ananthavaram
-
కాలిఫోర్నియా టు అనాతవరం.. సొంతూరిలో సాఫ్ట్వేర్ కంపెనీ
సాక్షి, అమలాపురం టౌన్(తూ.గో): ఆయనో విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు. ఉపాధ్యాయుడిగా 1999లో రాష్ట్రపతి అవార్డు పొందారు. ఉద్యోగ జీవితంలో వేలాది మందికి విద్యాబుద్ధులు నేర్పి ప్రయోజకులను చేసిన ఆదర్శ ఉపాధ్యాయుడు. పేరు ఓరుగంటి శ్రీరామ్మూర్తి. ఊరు ముమ్మిడివరం మండలం అనాతవరం. ఆయన కుమారుడి పేరు రమేష్. ఉద్యోగం కోసం అమెరికా వెళ్లిన ఆయన.. కాలిఫోర్నియాలో ‘టెక్ మంత్రా నౌ’ పేరిట ఓ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి దానికి ఫౌండర్, సీఈఓగా పని చేస్తున్నారు. అంతా బాగానే ఉన్నప్పటికీ పుట్టి, పెరిగిన ఊళ్లోనే సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి, గ్రామీణ యువతకు ఇక్కడే ఉద్యోగాలు కల్పించాలన్నది శ్రీరామ్మూర్తి ఆశయం. ఈ విషయాన్ని అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతున్న తనయుడు రమేష్ దృష్టిలో పెట్టారు. తండ్రి ఆశయాన్ని నెరవేర్చే లక్ష్యంతో టెక్ మంత్రా నౌ కంపెనీ శాఖను రమేష్ అనాతవరంలో ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ కంపెనీ శాఖలు హైదరాబాద్, బెంగళూరు, పుణె, చెన్నైలో ఉన్నాయి. ఈ క్రమంలోనే సొంతూరు అనాతవరంలో.. అదీ పూర్తి గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ కంపెనీ కొత్త శాఖ శనివారం ప్రారంభమవుతోంది. ఈ వివరాలను శ్రీరామ్మూర్తి, అమెరికా నుంచి వచ్చిన ఆయన తనయుడు రమేష్లు అమలాపురంలోని కన్యకా పరమేశ్వరి కల్యాణ మంటపంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ప్రాథమికంగా 100 మందికి ఉద్యోగాలు అనాతవరంలో జాతీయ రహదారి 216 చెంతన నెలకొల్పిన ఈ కంపెనీలో ప్రాథమికంగా 100 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఇప్పటికే 25 మందిని నియమించామని రమేష్ తెలిపారు. కాలిఫోర్నియాలో 2014లో స్థాపించిన తమ కంపెనీ ఏడో శాఖను అనాతవరంలో నెలకొల్పుతున్నామన్నారు. తాను అనాతవరం హైస్కూలులోనే పదో తరగతి వరకూ చదువుకున్నానని తెలిపారు. తమ కంపెనీలో ట్రైనింగ్ హెచ్ఆర్గా పని చేస్తున్న పేరి విశాలి, డెలివరీ స్ట్రాటజీ డైరెక్టర్గా పని చేస్తున్న నూకల చిన వెంకటరత్నంలు కూడా కోనసీమకు చెందిన వారేనని చెప్పారు. వారు అమలాపురం ఎస్కేబీఆర్ కళాశాల పూర్వ విద్యార్థులని తెలిపారు. తండ్రి శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ, తన ఆశయానికి అనుగుణంగా పుట్టిన ఊళ్లోనే సాఫ్ట్వేర్ కంపెనీ పెడుతున్న కుమారుడు రమేష్ ప్రయత్నాన్ని అభినందించారు. -
చంద్రబాబు మా భూములు లాక్కుంటున్నాడు
-
మద్యం తాగి పచ్చతమ్ముళ్ల వీరంగం
నలుగురు రైతులపై దాడి సీఆర్డీఏ కార్యాలయంలో ‘సాక్షి’ బృందాన్ని నిర్బంధించిన తమ్ముళ్లు ఏ ఆధారాలతో వార్తలిచ్చారో చూపించాలంటూ దౌర్జన్యం పక్కా రికార్డులు చూపించడంతో సీఆర్డీఏపైకి నెట్టేసిన వైనం సాక్షి, అమరావతి బ్యూరో: అక్రమాలు వెలుగులోకి రాకుండా ఉండేందుకు పచ్చ తమ్ముళ్లు కొందరు దౌర్జన్యానికి దిగారు. మద్యం సేవించి మరీ ఏపీ రాజధాని పరిధిలోని అనంతవరం గ్రామానికి చెందిన నలుగురు రైతులపై దాడికి తెగబడ్డారు. రైతులకు అండగా నిలిచేందుకు వెళ్లిన సాక్షి బృందాన్ని స్థానిక సీఆర్డీఏ కార్యాలయంలో నిర్బంధించారు. ఏ ఆధారాలతో