార్ ఈజ్ బోర్న్- పేరు: హృతిక్ రోషన్. తండ్రి: రాకేష్ రోషన్ - కొడుకు తొలి సినిమాకి కథ, నిర్మాత, దర్శకుడు. బాబాయ్: రాజేష్ రోషన్ - అన్న కొడుకు తొలి సినిమాకి సంగీత దర్శకుడు. సినిమా: కహో నా... ప్యార్హై కుటుంబమంతా కలిసి కష్టపడి ప్రేక్షక దేవుళ్ల ఆశీస్సులు, మెప్పులు పొందిన సూపర్ హిట్ మర్షియల్ సినిమా. క్లుప్తంగా కథ: హిత్, అతని తమ్ముడు అమిత్ ఒక మధ్యతరగతి ఇంట్లో పేయింగ్ గెస్టులు. వారికి తల్లిదండ్రులు లేరు. తమ్ముడి ఆలనా పాలనా అన్నే చూసుకుంటుంటాడు. తమ్ముడు తెగ మోసేసినా ఆ అన్న అలగడు. అభిమానంగా స్వీకరిస్తాడు. ఇద్దరి మధ్య మంచి అనుబంధం. మంచి అన్నకి చిలిపి తమ్ముడు. స్టార్ సింగర్ కావాలని రోహిత్ కల. ఆ కలతోనే సినిమా మొదలౌతుంది. రోహిత్ కార్ షోరూమ్లో సేల్స్మన్. అందమైన సోనియా అనే అమ్మాయిని మొదటిసారి ట్రాఫిక్లో చూస్తాడు. బానే ఉందనుకుంటాడు. తర్వాత... సోనియా తండ్రి ఆమెకు పుట్టిన రోజు కానుకగా కారు కొంటాడు. ఆ కారుని సోనియా బర్త్డే రోజు ఇంటికి తెమ్మని రోహిత్కి చెబుతాడు. కూతురు ‘నా పుట్టినరోజు కానుకేది’ అనడిగితే ‘తలుపు తియ్యి’ అంటాడు. తలుపు తీస్తే ఎదురుగా హీరో. ఒక్క క్షణం ఆమెకర్థం కాదు. ‘బహుమతి ఎలా ఉంద’ంటాడు తండ్రి. ‘కలర్ బావుంది, గిఫ్ట్ బావుంది’ హీరోని కొంటెగా చూస్తూ - తండ్రితో. కారు తాళం చూపిస్తాడు హీరో- లోపల్నించి తండ్రి ‘నడిపి చూడు ఇంకా బావుంటుంది’ అంటాడు. ‘ఓ నిన్ను తాళంతో నడపచ్చా’ అంటుంది. ఆమె కొంటెతనం అర్థమై, కారు చూపిస్తాడు హీరో. ఇందులో సరసం ఉంది. వెగటుతనం లేదు. అలా వాళ్ల మధ్య పరిచయం స్నేహమై, ప్రేమై తండ్రికి తెలిసి, అతనితో మాట్లాడతాను రమ్మంటాడు. డ్రగ్స్ ముఠాని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న కమీషనర్ని విలన్లు హత్య చేయడం హీరో చూస్తాడు. హీరోని వాళ్లు వెంటపడి వెంటపడి చంపుతారు. విశ్రాంతి... ఇంటర్వెల్కే హీరో చనిపోతాడు. ప్రేక్షకులూ, హీరోయినూ కలిసి గాఢంగా ప్రేమించేసిన హీరో చనిపోతాడు. సినిమాటిక్గా సెకండాఫ్లో బతికొస్తాడులే అనుకుంటాం. సినిమా అయిపోయినా రోహిత్ బతకడు. రాజ్ అనే మరో హృతిక్ రోషన్ సెకండాఫ్ కథ నడిపిస్తాడు. రోహిత్ను హత్య చేసిన దుర్మార్గుల పని పడతాడు. రోహిత్ కలగన్న పెర్ఫార్మెన్స్ ఇస్తాడు రాజ్. రోహిత్ ప్రేయసి సోనియా మనసు గెలుస్తాడు. రోహిత్ తమ్ముడిని కూడా న్యూజిలాండ్ తీసుకెళ్లిపోతాడు. రెండు రకాల స్వభావాలున్న పాత్రలు రెండూ ఒకే హీరో ఒకే సినిమాలో చేయాలంటే, అదీ తన మొదటి సినిమాలోనే చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. ఆ గట్స్తోటే హృతిక్రోషన్ హీరో అయ్యాడు. ఈ సినిమాలో డైలాగులాగే ‘‘ఏక్ బాత్ బోలూ...’’ మిలీనియమ్లో మొదటి సూపర్హిట్ బాలీవుడ్ సినిమా ‘‘కహోనా... ప్యార్హై...’’ ‘‘చాంద్సెతారే పూల్ అవుర్ కుష్బూ’’ పాట, ‘‘కహోనా... ప్యార్హై’’ టైటిల్ సాంగ్ పెద్ద హిట్. ఇక... సినిమాకు ముందు విషయానికొస్తే... తండ్రి రాకేష్ రోషన్ దీనికి ముందు తీసిన భారీ చిత్రం ‘‘కోయ్లా’’కి హృతిక్ సహాయ దర్శకుడు. కండలవీరుడు సల్మాన్ఖాన్ సలహాలతో తన శరీరాకృతిని సర్వాంగ సుందరంగా మార్చుకున్నాడు హృతిక్. యువతరం మనసు కొల్లగొట్టాడు. బాలీవుడ్లో డ్యాన్స్ చేసే హీరోలు లేరని గుర్తించి సౌత్లో లాగ చాలా కష్టమైన డ్యాన్స్లు సునాయాసంగా చేశాడు. బాక్సాఫీసుని బద్దలు కొట్టాడు. చిత్రానికి హీరోయిన్గా ముందు కరీనాకపూర్ని ఎంచుకుని కొంత షూటింగ్ చేశారు. రషెస్ చూశాక, కొత్తమ్మాయి అమీషా పటేల్తో రీషూట్ చేశారు. అమితాబ్ తర్వాత ఖాన్లు ఏలుతున్న బాలీవుడ్కి నాన్ఖాన్ సూపర్స్టార్గా, ప్రత్యామ్నాయంగా ఎదిగాడు హృతిక్. సవరించిన ద్రవ్యోల్బణ రేటు ప్రకారం బాలీవుడ్ హయ్యస్ట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల్లో ఇవాళ్టికీ పదకొండో చిత్రంగా నిలిచింది కహోనా...ప్యార్హై. చిత్రంలో హృతిక్ తమ్ముడు అమిత్గా నటించిన బాలనటుడు అభిషేక్ శర్మ ఇవాళ హిందీ బుల్లితెర మీద పెద్దనటుడు. సినిమా మొత్తం హృతిక్ చేతికున్న ఆరోవేలు కనపడకుండా సినిమా తీశారు రాకేష్ రోషన్. ఫస్టాఫ్ షిప్లోనూ, ఐలాండ్లోను తీసి, సెకండాఫ్ న్యూజిలాండ్లోనూ, ముంబైలోనూ తీయడం వల్ల సినిమాకి ఎక్కడలేని రిచ్నెస్ వచ్చింది. అయిదు పదుల వయసులో కూడా 2000వ సంవత్సరపు ప్రేక్షకుడి నాడికి పట్టుకోవడం అసాధ్యం కాదని, షారుఖ్ఖాన్, మాధురీదీక్షిత్ లాంటి అగ్రతారలతో తీసిన కోయ్లా డిసాస్టర్ అయ్యాక కూడా ఆ దర్శకుడు బౌన్స్ బ్యాక్ అవ్వచ్చని కహోనాప్యార్హైతో రచయితగా, దర్శకుడిగా నిరూపించారు నిన్నటి తరం నటుడు రాకేష్ రోషన్. క్రియేటివిటీ డివైన్ మాత్రమే కాదు, వైన్లాంటిది కూడా. పాతబడిన కొద్దీ రుచిలో కిక్ పెరుగుతుంటుంది. సానబెట్టిన కొద్దీ రాయి వజ్రంగా మారినట్టు. మళ్లీ వచ్చేవారం మరో సూపర్హిట్ బాలీవుడ్ మూవీతో కలుద్దాం... హ్యాపీ సండే, ఫన్డే. - వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు -
'మణిరత్నం చిత్రాన్ని విడుదల చేయొద్దు'
చెన్నై : దర్శకుడు మణిరత్నం తాజా చిత్రం ఓ కాదల్ కన్మణి. ఈ నెల 17న విడుదలకు ముస్తాబవుతోంది. ఇలాంటి పరిస్థితిలో మన్నన్ అనే డిస్ట్రిబ్యూటర్ మణిరత్నంపై తమిళ నిర్మాతల మండలిలోను, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల సంఘాలలోను ఒక ఫిర్యాదు చేశారు. అందులో ఆయన పేర్కొంటూ మణిరత్నం ఇంతకుముందు రూపొందించిన కడల్ చిత్ర డిస్ట్రిబ్యూషన్ హక్కులను తాను పొందానన్నారు. అయితే ఆ చిత్రం తనకు తీవ్ర నష్టాన్ని కలిగించిందని తెలిపారు. ఆ చిత్రం కొనుగోలు కోసం చేసిన అప్పులకు వడ్డీ కూడా కట్టలేని స్థితిలో వున్నానన్నారు. పెద్ద నిర్మాణ సంస్థలు నిర్మించిన చిత్రాలకు ఏర్పడ్డ నష్టాలను మానవతావాదంతో ఇప్పుడు తిరిగి చెల్లిస్తున్నారన్నారు. అదే విధంగా కడల్ చిత్రానికి తనకు కలిగిన నష్టాన్ని భర్తీ చేసే వరకు మణిరత్నం తాజా చిత్రం ఓ కాదల్ కన్మణిని విడుదల చేయకుండా అడ్డుకోవాలని కోరారు. -
దర్శకుడు పూరీజగన్నాథ్ ఇంట్లో చోరీ
-
దర్శకుడు పూరీజగన్నాథ్ ఇంట్లో చోరీ
హైదరాబాద్: ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ నివాసంలో భారీ చోరీ జరిగింది. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 31లో నివసించే పూరి జగన్నాథ్ కుటుంబం బయటకు వెళ్లిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి బెడ్రూమ్లో ఉన్న అలమరా తాళాలు తీసి బంగారు ఆభరణాలు తస్కరించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అలమరాలోని సుమారు రూ.15 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, అరుదైన డిజైన్లు, వజ్రాలు పొదిగిన నెక్లెస్ ఉన్నట్లు పేర్కొన్నారు. -
మా‘స్టారు’.. వెళ్లిపోయారు
