Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Their air defence systems no match for Indias BrahMos1
‘పాకిస్తాన్ వద్దే కాదు.. చైనాకు కూడా ఆ సామర్థ్యం లేదు’

వాషింగ్టన్: ప్రపంచ దేశాల్లో అత్యంత శక్తివంతమైన రక్షణ వ్యవస్థ కల్గిన దేశాల జాబితాలో భారత్ కు ప్రత్యేక స్థానం ఉందనే విషయం ఆపరేషన్ సిందూర్ తో మరోసారి నిరూపితమైంది. అత్యంత శక్తివంతమైన ఆర్మీ కల్గిన దేశాల జాబితాలో భారత్ ది నాల్గో స్థానం. ఇక్కడ చైనా కంటే భారత్ ఒక స్థానం కిందే ఉంది. టాప్ 5లో ఉన్న దేశాల్లో అమెరికా, రష్యా, చైనా, భారత్, దక్షిణకొరియాలు ఉన్నాయి. అయితే పాకిస్తాన్ తో ఉద్రిక్త పరిస్థితుల నడుమ భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తో భారత్ బలం మరింత పెరిగిందని అంటున్నారు యుద్ధ రంగ నిపుణులు. అది కూడా అమెరికాకు చెందిన యుద్ధ రంగ నిపుణుడు రిటైర్డ్ కల్నల్ జాన్ స్పెన్సాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.పాకిస్తాన్ తో యుద్ధంలో భారత్ యుద్ధ నైపుణ్యంలో తిరుగులేదని నిరూపించుకుందన్నారు. అటు ఎఫెన్స్, ఇటు డిఫెన్స్ అయినా భారత్ శక్తి అమోఘమని కొనియాడారు. ఇక్కడ ప్రధానంగా భారత్ కు చెందిన బ్రహ్మోస్ క్షిపణిపై ప్రశంసలు కురిపించారు. భారత్ రక్షణ అమ్ముల పొదిలో ఉన్న బ్రహ్మోస్ పని తీరును ఎంత పొగిడినా తక్కువే అంటూ కితాబిచ్చారు. బ్రహ్మోస్ తరహా క్షిపణులు అటు పాకిస్తాన్ లోనే కాదు, చైనాకు కూడా లేవని బల్లగుద్దీ మరీ చెప్పారు. చైనా, పాకిస్తాన్ రక్షణ వ్యవస్థలో భారత్ లో ఉన్న బ్రహ్మోస్ తో సరిపోల్చే క్షిపణులు కానీ ఆయుధ సామాగ్రి గానీ లేవన్నారు జాన్ స్పెన్సార్.. ఈ విషయాల్ని జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడేకు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు జాన్ స్పెన్సార్.‘ చైనా వైమానికి రక్షణ వ్యవస్థలు కానీ పాకిస్తాన్ రక్షణ వ్యవస్థలు కానీ భారతదేశ రక్షణ వ్యవస్థలతో పోలిస్తే చాలా తక్కువ సామర్థ్యం కల్గి ఉన్నాయి. భారత్ బ్రహ్మోస్ క్షిపణి.. చైనా, పాకిస్తాన్ రక్షణ వ్యవస్థల్లో ఉన్న దానికంటే అధికరెట్లు బలంగా ఉంది. పాకిస్తాన్ లో ఉగ్ర స్థావరాలను, ఎయిర్ బేస్ లను భారత్ సునాయాసంగా ఛేదించడంలో బ్రహ్మోస్ కీలక పాత్ర పోషించింది. ఇక్కడ భారత్ క్లియర్ మెస్సేజ్ ఇచ్చింది. పాకిస్తాన్ లోని ఏ ప్రదేశాన్నైనా సునాయాసంగా ఛేదించగలదనే సందేశాన్ని భారత్ చాలా క్లియర్ గా పంపింది’ అని ఆయన పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: మోస్ట్ పవర్ ఫుల్ ఆర్మీ కల్గిన దేశాలు ఇవే..

Ysrcp Provided Financial Assistance To Family Of Jawan Murali Nayak2
వీరజవాన్‌ కుటుంబానికి వైఎస్సార్‌సీపీ ఆర్థిక సాయం.. రూ.25 లక్షల చెక్కు అందజేత

శ్రీసత్యసాయి జిల్లా: ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో భాగంగా దేశ సరిహద్దుల్లోని కశ్మీర్‌లో ఈనెల 8న పాకిస్తాన్‌తో జరిగిన కాల్పుల్లో వీర మరణం పొందిన అగ్నివీర్‌ మురళీ నాయక్‌ కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా నిలిచింది. దేశం కోసం ప్రాణాలర్పించిన మురళీ నాయక్‌ కుటుంబాన్ని ఈ నెల 13న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించిన సంగతి తెలిసిందే.. పార్టీ తరపున ఆయన రూ.25 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు.రూ.25 లక్షల రూపాయల చెక్కును వీర జవాను మురళీ నాయక్ కుటుంబానికి వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్ అందజేశారు. గోరంట్ల మండలం కల్లి తండాకు వెళ్లి వీర జవాన్‌ కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం చెక్కును ఆమె అందించారు. కాగా, మూడు రోజల క్రితం (13వ తేదీన) మురళీ నాయక్‌ కుటుంబ సభ్యులను వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. మురళీనాయక్‌ స్వగ్రామమైన శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు చేరుకుని.. మురళీనాయక్‌ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.మురళి తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరామ్‌ నాయక్‌లకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వారు భావోద్వేగానికి గురయ్యారు. ‘మురళీ.. లే మురళీ.. జగన్‌ సార్‌ వచ్చారు.. లేచి సెల్యూట్‌ చేయి మురళీ’ అంటూ తండ్రి శ్రీరామ్‌ నాయక్‌ భావోద్వేగంతో పలికిన మాటలు అక్కడ ఉన్న వారందరికీ కన్నీళ్లు తెప్పించాయి. యావత్‌ దేశం గర్వపడేలా దేశ రక్షణలో విధులు నిర్వర్తించిన మురళీ కుటుంబానికి యావత్‌ దేశం రుణపడి ఉంటుందని వైఎస్‌ జగన్‌ అన్నారు.