వార్తలు రాశారో చూపించనిదే ఇక్కడి నుంచి వెళ్లడానికి లేదని అడ్డుకున్నారు. సాక్షి ప్రతినిధులు తమ వద్ద ఉన్న పక్కా రికార్డులను తెచ్చి చూపించడంతో చేసిన తప్పును సీఆర్డీఏ అధికారులపై నెట్టేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, టీడీపీలోని మరో వర్గం 'సాక్షి'కి అండగా నిలిచింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్రమార్కులు పత్తాలేకుండా పోయారు. దాడిలో గాయాలపాలైన గురజాల రామ్మోహన్రావు.. టీడీపీ నేత పారా కిషోర్పై తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పారా కిషోర్పై 506, 509, 323 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. రాజధాని రైతుల భూములను ఆక్రమించుకుని రికార్డులు తారుమారుచేసిన వైనంపై 'సాక్షి' పక్కా ఆధారాలతో వరుస కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే. అక్రమాలు వెలుగులోకి రావటంతో ఉలిక్కిపడ్డ స్థానిక టీడీపీ నేతలు, కొందరు సీఆర్డీఏ అధికారులు తారుమారు చేసిన రికార్డులను మళ్లీ మార్చేందుకు ప్రయత్నించారు. అందులో భాగంగా ఆదివారం రాత్రి ఇద్దరి పేర్లు మార్చి పాత రికార్డులుగా సృష్టించే ప్రయత్నం చేశారు. ఆ విషయం కూడా 'సాక్షి' బయటపెట్టడంతో ఇరకాటంలో పడిన టీడీపీ నేతలు.. రకరకాల ఫోన్ల నుంచి సాక్షి ప్రతినిధులకు ఫోన్లు చేసి బెదిరించే ప్రయత్నం చేశారు. అర్ధరాత్రి మద్యం తాగి రైతులపై దాడి భూములు మాయం చేసిన ఆధారాలు 'సాక్షి'కి ఎలా వచ్చాయని టీడీపీ నాయకులు విచారించారు. రైతులే 'సాక్షి'కి ఉప్పందిస్తున్నారని అనుమానం వచ్చిన వారిపై దాడిచేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా సోమవారం అర్ధరాత్రి దాటాక కొందరు మద్యం తాగి అనంతవరం గ్రామంలో దౌర్జన్యం చేశారు. గురజాల రామ్మోహన్రావు, తరిగోపుల నరసింహరావుపై దాడిచేసి గాయపరిచారు. మంగళవారం ఉదయం బండ్ల బసవయ్యపై దాడిచేశారు. సాక్షికి ఇంటర్వ్యూలు ఇచ్చిన రైతులు, సాక్షి ప్రతినిధులను కొట్టాలని పథకం వేశారు. అందుకు ఓ 40 మంది గ్రూపుగా ఏర్పడ్డారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొందని తెలియడంతో సాక్షి బృందం మంగళవారం అనంతవరానికి చేరుకుంది. ఈ విషయం తెలుసుకున్న పచ్చనేతలు సీఆర్డీఏ కార్యాలయానికి చేరుకొని.. అక్కడ ఉన్న రైతులను బయటకు పంపి సాక్షి బృందాన్ని కార్యాలయంలోకి పిలిచి నిర్బంధించారు. తమపై ఏ ఆధారాలతో కథనాలు రాశారో చూపించే వరకు కదలడానికి లేదని దౌర్జన్యం చేశారు. ఒకానొక సమయంలో సాక్షి బృందంపై దాడికి యత్నించారు. తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని, తెప్పిస్తామని చెప్పడంతో కొంత సమయం ఓపిక పట్టారు. రికార్డులను తీసుకొచ్చి పచ్చనేతలకు చూపించటంతో అందులో భూములు ఎలా వచ్చాయో తమకు తెలియదని, అంతా సీఆర్డీఏ అధికారులు చేశారని బుకాయించారు. అయితే పత్రికలో చూపించిన భూమిని ఇవ్వాలని, లేకపోతే కౌలు చెల్లించాలని సాక్షి బృందాన్ని డిమాండ్ చేశారు. నిర్బంధించిన విషయాన్ని తెలుసుకున్న టీడీపీలోని మరో వర్గం నాయకులు సీఆర్డీఏ కార్యాలయానికి చేరుకున్నారు. అదే విధంగా తుళ్లూరు పోలీసులకు సమాచారం అందించారు. ఇక తమ ఆటలు సాగవని గ్రహించిన అక్రమార్కులు పోలీసులు గ్రామానికి చేరేలోపు పత్తాలేకుండా పోయారు. -
‘అవినీతి సెంటు’ నుంచి తప్పించుకునేదెలా?