జనవరి నెలొచ్చింది. భీమవరం కేజీఆర్ జూనియర్ కాలేజీకి సంక్రాంతి సెలవులు ఎప్పుడిస్తారనేది అప్పటికింకా ప్రకటించలేదు. ఆ రోజు తెలుగు పాఠం అరుుపోరుుంది. విద్యార్థులంతా లెక్చరర్ చుట్టూ చేరి ‘మాస్టారూ.. సంక్రాంతి సెలవులు ఎప్పటినుంచి’ అనడిగారు. ‘నాకూ తెలీదురా.. అరుునా ఆ విషయం మేం చెప్పకూడదు. నోటీసు బోర్డులో పెడతార్లే’ అన్నారాయన. ‘ఎవర్నడిగినా చెప్పట్లేదు.. మీరైనా చెప్పండి మాస్టారూ’ విద్యార్థులు బేలగా అడిగారు. ‘సర్లే.. చెబుతా ఏడు’ అని సెలవిచ్చారు. విద్యార్థుల మొహాల్లో ఒకటే వెలుగు. ఆయన ఉచ్ఛారణలోని చమత్కారం జనవరి 7నుంచి సెలవులు ఇస్తున్నారని చెప్పకనే చెప్పింది. విద్యార్థులంతా ఎంఎస్ఎన్గా పిలుచుకునే ఆ మాస్టారి పేరు ఎంఎస్ నారాయణ. లెక్చరర్గా చక్కనైన తెలుగును ఎంచక్కా నేర్పించారు. వెండి తెర వెలుగుల్లో జనమంతా హారుుగా నవ్వుతూ మైమరిచిపోతే హఠాత్తుగా అదృశ్యమై నవ్వునూ ఏడిపించారు. శిష్యులను.. అభిమానులను దుఃఖసాగరంలో ముంచేశారు. నిడమర్రు అది జనవరి 13వ తేదీ. నిడమర్రులోని ఓ ఇల్లు సందడిగా ఉంది. అది హాస్యనటుడు ఎమ్మెస్ నారాయణ సోదరుడిది. ‘ఆ రోజు తమ్ముడు సరదాగా మాతో గడిపాడు. అందరికీ మిఠాయిలు పంచిపెట్టాడు. ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పాడు. అనారోగ్యంతో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు’ అంటూ ఎమ్మెస్ సోదరుడు లాలయ్య విలపించారు. జనవరి 13న పెదనిండ్రకొలనులోని మాజీ సొసైటీ అధ్యక్షుడు కూనపురాజు కుమారస్వామిరాజు నివాసంలో స్నేహితులతో చివరి సారిగా గడిపారు. దొంగ సూరిగాడు నిడమర్రు గ్రామంలోని రైతు కుటుంబానికి చెందిన మైలవరపు బాపిరాజు, వెంకటసుబ్బమ్మ దంపతులకు మూడో సంతానంగా 1951 ఏప్రిల్ 16న ఎమ్మెస్ నారాయణ జన్మించారు. ఆయనకు అక్క, అన్న, అయిదుగురు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెళ్లున్నారు. బాల్యంలో తోటి స్నేహితులతో కలసి రాత్రి వేళల్లో గ్రామంలోని మోతుబరి పొలాల్లో పండించిన కూరగాయలు, ఆకుకూరలు దొంగిలించి పేదవారి ఇళ్ల గుమ్మాల ముందుంచేవారని గ్రామస్తులు చెబుతారు. దీంతో గ్రామంలో ఎంఎస్ను దొంగ సూరిగాడు అంటూ పిలిచేవారు. వ్యవసాయ పనులకు వెళ్లమంటే తప్పించుకుని తిరిగేవారు. గేదెల్ని కాసేందుకు పందికోడు వంతెన గట్టుకు వెళ్లి అద్దెకు తెచ్చుకున్న నవలలను చదివేవారు. అమ్మ పోలిక వల్లే అదృష్టం పట్టింది తల్లి వెంకట సుబ్బమ్మ ముఖం..తనది ఒకేలా ఉంటుందని..అదే తన అదృష్టానికి కారణమని తరచూ ఎమ్మెస్ చెబుతూ మురిసిపోతుండేవాడు. ఏ కారు కొన్నా నిడమర్రు వచ్చి తల్లి వెంకట సుబ్బమ్మను తీసుకుని ద్వారకాతిరుమల తప్పని సరిగా వెళ్లేవారు. వచ్చిన ప్రతిసారి తల్లి వద్ద ఉండేందుకే సమయాన్ని కేటాయించేవారు. ఆమె 2011 సెప్టెంబర్ 25న మృతి చెందాక నిడమర్రు రావడం తగ్గించినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. అవకాశం దొరికితే తండ్రికి తెలియకుండా గణపవరంలో రెండో ఆట సినిమాకు వెళ్ళిన ప్రతిసారి తల్లిని అడ్డు పెట్టుకుని తండ్రి నుంచి దెబ్బలు తప్పించుకునేవారని ఆయన సోదరులు తెలిపారు. పరుచూరి అండతో ప్రేమ వివాహం మూర్తి రాజు కళాశాలలో భాషాప్రవీణ కోర్చు చదువుతున్నప్పుడు తోటి విద్యార్ధిని కళాప్రపూర్ణ ప్రేమలో పడ్డారు. ఇదే సమయంలో సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేశారు. ఎమ్మెస్ ప్రేమ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు కులాంతర వివాహానికి అడ్డు చెప్పారు. అవేవీ పట్టించుకోని ఎమ్మెస్ భాషా ప్రవీణ కోర్సు పూర్తి చేశాక లెక్చరర్ పరుచూరి గోపాల కృష్ణ సహకారంతో కృష్ణా జిల్లా చల్లపల్లిలో కళాప్రపూర్ణను 1972లో రిజిస్టర్ వివాహం చేసుకున్నారు. ఎమ్మెస్ భీమవరంలోని మూర్తిరాజు హైస్కూల్లో, భార్య కళాప్రపూర్ణ జూపూడి కేశవరావు హైస్కూల్లో సెంకడరీ గ్రేడ్ తెలుగు పండిట్గా చేరారు. అనంతరం భీమవరంలోని కేజీఆర్ఎల్ జూనియర్ కళాశాలలో తెలుగు అధ్యాపకునిగా పనిచేశారు. సూర్యనారాయణ, ఆర్ఎంపీ చదువు మధ్యలో మానేశాక గ్రామంలోని ఆర్ఎంపీ వైద్యుడు లంకా వెంకట్రావు వద్ద సహాయకునిగా పనిచేశారు. తర్వాత కొంతకాలం గ్రామంలో ఆర్ఎంపీ అవతారం ఎత్తారు. నాటకాలంటే పిచ్చి నవలలు చదివి పాత్రల్లో లీనమైపోయేవారు. తోటి స్నేహితులతో చిన్న చిన్న నాటకాలు వేసేవారు. ఏ నాటకమైనా హాస్యభరితంగా ఉండేలా రచించేవారు. టీచరు, డాక్టర్ పాత్రల్ని ఇష్టపడేవారు. ‘చాకలి తిప్పడు’ ఏకపాత్రాభినయం ఆకట్టుకునేది. ఎక్కువగా గ్రామంలోని మంచినీటి చెరువులో ఈత కొట్టేవారు. ప్రతి నాయకుని పాత్ర కోరిక తీరకుండానే తెలుగు చలనచిత్ర సీమలో గుర్తుండిపోయే ప్రతి నాయకుని పాత్ర పోషించాలనేది ఎమ్మెస్ చిరకాల వాంఛ. అది నెరవేరకుండానే కన్నుమూశారు. అయిదు నందులు వచ్చిన అనందం కంటే మంచి ప్రతినాయకుని పాత్ర కోసం ఎదురు చూస్తున్నాననేవారు. హాస్యనటుడుగా రాణించడానికి కారకుడు దివంగత దర్శకుడు ఈవీవీ అని చెప్పేవారు. పాఠాలు చెబుతూనే అందరినీ నవ్వించేవారు మేం ఇంటర్మీడియెట్ చదివే రోజుల్లో ఎమ్మెస్ నారాయణ తెలుగు లెక్చరర్. చేతిలో పుస్తకం లేకుండానే పాఠం బోధించేవారు. తెలుగు వ్యాకరణంతోపాటు సినిమాలు, కథల చెబుతుండేవారు. పాఠానికి హాస్యాన్ని జోడించేవారు. ఒక్కోసారి డిటెక్టివ్ షాడో తరహాలో చెప్పి పాఠాన్ని రక్తికట్టించేవారు. ఆయన క్లాస్ అంటేనే పక్క గ్రూపుల విద్యార్థులు కూడా వచ్చి మావద్ద కూర్చునేవారు. గది చాలక కాలేజీ ఆవరణలోనూ నిలబడి ఆయన చెప్పే పాఠాలు వినేవారు. ‘ఎవరో మన గురించి ఏదో అనుకుంటారని మనం అనుకోకూడదు. ఎలాంటి విషమ పరిస్థితులొచ్చినా ముందుకు సాగాలి’ అని ఎమ్మెస్ నారాయణ చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తే. - బి.సాయిరమేష్, సీఐ, బొమ్మూరు పోలీస్ స్టేషన్ కలుపుగోలు మనిషి హాస్యనటుడు ఎంఎస్ నారాయణ కలుపుగోలు మనిషి. రంగస్థలం నుంచి వచ్చిన పేరుమోసిన రచయిత. అనవసరమైన డైలాగులు చెప్పకుండా పాత్రకు ఎంత అవసరమో అంతవరకే పరిమితమైన గొప్ప హాస్యనటుడు. తోటి హాస్యనటులను కూడా తనకంటే బాగా నటించేలా ప్రోత్సాహం అందించిన వ్యక్తి ఎమ్మెస్ నారాయణ. ఆయన మృతి తీరని లోటు. ఎంఎస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. - కోడి రామకృష్ణ, సినీ దర్శకుడు -
ప్రముఖ దర్శకుడు భాస్కర రావు ఇకలేరు
-
నాలుగు భాషల్లో ‘రెడ్ అలర్ట్’
వెదురుపాక (రాయవరం) :‘ఒకేసారి నాలుగు దక్షిణాది భాషల్లో రూపొందించిన సినిమా త్వరలో వెండితెర పైకి రాబోతోంది. ఆయా నటులతో కలసి ఒకేసారి సినిమాకు దర్శకత్వం వహించడం ఇదే తొలిసారి. ఆ రికార్డు నా సొంతం కావడం ఆనందంగా ఉంది’ అన్నారు ప్రముఖ సినీ దర్శకుడు చంద్రమహేశ్. ‘ప్రేయసి రావే’ సినిమాకు దర్శకత్వం వహించి తొలి ప్రయత్నంలోనే నంది అవార్డు అందుకున్న ఆయన గురువారం విజయదుర్గా పీఠానికి వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, దర్శకుడిగా ఎదిగిన తీరును వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘రెడ్ అలర్ట్’ ఒక రికార్డు.. నాలుగు దక్షిణాది భాషల్లో ఒకేసారి సినిమా నిర్మించడం ఒక రికార్డు. తెలుగు, కన్నడలో ‘రెడ్ అలర్ట్’గా, తమిళంలో ‘చెన్నై నగరం’, మలయాళంలో ‘హై అలర్ట్’ పేరుతో త్వరలోనే ఈ సినిమా విడుదల చేయనున్నాం. హీరోగా మహదేవను పరిచయం చేస్తున్నాం. హీరోయిన్గా అంజనీ మీనన్, ప్రధాన పాత్రల్లో సుమన్, పోసాని కృష్ణమురళి, అలీ, కౌశ, కాశీ విశ్వనాథ తదితరులు నటిస్తున్నారు. సంగీతం రవివర్మ. నిర్మాత పీవీ శ్రీరామరెడ్డి. ఈ సినిమా చివరి షెడ్యూల్ ఈ నెల 13 నుంచి 20 వరకూ జరుగుతుంది. జనవరిలో సినిమా విడుదలకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. అలాగే నటుడు, దర్శకుడు భాగ్యరాజా కుమారుడు శాంతన్ భాగ్యరాజా హీరోగా ‘లవ్ ఇన్ హైదరాబాద్’ సినిమాకు దర్శకత్వం వహించాను. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను త్వరలోనే విడుదల చేస్తాం. భార్య ప్రోత్సాహంతోనే.. మాది జిల్లాలోని శంఖవరం గ్రామం. నాకు చిన్ననాటి నుంచీ సినిమాలపై ఎంతో ఆసక్తి. ఇంట్లో అందరూ ఉద్యోగస్థులు కావడంతో సినిమా పరిశ్రమ వైపు వెళ్లేందుకు ఎవ్వరూ ఇష్టపడలేదు. వివాహమైన తర్వాత భార్య రాజశ్రీ ప్రోత్సహించింది. భార్యా పిల్లలను తీసుకుని హైదరాబాద్ వెళ్లిపోయాను. మూడు నెలలు రామానాయుడు స్టూడియోకు కాళ్లరిగేలా తిరగ్గా.. నా పట్టుదల చూసి చివరకు అసిస్టెంట్ డెరైక్టర్గా సూపర్ పోలీస్ సినిమాకు అవకాశం ఇచ్చారు. వృత్తిపట్ల అంకితభావం చూసి నా రెండో సినిమా ధర్మచక్రంకు అసోసియేట్ డెరైక్టర్గా చేశారు. తర్వాత నాయుడిగారి కుటుంబం, శివయ్య, ప్రేమించుకుందాం..రా, పెద్ద మనుషులు సినిమాలకు అసోసియేట్ డెరైక్టర్గా పని చేశాను. రామానాయుడి ఆశీస్సులతోనే.. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి రామానాయుడు ఆశీస్సులతోనే దర్శకుడిగా మారాను. పోసాని కృష్ణమురళి అందించిన కథతో ప్రేయసి రావే సినిమాతో దర్శకుడిగా మారి నంది అవార్డు అందుకున్నాను. అనంతరం అయోధ్య రామయ్య, చెప్పాలని ఉంది, జోరుగా.. హుషారుగా, హనుమంతు, ఆలస్యం.. అమృతం సినిమాలు చేశాను. హనుమంతు సినిమాకు రెండోసారి ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు అందుకున్నాను. సినీ పరిశ్రమ స్లంప్లో ఉంది ఇటీవల సినీ పరిశ్రమ స్లంప్లో ఉంది. ఏ సినిమా అయినా హిట్ అవాలంటే కథ బాగుండాలి. అందుకే సినిమాకు కథే హీరో. దశాబ్దకాలంగా హిట్ శాతం పడిపోయింది. దర్శకుడికి 24 ఫ్రేమ్లపై అవగాహన, పట్టు ఉండాలి. నూతన దర్శకుల్లో అవగాహన లోపం ఉంది. మంచి పాయింట్ తీసుకున్నా టేకింగ్లో న్యాయం చేయలేకపోతున్నారు. -
కళాకారులకు పుట్టినిల్లు నల్లగొండ
నల్లగొండజిల్లా కవులు, కళాకారులకు పుట్టినిల్లని ప్రముఖ సినీ దర్శకుడు ఎన్. శంకర్ అన్నారు. నల్లగొండ ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక చినవెంకట్రెడ్డి ఫంక్షన్హాల్లో శుక్రవారం నిర్వహించిన తెలంగాణ సినిమా పండగలో ఆయన మాట్లాడారు. నల్లగొండ కల్చరల్: నల్లగొండ జిల్లా కళలు, కళాకారులకు పుట్టినిల్లు అని ప్రముఖ సినీ డెరైక్టర్ ఎన్.శంకర్ అన్నారు. నల్లగొండ ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక చినవెంకట్రెడ్డి ఫంక్షన్హాల్లో శుక్రవారం నిర్వహించిన తెలంగాణ సినిమా పండగలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో దాదాపు 20 వరకు జానపద కళారూపాలు ఉన్నాయని, ఎంతో మంది కళాకారులు చైతన్యవంతంగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కనుమరగవుతున్న జానపద కళాకారుపాలకు జీవం పోసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. జిల్లా కేంద్రంలో ప్రముఖ సినీ కళాకారులు టీఎల్ కాంతారావు, ఎం.ప్రభాకర్రెడ్డి విగ్రహాలను ఏర్పాటు చేయడంతో పాటు జయంతి కార్యక్రమాలు ప్రభుత్వమే నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.నటులు ప్రభాకర్రెడ్డి చలువ వల్లనే తను ఈ రోజు సినీ పరిశ్రమలో నిలబడ్డానన్నారు. సినీ కళాకారులు ఎంఎన్.నాగరాజు మాట్లాడుతూ వచ్చే ఏడాది 20 మంది సినీ కళాకారులతో నల్లగొండలో తెలంగాణ సినిమా పండగ నిర్వహిస్తామన్నారు. అలాగే తెలంగాణకు చెందిన పేద కళాకారులకు ప్రతి ఏటా రూ.లక్ష ఆర్థికసాయం, ఉత్తమ కళాకారుడికి రూ.25వేల నగదు పారితోషికాన్ని ప్రముఖ నటులు టీఎల్.కాంతారావు పేరు మీద అందిస్తామని చెప్పారు. విద్యావేత్త కొండకింద చినవెంకట్రెడ్డి మాట్లాడుతూ సినీ పరిశ్రమలో తెలంగాణ కళాకారులకు అవకాశం కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఫిలం సొసైటీ కార్యదర్శి పున్న అంజయ్య, దశరథకుమార్, సత్యం, మునవర్అలీ, గూడ రామకృష్ణ, నర్సయ్య, మట్టిమనిషి వేనేపల్లి పాండురంగారావు, పెన్షనర్స్ సంఘం అధ్యక్షుడు జి. దామోదర్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. -
‘అభినందన’ దర్శకుడు కన్నుమూత
చెన్నై: ప్రముఖ సినిమాటోగ్రాఫర్, సినీ దర్శకుడు అశోక్కుమార్ (70) మంగళవారం రాత్రి చెన్నైలో కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఆరునెలలుగా హైదరాబాద్, చెన్నైలోని అనేక ఆస్పత్రులలో ఆయన చికిత్స పొందుతున్నారు. అయినా ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. చివరి క్షణాలు స్వగృహంలోని కుటుంబ సభ్యుల మధ్య గడపాలన్న ఆయన కోరిక మేరకు రెండు రోజుల క్రితం ఇంటికి తీసుకువచ్చారు. మంగళవారం రాత్రి 11.30కు ఆయన కన్నుమూశారు. అశోక్కుమార్కు భార్య జ్యోతి, నలుగురు కుమారులు ఉన్నారు. బుధవారం సాయంత్రం చెన్నైలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. 1944లో అలహాబాద్లో జన్మించిన అశోక్కుమార్ 1969లో జన్మభూమి అనే మలయాళ చిత్రానికి కెమెరామన్గా సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తరువాత తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో 125 సినిమాలకు పనిచేశారు. తెలుగులో అభినందన, నీరాజనం, సాయి మహిమలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. అభినందన చిత్రానికి దర్శకునిగా నంది అవార్డును, తమిళ చిత్రం నెంజెత్తై కిళ్లాదే చిత్రానికి కెమెరామెన్గా జాతీయ అవార్డును అందుకున్నారు. -
మళ్లీ వివాదాల సుడిలో రాంగోపాల్ వర్మ
‘సావిత్రి’ సినిమా పోస్టర్పై వివిధ వర్గాల ఆగ్రహం సుమోటో కేసు నమోదు చేసిన బాలల హక్కుల కమిషన్ హైదరాబాద్: ఇటీవల వరుస వివాదాలతో వార్తల్లోకి ఎక్కుతున్న సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా మరో వివాదానికి కేంద్ర బిందువు అయ్యారు. ‘సావిత్రి’ పేరు మీద ఒక చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు విజయదశమి రోజు ఆయన చేసిన ప్రకటన సమాజంలోని వివిధ వర్గాల వారి నుంచి తీవ్ర నిరసనను ఎదుర్కొంటోంది. ఆ చిత్రానికి సంబంధించి స్కూలు విద్యార్థి, టీచర్ బొమ్మలతో విడుదల చేసిన వాణిజ్య ప్రకటన చూసి శనివారం రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలు, ఉపాధ్యాయులు, బుద్ధి జీవులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. గురువారం రోజే వర్మ ఆ చిత్రానికి సంబంధించిన ప్రకటన విడుదల చేస్తూ.. స్కూల్లో చదువుకునేటప్పుడు తన ఇంగ్లిష్ టీచర్ అంటే పిచ్చెక్కిపోయేదనీ, ఆమె తన ‘సావిత్రి’ అని పేర్కొన్నారు. మీ అందరి జీవితాల్లో తారసపడిన ఆ సావిత్రులందరి స్ఫూర్తితోనే ఈ ‘సావిత్రి’ సినిమా మొదలు పెడుతున్నాం’అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ‘‘మీ జీవితంలో మీకు ఎదురైన మీ ‘సావిత్రి’లకు సంబంధించిన అనుభవాలు మాతో పంచుకుంటే, ఆ అనుభవాలను సినిమాలో పెడతాం’’ అని కూడా ప్రకటించారు. వర్మ చేసిన ఈ ప్రకటనపై ఒక్కసారిగా నిరసనలు, విమర్శలు వెల్లువెత్తాయి. అందులో తప్పేముంది! : వర్మ సినిమా తీయడానికి, తన అభిప్రాయాలు పంచుకోడానికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉందంటూ ‘సాక్షి’తో మాట్లాడుతూ వర్మ వాదించారు. తన పత్రికా ప్రకటన, పోస్టర్లలో అభ్యంతరకర విషయాలు ఏమున్నాయని ఎదురు ప్రశ్నించారు. ‘‘నా జీవితంలో నాకు కలిగిన భావాన్ని చెబితే, మా టీచర్ నా ధైర్యాన్ని అభినందించారు.’’ అని స మాధానమిచ్చారు. అయితే, పిల్లల ను తప్పుదోవ పట్టించేలా ఈ చిత్ర ప్రకటనలు ఉన్నాయంటూ బాలల హక్కుల సంఘం ప్రతినిధులు దీనిపై విచారణ చేపట్టారు. సావిత్రి సినిమా పోస్టర్పై సుమోటో కేసు నమోదు చేశారు. ఈ మేరకు చిత్ర దర్శకుడు వర్మ, సెన్సార్బోర్డు, సిటీ పోలీస్ కమిషనర్ ఎం. మహేందర్రెడ్డిలకు నోటీసులు జారీ చేసినట్లు కమిషన్ సభ్యులు అచ్యుతరావు, మమతా రఘువీర్లు తెలిపారు. అసాంఘికమైన ఆలోచన: పశ్యపద్మ, సీపీఐనేత వర్మ ఆలోచనే అసాంఘికమైనది. పిల్లలకు అనుకూలమైన, వారికి స్నేహపూర్వకంగా ఉండే స్కూళ్లను రూపొందించాలని యూనిసెఫ్ సూచిస్తుండగా, అందుకు పూర్తిభిన్నంగా టీనేజ్, అంతకు తక్కువ వయసున్న పిల్లల బుద్ధి వక్రమార్గం పట్టేలా వర్మ సినిమాలు తీయడం మంచిది కాదు. సినిమాలే కాదు వాటిపోస్టర్లను కూడా అశ్లీలంగా, అసభ్యంగా రూపొందించి, వివాదాల ద్వారా ప్రచారం పొందాలనే ఆలోచన సరికాదు. వర్మది నేరప్రవృత్తిని పెంచేతత్వం: మహిళాసంఘాలు రాంగోపాల్వర్మ ఒక పర్వర్టెడ్ పర్సన్ అని. నేరప్రవృత్తి పెంచేలా సినిమాలు తీయడం సరికాదని, సావిత్రి పేరిట తీసే సినిమా పోస్టర్ను అసభ్యంగా రూపొందించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఐద్వా నేత జ్యోతి శని వారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటువంటి ధోరణిని ఆయన వెంటనే విడిచిపెట్టాలన్నారు. ప్రేక్షకులకు లేని ఆలోచనలు ప్రేరేపించేలా సినిమా ఇతివృత్తం, సీన్లు వర్మ సినిమాల్లో ఉంటాయని, మహిళలను, ఆడపిల్లలను వ్యక్తిత్వం లేని వారిగా వర్మ చిత్రీకరించడం దారుణమన్నారు. -