KSR Comments On Chandrababu And Media3
బాబూ.. మీడియాతో పెట్టుకోకు!

ఎవరైనా బలవంతంగా ఇంట్లోకి చొరబడితే ఏం చేస్తాం?. ముందుగా అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. ఆ తరువాత పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. మరి పోలీసులే వ్యక్తుల ఇళ్లల్లోకి బలవంతంగా చొరబడితే? చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తే? ప్రజల స్వేచ్ఛను కాపాడాల్సిన ప్రభుత్వమే వాటిని హరిస్తూ అరాచకాలకు పాల్పడితే? ఏపీలో ప్రస్తుత పరిస్థితి ఇదే.ఏపీ ప్రభుత్వం మిగిలిన పనులన్నీ పక్కనబెట్టి మరీ పోలీసులతో తప్పుడు కేసులు పెట్టిస్తూ విపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను వేధిస్తూ చివరికి ప్రజల పక్షాన వార్తలు రాస్తున్న మీడియా గొంతు నొక్కేందుకూ ప్రయత్నిస్తోంది. సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి నివాసంపై పోలీసుల దాడిని కూడా ఈ కోణంలోనే చూడాలి. టీడీపీ, అధికారంలోకి వచ్చినప్పటి జనసేన, బీజేపీ కూటమి దుశ్చర్యలకు అంతు లేకుండా పోతోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎప్పుడూ మీడియాపై ఒక కన్నేసే ఉంచుతారు. బాకా మీడియాను ఒకరకంగా, వైఫల్యాలను, ప్రభుత్వ స్కామ్‌లను బయటపెట్టే మీడియాను మరో రకంగా చూస్తారు. మాట వినని జర్నలిస్టులను ఉద్యోగాల నుంచి తొలగించేలా యాజమాన్యాలపై ఒత్తిడి తీసుకు వస్తారు కూడా. అనుకూలంగా ఉండే మీడియాకు రకరకాల రూపాలలో మేళ్లు చేస్తారు. తద్వారా ఆ యాజమాన్యాలను తన గుప్పెట్లో ఉంచుకుంటారు.1995లో తన మామ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక వర్గం మీడియా ద్వారా ఆయనపైనే వ్యతిరేక ప్రచారం అనండి.. దుష్ప్రచారం చేయించిన చరిత్ర చంద్రబాబుది అని అప్పటి నుంచి రాజకీయాలు చూస్తున్నవారు చెబుతుంటారు. ఎన్టీఆర్‌ కేబినెట్‌లో మంత్రిగా ఉంటూనే ఆయన తెలివిగా ఎన్టీఆర్‌ ప్రతిష్టను తగ్గించే వ్యూహాలు అమలు చేశారని ఆరోపణలున్నాయి. ఎన్టీఆర్‌ భార్య లక్ష్మీపార్వతిని బూచిగా చూపెట్టేందుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి పత్రికలను బాగా వాడుకోగలిగేవారు. ఈనాడు చూడడానికే అసహ్యంగా ఉండే ఘోరమైన కార్టూన్లు ఎన్టీఆర్‌పై వేసేది. అయినా ఆ రోజుల్లో ఈ పత్రికలపై ఎన్టీఆర్‌ కేసులు పెట్టలేదు.మామను కూలదోసి ముఖ్యమంత్రి అయిన తరువాత చంద్రబాబు పాలన మాటెలా ఉన్నా అనుకూల మీడియా వ్యవస్థనైతే బాగానే ఏర్పాటు చేసుకున్నారు. మీటింగ్‌లు జరిగినా, జరగకపోయినా, కల్పిత కథనాలకు కొదవ ఉండేది కాదు. అదే టైమ్‌లో రాజకీయ ప్రత్యర్థులపై బురద చల్లే వ్యూహాలు పక్కాగా అమలయ్యేవి. ఆ రోజుల్లో కూడా ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాసే కొన్ని పత్రికలకు ప్రభుత్వ ప్రచార ప్రకటనలు నిలిపివేసే వారు. కానీ ఇప్పటిలా బరితెగించి మరీ కేసులు పెట్టేవారు కాదనే చెప్పాలి. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడం చంద్రబాబుకు కొత్తకాదు. అయితే, ఆ హామీలను అమలు చేయకపోయినా ఎవరూ వాటిని గుర్తు చేయకూడదు! అందుకోసం ఆయన నానా ప్రయత్నాలూ చేస్తుంటారు.2014లో రైతుల సంపూర్ణ రుణమాఫీ కావచ్చు.. కాపుల రిజర్వేషన్‌ ఉద్యమం కావచ్చు.. మరేదైనా కావచ్చు. చంద్రబాబు పంథా ఒక్కటే. తనకు వ్యతిరేకంగా ఏదైనా జరుగుతుంటే అనుకూల మీడియా చేత వాటిని అణచివేసే ప్రయత్నం చేయడం. అంశం ఏదైనా.. టీవీ ఛానళ్లలో అనుకూల ప్రచారమే సాగాలన్నది ఆయన ఆకాంక్ష. కాపుల రిజర్వేషన్‌ విషయమే తీసుకుందాం.. ఇచ్చిన హామీ అమలుకు ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేపడితే ఆ విషయం ప్రజలలోకి వెళ్లనీయకుండా కొన్ని టీవీ చానళ్లను బ్లాక్ చేయడానికి యత్నించారు. ఇదే చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటే మాత్రం అధికార పార్టీపై వ్యతిరేక వార్తలు రాయాలని జర్నలిస్టులకు నూరి పోస్తుంటారు. దానికి తగినట్లే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి తమ రాజకీయ, వ్యాపార ప్రయోజనాల కోసం ఉన్నవి, లేనివి కల్పించి వార్తలు ఇచ్చేవి. ఈ మీడియా 2019-2024 మధ్యలో ముఖ్యమంత్రి జగన్‌పై కక్కినంత విషం బహుశా ప్రపంచంలోనే మరే మీడియా కక్కి ఉండదు. ఇందుకోసం పచ్చి అబద్ధాలు రాసేందుకూ వెనుకాడలేదు ఈ సంస్థలు.టీడీపీ మీడియా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్‌ను కించపరిచేలా కథనాలు ఇచ్చినా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్‌ తదితరులు దారుణమైన వ్యాఖ్యలు చేసినా అప్పట్లో ఎవరిపై కేసులు పెట్టలేదు. కానీ 2024లో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చంద్రబాబు.. సాక్షి మీడియా అణచివేతకు యత్నిస్తూనే ఉన్నారు. పలువురు విలేకరులపై పోలీసు కేసులు నమోదవడం ఇందుకు నిదర్శనం. నెల్లూరు జిల్లా కావలి వద్ద ఎప్పుడో మూడేళ్ల క్రితం శిలాఫలకం పడవేశారంటూ అప్పటి ఎమ్మెల్యేతోపాటు విలేకరిపై కూడా కేసు పెట్టారట. అప్పుడు ఏం చేశారో కాని, కూటమి అధికారంలోకి వచ్చాక, టీడీపీ, జనసేన వారు లెక్కలేనని శిలా ఫలకాలను ధ్వంసం చేసినా ఒక్క కేసు నమోదు కాలేదు. మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఎవరెవరో ఫిర్యాదు చేయడం పోలీసులు హుటాహుటిన వైఎస్సార్‌సీపీ వారిని అరెస్టు చేయడం సాధారణమై పోతోంది.ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి లోకేశ్‌ ‘రెడ్ బుక్’పేరుతో కక్ష రాజకీయాలు చేస్తున్నారు. ఎందుకు ఇవన్నీ?. చాలా సింపుల్‌ ప్రభుత్వ తప్పులు ఎవరూ ఎత్తి చూపకూడదు. సూపర్ సిక్స్ తో సహా ఎన్నికల సమయంలో ఇచ్చిన 150 హామీలు ఎందుకు అమలు చేయడం లేదని ఎవరూ ప్రశ్నించకూడదు. గత ప్రభుత్వం చేసిన అప్పులపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదితరుల అసత్యపు ప్రచారాన్ని ఎవరూ గుర్తు చేయకూడదు. ఏడాది తిరగకుండానే కూటమి ప్రభుత్వం చేసిన రూ.1.5 లక్షల కోట్ల అప్పులు ఎందుకు? దేనికి ఖర్చుపెట్టారు? అని ఎవరూ అడగకూడదు. ప్రభుత్వంలో జరుగుతున్న కుంభకోణాలను ఎవరూ వెలికి తీయకూడదు. సాక్షి మీడియా ఇవన్నీ చేస్తున్నందునే చంద్రబాబు ప్రభుత్వం కక్ష కట్టి దాడి చేస్తోంది.నిజానికి సాక్షి మీడియా ప్రతీ వార్తనూ ఆధార సహితంగానే రాస్తుంది. సౌర శక్తి ఒప్పందాలనే తీసుకుందాం. జగన్‌ హయాంలో యూనిట్‌కు రూ.2.49లకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంస్థ సెకీతో ఒప్పందం చేసుకుంది. ఇందుకు గగ్గోలు పెట్టిన చంద్రబాబు, ఎల్లోమీడియా..లక్ష కోట్ల రూపాయల నష్టం జరిగిపోయిందని ప్రచారం చేశాయి. తీరా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిందేమిటి? అదే విద్యుత్తును రూ.4.60లకు కొనుగోలు చేస్తున్నారు. అంటే.. యూనిట్‌కు దాదాపు రెండు రూపాయలు ఎక్కువ పోసి కొంటున్నారన్నమాట. అయినా సరే.. దీనిపై ఈనాడు, ఆంధ్రజ్యోతుల్లో ఒక్క వార్త కూడా రాలేదు. సాక్షి మాత్రం పక్కా ఆధారాలతో జరిగిన అవినీతిని వివరించారు. సౌర శక్తి కొనుగోళ్ల విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో చంద్రబాబు ప్రభుత్వ ప్రతిష్ట మసకబారింది.అలాగే.. విశాఖలో టీసీఎస్‌కు 99 పైసలకు ఎకరా భూమి ఇవ్వడం, ఊరు, పేరు లేని ఒక కంపెనీకి అరవై ఎకరాలు కట్టబెట్టడం, అమరావతి రాజధాని నిర్మాణాల పేరుతో అధిక రేట్లకు ఇష్టారాజ్యంగా టెండర్లు కేటాయించడం, అప్పుల కోసం ఏకంగా రాష్ట్ర ఖజానాను కూడా తాకట్టు పెట్టడం పెన్షన్లు మినహా మరే హామీ అమలు చేయకపోవడంతో ప్రజలలో అసంతృప్తి నెలకొనడం మొదలైన వార్తలను సాక్షి మీడియా ఇస్తోంది. ఏలికలకు ఇది పంటికింద రాయిలా మారింది. దీంతో సాక్షిని ఇబ్బంది పెట్టడానికి యత్నిస్తోంది. ఈ క్రమంలో ఆధారాలు లేని మద్యం స్కామ్‌ను సృష్టించి వైఎస్సార్‌సీపీ నేతల అరెస్టుకు చంద్రబాబు.. పోలీసులను ప్రయోగించారు. నిందితులు సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి ఇంటిలో ఉన్నారన్న అనుమానం వచ్చిందని పోలీసులు.. చెప్పా పెట్టకుండా విజయవాడలో ఆయన ఇంటిపై పడ్డారు. నిజంగా అలాంటి అనుమానం ఉంటే ఏమి చేయాలి? సెర్చ్ వారంటే ఇచ్చి సోదాలు చేయాలి. అసలు ఒక పత్రికా సంపాదకుడి ఇంటికి అంత ధైర్యంగా వెళ్లారంటే ఈ ప్రభుత్వం ఎంత నియంతృత్వంగా వ్యవహరిస్తున్నది అర్థం చేసుకోవచ్చు.సాక్షి సిబ్బందిని మానసికంగా వేధించడానికి ఇలా చేసినట్లు తెలుసుకోవడం కష్టం కాదు. ఇంత మాత్రానికే సాక్షి మీడియా వణికిపోతుందా?. 2008 నుంచి సాక్షి మీడియా ఇలాంటి ఆటుపోట్లను ఎన్నింటినో ఎదుర్కొంది. ఈ మీడియాను దెబ్బతీయడానికి చంద్రబాబు కాంగ్రెస్‌తో కలిసి ఎన్ని కుట్రలు పన్నింది.. ఎన్ని కేసులు పెట్టించింది తెలియనిది కాదు. 2014 టర్మ్‌లో కూడా సాక్షిని లేకుండా చేయాలని ప్రయత్నించి విఫలం అయ్యారు. తిరిగి ఈ టర్మ్‌లో అంతకన్నా ఎక్కువగా కక్ష సాధింపు చర్యలకు తెగిస్తున్నారు. ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి వాటిని సమర్థంగానే ఎదుర్కొన్నారు. పోలీసులు మూడు గంటలపాటు అక్కడ ఉన్నా వారికి ఏమీ దొరకలేదు. దాంతో వారు సైలెంట్‌గా వెళ్లిపోక తప్పలేదు. సెర్చ్ వారంట్ లేకుండా వెళ్లడం ద్వారా పోలీసులు దుశ్చర్యకు పాల్పడినట్లు అయింది.ఇక, ఎమర్జన్సీలో సైతం ఇందిరాగాంధీ ఇలాంటి పద్దతులు అనుసరించి మీడియా గొంతు నులమాలని విశ్వయత్నం చేశారు. కానీ, అంతిమంగా ఆమె ఘోర పరాజయాన్ని మూట కట్టుకున్నారు. తొలుత ఇందిరాగాంధీ శిష్యుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసి, ఆ తర్వాత తెలుగుదేశంను తన అధీనంలోకి తెచ్చుకుని రాజకీయం చేస్తున్న చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు అవే పద్దతులు అవలంభిస్తున్నారు. చరిత్ర చెప్పిన పాఠాలను మర్చిపోయి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఎవరికైనా ఓటమి తప్పదు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