‘సాక్షి’ కథనాలతో అధికార పార్టీ నేతల్లో కలవరం రైతులు నిలదీయడంతో అనంతవరం సీఆర్డీఏ కార్యాలయానికి తాళం భూ కుంభకోణం వాస్తవమేనన్న టీడీపీలోని ఓ వర్గం నేతలు సాక్షి, అమరావతి బ్యూరో: ఏపీ రాజధాని గ్రామాల్లో అవినీతి ‘సెంటు’ నుంచి తప్పించుకునేందుకు అధికార పార్టీ నేతలు, కొందరు సీఆర్డీఏ అధికారులు నానా తంటాలు పడుతున్నారు. భూ కబ్జాపై ‘సాక్షి’ పత్రిక తప్పుడు కథనాలు రాసిందని చెప్పడానికి టీడీపీ నేతలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా రెండ్రోజులుగా విలేకరుల సమావేశం అని చెప్పి రద్దు చేసుకుంటున్నారు. ఇదిలాఉంటే ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం రాత్రి వరకు తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయంలో అధికారులు రికార్డులతో కుస్తీ పడుతున్నారు. అనంతవరంలో సెంట్ల చొప్పున భూదోపిడీపై ‘సాక్షి’కి పక్కా ఆధారాలు ఎలా దొరికాయి? ఎవరి చ్చారు? అనే దానిపై టీడీపీ నేతలు విచారణ చేపట్టారు. మా భూమి ఎలా మాయమైంది? రాజధాని అమరావతి పరిధిలోని అనంతవరంలో భూ కుంభకోణంపై ‘సాక్షి’ పక్కా ఆధారాలతో వరుస కథనాలను ప్రచురించిన విషయం తెలిసిందే. దీంతో టీడీపీ నేతలు ‘సాక్షి’ ప్రతినిధులను బెదిరించడం, గ్రామస్తులను భయపెట్టడం వంటి చర్యలకు దిగారు. పత్రికలో వచ్చిన కథనాలు అవాస్తవం... తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు గానీ వాటిని బయటపెట్టడం లేదు. మరోవైపు సోమవారం ఉదయం సీఆర్డీఏ కార్యాలయానికి వచ్చిన అధికారులను గ్రామస్తులు చుట్టుముట్టారు. తమ భూమిలో నుంచి సెంట్ల చొప్పున స్థలం ఎలా మాయమైందని నిలదీశారు. అధికారులు ఏం సమాధానం చెప్పాలో తెలియక కార్యాలయానికి తాళం వేసుకుని వెళ్లిపోయారు. రైతులకు అన్యాయం జరిగితే సహించం రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ సహించలేక టీడీపీలోని ఓ వర్గం ప్రభుత్వ తీరును తప్పుబడుతోంది. భూ కుంభకోణంపై ‘సాక్షి’లో వచ్చిన కథనాలు వాస్తవమేనని ఆ వర్గం నేతలు స్పష్టం చేశారు. పొరపాట్లు ఉంటే సవరించుకుంటాం ‘‘100 రెవెన్యూ రికార్డులను పరిశీలించి భూ యజమానులను గుర్తించాం. ఫారం 9(1) ఇచ్చిన రైతుల భూముల వివరాలు, సర్వేలో వెల్లడైన భూముల వివరాలు ఒకేలా ఉండకపోవచ్చు. ఎక్కడైనా పొరపాట్లు ఉంటే సవరించుకుంటాం. సర్వే నంబర్ 270లో ఆరుగురు రైతులకు కలిపి 15 ఎకరాల 94 సెంట్లు పొలం ఉందన్నారు. వీరిలో బండల వెంకాయమ్మ అనే మహిళా రైతు 3 ఎకరాల 74 సెంట్లు సీఆర్డీఏకు ఇచ్చింది. అయితే సీఆర్డీఏ నిర్వహించిన సర్వేలో 3 ఎకరాల 39 సెంట్లు మాత్రమే ఉన్నట్టు తేలింది. ఈటీఎస్ ద్వారా సర్వే నిర్వహించగా 3 ఎకరాల 42 సెంట్లు ఉన్నట్లు తేలింది. దీంతో అందరికీ లెక్క సరిపోయింది. వెంకాయమ్మ ఇచ్చింది 3 ఎకరాల 74 సెంట్లు. డాక్యుమెంట్ల ప్రకారం అయితే సర్వే నంబర్లో ఉన్న 15 ఎకరాల 94 సెంట్లకు మరో 32 సెంట్లు అదనంగా చేర్చాల్సి ఉంది. ఈ అదనపు భూమిని సీఆర్డీఏ ఎక్కడ నుంచి తేవాలి? జమ్మిగుంపుల పద్మజ సర్వేనంబర్ 114 లో 1.95 ఎకరాలు ఉన్నట్టు చూపగా ఎకరం 90 సెంట్లకు సెటిల్ చేశాం. నెల్లూరి రావమ్మ సర్వేనెంబర్ 119/బిలో 1.99 సెంట్లు చూపగా 1.90 సెంట్లకు సెటిల్ చేశాం. గొరిజాల అరుణకు 1.17 ఎకరాలు చూపగా ఎకరానికి సెటిల్ చేశాం. పోలు భూ దేవయ్య సర్వే నెంబర్ 81/1 లో 1. 