సినీ దర్శకుడు లారెన్స్పై చీటింగ్ కేసు
హైదరాబాద్ : ప్రముఖ సినీ దర్శకుడు, కొరియోగ్రాఫర్ లారెన్స్ రాఘవ, అతని వ్యక్తిగత కార్యదర్శి రాజ్కుమార్ పై గురువారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకరాం ప్రభాస్, తమన్నా జంటగా నటించిన రెబల్ సినిమాకు లారెన్స్ దర్శకత్వం వహించాడు. ఆ సినిమాకు భగవాన్, పుల్లారావు నిర్మాతలు. సినిమా ప్రారంభానికి ముందే లారెన్స్ నిర్మాతల మధ్య సినిమా ఖర్చు విషయంలో ఒప్పందం కుదిరింది. రూ.23 కోట్లతో సినిమాను పూర్తి చేస్తానని, అంతకంటే ఎక్కువ ఖర్చు అయితే తానే భరిస్తానని లారెన్స్ ఒప్పుకున్నాడు. ఇందుకు సంబంధించి నిర్మాతలు దర్శకుడికి మధ్య అగ్రిమెంట్ జరిగింది. ఈ సినిమాకు అనుకున్న దానికంటే రూ.5కోట్లు ఎక్కువ ఖర్చు చేశారు. ఇంత మొత్తాన్ని తాము భరించలేమని ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం అదనంగా ఖర్చు చేసిన రూ.5 కోట్లు తిరిగి ఇవ్వాలని నిర్మాతలు లారెన్స్ పై ఒత్తిడి తెచ్చారు. అయితే ఒక్కపైసా కూడా ఇచ్చేది లేదని లారెన్స్ మొండికేశారు. జవాబు కూడా చెప్పడం మానేశాడు. దీంతో బాధిత నిర్మాతలు కోర్టును ఆశ్రయించగా... లారెన్స్ పైన, అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు మధ్యవర్తిగా ఉన్న అతని వ్యక్తిగత కార్యదర్శి రాజ్కుమార్పైన కేసు నమోదు చేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది. దీంతో ఈ ఇద్దరిపై ఐపీసీ సెక్షన్ 406,420 కింద కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు లారెన్స్ కోసం గాలింపు చేపట్టారు. -
బాపు అంతిమ యాత్ర
-
రాంగోపాల్వర్మపై డీఎస్పీకి ఫిర్యాదు
రామచంద్రాపురం : సినీ దర్శకుడు రాంగోపాల్వర్మ హిందువులను అగౌర పరిచేలా ట్విట్టర్లో వ్యాఖ్యలు చేశారని ఆయనపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ భజరంగ్దళ్ నాయకులు డీఎస్పీ కవితకు సోమవారం ఫిర్యాదు చేశారు. అనంతరం భజరంగ్దళ్ రాష్ట్ర కో కన్వీనర్ ఎం సుభాష్ చందర్, జిల్లా గోరక్ష ప్రముఖ్ మాణిక్యం, వీహెచ్పీ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీధర్గౌడ్ మాట్లాడారు. ఓ మతాన్ని కించపరుస్తూ ట్విట్ చేసిన రాంగోపాల్వర్మపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో నాయకులు మనికంఠ, విజయ్ తదితరులు ఉన్నారు. -
ఆ ఇద్దరు నన్ను మోసం చేశారు: పూరి జగన్నాథ్
హైదరాబాద్: తనను బిల్డర్ సుబ్బరాజు, రామరాజులు మోసగించారని ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తెలిపారు. జూబ్లీహిల్స్లోని తన కుటుంబానికి చెందిన ఖాళీ స్థలాన్ని రామరాజు, సుబ్బరాజులకు ఐదేళ్ల కిత్రమే విక్రయించానని చెప్పారు. ఆ సమయంలోనే మాసాబ్ట్యాంక్ ఎస్బీఐ బ్రాంచ్లో తనకు రూ.5 కోట్ల రుణం ఉందని ఆ ఇద్దరికి చెప్పానని పూరి స్పష్టం చేశారు. అయితే ఆ రుణాన్ని తమ పేర్లపైకి బదిలీ చేసుకుంటామని సుబ్బరాజు, రామరాజులు తనకు హామీ ఇచ్చారని చెప్పారు. అందుకు ఆ బ్రాంచ్ మేనేజర్ కూడా అంగీకరించాడని తెలిపారు. ఇందకు సంబంధించిన సాక్ష్యాధారాలు తన వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. మూడేళ్ల క్రితం నేనే ఇంటిపై రుణం తీసుకునేందుకు సదరు బ్యాంక్కు వెళ్లగా ఎస్బీఐలో రుణం పెండింగ్లో ఉందని బ్యాంకు అధికారులు తనకు గుర్తు చేశారు. ఆ క్రమంలో వెంటనే తాను (2011లో) బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించి... సుబ్బరాజు, రామరాజులపై ఫిర్యాదు చేసినట్లు పూరి వివరించారు. ఆ విషయం తెలుసుకున్న ఆ ఇద్దరు విదేశాలకు పారిపోయారన్నారు. తాన నుంచి కొనుగోలు చేసిన ఆ స్థలాన్ని వారిద్దరు ఇతరులకు విక్రయించారని చెప్పారు. అసలు విషయం వారికి తెలియక ఫ్లాట్ యజమానులు తనపై ఫిర్యాదు చేశారని పూరి విశదీకరించారు. ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్పై సీసీఎస్ పోలీసులు గురువారం చీటింగ్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో పూరి జగన్నాథ్ కుటుంబానికి వెయ్యి గజాల స్థలం ఉంది. ఆ స్థలంపై ఓ జాతీయ బ్యాంకులో సుమారు రూ. 5 కోట్ల రుణం తీసుకున్నారు. సగం వాయిదాలు సక్రమంగా చెల్లించారు. ఇదిలావుండగా, ఈ స్థలాన్ని బిల్డర్ సుబ్బరాజుకు డెవలప్మెంట్కు ఇవ్వగా సదరు బిల్డర్ ఫ్లాట్స్ కట్టి నలుగురికి విక్రయించాడు. బ్యాంకు రుణం తీరకపోవడంతో అధికారులు రుణం చెల్లించాలంటూ ఫ్లాట్స్ కొనుగోలు చేసిన నలుగురు వ్యక్తులకు నోటీసులు జారీ చేశారు. బ్యాంకులో రుణం ఉండగా ఫ్లాట్స్ ఎలా కొనుగోలు చేస్తారని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో ఫ్లాట్ యజమానులు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించిరు. బిల్డర్ సుబ్బరాజుతోపాటు పూరి జగన్నాథ్లు తమను మోసం చేసి ఫ్లాట్లు విక్రయించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే నాంపల్లి కోర్టు నుంచి పూరి బెయిల్ తీసుకున్నారు. సదరు ఖాళీ స్థలం పూరి జగన్నాథ్ భార్య లావణ్య పేరుతో ఉందని, బిల్డర్కు అగ్రిమెంట్ చేసే సమయంలో బ్యాంకు రుణం గురించి ప్రస్తావించారా లేదా అనే అంశంపై దర్యాప్తు చేస్తున్నామని సీసీఎస్ డీసీపీ పాల్ రాజు తెలిపారు. కాగా బిల్డర్ సుబ్బరాజు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారని డీసీపీ చెప్పారు. దర్యాప్తు ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. -
విజయనగరం వేదిక కావాలి