KTR Congratulates Konda Surekha for Finally Speaking the Truth4
‘కొండా సురేఖకు నా అభినందనలు’: కేటీఆర్‌

సాక్షి,హైదరాబాద్‌: మంత్రి కొండా సురేఖకు మాజీ మంత్రి కేటీఆర్‌ అభినందనలు తెలిపారు. మంత్రులు కమిషన్లు తీసుకోకుండా ఏ పనిచేయరంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఎక్స్‌ వేదికగా కేటీఆర్‌ స్పందిస్తూ ట్వీట్‌ చేశారు.ఆ ట్వీట్‌లో ‘కనీసం ఇప్పటికైనా కొన్ని నిజాలు బయట పెట్టినందుకు మంత్రి కొండా సురేఖకు నా హృదయపూర్వక అభినందనలు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ‘కమీషన్ సర్కార్’గా మారిపోయింది. ఇది రహస్యమే కాదు. ఓపెన్ సీక్రెట్. అంతేకాదు, ఈ ప్రభుత్వంలో ఫైల్స్‌పై సంతకం చేసేందుకు మంత్రులు, వారి సహచర మంత్రులు 30శాతం కమిషన్‌ తీసుకుంటున్నారు. ఇదే కమిషన్ల వ్యవహరంలో సచివాలయంలో పలువురు కాంట్రాక్టర్లు ధర్నా చేసిన విషయం గుర్తుందా? అని ప్రశ్నించారు. ఆ ఘటనే ఈ ప్రభుత్వంలో మంత్రుల కమిషన్ల భాగోతాన్ని బహిర్గతం చేసింది. ఈ సందర్భంగా కొండా సురేఖని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. కమిషన్లు తీసుకుంటున్న మంత్రుల వివరాల్ని బయటపెట్టాలి. ప్రజల ముందు బహిర్ఘతం చేయాలని అన్నారు. ఇదే అంశంపై రాహుల్‌ గాంధీ,రేవంత్‌రెడ్డిలు వారి సొంత కేబినెట్‌ మంత్రి చేసిన ఆరోపణలపై మీరు దర్యాప్తుకు ఆదేశించగలరా?’అని కేటీఆర్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. Many congratulations to Minister Konda Surekha garu for finally speaking some truths!Congress in Telangana runs a “commission sarkaar”, and it's unfortunate this has become an open secret in TelanganaIn this 30% commission government, ministers, according to their own… https://t.co/3dMd2yDfb5— KTR (@KTRBRS) May 16, 2025

CEO tells staff to return to office or find another job. Majority of them quit5
ఆఫీస్‌కు రాకపోతే వేరే ఉద్యోగం చూసుకోండి..