13 ఎకరాలు ఉన్నట్టు చూపినా ఆయన వద్ద కేవలం 40 సెంట్లకు మాత్రమే డాక్యుమెంట్ ఉంది. సర్వేనంబర్ 100ఈలో బండల సూరిబాబుకు 36 సెంట్లు ఉన్నా 8 సెంట్లే ఉన్నట్లు సీఆర్డీఏ అధికారులు తప్పుడు సర్టిఫికెట్ ఇవ్వడంపై విచారణ చేస్తాం’’ – చెన్నకేశవులు, సీఆర్డీఏ డిప్యూటీ కమిషనర్ -
రెండేళ్ల క్రితమే ‘సెంటు’ స్కెచ్
అనంతవరం భూముల్లో అంతులేని అవినీతి గుట్టుచప్పుడు కాకుండా రికార్డులు తారుమారు కైంకర్యం చేసిన భూములు అమ్మేశారు ‘సాక్షి’ కథనంతో బైటకొస్తున్న మరింతమంది బాధితులు రాజధాని రైతుల నుంచి ఫోన్ల వెల్లువ అన్యాయమైపోయాం.. ఆదుకోవాలంటూ వేడుకోలు టీడీపీ నాయకులు, సీఆర్డీఏ అధికారుల అక్రమాలపై ఆందోళన న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు కదులుతున్న రైతులు సాక్షి, అమరావతి బ్యూరో: ఏపీ రాజధాని గ్రామాల్లో ఒకటైన అనంతవరంలో భూములను భోంచేసే ‘పథకం’ ఈనాటిది కాదు. రాజధాని ప్రకటన నాటి నుంచే పథకం పన్నారు. ఎవరికీ అనుమానం రాకుండా గుట్టుచప్పుడు కాకుండా సెంట్ల రూపంలో పెద్ద ఎత్తున భూములను మింగేశారు. రికార్డుల్లో తారుమారు చేసిన భూములను సైతం కొందరు అమ్మి సొమ్ము చేసుకున్నారు. ‘సాక్షి’ కథనంతో బాధితులు ఒక్కొక్కరుగా బయటకొచ్చి తమకు జరిగిన అన్యాయంపై గొంతెత్తుతున్నారు. రెండేళ్ల నుంచి సీఆర్డీఏ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదని, పత్రికలకు ఎక్కితే కేసులుపెట్టి జైల్లో పెడతామని బెదిరించారని వారు చెబుతున్నారు. అంతేకాదు భూ అక్రమాలపై రాజధాని పరిధిలోని పలు గ్రామాల నుంచి బాధితులు ‘సాక్షి’ ప్రతినిధులకు ఫోన్లు చేసి అనంతవరం తరహాలోనే తమకూ అన్యాయం జరిగిందని, న్యాయం చేయాలని కోరుతున్నారు. సీఆర్డీఏ అధికారులు, టీడీపీ నేతలు చేస్తున్న అక్రమాలకు నిరసనగా రైతులంతా చేతులు కలుపుతున్నారు. అనంతవరం గ్రామంలో సుమారు 50 ఎకరాల భూమిని సర్కారు పెద్దలు మింగేశారు. గుట్టుచప్పుడు కాకుండా జరిగిన ఆక్రమణలను చూసి మనస్తాపంతో ఇదే గ్రామానికి చెందిన రాంబాబు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. దాంతో ఈ భూ దందా ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ అవినీతి సెంట్ల వ్యవహారంపై ‘సాక్షి’ తీగలాగటంతో డొంకంతా కదులుతోంది. అవినీతికి పాల్పడి.. పైగా రైతులకు బెదిరింపులు రాజధాని నిర్మాణం పేరుతో అనంతవరం గ్రామంలోని 1,963 మంది రైతుల నుంచి రాష్ట్రప్రభుత్వం భూ సమీకరణ ద్వారా 2,523 