నూతన శకంలోకి అడుగుపెట్టిన టాటా గ్రూప్
ముంబై : టాటా గ్రూప్ ఓ నూతన శకంలోకి అడుగుపెట్టింది. బహుళ జాతీయ సంస్థగా పేరొందిన ఈ గ్రూప్కు చైర్మన్గా ఎన్ చంద్రశేఖరన్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇన్నిరోజులు తాత్కాలిక చైర్మన్గా ఉన్న రతన్ టాటా నుంచి ఎన్ చంద్రశేఖరన్ ఈ బాధ్యతలు తీసుకున్నారు. టాటా సన్స్కు చైర్మన్గా ఉంటూనే చంద్రశేఖరన్ గ్రూప్లో అత్యంత కీలకమైన టెక్ అగ్రగామి టీసీఎస్కు కూడా ఈయన చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 150 ఏళ్లు కలిగిన టాటా గ్రూప్కు తొలిసారి నాన్-పార్సి చైర్మన్గా చంద్రశేఖరన్ ఎంపికయ్యారు.
దేశంలో అతిపెద్ద సాప్ట్ వేర్ ఎగుమతిదారిగా టీసీఎస్ ను రూపొందించిన ఘనతతో చంద్రశేఖరన్ ఎక్కువగా పేరొందారు. టాటాసన్స్ చైర్మన్గా నేడు బాధ్యతలు చేపట్టిన ఎన్.చంద్రశేఖరన్ నిన్న టీసీఎస్ సీఈఓ హోదాలో ఆఖరి బోర్డు సమావేశం నిర్వహించారు. ఆ బోర్డు సమావేశంలో ఇన్వెస్టర్లకు తీపి కబురు అందించారు. రూ.16వేల కోట్ల షేర్ల బైబ్యాక్ ఆఫర్ను ప్రకటించారు. టాటా సన్స్ కొత్త చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే చంద్రశేఖర్, వివిధ కంపెనీల సీఈవోలతో అధికారికంగా భేటీ అయ్యారు.