రిమోట్ వర్క్.. అదేనండి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌. చాలా మంది ఉద్యోగులకు ఆకర్షణీయమైన ఎంపికగా మారింది. ఓపక్క కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే మరో వైపు ఉద్యోగాన్ని చూసుకుంటున్న వారికి ఈ విధానం చాలా అనువుగా ఉంటోంది. అయితే కోవిడ్-19 మహమ్మారి విజృంభణ సందర్భంగా అమలులోకి వచ్చిన ఈ రిమోట్‌ వర్క్‌ విధానం నెమ్మదిగా తొలగిపోతోంది. చాలా కంపెనీలు ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు పిలుస్తున్నాయి.సౌకర్యవంతమైన ఈ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానానికి అలవాటు పడినవారు ఆఫీసులకు తిరిగివెళ్లడానికి ఇష్టపడటం లేదు. చాలా కంపెనీలు ఉద్యోగులను బలవంతంగానైనా ఆఫీసులకు రప్పిస్తున్నాయి. ఇలాగే ఉద్యోగులను ఆఫీసులకు రావాలని ఆదేశించడం ఓ ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీలో ఎలా బెడిసికొట్టిందో.. ఉద్యోగులు ఏం చేశారో చెబుతూ ఆ కంపెనీలో పనిచేసే వ్యక్తి రెడ్డిట్‌లో షేర్‌ చేసిన స్టోరీ ఆసక్తికరంగా మారంది.ఆఫీస్‌కు రాకపోతే ఏం చేస్తారు?కోవిడ్‌ సమయంలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అమలు చేసిన కంపెనీ.. ఆ సమయంలో చాలా మందిని రిమోట్‌ వర్క్‌ విధానంలోనే నియమించుకుంది. కానీ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. అందరూ క్రమంగా ఆఫీసులకు రావాలని యాజమాన్యం ఆదేశించింది. అసలు సమస్య ఏంటంటే.. దాదాపు చాలా మంది రిమోట్‌ వర్క్‌ విధానంలోనే ఉద్యోగాల్లో చేరారు. కొంత మంది తమ ప్రాంతాలకు మకాం మార్చారు. ఇప్పుడు వీళ్లకు ఎటువంటి ఆర్థిక సహకారం అందించకుండా ఏడాదిలోగా ఆఫీసులకు వచ్చేయాలని కంపెనీ చెబుతోంది.దీంతో ఉ‍ద్యోగులు గందరగోళంలో పడిపోయారు. ఈక్రమంలో కంపెనీ వైడ్ టౌన్ హాల్ సమావేశంలో ఆఫీస​్‌కు రావడానికి అయిష్టంగా ఉన్నవారికి మినహాయింపులేమైనా ఉంటాయా అని ఓ ఉద్యోగి నేరుగా సీఈవోనే అడిగేశారు. దానికి సీఈవో స్పందిస్తూ "మీరు ఇంటి నుండి పని చేయాలనుకుంటే, వేరే చోట ఉద్యోగం చూసుకోండి" అంటూ బదులిచ్చారు. దీంతో అవాక్కైన ఉద్యోగులు ఆన్‌లైన్‌ కాల్స్‌లోకి రావడం మానేశారు. చాలా మంది వెంటనే రాజీనామా చేశారు. ఎక్కువ మంది వెళ్లిపోవడంతో కంపెనీకి షాక్‌ తగిలింది. క్యూసీ ఉ‍ద్యోగులతోనే యాప్ డెవలప్‌మెంట్ చేయించాల్సి వచ్చింది.

I Dont See That A Loss: Former South Africa Batter on Rohit Test Retirement6
‘రోహిత్‌ శర్మ జట్టులో లేకపోయినా పెద్దగా నష్టమేమీ లేదు’