జిల్లాలోని వేపాడ మండలంలో పుట్టి, సినిమాపై మమకారంతో చెన్నపట్నం వరకు వెళ్లి సృజనాత్మక దర్శకునిగా పేరు సంపాదించారు పోతుగంటి విద్యా ప్రకాష్ అలియాస్ పీసీ ఆదిత్య. తక్కువ బడ్జెట్తో సినిమాలు తీస్తూ జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారాయన. ‘వైఎస్ఆర్ మహాప్రస్థానం’ సినిమాతో ఆయన ఎంతో కీర్తి సంపాదించుకున్నారు. విజయనగరం అంటే ఆయనకు ఎనలేని మక్కువ. అందుకే రాష్ర్ట విభజన తర్వాత విజయనగరంలో తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నారు. ఆయన దర్శకత్వం వహించిన ‘పూతరేకులు’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఆయన తన భావాలను ‘సాక్షి’తో ఇలా పంచుకున్నారు. మీ బాల్యం, విద్యాభ్యాసం..? మాది వేపాడ మండలం కుమ్మపల్లి గ్రామం. చిన్ననాటి నుంచే నాటక రంగంపై నాకు ఇష్టం ఎక్కువ. బాల్యమంతా గ్రామంలోనే గడిచింది. సినిమాలు, రాజకీయాలపై నాకు చాలా ఆసక్తి ఉండేది. అందుకే బీఏలో పొలిటికల్ సైన్సలో చేరా. మీ సినీ ప్రయాణం ఎలా సాగింది..? 1988లోనే ఫిల్మ్ డెరైక్టర్ అవ్వాలనే లక్ష్యంతో మద్రాసు వెళ్లిపోయాను. జంధ్యాల వద్ద శిష్యరికం చేశాను. తర్వాత కాలంలో సూపర్స్టార్ కృష్ణ వద్ద వర్క్ చేశాను. 2004 జూన్ 11న విడుదలైన ‘పిల్లలు కాదు పిడుగులు’ నా తొలి చిత్రం. ఇది సందేశాత్మక చిత్రం కావడం వల్ల దర్శకుడిగా మంచి పేరు తెచ్చింది. రాష్ట్ర విభజన ప్రభావం సినీ ఇండస్ట్రీపై పడిందంటారా? కచ్చితంగా. ఉత్తరాంధ్రలో సినీ పరిశ్రమ బతకాలంటే విజయనగరంలోనే సినిమా పరిశ్రమను అభివృద్ధి చేయాలి. విశాఖపట్నంలో సినిమా షూటింగ్లు ఇరవై ఏళ్లుగా జరుగుతూనే ఉన్నాయి. ప్రత్యేకంగా విశాఖలో అభివృద్ధి చేయాల్సిందేమీ లేదు. విజయనగరం జిల్లాలో మాత్రం అనేక ప్రదేశాలు షూటింగ్లకు అనువుగా ఉన్నాయి. ఉత్తరాంధ్రలో సినీ పరిశ్రమ సాధ్యమంటారా? ప్రయత్నిస్తే సాధ్యం కానిదేదీ లేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు, సినిమా రంగ పెద్దలు ఉత్తరాంధ్రపై దృష్టిసారించాలి. ప్రధానంగా విజయనగరం అటు శ్రీకాకుళానికి, ఇటు విశాఖకు మధ్యలో ఉంది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సింగిల్ విండో సిస్టమ్లో ఏ లొకేషన్కైనా సులభంగా అనుమతినిచ్చే విధంగా ఉండాలి. చిన్న సినిమాలకు కనీసం రూ.10 లక్షలు సబ్సిడీని నిర్మాతకు అందజేస్తే ఎక్కువ సినిమాలు రూపుదిద్దుకుంటాయి. పూర్తయిన సినిమా విడుదలయ్యిందంటే థియేటర్కు ఇచ్చే విధంగా ప్రభుత్వం జీఓ విడుదల చేయాలి. ఉత్తరాంధ్రాలో నటీనటులు, సాంకేతిక నిపుణులకు కనీస సౌకర్యాలు కల్పిస్తే, చిత్రనిర్మాణం పెరుగుతుంది. దీనివల్ల స్థానికంగా ఉండే యువతకు అవకాశాలు వస్తాయి. ‘వైఎస్ఆర్ మహాప్రస్థానం’ అనుభవాలు..? జాతీయ స్థాయిలో నాకు పేరు తెచ్చిన సినిమా వైఎస్ఆర్ మహాప్రస్థానం. సెప్టెంబరు 9న షూటింగ్ ప్రారంభించాం. మేజిక్ ఫిగర్ కోసం పరితపించాను. 09-09-2009న ఉదయం 09 గంటలకు షూటింగ్ ప్రారంభం జరిగింది. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 68 రోజుల పాటూ పాదయాత్ర చేశారు. చేవెళ్లలో పాదయాత్ర ప్రారంభించిన వైఎస్ ఇచ్ఛాపురం వరకూ మొత్తం వేల కిలోమీటర్లు నడిచారు. మేము కూడా చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకు షూటింగ్ చేశాం. ఇది మరిచిపోలేని అనుభూతి. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్లో చోటు ఎలా దక్కింది? జవాబు: ఎప్పుడైతే మేజిక్ ఫిగర్లతో ప్రస్థానం ప్రారంభమైందో అదే దీక్షతో వంద రోజుల్లో వంద షార్ట్ ఫిల్మ్లు తీశాను. అందుకు గానూ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ 2012లో చోటు దక్కింది. మీ ఆశయం ఏంటి ? ఇప్పటివరకూ 11 చిత్రాలకు దర్శకత్వం వహించాను. శాస్త్రీయ సంగీతానికి సంబంధించి శంకరాభరణం సినిమా అందుకున్నన్ని అవార్డులు ఏ సినిమాకూ రాలేదు. దీనికి సీక్వెల్ చేయాలనే ఆలోచన ఉంది. ఉత్తరాంధ్రలోనే ఫిల్మ్ ట్రైనింగ్ స్కూల్ ఏర్పాటుకు కృషిచేస్తున్నాను. అదే నా ఆశయం. ప్రభుత్వాధికారులు సహాయ, సహకారాలందిస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుతం ‘పూతరేకులు’ విడుదలకు సిద్ధంగా ఉంది. కిట్టిగాడు సినిమాలో ‘జీవి తం ఒక పాఠశాల.. ఆశయం ఒక ఆయుధం’ అనే టైటిల్ సాంగ్ రాశాను. అది నాకు ఎంతో ఇష్టమైన పాట. అదేవిధంగా ప్రస్తుతం అంతరించిపోతున్న కళలకు జీవం పోయాలి. ఆ దిశగా ప్రయత్నం జరుగుతోంది. -
సినిమా డెరైక్టర్ కారుకు ప్రమాదం
మద్దిపాడు(ఆంధ్రప్రదేశ్): ప్రకాశం జిల్లా మద్దిపాడు-కొష్టాలు మధ్య జాతీయ రహదారిపై తమిళ సినిమా డెరైక్టర్ ముకళంజియం కారు బోల్తా కొట్టి అందులో ప్రయాణిస్తున్న అరుణ్కుమార్ (36) మృతి చెందిన సంఘటన బుధవారం మధ్యాహ్నం జరిగింది. సినిమా డెరైక్టర్ ముకళంజియం తన స్నేహితుని వివాహానికి హాజరయ్యేందుకు రాజమండ్రి వచ్చి తిరుగు ప్రయాణంలో కొష్టాలు సెంటర్ సమీపంలోకి రాగానే వారు ప్రయాణిస్తున్న కారు కుడివైపు ముందు చక్రం పేలిపోయింది. దీంతో కారు డివైడర్ను ఢీకొట్టి రెండో వైపు రోడ్డులో నాలుగు పల్టీలు కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న అరుణ్కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు మద్దిపాడు ఎస్ఐకు సమాచారమందించడంతో కారులోని వారిని 108 ద్వారా రిమ్స్కు తరలించారు. కారులో ప్రయాణిస్తున్న అసిస్టెంట్ డెరైక్టర్ శంకర్పాండేకు తీవ్రగాయాలు కాగా, డెరైక్టర్ ముకళంజియం, నటుడు పెరుంజిత్తన్, డ్రైవర్ ఎస్.బాబు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. డెరైక్టర్ ముకళంజియం పూమణి, పూందొట్టం, కెలుక్కుమెరుక్కుం, మిటా మెరాస్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. మృతి చెందిన అరుణ్కుమార్ తంజావూరు జిల్లా పాపనాడుకు చెందినవారని తెలిసింది. ముకళంజియంది కూడా తంజావూరే. మద్దిపాడు ఎస్ఐ వి.మహేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నాటకమే నా ఊపిరి.. ప్రాణం
సినీదర్శకుడు రవీంద్రరెడ్డి అంతరంగం కర్నూలు (కల్చరల్): నాటకమే నా ఊపిరి..ప్రాణమని సినీ దర్శకుడు నారసాని రవీంద్రరెడ్డి పేర్కొన్నారు. కర్నూల్లో జరుగుతున్న రాష్ట్రస్థాయి నాటక పోటీల్లో ‘అమ్మకో ముద్దు’ నాటకాన్ని ఆదివారం ఆయన ప్రదర్శించారు. 1982లో శోభన్బాబు, సుజాత నటించిన వంశగౌరవం సినిమాకు దర్శకత్వం వహించిన రవీంద్రరెడ్డి పలు సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేశారు. సత్యనారాయణ హీరోగా దాదా అనే హిందీ సినిమాకు దర్శకత్వం వహించారు. ఉయ్యాల జంపాల, అత్తా ఒకనాటి కోడలే, భూమి కోసం తదితర సినిమాలకు అసిస్టెంట్ డెరైక్టర్గా చేసిన రవీంద్రరెడ్డి మళ్లీ నాటకాల వైపుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి‘తో తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. ఆయన మాటల్లోనే.. గుంటూరు జిల్లాలోని నంబూరు మా సొంతూరు. మా అమ్మ తులసమ్మ, నాన్న హనుమంతరెడ్డి. నన్ను చిన్నప్పటి నుంచి నాటకాల వైపు బాగా ప్రోత్సహించారు. నంబూరు జిల్లా పరిషత్ స్కూల్లో చదివే రోజుల్లో వార్షికోత్సవాలు ఘనంగా జరిగేవి. నేను ప్రాథమిక పాఠశాలలో చదివేటప్పుడు ఏడేళ్ల ప్రాయంలోనే ‘దొంగ వీరడు’ అనే నాటకంలో మురళి పాత్ర వేశాను. ఆ తర్వాత స్కూల్లో మాస్టార్జీ, లంకెబిందెలు అనే నాటకాల్లో నేను చేసిన పాత్రలకు మంచి స్పందన లభించింది. అది మొదలు నేను నాటకాల వైపు దృష్టి సారించాను. గుంటూరులో హిందూ కాలేజ్లో పీయూసీ చదువు పూర్తయ్యాక అభినయ ఆర్ట్స్ అకాడమీ స్థాపించి నాటకాలు రూపొందించే పనుల్లో పడ్డాను. నేను దర్శకత్వం వహించిన ‘తూర్పు తెల్లారింది’ అనే నాటకం రాష్ట్ర వ్యాప్తంగా చాలా పరిషత్తుల్లో ప్రదర్శించడం జరిగింది. ఆ నాటకంలో నేను వేసిన కొండలు వేషం నాకు బాగా పేరు తెచ్చింది. సూరీడు అనే నాటకంలో శివుడు పాత్రకు కూడా బాగా పేరొచ్చింది. 1977లో సినీరంగ ప్రవేశం.. నేను 1977లో మద్రాస్కు వెళ్లి అలనాటి ప్రసిద్ధ డెరైక్టర్ కె.బి.తిలక్ దగ్గర అసిస్టెంట్ డెరైక్టర్గా చేరాను.1989దాకా సినీరంగంలో దర్శకత్వ శాఖలో పనిచేశాను. అత్తా ఒకింటి కోడలే, ఉయ్యాల, జంపాల, భూమి కోసం తదితర హిట్ సినిమాలకు పనిచేశాను. 1982లో శోభన్బాబు హీరోగా నేను దర్శకత్వం చేసిన ‘వంశగౌరవం’సినిమా బాగా ఆడింది. ఆ తర్వాత నేను ఆత్మ, హ్యాపీ హోం, స్వాతి అనే టీవీ సీరియల్స్కు దర్శకత్వం వహించాను. పలుసార్లు ఉత్తమ దర్శకునిగా, ఉత్తమ నటునిగా అవార్డులు అందుకున్నాను. సతీమణి శస్త్రచికిత్స వదిలి నాటక ప్రదర్శనకు.. ఒకసారి నా శ్రీమతికి డెలివరీ అనంతరం ఒక శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చింది. అయితే అదే రోజున నేను సూరీడు నాటకం ప్రదర్శించాల్సి ఉంది. . నేను వెళ్లకపోతే నాటకం ఆగిపోతుంది. శ్రీమతి ఆరోగ్యం పరిస్థితి బాగా లేకున్నా ఆమెను వదిలి నేను నాటక ప్రదర్శనకు వెళ్లాను. నాటకం సక్సెస్ అయింది. ఆ క్షణాలు తల్చుకుంటే గుండె బరువెక్కుతుంది. నాటక రంగంలోని వాళ్లకు ఇటువంటి క్షణాలు తప్పవు. -