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. ఇపుడు అధికార పార్టీ నేతలు రైతులకు నష్టపరిహారం కింద చెల్లించే ప్లాట్లు, కౌలుపై కన్నేశారు. గ్రామానికి చెందిన అనేక మంది రైతుల భూములను సెంట్ల రూపంలో కొట్టేశారు. తమకు జరిగిన అన్యాయంపై అధికారులను కలసి రైతులు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. పైగా తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. నోరెత్తితే కేసులు పెట్టి జైల్లో పెట్టిస్తామని బెదిరిస్తున్నారు. రాంబాబు అనే వ్యక్తి మాత్రం బైటకొచ్చి తనకున్న 47 సెంట్లలో 3 సెంట్లు మాయం చేశారంటూ సీఆర్డీఏ అధికారులను ఆశ్రయించారు. ఆ 3 సెంట్లకు సంబంధించి కౌలు చెల్లిస్తాం, ఎవ్వరికీ చెప్పొద్దని సీఆర్డీఏ అధికారులు రాజీ చేసే ప్రయత్నం చేశారు. తనకు కౌలుతో పాటు 3 సెంట్ల భూమి కూడా రికార్డుల్లో చేర్చాలని రాంబాబు డిమాండ్ చేశారు. అయితే అధికారులు అంగీకరించకపోవటంతో తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయం ఎదుట రాంబాబు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. ఇది తెలుసుకున్న రాజధాని గ్రామాల రైతులు తమ రికార్డులను తెప్పించుకుని చూశారు. అనంతవరంతో పాటు రాయపూడి, వెంకటపాలెం, బోరుపాలెం, అబ్బురాజుపాలెం, దొండపాడు, పెనుమాక, కృష్ణాయపాలెం, ఐనవోలు, ఉద్దండరాయునిపాలెం గ్రామాల్లోనూ రైతుల భూముల్లో నుంచి సెంట్లు చొప్పున భూములు మాయమయ్యాయని తెలుస్తోంది. సాక్షిలో ఆదివారం ‘రాజధాని గ్రామాల్లో అవి నీతి సెంటు’ శీర్షికన వచ్చిన కథనం చూసి రైతులంతా ఫోన్లు చేస్తున్నారు. తమ భూమిలో నుంచి కూడా కొంత భూమిని మాయం చేశారని, న్యాయం చేయాలని కోరుతున్నారు. మళ్లీ రికార్డుల తారుమారు రాజధానికి రైతులు ఇచ్చిన భూముల్లో సెంట్ల చొప్పున తగ్గించిన వ్యవహారంపై ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన కథనాలతో ఉలిక్కిపడ్డ టీడీపీ నాయకుడొకరు ఆదివారం రాత్రి రికార్డులను తారుమారు చేశారు. అనంతవరం గ్రామానికి చెందిన పారా సీతారామయ్య పేరున సర్వే నంబర్ 287లో 82 సెంట్లు ల్యాండ్ పూలింగ్కు ఇచ్చినట్లు గతంలో రికార్డులు సృష్టించారు. అయితే ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన కథనాలతో అదే 287 సర్వే నంబర్లో నాదెండ్ల పద్మావతి పేరు చేర్చారు. ఆమె సీఆర్డీఏకు 282 సెంట్లు ఇచ్చినట్లు రికార్డులు తారుమారు చేశారు. అలాగే 237/1లో పారా సామ్రాజ్యం 20 సెంట్లు ల్యాండ్ పూలింగ్కు ఇచ్చినట్లు గతంలో మార్పులు చేశారు. సాక్షి కథనాలతో సీఆర్డీఏ వెబ్సైట్లో ఉన్న పారా సామ్రాజ్యం పేరును తొలగించి ఇతరులు అని చేర్పించారు. పారా సీతారామయ్య కుమారుడు రాజధాని కమిటీలో సభ్యుడు కావడం గమనార్హం. కాగా పస్తుతం ‘సాక్షి’ వద్ద ఉన్న రికార్డులు తప్పు అని చూపించి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. తారుమారు చేసి కొట్టేసిన భూములు