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma)ను ఉద్దేశించి సౌతాఫ్రికా మాజీ క్రికెటర్‌ డారిల్‌ కలినన్‌ (Daryll Cullinan) ఘాటు వ్యాఖ్యలు చేశాడు. టెస్టు క్రికెట్‌లో భారత్‌కు రోహిత్‌ గొప్పగా చేసిందేమీ లేదని.. అతడు రిటైర్‌ అయినా టీమిండియాకు పెద్దగా నష్టం లేదని పేర్కొన్నాడు.అదే విధంగా.. విరాట్‌ కోహ్లి (Virat Kohli) లేకపోయినా.. బౌలర్లు రాణిస్తే భారత్‌ ఇంగ్లండ్‌లో గట్టెక్కగలదని డారిల్‌ కలినన్‌ అభిప్రాయపడ్డాడు. కాగా గత కొంతకాలంగా టెస్టుల్లో ఫామ్‌లేమితో సతమతమవుతున్న రోహిత్‌ శర్మ ఇటీవలే రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.న్యూజిలాండ్‌తో స్వదేశంలో 3-0తో రోహిత్‌ సేన వైట్‌వాష్‌ కావడం.. ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీని 3-1తో చేజార్చుకోవడంతో.. హిట్‌మ్యాన్‌పై విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ సిడ్నీలో ఆఖరిదైన ఐదో టెస్టు నుంచి తప్పుకొన్నా.. టెస్టుల్లో కొనసాగుతానని నాడు రోహిత్‌ స్పష్టం చేశాడు.రో- కో లేకుండానేఈ క్రమంలో ఇంగ్లండ్‌ పర్యటనలో అతడే పగ్గాలు చేపడతాడనే వార్తలు రాగా.. అనూహ్యంగా మే 7న రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఆ తర్వాత ఆరురోజులు తిరిగే లోపే విరాట్‌ కోహ్లి కూడా సంప్రదాయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఫలితంగా.. వీరిద్దరు లేకుండా యువ భారత జట్టు జూన్‌ 20 నుంచి ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ ఆడబోతోంది.ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా మాజీ క్రికెటర్‌ డారిల్‌ కలినన్‌ హిందుస్తాన్‌ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ‘‘రోహిత్‌ శర్మ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ‍గురించి చాలా రోజులుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికి అతడు సరైన నిర్ణయం తీసుకున్నాడు.రోహిత్‌ లేకపోయినా నష్టమేమీ లేదునిజం చెప్పాలంటే.. టెస్టుల్లో రోహిత్‌ కెరీర్‌ అంత గొప్పగా ఏమీలేదు. సొంతగడ్డ మీదైనా.. విదేశాల్లోనైనా అదే తీరు. ఇటీవల ఆస్ట్రేలియాతో సిరీస్‌లో కెప్టెన్‌గా ముందుండి నడిపించాల్సింది పోయి.. అతడే దారుణంగా విఫలమయ్యాడు. కాబట్టి రోహిత్‌ వీడ్కోలు పలకడం వల్ల భారత టెస్టు క్రికెట్‌కు వచ్చిన నష్టమేమీ లేదు’’ అని డారిల్‌ కలినన్‌ పేర్కొన్నాడు.బౌలర్లంతా ఫిట్‌గా ఉంటే చాలుఇక ఇంగ్లండ్‌తో సిరీస్‌ గురించి ప్రస్తావన రాగా.. ‘‘టీమిండియా బౌలర్లందరూ ఫిట్‌గా ఉండి.. రాణించినట్లయితే ఇంగ్లండ్‌లో భారత్‌కు గెలుపు అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి’’ అని కలినన్‌ అభిప్రాయపడ్డాడు. విరాట్‌ కోహ్లి లేకపోయినా రాణించగల సత్తా టీమిండియాకు ఉందని పేర్కొన్నాడు. కాగా జూన్‌ 20 నుంచి టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆరంభం కానుంది. ఈ సిరీస్‌తో టీమిండియా టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మన్‌ గిల్‌ తన ప్రయాణం మొదలుపెట్టే అవకాశం ఉంది.కాగా 58 ఏళ్ల డారిల్‌ కలినన్‌ 1993 నుంచి 2001 వరకు అంతర్జాతీయ క్రికెట్‌ ఆడాడు. సౌతాఫ్రికా తరఫున 70 టెస్టులు, 138 వన్డేలు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. సంప్రదాయ క్రికెట్‌లో 4554 పరుగులు, వన్డేల్లో 3860 రన్స్‌ సాధించాడు. మరోవైపు.. రోహిత్‌ శర్మ టీమిండియా తరఫున 67 టెస్టుల్లో 4301 పరుగులు చేయగా.. విరాట్‌ కోహ్లి 123 టెస్టులాడి 9230 రన్స్‌ సాధించాడు.చదవండి: మాట తప్పారు!.. ఆర్సీబీకి తిరిగి ఆడాలని అనుకోలేదు: పాటిదార్‌

Defence Minister Rajnath Singh Visits Bhuj Airbase, Meets Air Warriors7
‘ట్రైలర్‌ మాత్రమే చూశారు.. పాక్‌ తీరు మారకపోతే పూర్తి సినిమా చూపిస్తాం’

గాంధీనగర్‌: ఆపరేషన్‌ సిందూర్‌ (operation sindoor) ముగియలేదు. ట్రైలర్‌ మాత్రమే చూశారు. పాక్‌ తీరు మార్చుకోకపోతే సినిమా చూపిస్తాం’ అంటూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (rajnath singh) హెచ్చరికలు జారీ చేశారు. శుక్రవారం గుజరాత్‌లోని భుజ్‌ ఎయిర్‌ బేస్‌లో ఆపరేషన్‌ సిందూర్‌లో పాల్గొన్న ఎయిర్‌ వారియర్స్‌తో రాజ్‌నాథ్‌ భేటీ అయ్యారు. ఆపరేషన్‌ సిందూర్‌లో పాల్గొన్న ఎయిర్‌ వారియర్స్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. అనంతరం, ఆయన మీడియా మాట్లాడారు. పాకిస్తాన్‌పై భారత్‌ విజయానికి ఎయిర్‌బేస్‌ సాక్ష్యం.పహల్గాం దాడి, ఆ తర్వాత ఆపరేషన్‌ సిందూర్‌ను ప్రపంచమంతా చూసింది. పాకిస్తాన్‌లో ఉగ్రశిబిరాలను ధ్వంసం చేశాం. బ్రహ్మోస్‌ మిస్సైల్‌ పవరేంటో పాకిస్తాన్‌కు చూపించాం. బోర్డర్‌ దాటకుండానే పాక్‌ ఉగ్ర శిబిరాలను నాశనం చేశాం. పాకిస్తాన్‌ ముఖ్య ఉగ్ర కేంద్రాన్ని ధ్వంసం చేశాం. నయా భారత్‌ ఎంటో ప్రపంచానికి తెలిసింది.మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది మసూద్‌ అజహార్‌కు పాక్‌ రూ.14కోట్లు ఇచ్చింది. ప్రపంచానికి మన సత్తా ఏంటో కళ్లకు కట్టేలా చూపించాం. మన వాయిసేన అసమాన ప్రతిభ కనబర్చి ప్రత్యర్థులను వణికించింది. ఉగ్రవాదులకు పాకిస్తాన్‌ ఫండింగ్‌ చేస్తోంది. ఇది ఒక ట్రైలర్‌ మాత్రమే.. పాక్‌కు అసలు సినిమా ముందుంది’ అంటూ రాజ్‌నాథ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. Addressing the brave Air Warriors at the Air Force Station in Bhuj (Gujarat). https://t.co/3TGhBlyxFH— Rajnath Singh (@rajnathsingh) May 16, 2025