కోర్టుకు హాజరైన దర్శకుడు జితేంద్ర
ఎమ్మిగనూరు టౌన్: ‘యమహో యమ’ చిత్ర దర్శకుడు జితేంద్ర సోమవారం ఎమ్మిగనూరు కోర్టుకు హాజరయ్యారు. చిత్రం వాల్పోస్టర్లో హీరోయిన్ పార్వతి మిల్టన్ పొట్టి దుస్తులతో అశ్లీలంగా కనిపించడంపై ఎమ్మిగనూరుకు చెందిన మాజీ కౌన్సిలర్ కోనేరు నాగేంద్రప్రసాద్ గత ఏడాది చిత్ర దర్శకుడు జితేంద్ర, నిర్మాత విజయకుమార్గౌడ్, సమర్పకుడు సాధక్కుమార్, హీరోయిన్ పార్వతిమిల్టన్లపై స్థానిక పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్ఐ చంద్రబాబునాయుడు వీరందరిపై కేసు(క్రైమ్నెంబర్ 41/13) నమోదు చేశారు. కేసుకు సంబంధించి వాయిదా ఉండటంతో వీరంతా సోమవారం కోర్టుకు హాజరయ్యారు. తదుపరి విచారణను జూనియర్ సివిల్ జడ్జి రవిశంకర్ ఆగస్ట్ 20వ తేదీకి వాయిదా వేశారు. ఆగస్టులో సెట్స్పైకి కొత్త చిత్రం వచ్చే ఆగస్టు నెలలో కొత్త చిత్రం సెట్స్పైకి తీసుకురానున్నట్లు దర్శకుడు జితేంద్ర తెలిపారు. కోర్టు వాయిదా నిమిత్తం ఎమ్మిగనూరుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం తెరకెక్కుతుందన్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కథకు తుది మెరుగులు దిద్దుతున్నట్లు చెప్పారు. త్వరలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు. -
ఖయల్ రెగ్యులర్ చిత్రం కాదు
ఖయల్ రెగ్యులర్ కథా చిత్రం కాదంటున్నారు ఆ చిత్రదర్శకుడు ప్రభు సాలమన్. మైనా సృష్టికర్త అయిన ఈయన తదుపరి ప్రయోగాత్మక చిత్రం ఖయల్. ఈ చిత్రాన్ని ఈయన ఒక తపస్సులా చేస్తున్నారనవచ్చు. ఆ చిత్ర ఆవిష్కరణ గురించి చిన్న భేటీ... ప్ర: కుంకీ వంటి సంచలన విజయం సాధించిన చిత్రం తరువాత ఖయల్ చిత్ర రూపకల్పనకు చాలా సమయం తీసుకున్నట్లున్నారే? జ: మంచి చిత్రం చెయ్యాలంటే ఈ గ్యాప్ అవసరమే. మైనా చిత్రం తరువాత కుంకీ చిత్రానికి కొంత సమయం తీసుకున్నాను. ఎలాంటి కథను తయారు చేసుకోవాలన్న ఆలోచనకు అమాతం విరామం అవసరమైంది. మైనా చిత్ర ఆలోచనను పూర్తిగా మనసు నుంచి తుడిచేసి కుంకీ కథ సిద్ధం చేసుకోవడానికి ఆరు నెలలు పట్టింది. అలా మైనా, కుంకీ చిత్రాల విజయాలు నన్ను మరింత ఆలోచింపజేశారుు. గత విజయాలను కాపాడుకొంటూ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా వారిని సంతృప్తి పరిచేలా చిత్రం చేయాలంటే నూరు శాతం శ్రమించాల్సి ఉంటుంది. ఇందుకు తగిన సమయం అవసరం అవుతుంది. ప్ర: ఖయల్ చిత్ర కథేంటి? జ: ఇందులో ప్రేమ ఉంటుందని, ఉండదని చెప్పలేను. మొత్త మీద ఖయల్ రెగ్యులర్ చిత్రంలా మాత్రం ఉండ దు. ప్రేక్షకుల దశాబ్దం కాలంగా సాధారణ చిత్రాలను మరచిపోయారు. ప్రస్తుతం సినిమా వేరే దిశలో పయనిస్తోంది. మనకు సునామీ వచ్చి పదేళ్లరుుంది. అలాం టి సునామీ నేపథ్యంగా తీసుకుని తెరకెక్కిస్తున్న చిత్రం ఖయల్. 56 ట్రాక్ సంగీతం చిత్రానికి పది రెట్లు బలాన్ని పెంచుతుంది. ప్ర: మైనా, కుంకీ, ఖయల్, తదుపరి ఎలాంటి కథాం శంతో కూడిన చిత్రాన్ని మీ నుంచి ఆశించవచ్చు? జ: సింహం బ్యాగ్డ్రాప్లో ఒక చిత్రం చేయాలనే ఆలోచన ఉంది. ప్ర: ఖయల్ చిత్రం హీరో, హీరోయిన్ల గురించి? జ: యుక్త వయసు కొచ్చిన యువతి పాత్ర కోసం చాలా మందిని ఆడిషన్ వేశాం. అయినా సంతృప్తి కలగలేదు. చివరిగా వచ్చిన నటి ఆనంది. ఆమె ముఖంలో కనిపించే చైల్డిష్ రూపం నా కథలోని హీరోయిన్ పాత్రకు కచ్చితంగా సరిపోతుందనిపించింది. అదేవిధంగా నటుడు చంద్రన్ హీరో పాత్రకు చక్కగా సరిపోయూరు. ప్ర: ప్రముఖ హీరోయిన్లు సెట్ అవ్వరా? జ: ప్రముఖ హీరోయిన్లను నా సమయానికి తగ్గట్టుగా ఉపయోగించుకోవడం సాధ్యం కాదు. వారికి వరుసగా చిత్రాలుంటాయి. వాటికి ఆటంకం కల్పిం చడం నా అభిమతం కాదు. నిజంగా స్టార్ హీరోయిన్స్ నా కథకు అవసరమైతే అప్పుడు వారితోనే చిత్రం చేస్తా. ప్ర: ఖయల్ చిత్రం విడుదల ఎప్పుడు? జ: ఆగస్ట్లో ఎదురు చూడవచ్చు. -
నాలుగు భాషల్లో వకుడు పాండియర్గళ్
తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం తదితర నాలుగు భాషల్లో వకుడు పాండియర్గళ్ అనే చిత్రం తెరకెక్కుతోంది. సినీ నిలయ క్రియేషన్స్ ఎల్ ఎల్ పి పతాకంపై పి.వి.శ్రీరామ్రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి టాలీవుడ్ దర్శకుడు చంద్రమహేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన తెలుగులో ప్రేయసిరావే వంటి పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక నంది అవార్డు గ్రహీత అయిన చంద్రసిద్ధార్థ్ ఈ చిత్రం ద్వారా తమిళం, మలయాళం, కన్నడం భాషల్లో పరిచయమవుతున్నారు. మహదేవ్, కృష్ణ, అమర్, తేజ మొదలగు నలుగురు హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో అంజనామీనన్ హీరోయిన్గా పరిచయమవుతున్నారు. పాండియరాజన్, గంజాకరుప్పు, యోగిబాబు, మధుమిత్ర, సుమన్, టెలిఫోన్ రాజ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ దర్శక, నిర్మాత కె.భాగ్యరాజ్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం ఇటీవల చెన్నైలో ప్రారంభమైంది. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ వినాయక చతుర్ధశి వేడుకలను చెన్నైలో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని, అదే సమయంలో నలుగురు యువకులు చెన్నై సముద్రతీరం మెరీనాబీచ్ను చూడటానికి వస్తారని తెలిపారు. అలాంటి సమయంలో కొందరు ఉగ్రవాదులు వినాయక చవితి ఉత్సవాల్లో కల్లోలం సృష్టించడానికి ప్రయత్నిస్తారన్నారు. వారి ప్రయత్నం ఫలించిందా? మెరీనా తీర పర్యటనకు వచ్చిన వారేమయ్యారు? వంటి పలు ఆసక్తికర సంఘటనల సమాహారమే వకుడు పాండియర్గళ్ చిత్ర ఇతివృత్తంగా తెలిపారు. చిత్ర షూటింగ్ను చెన్నై పరిసర ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు దర్శకుడు వెల్లడించారు. -
ఒక్క చిత్రంతో...గిన్నిస్ రికార్డ్ మిస్సయ్యా!