అమ్మేశారు యడ్లూరి సాంబశివరావుకు సర్వే నంబర్ 100ఈలో 1.24 ఎకరాల భూమి ఉంది. అందులో నుంచి 44 సెంట్ల భూమి మాయమైంది. అదే భూమిని స్థానిక టీడీపీ నాయకులు నలుగురు కలసి ఉప్పాల జ్ఞానేశ్వరికి అమ్మి సొమ్ము చేసుకున్నారు. అదే విధంగా కొమ్మినేని శ్రీనివాసరావుకు చెందిన 2.64 ఎకరాల్లో నుంచి 25 సెంట్లు మాయం చేసి గుంటూరు జిల్లా రాజోలుకు చెందిన వెంకటేశ్వర్లుకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. చందోలు పూర్ణచంద్రరావుకు 120ఎ లో 1.88 సెంట్లు భూమి ఉంది. అందులో 11 సెంట్లను మాయం చేసి వేరొకరికి కట్టబెట్టినట్లు పూర్ణచంద్రరావు ఆరోపించారు. సుంకర విజయకుమారి, గోపిదేశి మీరాకుమారితో పాటు పలువురు గ్రామస్తులంతా ‘సాక్షి’ ప్రతినిధులకు రికార్డులను చూపించి సీఆర్డీఏ, రెవెన్యూ, స్థానిక టీడీపీ నేతలు చేసిన దారుణాలను వివరించారు. ఈ భూములను మాయం చేసి వేరొకరికి అప్పగించేందుకు రైతుల పేర్లు, వేలిముద్రలను ఫోర్జరీ చేసినట్లు యర్రా వెంకాయమ్మ ఆరోపించారు. ఇదిలా ఉంటే శాఖమూరులో సర్వే నంబర్ 86/ఏలో 2.40 ఎకరాల భూమిని 1972లో 44 మంది దళిత గిరిజన కుటుంబాలకు 4 సెంట్లు పంపిణీ చేశారు. ఈ మొత్తం భూమిని గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడొకరు గుట్టుచప్పుడు కాకుండా ల్యాండ్పూలింగ్కు ఇచ్చేశారు. రాయపూడిలో 140 మంది రైతుల భూముల నుంచి కొంత భూమి మాయం చేసినట్లు ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. రాజధాని గ్రామాల నుంచి అనేక మంది బాధితులు బయటకు వస్తున్నారు. న్యాయస్థానాలను ఆశ్రయించటానికి సిద్ధమవుతున్నారు. -
అమరావతిలో కలకలం
అనంతవరం: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఆకాశరామన్న లేఖ కలకలం రేపింది. టీడీపీ నాయకులు భారీగా అక్రమాలకు పాల్పడ్డారంటూ గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంతవరం గ్రామంలో ఆకాశరామన్న ఉత్తరం వెలుగులోకి రావడంతో అధికార పార్టీ ఉలిక్కి పడింది. ఈ లేఖలను బాధితులు శనివారం గ్రామంలో పంచారు. తమ గ్రామంలో టీడీపీ నేతలు 18.78 ఎకరాల భూములు కాజేశారని లేఖలో ఆరోపించారు. రైతులు, అధికారులను బెదిరించి భూకబ్జాకు పాల్పడ్డారని వాపోయారు. సీఆర్డీఏ అండతో తమ భూములు కొట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాంగ్స్టర్ నయీంతో సంబంధాలున్నాయని రైతులను బెదిరించారని వెల్లడించారు. టీడీపీ నాయకులకు కోట్లాది రూపాయల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ఆకాశరామన్న లేఖతో తమ బండారం బయటపడడంతో అధికార పార్టీ నాయకుల్లో గుబులు మొదలైంది. అమరావతిలో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారని ఇప్పటికే ఆరోపణలు వెల్లువుత్తుతున్న నేపథ్యంలో చంద్రబాబు సర్కారు మరింత ఇరకాటంలో పడే పరిస్థితి కనిపిస్తోంది. -
అమరావతిలో కలకలం.
-
గుంటూరు జిల్లాలో చంద్రబాబు వనమహోత్సవం