Eleven Movie Review And Rating In Telugu8
‘లెవన్‌’ మూవీ రివ్యూ

నవీన్ చంద్ర హీరోగా నటించిన తాజా చిత్రం ‘లెవన్’. సుందర్ సి వద్ద కలకలప్పు 2, వంద రాజవతాన్ వరువేన్, యాక్షన్ వంటి చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన లోకేశ్ అజ్ల్స్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. AR ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అజ్మల్ ఖాన్,రేయా హరి నిర్మించిన ఈ చిత్రం నేడు(మే 16) తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.‘లెవన్‌’ కథేంటంటే.. అరవింద్‌(నవీన్‌ చంద్ర) ) ఓ సిన్సియర్‌ పోలీసాఫీసర్‌. ఏసీపీ హోదాలో వైజాగ్‌కి ట్రాన్స్‌ఫర్‌ అవుతాడు. వచ్చీరావడంతోనే ఓ దొంగతనం కేసును ఈజీగా సాల్వ్‌ చేస్తాడు. అదే సమయంలో వైజాగ్‌లో వరుస హత్యలు జరుగుతుంటాయి. తొలుత ఈ కేసును ఏసీసీ రంజిత్‌ కుమార్‌ (శశాంక్‌) డీల్‌ చేస్తాడు. విచారణ మధ్యలోనే అతనికి యాక్సిడెంట్‌ అవుతుంది. దీంతో ఈ కేసు అరవింద్‌ చేతికి వస్తుంది. అతనికి సహాయంగా ఎస్సై మనోహర్‌ ఉంటాడు. వీరిద్దరు కలిసి చేసిన విచారణలో చనిపోయినవారంతా కవలలు అని, ఇద్దరిలో ఒకరిని మాత్రమే చంపుతున్నారని తేలుతుంది. ఈ హత్యలు చేస్తున్న సీరియల్‌ కిల్లర్‌ ఎవరు? ఎందుకు చేస్తున్నాడు? ట్విన్స్‌లో ఒకరిని మాత్రమే ఎందుకు చంపుతున్నాడు? వారితో సీరియల్‌ కిల్లర్‌కు ఉన్న సంబంధం ఏంటి? ఏసీపీ అరవింద్‌ ఈ కేసును ఎలా డీల్‌ చేశాడు? చివరకు హంతకుడిని పట్టుకున్నారా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. విలన్‌ క్రైమ్‌ చేయడం... పోలీసు అయిన హీరో ఆ కిల్లర్‌ని పట్టుకోవడం..అతనికో ప్లాష్‌ బ్యాక్‌ స్టోరీ..ఇలా ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్ల ఫార్మాట్‌ దాదాపు ఒకేలా ఉంటుంది. దీంట్లో క్రైమ్‌ జరిగిన తీరు.. వాటి చుట్టు అల్లుకున్న మైండ్‌ గేమ్‌, హీరో ఎంత తెలివిగా ఈ కేసును ఛేధించాడనే అంశాలపై సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. ఇలాంటి సినిమాలకు బిగిస‌డ‌ల‌ని స్క్రీన్‌ప్లే అవసరం. ప్రేక్షకుడు ఒక్క క్షణం కూడా తలను పక్కకు తిప్పుకోకుండా ఉత్కంఠ కలిగించే సన్నివేశాలతో కథనాన్ని నడిపించాలి. ‘లెవన్‌’ ఈ విషయంలో ఇది కొంతవరకు సఫలం అయింది. విలన్‌ ప్లాట్‌ రొటీన్‌గా ఉన్న ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్‌ కొత్తగా ఉంటుంది. ఈ సినిమాలో వచ్చే ట్విస్టులను ముందుగా డీకోడ్‌ చేయ‌డం కొంతవరకు కష్టమే. క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమాలను రెగ్యులర్‌గా చూసేవాళ్లు విలన్‌ ఎవరనేది కనిపెట్టినా.. వాళ్ల మైండ్‌తో కూడా గేమ్‌ ఆడేలా స్క్రీన్‌ప్లే ఉంటుంది. సినిమా ప్రారంభంలో కథనం కాస్త నెమ్మదిగా సాగుతుంది. సీరియల్‌ కిల్లింగ్‌ కేసు హీరో చేతికి వచ్చిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. అదే సమయంలో హీరోహీరోయిన్ల మధ్య వచ్చే లవ్‌ ట్రాక్‌ ఇరికించినట్లుగా అనిపిస్తుంది. ప్రీఇంటర్వెల్‌ నుంచి కథనం మరింత ఆసక్తికరంగా సాగుతుంది. ఇంటర్వెల్‌ సీన్‌ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో ఇన్వెస్టిగేషన్‌ ప్రాసెస్‌ ఉత్కంఠభరితంగా సాగుతుంది. మధ్యలో వచ్చే ప్లాష్‌బ్యాక్‌ స్టోరీ హృదయాలను హత్తుకుంటుంది. ఇక చివరిలో వచ్చే ట్విస్టులు అదిరిపోతాయి. ఈ కథకి లెవన్‌ అనే టైటిల్‌ ఎందుకు పెట్టారనేదానితో పాటు ప్రతి సీన్‌కి లాజిక్‌ ఉంటుంది. మొత్తంగా ‘లెవన్‌’ సినిమా రొటీన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ కథే అయినా.. కథనం మాత్రం ఆసక్తికరంగా ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. నవీన్‌ చంద్రకు పోలీసు పాత్రలు చేయడం కొత్త కాదు. ఈ మధ్య ఆయన ఎక్కువ ఇలాంటి పాత్రలే చేశాడు. ఇందులో ఏసీపీ అరవింద్‌గా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఆయన బాడీలాంగ్వేజ్‌, లుక్‌ నిజమైన పోలీసుల అధికారిని గుర్తు చేసేలా ఉంటుంది. హీరోయిన్‌ రియా హరి పాత్ర నిడివి తక్కువే అయినా ఉన్నంతలో చక్కగా నటించింది. ఎస్సై మనోహర్‌గా దిలీపన్‌, పోలీసు ఉన్నతాధికారిగా ఆడుకాలం నరేన్‌, ఏసీపీ రంజిత్‌ కుమార్‌గా శశాంక్‌ తమ పాత్రలకు న్యాయం చేశారు. కిరీటీ, రవివర్మతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. డి ఇమాన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకు ప్లస్‌ అయింది. తనదైన బీజీఎంతో అదరగొట్టేశాడు. పాటలు ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్‌ పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నంతా ఉన్నాయి.