ఉన్నత చదువులు చదివి... గొప్ప ఉద్యోగం చేయాలనుకున్న వ్యక్తి సినీదర్శకుడు అవడమేంటి? తొలి సినిమానే సరైన సమయానికి విడుదల కాలేదు. అలాంటి వ్యక్తి... 73 సినిమాల దర్శకునిగా ఎదగడమేంటి? ‘వీడు గనుక దర్శకుడైతే... సీరియస్ సినిమాలు తీసి చంపేస్తాడ్రా’ అని అందరితో అనిపించుకున్న వ్యక్తి ముప్ఫై ఏళ్ల పాటు జనాలను ఏకధాటిగా నవ్వించడమేంటి? ఇన్నాళ్ల ఆ నవ్వుల ప్రయాణం వెనుక చెరగని ఆ కన్నీటి మరక ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలనుందా! అయితే చదవడం మొదలుపెట్టండి. దర్శకుడు రేలంగి నరసింహారావు కామెడీ వెనుక ఎంత కథ ఉందో, ఎంత కష్టం ఉందో, ఎంత కన్నీరుందో... తెరపై మీదో ప్రత్యేక సంతకం కదా! మీరిలా సెలైంటయ్యారే? 1996 నుంచి వరుసగా నాలుగేళ్లు కన్నడ సినిమాలు చేశా. తెలుగు సినిమా పూర్తి స్థాయిలో హైదరాబాద్కు షిఫ్టయ్యింది అ టైమ్లోనే. కన్నడంలో కమిట్మెంట్లు పూర్తి చేసుకొని 1999లో హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాను. అప్పటికే జరగకూడని డామేజీ జరిగిపోయింది. నా గ్యాప్ ఇక్కడ భర్తీ అయిపోయింది. ఈవీవీ సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డి బిజీ అయ్యారు. ఒక్కసారి వెనుక పడ్డాక, ముందుకెళ్లడం చాలా కష్టం. ట్రెండ్ కూడా మారింది. పైగా ‘రేలంగి నరసింహారావు కన్నడంలో స్థిరపడిపోయాడు’ అనే వార్తలు అప్పటికే పేపర్లలో వచ్చాయట. నిజానికి నేను అక్కడ సెటిల్ అవ్వలేదు. మా అత్తగారి ఊరు బెంగళూరు. అందుకే కొన్ని రోజులు అక్కడే ఉండి సినిమాలు చేశా. దానికి ప్రతిఫలమే ఈ విరామం. ఇక్కడకు రాగానే రాజేంద్రప్రసాద్తో ‘అమ్మో బొమ్మ’ తీశా. ఆడలేదు. ఆ తర్వాత ‘ప్రేమించుకున్నాం పెళ్లికి రండి’ తీశా. అదీ ఆడలేదు. తర్వాత దుకాణం తెరిచి ఉంచినా మన దగ్గరకు ఎవరూ రాలేదు. ఏం చేస్తాం. వరుసగా సినిమాలు చేసిన మీకు ఈ విరామం ఇబ్బందిగా లేదా? నా అదృష్టం ఏంటంటే.. ఇంకా నా పేరు మరుగున పడలేదు. ‘ఎదురింటి మొగుడు-పక్కింటి పెళ్లాం, పోలీసుభార్య, ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్, బ్రహ్మచారి మొగుడు’ లాంటి చిత్రాలు టీవీల్లో వస్తుంటే జనం విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్క సినిమా హిట్టయినా మళ్లీ పూర్వ వైభవం వస్తుందని నా నమ్మకం. త్వరలో మా గురువు గారైన దాసరి గారి బ్యానర్లో ఓ సినిమా చేయబోతున్నా. స్క్రిప్ట్ రెడీ. త్వరలోనే సెట్స్కి వెళతాం. అసలు దర్శకునిగా మీ తొలి అడుగు ఎలా పడింది? మా నాన్నగారు రేలంగి శ్రీరంగనాయకులు మా ఊళ్లో పేరున్న వైద్యులు. నన్ను కూడా డాక్టర్గా చూడాలనేది నాన్న కోరిక. అందుకే బీఎస్సీలో చేర్పించారు. మార్కులు సరిగ్గా రాలేదు. నిరుత్సాహానికి లోనై, ‘డాక్టర్ చదువుకి నేను పనికిరాను’ అని నాన్నకు నిర్మొహమాటంగా చెప్పేశాను. నా పరిస్థితిని గమనించిన నాన్న.. ‘ఇష్టమైన రంగంలోనే ప్రోత్సహించడం కరెక్ట్’ అనుకొని మద్రాస్ తీసుకెళ్లారు. రవిరాజా పినిశెట్టి తండ్రి పినిశెట్టి శ్రీరామ్మూర్తి గారు మా నాన్నకు మంచి మిత్రుడు. నన్ను ఆయన వద్దకు తీసుకెళ్లారు. అక్కడే గురువుగారు దాసరిగారిని తొలిసారి చూశా. రామ్మూర్తిగారి రికమెండేషన్తో ‘మహ్మద్బీన్ తుగ్లక్’ సినిమాకు దర్శకుడు బీవీ ప్రసాద్ దగ్గర అసిస్టెంట్గా చేరాను. ఆ చిత్రానికి దాసరిగారే రైటర్. అప్పట్నుంచీ ఆయనతో టచ్లో ఉండేవాణ్ణి. తర్వాత నేను కేఎస్ఆర్ దాస్గారి దగ్గర ‘ఊరికి ఉపకారి’ చిత్రానికి అసిస్టెంట్గా చేరాను. అప్పుడే గురువుగారి ‘తాతామనవడు’ మొదలైంది. ‘వచ్చేస్తాను సార్’ అన్నాను. ‘సినిమా మధ్యలో వదిలిపెట్టి రావద్దు. మంచి పద్ధతి కాదు. కష్టమైనా నష్టమైనా ఒప్పుకున్న సినిమాను పూర్తి చేసి రావడం ధర్మం’ అని కచ్చితంగా చెప్పేశారు గురువుగారు. గురువుగారి రెండో సినిమా నుంచీ నేను ఆయన బృందంలో చేరిపోయాను. అలా 1973 నుంచి 1979 వరకూ దాసరిగారితో నా ప్రయాణం సాగింది. ‘సర్కస్రాముడు’ నిర్మాత కోవై చెళియన్ గురువుగారితో ఓ సినిమా చేయాలనుకున్నారు. గురువుగారికేమో విపరీతమైన కమిట్మెంట్లు. దాంతో ‘మా నరసింహారావు చేస్తాడు లెండీ. నేను పర్యవేక్షిస్తాను’ అని దర్శకునిగా నాకు ప్రమోషన్ ఇప్పించారు గురువుగారు. అలా ‘చందమామ’తో దర్శకుణ్ణి అయ్యాను. మరి మీ తొలి సినిమా ‘చందమామ’కు ఇబ్బందులొచ్చాయట.. నిర్మాత చెళియన్గారికి, పంపిణీదారులకీ మధ్య మనస్పర్థలొచ్చాయి. వాళ్లే తన దగ్గరకొస్తారని ఆయనా, ఆయనే వస్తారని పంపిణీదారులు భీష్మించుకొని కూర్చోవడంతో సినిమా విడుదల ఆగింది. అప్పుడు గురువుగారు కలుగజేసుకొని నిర్మాతకు, పంపిణీదారులకూ మధ్య రాజీ కుదిర్చారు. ఎట్టకేలకు మూడేళ్ల తర్వాత సినిమా విడుదలైంది. అప్పటికే నా దర్శకత్వంలో ‘నేనూ మా ఆవిడ, ఏమండోయ్ శ్రీమతిగారు’ చిత్రాలు విడుదలై నాకు కామెడీ ఇమేజ్ వచ్చేసింది. దాంతో ఆ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. నిజానికి అది చాలా మంచి కథ. సీరియస్ సబ్జెక్ట్. మురళీమోహన్, మోహన్బాబు, సరిత, ఫటాఫట్ జయలక్ష్మి ఇలా హేమాహేమీలు నటించారు. సరైన సమయంలో అది విడుదలైతే, నా ప్రయాణం వేరేలా ఉండేది. బహుశా నా నుంచి సీరియస్ సినిమాలే వచ్చేవేమో! అసలు కామెడీ బాట ఎలా పట్టారు? ‘చందమామ’ తర్వాత అనుకోకుండా కామెడీ కథ చేయాల్సొచ్చింది. రాంబాబుగారని.. ఎన్టీఆర్గారి బావమరిదికి బావమరిది. తను నిర్మాత. గురువుగారు దర్శకత్వ పర్యవేక్షణ. సినిమా పేరు ‘నేను - మా ఆవిడ’(1980). ఓ బ్రహ్మచారి కథ అది. పెద్ద హిట్. వందరోజులాడింది. ఆ సినిమా పుణ్యమా అని నాకు కామెడీ ఇమేజ్ పడిపోయింది. కామెడీకే అంకితమైపోయానని ఎప్పుడైనా బాధపడ్డారా? ఆ ఫీలింగ్ నాకెప్పుడూ లేదు. ఇప్పటికీ నాకు నేను అదృష్టవంతునిగా ఫీలవుతా. సాధారణంగా సినీరంగంలో పోటీ ఎక్కువ. కానీ.. నాకు జంధ్యాల మాత్రమే పోటీ. జంధ్యాల తెలుగుకే పరిమితం అయ్యారు. నేను ఇతర భాషల్లోనూ చేశా. కన్నడంలో ఏడు సినిమాలు చేశాను. తమిళంలో నగేశ్ గారబ్బాయి ఆనంద్బాబుతో ‘ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్’ రీమేక్ చేశాను. హిందీలో కూడా అదే సినిమాను రీమేక్ చేసే ఛాన్స్ వచ్చింది. రిషి కపూర్ హీరో. కానీ జస్ట్ మిస్. లేకపోతే హిందీలో కూడా నాది ఓ సినిమా ఉండేది. వంద సినిమాలకు దగ్గర పడుతున్నట్లున్నారు... లేదండీ... 73 సినిమాలు చేశాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వంద సినిమాలు చేయడం కష్టమే. కన్నడంలోకి వెళ్లకపోతే మాత్రం కచ్చితంగా వందకు దగ్గర పడేవాణ్ణి. ఏంటండీ... ఒక్క 1989లోనే నావి 11 సినిమాలు విడుదలయ్యాయంటే నమ్ముతారా!. ఏడాదికి 11 సినిమాలతో ఓ మలయాళ దర్శకుడు అప్పటికే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఉన్నాడు. కృష్ణంరాజుగారి ‘యమధర్మరాజు’ సినిమా నిర్మాణం పూర్తి చేసుకొని విడుదలకు రెడీగా ఉంది. అయితే... ఆ సినిమా ఆ మరుసటేడు 1990లో విడుదలైంది. అలా ఒక్క చిత్రంతో గిన్నిస్ రికార్డ్ మిస్సయ్యా. లేకపోతే, దాసరిగారితోపాటు వారి శిష్యుల్లో కూడా ఒకరు గిన్నిస్ రికార్డ్లో ఉండేవారన్నమాట? గురువుగారితో పోలిక వద్దండీ. ఆయన మహానుభావుడు. నా తొలి సినిమా ‘నేనూ మా ఆవిడ’ ఇంకొన్ని రోజుల్లో ప్రారంభోత్సవం అవుతుందనగా... ఎన్టీఆర్గారు అన్నమాట నాకింకా గుర్తు. ‘అందరు గురువుల్లాంటి గురువు కాదండీ మీ గురువు. అందరూ విద్య నేర్పి వదిలేస్తారు. కానీ మీ గురువు మీ అభ్యున్నతికి కూడా బాటలు వేస్తారు. అరుదుగా ఉంటారు అలాంటి గురువులు. నేను నీ తొలి సినిమా ప్రారంభోత్సవానికి వస్తాను. మొదటి కొబ్బరికాయ నేనే కొడతాను’ అని దీవించారు. అన్నట్లుగానే వచ్చి దీవించారు. రామారావుగారు అన్నారని కాదు కానీ... మా గురువుగారు నిజంగా అంతటి గొప్పవారే. కొంతమంది గురువులు శిష్యులు పైకొస్తున్నా తట్టుకోలేరు. కానీ మా గురువుగారికి అలాంటి అసూయ ఇసుమంత కూడా ఉండదు. ఎప్పడూ మమ్మల్ని ప్రేమించారు. ఆయనకు తీరిక లేకపోతే... మా పేర్లు సూచించిన సినిమాలు చాలా ఉన్నాయి. గురుధర్మాన్ని గొప్పగా అవలంబించేవారాయన. ఆ గొప్పతనాన్ని దగ్గరగా చూశాం కాబట్టే మా అందరికీ ఆయన దైవం అయ్యారు. పరిశ్రమ పచ్చగా ఉండాలనే దృక్పథంతో సాధ్యమైనంతవరకూ ఎక్కువ సినిమాలు చేసేవారు. ఆయన దారినే అనుసరిస్తూ శిష్యులమైన మేము కూడా గణనీయంగా సినిమాలు చేశాం. నేను 73 సినిమాలు చేస్తే... కోడి రామకృష్ణ తీసినవాటి సంఖ్య ఇప్పటికే 130 దాటిపోయింది. రవిరాజా పినిశెట్టి యాభైకి పైనే తీశాడు. ఇదంతా మా గురువుగారి ప్రేరణే. అన్నట్లు... కోడి రామకృష్ణ, మీరూ చిన్ననాటి దోస్తులటకదా? అవును.. కోడిరామకృష్ణ నా క్లాస్మేట్, రూమ్మేట్, బెంచ్మేట్ కూడా. పాలకొల్లులో మాది లంకంత ఇల్లు. మా తాతయ్యకు ఏడుగురు కొడుకులు. ఇంకో తాతయ్యకు అయిదుగురు కొడుకులు. అందరికీ ఒకటే వరండా. అక్కడ చదువు సాగడం చాలా కష్టం. అందుకని బయట రూమ్ తీసుకున్నా. కోడి రామకృష్ణ, నేను, మా ఇంకో మిత్రుడు సుబ్రహ్మణ్యం ఆ రూమ్లో ఉండేవాళ్లం. మొదట్నుంచీ రామకృష్ణకి సినిమాలపైనే దృష్టి. ఎలాగైనా సినిమాల్లోకి వెళ్లాలని కలలు కనేవాడు. నాకేమో ఉన్నత చదువులు చదవాలని ఉండేది. నాటకాల రిహార్సల్స్ అంటూ ఎవరెవరినో గదికి తెస్తుండేవాడు. దాంతో నాకు, నా మిత్రుడు సుబ్రమణ్యంకి చిర్రెత్తుకొస్తుండేది. ఒక్కోసారి నేను, సుబ్రమణ్యం కలిసి రామకృష్ణను తెగ తిట్టేవాళ్లం. ‘అస్తమానం సినిమాలేంటి? నాటకాలేంటి? ఎప్పుడూ రూమ్ నిండా ఈ జనాలేంటి? అసలు నువ్వు మా రూమ్లో వద్దు. బయటకుపో’ అని సామాన్లు విసిరి కొట్టేవాళ్లం. కానీ... రామకృష్ణకు విపరీతమైన సహనం. అస్సలు కోపం రాదు. చిన్నప్పట్నుంచీ అంతే. ఎంత తిట్టినా.. ‘రేపట్నుంచి ఉండదులే. బయట చూసుకుంటాం. ఈ ఒక్కరోజే’ అని ఎలాగోలా మభ్య పెట్టేవాడు. అవన్నీ మరిచిపోలేని రోజులు. ఇంతకీ మీ అమ్మగారి గురించి చెప్పనే లేదు? మా అమ్మ గృహిణి. పేరు శివరావమ్మ. అమ్మంటే నాకు చాలా ఇష్టం. కానీ ఓ చిన్న విషయం వల్ల మేం పదేళ్ల పాటు దూరమయ్యాం. చిన్న పిల్లలు కొట్టుకోవడం, తిట్టుకోవడం సహజం కదా! అలాగే, ఓ సారి మా తమ్ముణ్ణి కొట్టాను. అమ్మ తిట్టింది. ‘ఎందుకురా... పెద్దాడివై ఉండి... చిన్నాణ్ని పట్టుకొని అలా కొట్టడం. తప్పు కదా’ అని మందలించింది. ఆ చిన్న కారణం వల్ల పదేళ్ల పాటు అమ్మతో నాకు మాటల్లేవ్. బహుశా ఊళ్లో ఉంటే మాట్లాడేవాణ్ణేమో. నేను 1970లోనే మద్రాస్ వెళ్లిపోయా. దాంతో ఇక అమ్మతో మాట్లాడలేకపోయాను. ‘అమ్మ’ అనే పిలుపుకు కూడా ఆమెను దూరం చేశాను. 1968లో జరిగింది ఈ గొడవ. అమ్మ 1978లో చనిపోయింది. అంత కోపం ఎందుకొచ్చింది? అజ్ఞానం. తర్వాత తెలిసింది అది అజ్ఞానం అని. దాని వల్ల ఎంత పోగొట్టుకున్నానో తర్వాత తెలిసింది. 1978లో అమ్మ చనిపోయిందని మా ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. ఆదుర్దాగా బయలు దేరాను. తెల్లారి పొద్దున్నే ఊళ్లోకి దిగాను. ఇంటి ముందు పందిరేసుంది. బయట బల్లలు పెట్టి ఉన్నాయి. కానీ అమ్మ భౌతిక కాయం మాత్రం అక్కడ లేదు. గుండె బరువెక్కింది. ‘అమ్మ ఏది?’ అని అక్కడున్నవాళ్లను కంగారుగా అడిగాను. ‘లేదయ్యా... రాత్రి అమ్మకు మళ్లీ ఊపిరొచ్చింది’ అని చెప్పారు. దాంతో పరుగు లాంటి నడకతో హాల్లోకి వెళ్లాను. అమ్మ పడుకొని ఉంది. మంచం చుట్టూ బంధువులు గుమిగూడి ఉన్నారు. కానీ... అమ్మ నా వైపే చూస్తోంది. నేను దగ్గరకు వెళ్లాను. అప్పటికే అమ్మకు మాట పడిపోయింది. నన్ను పట్టుకొని ‘ఆ... ఆ...’ అని ఏదో అంటోంది. నాకేం అర్థం కాక పక్కవాళ్ల వంక చూశాను. ‘ఏమీ లేదయ్యా... ఒక్కసారి ‘అమ్మా’ అని పిలవమంటోంది’ అన్నారంతా. ‘అమ్మా...’ అని పిలిచాను. అంతే... ఆమె కళ్లల్లో ఎప్పుడూ చూడనంత ఆనందం... బొటబొటా... కన్నీరు కార్చేసింది. నన్ను గట్టిగా కౌగిలించేసుకుంది. ‘ఇంకేం బాధ లేదు బాబూ... ఈ ఆనందంలో బతికేస్తుంది’ అన్నారంతా. కాసేపయ్యాక నేను లోపలకెళ్లి స్నానం చేసి వచ్చాను. ఇంతలో ఘొల్లున ఏడుపులు వినిపించాయి. ఏంటి? అంటే ‘అమ్మ చనిపోయింది’. నిజానికి అమ్మ ఆ ముందురోజు రాత్రే చనిపోయిందట. బయట పడుకోబెట్టేశారు. దండలు కూడా వేసేశారట. కానీ.. కేవలం నాతో ‘అమ్మా’ అని పిలిపించుకోవడం కోసమే ఆమె మళ్లీ బతికింది. వైద్యశాస్త్రం ఇది అసంభవం అనొచ్చు. కానీ... కర్మ సిద్ధాంతాన్ని నమ్మే దేశంలో పుట్టిన వ్యక్తిగా దాన్ని నేను నమ్ముతాను. (కళ్లల్లో నీళ్ళు సుడులు తిరుగుతుండగా..) అమ్మ విషయంలో నా తప్పు తెలుసుకున్నాను. కానీ... తప్పు తెలుసుకునేలోపే అమ్మే నాకు కరువైపోయింది. ఆ భగవంతుడు నాకు వేసిన పెద్ద శిక్ష అమ్మను దూరం చేయడం. బాధపడకండి సార్... అమ్మ ఎప్పుడూ మీతోనే ఉంటుంది. అది సరే.. రేలంగి వెంకట్రామయ్యగారు మీకేమైనా బంధువా? మా నాన్నకు కజిన్ రేలంగి గారు. నాకు పెదనాన్న అవుతారు. అయితే... నాకు ఆయనతో పరిచయం లేదు. ఆయన్ను తొలిసారి నేను చూసింది ‘రాధమ్మపెళ్లి’ షూటింగ్లో. గురువుగారే దర్శకుడు. అందులో రేలంగి గారిది మంచి వేషం. టి.నగర్లోని ఆయన ఇంటి దగ్గరే షూటింగ్. నేను ఆయన బంధువునైనా ఏనాడూ ఆయన ఇంటికి కూడా వెళ్లలేదు. బంధుత్వం కలుపుకొని ఎదగాలనుకునే తత్వం కాదు నాది. అయితే... షూటింగ్ గ్యాప్లో ఓ సారి ఆయనే ‘ఏవయ్యా... ఇలా రా’ అని పిలిచారు. వెళ్లాను. ‘నీ పేరు రేలంగి నరసింహారావా? ఏ ఊరు నీది’ అనడిగారు. ‘పాలకొల్లండీ’ అని చెప్పాను. ‘ఎవరబ్బాయివేంటి?’ అనడిగారు. ‘రేలంగి రంగనాయకులుగారి అబ్బాయిని’ అని చెప్పాను. ‘ఓ హో... రంగడి కొడుకువా? వెరీగుడ్ వెరీగుడ్’ అనీ... ‘ఏమీ లేదయ్యా... మీ గురువు... నిన్ను తిడుతున్నాడో నన్ను తిడుతున్నాడో అర్థం కావడం లేదు. అయినా... నన్ను తిట్టేంత ధైర్యం అతనికి ఎక్కడుంది కానీ... నువ్వు ఓ పనిచేయ్. ‘నరసింహారావు’ అని పిలిపించుకో. రేలంగిని నేను ఉన్నానుగా’ అన్నారు ఆయన శైలిలో. నాకేమో ఓ వైపు నవ్వు, మరో వైపు... టెన్షన్. ‘అలా కాదండీ... గురువుగారి దగ్గరకెళ్లి అలా చెప్పలేనండీ’ అన్నాను. ‘అయితే ఓ పని చేసేయ్. ఈ సినిమా వరకు మానేయ్’ అన్నారు. ‘మా గురువుగారు మధ్యలో మానొద్దన్నారండీ’ అన్నాను. ‘ఏం గురువుగారయ్యా... అస్తమానం గురువుగారు.. గురువుగారు అనీ... పోనీ ఓ పనిచెయ్. పక్కనున్నవాళ్లతోనైనా ‘నరసింహారావు’ అని పిలిపించుకో. అప్పుడు మీ గురువు కూడా ‘నరసింహారావు’ అనే పిలుస్తాడు ఏమంటావ్’ అన్నారు. ‘సరే సార్’ అన్నాను. ఓ రెండ్రోజుల తర్వాత నిదానంగా గురువుగారికే ఈ విషయం చెప్పాను. ఆయన తాపీగా... ‘అలా అన్నారా!’ అన్నారు. అప్పట్నుంచీ షూటింగ్ అయ్యేంతవరకూ నన్ను ‘ఇదిగో ఇలా రా!’ అని పిలిచేవారు కానీ... ‘రేలంగీ...’ అనేవారు కాదు. రేలంగి గారితో నా తొలి అనుభవం అది. మీ కుటుంబం గురించి చెప్పండి? నా భార్య పేరు సాయిలక్ష్మి. పెద్దబ్బాయి హిప్నో థెరీపీ కోర్స్ చేశాడు. పాస్ట్లైఫ్ థెరపీ కూడా చేస్తాడు. ప్రస్తుతం చెన్నైలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. చిన్నవాడు అమెరికాలోని లాస్ఏంజిల్స్లో ఉద్యోగం. ఇద్దరికీ పెళ్లిళ్లు చేసేశాం. మనవళ్లు, మనవరాళ్ళు కోసం ఎదురుచూస్తున్నా. - బుర్రా నరసింహ ఆ విషయంలో చంద్రమోహనే నా గురువు! దర్శకునిగా నాకు గురువు దాసరిగారైతే.. కామెడీ విషయంలో మాత్రం చంద్రమోహన్గారు గురువు. ఆయనతో 24 సినిమాలు చేశాను. అన్నీ హిట్లే. బయట కూడా అద్భుతంగా నవ్విస్తారాయన. ఆయన్నుంచే నాకు హ్యూమర్ అలవడింది. గురువుగారి దగ్గర నాతోపాటు పనిచేసిన వారందరూ ఈ రోజు నన్ను చూసి ఆశ్చర్యపడుతుంటారు. ‘వీడు దర్శకుడైతే... సీరియస్ సినిమాలు తీసి జనాల్ని చంపేస్తాడ్రా’ అనేవాళ్లు అప్పుడంతా. అంత సీరియస్గా ఉండేవాణ్ణి. అలాంటి నేను కామెడీ డెరైక్టర్ని అయ్యానంటే... అదంతా దైవ నిర్ణయం. ఒక్క రాజేంద్రప్రసాద్గారితోనే 32 సినిమాలు చేశాను. నాకు నచ్చిన నా చిత్రాలు 1. సంసారం 2. చిన్నోడు పెద్దోడు 3. పోలీసు భార్య 4. ఎదురింటి మొగుడు-పక్కింటి పెళ్లాం 5 ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్ 6. బ్రహ్మచారి మొగుడు 7. దాగుడు మూతల దాంపత్యం 8. పెళ్లానికి ప్రేమలేఖ-ప్రియురాలికి శుభలేఖ 9. మానసవీణ 10. మామా అల్లుడు