women aftey wing a hyderabad woman doctor experience  impress you9
హ్యాట్సాఫ్‌.. పోలీస్‌.. ఇంట్రస్టింగ్‌ స్టోరీ

అబిడ్స్‌: కుటుంబ కలహాలతో కలత చెందిన ఓ వైద్యురాలు హైదరాబాద్‌ ఉమెన్‌ పోలీస్‌ డీసీపీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ డీసీపీ లావణ్య జాదవ్‌ను కలిసి తన సమస్యను వివరించగా ఆమెను షాహినాయత్‌గంజ్‌లోని సౌత్‌వెస్ట్‌ జోన్‌ మహిళా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాలని సూచించారు. అక్కడికి వచ్చిన వెంటనే ఆమె మహిళా పోలీసులు, ఇన్‌స్పెక్టర్‌ వి.శ్రీనివాసరావులను కలిసి తన వివరాలను చెప్పారు. వెంటనే వారు డాక్టర్‌ ఆయేషా ఫిర్యాదు చేసిన వ్యక్తిపై కేసును నమోదు చేసి కోర్టులో ఛార్జీషీట్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ ఆయేషా మాట్లాడుతూ.. హైదరాబాద్‌ ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ పోలీసులు పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన వారితో మర్యాదగా మాట్లాడడం, వారికి కౌన్సిలింగ్, సలహాలు ఇవ్వడం ఎంతో ధైర్యాన్ని ఇచి్చందన్నారు. తాను ఎంతో భయంగా మహిళా పోలీస్‌స్టేన్‌కు వచ్చానని కానీ ఇక్కడ పోలీసులు ఎంతో మర్యాదగా తన కేసును తీసుకొని పరిష్కారం దిశగా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. తనకేసు కాకుండా మిగతా మహిళల కేసులు కూడా పరిష్కారమే దిశగా ప్రయత్నిస్తున్నారని అందరికి మర్యాదనిస్తూ వారిలోని భయాన్ని దూరం చేస్తున్నారని తెలిపారు. చదవండి: Cannes Film Festival 2025: కాన్స్‌లో మెరిసిన 17 ఏళ్ల యువతార, బాలీవుడ్‌ అగ్ర హీరోయిన్లను..!ప్రతి ఒక్క మహిళా ధైర్యంగా తనకు జరుగుతున్న అన్యాయాన్ని మహిళా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చునని భరోసా కలిగిందన్నారు. హైదరాబాద్‌ ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ డీసీపీ, ఏసీపీ, ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరావును కలిసి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: బిగ్‌ బాస్‌ విన్నర్‌ లివర్‌లో టెన్నిస్‌ బాల్‌ అంత కణితి : వైరల్‌ పోస్ట్‌

YSRCP MLC Kalpalatha Reddy Serious On CBN Govt10
‘చంద్రబాబు నిర్వాకం.. పదివేల మంది టీచర్లకు డిమోషన్‌’

సాక్షి, తాడేపల్లి: ఏపీలో విద్యారంగంలో వైఎస్‌ జగన్ తెచ్చిన విప్లవాత్మక మార్పులను ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి. సీఎం చంద్రబాబు విధానం వలన 10వేల మంది ఉపాధ్యాయులకు డిమోషన్లు రాబోతున్నాయని అన్నారు.ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘విద్యారంగంలో వైఎస్‌ జగన్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వాటిని ధ్వంసం చేస్తోంది. టీచర్లు సైతం విద్యారంగాన్ని బతికించమంటూ ధర్నాలు చేస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న కన్ఫ్యూజన్ పాలనతో విద్యారంగం నాశనం అవుతోంది. సరైన విధానం లేకుండా 9 రకాల స్కూళ్లను చంద్రబాబు తెస్తున్నారు. వైఎస్‌ జగన్ వలన టీచర్లకు ప్రమోషన్లు వచ్చాయి. చంద్రబాబు విధానం వలన 10వేల మంది ఉపాధ్యాయులకు డిమోషన్లు రాబోతున్నాయి.ఒకవైపు సర్‌ప్లస్ చూపిస్తూ మరోవైపు డీఎస్సీ అంటూ మోసం చేస్తున్నారు. ఇప్పుడు చూపిస్తున్న సర్‌ప్లస్ టీచర్లను ఏం చేయబోతున్నారు?. గందరగోళంగా మారిన వ్యవస్థపై చంద్రబాబు క్లారిటీ ఇవ్వాలి. సబ్జెక్టు టీచర్లను పక్కన పెడితే పిల్లలకు క్వాలిటీ విద్య ఎలా అందుతుంది?. విద్యా వ్యవస్థను నాశనం చేయవద్దు’ అంటే వ్యాఖ్యలు చేశారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement